Wednesday, December 29, 2010

నిత్యజీవితంలో పద్యాలు - శారదాదేవి

ఉ:-
శ్రీకరపాదపద్మముల చేతులఁ దాకగఁజాల లేక యీ
చీకటి కోటలోనిరికి చిత్తము చంచలమై భ్రమించుచున్
వేకువ కోరి వేడితిని వేదముఁబట్టిన దివ్యహస్త! ఈ
నా కనుదోయిలో నిలిచి నాటకమున్ కడతేర్చుమా భువిన్

చం:-
కరణములన్ని ప్రాణహరకాంతికి మ్రొగ్గెడి మూఢమక్షికల్
తరణము చేతఁగాక భవతామససాగరమందు చిక్కితిన్
శరణను నన్ను గావగ ప్రసన్నతనొందుమ, హంసవాహినీ!
కరుణను చూచుమా జనని! కామితదాయిని! లోకపావనీ!

చాలా రోజులు పద్యాలకు దూరంగా ఉన్నాను అని ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకుని రెండు పద్యాలు వ్రాశాను. తప్పులుంటే సవరించగలరు.

Wednesday, December 22, 2010

నా అనుభవాలు: 1

("నా అనుభవాలు" పేరుతో వ్రాస్తున్న ఈ శీర్షికలో నా చిట్టి అనుభవంలో చూసిన/విన్న సంఘటనల గురించి వ్రాస్తున్నాను. దీనిలో కేవలం మనోభావాలు, అధ్యాత్మిక విషయాలు వంటివి ఉంటాయి. హాస్యం ఉండదు.)

కామేశ్వరరావు గొప్ప భక్తుడు. ఒకప్పుడు సైనికవిభాగంలో పని చేశాడు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా రోజూ ఒక గంటసేపు తన ఇష్టదైవాన్ని ధ్యానించేవాడు. ఎప్పుడూ మద్యమాంసాల జోలికి పోలేదు. ఇప్పుడు ఆయన పదవిని విరమించి స్వగ్రామంలో ఉంటున్నాడు. ఆయన జీవితంలో ఒక సారి జరిగిన ఘట్టం వారి అబ్బాయి (నా మిత్రుడు) నాతో చెప్పాడు. అదే ఈ చిన్నకథ.

ఒక రోజు కామేశ్వరరావు పూజ ముగించి వరండాలో కూర్చున్నాడు. తన మిత్రుడు ఎవరో ఒక అపరిచితవ్యక్తిని వెంటబెట్టుకుని గుమ్మం ముందుకు వచ్చాడు. మర్యాద కోసమని కామేశ్వరరావు వెళ్ళి వాళ్ళను పలకరించి ఇంట్లోకి పిలిచాడు. అందరూ కాఫీలు పుచ్చుకున్న తఱువాత, కామేశ్వరరావు మిత్రుడు తనతో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ, ఆయన గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి అని, ఎవరింట్లో ఐనా పూజగది చూసి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ చెప్పగలడని చెప్పాడు. కామేశ్వరరావుకి కుతూహలం ఆగలేదు. వెంటనే ఆయన్ని పూజగదిలోకి తీసుకెళ్ళాడు.

ఆ వ్యక్తి గంభీరమైన ముఖంతో ఉన్నాడు. నుదుట విభూతి గాని కుంకుమ గాని లేదు. పూజగదిలోకి అడుగు పెడుతూనే ఒక్క సారి చుట్టూ చూశాడు. దేవుడి పాటాలను, దీపాలను చూసినదాని కంటే మిగతా దిక్కులను ఎక్కువ చూసి "మీ నాన్నగారు మీ చిన్నప్పుడే పోయారు. ఆయన చామంచాయ, ఆరడుగులు ఎత్తు, మీసం ఉండదు - అవునా", అన్నాడు. కామేశ్వరరావు ఆశ్చర్యచకితుడైనాడు. వాళ్ళ నాన్నగారికి ఒక నమ్మకం ఉండేది - photo తీయించుకుంటే సహజసౌందర్యం దెబ్బ తింటుంది అని. అందుకే ఆయన ఎప్పుడూ photo తీయించుకోలేదు. ఈ వ్యక్తి తన తండ్రి photo సంపాదించి ఈ విషయం చెప్తున్నాడు అనడానికి ఆస్కారం లేదు. అలాగే తన చిన్నదనంలోనే చనిపోయిన తండ్రిని తన భార్య, బిడ్డలు చూసే కూడా చూడనేలేదు. ఈ వ్యక్తి చూసే అవకాశం కూడా లేదు. ఒక వేళ ఇదివరకు ఇతను తన తండ్రిని స్వయంగా చూశాడా అంటే ఇతడు కామేశ్వరరావు కంటే చిన్నవాడాయె. ఇదంతా తనకు నమ్మశక్యంగా లేదు. కాసేపటికి తేరుకుని ఆయన చెప్పినవన్నీ నిజమేనని ఒప్పుకుని సాష్టాంగప్రణామం చేసినంత పని చేశాడు. ఆ తఱువాత ఆ వ్యక్తి మరిన్ని వివరాలు చెప్పడం, కామేశ్వరరావు ఊ కొట్టడం జరిగాయి. చివరికి ఆయనకు భోజనం కూడా పెట్టి పంపించాడు.

కామేశ్వరరావు ఈ విషయాన్ని సత్వరమే తన గురువుగారికి చెప్పాలని ఆ మఱునాడు బయల్దేరి ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన నుదుటన, విభూతి, కుంకుమ పెట్టుకుని ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. కామేశ్వరరావుని చూసి, "కామేస్వరం, నిన్న మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తే పూజగది చూపించావు కదూ?" అన్నాడు. మళ్ళీ కామేశ్వరానికి మతి పోయింది. ఇదివరకు ఎప్పుడూ ఈ గురువుగారు మానవాతీతశక్తి ఉన్నట్టుగా ప్రవర్తించలేదు, అనిపించలేదు. ఉన్నట్టుండి ఈయనకు కూడా ఈ శక్తి ఎక్కడినుండి వచ్చింది? ఇది కలా? నిజమా? అని అనుకుంటూ, "అవును స్వామీ, ఆ విషయం చెప్దామనే ఇక్కడికి వచ్చాను", అన్నాడు. ఆయన గంభీరమైన ముఖాన ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వి, "తప్పు చేశావు కామేస్వరం. పూజగది మన ఆధ్యాత్మికబలానికి నెలవు. అక్కడికి ఎవరినిబడితే వారిని రానివ్వకూడదు. శక్తికి కూడా రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ప్రకృతికి అనుకూలమైన దైవీకశక్తి, రెండవది ప్రకృతిధర్మాలను ధిక్కరించే శక్తి. మనం మల్లెబాటలో వెళ్ళాలయ్యా. ఇంకెప్పుడూ అలాంటివాళ్ళను ఆశ్రయించకు", అన్నాడు.

కుతూహలం ఆగని కామేశ్వరరావు, "స్వామీ, మీరు చెప్పింది పాటిస్తాను. ఆ విషయాన్ని మీరు మరింత వివరిస్తే వినాలనుంది", అన్నాడు. గురువుగారి ముఖంలో గాంభీర్యం తగ్గి కాస్త శాంతం చోటు చేసుకుంది, "కామేశ్వరం, మీ ఇంటికి వచ్చిన వ్యక్తిది దైవబలం కాదు. దైవబలం ఉన్న వ్యక్తులు ఎప్పుడుబడితే అప్పుడు వారి శక్తిని వాడరు. పిండోదకక్రియలను సక్రమంగా ఆచరిస్తున్న నీకు పితృదేవతల అండ ఉంది. అతను మీ పితృదేవతలతో మాట్లాడాడయ్యా. ఇది పెద్ద విద్యేం కాదు. కాకపోతే అది ప్రకృతివిరుద్ధం. నీ పితృదేవతలు కూడా నీకు ప్రశ్నలుంటే, అవి ముఖ్యమైనవైతే, నువ్వు నీ వారిపట్ల నీ ధర్మాలను సరిగ్గా ఆచరిస్తే నీకు కల ద్వారానో, లేక మఱొక మార్గంలోనో సూచనలనిస్తారు. ఇలాంటి వ్యక్తులు వాడేవి ప్రకృతివిరుద్ధమైన మార్గాలు. వారు మీ పితృదేవతలను ఇబ్బంది పెట్టగలరు. నిన్నూ నమ్మించి మోసం చెయ్యగలరు. వీరిని నమ్మితే నువ్వు నీ పితృదేవతల అండని, భగవంతుడి కృపని వదులుకోవలసి రావచ్చును. అందుకనే వీళ్ళకు దూరంగా ఉండమంటున్నది", అన్నాడు. కామేశ్వరరావుకు విషయం అర్థమైంది. అప్పటి నుండి ఇలాంటి మాయలకు దూరంగా ఉంటున్నాడు.

Monday, November 8, 2010

ఉల్లేఖాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉల్లేఖాలంకారము


సూత్రం: బహుభిః బహుదోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే
అర్థం: ఒకే వస్తువు పలువురికి పలు విధములుగా కనిపిస్తున్నట్టుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం అవుతుంది.

ఉదా:- (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
బాణుడని కవులు, మురజిద్బాణుడని రాజులు, సుమనోబాణుడని స్త్రీలు, నరసిమ్హరాయలును తలంచెదరు

ఇక్కడ కవితావస్తువు ఒకటే - నరసిమ్హరాయులు. ఆయన కవులకు బాణుడిగా, రాజులకు మురారిగా, స్త్రీలకు మన్మథుడిగా కనిపిస్తున్నాడు అని చెప్పడం ద్వారా కవి ఒకే వ్యక్తికి ఎన్నో స్వరూపాలను తెలియజేశాడు. కనుక ఇది ఉల్లేఖాలంకారము. ఇందులోనే శబ్దాలంకారం కూడా ఉంది - బాణుడు అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తోంది - ఇది అనుప్రాస అవుతుందని నా నమ్మకం.


ఒకే వస్తువుకు వేర్వేరు గుణాలను బట్టి వేర్వేరు వస్తువులకు అభేదాన్ని తెలుపడం కూడా ఉల్లేఖాలంకారమే.

ఉదా:- (చంద్రాలోకం)
అతడు వ్యక్తిత్వమందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, విలువిద్యయందు భీష్ముడు

ఇక్కడ ఒకే వ్యక్తికి బృహస్పతి, అర్జునుడు, భీష్ముడు - ఈ ముగ్గురితో అభేదం చెప్పబడింది. కాకపోతే ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో సమానం అని చెప్పారు. కనుక ఇది ఉల్లేఖాలంకారము.


ఉదా:- (అప్పకవీయం, రచన: అప్పకవి)
తిరమగు త్రిప్రాసము సుం
దరమగు మురవైరిరూపు తరుణులకు మనో
హరమగు, దానవులకు భీ
కరమగు, 'దపసులకూ ముక్తికరమగునవనిన్

"మురవైరి (కృష్ణుడి) రూపము స్త్రీలకు మనసు దోచుకునే విధంగా, దానవులకు భయం కలిగించే విధంగా, తాపసులకు ముక్తి మార్గంగా గోచరిస్తోంది" అని భావం. కృష్ణుడికి ఉన్న ఒక్కో గుణం ఒక్కొక్కరికి ప్రత్యక్షమవుతోంది అని చెప్పటంతో ఇది ఉల్లేఖనాలంకారం అయ్యింది.

ఉదా:- (శ్రీమద్భాగవతం, రచన: పోతన)
రవిబింబంబుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుఁదా బ్రహ్మాండమున్ నిండుచోన్

వామనావతారఘట్టంలోని ఈ పద్యం బహుశః అందరికీ తెలిసిన ఉదాహరణ. పోతనామాత్యుడి ఊహాశక్తికి నిదర్శనం. వామనుడు తన శరీదైర్ఘ్యాన్ని పెంచుకుంటూపోతుంటే అతని పక్కన ఉన్న సూర్యుడు చిన్నవాడైపోతున్నట్టుగా అనిపిస్తోందని కవి భావం.

బ్రహ్మచారికి పట్టిన గొడుగుగా, అతడి తల మీద ధరించిన రత్నంగా, చెవుల కుండలాలుగా, మెడలో నగగా, భుజాలపై బంగారు కేయూరంగా, మణికట్టుపైన కంకణంగా, నడుముకు కట్టిన గంటగా, కాలికి ఉంచిన పట్టీలుగా, చివరికి వటుని పాదాలకు పీటగా అనిపిస్తున్నాడుట సూర్యుడు. అంటే పోల్చి చూస్తుంటే వటుడి పరిమాణం పెద్దదైపోతోంది, సూర్యుడు చిన్నవాడైపోయి శిరస్సు పైనుండి, పాదాలకు చేరినట్టనిపిస్తోంది - అని కవి భావం. కవితావస్తువు సూర్యబింబం - ఒక్కో తరుణంలో ఒక్కోలాగా కనిపించడం ఉల్లేఖాలంకారానికి ఆధారమైంది.

ఉదా:- (పాట: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్రం: వర్షం, రచన: సిరివెన్నెల)
ముక్కుపుడక లాగ, చెవులకు చుట్టూ ఝూక లాగ, చేతికి రంగులగాజుల్లాగా, కాలికి మువ్వలపట్టీ లాగా, మెడలో పచ్చని పతకం లాగా ఉండిపోవే వానచినుక

చినుకును వేర్వేరు వస్తువులతో సమంగా పోల్చడం ద్వారా కవి ఉల్లేఖాలంకారాన్ని ప్రయోగించారు.

Sunday, November 7, 2010

కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి (జొన్నవిత్తుల రచన)

"దేవి" చిత్రం తో దేవిశ్రీప్రసాద్ చలనచిత్రసంగీతరంగంలోకి ప్రవేశించారు. మొదటి చిత్రం అంటే ఏ సంగీతదర్శకుడైనా చాలా కష్టపడి మంచి సంగీతాన్ని అందిస్తాడు. ఉదాహరణకి ఇప్పటికీ రోజ వంటి అద్భుతమైన పాటలను మళ్ళీ రెహ్మాన్ చెయ్యనేలేదు అనే వారున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎంతో ఉత్సాహంగా కనబడి నేటి తరం యువకుడు లాగా కనబడే ఈయన, ఎంతో పొందికైన, శ్రావ్యమైన గీతాలని ఈ చిత్రానికి అందించారు. పాటల మధ్యలో వేణువు (ఈ పాట), వీణ (తొట్టిగ్యాంగ్ చిత్రంలో "నువ్వే కావాలి" అనే పాట), సన్నాయి (ఆనందం చిత్రంలో "చికిచికిచం") వంటి సంప్రదాయవాయిద్యాలను వాడటంలో ఈయన సిద్ధహస్తుడు. ఈ పాట బాణీ చక్కని తెలుగుదనంతో ఉంటుంది.

జొన్నవిత్తులకి అపారమైన లాఘవం ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం. దేవుడు, దేవి మొదలైన చిత్రాలలో ఆయన అందించిన సాహిత్యం ఎంతో చక్కగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలాగా, అచ్చతెలుగు పదాలను వాడి అందరినీ మెప్పిస్తారు. ఈ పాటతో సరసగీతాలలో ఆయనకు ఉన్న పట్టుని ప్రదర్శించారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చును.


చిత్రం: దేవి
రచన: జొన్నవిత్తుల
దర్శకత్వం: కోడి రామకృష్ణ
పాడింది: చిత్ర, బాలు
సంగీతం: దేవిశ్రీప్రసాద్

కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
మేలిమిబంగరు  చీరలో మెరిసే ఓ వయారి
నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి

ఇక్కడ గమనించవలసినది యతినియమాన్ని - కుంకుమ, కులికే; మేలిమి మెరిసే - పల్లవిని పాడుకోవడానికి హాయిగా మలచాయి. కుంకుమపూలతోట, మేలిమిబంగరు చీర వంటి పదాలు తెలుగుపాటల్లో వినిపించడం చాలా అరుదు. అవకాశం దక్కినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు జొన్నవిత్తుల. "మరాళి" అంటే హంస అనే అర్థం ఉంది. తన గుండెకొలనులో సంచరించే హంసగా, మల్లెల తావిని నింపుకున్న గాలిగా తన ప్రేయసిని వర్ణించడం చక్కగా కుదిరింది.

శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి

"శంఖములూదిన ప్రేమ" అనేది గొప్ప ప్రయోగం. శంఖారావం విన్నప్పటికి మల్లే, ప్రేమ మనసును తట్టగానే గుండె ఝల్లుమంటోంది అనే లోతైన భావాన్ని రెండు ముక్కల్లో చెప్పాడు కవి. "సమాళించడం"అంటే అనుకూలంగా చేర్చడం - ఈ పదం కూడా చలనచిత్రగీతాల్లో విన్నది తక్కువే! చంద్రకాంతిని వెతికే చకోరంగా తనను, యవ్వనమనే వనానికి కాపరి గా ప్రియుణ్ణి సంబోధించడం కూడా చాలా నవ్యంగా ఉంది.

మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం 

తామరమొగ్గ, కాముని సవాసం -శృంగారానికి కూడా ఎంతో సాత్వికతను అలది చెప్పగలిగారు కవి.

హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం

"చ్చ" తో అనుప్రాస కలిపడం ఒక ఎత్తైతే, "హెచ్చెను హేమంతం" అనడంతో "హె"-కు యతి కలిసింది - అలాగే హేమంతానికి ఉత్సాహం కలిగింది అనే కొంగొత్త ప్రయోగం కుదిరింది.

ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా

"విరిసిన పరువాల పిలిచెను మధుబాల" -- స్త్రీని విరిసిన పువ్వుతో పోల్చడం గతంలో చాలా పాటల్లో జరిగినా ఇది కొత్త మాటలతో వినూత్నంగా ఉంది. ఆ వాక్యానికి "వేసే పూబంధాలు" అంటూ మరింత సౌందర్యాన్ని అలిదారు కవి.

అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం

పుష్యమి నక్షత్రం అనడంలో కవి ఆంతర్యం పరిపూర్ణంగా అర్థం కాకపోయినా -- పుష్యం అంటే ఒక నవరత్నాలలో ఒకటి. "ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చిన తాంబూలం ఆమె చెక్కిలిపై పుష్యంగా చేరి నక్షత్రం వలే మెరుస్తోంది" అన్నది కవి భావమనిపిస్తోంది. ఇక్కడ కూడా జొన్నవిత్తుల వారు వేటూరిని తలపించారు. నక్షత్రాలను, తిథులను పాటల్లోకి తీసుకురావడం ఇదివరకు వేటూరి చాలా సార్లు చేశారు. (ఉదా:- కొండవీటి రాజ చిత్రంలో "గన్నవరం సిద్ధాంతి అన్నారు - వలపుల్లో వర్జ్యాలు ఉండబోవని").అలాగే, ఒక ప్రయోగానికి రెండుమూడు భావాలు కుదిరేలాగా వ్రాయగలగడం కూడా వేటూరి పాటల్లో రివాజు.

ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం

ఇది నా చేత, "ఆహా" అనిపించిన వాక్యం. "పంచదారవిల్లు" (అంటే "చెరుకువిల్లు", మన్మథుడి విల్లు) చేసిన గాయం అంటే ప్రేమ పెట్టిన తొందర - ఎంత కొత్తగా చెప్పారు కవి! ఆ విల్లు వదిలిన బాణం తగలకపోతే వయసు మోమాటం తీరదుట - మహాచిలిపిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది.

నిలిచా నినుకోరి, రసమయ రహదారి
శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి

"రసమయరహదారి" (ప్రేమరసం నిండిన త్రోవ) - ఇటువంటి మాటను నేను తెలుగుపాటల్లో వినలేదు. అదొకటే కాక "శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి" అనడంలో ఎంతో శృంగారం నిక్షిప్తం చేశాడు కవి.

మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై...

నింగీనేలా ఏలే రాగాలు అంటే సాయంసంధ్య గా నాకు అర్థమయ్యింది. అంటే సందెవేళలో ప్రేయసీప్రియులు ఏకమై ప్రేమభావంలో పొంగిపోతున్నారు...అని.

Thursday, October 14, 2010

రూపకాలంకారం (metaphor)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> రూపకాలంకారము

లక్షణం: విషయ్యభేద తాద్రూప్య రంజనం విషయస్య యత్
వివరణ: ఉపమేయమునకు, ఉపమానము తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం 'రూపకం' అవుతుంది. మొదటిది అభేదరూపకం, రెండవది తాద్రూప్యరూపకం.

మనం దేన్ని పోల్చదలుచుకున్నామో అది ఉపమేయమని, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానమని ఇదివరకే మనం తెలుసుకున్నాము.

ఉదా: (చంద్రాలోకం)
ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే

ఇక్కడ "మహారాజు" అన్నది ఉపమేయం. "ఈశ్వరుడు" అన్నది ఉపమానం. నిజానికి ఈశ్వరుడు, మహారాజు వేరు వేరు. అయినప్పటికీ "సాక్షాత్తు" అన్న పదం ద్వారా వీరిద్దరికీ అభేదం (తేడా లేకపోవడం) చెప్తున్నాడు కవి. అంటే ఈశ్వరుడిలోని ధర్మాలన్నీ ఈ మహారాజులో ఉన్నాయి అని కవి భావం. ఈశ్వరధర్మాన్ని మహారాజుకు ఆపాదించడం కోసం కవి వీరిద్దరికీ అభేదాన్ని చెప్పాడు కనుక ఇది అభేదరూపకం అవుతుంది.

రూపకసమాసం విగ్రహవాక్యవిధానం తెలిస్తే తాద్రూప్యరూపకం గురించి తెలిసినట్టే. ఈ క్రింది ఉదాహరణ చూద్దాము.

ఉదా: (సౌందరనందం, రచన: అశ్వఘోషుడు)
కామవ్యాథుని చేత మనుష్యహరిణములు చంపబడుచున్నవి.

ఈ ప్రయోగంలో రెండు రూపకాలంకారాలు ఉన్నాయి. మొదటిది: "కామవ్యాథుడు" అంటే "కామము అనెడి బోయవాడు" అని భావం. కామానికి, బోయవానికి ఉన్న తాద్రూప్యాన్ని (similarity) చెప్తోంది కాబట్టి ఇది రూపకలాంకారం అవుతుంది. ఇక రెండవది: "మనుష్యహరిణము" అంటే "మనిషి అనే లేడి". వేటాడబడటంలో (కామము చేత) మనిషికి, (బోయవాని చేత) లేడికి కల తాద్రూప్యాన్ని చెప్తోంది కనుక ఇది కూడా ప్యరూపకాలంకారం అవుతుంది.

ఉదా: (మనుచరిత్ర, రచన: అల్లసాని పెద్దన)
విలోకన ప్రభావీచికలన్ తదీయ పదవీకలశాంబుధి వెల్లి గొల్పచున్

పద్యంలోని ఈ పాదానికి భావం, "చంద్రుని కిరణాల వలన సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసిపడతాయో, అదే విధంగా వరూధిని చూపులు తాకి ప్రవరుని బాట పొంగిపొరలుతోంది", అని. ఇక్కడ "పదవీకలశాంబుధి" అనడంలో పదవికి, కలశాంబుధికి తాద్రూప్యాన్ని చెప్పడం ద్వారా ఇది రూపకాలంకారమైంది.

ఉదా: (అంతర్యామి అలసితి సొలసితి, రచన: అన్నమాచార్యులు)
కోరిన కోర్కెలు కోయని కట్లు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మదిలో చింతలు మయిలలు మణుగులు

ఈ వాక్యాలన్నింటిలోనూ రెండు విషయాలకు అభేదాన్ని చెప్తున్నారు మహానుభావులు అన్నమాచార్యులు.

ఉదా: (రఘువంశసుధాంబుధిచంద్ర, రచన:  పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్)
రఘువంశసుధాంబుధిచంద్ర! శ్రీరామ రామ రాజరాజేశ్వర!

రఘువంశసుధాంబుధి అంటే "రఘువంశము అనెడి అమృతం నిండిన సముద్రం" అని అర్థం. ఆ రెండింటికీ అభేదం చెప్పాడు. అక్కడితో ఆగక, చివరన "చంద్ర" అని చేర్చడంతో "రఘువంశమనే సముద్రానికి చంద్రుడవు" అని శ్రీరాముణ్ణి అనడంతో చంద్రుడి ధర్మాలను శ్రీరామచంద్రుడికి ఆపాదించి తాద్రూప్యరూపకాలంకారాన్ని సమర్పించుకున్నాడు కవి.


మహామహులైన కవులు తమ భావనాబుభుక్షను చల్లార్చుకోవడానికి రూపకాలంకారాన్ని సేవించారు. వారందరి ప్రయోగాలనూ ఒకచోట చెప్పడానికి నాబోటి సామాన్యుడికి రెండుమూడు జన్మలు కూడా చాలకపోవచ్చును.ఇదే అలంకారాన్ని మన చలనచిత్రకవులు కూడా చాలా వాడారు. కొన్నిసార్లు ఉచితమైన సందర్భాలకు వాడితే కొన్ని చోట్ల ఈ అలంకారానికి అవమానం కలిగించే విధంగా వాడారు. మనం ఉచితమైనవే చెప్పుకుందాం.

ఉదా: (పాట: ధన్యోహం ఓ శబరీశా, చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్మ్యం, రచన: వేటూరి)
ఉత్తుంగ శబరిగిరిశృంగా, నిత్యనిస్సంగ, మంగళాంగ, పంపాతరంగపుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగా!

"మునుల యొక్క హృదయములు అనెడి తామరపూవుల మీద వాలే తేనెటీగ" అనే లోతైన భావాన్ని వేటూరివారు సంస్కృతభూయిష్టంగా చెప్పారు.


ఉదా: (పాట: సన్నజాజిమంచమెట్టి, చిత్రం: రాంబంటు, రచన: వేటూరి)
చందమామ కంచమెట్టి,సన్నజాజి బువ్వపెట్టి...




చదువర్లకు తెలిసిన కావ్యాలు, కీర్తనలు, పాటల్లోని రూపకాలంకారాలను గుర్తించి చెప్పగలరని ఆశిస్తున్నాను.

Sunday, October 10, 2010

TV చూస్తున్నప్పుడు ప్రేక్షకుల హాస్యభరితవ్యాఖ్యలు

మనం TV చూసేది వినోదం కోసం. సాధారణంగా ఆ వినోదం కేవలం TVలో వచ్చే విషయానికే కాక, మన చుట్టూ ఉన్నవాళ్ళు చేసే వ్యాఖ్యలకు కూడా వస్తుంది. అలాంటివాటిలో నాకు నచ్చిన కొన్ని చెప్దామన్నదే ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

అసలు ఈ విషయం తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది పెద్దవాళ్ళే - అంటే బామ్మలు, తాతలు మొ. వాళ్ళు. పూర్వం నాటికలు చూస్తున్నా, కావ్యాలు చదువుతున్నా ప్రేక్షకుడు/చదువరి చాలా నిమగ్నమై చేసేవారు అని అనిపిస్తుంది. వాళ్ళకు కథలోని ఒక పాత్ర ఆవేశాన్ని అనుభవించడం అలవాటేమో. ఇలాంటి వాళ్ళు TV ముందు చేరారంటే, ప్రతినాయకుడికి ఆయుస్షు మూడినట్టే "అమ్మ నీయమ్మకడుపు మాడ", "అమ్మ తత్తుకొడకో", "వీడి అసాధ్యం కూలిపోను", "వీడి బొంద పెట్ట" వంటి వ్యాఖ్యలు అనాయాసంగా, అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఇక ధారావాహికలో ప్రతినాయకుడో లేక ఒక చెడ్డ పాత్రో దుస్థితిపాలైతే కర్మసిద్ధాంతాన్ని వీళ్ళే వల్లించేస్తారు. "ఇప్పుడు తిక్క కుదిరిందా దొంగవెధవ. నిరుడు ఏడిపించుకు తిన్నారు కద దాన్ని. దేవుడు బాగా చేశాడు", అని అంటుంటే "వీళ్ళ దృష్టిలో దర్శకుడు దేవుడన్నమాట", అనిపిస్తుంది.

ఈ బామ్మలకి క్రికెట్ అంటే కూడా ఆసక్తి ఉంటుంది. ఏ తెండుల్కరో slipలో ఒక catch పడితే వెంటనే, "అమ్మ నాయనో. పండు పట్టేశాడురా", అంటారు. చిన్నప్పుడు వీళ్ళ కామెంటరీ వినే, మా అన్నదమ్ములం ఎవరైనా పనికిమాలిన shot కొట్టి outఅయితే, "పండి ఇచ్చి పక్కకెళ్ళాడు" అనడం అలావాటైంది. కొంచెం రామాయణభారతాదికావ్యాలను చదివినవాళ్ళైతే క్రికెట్ ఆటగాళ్ళను పౌరాణిక పాత్రలతో పోలుస్తూ ఉంటారు. అగార్కర్ bowling కి వస్తే, "వచ్చాడండి కర్ణుడు. ఇక పరుగులని దానం చేస్తూనే ఉంటాడు, చేతిలో ఎముక లేకుండా", అనడం చూసి నేను పడిపడి నవ్వుకున్నాను.

ఆ మధ్యన ధోనీ bat పట్టుకుని ఎడాపెడా బట్టలుతికినట్టుతికేసేవాడు. జట్టుకు నాయకుడు అయ్యాక నెమ్మదిగా ఆడటం మొదలెట్టాడు. ఇది మా అన్నదమ్ములెవ్వరికీ మింగుడుపడలేదు. ఆ మధ్యన ఒక test match మేమందరం కలిసి చూస్తుండగా ఒక batsman out అయ్యి, ధోనీ వచ్చాడు. అప్పుడు మా తమ్ముడు పక్కనుండి వచ్చి, "ధోనీ ద్రావిడ్ role కి వచ్చాడు, ధోనీ ద్రావిడ్ గా నుంచున్నాడు. ధోనీ ద్రావిడే అయిపోయాడు. ఇప్పుడు మీరు పూర్తిగా ద్రావిడ్ గా మారిపోయిన ధోనీని చూస్తారు", అన్నాడు (చంద్రముఖి cinema పతాకసన్నివేశాన్ని అనుకరిస్తూ).

చిత్రాల్లో నాటకీయతను ఆధారంగా చేసుకుని హాస్యాన్ని పండించడం ఒక ఎత్తు. ఒకసారి ఏదో చిత్రంలో కథానాయకుడిని చంపడానికి పదిమంది దుండగులు వచ్చి కొట్లాటకు దిగుతారు. కానీ నాయకుడు మీదకు మాత్రం ఒక్కోసారి ఒక్కొక్కళ్ళే వస్తారు. ఇది చూసిన ఒక పెద్దాయన, "ఇదేమైనా ధర్మయుద్ధమారా? నలుగురూ కలిసి ఒక దెబ్బేస్తే చచ్చూరుకుంటాడుగా", అని అడిగారు.

చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో ఎదురింట్లో పిల్లలందరూ చేరారు. అప్పట్లో చిరంజీవి నటించిన "దొంగమొగుడు" అనే చిత్రం cassette తెచ్చి చూద్దామని అల్లరి చేశారు. చూశారు, చూశారు పెద్దాయన, ఎంతకీ పిల్లలు మాట వినకపోతే, "దొంగమొగుడూ లేడు, తత్తుకొడుకూ లేడు. పొండిరా వెధవల్లారా. వేషాలేస్తున్నారు", అన్నారు. దెబ్బకు పిల్లలంతా నోరు మూసుకుని మళ్ళీ జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలయ్యేంతవరకు తెరవలేదు.

మన తెలుగు చలనచిత్రాల్లో దాదాపు అన్ని కథలూ మనకు తెలిసినవే మళ్ళీ తీస్తూ ఉంటారు. ఏమైనా అంటే, treatment కొత్తగా ఉంది అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మా అన్నయ్య చిత్రకథను ముందుగానే ఊహించి చెప్పాడు. అనుకున్నట్టే చివరికి ప్రతినాయకుడు కథానాయకుడి మిత్రుడే. "చూశార్రా? నేను చెప్పినట్టే జరిగింది", అన్నాడు. వెంటనే మఱొక అన్నయ్య లేచి, "ఊరుకోరా...పౌండ్రకవాసుదేవుడిలాగా నీ డబ్బా...అది అందరికీ తెలిసిందే...", అన్నాడు. ఎక్కడినుండో పౌండ్రకవాసుదేవుడిని పట్టుకొచ్చి ఉపమానం చెయ్యడం చూసి నాకు భలే నవ్వొచ్చింది.

ఇహ మొగుడూపెళ్ళాల వెటకారానికైతే లోటేముంది. గీతాంజలి చిత్రం వస్తోంది. మా పక్కింటావిడ ఆ విషయం తెలుసుకుని భర్తతో, "ఏవండీ...గీతాంజలి cinema పెట్టండి. cancer patient లాగా నాగార్జున చాలా బాగా చేశాడు", అంది. వెంటనే ఆయన, "వాడు చేసేదేముందే...ఎలాగా cancer patient లాగే ఉంటాడుగా...", అన్నాడు. (ఇది కేవలం పరిహాసానికి మాత్రమే అని చదువర్లు గమనించాలి...ఏ మొగుడు మాత్రం భార్య ఫలానా hero బాగున్నాడు అంటే ఒప్పుకుంటాడు? :) )

నా చిన్నప్పుడు JD చక్రవర్తి నటించిన చిత్రం ఒకటి "పేరు పెట్టకుండానే" విడుదలైంది. ఆ చిత్రం ఎలాగుందో తెలుసుకోవాలనే కుతూహలంతో నేనూ, మా తమ్ముడు మా పనమ్మాయిని, "లక్ష్మీ! గెడ్డం చక్రవర్తి కొత్త cinema ఎలాగుంది?", అని అడిగాము. దానికి, "ఏ cinema?...ఓ దిక్కుమాలిన cinemaనా?" అంది. పేరుకు నోచుకోని cinemaని "దిక్కుమాలిన cinema" అనచ్చు అనే ఆలోచన మాకెందుకు తట్టలేదా అని మేమిద్దరం రెండు రోజులు బాధపడ్డాము.

కొంచెం ఎదిగాక కుఱ్ఱాళ్ళు (నేనూను :) ) మరీ ముదిరిపోతారు. ఇలాంటి వాళ్ళల్లో మా మిత్రుడొకడున్నాడు. వాడు చిన్నప్పుడు "దాన వీర శూర కర్ణ" చిత్రం పైన సంధించిన హాస్యాస్త్రానికి ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఆ చిత్రంలో బుల్లికర్ణుణ్ణి పట్టుకుని రాధ, "ఏ తల్లి నిను కన్నదో" అని ఒక పాట పాడుతుంది. సి.నా.రే సాహిత్యంతో లలితంగా సాగే ఈ పాట మధ్యలో ఒక చోట "నా వరాల తొలిపంటగా నీవు నా ఇంట వెలశావురా" అని అన్నప్పుడు, పక్కన అధిరధుని పాత్రను ధరించిన చలపతిరావు వచ్చి మీసాలు మెలేస్తాడు. పక్కనుండి నా మిత్రుడు, "అబ్బా...నువ్వెందుకు మీసాలెగరేస్తున్నావు?", అన్నాడు.
 
సూపెర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రం చూసే ఉంటారుగా. ఆ చిత్రంలో పదే పదే జమదగ్ని అనే పాత్రలో కృష్ణ "అగ్గి పెట్తుందా?" అని అడుగుతూ ఉంటాడు. అది చూసి చూసి ఒక పెద్దాయన, "అగ్గి పెట్టి కూడా లేదు కుంకా, నువ్వులు జమదగ్నివా?" అన్నారు. నాకు నవ్వాగలేదు.

మనవాళ్ళు పాటల్ని కూడా వదలరు. "ఆనంద్" చిత్రంలో హరిహరన్, చిత్ర పాడిన "యమునాతీరం" పాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోవడానికి వేటూరి సాహిత్యం, రాధాకృష్ణన్ సంగీతం, శేఖర్ కమ్ముల దర్శకత్వం, కమలిని ముఖర్జీ అభినయం మొ. కారణాలు ఉండేవి. ఆ తఱువాత మా అన్నయ్య వ్యాఖ్య అన్నిటికంటే పెద్ద కారణమైంది. గమనిస్తే హరిహరన్ "మనసు కథా" అని ఒక్కోచోట ఒక్కోలాగా పాడతాడు. వినీవినీ మా అన్నయ్య, "హరిహరన్ పాడుతున్నప్పుడు మనసులో...'ఓరి శ్రోత...నేను ఇందాకటిలాగా అంటాననుకుంటున్నావు కదా? ఈ సారి ఇలా అంటాను చూడూ' అనుకుంటాడా ఏమిటిరా? పాడినట్టు మళ్ళీ పాడడు?" అన్నాడు.

మఱొక సారి ఇళయరాజ స్వరపరిచిన ఒక శ్రావ్యమైన పాట వింటున్నాను (ఏదో చెప్పను). పక్కనుండి నా మిత్రుడు వచ్చి, "ఒరేయ్, ఈ పాట వినరా...తద్దినం మేళాన్ని పట్టుకుని పాటంటాడేమిటిరా ఇళయరాజ?", అన్నాడు. అప్పటినుండి నాకు ఎంతో ఇష్టమైన ఈ పాటని కాస్త వ్యవధినిచ్చి వినాల్సొచ్చింది. నా మిత్రుడొకడు ("పులి" చిత్రం విడుదలయ్యాక) bank నుండి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఆ విషయం మిత్రబృందంతో చెప్తూ, "అయ్యలారా...అమ్మలారా...నా దగ్గరున్నదంతా ఊడ్చిపెట్టి ఇల్లు కొన్నాను. ఏమైనా అత్యవసరమైన ఖర్చు వచ్చిపడితే నేను మీ గుమ్మాల్లోకొచ్చి రెహ్మాన్ పాటలని పాడతాను", అన్నాడు. "రెహ్మాన్ పాటా?" అని అనుకుంటుండగా..."అదే...'అమ్మా...తల్లే...నోటు-ముత్యాల్ రాల్నియ్యవే...' అని కానీ, 'అమ్మ...అమ్మ...' (హమ్మ...హమ్మ...) అని కానీ పాడతాను", అన్నాడు.

మా చిన్నప్పుడు ఒక ఆట ఉండేది. ఈ ఆటకు మూలం "వివాహభోజనంబు" చిత్రంలో కీ. శే. జంధ్యాల వ్రాసిన ఒక సంభాషణం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుత్తివేలు ఒకరిని ఒకరు నిందించుకుంటూ, "ఒరేయ్, నువ్వు రామాయణంలో శతృఘ్నుడి type. పేరుకే తప్పితే పాత్రేమీ లేదు" అంటాడు ఒకడు. దానికి, మఱొకడు, "ఒరేయ్, నువ్వు భారతంలో దుర్యోధనుడి తొంభైమూడో తమ్ముడివి. నీ పేరు కూడా ఎవరికీ తెలియదు", అంటాడు. అదే ఆధారంగా మా అన్నయ్య, బావ ఒక ఆట మొదలెట్టారు. ఏదైనా చిత్రం రావడం మొదలు...అందులో అస్సలు ముక్కూమొహం తెలియని నటుల పేర్లను ఒకరికి ఒకరు ఆపాదించుకోవడం ఆట. ఆ పరంపరలో దొరికిపోయిన నటులు...శ్రీధర్ (ముత్యాలముగ్గు చిత్రంలో కథానాయకుడు), రాజీవ్ కనకాల (Jr. NTR చిత్రాలు వచ్చేంతటి వరకు చిన్నచిన్న పాత్రలు వేసేవాడు), కీ. శే. రాజా (ధారావాహికలో నటించేవాడు), కీ. శే. అచ్యుత్ (బుల్లితెర megastar) మొదలైనవాళ్ళు. ఇంకా కొంతమంది పేర్లైతే నాకు ఇప్పటికీ తెలియనే తెలియవు. సన్నివేశం మొదలవగానే, "ఒరేఇ..బావొచ్చేశాడురా..." అని మొదలెట్టడం. (ఈ ఆట ద్వారా ఎవరినో అవమానించాలనే ఉద్దేశం లేదు. వాళ్ళకు ఆ వయసులో అంత ఊహ కూడా తెలియదు.)

ఇవన్నీ చూసి/విన్నమీదట నాకు TV చూస్తే మా gang అందరితోనూ కలిసి చూడాలనిపిస్తుంది. లేకపోతే, చూసినట్టుండదు.

Saturday, September 25, 2010

నిదుర రాని నిట్టూర్పుల జోల పాటలు

ఈ మధ్యన నాకు ఒకదాని తఱువాత మఱొకటి పనులు వచ్చి పడుతున్నాయి. ఇన్ని పనుల మధ్యలో తీరిగ్గా కూర్చుని ఒక పద్యం వ్రాద్దామన్నా, ఒక పాట వ్రాద్దమన్నా, ఒక హాస్యభరితమైన టప వ్రాద్దమన్నా కుదరట్లేదు (ఇదేదో డబ్బా కొట్టుకోవడం కాదు. ఇలాగ పనులు వచ్చిపడటానికి కారణం నాకు క్రమశిక్షణ తక్కువవ్వడమే!).

ఈ పరిస్థితుల నడుమ పడుకునే ముందు రెండు నిముషాలు మనసుని ప్రశాంతపరుచుకుని రెండు మూడు వాక్యాలు వ్రాసి ఆ సంతృప్తితో పడుకుందామని అనిపించినప్పుడల్లా ఏవో వ్రాస్తున్నాను. వాటిల్లో కొన్ని మిత్రులకు నచ్చాయి. అవి ఇక్కడ కూడా వ్రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇవి పాటలా అంటే నాలుగైదు వాక్యాలకు మించి ఉండవు, పద్యాలా అంటే ఛందస్సును అనుసరించవు, వాక్యాలా అంటే లయ ఉంటుంది, తవికలా అంటే మరీ అంత తేడాగా ఉండవనే అనిపించింది. వీటినేమనాలో నాకు తెలియదు. అందుకే ఈ టప శీర్షవాక్యం (title) అలాగ వ్రాశాను.

నేను వ్రాసినవాటిల్లో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. వాటికి సందర్భాలు అంటూ ప్రత్యేకించి ఉంటే వివరిస్తాను. వాక్యం చివరన $ పెడితే నాకు నచ్చిందని :-D. 


"ఎబ్బే, ఛ ఛ" మొదలైన భావాలేమైనా ఉంటే వ్యాఖ్యల ద్వారా చెప్పండి - ఇకపైన ఈ బ్లాగ్పొల్యూషణ్ని నివారిస్తాను. మనోనేత్రంలో ఇలాంటి నలుసులు మళ్ళీ పడకుండా జాగ్రత్తపడతాను :)

సం:- పడుకోబోతుంటే ఒక అమ్మాయి చిత్రం (photo) చూశాను. లక్ష్మీదేవి లాగా కళగా ఉంది.

ఈ సిగ్గు ఏ ముంగిలి ముగ్గో
ఈ నవ్వు ఏ వాకిలి పువ్వో
ఈ వలపు ఏ గడపల పసుపో $
ఈ సొగసు ఏ రాముడి సగమో $

సం:- ఒకమ్మాయి తిరుపతి మీదుగా బస్సులో వెళ్తోంది. ఏదో భయంలో ఉంది. కాస్త చల్లబడేలాగా రెండు మాటలు చెప్దామనిపించింది. అప్పుడు పంపిన SMS.

వీచేటి ఈ గాలితో పంపాను, నీ మోవిపై చిరునవ్వుపూలన్ని చిరకాలముండేట్టు శ్రీరస్తుభావాలని
పూసేటి సిరివెన్నెల జోలాలి అంటుండగా, ఏ చింతలూ లేక ఈ బంతి నిదురమ్మ ఒడిలోన ఒదగాలని
"జాబిల్లి నీ చెల్లిలాగుందె ఓ బుల్లి, ఏ పల్లె మారాణివే?", అనుకున్న దోవెళ్ళి వెంకన్ననడగాలి ఎవరని

సం:- వేటూరి పూనేశాడు. కొంచెం శృంగారరసం కలపాలనిపించింది. తప్పుగా అనిపిస్తే చదువర్లు క్షమించాలి.

వయసు వాయనాలడుగగ వచ్చానే మగువా!
నా వలపునోము చెల్లించగ నీకెందుకు బిగువ?
జాబిలమ్మ పందిరేసి పిలిచాక తగువా? $
పెదవిగంధమద్దుతాను* మడిపీట దిగవా? $

సం:- మధ్యమధ్యలో నాకు పిల్లరాతాలు వ్రాయలనిపిస్తుంది. అంటే కొత్త ప్రేమకొడుకు భావాలు. అలాగ అనిపించినప్పుడు:

ఆ రోజున నిను చూసిన నన్ను, ఏనాడూ నే మరువగలేను
ఆ నిముషంలోనే జీవిస్తున్నాను $

నువు లేకనె నా పైనే నాకు, కలిగిందే ఈ వింతచిరాకు
ఇటు రాకని నేనే చెబుతున్నా నాకు $


* దుష్టసమాసానికి క్షంతవ్యుణ్ణి.

# ఈ టప శీర్షవాక్యం "నేను" చిత్రంలో వేటూరి వ్రాసిన "దేవతలా నిను చూస్తున్నా" పాటలోని వాక్యం. ఈ పాటకు సందర్భం ఒక కుఱ్ఱాడు తన తోటి విద్యార్థినిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతనితో స్నేహంగా ఉన్నా, మఱొకరిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ఈ కుఱ్ఱాడి ముందు తిరుగుతుంటే అతనికి కలిగే ఆవేదనని, తన ప్రేయసి వేరొకరిని ప్రేమిస్తోంది అని తెలిసినా తనని మరచిపోవడం వీలు కాని అసహాయతనీ వ్యక్తం చేసే పాట అది. ఈ పాటను ఇక్కడ చూడవచ్చును, దాన్ని విశ్లేషిస్తూ సోదరుడు ఫణీంద్ర వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ చదువవచ్చును. ఆ పాటలో దాదాపు అన్ని వాక్యాలూ నాకు నచ్చినా, ఈ వాక్యంలో ఇంకా లోతు కనబడింది. అందుకే దీన్ని నా టపకు శీర్షవాక్యం గా చేశాను.

Friday, September 17, 2010

ఉప్మా కథ

నాకు చిన్నప్పుడు ఉప్మా, ఇడ్లీ - ఈ రెండింటి మీద కొంచెం చిన్నచూపు ఉండేది. ఐనా, చట్నీ బాగుంటే, అందులో ఇవి నంజుకుంటూ సర్దుకుపోయేవాణ్ణి. అమెరికా వచ్చాక మాత్రం ఉప్మా నా జీవనాధారం అయిపోయింది. అది ఎందుకో జీవితంలో ఒక్కసారైనా ఉప్మా వండినవాళ్ళకు తెలుస్తుంది. పావుగంటలో వండుకునే భారతీయ ఉపహారాలు చాలా తక్కువ. అందులో ఉప్మా శ్రేష్ఠమైనది అని నా అభిప్రాయం. పోకిరి సినిమాలో చెప్పినట్టు, "semesterలు semesterలు ఉప్మా తిని బ్రతికేస్తున్నాను". ఈవేళ కూడా అదే వండుకుని తిన్నాను. అది వండుతున్నప్పుడు నాకో కథ గుర్తొచ్చింది.

మాకు చిన్నప్పుడు బడిలో Moral Science చెప్పేవారు. ఐతే ఆరో తఱగతి దాటాక ఆ subject లో మార్కులు total లో లెక్కపెట్టేవారు కాదు. అందుచేత విద్యార్థులందరూ ఆ classలో కళ్ళు తెరిచి పడుకోవడం, book-cricket ఆడుకోవడం, మర్నాడు ఉదయానికి hand-writing వ్రాయడం వంటి పనులు చేసుకుంటూ ఉండేవారు. అది చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయులు మాకు ఈ subject అంటే ఆసక్తి లేదని గ్రహించి, కొంతసేపు విషయం చెప్పి, మధ్యలో విద్యార్థుల దృష్టిని మళ్ళీ తమవైపు మరల్చుకోవడానికి కథలు చెప్పేవారు. అలాంటి కథల్లోదే ఈ ఉప్మా కథ. చెప్పిన ఉపాధ్యాయుని పేరు ఆరుముగం శివసామి. ఇంతకీ ఆ కథ ఏమిటో చూద్దాము.

అనగనగా తమిళనాడులో, ఒక ఊళ్ళో ఒకబ్బాయి ఉన్నాడు. అతనికి చదువు అవ్వగానే ఎక్కడో ఉత్తరభారతదేశంలో ఉద్యోగం వచ్చింది. మనవాడా అరవోడు. పొట్ట కోస్తే హిందీ ముక్క రాదు. అక్కడికి వెళ్ళి ఉద్యోగంలో చేరాడే కానీ మరీ తిండికి ఇబ్బందయ్యింది. ఇతడికి వంట రాదు. బయట hotel లో దక్షిణభారతదేశపు వంటకాలు దొరకవు. ఒకసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు అతను తింటున్న తీరుని బట్టి, "వీడు మన తిండికి మొహం వాచిపోయి ఉన్నాడు. వీడికి పెళ్ళి చేస్తే మంచిది", అని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. "బాగా వంట వచ్చిన అమ్మాయి కావాలి" అనుకుని, సంబంధాలు వెతగ్గా వెతగ్గా ఒకమ్మాయి photo అతడికి బాగా నచ్చింది.

ఒక సుముహూర్తంలో అందరూ కలిసి పెళ్ళి చూపులకు వెళ్ళారు. అక్కడ ఉప్మా పెట్టారు. ఆ ఉప్మా తిన్న కుఱ్ఱాడు పెనం మీద పడ్డ వెన్నముద్దలాగా కరిగిపోయాడు. ఆ ఉప్మా అమ్మాయే చేసింది అని తెలుసుకుని మురిసిపోయాడు. అమ్మాయి అందరికీ బాగా నచ్చింది. పెద్దలు అన్నీ మాట్లాడుకుని పెళ్ళి జరిపించారు.

స్వంత ఊరు వచ్చిన మొదటి రోజు, అతను భార్యతో, "నువ్వు పెళ్ళిచూపులప్పుడు చేసి పెట్టిన ఉప్మా అద్భుతం. మళ్ళీ చెయ్యవూ?" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించి, చక్కగా వండిపెట్టింది. మనవాడు కొత్త పెళ్ళికొడుకు కావడం చేత ఎంత తింటున్నాడో చూసుకోకుండా సుబ్బరంగా తినేసి "మా ఆవిడ వంటలో best" అని చాటింపేశాడు. ఇంక ఆ వారమంతా అదే ఉప్మా తిన్నాడు. మరుసటివారం మనవాడికి కొంచెం వెగటు వచ్చి, "ఈ రోజు దోశలు చెయ్యవోయ్. ఉప్మాకి కొంచెం break వేద్దాం", అన్నాడు. ఆమె, "నాకు దోశలు చెయ్యడం రాదండి" అంది. కొత్తసంసారంలో కోపాలు ఉండకూడదు, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామన్న సదుద్దేశంతో:
అ: "పోనీ నీకేం వచ్చు"
ఆ: "నాకు ఉప్మా చెయ్యడం వచ్చును."
అ: "అది కాకుండా?"
ఆ: "నాకు అదొకటే వచ్చునండి"
అ: "ఆఁ? ఆ ముక్క పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు?"
ఆ: "మీరు అడగలేదు కదండి"

సరే ఇంత చిన్న విషయాన్ని పెద్దది చెయ్యడం ఎందుకు అనుకుని అతను రోజూ అదే tiffin గా సేవిస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు అతడుంటున్న ఊళ్ళో ఒక South Indian restaurant (అదే, దక్షిణభారతవంటకాల పూటకూళ్ళ ఇల్లు) ప్రారంభించారు. పందొమ్మిదివందల నలభై ఏడు, ఆగష్టు పదిహేనున మన జాతీయపతాక ఎగిరినప్పుడు గాంధీగారు ఎంత ఉబ్బితబ్బిబ్బైపోయారో, మన కథానాయకుడు కూడా అంతే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సాయంత్రం త్వరగా office నుండి వచ్చేసి, భార్యాసమేతంగా ఆ restaurant దగ్గర వాలిపోయాడు.

ఒక waiter, menu తీసుకొచ్చి మనవాడి ముందు ఉంచాడు. "ఎన్నిరిక్కు?" అని ఆత్రంగా అడిగాడు మనవాడు. "menu దేఖియే" అన్నాడు waiter. అప్పుడు అర్థమైంది అకడ waiters అందరూ హిందీలో సంభాషిస్తున్నారు అని. menu కూడా హిందీలో ఉంది. సరే, హిందీ రాదనే విషయం భార్యకు తెలిస్తే నామోషీ అని దేవుణ్ణి తలుచుకుని ఉన్నవాటిల్లో ఒకదాని మీద వేలు పెట్టి waiterకి చూపించాడు. Waiter, "ఓ, అర్థమైంది", అన్నట్టు తల ఊపి, తన చేతిలో ఉన్న కాగితం మీద ఏదో బరుక్కుని వెళిపోయాడు. ఇంతలో మన వాడు భార్యకేసి చూసి, "Waiter లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే లోకువైపోతాము", అన్నాడు. అతని భార్య అమాయకంగా, "ఓ, అలాగా", అని తల ఊపింది.

ఇంతలో మన వెయ్టరు రెండు పళ్ళాల నిండా ఉప్మా పెట్టుకుని తీసుకొచ్చాడు. అది చూసిన మనవాడు ఉప్మా కంటే ముందు ఖంగు తిన్నాడు. భార్యకేసి తిరిగి, కాస్త తెల్లముఖానికి గాంభీర్యం పూసి, "ఎప్పుడూ నీ చేతి ఉప్మా తింటున్నాను కదా. ఈ సారి అసలు బయట ఎలాగ చేస్తారో తెలుసుకుందామని order చేశాను" అన్నాడు. భార్య మళ్ళీ అమాయకంగా తల ఊపి తినడం మొదలెట్టింది. మనవాడు తింటున్నాడే కానీ, ఒకటే వెగటు పుట్టింది. మొత్తానికి అయ్యింది అనిపించి, "సరే, ఇంకేమైనా తిందాం" అనుకున్నాడు. పక్క బల్ల మీద కూర్చున్న వాళ్ళేమి order చేస్తున్నారో చూస్తూ ఉన్నాడు. ఒకాయన ఏదో హిందీలో చెప్పాడు. అది విన్న waiter ఘుమఘుమలాడే సాంబార్తో వడలు తీసుకొచ్చాడు. మనవాడికి మనసు లాగింది. ఆయనేమన్నాడో అలాగే గుర్తుపెట్టుకుని waiter వచ్చాక అదే చెప్పాడు. waiter, "ఓహో" అన్నట్టు చూసి లోపలికెళ్ళాడు.

కాసేపాగి మళ్ళీ waiter రెండు ప్లేట్లలో ఉప్మా పట్టుకొచ్చాడు. మనవాడు బిక్కమొహం వేసి, "ఏంటిది? వెటకారమా? owner తో మాట్లాడతాను" అని వాడితో తగువుపెట్టుకున్నాడు. Owner తెల్లని పంచి కట్టుకుని, అడ్డనామాలు పెట్టుకుని, కిళ్ళీ నవులుతూ వచ్చాడు. "Problem ఏంటి సార్", అని అడిగితే మనవాడు అరవంలో తన బాధ వెలిబుచ్చుకున్నాడు. ఆ owner, waiter తో, "ఈయన ఏమి చెప్పారు?" అని అడిగితే "ఫిర్ యెహీ లాయియే, అన్నారు సార్", అని waiter చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న owner, "సార్, మీరు ఇదివరకు తెచ్చిందే తెమ్మని చెప్పారుట కదా సార్" అన్నాడు. అప్పుడు వెలిగింది మనవాడికి, ఆ పక్క బల్ల వాడు ముందు కూడా సాంబార్వడ order చేసి ఉంటాడు అని. తగువు పెట్టుకుంటే అసలు విషయం తెలిసిపోతుందని, "అయ్యో, నేనో పరధ్యానంలో ఉన్నాను" అని owner తో చెప్పి మళ్ళీ ఉప్మా తినేశాడు.

మూడో సారి కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనవాడు menu తిరగేశాడు. "సరే, అది ఉప్మా అనుకో, మిగతావేవీ ఉప్మా కాకూడదు కదా?" అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అని ఉప్మాకు అతిదూరంలో ఉన్న, menu లోనే ఆఖరి item ని order చేశాడు. అదేదో మిగతావాటికంటే వేరే font తో, special గా ఉంది, కచ్చితంగా ఏదో అద్భుతమే అయ్యుంటుందని ఊహించాడు. ఆ waiter ఒక వెర్రిచూపు చూసి, వెళ్ళి owner తో మాట్లాడాడు. Owner వచ్చి, "సార్, మీరు చెప్పింది మేము తీసుకురాలేము", అన్నాడు. "ఎందుకు తీసుకురాలేరు", అని అడిగాడు మనవాడు. ఆ owner ఒక వెటకారపు నవ్వు నవ్వి, "ఆ menu చివరిలో ఉన్నాది, నా పేరు సార్", అన్నాడు.

మొత్తానికి కథానాయకుడికి ఉప్మా తప్ప వేరే ఏదైనా తినాలనే కోరికకు అలాగ అడ్డంకులు పడుతూ వచ్చాయి అన్నమాట. నా పరిస్థితి కూడా అలాగే ఉంది.


--
సెర్చి పార్టీలకు: Viveka Vardhani/Vardhini Public School, Arumugam Sivasami/Sivasamy, Tuni

Tuesday, September 14, 2010

చుప్పనాతి శూర్పనఖ (వేటూరి వారి పాట)

భారతావనిలో స్త్రీద్వేషి రాంబాబా గారిని కలిసినప్పుడు, ఆయన నాకు చాలా బోధలు చేశారు. వాటన్నిటితోనూ నేను ఏకీభవిస్తానా లేదా అన్న విషయం పక్కన పెడితే, అవన్నీ విన్నమీదట నాకు వేటూరి వారి పాట ఒకటి గుర్తొచ్చింది.

ఈ పాట "సుందరానికి తొందరెక్కువ" అనే లో-బడ్జెట్ చిత్రంలోనిది. తారాగణం, సాంకేతికవర్గం అందరూ కొత్తవారే కావడం, తగినంత ప్రచారం జరగకపోవడం వలన చిత్రానికి పెద్ద పేరు రాలేదు కానీ, నేను చూసిన రెండుమూడు సన్నివేశాలు మాత్రం బానే ఉన్నాయనిపించింది. ఎలాంటి చిత్రానికైనా మంచి సన్నివేశం, తెలుగుదనం ఉన్న బాణీ ఇస్తే వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు కదా. అలాంటి పాటల్లో ఇదొకటి.

ముందుగా పాట వ్రాస్తున్నాను, తఱువాత నాకు నచ్చిన అంశాలను చెప్తాను. ఈ పాటను ఇక్కడ వినవచ్చును.

చిత్రం: సుందరానికి తొందరెక్కువ
గాయకులు: బాలు
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: నాగరాజ్

చుప్పనాతి శూర్పణక్క చుట్టుముట్టుకున్న లంక, రాములోరి రాత కూడా మార్చినట్టి మాయజింకరా, ఓరి సోదరా!
కొప్పుచుట్టనంటు ఇంక, నిప్పు పెట్టిపోయెనింక, భారతాన ద్రౌపదమ్మ భద్రకాళికైన అక్కరా, తిక్కశంకరా!
ఒంపుసొంపు చూసి ఓడిపోకి, ఓర చూపు చూడగానె ఒంగిపోకు, దాని దోరనవ్వు చూసి లొంగిపోకు
తొరబడి, పొరబడి, నువ్వు కోకలాంగి తోక కాకు

పానశాలకి దేవదాసును పంపినట్టి పార్వతమ్మ ఆడదేనురా
చందమామకే మచ్చ తెచ్చిన మచ్చెకంటి తార కూడ ఆడదేనురా
ఆడరోషమున్న రోషనార, నాగులేటి నాగులాంబ సాటిలేని జాణలేనురా
ఈడ అమ్మ తప్ప, అత్తలైన దుత్తలెవ్వరైన, పెళ్ళమైన గొళ్ళెమేనురా

రాములోరిని కానకంపిన, మంథరమ్మ ఆడశకుని కాకపోదురా
కృష్ణమూర్తినే కాలదన్నిన సత్యభామ కూడా స్వఛ్ఛమైన ఆడదేనురా
అల్ల తాటకైన, పూతనైన, లంకిణైన, బొంకిణైన ఆడదాని అంశలేనురా
ఇల్ల మేనకైన, ఊర్వశైన, రంభపంబలెవ్వరైన ఇంద్రజాలకీలలేనురా

మొదటగా ఈ పాటలో గమనించవలసిన విషయం ఏమిటి అంటే వేటూరికి పురాణాలపైన, చరిత్రపైన ఉన్న పట్టు. సీతా, సత్యభామా మొదలుకొని శూర్పనఖ, మంథర వరకు మన పురాణాలలో ఉన్న అన్ని రకాల ఆడవాళ్ళనీ గుర్తుచేశాడు. అలాగే చరిత్రనుండి రోషనార, నాగులాంబ వంటి వారిని కూడా ఉదాహరణలుగా చూపించాడు.

చరిత్ర మీద వేటూరికి ఉన్న పట్టు గతంలో కూడా చాలా గీతాల్లో తెలిసింది. ఉదాహరణకు "యమహా నగరి" (చిత్రం: చూడాలని ఉంది) పాటలో ఎంతమంది బెంగాలీయులని తలుచుకున్నాడు (ఠాగూర్, సత్యజిత్ రే, వివేకానంద, సరోజిని నాయుడు, మదర్ థెరెసా, శరచ్చంద్ర, ఎస్.డీ. బర్మన్ - మరెందరో). ఒక ఊరు గురించి చెప్పవయ్యా అంటే ఆ జంక్షన్ ఉంది, ఈ సర్కిల్ ఉంది అని కాకుండా ఆ ఊరిలో ఉన్న గొప్పవారి గురించి చెప్పే ఔన్నత్యం ఆయనది. రెండు చరణాలు రికార్డింగ్ అయ్యాక, అప్పటికప్పుడు మూడో చరణం వ్రాసి ఇచ్చి - "ఇది కూడా పెట్టండి" అని అడిగి మరీ ఆ ఊరుని పొగడటం వేటూరికే చెల్లుతుందేమో!

మళ్ళీ పాట విషయానికి వస్తే, ఈ పాటలో మనం గమనించాల్సిన మఱో విషయం, వేటూరి సరదా ప్రయోగాలు. కోమలాంగికి ని వెటకారంగా కోకలాంగి అని వక్రీకరించడం, రోషానికి కూడా లింగభేదం కల్పించడం ("ఆడరోషమున్న"), పెళ్ళాన్ని గొళ్ళెమనడం ఉదాహరణలు. స్త్రీత్వానికి ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించి స్త్రీలందరినీ ఆ శక్తియొక్క ప్రతిబింబాలుగా చెప్పడం నాకు బాగా నచ్చింది. "సత్యభామ కూడా స్వఛ్ఛమైన ఆడదే" అనడంలో ఆమె చేసిన పని పూర్తిగా స్త్రీగర్వఫలితమే అన్న భావం నాకు స్ఫురించి నవ్వొచ్చింది.

చివరగా "ఈడ అమ్మ తప్ప, అత్తలైన దుత్తల్లెవ్వరైన, పెళ్ళమైన గొళ్ళెమేనురా" అనడం నాకు భలే నచ్చింది (ఆడవాళ్ళూ, దయచేసి తిట్టుకోకండి!). (సాధారణంగా) ఈ సృష్టిలో ఏ తలనొప్పీ తీసుకురాకుండా,  స్వార్థం చూసుకోకుండా మనకు ఏదో చెయ్యాలనుకునేది ఒక్క తల్లే. నిజమైన స్త్రీత్వానికి ప్రతిరూపం ఆమె! రాంబాబా గారు చెప్పినట్టు, అత్తగారు బ్రతిమాలి కాఫీ ఇచ్చినా, ఆ నురుగలో "మా అమ్మాయిని బాగా చూసుకో" అని కనిపిస్తుంది.

Sunday, September 12, 2010

అంతరాయానికి చింతిస్తున్నాము

నేను దాదాపు నెలరోజులపాటు ఒక్క టప కూడా వ్రాయలేదు. (అంటే, నా టపల కోసం ఎవరో కాచుకుని కూర్చున్నారు అని అనట్లేదు అనుకోండి.) దానికి కారణం నా స్వదేశగమనం. భారతదేశానికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని, బంధువులని, మిత్రులని కలిసి వెనక్కి వచ్చాను. నేను వెనక్కి రాగానే శనైశ్చరుడు హస్త (నాకు నైధన తార) మీదకు జరిగాడు. తస్సాదియ్యా, నాకు సరదా తీరిపోతోంది. 2011 సెప్టెంబర్ వరకు నాకు చక్కని కాలక్షేపం.

రెండు రోజులనుండి టప వ్రాద్దామని ప్రయత్నిస్తున్నాను కానీ, "ఇదేంటి, ఇదేదో కొత్త ప్రపంచంలాగా ఉందే. ఇవన్ని టపలు వ్రాసింది నేనేనా?" అనే భావం మెదులుతోంది మనసులో. స్వగృహదూరవేదన (home-sick ని తెనుగీకరిద్దామని ప్రయత్నించాను) మనసులోకి దూరదామన్నా ఖాళీ లేనంత పనిలో పడ్డాను. ఏదేమైనా నీళ్ళల్లోకి దూకాక ఈదక తప్పుతుందా.

అలంకారాల టపలు కొనసాగిస్తాను. వీలైనప్పుడు మళ్ళీ పద్యాలు వ్రాస్తాను. వేటూరి వారి సాహిత్యం గురించి కూడా టపలు వ్రాస్తాను. చిట్టి కథలు కూడా వ్రాస్తాను. చదువర్లు అక్షతలు వెయ్యాలనుకుంటే వ్యాఖ్యలను వాడుకోగలరు.

ఇంతే సంగతులు
చిత్తగించగలరు
భవదీయుడు
రామకృష్ణ సందీప్

Sunday, August 1, 2010

ప్రతీపాలంకారము

వ్యాకరణం -> అలంకారములు -> అర్థాలంకారములు -> ప్రతీపాలంకారము


లక్షణం: ప్రతీపం ఉపమానస్య ఉపమేయత్వప్రకల్పనం
వివరణ: ఉపమానంగా ప్రసిద్ధమైనదానికి ఉపమేయంగా వాడటాన్ని ప్రతీపాలంకారం అంటారు.

ఉదా:- (రేరాణి, రచన: ఎల్. నాగలక్ష్మి)
రాణి! నీయందముతో సరి రతిదైన
యందమని సురాంగనలందురక్కజముతో

సాధారణంగా స్త్రీ సౌందర్యాన్ని రతిసౌందర్యంతో పోలుస్తారు. అప్పుడు రతిసౌందర్యం ఉపమానం అవుతుంది, స్త్రీ సౌందర్యం ఉపమేయం అవుతుంది. కానీ, ఇక్కడ "రాణి అందానికి సాటి రతిసౌందర్యం" అనడంతో రతిసౌందర్యం ఉపమేయం, రాణిసౌందర్యంతో ఉపమానం అయ్యాయి. దీన్నే ప్రతీపాలంకారం అంటారు.


ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
పద్మము నీ లోచనముతో సమానం

సాధారణంగా కన్నుని పద్మంతో పోలుస్తారు. కానీ, ఇక్కడ పద్మాన్నే కన్నుతో పోల్చడం జరిగింది కనుక ఇది ప్రతీపాలంకారం.


ఈ అలంకారానికి చలనచిత్రగీతాల్లో ఉదాహరణలు నాకు తెలియవు. చదువర్లకు తెలిస్తే చెప్పగలరు.

ఉపమేయోపమాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉపమేయోపమాలంకారము


లక్షణం: పర్యాయేణ ద్వయోస్తచ్చేదుపమేయోపమా మతా
వివరణ: రెండు వస్తువులను ఒకదానికి ఒకటి ఉపమానంగా వాడితే అది ఉపమేయోపమానం అవుతుంది.

ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
ఓ రాజా! నీయందు ధర్మము అర్థము వలెను, అర్థము ధర్మము వలెను శ్రీమంతములు.

ఇక్కడ ధర్మము, అర్థము అని రెండు వస్తువులు ఉన్నాయి. మొదట, "ధర్మము అర్థము వలెను శ్రీమంతము" అన్నప్పుడు: ధర్మము ఉపమేయము, అర్థము ఉపమానము. తఱువాత, "అర్థము ధర్మము వలెను శ్రీమంతము" అన్నప్పుడు: అర్థము ఉపమేయము, ధర్మము ఉపమానము. ఈ విధంగా రెండు వస్తువులను ఒకదానికొకటి ఉపమానంగా వాడటాన్ని ఉపమేయోపమాలంకారము అంటారు.


ఉదా:- (కావ్యాలంకారసంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
ఆ నరసింహునికి ఈ నరసింహరాయలు సాటి. ఈ నరసింహరాయలుకు ఆ నరసింహుడు సాటి.


ఉదా:- (చిత్రం: నీ స్నేహం, రచన: సిరివెన్నెల)
వివరిస్తున్నది అద్దం, మన అనుబంధానికి అద్దం; నువు నాలాగా నే నీలాగా కనిపించడమే సత్యం.


చలనచిత్రాలనుండి నాకు ఉదాహరణలు ఆట్టే తెలియవు. చదువర్లకు తెలిస్తే చెప్పగలరు.

Saturday, July 31, 2010

ఆపరా నీ ఫియాన్సే గోల

నాకు ఒక తమిష్జస్నేహితుడు ఉన్నాడు. వాడు ఒకమ్మాయిని ప్రేమించాడు. పెద్దల అంగీకారాన్ని సంపాదించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ పరిస్థితుల మధ్య వాడితో వచ్చిన తంట విచిత్రంగా ఉంది. అదే ఈ టపలో మూలవిషయం.

మేమిద్దరం బెంగుళూరులో ఉన్నప్పుడు వారానికో సాయంత్రం కలుసుకుని ఒక రెండు గంటలు cinema చూసి, కృష్ణా cafe లో దోశలు లాగించి, Corner Houseలో హిమక్రీములనారగించి, ఊరు నిదరోయే సమయంలో తీరిగ్గా, కుక్కలు తిరగని వీధుల్లో నడుచుకుంటూ, ఇందిరా గాంధి పెళ్ళి వెనుక రహస్యాల నుండి "జంతువులకు బట్లేసుకోవాలని ఎందుకు అనిపించదు?" వంటివాటి వరకు అన్ని విషయాలనూ సమగ్రంగా చర్చించుకునేవాళ్ళం. అమెరికా వచ్చాక కూడా అప్పుడప్పుడు కలుసుకుంటున్నాము. కాకపోతే agenda మారిపోయింది. అలాటి సాయంత్రాలలో ఒకటి నిన్నటిది...

సాయంత్రం ఆరు గంటలకు నేను బస్సు దిగి అక్కడే వాడి గురించి నిరీక్షిస్తూ ఉన్నాను. వాడు చెవులో phone పెట్టుకుని మాట్లాడుకుంటూ, "ఇల్లెడీ, నాన్ ఒణ్ణుమే సాపిడల్లె, నెజమా సొల్రేన్ [నేనేమీ తినలేదు. నిజంగా చెప్తున్నాను]", అనుకుంటూ వచ్చాడు. నేను "నిజంగా సొల్లే" అనుకున్నాను. భుజం తట్టి "పద పోదాం" అన్నట్టు సైగ చేశాడు. పది నిముషాలు నడిచాము. ఇంకా phone అవ్వలేదు. ఇంతలో Walmart (departmental store) వచ్చింది. వాడు phone లో, "ఇరు ఇరు, నా అప్ప్రమా కాల్ పణ్ణువేఁ [ఉండు, తరువాత కాల్ చేస్తాను]"  అని పెట్టేశాడు. "మళ్ళీ call చేస్తే, తుపాకితో నిన్ను కాల్చేస్తాను", అనుకున్నాను. నాకేసి తిరిగి, సాంబార్ వాసన వచ్చే యాసతో, "ఎలా వున్నావు?" అని అడిగాడు. "అఘోరించావులే తెలుగులో", అనుకుని; "Walmart లో ఏమైనా కొనాలా?", అని అడిగాను. "చాలా కొనాలి. అసలే నా పెళ్ళి దగ్గరకొస్తోంది. అన్నీ చక్కబెట్టుకోవాలి", అన్నాడు. సరే అని Walmart లోకి వెళ్ళాము.

"ఏం కొనాలి", అని అడగగానే, Leather case లోంచి ఒక phone తీశాడు. వాడికి office లో ఒక blackberry phone ఇచ్చారు. అందులో వాడు కొనాల్సినవాటి జాబితా వ్రాసుకున్నాడు. అది నాకు చూపించాలని తాపత్రయం. నేను ఒక విరక్తియుక్తమైన నవ్వు నవ్వాను. "మొదట ఒక దుప్పటి కొనాలి. చలిగా ఉంటోంది", అన్నాడు. దుప్పట్ల section కి తీసుకెళ్ళాను. అక్కడ వాడు అన్ని దుప్పట్లూ, వాటి ధరలూ చూశాడు. చూసి, "నిజం చెప్పాలంటే, దుప్పట్లు, కర్టెన్లు సంగతి ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది. ఈ సారి నా ఫియాన్సేని తీసుకొచ్చినప్పుడు కొనుక్కుంటాను", అన్నాడు. సరే అని, "ఇంకేం కొనాలి", అన్నాను. "Mixer కొనాలి", అన్నాడు. వాడిని తీసుకుని Mixers section కి వెళ్ళాను. నా అనుభవం మేరకు అన్నీ చూపించాను. వాడు "Phone a friend" option వాడుకున్నాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఒక పావుగంట సేపు: మధ్యనం sandwichలో ఎంత cheese వాడారు, Inception cinema చూస్తున్నప్పుడు ఎంతసేపు నిద్రపోయారు వంటి అత్యవసరవిషయాలను చర్చించి, చివరకి నా మీద దయతో "ఏ mixer కొనాలి" అన్న ప్రశ్నపై దృష్టి పెట్టారు. వీడు restaurant లో waiter లాగా అన్ని mixer ల ధరలు, ప్రత్యేకతలు చెప్పాడు. చివరికి, "నేను చూడందే నిశ్చయించుకోలేను", అంది. వాడు నాకేసి తిరిగి, "మాఁవ, తను చూస్తే కానీ చెప్పలేను అందిరా", అన్నాడు. సరేనని అదే విధంగా ముందుకుపోయాము. "నా structure పాడైపోతోంది, running చెయ్యాలి కద, మాఁవ!", అన్నాడు. వెంటనే విషయం అర్థమైంది. ఉన్నట్టుండి మగవాడికి అంత సద్బుద్ధి ఎలాగ వస్తుంది మరి? "సరే, ఇప్పుడేం కావాలి?" అన్నాను. socks కొనాలి అన్నాడు. సరే పద అన్నాను. అక్కడా scene repeat.

చివరికి నా మటుక్కు నేను biscuits కొనుక్కున్నాను. నేను vegan ని కాబట్టి పాలు లేనివి కొనుక్కున్నాను. అవి అంత రుచికరంగా ఉండవు. "నీకూ కావాలా?", అన్నాను. దానికి వాడు, "ఓ! sorry. నేను junk food (చిరుతిళ్ళు) తినడం మానేశాను. ఇందులో అన్నీ carbs ఏ తెలుసునా?", అన్నాడు. మళ్ళీ విషయం అర్థమైంది. "మాఁవ, నాకు అంతటి పరిజ్ఞానం, జిజ్ఞాస - రెండూ లేవు", అన్నాను. Credit card అంటగడదామని ప్రయత్నిస్తున్న ఏజెంటుని చూసినట్టు ఒక చూపు చూశాడు. ఇంటికి వచ్చాము.

"Dinner కి ఏం వండుతున్నావు", అన్నాడు. "నాకు వంట రాదని తెలుసుగా? Sandwich చేస్తాను", అన్నాను. "అందులో ఏం వేస్తావు?" అన్నాడు. "పనీర్ మసాల, ఆలూగోబీ, భెండీ fry - ఏది better అంటావు?", అని వ్యంగ్యంగా అడుగుదామనుకుని, "సరే పెళ్ళి చేసుకుంటున్నాడు వెధవాయ్. పెద్దరికం వహిద్దాము", అని నిర్ణయించుకుని "Garlic sauce, Hummus, Onions, Tomatoes, Peppers", అన్నాను. "Hummus అనగానేమి?", అన్నాడు. Hummus అంటే మన వేరుశనగ చట్నీ లాంటిదే" అని చెప్పాను. "సరే try చేస్తాను", అన్నాడు. నా మానాన వెళ్ళి కూరలు తరగడం మొదలెట్టాక వచ్చి, "నాకు hummus నచ్చదు మాఁవ", అన్నాడు. "నువ్వెప్పుడూ తినలేదు కదా?', అన్నాను. "ఆ అమ్మాయికి నచ్చలేదుట", అన్నాడు. నేను లేని రెండు నిముషాల్లో phone చేసి మరీ కనుక్కున్నాడు అని అర్థం చేసుకున్నాను. Hummus తీస్తున్న చెంచాతో రెండు ముద్దలు తీసి వాడి నోట్లో కుక్కేద్దామనిపించింది. ఆపుకుని, "ఒక ముక్క తిను. నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాము", అన్నాను. తన ముప్ఫై ఏళ్ళ career లో, ఎల్లపుడూనిజాయితీగా ఉన్న government officer, మొదటి సారి, పై అధికారి ఒత్తిడి వలన తప్పు చేయాల్సొస్తే ఎంత బాధపడతాడొ అంత బాధగా మొహం పెట్టాడు. తరువాత, పళ్ళాలు కడగటం మొదలెట్టాను. వెనుకనుండి వచ్చి, "ఈ brush బాగా రుద్దదు మాఁవ. ఆ అమ్మాయికి ఇది నచ్చదు. పీచైతే better.", అన్నాడు. ఆ brush తో వాడి నాలుకని తోఁవేద్దామనిపించింది. ఊరుకున్నాను.

Sandwich చేశాను. తిన్నాడు. ఒక ముక్క తినగానే లేచాడు. "ఏం, నచ్చలేదా?", అన్నాను. నవుల్తూనే, "బాగుంది" అన్నట్టు తలూపాడు. మంచినీళ్ళకు లేచాడనుకున్నాను. తిన్నగా వెళ్ళి phone తెచ్చాడు. అప్పుడు అర్థమైంది, TV9 updates లాగా, బీవీ-1 updates మొదలెట్టాడని. "ఎన్నడీ, hummus ఒణక్కు ఎదుక్కు పుడికిల? సెమ్మదాఁరుక్కే? [ఏమే? నీకు hummus ఎందుకు నచ్చలేదు? బానే ఉందిగా?]", అంటూ మొదలు. పెట్టినవాణ్ణి నాకు "బాగుంది" అని చెప్పడం మానేసి అదేదో బావిలో పడిపోయిన పిల్లాడి గురించి NDTV update లాగా చెప్పడంతో నాకు నవ్వాలో, చిఱాకు పడాలో అర్థం కాలేదు.

భోజనలయ్యాయి, అరాయించుకోవడానికి కూర్చున్నాము. ఇంతలో ఒక పాట అందుకున్నాను. వెంటనే, "ఏయ్, నీకూ ఇదే పాట ఇష్టమా?", అన్నాడు. "అదేఁవిటి? వీడికీ పాట ఇష్టం లేదే? నీకూ అని సాగదీస్తాడేంటి?", అనుకున్నాను. వెంటనే, "ఆ అమ్మాయికీ ఇదే ఇష్టం తెలుసునా", అన్నాడు. "దేఁవుడా!" అనుకున్నాను. ఇంతలో వాడి phone మ్రోగింది. వాడికి బాగా పరిచయం ఉన్న, నాకు కేవలం ముఖపరిచయం ఉన్న ఒక స్నేహితుడు phone చేశాడు. వాడు phone మాట్లాడటం మొదలెట్టాడు. వాడి ధోరణిలోనే "అవును మాఁవ. ఆ అమ్మాయి కూడా..." అనుకుంటూ మాట్లాడాడు. ఇంతలో అదే phone లో ఆ అమ్మాయినుండి call వచ్చింది. మాట్లాడుతున్న phone ని నా చేతిలో పెట్టేసి "నా friendతో నువ్వు మాట్లాడు మాఁవ", అన్నాడు.

నాకు ఆ friendతో ముఖపరిచయం అయ్యి ఆరేళ్ళు దాటింది. మేము మాట్లాడుకుని నాలుగున్నరేళ్ళు అయ్యింది. నేను phone తీసుకుని, "హేయ్, ఎప్పిడి ఇరుక్కే? [ఎలాగున్నావు?]", అన్నాను. వాడు దానికి "సందీప్, నేను బాగున్నాను. మీ అక్కకి కఁవలపిల్లలంటగా", అన్నాడు. "స్వామీ, నాకు అక్కాలేదు, ఆవిడ పురుడోసుకోనూ లేదు, కఁవలపిల్లలూ పుట్టనూలేదు. నేను ఆ సందీప్ ని కాను. పీ.ఆర్.కే ని ", అన్నాను. వాడు "ఆఁ, పీ.ఆర్.కే. ఎలాగున్నావు? మీ కుటుంబం బాగుందా?", అన్నాడు. అలాగ రెండు నిముషాలు వరకూ మాట్లాడుకున్నాము. నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడా? అని చూస్తే నా phone లోంచి ఫియాన్సేకి phone చేసి: తన phone వెంటనే ఎందుకు ఎత్తలేకపోయాడు, ఆ phone చేసిన ఫ్రెండ్ ఎవరు? వాడికి అక్కచెల్లెళ్ళున్నారా వంటి ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నాడు. ఇంతలో ఈ phone లోని friend, "ఇంగ్లండ్ ఎలాగుంది", అన్నాడు. "నేను ఇంగ్లండు ఎప్పుడూ వెళ్ళలేదు మహప్రభో", అనగానే "ఐతే నువ్వు శాండీవి కావా?", అన్నాడు. "వామ్మోవ్, నేను నువ్వనుకునే శాండీనైతే కాదు బాబు. ఉండు నాయనా, నువ్వు మన కాలేజీలో ఉన్న అందరు సందీపులనీ cover చేసేలోపుల నా biodata చెప్తాను.", అని మొత్తమంతా చెప్పుకుంటూ వెళ్తే, చివరికి వాడు నన్ను గుర్తుపట్టకపోగా, "ఆఁ! గుర్తొచ్చావు. బాగుంది బాగుంది. నీతో మాట్లాడి చాలా రోజులైంది. సరే phone వాడికియ్యి", అన్నాడు. అది తీసుకెళ్ళి నా friend చేతుల్లో పెట్టగానే వాడు కళ్ళెర్రజేసి ఇంకో చేతులోని phone నా చేతులో పెట్టాడు. అది ఎత్తితే అందులో వాడి ఫియాన్సే. "సందీప్, ఎలాగున్నావు? Hummus మావాడికి నచ్చిందిట. అది చాలా ఆశ్చర్యం తెలుసునా!", అంటూ మొదలెట్టింది. అర్ధరాత్రిలో మద్దెల దరువంటే ఏమిటా అనుకున్నాను. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. కాసేపటికి రెండు phone లూ పెట్టేశాము.

నేను కాస్త ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టను. ఇంతలో cassette ని side-B కి మార్చాడు. అంటే: వాళ్ళు ఎప్పుడెప్పుడు తగువాడుకున్నారు, మళ్ళీ ఎప్పుడు గొడవాడుకునే అవకాశం ఉంది, అసలు problem అంతా ఎక్కడుంది - ఇత్యాది విషయాలపై ఏకపాత్రాభినయం చేశాడు. రాయబారం సీన్లో రెండోకృష్ణుడి కోసం వేచియున్న ప్రేక్షకుడిలాగా నేను నోరెళ్ళబెట్టుకుని కూర్చున్నాను. అప్పుడు కాసేపాగి, "ఏమిటి మాఁవ, నువ్వేమీ మాట్లాడట్లేదు. ఈ మధ్యన బాగా సైలెంటైపోయావు", అన్నాడు. Question paper లో ఐదే ప్రశ్నలిచ్చి, ఆరో సమాధానం వ్రాయలేదని మార్కులు cut  చేసినంత దారుణమైన ఈ మాట విన్న నేను, బ్రహ్మానందం లాగా ఒకసారి నిట్టూర్చి, "హుఁ, నీకలాగ అనిపిస్తించిందా మహాశయా! ఓ మహర్షీ, ఓ మహానుభావా! అసలు నువ్వు నన్నెక్కడ మాట్లాడనించావు? ఏమైనా అంటే నేను, నా ఫియాన్సే, మా పెళ్ళి, ఆ తరువాత కొనుక్కోవల్సిన వెచ్చాల లెక్కలు, నా బొచ్చు. ఆ అమ్మాయికి ఇష్టమైన Tea brand నుండి TV brand వరకూ అన్నీ చెప్తూ ఉంటే నేనింకేమి మాట్లాడతాను? నువ్వు ఫ్రెండువా, చెవులో పుండువా? నిన్ను భరించడం నా యొక్క వల్ల కాదు బాబూ. త్వరగా నిదురించి నన్ను విముక్తుణ్ణి చెయ్యి.", అని మనసులో అనుకున్నాను. వీటిల్లో ఏ మాట నేను బయటికి అన్నా, వాడికి కోపమొస్తుంది. కాబట్టి "నువ్వు చెప్తున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందుకే వింటున్నాను.", అని చెప్పి తప్పించుకున్నాను. వాడు మాట్లాడుతూనే పడుకున్నాడు. సహజంగా నా పక్కన ఉన్నవాళ్ళని మాట్లాడనివ్వకుండా లొడలొడా వాగే నాకు తలనొప్పొచ్చేలాగా మాట్లాడిన వాడి వాగ్శక్తికి జోహార్లు చెప్పుకుంటూ నేనూ పడుకున్నాను.

నాకు పరిచయం ఉన్న చాలా మంది అమ్మాయిలు, పెళ్ళి తరువాత నన్ను పలకరించడం తగ్గించేశారు/మానేశారు. వారి వారి పనుల్లో busy అయ్యారులే అని ఊరుకున్నా, అప్పుడప్పుడు "మరీ అసలు పుట్టినరోజుకు కూడా wish చెయ్యట్లేదు ఏమిటి?", అనుకునేవాణ్ణి. నిన్న అర్థమైంది, అదే నయమని.

PS: ఉన్న విషయానికి కొంచెం నా ఊహాశక్తిని జోడించినా, అసలంటూ విషయం మాత్రం ఉందండోయ్!

Sunday, July 18, 2010

మీకు తెలిసిన బండి-ర (ఱ) ఉన్న పదాలు చెప్పండి!

నేను శాస్త్రీ శతకం పేరిట మూడున్నరసంవత్సరాల క్రితం నుండి వ్రాస్తున్న పద్యాలను నిన్న ఒక్క సారి తిరగేశాను. అందులో చాలా వ్యాకరణదోషాలు కనిపించాయి. వాటిలో ఒకటి: ర (సాధు రేఫ), ఱ (శకటరేఫ) కి భేదం చూపకుండా ప్రాస కలపడం. మన తెలుగు వ్యాకరణపుస్తకాలు నిశ్చయంగా చెప్తున్నది ఏమిటంటే, ఈ రెండింటికీ ప్రాస కుదరదు అని. దీన్నే ప్రాసవైరం అంటారు.

ఈ రెండింటికీ ఉచ్చారణలో భేదం ఉంది. అది ఎలాగ చెప్పలో నాకు తెలియదు కాని, 'ఱ' అన్నప్పుడు నాలుక ఇంకా బలంగా మూర్ధాన్ని (నోరు పై భాగాన్ని) తాకుతుంది అని నా నమ్మకం. ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకుందామని సోదరుడు రాఘవని అడిగాను. ఆయన ఈ క్రింది విషయాలను తెలిపారు.

  • రఱల భేదాలు తెలుపుతూ సూత్రాలు ఏమీ లేవు. వాడుకని బట్టి గ్రహించటమే మార్గం. ఈ సూత్రాలభ్యం వల్ల పోతన కూడా ఎక్కడ ర వాడాలో ఎక్కడ ఱ వాడాలో సరిగా నిర్ధారించుకోలేక ఇబ్బంది పడ్డారని చెబుతారు.
  • ఉచ్చారణ విషయానికి వస్తే, 'ఱ' కొంచెం నొక్కినట్టుగా పలుకుతాం, 'ర' కొంచెం తేలికగా పలుకుతాం. ముఖ్యంగా ద్విత్వాలు వచ్చినప్పుడు ఈ భేదం ఇంకా బాగా తెలుస్తుంది. 
  • అప్పకవీయంలో ర-ఱ భేదం తెలుసుకోవటానికై ఉపయోగపడేలా రకారం వాడే పదాలూ, ఱకారం వాడే పదాలూ వేఱు వేఱు వర్గాలుగా ఇవ్వబడ్డాయి.

నాకు అప్పకవీయం చదవటానికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపల మన బ్లాగ్మిత్రులకు తెలిసిన 'ఱ' ఉన్న పదాలని సంగ్రహిద్దామని ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను. నాకు తెలిసిన 'ఱ' ఉన్న పదాల జాబితా ఈ క్రింద ఉంది. మీకు తెలిసినవి కూడా వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

కొన్ని ఉదాహరణలు:
మఱియు, ఇద్దఱు, ఆఱు, చిఱునవ్వు, ఎఱుగు, వఱకు, చెఱకు, తఱచు, మఱి, ఎఱుపు, పిఱికి, అఱుపు, కఱుకు, ఱొమ్ము, గఱి (గరుత్తుకు వికృతి, రెక్క అని అర్థం), చెఱువు

ద్విత్వం ఉన్న పదాలు:
జీలకఱ్ఱ, చిఱ్ఱెత్తు, ఎఱ్ఱని, జెఱ్ఱి, గుఱ్ఱము, కఱ్ఱ, వెఱ్ఱి, మఱ్ఱి, బుఱ్ఱ

కొన్ని పదాలు వస్తువుల చేసే శబ్దాన్ని అనుకరించే ప్రయత్నంలో వాడతాం. అలాంటి వాటిల్లో శకటరేఫం ఉండే పదాలు కొన్ని:
జఱ జఱ (ఈడ్చుట, జారుట)
కొఱ కొఱ (కోపంగా చూడటం)
కఱ కఱ (నవిలే విధానం)
కిఱ కిఱ (బండి చక్రం తిరిగే విధానం)
గఱ గఱ (గరుకుతనాన్ని తెలిపేది)
చొఱ చొఱ (నెత్తురు కారడం)
బిఱ బిఱ (తొందరగా నడవటం)
కిఱ్ఱు కిఱ్ఱు (తలుపు తెరిచేటప్పుడు వచ్చే శబ్దం)

Saturday, July 17, 2010

నిత్యజీవితంలో పద్యాలు - పాప పుట్టినరోజు

సందర్భం: రేపు, మా బంధువులమ్మాయి పుట్టినరోజు. నేను, బాబాయ్ ఏవైనా పద్యాలు వ్రాద్దామని అనుకున్నాము. ఆయన వ్రాసిన పద్యాలు ఇక్కడ చదవగలరు. నేను వ్రాసినవి ఇవి. ఈ పద్యాలను వినిపించేది మామూలు తెలుగు (వ్యావహారికం) మాత్రమే తెలిసినవారు కాబట్టి (శ్రోతలకు) నిఘంటువుతో పనిలేకుండా వ్రాయాలని నిర్ణయించుకున్నాను. అక్కడక్కడా అలంకారాలను సూచించేటువంటి అక్షరాలను ముద్దగా దిద్దాను. చదువర్లు గమనించగలరు.

గమనిక: వీటిలో తప్పులుండే అవకాశం ఉంది. అక్కడక్కడా నాకున్న సందేహాలను వ్రాశాను. చదువర్లు సందేహాలను నివృత్తి చేసి, తప్పులను సవరించవలసిందిగా కోరుతున్నాను.

ఆ :-
పసిడినగవులమ్మ పాలపళ్ళు తెలుపు
బుల్లిమోముతల్లి బుగ్గ ఎఱుపు
కలువకంటి పాప కంటిపాప నలుపు
నునుపుమేను బంతి నుదురు పసుపు

విశేషాలు:
1. అన్ని పాదాలలోనూ చివరి అక్షరం "పు". అందుచేత ఇది అంత్యప్రాస అవుతుంది.
2. "కలువకంటి" అంటేనే "స్త్రీ" అని అర్థం. మరి, "కలువకంటి పాప" అనడం సరి అవుతుందా? అయితే, కలువకంటి పాప అంటే, కలువ వంటి కనులు కలిగిన పాప. కంటిపాప అంటే pupil of eye. ఇక్కడ ఛేకానుప్రాస కుదిరింది.

ఆ :-

రంగులన్ని యిట్లు రంరించెను బ్రహ్మ
గంభంగి పొంగెనంగు - అవనిఁ!
ముంగిలి మురిసేది రంవల్లికి, మరి
లోగిలి! చిటిపాప ఆగడముకు!

విశేషాలు:

1. రంగు, రంగరించు, గంగ, భంగి, పొంగె, అంగు, ముంగిలి, రంగవల్లి - ఇవన్నీ కూడా వృత్త్యనుప్రాసకు ఉపకరించాయి. గంగ, భంగి, పొంగె, అంగు - ఇవి నాలుగు వరుసగా రావడంతో (మిగతా పదాల సంగతి ఎలాగున్నా) ఇది వృత్త్యనుప్రాస అవుతుంది.
2. "అవనిన్" అనే పదాన్ని "అవనిఁ" అని మార్చడం సరి అవుతుందా? ఇదే వ్యాకరణనియమానుసారం అవుతుంది? ఒకవేళ సరి ఐతే: అవనిఁ అనడంలో రెండు అర్థాలు: a) పుట్టినరోజు పాప పేరు "అవనిజ". ఆ  పేరుకు ముద్దు పేరు అవని అవుతుంది. b) "అవనిలోపల అందం గంగలా ప్రవహించింది" అనే అర్థంలో కూడా "అవనిఁ" సరిపోతుంది. కనుక, ఇది శ్లేషాలంకారం అవుతుంది.

సీ :-

బుజిపాప నోరార బువ్వలు తినుచుండ, కన్నవారికి కూడ కడుపు నిండె
చిరునవ్వు చిగురించు చిన్నారి సిరిమోము, చిత్తాన చైత్రమై, చింతఁ దీర్చె
బుడతమ్మ నట్టింట పడిలేచి పారాడు సవ్వళ్ళు మాగుండె చప్పుడయ్యె
అలసిన పాపాయి అరమోడ్పుకనుదోయి, గాంచిన నిట్టూర్పు గాసిఁ దీర్చు
విశేషాలు:
1. "కన్నవారికి" అంటే తల్లిదండ్రులు అని ఒక అర్థం, చూసినవారు అని మఱొక అర్థం. అందుచేత ఇది శ్లేషాలంకారం అవుతుంది.
2. "చ" తో రెండో పాదంలో ఒక విన్యాసం చేశాను. ఇది చాలా వరకు అనాలోచితంగా వచ్చినదే. ఇది వృత్త్యనుప్రాస అవుతుందా?

తే :-

లక్ష్మి యెల్లవేళల నీకు లక్షలివ్వ
దుర్గ ఆపద రాకుండ తోడునుండ
శారదాంబ కరుణఁజూచి చదువులివ్వ
నిండు నూరేళ్ళు చల్లగనుండవమ్మ!


చదువర్లు వ్యాఖ్యల ద్వారా నా సందేహాలను నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.

Friday, July 16, 2010

మనిషి నైజం - 1

(సూచన: ఈ వ్యాసంలోని భావాలన్నీ నా ఊహలే. వాటిల్లో నిజాలెన్నో, అబద్ధాలేన్నో చదువరులు తమకు తాముగా తెలుసుకోవాలి. ఈ వ్యాసం, "మనిషి నైజం" అనే శీర్షికలోని మొదటిభాగం.)

మనిషి జాతి, కులం, మతం, ప్రాంతం, రంగు, ఎత్తు అంటూ తనకు తాను ఎన్ని విషయాలను ఆపాదించుకున్నా, నైసర్గికంగా మానవనైజం మాత్రం ఒక్కటే. చరిత్ర చూసినట్టైతే, ప్రపంచంలో వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాలలో జరిగిన ఒకేలాంటి సంఘటనలు ఒకే పరిణామానికి దారితీశాయని తెలుస్తుంది. మనుషులు ఏ దేశంలో పుట్టినా, ఏ సంప్రదాయంలో పెరిగినా, ఏ నాగరికత మరిగినా - చివరికి అన్ని సమూహాల్లోనూ అన్ని రకాల మనుషులూ ఉన్నారు. ఒక మనిషికి స్ఫురించేటువంటి ఆలోచన, ఎక్కడో భూమికి అటువైపు మఱొక మనిషికి స్ఫురించవచ్చును. ఆ ఆలోచన ఇచ్చే ఫలితం మాత్రం దాదాపుగా అదే ఉంటుంది.

ఒక ఉదాహరణ తీసుకుందాం. మనిషికి, "ఈ ప్రకృతిని సృజింపజేసినది ఎవరు?" అనే ప్రశ్న కలిగి, దానికి "పరమాత్మ"(1) అని సమాధానం ఇచ్చుకున్నాడు. ఎప్పుడో ఐదువేల సంవత్సరాల క్రితం సనాతనధర్మం (దాన్నే "హిందూయిసం" అంటారు), రెండున్నరవేల సంవత్సరాల క్రితం జుడాయిసం, రెండువేల సంవత్సరాల క్రితం క్రిష్టియానిటీ, పదిహేనువందల సంవత్సరాల క్రితం ఇస్లాం - అన్నీ అదే ప్రశ్నకు సమాధానాలుగా వచ్చాయి. దీన్నే మామూలు భాషలో మతం అంటారు. మనిషిని పరమాత్ముడి దగ్గరకు చేర్చడం మతం ఉద్దేశం.

ఒక మతానికి కాని, నమ్మిన వ్యక్తికి కాని ఒక్క పరమాత్మతో తప్ప, వేరేవాళ్ళతో సంబంధం ఉండకూడదు. ఒక బ్యాంకుకెళ్తే ఎవరి ఎకౌంటు వాళ్ళది. ఒకరి వివరాలు మఱొకరికి చెప్పరు కదా? పరమాత్మకి, మనిషికి అనుసంధానమైనది మతం ఐతే, మరి దాంట్లో "సమాజం" ప్రస్తావన ఎందుకు వచ్చింది?". అక్కడ మళ్ళీ మనిషి ఒక ఆలోచన చేశాడు: "ప్రజలకు దేవుడంటే భయమో భక్తో ఉంటుంది. దానిని మనం ఉపయోగించుకుంటే సమాజంలో మార్పు తీసుకురావడం సులువు", అని. మనిషి generalizations చెయ్యడం మొదలుపెట్టి, "ఆడవాళ్ళు ఇలాగ ఉంటారు. మగవాళ్ళు ఇలాగ ఉంటారు. అందుకని వీళ్ళు ఇది చెయ్యాలి, వాళ్ళు అది చెయ్యాలి", అంటూ సంఘాన్ని ఒక రూపుకు తీసుకువచ్చే యత్నం చేశాడు. ఒక్కొక్క నియమం అప్పటి సమాజస్థితిని బట్టి సృష్టించాడు. సమాజంలో పరిస్థితులు మారాయి, నియమాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీని వలన ఇప్పుడు దాదాపు అన్ని మతాలూ ఎంతో కొంత అత్యాచారానికి ఆధారలౌతున్నాయి.

మనిషి మతాన్ని మాటల్లో పెట్టాలనుకున్నాడు. కానీ, ఆ మాటల్ని ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చదివి "నేనే రైటు", అనుకుంటాడన్న విషయాన్ని ఊహించలేకపోయాడు. దానితో అన్ని మతాల్లోనూ చీలికలు బయల్దేరాయి. అన్నిటికంటే పాత మతమైన సనాతనధర్మంలో "శివుడు గొప్పా? విష్ణువు గొప్పా?", అని కొట్టుకున్నారు. అలాగే కులాలన్నారు. ఆ తరువాత బుద్ధిసం, సిఖిసం అని వేరే మతాలు కూడా పుట్టాయి. జుడాయిసం కూడా ఇలాగ క్రిష్టియానిటీకి, ఇస్లాంకి దారులు వేసింది. క్రిష్టియన్లు ప్రొటెష్టెంట్, కేతలిక్ అని; ముస్లింలు సూఫీ, సూని అని కొట్టుకున్నారు.

హిందువులు ఏసు-క్రీస్తు హిమాలయాల్లో ఒక సాధువు దగ్గర జ్ఞానోదయం పొందాడని, క్రిష్టియన్లు హైందవమతం బోధిస్తున్నది క్రీస్తు గురించేనని, ముస్లింలు హైందవమతపురాణాలు చెప్తున్నది అల్లా గురించేనని - ఎవరికి వారు, మాదే పైచేయి అని వాదించుకుంటున్నారు. ఇహ కొన్ని మతాలు తమను విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నం సంగతి నేను చెప్పక్కరలేదు. మనిషికి ఒక అలవాటు ఉంది. ఒక వాహనం ఎక్కి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత గమ్యం గురించి మరిచిపోయి, ఆ వాహనం తనదని, ఆ దారిలో పరిచయినవి శాశ్వతమని అనుకోవడం. అందుకే పరమాత్ముడి మీద దృష్టి సృతి తప్పి, అది మతం మీద పడటం సంభవించి అనర్థాలకు దారి తీస్తోంది. ఈ మతకలంకం అంటని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. మతం ఏదైనా, దానిలో జరిగే మార్పులు, దాని వలన వచ్చే పరిణామాలు - వీటిల్లో చాలా సారూప్యం ఉంది. మతానికి కూడా మనిషి లాగా, "కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం" వంటి దశలు ఉన్నాయి అన్నమాట! అంతే కదా? మతం ప్రతిబింబించేది మనిషి ఆలోచనని. అదే ఆలోచన ఎక్కడ పుట్టినా మనిషిదే కదా! అందుకే ఈ సారూప్యం.

సశేషం...

(1) ఈ పదాన్ని లింగభేదం లేకుండా వాడుతున్నాను.

Tuesday, July 13, 2010

అనన్వయాలంకారము

వ్యాకరణం -> అలంకారములు -> అర్థాలంకారాలు -> అనన్వయాలంకారం

లక్షణం: ఉపమానోపమేయత్వం యదేకస్యైవ వస్తునః
వివరణ: ఒక వస్తువుకు దానినే ఉపమానంగా చెప్పడాన్ని అనన్వయాలంకారం అంటారు.

ఒక మహారాజును వర్ణిస్తూ, "మహారాజులాగా ఉన్నాడు" అనడం అనన్వయానికి ఉదాహరణ అవుతుంది.

గమనిక: అనన్వయాలంకారం అర్థాలంకారం. అందుచేత శబ్దానికి ప్రాధాన్యతలేదు. అంటే రెండు సార్లు ఒకటే వస్తువుని వేరే పదాలతో పిలిచినా ఫరవాలేదు. కానీ, తాత్పర్యభేదం, అర్థభేదం ఉండకూడదు! ఉంటే అది లాటానుప్రాసం అయ్యే అవకాశం ఉంది.

ఉదా: (రేరాణి, రచన: ఎల్. నాగలక్ష్మి)
రాణి రాణి వలెనతిలోక సౌందర్యవతి

ఇక్కడ రాణితో పోల్చదగిన వస్తువు మఱొకటి లేదు కనుక, రాణి రాణిలాగా ఉంది అన్నారు.

ఉదా: (కావ్యాలంకారసంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
నీ దయకు నీడు జోడు
నీ దయ, నీ జయము సాటి నీ జయమిలలో
నీ దానమునకు నెనయగు
నీ దానము, నీకు సాటి నీవె నృసింహా

నరసరాజు (అనబడే రాజు) దయ, విజయం, దానం - వీటికి ఇవే సాటి అనే ఉద్దేశంతో ఈ పద్యం చెప్పబడింది.

ఉదా: (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
శశి శశి భంగి కాంత్యుదగ్రుడు

దీని అర్థం "చంద్రుడు చంద్రుని వలెనే కాంతిలో గొప్పవాడు" అని. చంద్రుడినే ఉపమానంగానూ, ఉపమేయంగానూ వాడటం చేత ఇది అనన్వయం అయ్యింది.

చలనచిత్రగీతాల్లో అనన్వయాలంకారం నేను తక్కువగా చూశాను.  లాటానుప్రాస గురించి చర్చలో సోదరుడు కిరణ్ చెప్పిన ఉదాహరణ ఒకటి:

ఉదా: (ఇల్లాలు, రచన: ఆత్రేయ)
అందమంటె నువ్వే, ఆనందమంటే నువ్వే, నువ్వంటే నువ్వే, నీ వంటిది నువ్వే నువ్వే

"నిన్ను" పోలి "నువ్వు" తప్ప వేరేవారు లేరు అనడం వలన ఇది అనన్వయాలంకారం అవుతుంది.

Sunday, July 11, 2010

ఉపమాలంకారము (Simile)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉపమాలంకారము


అంత్యప్రాసాలంకారంతో శబ్దాలంకారాల గురించి చెప్పడం ముగిసింది. ఇక అర్థాలంకారాలు. 'అర్థమే' ప్రథానంగా గల అలంకారాలను అర్థాలంకారాలు అంటారు. ఇవి వందకు పైగా ఉన్నాయి అని కొందరు చెప్తారు, అంతకంటె తక్కువగానే ఉంటాయని మఱికొందరు చెప్తారు. సుమారుగా వంద ఉంటాయి అని అంటే తగువు ఉండదు. స్థూలంగా ఉన్న ఒక అలంకారాన్ని చిన్నచిన్న భేదాలతో విభజిస్తే అప్పుడు సంఖ్య పెరుగుతుంది. అలంకారాలను గురించి వివరించడానికి పూర్వీకులు పుస్తకాలను రచించారు. కానీ, నేను వ్రాస్తున్నది కేవలం అలంకారాలను పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో కాబట్టి, ముఖ్యమైనవి కొన్ని చూద్దాము.

కాళిదాసు ఉపమాలంకారాన్ని ఎక్కువ వాడేవాడని "ఉపమా కాళీదాసస్య" అని పెద్దలు చెప్తారు. అలాగే శ్రీనాథుడికి అర్థాంతరన్యాసాలంకారము, భాస్కరశతకం మారద వెంకయ్యకి దృష్టాంతాలంకారము, చేమకూర వేంకటకవికి శబ్దాలంకారాలు/శ్లేషాలంకారము, పోతనకి శబ్దాలంకారాలు ఇష్టమని వారి కావ్యాలు చదివితే తెలుస్తుంది(ట). అలాగ మీకు తెలిసిన కవులు ఎక్కువగా వాడిన అలంకారాలను గురించి వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

ఈ అలంకారలకు చలనచిత్రగీతాలను చెప్పుకుంటూపోతే బోళ్ళు ఉదాహరణలు ఉంటాయి. కొన్ని అవి, కొన్ని పద్యాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థాలంకారాలు కర్ణాటక సంగీతంలోని కీర్తనలు కూడా ఎక్కువ వినబడతాయి. అవి కూడా చర్చించుకుందాము.

ఉపమాలంకారం

ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది అని నా నమ్మకం. దీన్ని ఆంగ్లంలో "simile" అంటారు.

లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః
వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.

ఈ అలంకారానికి నాలుగు వస్తువులను మనం చూసుకోవాలి.
ఉపమేయం: దేని గురించి చెప్తున్నాము?
ఉపమానం: దేనితో పోలుస్తున్నాము?
సమానధర్మం: రెండింటికీ పోలిక ఏమిటి?
ఉపమావాచకం: ఏ పదాన్ని వాడి ఈ రెండింటికీ పోలికను వ్యక్తపరుస్తున్నాము?

ఉదా: (రఘువంశం, రచన: కాళిదాసు)
వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ ||

అర్థం: పదాలను (వాక్కులు), అర్థాలను నాకు ప్రసాదించమని - వాక్కు, అర్థం వలె కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను.

ఉపమేయం: పార్వతీపరమేశ్వరులు; ఉపమానం: వాక్కు, అర్థం; సమానధర్మం: కలిసి ఉండటం; ఉపమావాచకం: ఇవ (సంస్కృతంలో), వలె (అనువాదంలో)

ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగ ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.

ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. ఇలాంటివి మనం చలనచిత్రగీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదా: (భగవద్గీత, రచన: వ్యాసభగవానుడు)
బ్రహ్మణ్యధాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేణ పద్మపత్రమివాంభసా

అర్థం: పరమాత్ముడికి అన్నీ వదిలేసి, కర్మలను రాగద్వేషాలు లేకుండా ఎవరైతే ఆచరిస్తారో వారిని తామరాకులను నీరు అంటని విధంగా పాపం అంటదు.

ఉదా: (మంచి మనసులు, రచన: ఆత్రేయ (?) )
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

ఉదా: (ఆనంద్, రచన: వేటూరి)
మేఘమల్లె సాగివచ్చి, దాహమేదొ పెంచుతావు; నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు

ఉదా: (యువరాజు, రచన: వేటూరి)
తొలివలపు వేదంలాగా లిపిలేనిది


తెలుగుకావ్యాలలో, చలనచిత్రగీతాల్లో ఈ అలంకారాన్ని గుర్తించిన చదువర్లు తప్పకుండా వ్యాఖ్యలద్వారా తెలుపగలరు.  ఇంతకన్నా మంచి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

Saturday, July 10, 2010

విధాత తలపున (సిరివెన్నెల చిత్రంలోని పాట)

  • అప్రస్తుతమైన విషయాలు చదవకుండా, ఈ పాట గురించి మాత్రమే చదవాలనుకునేవారు మొదటి ఐదు పేరాలు వదిలెయ్యడం మంచిది.
  • ఈ వ్యాసం వ్రాయడానికి సహాయపడిన సోదరులు - కిరణ్, ఫణీంద్రలకు; వ్రాయమని అడిగిన ప్రణీత స్వాతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.


"సిరివెన్నెల" చిత్రంతో చలనచిత్రరంగానికి పరిచయమై, అప్పటి నుండి ఆయన పాటలతో ప్రేక్షకులకే కాక, తెలుగు సాహిత్యాభిమానులకు కూడా ప్రీతిపాత్రులైనటువంటి రచయిత సీతారామశాస్త్రి గారు. ఆయనంటే నాకు అమితమైన అభిమానం, గౌరవం. నేను సహజంగా ఆయన పాటల గురించి ఈ బ్లాగులో వ్రాయను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి: ఆయన పాటలు పండితపామరజనరంజకంగా ఉంటాయి. సహజంగా, వివరించి చెప్పాల్సినంత భాషని కానీ, భావుకతని కానీ (వాడగలిగినా) వాడరు. ప్రతిమనిషికీ అర్థమయ్యి, వారు ఆ పాటను అనుభవించగలిగేలాగా వ్రాయడం ఆయన శైలిలో నాకు నచ్చేటువంటి అంశం. రెండు: ఆయనకు యువతరంలో అసంఖ్యాకమైన అభిమానులున్నారు. ఆయన అభిమానులు బోలెడు వెబ్-సైటులను ఏర్పరిచి ఆయన ప్రతిగీతాన్ని వర్ణించుకుంటూ వెళ్తున్నారు. అందుచేత నేను ఇప్పుడు పనిగట్టుకుని చెయ్యవలసింది లేదు. మూడు: ఆయనతో ప్రతిరోజూ మాట్లాడే ఆయన శిష్యులు చాలామంది సిరివెన్నెల ఆర్కుట్ కమ్యూనిటీలోనో, తదితర వెబ్సైట్లలోనో ఆయన పాటలకు ఆయనే ఇచ్చుకున్న విశ్లేషణలని చెప్తూ ఉంటారు. నాలుగు: సిరివెన్నెల తరంగాలు ఇత్యాది పుస్తకాల ద్వారా కూడా ఆయన పాటల ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఈ బ్లాగులో నేను, ముందుతరంలోని కవులు ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి మొ.; అలాగే ఆయన తరంలో ఎంతో లాఘవం కలిగి ప్రజాదరణకు ఆట్టే నోచుకోని కవులు జొన్నవిత్తుల, వెన్నెలకంటి, భువనచంద్ర మొ. వారి పాటల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.

నాకు కవిని కావడానికి స్ఫూర్తి మా మాతామహులు, నాన్నగారు మొదలుకొని చాలా మంది ఉన్నారు. అయితే మామూలు చలనచిత్రగీతంలో కూడా విషయాన్ని చెప్పచ్చు అని తెలిసింది ఆయన పాటలు విన్నప్పుడే. ఆ తరువాత ఆయన ఇంటర్వ్యూలో "వేటూరి ఆయనకు గురుతుల్యుడు" అని అంటే "హమ్మ! ఈయనకే గురువా?" అనుకుని, వేటూరి వ్రాసిన పాటలు చూసుకుంటూ పోతే నాకు మతి తిరిగిపోయింది. అప్పటినుండి నేను ఆ వేటూరి-మాయలో ఉండిపోయాను - బహుశా ఎప్పటికీ ఉండిపోతాను. వేటూరి వ్రాసిన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకం చదివాక ఆయనకు ఆత్రేయగారి మీద ఉన్న గౌరవం తెలిసింది, నాకున్న గౌరవం మరింత పెరిగింది. సిరివెన్నెల చాలా విధాలుగా ఆత్రేయని గుర్తుచేస్తారు అని ప్రేక్షకులలో ఒక నుడి. వీరిరువురూ ఒక పాట వ్రాయడానికి నెలకంటే ఎక్కువ తీసుకోవడం జరిగిన సందర్భాలు ఒకింత కారణం ఐతే, ఒక మామూలు ప్రేక్షకుడికి (సగటు భాషాజ్ఞానం,ఊహాశక్తి ఉన్నవాడికి) కూడా అర్థమయ్యి, మనసు కరిగేలాగానో, కదిలేలాగానో వ్రాయగలగడం మఱొకటి.

ఇంతకీ విషయానికి వస్తే సిరివెన్నెల వ్రాసిన "విధాత తలపున" అనే పాట తెలుగువాడూ గర్వించదగిన పాట. ఈ పాటకు జాతీయస్థాయి అవార్డు రాకపోవడం ఆ అవార్డుకు దురదృష్టంగా పేర్కొనవచ్చును. ఈ పాట గురించి వ్రాయమని ప్రణీతాస్వాతిగారు అడిగితే, "Internetలో ఎక్కడైనా దీన్ని గురించి విశ్లేషించారా?" అని వెదుకగా ఎక్కడా దొరకలేదు. అందుచేత ఏదైనా వ్రాద్దామని పూనుకున్నాను.

ఈ పాటను వ్రాసినప్పుడు ఆయన పరిస్థితులేమిటి అన్నది ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. "సిరివెన్నెలతరంగాలు" పుస్తకంలో ఆయన కూడా ఈ పాటను వర్ణించారు. (ఈ పుస్తకం మీరు కొనాలనుకుంటే ఆయన ఇంటర్వ్యూ చివరన ఉన్న చిరునామాను సంప్రతించండి). అది చదివిన తరువాత నేను ప్రత్యేకించి చెప్పవలసిన విషయం ఏమీ లేదు. అర్థాలను వివరిస్తే, ఆయన మాటలను ఇక్కడ వ్రాస్తే సరిపోతుంది అని తెలుసుకున్నాను.  శాస్త్రిగారు చలనచిత్రసీమకు పరిచయం కాకముందు "భరణి" పేరిట వ్రాసిన ఒక కవితని కొంచెం మరమ్మత్తు చేసి వ్రాసినది ఈ పాట. పాట మూలాన్ని ఇక్కడ చదవవచ్చును. చిత్రంలోని పాటను పూర్తిగా ఇక్కడ చదవవచ్చును.

ఈ పాట గురించి చెప్పుకోవలసినవాళ్ళు చాలామంది ఉన్నారు.  మొట్ట మొదట చెప్పుకోవలసినది కళాతపస్వి కే. విశ్వనాథ్ గారి గురించి. సిరివెన్నెల వ్రాసిన మొట్టమొదటి పాట ఇంత అద్భుతంగా ఉంది. మళ్ళీ ఈ పాటలో ఉన్నంత భావుకత, బరువు, వైశాల్యం, లోతు నాకు ఎక్కడా కనబడలేదు. మళ్ళీ వ్రాయలేకనా? కాదు! సందర్భం లేక. శ్రేష్ఠమైన సందర్భాలను, కవికి స్వేఛ్ఛనూ ఇచ్చేటువంటి దర్శకులు కరువయ్యి మళ్ళీ ఇలాంటి పాట రాలేదు. అందుకని ఈ పాటలో విశ్వనాథ్ గారికి పెద్దవాటా ఉంది.  అలాగే "నువ్వు వ్రాయవయ్యా. నేను స్వరపరుస్తాను.", అనేటువంటి ఔన్నత్యం ఉన్న సంగీతదర్శకుడు మామ, కే.వీ.మహదేవన్. ఆయనకు హిందూ వార్తాపత్రిక ఇచ్చినా  స్వరపరుస్తారు అని చలనచిత్రరంగంలో పేరు. ఆయనకు కూడా ఈ పాటలో పెద్దవాటా ఉంది.  ఈ చిత్రానికి వేణుగానాన్ని అందించిన హరిప్రసాద్ చౌరాసియా గారు కూడా పాట భావానికి, సందర్భానికి తగిన స్వరాలను వినిపించారు. ఇహ బాలు, సుశీల గురించి చెప్పుకోవడం దేనికి? పంచదార తియ్యనా, తేనె తియ్యనా అన్నట్టు ఉంటుంది వారి గాత్రాల జంట.

అనాదిగా విధాత (పరబ్రహ్మ) ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి. ఆ పరబ్రహ్మ హృదయంలో మెదిలిన ఒక ఆలోచన నుండి ఈ సృష్టి పుట్టింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ఆలోచన స్వరూపం ఓంకారం. ఆ ఓంకారమే ఈ సృష్టికి మూలం. ఆ ఓంకారమే ప్రకృతిలోనూ, జీవరాశుల్లోనూ చైతన్యమై నిండివుందన్నది ఆవిష్కరించడం ఈ పాటలోని ప్రథానాంశం. ఈ పాట కవి స్వగతం కాబట్టి, దీని గురించి కవి స్థానంలో ఉండి చెప్పడం అవసరం. అందుకే మొత్తం కవి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాను.


విధాత మనసులో కలిగిన ఊహ ఓంకారం. ఆ ఓంకారం ప్రతిజీవిలోనూ చైతన్యమై నడిపిస్తోంది.

భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించినప్పుడు అక్కడ ఏముందో వ్యాసభగవానుడు సవివరంగా చెప్పాడు.  ప్రకృతిలోని గ్రహాలు, నక్షత్రాలు మొదలుకొని రాయి, రప్ప వరకు అన్ని వస్తువులు; సమస్తజీవరాశులు జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణం - సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక్కచోట అర్జునుడికి కనిపించాయి.   అది చూసి అర్జునుడు, అవన్నీ నడిపిస్తున్నది ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నాడు.

అదే విశ్వరూపవిన్యాసం ప్రతిమనిషికీ కనిపిస్తుంది. అది ఎప్పుడంటే - సృష్టి మొత్తం నిండినది ఒకటే నాదం, ఒకటే జీవం, ఒకటేచైతన్యం అన్న విషయం అర్థమయినప్పుడు. ఆ దివ్యనేత్రం తెరుచుకున్నప్పుడు, మనిషి సృష్టిని ఒక్కచోటనే నిలబడి చూస్తాడు. "ప్రతిజీవి గుండెలోని లయా ఆ ఓంకారమే.  అది విరించి (బ్రహ్మ) విపంచి (వీణ) గానం, పరమాత్మ స్వరూపం. నేను అంటే ఈ మేను కాదు, ఆత్మ. నా ఆత్మ, చూడాటానికి వాడే పరికరాలు కళ్ళు. ఆ ఆత్మ చూడవలసింది, తెలుసుకోవలసినది(1) సృష్టిని, దాని వెనుకనున్న ఓంకారాన్ని. అదే జీవనవేదం.", అని  విదితమవుతుంది. ఆ సృష్టిని ప్రతిబింబించేటువంటి కవితను వ్రాయడానికి నేను ఒక  విరించిని(2) అయ్యాను, అది పాడి వినిపించడానికి నేను ఒక వీణను (విపంచి) అయ్యాను.

సంగీతానికి మూలం సామవేదం. సామవేదంలో స్వరాలను ఎలాగ పలకాలో, వేదాలను ఎలాగ చదవాలో ఉంటుంది. ఆ వేదం మూలంగా కలిగి, తీయని స్వరాలు (సరసస్వర) నీరుగా ఉన్న గంగ (సురఝరి) నా పాట. ఈ పాట  జీవనవేదాన్ని చెబుతుంది.

నిద్ర మృత్యువుతో సమానమని మన యుద్ధధర్మాలు బోధిస్తున్నాయి. ఆ మృత్యువుని తీసుకొచ్చేటువంటి వాహనం రాత్రి. ఆ మృత్యువుని సంహరించి, ప్రకృతికి చైతన్యాన్ని తీసుకువచ్చేది ఉదయం. ప్రొద్దున్నే మేలుకొని గుంపులుగా చేరిన పక్షులు (జాగృత-విహంగ-తతులు) నీలిగగనమనే వేదికపైన, తూరుపుదిక్కును ఒక వీణగా మలచి (ప్రాక్-దిశ-వీణియ) సూర్యుడి కిరణాలను దానికి తీగెలుగా బిగించి (దినకర-మయూఖ-తంత్రులు), తమ రెక్కలనే వేళ్ళుగా చేసుకుని ఆ వీణియను వాయిస్తూ, తమ కిలకిలారావాలను (స్వనములు) పాడటమే ఈ జగతికి (ఒక కొత్త) శ్రీకారం అవుతోంది. సృష్టి మళ్ళీ చైతన్యంతో నడుస్తోంది. ఈ విషయం తెలుసుకుంటే విశ్వం అనే కావ్యానికి భాష్యం చెప్పడం చేతనౌతుంది. ఆ భాష్యమే నా గీతం.

పుట్టిన ప్రతిప్రాణి గళంలో వినబడేటువంటి స్వరం, ఓంకారంలోని ఒక తరంగం (జీవననాదతరంగం). ఆ చైతన్యానికి స్పందనగా, గుండె ఒక మృదంగంగా మారి ధ్వనిస్తోంది (గుండెచప్పుడు). ఆ చప్పుడు మొదలైనప్పటినుండీ ఒకేలాగా ఉంటుంది కనుక ఆదితాళం. అది పాడుతున్న జీవనవేదానికి ఆది-అంతం లేవు కాబట్టి దానిది అనాదిరాగం. ఇదే రీతిలో అనంతమైన జీవరాశులు ప్రవహిస్తున్న నది సృష్టి (అనంత-జీవన-వాహిని).  ఆ సృష్టి విలాసమే నా ఈ గీతంలోని విషయం. సృష్టిరహస్యమే నా ఊపిరిగా (ఉఛ్చ్వాసం) వెళ్ళి, నాలో ఉన్న ప్రాణచైతన్యాన్ని స్పందింపజేసి, గానంగా బయటకు (నిశ్వాసం) వస్తోంది.


(1) వేదం అంటే తెలుసుకోవలసినది అని అర్థం.
(2) విరించి అంటే బ్రహ్మ (సృష్టించేవాడు). కవి కవితను సృష్టిస్తాడు.

Saturday, July 3, 2010

అంత్యప్రాసాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> అంత్యప్రాసం


లక్షణం: మొదటి పాదం చివర ముగిసిన అక్షారసమూహంతోనే తరువాతి పాదం కూడా ముగిస్తే అది అంత్యప్రాసం అవుతుంది.

వివరణ: సాధారణంగా ప్రాస అంటే రెండో అక్షరానికి వర్తిస్తుంది. గమనిస్తే అన్నమయ్యకీర్తనలలో ప్రతిచర్ణంలోనూ రెండో అక్షరం ఒకే గుణింతంలోనుండి వస్తుంది. ఉదాహరణకు "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అనే పల్లవిని పరికిస్తే "ముద్దు, తిద్ద" - ఈ రెండు శబ్దాలకూ ప్రాస కుదిరింది. అలాగే సుమతీ శతకంలో (కందపద్యాలలో) ప్రతీ పాదంలోనూ రెండో అక్షరానికి ప్రాస కుదురుతుంది. ఉదాహరణకు: "అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు" లో "క్క" తో ప్రాస కుదురింది. ఇదే నియమం పాదంలో ఆఖరి అక్షరానికి వాడితే అది అంత్యప్రాసం అవుతుంది. భావకవిత్వంలో పాదం బదులు "వాక్యం" చివరి అక్షరసమూహాన్ని పరిగణించడం రివాజు.

మన తెలుగు చలన చిత్రంలో అతి ఎక్కువగా వాడబడుతున్న ప్రాస ఇదే.ఎంతో భావుకతతో శ్రోతలు ఊహించని విధంగా ప్రాస కలపడంలోనే అంత్యప్రాస అందం ఉంది అని నా అభిప్రాయం. దీని గురించి వ్యాసాలు కాదు, పుస్తకాలు వ్రాయచ్చును. అంత అవసరం ఇప్పుడు లేదు కాబట్టి నాకు నచ్చిన ప్రాసలు కొన్ని చెప్పి శబ్దాలంకారాలు ముగిస్తాను. ఆ తరువాత అర్థాలంకారాలు వైపు నడుద్దాము.


ఉదా: (చిత్రం: ఆంధ్రకేసరి, రచన: ఆరుద్ర)
గజపతులు, నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు

మహానుభావుడు ఆరుద్ర రాజమహేంద్రపురం గురించి వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట ఇప్పటికీ గోదారిగంగ అలలలాగా నా మనసులోతుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. "ఊరు" కి ఎన్నో ప్రాసపదాలు వాడటం మనం చూశాం, "పేరు", "ఏరు", "నీరు" వంటివి రివాజు. కానీ, ఆరుద్ర ఎంతో ఆలోచించి "నినదించెను" వంటి చక్కని పదాలను అక్కునచేర్చుకుని "గౌతమి హోరు" (గోదావరి అలల వేగం వలన కలిగిన నాదం) అని ఎంత చక్కని అంత్యప్రాస కలిపారు?

కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

అలాగే, "కొట్టుకొని పోయెనొక కోటిలింగాలు" అన్నప్పుడు ఎవరైనా, "ఐతేనేమి? కాటన్ దొర బ్యారేజీ మిగిలిందనో, రచించిన కవితాసౌధాలు మిగిలాయనో చెప్తారు", అని శ్రోతలు అనుకుంటే "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్న చందాన, "వీరేశలింగం పంతులు మిగిలాడు మాకు, అది చాలు", అని చెప్పడం విన్న ప్రతిసారి, నాకు కళ్ళు చెమరుస్తుంది.


ఉదా: (చిత్రం: రాజ్కుమార్, రచన: ఆత్రేయ)
సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం, ప్రతిపొద్దూ ప్రణయావేశం, పెదవులపై హాసం
సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం, ప్రతిరోజూ ఒక శ్రీకారం, పరవశశృంగారం

"జానకి కలగనలేదు" అనే పాటలోనిది ఈ చరణం. ముక్కలైపోయిన గుండెలగురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే "మనసు-కవి", "మన-సుకవి" ఆత్రేయగారు, ఈ పాటలో ఒక్కటైపోయిన మనసుల గురించి చక్కగా చెప్పారు (1). ఒక్కో మాటలోనూ ఎంతో లోతైన భావం ఉంది, ఎంతో చక్కందనం ఉంది. అందుకే ఈ అంత్యప్రాస బాగా కుదిరింది.


ఉదా: (చిత్రం: శుభసంకల్పం, రచన: వేటూరి)
సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేదమంత్రాలు

ఇక్కడ రెండు అక్షరాలతో చక్కని అంత్యప్రాస కుదిరింది. "కట్టె, కొట్టె, తెచ్చె" అని రామయణం చెప్పడం తెలుగువారికి తెలిసే ఉంటుంది. అదే రామయణాన్ని ఈ రెండు వాక్యాలలోనూ కవి ఎంతో అందంగా చెప్పాడు. రాముడి సుగుణాల, సీతమ్మ అందాల, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు కలిసినప్పుడు జరిగిన వైభోగాలు - అంతే కదా రామయణం!


ఉదా: (చిత్రం: మనీ రచన: సిరివెన్నెల)
ఇదీయమీను సద్దాం హుసేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో ఉండే పెళ్ళాం కంటే డిక్టేటర్లట్రా?

"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాటల మధ్యలో ఇది వ్రాశావు? సిరివెన్నెల ఇంతకంటే గొప్పవెన్నెన్నో ప్రయోగాలు చేశారు కదా?" అని చదువర్లకు సందేహం రావచ్చు. "ఇంగ్లీషు పదాలకు, తెలుగుపదాలకు ప్రాస కలపడంలో కూడా అందం ఉంది. అది చెయ్యడానికి కూడా చాలా ఆలోచన కావాలి", అని చెప్పడానికే ఇది వ్రాశాను. ఈ పాట నచ్చని తెలుగువాడుంటాడా చెప్పండి?


ఒకప్పుడు ఇది నిజంగా అలంకారంగానే (తగినపాళ్ళలో వాడేవారు) ఉండేది. ఉదాహరణకి దేవులపల్లి, పింగళి, సినారె, దాశరథి మొదలగు కవుల పాటల్లో ఇది ఒక నియమంలాగా ఉండదు. రాను రాను, ఒక నియమం అయిపోయింది. ప్రాస కలపడం, అది ఒక పాటనడం - ఇది రివాజైపోయింది. "బన్ని, పిన్ని, చున్ని" ప్రాసపాటలు, తెలుగువైభవాన్ని చూసినవారికి గుండెపోట్లై కూర్చుకున్నాయి. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.


ఈ అలంకారానికి పద్యాలలో ఉదాహరణలు నాకు తెలియవు. మీకేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

(1) "వివరించేటప్పుడు నీ అలంకారాల గోలేమిటయ్యా?", అని అనుకోకండి. దైనందినజీవితంలో వాడితేనే కదా అలంకారాలకు అలంకారం?

Thursday, July 1, 2010

ఎవ్వరో ఎవ్వరో (మల్లెపువ్వు చిత్రంలోని పాట)

బాణీ కట్టిన తరువాత పాట వ్రాయడం ఒక రకంగా అదృష్టమైతే ఒక రకంగా శిక్ష. కవిత్వం ధారలాగా పొంగితే అందులో భావానికి ఎల్లలు ఉండవు. అదే ఇక్కడ రెండు లఘువులు వెయ్యి, ఇక్కడ ఇంకో రెండు మాత్రలు పడాలి అంటూ కట్టడి చేస్తే అది కాలువ అవుతుందేమో కానీ నది కాలేదు. అలాంటి భావకవిత్వం ఉన్న పాటలు, రచయితకి స్వేఛ్ఛనిచ్చే సంగీతదర్శకులు ఉంటే సాధ్యమవుతుంది. కే.వీ.మహదేవన్, రమేశ్ నాయుడు దాదాపు అన్ని పాటలకూ, సాహిత్యం ముందు వ్రాసి ఇమ్మనేవారు అని తెలిసిందే. ఆ తరువాత చక్రవర్తి, ఇళయరాజ కొన్ని పాటలకు అలాగ వ్రాయించుకునేవారుట.

కొంతమందికి సందేహం కలుగుతుంది - "అలాగ వ్రాసిన పాటల్లో లయ ఉండదేమో? వాటిని ప్రజలు ఆదరించరేమో?" అని. కే.విశ్వనాథ్ చిత్రాలలో చాలా వరకు పాటలు ముందు వ్రాసి, ఆ తరువాత స్వరకల్పన చేయబడినవే. మరి శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతికిరణం, సిరివెన్నెల - మొన్న మొన్న సంగీతానికి నేషనల్ అవార్డు వచ్చిన స్వరాభిషేకం అలాగ చేయబడినవే! వాటిల్లో అన్నీ వినసొంపుగా ఉన్నపాటలే!ఇటు చూస్తే వేటగాడు, అడవి రాముడు మొదలైన చిత్రాలలో పాటలూ అలాగ వ్రాసినవే. మరి వాటిల్లో "ఊపు" లేదా? ఇంకో రెండు తరాల తరువాత కూడా గుర్తుండిపోయేటువంటి పాటలు చూసుకుంటే అవి భాష, భావం, స్వరం, గానం అన్నిటికీ న్యాయం చేకూర్చినటువంటి పాటలే కాని, వేరేవి కావఇప్పుడు నేను చెప్పబోతున్నది అలాగ రచించిన పాటే (అని అది వింటే తెలుస్తుంది). హిందీలో వచ్చిన ప్యాసా సినిమాకు రీమేక్, "మల్లె పువ్వు". హీరొ పాత్రను శోభన్ బాబు పోషించాడు. గురు దత్ సినిమా కాబట్టి సందర్భాలు ఉన్నతమైనవి. హీరో ఒక సానివాడకు వెళ్ళి అక్కడి వేశ్యల దైన్యస్థితిని చూసి పాడే పాట ఇది. ఇందులో గొప్ప భావోద్వేగం ఉంది. ఇది వ్రాసింది వేటూరి అని నా నమ్మకం. chimatamusic.com అదే సూచిస్తోంది. అక్కడక్కడ ప్రయోగాలు చూస్తుంటే కూడా వేటూరేననిపిస్తోంది. స్వరకల్పన చేసింది చక్రవర్తి. వేటూరి-చక్రవర్తి - వీరిద్దరికీ ఉన్న సామ్యం ఏమిటి అంటే అసమాన్యమైన శక్తి ఉన్నా, ప్రొడ్యూసర్లూ, డైరక్టర్లూ చేరి వీరిద్దరి చేతా చాలా సామాన్యమైన/నాసి రకమైన పాటలు వ్రాయించారు. ఈ పాట వారి కలిసి కృషి చేస్తే ఎంత గొప్పనైన పాటని అందించగలరు అన్నదానికి నిదర్శనం.

చిత్రం: మల్లె పువ్వు
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి (?)
గానం: బాలు

ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో
ఈ పాపం కడిగే దిక్కెవ్వరో
ఎవ్వరో వారెవ్వరో

అందెలు సందడి చేసిన జాతరలో, ఆకలేసి ఏడ్చిన పసికందులు
అందం అంగడికెక్కిన సందులలో, అంగలార్చి ఆడిన రాబందులు
ఎందుకో ఈ చిందులు, ఎవరికో ఈ విందులు
ఏమిటో ఏమిటొ ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో
ఏ కర్మం ఈ గాయం చేసిందో? ఏమిటో ఆ ధర్మం ఏమిటో?

శీలానికి శిలువలు, కామానికి కొలువులు
కన్నీటి కలువలు, ఈ చెలువలు
కదులుతున్న ఈ శవాలు, రగులుతున్న శ్మశానాలు
మదమెక్కిన మతితప్పిన, నరజాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో
ఈ గాధలు ముగిసేదింకెన్నడో?
ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో?

అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో
మైల పడిన మల్లెలు ఈ నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు
ఎందరికో ఈ కౌగిళ్ళు, ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు
ఎక్కడా ఎక్కడా ఏ వేదం ఇది ఘోరం అన్నదో
ఏ వాదం ఇది నేరం అన్నదో
ఎక్కడో ఆ వేదం ఎక్కడో

ఈ మల్లెల దుకాణాలు, ఈ గానాబజానాలు
వెదజల్లిన కాగితాలు, వెలకట్టిన జీవితాలు,
వల్లకాటి వసంతాలు, చస్తున్నా స్వాగతాలు
కట్లు తెగిన దాహాలకు, తూట్లు పడిన దేహాలు
ఎక్కడో ఎక్కడో ఈ రాధల బృందావనమెక్కడో
ఈ బాధకు వేణుగానం ఎక్కడో
ఎన్నడో ఎక్కడో ఎప్పుడో


ఈ పాటలో విశ్లేషించడానికి ఏమీ లేదు. ఎక్కడా కష్టమైన పదాలు వాడలేదు కవి. చిన్న చిన్న పదాలతో గొప్పభావాన్ని వ్యక్తపరిచాడు. ఒక చరణానికి, మఱో చరణానికీ బాణీలో పొంతనలేదు. అందుకే ఇది మొదట సాహిత్యం వ్రాసిన పాట అని అనిపించింది.

కొన్ని మాటలు నిప్పుకణాలలాగా ఉన్నాయి. కన్నీటి కలువలు, కదులుతున్న శవాలు, రగులుతున్న శ్మశానాలు, మైలుపడిన మల్లెలు, వెలగట్టిన జీవితాలు, వల్లకాటి వసంతాలు - ఇవన్నీ బరువైన ప్రయోగాలు. "కన్నీటి కలువలు" అని విన్నప్పుడు "మాతృదేవోభవ" చిత్రంలో "కన్నీటికి కలువలు పూచేనా?" అనే వాక్యం గుర్తుకొచ్చింది. అలాగే, "ఈ రాధల బృందావనమెక్కడో?" అని అనడం ఇది వేటూరి వ్రాశారేమో అన్న నమ్మకాన్ని బలీయం చేస్తోంది. వేశ్యల గురించి వర్ణిస్తూ కూడా రాధమ్మను తలుచుకుంటూ, అందులో ఎటువంటి దైవధిక్కారం లేకుండా, ఒక రకమైన ఆవేశాన్ని చూపించాడు కవి. ఇలాగ ఈ పాట గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా వ్రాయచ్చు. కాకపోతే ఇది వర్ణించేటువంటి సాహిత్యం కాదు, మనసుని సూటిగా గుచ్చే సాహిత్యం. విని అనుభవించాలి, అంతే! వేటూరి మాటల్లో చెప్పాలంటే, "మనసు...మాటలు కాదుగా?"

Wednesday, June 30, 2010

ఒరు పొన్మాలై పొళుదు

"నిళల్ గళ్" అనే చిత్రంలోని "పొన్మాలై పొళుదు" అనే పాట వైరముత్తు అనే ప్రసిద్ధ తమిళ రచయిత వ్రాసిన తొలి చలనచిత్రగీతం. ఇళయరాజా ఇచ్చిన  బాణీ ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పాట ఎంతగానో నచ్చిన నాకు దీని అర్థం ఏమిటొ తెలుసుకోవాలనే కుతూహలం కలగడంతో సోదరుడు భాస్కర్ ని అడిగితే, ఆయన ఎంతో ఓర్పుగా వైరముత్తు ఆత్మకథలో ఈ పాట గురించి వ్రాసిన ఘట్టాన్ని మొత్తం అనువదించారు. అనువాదం చదివాక నాకూ ఆ కవి శక్తి ఏమిటో అర్థమైంది. పాటలో గొప్ప ఆశావాదం, ప్రకృతివర్ణన ఉన్నాయి. విన్నాక ఇళయరాజ, భారతీరాజ వంటి మహామహులు ముగ్ధులయ్యారుట.

ఈ పాటకి అనువాదం కాదు కానీ, ఆ బాణీకి తగిన స్ఫూర్తితో తెలుగులో ఏమైనా వ్రాద్దామనుకుంటూ పడుకోబోయాను. కానీ ఎందుకో వెంటనే వ్రాయాలనిపించి లేచి వ్రాస్తున్నాను. కచ్చితంగా ఇది వైరముత్తు పాటతో పోల్చదగినది కాదు. ఏదో చిట్టిచిట్టి భావాలకు అద్దం పట్టాను - అంతే.

చిత్రం: నిళల్ గళ్
సంగీతం: ఇళయరాజ
మూలం రచించినది: వైరముత్తు
గాయకుడు: బాలు



నా దైవం నువ్వే
ఎపుడూ, నా దైవం నువ్వే
ఆగకురా ఓ మనసా!
వీడకురా నీ ఆశ!

కాలం నేర్పిన పాఠమిది
జ్ఞానం చూపిన బాట యిది
మనసును నమ్మిన మానవుడే
చరితలు మార్చే నాయకుడు
నీ పలుకే నా ఉనికై, పయనించే వేళ...

అందలమొకటే జీవితమా?
అందిన సిరులూ శాస్వతమా?
మరణం ఆపని నీ యశమే
నిరతం నిలిచే యవ్వనము
అంతములేని సొంతమదే! అది నాకందించే...

గెలవకపోతేనేం, భయమా?
ఓటమి చూడనిదో జయమా?
మట్టిని తాకిన విత్తనమే
మానై పొందును చేతనము
రెమ్మ ఒడీ, కొమ్మ బడీ విడి సాగే వేళ...


ఈ పాట చదివిన వెంటనే నాకు అనిపించినదేమిటి అంటే, "ఈ పాటకు సినిమా మసాలా పడలేదు. మరీ ఉడకబెట్టి, ఉప్పూకారం చల్లిన కూరలాగా ఉంది". "సరే నిర్మలంగా వచ్చిన భావాన్ని ఎందుకు మార్చాలి ఇప్పుడు? మనం ఎలాగూ సినిమాకవులం కాదు కదా!" అని అనిపించి ఇలాగ వదిలేశాను.

పల్లవిలో "నా దైవం నువ్వే, మనసా!" అనడం నన్ను ఎరిగినవాళ్ళందరికీ కొంచెం జీర్ణించుకోవడం కష్టతరమైన విషయమే. ఎందుకంటే నేను దైవంతో ఎవరినీ/దేనినీ పోల్చను.నా దృష్టిలో, భౌతికమైనదేమైనా పరమాత్మకు ప్రతిరూపమవుతుందేమో కానీ, "ఏవార్థం" (నువ్వే) ఇవ్వదగినది కాదు. సినిమాలో ఇది ఒక యువకుడు కులమతాల గొడవలు లేకుండా ప్రపంచమంతా చక్కగా మారాలనే ఆశాభావంతో పాడతాడు. దానికి తోడు వైరముత్తు తన నాస్తికత్వాన్ని కొంచెం ప్రదర్శించాడు. సరే, సందర్భానుసారం అలాగే వ్రాద్దామని వ్రాశాను.

పల్లవిలో "ఆగకురా ఓ మనసా!" అంటూ మనసుని పుంలింగంలో సంబోధించడం వేటూరికి నేను అక్షరనివాళిగా సమర్పించుకుంటున్నాను. గోదావరి సినిమాలో ఆయన, "మనసా గెలుపు నీదేరా!" అనడం నాకు ఎంతగానో నచ్చింది. విశ్లేషించి చూసుకుంటే పాటలో చాలా వరకు సిరివెన్నెల శైలి కనబడుతోంది నాకు. అంటే ఆయనకు సమానంగా వ్రాశానని కాదు, నేను చెప్తున్నది శైలి గురించి. బహుశః నాకు సినిమాపాటల మీద ఇష్టం ఏర్పడటానికి కారణం ఆయనే కనుక ఇది జరిగి ఉండవచ్చును.

పాటలో ఏవార్థాలు (ఏ-కారం) ఎక్కువే పడ్డాయి. కానీ ఎక్కడా స్వరాలు/మాత్రలు కుదర్చడానికి వాటిని వాడలేదు అనే నా నమ్మకం. సరిచూసుకోవడానికి సంస్కృతంలోకి అనువదించుకుని/ఉన్న పద్యాలతో పోల్చి చూశాను. నాకు తప్పేమీ తోచలేదు. నువ్వే నా దైవం (త్వమేవ శరణం మమ), మానవుడే నాయకుడు/యశమే యవ్వనము (తన కోపమె తన శత్రువు), విత్తనమే-చేతనము (భూమ్యాం పతితం బీజమేవ వృక్షం భవేత్, అన్యత్ నైవ), పలుకే-ఉనికై (తవ ఆజ్ఞా ఏవ మమ జీవనం, అన్యత్ నాస్తి). ఏవార్థం గురించి ఇంత చాదస్తంగా ఎందుకు చూసుకుంటున్నాను అంటే, ఈ మధ్యన సినిమా పాటలు వినీ వినీ ఈ ఏ-కారం అంటే ఒక ద్వేషం ఏర్పడింది. ఆ మధ్యన ఎవరో, "ఏ?" అని అడిగారు ("ఏందుకు?" అని). "ఓరి నీ ఏ-కారం బంగారం కానూ, పదం లేకుండానే వాడి పారేస్తున్నారూ?" అనుకున్నాను. అంత విరక్తి కలిగింది.

Sunday, June 27, 2010

ముక్తపదగ్రస్తాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> ముక్తపదగ్రస్తాలంకరము


లక్షణం: ఒక పాదం చివర వదిలిన పదాన్ని మరల రెండవ పాదం మొదటి పదంగాను, రెండవ పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటి పదం గాను, అలాగే మూడు, నాలుగు పాదాలు కూడా ఉంటే అది ముక్తపదగ్రస్తం అవుతుంది.

ముక్తము అంటే విడువబడింది, గ్రస్తము అంటే తీసుకోబడింది. ముక్తపదగ్రస్తము అంటే "విడిచిపెట్టిన పదాన్ని తిరిగి గ్రహించినటువంటి పద్యం". నాకు తెలిసినంతవరకు, ఇది ప్రతీపాదంలోనూ జరగాలని నియమం లేదు. ఈ అలంకారానికి ప్రత్యేకించి వివరణ అవసరం లేదు అనుకుంటున్నాను. ఈ క్రింది ఉదహారణలో ముద్దగా దిద్దబడిన పదాలను చూస్తే విషయం అర్థమవుతుంది.

ఉదా: (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజ భూషణుడు)
సుదతీనూతన మదనా!
మదనాగతురంగ! పూర్ణమణిమయసదనా!
సదనామయగజరదనా!
రదనాగేంద్రనిభ! కీర్తి రస నరసింహా! (1)


ఉదా: (శ్రీవేంకటేశ్వర సుప్రభాతం రచన: అన్నన్ స్వామి)
లక్ష్మీ సువిభ్రమాలోక సుభ్రూవిభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం

ఉదా: (రచన:మల్లాది సాయికృష్ణ ప్రసాద్)  (2)
మారమ కనికరమా రమ
మారమణునకు చెప్పి మమ్ము మన్నింపనిచోన్


వాక్యాంతముక్తపదగ్రస్తము:

పాదం చివర విడిచిన పదాన్ని ఆ తరువాతి పాదంలో మొదట పదంగా వాడితే అది ముక్తపదగ్రస్తం. అలాగే వాక్యం చివర విడిచిన పదాన్ని ఆ తరువాతి వాక్యంలో మొదటి పదంగా వాడితే అది వాక్యాంతముక్తపదగ్రస్తము. (వాక్య: వాక్యం, అంత: చివర, ముక్త: విడిచిన, పద: పదం, గ్రస్తము: తీసుకోబడినది).

ఉదా: (వ్యాకరణాదర్శం, రచన: బూరుగుల గోపాలకృష్ణమూర్తి)
మారసుందర! సుందర! ధీరమూర్తి!
మూర్తిగతలోక! లోకప్రపూజితాంగ!
అంగ సంగత గంగ! గంగాంతరంగ!
విశ్వరక్షక! స్వామి శ్రీ వేంకటేశ!

ఇందులో "మూర్తి" అన్నది పాదానికే కాక, వాక్యానికి కూడా చివరన ఉంది. అదే పదంతో ఆ తరువాతి వాక్యం (పాదం కూడా) మొదలయింది. ఇక "లోక", "అంగ" (పూజితాంగ = పూజిత + అంగ), "గంగ" (గంగాంతరంగ = గంగ + అంతరంగ) కూడా వాక్యాలకు చివరన వచ్చి, ఆ తరువాతి వాక్యాలలో మొదట వచ్చాయి. అందుచేత ఇది వాక్యాంతముక్తపదగ్రస్తము.


వాక్యాంతముక్తపదగ్రస్తానికి చలనచిత్రాల్లో ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు గుర్తున్నది ఇది ఒకటి:

ఉదా: (చిత్రం: వరుడు, రచన: వేటూరి)
నలుగు పెట్టినకొద్దీ అలిగింది వయసు. వయసు అలిగినకొద్దీ వెలిగింది మనసు


(1) ఇక్కడి పద్యాలలోని పదాలను నేను సరిగ్గా విభజించానో లేదో తెలియడం లేదు. ఈ పద్యాలకు భావాలు మీకు పూర్తిగా అర్థమయితే వ్యాఖ్య ద్వారా నాకు వివరించగలరు.
(2) ఈయన నేను చదువుతున్న వ్యాకరణం పుస్తకానికి రచయిత.

Sunday, June 20, 2010

నన్ను పోలిన మనిషి

మన ఇళ్ళల్లో చాలా మంది, ఒక బిడ్డ పుట్టగానే వాడి పోలికలను పసిగట్టేస్తుంటారు. "ఆ ముక్కు చూడు, అచ్చం వాళ్ళ నాయినమ్మే" అని ఒకడంటే, "ఏడిశావు, వాడివన్నీ వాళ్ళ అమ్మమ్మ పోలికలే" అనేవాడు మఱొకడు. ice-creamలో ఆవకాయబద్దలాగా బిడ్డ పుట్టాడన్న ఆనందం పక్కనే, "మా పోలికలున్నాయని చెప్పే నాథుడెవడూ లేడా?" అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. "పూజారికి లేక పస్తులుంటుంటే భక్తుడొచ్చి పొంగలి అడిగాడు" అన్నట్టు మేనమామలు, మేనత్తలూ కూడా పోలికలలో వాటాకొస్తుంటారు. ఇన్నాళ్ళూ లోపల ప్రశాంతంగా ఉన్నాను, బయటకి ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని ఆ బిడ్డకు అనిపిస్తుందేమో. దానికి ప్రతీకారంగా క్రమేపీ తన ఫ్యాన్సు అంచనాలకు అందకుండా పోలికలు మార్చేసుకుంటూ వెళ్తాడు/వెళ్తుంది. మొదట తండ్రి పోలిక అనిపించినవాడు, రెండు నెలలకు పూర్తిగా తల్లిపోలిక అనిపిస్తాడు. ఈ వేడుకంతా మా అన్నయ్యకు పిల్లాడు పుట్టినప్పుడు దూరం నుండి వీక్షించాను కానీ, మొదటిచెయ్యి అనుభవం  (first-hand experience) లేదు.

చిన్నప్పుడు "వీడికి మేనత్త పోలిక" అంటూ ఉండేవారు (ఆవిడా నా లాగే కొంచెం చామంచాయ, చాదస్తం - ఏ పని చేసినా (భోజనానికి కూర్చున్నా) మూడు సార్లు చెయ్యడం అలవాటు). ఇది పక్కన పెడితే, నాకు చిన్నప్పటినుండి ఎక్కడికి వెళ్ళినా, "అరే, అచ్చం మీలానే ఇంకోళ్ళను చూశానే" అనేవాళ్ళు తగుల్తూనే ఉన్నారు. మొదట్లో ఉత్సాహపడేవాడిని "హాయ్, నాలాగే ఇంకోడా? దొంగమొగుడు, రౌడీ అల్లుడు ఇత్యాది సినిమాల్లో చిరంజీవి లాగా నాకూ డూప్ ఉన్నాడు అన్నమాట" అనుకునేవాణ్ణి. (చిన్నప్పుడు మెము చిరంజీవి ఫ్యాన్సు. మా అమ్మమ్మ మాకు ఉత్తరం వ్రాసి చివర్లో, "చిరంజీవి దీపు బాగా చదువుకుంటున్నాడని ఆశిస్తున్నాను" అంటే, మా తమ్ముడు బనీన్ వేసుకుని, చొక్కా బటన్లు విప్పేసి, "చూడండిరా, అమ్మమ్మ కూడా చెప్పింది. నేనే చిరంజీవి. కావలిస్తే gang-leader సినిమాలో కూడా చిరంజీవి last తమ్ముడే, చూసుకోండి", అనేవాడు). క్రమేపీ ఆ ఉత్సాహం నిట్టూర్పుగానూ, ఆ నిట్టూర్పు చిరాకుగానూ, ఆ చిరాకు ఆందోళనగానూ మారాయి. అది ఏమిటి? ఎందుకు? ఎలాగ? అని అడక్కముండే చెప్పేస్తాను.

మొట్టమొదటిగా నాకు ఈ అనుభవం మంగలికొట్లో ఎదురయ్యింది. నేను వెళ్ళి క్యూ-బల్లపై ఈనాడు పత్రికలోని సినిమాశీర్షిక చదువుతూ కూర్చున్నాను. నా వంతు వచ్చేసరికి వెళ్ళి సింహాసనాధిరోహణం గావించాను. అక్కడ కత్తెర వెయ్యడానికి చెయ్యి లేపిన మంగలి ఒక్కసారి ఆగి, ఆ కుర్చి వెనక్కు తిప్పి, "బాబొ, మీకు మొన్ననే గాందా కట్టింగ్ సేసాను? మల్లీ ఇంత జుత్తెట్టొచ్చేసిందె?", అని అడిగాడు. మా ఎకనామిక్స్ క్లాసులోలాగా వెర్రిముఖమేసుకుని ఒకసారి వాడి మొహంకేసి చూశాను. "నువ్వెవరనుకుని అంటున్నావో కానీ, మా అమ్మ నన్ను కొడుతుందేమో అని భయమేసినప్పుడు తప్పితే నేను క్షవరం చేయించుకోను. నేను రెండు నెలలుగా అసలు మంగలినే చూడలేదు", అన్నాను. దానికి అతను, "ఓరోరె, ఐతే మీకులాంటోడికే నేను మొన్న కటింగ్ చేసానొ. ఆల్లు ఈ పక్కన సూరోల్ల యీదిలోనే ఉంటారు. మీరేడ ఉంటారేటి?" అంటూ ఇంక నా పుట్టుపూర్వోత్తరాలు, పూర్వతరాలు గురించి అడగడం మొదలు పెట్టాడు. అసలే కృష్ణుడికి నెమలిపించం పుట్టుకతో వస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టు నా తలపైన జుత్తు దానంతట అదే నుంచుంటుంది. ఆశ్చర్యానికి లోనైన మంగలి ఏ కంగారు-లోనైన దాన్ని పురికొలుపుతాడేమో,"పురి విడిచిన నెమలి"-ని అవుతానేమోనని నా భయం సంగతి అటు ఉంచితే, అప్పటినుండి నాకు నా సరూపుణ్ణి చూడాలనే ఉత్సాహం మొదలైంది. అది ఎప్పుడూ జరుగలేదు.

ఆ తరువాత మేము తుని విడిచిపెట్టి విశాఖపట్నం వెళ్ళాము. మధ్యలో ఏదో పని ఉండి తుని మళ్ళీ వెళ్ళాను. నా దారిని నేను పోతుంటే నాకు ఉడిపీ లక్ష్మీభవన్ కనబడింది. అది మా ఇంటిల్లిపాదికీ ఇష్టమైన వుటేలు. మసాలదోశ మీద మనసుతో లోపలికి వెళ్ళాను. అక్కడ ఆ ఓనరు, "అప్పా, మీ నాన్నగారు రాలేదా?" అని అడిగాడు. చదువులకోసమని మా అన్నదమ్ములము అక్కడ ఉన్నాం తప్పితే మా నాన్నగారు తునిలో ఉన్నది తక్కువే. అందుచేత "ఇతనికి మా నాన్నగారు ఎలాగ తెలుసు", అనుకుంటూ, "రాలేదు. ఆయన ప్రస్తుతం బిసీగా ఉన్నారు" అని చెప్పి టోకెన్ కోసం నేను పదిరూపాయలు ఇచ్చాను. ఇస్తున్నానే కానీ మనసు వెనకాల ఎక్కడో, 'నాన్నగారు తెలుసంటున్నాడు. "మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేమప్పా" అని ఆ పది వెనక్కిచ్చేస్తాడేమో', అని అనిపించింది. కానీ, ఆల్-అవుట్ ఎడ్వర్టైస్మెంటులో కప్ప దోమని నాలుకతో కబళించినట్టు ఈ అప్ప నా చేతిలో ఉన్న పదినోటుని సంగ్రహించి టోకెన్ ఇచ్చాడు. సరే ఎవడిదో సొమ్ము మనకెందుకులే అనుకున్నాను. కాకపోతే చిక్కు ఎక్కడ వచ్చిందంటే, నేను దోశ తుంపుకుని చట్నీలో ముంచినప్పుడల్లా వాడు నా వంక చూసి చిరునవ్వులు చిందించడం మొదలెట్టాడు. ఆ దోశ వెనకాల ఇంకా మైసూరు బజ్జీ, సాంబార్వడ, పూరీ మొదలుగా కలిగిన పదార్థాలను తిందామనుకున్న నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించి సగం నిండిన మనసుతో (అంటే, కడుపు నిండింది అనుకోండి) బయటకు వచ్చేశాను. అక్కడికి నాకు నా సరూపుడంటే ఉత్సాహం పోయింది, చిరాకు వచ్చింది.

ఆ తరువాత వైజాగులో మా అన్నదమ్ములం ముగ్గురమూ ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ మరీ సినిమాలో చూసినట్టైంది. నాకు ఒకమ్మాయి ఎదురయ్యింది. ఆ అమ్మాయి గతంలో నాకు నచ్చిన మఱొక అమ్మాయిలాగా కనిపించడంతో ఒక్కసారి అలాగ కళ్ళార్పకుండా చూశాను. (తరువాత ఈ ప్రక్రియనే సైటు కొట్టడం అని పిలుస్తారని తెలుసుకున్నాను.) ఆ అమ్మాయి నా కళ్ళల్లో ఏం చదివిందో తెలియదు కానీ, నాకేసి చూస్తూ సిగ్గుపడటం మొదలెట్టింది. ఇంతలో నా ఆత్మా'రాముడూ', "ఏంటిది, నగర్రపౌరులు చూస్తున్నారు. ఒళ్ళు/కళ్ళు దగ్గరపెట్టుకో", అన్నాడు. నేను కాస్త తలతిప్పుకుని వెళ్ళిపోయాను. ఇంతలో అచ్చం మా అన్నయ్యలాగే ఉన్న ఒక వ్యక్తి నా కళ్ళెదురుగా వెళ్ళాడు. కాకపోతే అతనికి గెడ్డం ఎక్కువ ఉంది. మా అన్నయ్యకి, అతనికి కొంచెం ముఖకవళికల్లో భేదం ఉంది (సరిగ్గాచూస్తే గుర్తు తెలియడానికి వీలయినంత) అనుకుని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ అతను కారిడార్లోకి వెళ్ళాక నేను మా అన్నయ్యకి, తమ్ముడికి ఆ విషయం చెప్పాను. ముగ్గురం ఆలోచిస్తుండగా నా పక్కనుండి ఈ సరీ మరీ నాకు డూపులాగా ఉండేవాడు (పరిమాణంలో కూడా భేదం లేదు కానీ, కొంచెం గెడ్డం గీసుకుని నీట్ గా ఉన్నాడు) కనబడ్డాడు. ముఖమైతే shame to shame. అదే ఆవదం తాగి నవ్వుదామని ప్రయత్నించేవాడి ఫేసు. వాడూ నాకేసి అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. "ఇది ఆసుపత్రా? మయసభా?", అనుకుని మేము ముగ్గురం ముక్కున వేలేసుకున్నాము.

ఇంతకీ ఈ గోలంతా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, నిన్న నేను మౌంటెన్ వ్యూలో, ప్యాసేజ్ టు ఇండియా బేకరీ అనే చోటుకు వెళ్ళాను. అక్కడ టోకెన్ ఇచ్చేవాడు కూడా, "మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందా?", అని అడిగాడు. నేను కొంచెం అనుమానంగా చూస్తూ, "లేదు", అన్నాను. వాడు, "మీ లాగే ఉండే ఒక పాప మా రెష్టారెంటుకు వస్తూ ఉంటుందండి", అన్నాడు. "ఆఖరికి నీ పోలికతో అమ్మాయి కూడా ఉందిరా శాండీ (నన్ను నేను పిలుచుకునే ముద్దుపేరు)", అనుకుంటుండగా, "Are you sure?", అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చి, "లేదు. ఆ అమ్మాయి నా కూతురే. వాళ్ళమ్మ మీద అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. నువ్వేమైనా ఫ్రీగా ఇంత ముద్ద పాడేస్తావా?", అని అడగాలనిపించింది. వాడు మళ్ళీ నా ముఖంలోకి డెంటిష్టు చూసినట్టు చూసి, "As it is. ఆ అమ్మాయి గలగలా మాట్లాడుతూ ఉంటుంది, చాలా చిలిపి పిల్ల.", అన్నాడు. ఇవి కచ్చితంగా నా పోలికలే. అందరూ నన్ను గలగల (పోనీ, లొడా లొడా) మాట్లాడుతున్నావని అంటారు. చిలిపిదనంలోనూ నాకు కొన్ని సెర్టిఫికేట్లు ఉన్నాయి. అప్పుడు నాకు కంగారు పట్టుకుంది. ఏవేవో ఆలోచనలు. "అమ్మోవ్, ఇదేమిటి పవిత్రబంధం (నాగేస్సర్రావుది) సినిమాలాగుంది? అసలే ఈవేళ పొద్దున్నే 'గాంధి పుట్టిన దేశమా ఇదీ?' అని పాడుకున్నాను కూడా. నేను నాలుగేళ్ళ క్రితం కూడా మౌంటెన్ వ్యూ వచ్చానాయె. ఇది కల కాదు కదా? ఇంకా నయం గరళ-ఫ్రెండ్ తో వచ్చుంటే గరళం తాగించేది. పెళ్ళాం తో వస్తే చెళ్ళుమనిపించేది. అన్నదమ్ములతో వస్తే అనుమానాలొచ్చేవి. friendsతో వస్తే బ్రతుకు facebook అయిపోయేది. మన అదృష్టం బాగుండి ఆ పిల్ల ఈ చుట్టు పక్కల లేదు. లేకపోతే విక్రమార్కుడు సినిమాలాగా అయ్యేదేమో!" - ఇలాగ అనేక ఆలోచనలు కలిగి ఆందోళన మిగిలింది. అప్పుడు వాడితో "అచ్చం నాలాగే ఉందా? ఉండే ఉంటుంది. మరి నా ఫేసు పరమబోరింగు ఫేసు కదా? ఎక్కడ పడితే అక్కడే ఉంటుందన్న మాట. నువ్వటు తిరుగమ్మ, కొంచెం అటు తిరుగు. అద్ది, అద్ది అలాగ నీ కంప్యూటర్కేసి చూడు. అలాగన్నమాట. నా లాగే ఉన్న అమ్మాయి. అచ్చం. మే బీ, ఆడం, ఈవ్-ల దగ్గర మొదలయిన వంశవృక్షంలో అందరికంటే పైకి ఉన్నది పొక్కునూరి వంశమేనేమో. అయ్యో! ఏది ఆ ఏప్లీస్ కాయేది? నేను ఇక్కడున్నాను ఏమిటి? అడవిలో ఉండాలి కదా? 'అహా నా డూపు అంటా, ఒహో నా డూపు అంటా, అహ నా డూపు అంట ఒహొ నా డూపు అంట, వాడు నేను సేమంట, నాకు మంట ఒళ్ళంత, ఢాం ఢాం ఢాం'" అని బ్రహ్మానందం స్టైల్లో అనాలనిపించింది. అయినా (వాడెదురుగుండా) నోరు మూసుకుని, భోజనం చేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఏమవుతుందో చూడాలి.