Sunday, April 17, 2022

ఎన్నియల్లో మల్లియల్లో

ఒక్కోసారి వేటూరి పాట వింటే ఆశ్చర్యం వేస్తుంది. పదాల అల్లికలో పచ్చి శృంగారాన్ని దాచేసిన వైనం చూస్తే పట్టపగలు బ్యాంకుదోపిడీ చేసి రోడ్డు మీద నిర్భయంగా నడిచినవాడిలా అనిపిస్తారు. మొన్ననే ఎందుకో శివ సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది. సరే విందాం కదా అని కూర్చుని, వినగానే ముక్కున వేలేసుకున్నాను.

సున్నితంగా "ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు, ఒళ్ళంటుకుంటే చాలు నాట్యాలు" అని పాట మొదలైంది. అతడి స్పర్శకి ఆ అందమైన అమ్మాయి మెలికెలు తిరుగుతోంది అనడం బాగుంది కదా అనుకున్నాను. ఆత్రంగా మొదటి చరణం విన్నాను. "సిగ్గేయగా బుగ్గమొగ్గ మందారధూళే దులిపే" - అమ్మాయికి సిగ్గేస్తే మొగ్గలాంటి లేత బుగ్గ ఎఱ్ఱబడింది అనడానికి మందారధూళి దులిపింది అనడం బాగుంది. ధూళి అంటే పరాగం (పుప్పొడి) అని కూడా అర్థం ఉంది. పువ్వులలో పుప్పొడి, తేనె రెండూ ఆస్వాదించడానికి తేనెటీగలు వస్తాయి. ఒకే వాక్యంలో మహానుభావుడు శ్లేష కూడా విసిరి, రెండు శృంగారవంతమైన అర్థాలను వినిపించారు. ఇక ఆపైన వాక్యాలలో దాపరికం ఏమీ లేదు. "(ఆ) ఒత్తిళ్ళతో ఒలిచేస్తుంటే వడ్డించనా వయసంతా", "(అ) వెలుగులో కలబడే కళలు కన్నా, తనువులో తపనలే కదిపిన కథకళిలోన" అని రాస్తే ఏమని వివరించాలి, ఆ భావనాపటిమకు చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప? వారి గదిలో ఒక చిన్న దీపం ఉంది అని గుర్తించి ముందుకు నడవడమే. అది చిన్న దీపం అని ఎందుకు అనుకోవాలంటే దానికి వెంటనే రెండో చరణంలో జవాబు ఇచ్చారు.

"(అ) ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలణిగే, (ఆ) ఈ దివ్వెల క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే" - చీకటే ఆమె చీర అట, దివ్వెల క్రీనీడలు ఆమె మీద నెమ్మదిగా పడుతున్నాయట. "(అ) నీ మబ్బులే గుడికడుతుంటే జాబిల్లిలా పడుకోనా" - అతడు మబ్బులా ఆమెను కౌగిలించుకుంటే చంద్రుడిలా ఆమె నిద్రపోతుందిట. ఈ భోగంలో అనురాగం కొంత పలికించారు - సంతోషం! ఇదంతా రాత్రి సంగతి ఐతే పొద్దున్న పరిస్థితి వర్ణిస్తూ పాట ముగించారు "(ఆ) ఉదయమే అరుణమై ఉరుముతున్నా, చెదరని నిదురలో కుదిరిన పడకలలోనా" - అలసిపోయి పడుకున్న వీరికి పొద్దున్న సూర్యకాంతి తగిలితే ఉరుములలా తోచిందట, ఐనా నిదుర చెదరకుండా పడుకున్నారట. అసంపూర్ణంగా వదిలిన చరణం చివరి వాక్యానికి పల్లవిని కలుపుకుందాం అంటే ఉదయపుటరుణానికి ఎన్నియలకి వైరమాయె! చంద్రుడిలో మచ్చలను వెతకడం కంటే వెన్నెలను ఆస్వాదించడమే నయం కాబట్టి పాటను మళ్ళీ మళ్ళీ తలుచుకుని సంబరపడుతున్నాను.

పాట చూసిన తరువాత అనిపించిన విషయాలు. పాటలో చీర ఉంది కానీ అమల ఎక్కడా చీర కట్టుకోలేదు. ఆమె నృత్యం చక్కగా చేసింది - నాగార్జున ఆమె ముందు తేలిపోయాడు. బాలు, చిత్రం గానం గురించి చెప్పుకోవక్కరలేదు. ఇళయరాజ బాణీలకు కొంచెం భిన్నంగా ఉండే బాణీ ఇది - చాలా నచ్చింది. ముఖ్యంగా చరణాలలో ఆఖరి నాలుగు లైన్లకు బాణీ అద్భుతం. పాటకు సెట్స్, ఆర్ట్ అంత కుదరలేదు అనిపించింది. కాకపోతే ఇదే సినిమాలో "సరసాలు చాలు శ్రీవారు" పాటకు కూడా సుమారుగా ఇదే సందర్భం, సెట్ కాబట్టి ఇలాగ చేసారేమో అనిపించింది.

Sunday, April 12, 2020

"అల వైకుంఠపురములో" దుర్భరం

అసలు ఈ మధ్యన బ్లాగులో రాయడం మానేశాను. ఎప్పుడో పండగకో పబ్బానికో రాస్తున్నాను. అలాంటిది ఉన్నట్టుండి ఒక పోస్టు రాయాలని అనిపించింది. సాధారణంగా అభిమానంతో రాసే నేను ఈ రోజు చిరాకు, విరక్తితో రాస్తున్నాను. ఎంతోమంది బాగుందని చెప్పారని ఈ రోజు Netflix కి signup చేసి మరీ "అల వైకుంఠపురములో" అనే ఒక సినిమా చూస్తే కలిగిన భావాలవి.

ఈ మధ్యన నేను తెలుగు సినిమాలు చూడటమే తగ్గింది. చూస్తే పాత సినిమాలు, లేకపోతే indie సినిమాలు చూస్తున్నాను. మంచి సినిమాలు వస్తున్నాయి. ఉదాహరణలు వెతికితే వెంటనే పెళ్ళి చూపులు, బ్రోచేవారెవరురా, మత్తు వదలరా గుర్తొస్తున్నాయి. ఇలాంటి సినిమాలు బాగానే ఆడుతున్నాయి కూడా. ఐనా కూడా కొంతమంది దర్శకులు నవ్యత లేని సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.

ఇక సినిమా  గురించి మాట్లాడుకుందాం. నాకు అన్నిటికంటే ముందు చిరాకు వచ్చిన విషయం - బావామరదళ్ళ ప్రణయం. దక్షిణభారతదేశంలో ఇది ఒకప్పుడు మామూలై ఉండవచ్చును. కానీ ఇప్పుడు మనం కూడా సైన్సు చదువుకుంటున్నాము కదా. First cousins పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు అనారోగ్యం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 1980 లోనే మా నాన్న గారిని ఎంతో మంది మరదలినో, మేనగోడలినో పెళ్ళి చేసుకోమంటే పిల్లలు బాగుండాలని వద్దు అన్నారు. ఇది 2020. మనకీ అంతో ఇంతో లోకజ్ఞానం వచ్చింది కదా. ఇకనైనా మనం first cousins పెళ్ళిళ్ళని ఆపమని సందేశం ఇవ్వచ్చునా? పోనీ, సినిమాల్లో సందేశాలెందుకు అంటారా, కనీసం అది glorify చెయ్యకుండా ఉండవచ్చునా? ఈ సినిమాలో రాజ్, తన మరదలైన నందినిని ఇష్టపడతాడు. వేరే దేశాల వరకు ఎందుకు? మన దేశంలోనే ఉత్తరాదిలో దీన్ని అసహ్యంగా భావిస్తారు. బావామరదళ్ళు కూడా అన్నాచెల్లెళ్ళ లాంటివారే అని వారి అభిప్రాయం. ఈ విషయంలో త్రివిక్రం repeat offender. ఇంతకు ముందు తీసిన "అత్తారింటికి దారేది" లో కూడా ఇదే చేసాడు.

రెండవ విషయం ఆడవాళ్ళ పట్ల రచయిత చులకన భావం. ఈ సినిమాలో పదే పదే హీరొయిన్ కాళ్ళను చూపించడం చిరాకు అనిపించింది. పాట మొదట రాసి తరువాత సినిమా తీసారో, సినిమా రాసిన తరువాత పాట రాసారో తెలియదు. కానీ, చివరికి అశ్లీలంగా అనిపించింది. ఎవరైనా అలాగ office లో ఎవరితోనైనా వ్యవహరిస్తే ఉద్యోగం పీకేస్తారు. ఇక్కడ మన "హీరో" ఏకంగా CEOని అలాగ చూసి వ్యాఖ్యానం చేసినా ఆవిడ ఏమీ అనుకోదు. ఇంతకు ముందు అతారింటికి దారేది సినిమాలో కూడా శమాంతా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు "హీరో" ఆమెకు ఏదో కథ చెప్పి, మీద చేతులు వేసి హడావుడి చెయ్యడం కూడా నాకు లైంగిక వేధింపు నేరంలాగా అనిపించింది. నవ్వు రాలేదు.

మూడో విషయం అర్థం పర్థం లేని పాత్రలు. అసలు సునీల్ పాత్ర ఎందుకు ఉంది, ఏం చేస్తోంది? రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఎందుకు ఉన్నాడు? ఎంతో నైపుణ్యం ఉన్న నటులను పెద్ద పాత్రలలో పెట్టకుండా, ఈ చిల్లర పాత్రలలో ఎందుకు పెట్టినట్టు? ఎవరైనా HR లో పని చేసేవాళ్ళు పొద్దున్నే బైకుల మీద తిరుగుతూ అమ్మాయిల చున్నీలు లాగుతారా? అలాంటి వెధవని ఒక CEO ఐన అమ్మాయి HR లో ఉంచుతుందా? బ్రహ్మాజీ వెనకనుండే రౌడీలు తెల్లవాళ్ళెలాగ అయ్యారు? రష్యా నుంచి వచ్చి రౌడీలుగా హైదరాబాద్లో స్థిరబడ్డారా? బ్రోచేవారెవరురా చిత్రంలో నిండుగా బట్టలు కప్పుకుని, స్వతంత్రనిర్ణ్యయాలు తీసుకోగల ఒక మంచి పాత్ర చేసిన నటి (నివేద) ఈ సినిమాలో సగం సగం బట్టలు వేసుకుని ఎవరో వచ్చి "నువ్వు పెద్ద అందగత్తెవు కాదు కానీ sexy గా ఉన్నావు" అంటే ఎందుకు మురిసిపోయింది. పెద్ద కంపెనీ పెట్టి CEO అయినావిడ ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళికి ఎలాగ ఒప్పుకుందీ? ఆ పెళ్ళి ఆపెయ్యకుండా వేరేవాడిని తల్లిదండ్రుల ఎదురుగుండా ఎందుకు కావలించుకుంటోంది? ఇది మోసం కాదా? ఇవా ఆడవాళ్ళ పాత్రలు రాసే విధానం. రాజ్ నందినిని ఇష్టపడితే board meeting సీన్ లో అమూల్యని చూసి ఎందుకు ఊగుతున్నాడు? వాడు కొంచం నెమ్మెదస్తుడు అని చెప్పారు కానీ, వాడికి ఎవరు ఇష్టమో కూడా తేల్చుకోలేని శుంఠా?

నాలుగో విషయం అర్థం పర్థం లేని కథనం. (1) ఒక పెద్ద ఆఫీసులో ఒకటే lift ఉందా? దాన్ని ఆపడం ఎలాగో పల్లెటూరులో ఉండే ఒక తాతగారికి తెలిసిందా? Freight elevator ఏమైంది? ఆ టైంలో రామచంద్రకికి అప్పలనాయుడుకి meeting ఉంది అని schedule లో ఉంటుంది, నాయుడు లోపలకు రావడం వెళ్ళడం పదిమందీ చూసి ఉంటారు. అయినా కేసు ఎందుకు పెట్టలేదు? (2) పాతికేళ్ళు కోమాలో ఉన్న ఆమె ఉన్నట్టుండి లేవడం, సరాసరి రామచంద్ర కొడుకుని కలవడం, వాల్మీకి చూసి గుర్తుపట్టడం, పూస గుచ్చినట్టు కథ చెప్పటం, అది వీళ్ళ తాత కూడా వినడం - ఇదంతా చిత్తు కాగితాల మీద రాసుకునే కథనం లాగా ఉంది. కోమా లోంచి వచ్చినావిడ "మా అమ్మ ఏది? నాన్న ఏడి? మొగుడేడి? పిల్లలేరీ?" - ఇవేమీ అడగలేదు? corridor లో ఉన్న ఆమె బంటుతో మాట్లాడుతుంటే curtain ఎక్కడ నుంచి వచ్చింది? (3) ఎంత సరదాగా ఉన్నా board meeting లో పాటలు పెట్టి dance చేసేవాడెవడైనా ఉంటాడా? అలాగ చేస్తే share value ఏమౌతుంది? అసలు ఆ సీనే నాకు అర్థం కాలేదు. (4) ఏ తల్లి ఐనా తన కొడుకు ఎదురుగుండా ఇంకోడితో "You are better than my son" అంటుందా? కన్నకొడుకుని బయటకు గెంటి వాడికి సగం ఆస్తి రాసి ఇస్తుందా? వాడు helicopter ఎక్కుతుంటే కుటుంబమంతా వచ్చి చప్పట్లు కొడుతుందా? (5) ఉన్నట్టుండి ఆ రాజ్ వెళ్ళి వాల్మీకి ఇంట్లో ఉండటం ఏమిటో, ఆ ఇంటి ఇల్లాలి ఎదురుగుండా "మందు కొడతాను" అనడం ఏమిటో, ఎవరో బేవార్స్ గాళ్ళను ఇంటికి పిలవడం ఏమిటో? పెళ్ళి కావలసిన కూతురున్న ఏ తల్లైనా ఇవన్నీ ఒప్పుకుంటుందా? ఏంటి ఈ పిచ్చి. (6) "హీరో" ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఎక్కడో వాడు వెళ్ళి వందమంది గూండాలను కొడుతూ ఉంటే, ఇక్కడ రామచంద్ర, యశోదా మేనగోడలి కోసం సంతకాలు పెడతారు అని, రాజ్ మొత్తానికి కోపం తెచ్చుకుంటాడు అని ఎలాగ ఊహించాడో మహానుభావుడు. ఇంటిల్లిపాది చూస్తుండగా రామచంద్ర ఎవరో ఒక అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు అని చెప్పడం ఏమి ఔచిత్యమో నాకు అర్థం కాలేదు.

ఐదో విషయం అర్థం పర్థం లేని ఫైట్లు. 2020 లో ఇంకా తెలుగు హీరోలు భౌతికశాస్త్రాన్ని వెక్కిరిస్తూ ఫైట్లు చేస్తున్నారు. కొన్ని కొన్ని సీన్లు చూస్తే ఇది కార్టూనా అనిపించింది. మనిషి భూమి మీద పడి స్ప్రింగులు ఉన్నట్టు ఎలాగ లేస్తాడు? దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 1980లలో ఫైట్లు మరీ రివాజుగా ఉన్నాయి అని సినిమాల్లో దర్శకులు ఏదో ఒక gimmick పెడుతూ ఉండేవారు. football నేల మీద పడకుండా రౌడీలని కొట్టడం, ఆయుధం వాడకుండా కొట్టడం (స్టేట్ రౌడీ) చూసను. 2020 లో చున్నీ తడిపారెయ్యడం ఒక ఫైటుగా చూస్తాను అని ఊహించలేదు.

నేనూ ఒక రచయితనే. నా శక్తి కొలది మంచివో, చెడ్డవోపద్యాలూ, పాటలూ, కథలూ రాస్తాను. వాటిని ఎవరైనా విమర్శిస్తే బాధ కలుగుతుంది. అందుకని వీలైనంతవరకు వ్యక్తులను కాక వారి పనులను మాత్రమే ప్రయోజనాత్మకంగా విమర్శించే ప్రయత్నం చేస్తాను. కానీ, ఒక్కో సారి మనసు గడి తప్పి ఇలాగ రాయాలనిపిస్తుంది. ఈ సినిమా రచయిత, దర్శకుడు ఐన త్రివిక్రం ని మాటలమాంత్రికుడని ఎందుకు అంటారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. పేరు, బలగం, ప్రజాభిమానం ఉన్న నటులు కూడా మంచి పాత్రలు చెయ్యగలరు అని ఎప్పటినుంచో ఋజువులు ఉన్నాయి. ఇలాంటి అత్తెసరు కథలు, కథనాలు ఎందుకు ఇష్టపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రపంచమంతా ముందుముందుకీ పోతుంటే, మన తెలుగు సినిమా అగ్రవర్గం మాత్రం వెనక్కి వెళ్తోంది. వాళ్ళకే గురూజీ అనీ, intelligent directors అనీ, మాటల మాంత్రీకులని బిరుదులు ఇచ్చుకుంటున్నాము అంటే నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు.

ఈ సినిమా మొత్తానికి పాటలు; జయరాం, మురళీ శర్మల నటన నచ్చాయి. ఈ సినిమా తీసినవారికి, బాగుందని నాతో అన్నవారికి శతకోటి నమస్కారాలు. 

Tuesday, December 25, 2018

కార్తిక మాసం సందర్భంగా రాసిన పద్యాలు

కార్తిక మాసం సందర్భంగా నేను రాసిన కొన్ని కందపద్యాలను శాస్త్రీ బ్లాగులో రాసాను. అక్కడ చదువని వారి కోసం మనోనేత్రంలో కూడా రాస్తున్నాను.

మాటలు, చేతలు, డెందము
గాటపు త్రిపురాలు దురితకారకముల్ నీ
మేటి కరకు జ్ఞానేషువు
వేటునఁ నాయహముఁ జంపు వేదాంతనిధే!

భా:- "మనసు, వాక్కు, కర్మ" అనే మూడూ త్రిపురాలుగా అయ్యి నా చేత పాపములు చేయిస్తున్నాయి. నీ సుజ్ఞానం అనే బాణంతో నా అహాన్ని చంపు, (త్రిపురాలను నాశనం చేసిన) శివా!

చాపపు నేరిమి దేవర
పాపపు పులి నోట చిక్కి బడలితి, కరుణా
రోపము గురి చూసి విడుమ
మాపు జననమరణవనిని మారాంతకుడా!

భా:- ధనుర్విద్యకు దేవతా! కామాన్ని జయించినవాడా! పాపం అనే పులి నోట చిక్కి అలిసిపోయాను. నువ్వు దయ అనే బాణాన్ని గురి చూసి పంపి పులితోబాటు ఈ జననమరణాలు అని అడవినే నాశనం చెయ్యి. (కామం వలనే పాపం పుడుతుంది. ఆ కామాన్ని జయించినవాడు పాపాన్ని నాశనం చెయ్యగలడు).

ఒడిలో బిడ్డడి యెలుకను
మెడలో బుసగొట్టు పాము మింగగఁజూడున్
ఎడమన పసివాని నెమలి
మిడినాగునుఁత్రుంచనెగురు మీదకునెపుడున్

వింతగు కాపురమును నీ
ఇంతి నడుపుచున్ జగములనేలుచునుండన్
సుంతయు బాసటనీయక
చింతెరుగని భిక్షువగుట చెల్లెను నీకే!

భా:- గణపతి వాహనమైన ఎలుకని మింగడానికి నీ మెడలో పాము బుసగొడుతూ ఉంటే, ఆ పామును మింగడానికి నీ చిన్నకొడుకు వాహనం నెమలి ఎగురుతూ ఉంటుంది. నీ ఇల్లాలు ఈ వింతైన కాపురాన్ని నడుపుతూనే జగాలను కూడా ఏలుతోంది. నువ్వు మాత్రం కొంతైనా సాయం చెయ్యకుండా భిక్షం ఎత్తుకుంటూ ఉన్నావు. ఈ వైభవం నీకే కుదిరింది.

ఎదలో కోర్కెలు ఎద్దుర
మదమొక గజముర చిలువర మత్సరమెల్లన్
పదునగు కోపము వ్యాఘ్రము
అదుపున పెట్టెడి కుశలతనందించు శివా!

భా:- ఎద్దులాగ ఎగిరిపడే కోర్కెలు, ఏనుగంత అహంభావం, పాములాగ బుస కొట్టే ఈర్ష్యా, పులి వంటి కోపం నాలో ఉన్నాయి.ఈ జంతువులని అదుపులో పెట్టిన నీవు నాకు కూడా ఆ దక్షతని అందించు, పశుపతీ! [నువ్వు ఎద్దుని (నందివాహనుడు), ఏనుగుని (గజచర్మాంబరుడు), పాములని (నాగాభరణుడు), పులిని (వ్యాఘ్రాజినాంబరుడు) అదుపులో పెట్టినవాడవు కదా.]

చలియించని యోగి, ఉమను
వలపించిన రాగి, కొలుచు వారికి ఱేడున్
కలచిన కీడున్ నటనకు
నెలవగు స్థాణువు శివుడిని నిత్యము తలతున్

భా:- స్థిరంగా ఉండే యోగి, అమ్మవారి మనసును ఆకర్షించిన అనురాగవంతుడు, కొలచిన వారిని ఆదుకొనేవాదు, చీకాకు పెట్టే వారికి శిక్షకుడు, కదులుతూ నాట్యం చేసే నటరాజు, అస్సలు కదలని స్థాణువు - అన్నీ అయిన శివుడిని ఎప్పుడూ తలుస్తూ ఉండెదను.

కైలాసంబున శైత్యము
మేలగు వినుదుస్తు నీది, మిన్నది తలలో
శైలజ కౌగిలి వీడవ
దేలన చలికోపలేక, ఇషణము మిషయే!

భా:- కైలాసంలో చలి, చక్కని ఆకాశాన్ని బట్టులుగా ధరిస్తావు, తలలో గంగమ్మ. పార్వతి కౌగిలి (పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం) వీడవంటే - చలికి తట్టుకోలేక. భార్య మీద ప్రేమ (ఇషణం) వత్తి సాకు (మిష).

పెక్కులఁ నిన్నును కలచెడి
రక్కసులకు వరములీయ రవ్వంతైనా
లెక్కించక, పెళ్లి జరుప
నక్కరఁ జూపిన వలదొర నణచుట పాడా!

భా:- నిన్ను, అనేకమందిని బాధపెట్టే రాక్షసులకు రవ్వంతైనా ఆలోచన లేకుండా వరాలిచ్చావు. నీకు పెళ్ళి జరుపుదామని ప్రయత్నించిన మన్మథుడిని మాత్రం దగ్ధం చేసావు. ఇది న్యాయమా?

ఆపవు కద భిక్షించుట
శ్రీపతి శ్రీదుల నడగక సెరబడియున్నన్
దాపున గంగను కలిగియు
ఆ పై యడిగేవు జనులనభిషేకముకై!

భా:- శివ! లక్ష్మీదేవి భర్త ఐన విష్ణువు, ధనవంతుడైన కుబేరుడూ నీకు మిత్రులైనా వాళ్ళని సాయం అడగక భిక్షమెత్తుకుంటావు. కానీ, నెత్తిపైన గంగను ఉంచుకుని జనాలను అభిషేకం చెయ్యమని అడుగుతావు. (ఇదేం విడ్డూరం!)

సిగలోనల్లరి విన్నది
రగిలే కన్నుయు నుదుటన, రాగలు మెడలో
నగుమోమునఁ మోసెడి దొర!
బెగడక మను పట్టు మదిన పెంచుము తండ్రీ!

భా:- జటాజూటంలో ఎగసిపడే గంగమ్మ, నుదుటిపైన నిప్పులు రగిలే కన్ను, మెడలో పాములు (అన్నీ ప్రమాదాలే అయినా) నవ్వుతూ వాటిని మోసేవాడా - భయపడకుండా ఉండే స్థైర్యాన్ని మా మనసుల్లో పెంచు తండ్రీ!

మాటకునూపిరి పోయగ
గాటపు శివసూత్రములను కల్పించితివే
నోటపలుకకుండ నిజము
తేటగ తెలిపెడి వలకడ దేవర ప్రణతుల్!

భా:- దక్షిణామూర్తి (వలకడ - దక్షిణదిక్కు) రూపంలో నోట మాట పలుకకుండా సత్యాన్ని (సత్) తెలుపగలిగిన యోగి, మనుషుల కోసం 14 శివ (మాహేశ్వర) సూత్రాలను పాణినికి ప్రసాదించి భాషను సృష్టించాడు. వానికి నమస్సులు.

కరిముఖమార్కండేయులఁ
మరణము దాటించినావు; మృత్యుంజయుడా!
గరళము మింగితివి నగుచు
కరుణను మముఁ గావుమయ్య కాలాంతకుడా!

భా:- శివ! నువ్వు నవ్వుతూ విషాన్ని తాగావు. మార్కండేయుణ్ణి యముడి (మృత్యువు) నుండి కాపాడావు. వినాయకుడికి ఏనుగు తలతో మరో జన్మను ప్రసాదించావు. యముడిని కూడా అంతం చేయగలవాడా - కరుణతో మమ్మల్ని కాపాడు.

ఒడలునఁ జతపడియుండిరి
విడరెట రాయిగ వెలసిన వేడుక మీరన్
గడుసరి భక్తుడడుగ సతి
నెడబాసిన వేల్పు కన్న హెచ్చును గలరే?

భా:- శివపార్వతులు లింగరూపమునైనా అర్థనారీశ్వరులుగానైనా ఒకటై అందంగా ఉన్నారు. అట్టిది, గజాసురుడు అడిగితే తన భార్యను విడిచి వెళ్ళిన శివుడి కంటె దైవం ఉందా?

తనరునె ధరణీతలమున
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?

భా:- భూమి మొత్తం వెతికినా కన్నబిడ్డను చూసి నవ్వినట్టి వాడిని నెత్తిన మోసుకు తిరిగే శివుడిని మించిన దయ కలిగినవాడు దొరుకుతాడా?

Sunday, February 11, 2018

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా! 
(దౌష్ట్యము = దుర్మార్గం, కాంచి = చూసి, దండన సేయు = దండించు, ఎంచు = నిర్ణయించు, హా = అయ్యో!)

భీముడు చేసిన దుర్మార్గాన్ని చూసి, రాముడు అతనిని దండించాలని నిర్ణయించుకున్నాడట. అది ఎలాగో ఉత్పలమాలలో చెప్పాలి. శ్రీచరణ్ గారు - ఇబ్బంది లేకుండా పూరించారు. ఆయన పూరణ:

​సృష్ట్యధినాథుడైన పరచిన్మయ విష్ణువు కృష్ణమూర్తియై
వృష్ట్యనృతాంబుదంబు వలె వీరరసంబును నూరిపోయగా
దృష్ట్యవహీనజాతుడగు దిట్టను కూల్చుట కోపభద్రుడై
దౌష్ట్యము గాంచి భీమునికి దండన చేయగ రాముడెంచె హా!


వారి పద్యంలో అన్వయం నాకు పూర్తిగా గోచరించలేదు. "అనృతాంబుదము" అని కృష్ణుడిని అనడం బాగుంది. అంబుదం అంటే మబ్బు. మబ్బులూ, కృష్ణుడూ నల్లగా ఉంటారు (నీలమేఘశ్యాముడు). ఆ కృష్ణుడు కల్లబొల్లి మాటలు చెప్పాడు అండానికి "అనృత + అంబుదం" అన్నారు.

అవధానం రేపనగా ఇది మరీ కష్టమేమోనని కొంచెం సందేహించాను. అదే విషయం నిద్రబోయే ముందు నా సతీమణితో అంటే "మీరు పూరించలేనిది ఆయనని అడగడం సబబా" అంది. సరే, చేతిలో కాగితం, కలం లేకుండా నేను పూరించగలనో లేదొ చూద్దాం అని పూరించాను. దాదాపు 40 నిముషాలు పట్టింది. ఇలాగ పూరించాను.

సృష్ట్యనునిత్యముంగనెడి సాధుకుఁ నీచుకుఁ మధ్య స్పర్థలో
దృష్ట్యనుసారమే తెలియు ర్మమెటో మురవైరియన్నకున్
తుష్ట్యరి కాడె శిష్యుఁ తొడ తుంచిన దుండగుడెవ్వడయ్యినన్ 
దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

సృష్టి ఎప్పుడూ మంచివాడికీ, చెడ్డవాడికీ మధ్య తగువును చూస్తూనే ఉంటుంది. అందులో ఎవరివైపు ధర్మముందో చెప్పడం కష్టం. ఎవరి దృష్టిని బట్టి వారికి అలాగ అనిపిస్తుంది. ఇందులో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడి అన్న, అవతారమూర్తి అయిన బలరాముడికి కూడా మినహాయింపు లేదు. తన శిష్యుడైన దుర్యోధనుడిని తొడ చీల్చి చంపినవాడు ఎవరైనా తన సంతోషానికి విరోధియే కదా. అందులోనూ భీముడు కూడా బలరాముడి శిష్యుడే. అందుచేత, బలరాముడికి చెడ్డ పేరు వస్తుంది. ఈ దుర్మార్గాన్ని చూసి భీముడిని దండించాలి అని (బల)రాముడు నిర్ణయించుకున్నాడు.

ఒక వేళ ఈ సమస్యతో అనుకోని చిక్కు ఏమైనా వస్తే ఉంటాయి అని మరి కొన్ని సమస్యలను కూడా సిద్ధపరిచాను. అవి మీకు నచ్చి, పూరించాలి అనిపిస్తే - ప్రయత్నించగలరు.

పలువురు మెచ్చెఁ పాలడుగు బాలుడె భామనుఁ గాసిచేయగన్
రావణుఁ నెగ్గియర్జునుడు రాముని వేటుకు నేలకూలెనే
పొట్టేలెంచెను చేప పొందు యెదుటన్ పుష్పాంగి చూస్తుండగా
తామరఁ గని యేవపడని తరుణియుఁ గలదే!
పాడెడి వారి పాలఁ బడి పాలక సైన్యము పారిపోయె హా!

Thursday, November 23, 2017

పోతన భాగవతం

మొన్న బోతల్ నగరంలో జరిగిన "మన దీపావళి" కార్యక్రమానికి వ్యాఖ్యానం (MC) చేసాను. కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం - "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటిక. వందకు పైగా పిల్లలు అందరూ అద్భుతంగా నటించటమే కాక పద్యాలను కూడా వినిపించారు. పద్మలత గారి రచనలో నాకు ముఖ్యంగా నచ్చింది - పోతనకై ప్రత్యేకంగా ఉంచిన సన్నివేశం. పోతనలోని లోతుని తెలిపేలాగ "శారద నీరదేందు", "బాల రసాల", "పలికెడిది భాగవతమట" మొదలైన పద్యాలను చిన్నారుల చేత చక్కగా చెప్పించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలగడం నా భాగ్యం.

ప్రేక్షకులకు కృష్ణతత్త్వాన్ని, పోతన తత్త్వాన్ని తెలిపేందుకు సిద్ధపడుతూ పోతన తీయని పద్యాలను మళ్ళీ గుర్తుచేసుకున్నాను. "కేళీ లోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్, మహా నందాంగనా డింభకున్" అని చదువుతుంటే పోతనలోని ఔన్నత్యం నా కళ్ళు చమర్చేలాగా చేసింది. "సృష్టి అనే ఒక ఆటను నడపుతూ ప్రకాశించే చూపుల వల నుండి పుట్టిన అనేక బ్రహ్మాండాలను తనలో ఇముడ్చుకున్న వాడు" అంటూ విష్ణువుని (అంతటా వ్యాపించినవాడిని) స్తుతిస్తూ పక్కనే "మహా నందాంగనా డింభకున్" (నందుడి భార్య ఐన యశోద బిడ్డ) అనడంలో - యశోదని, అమ్మని ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాడో అనిపించింది. ఇక "కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడనేల ఏడ్చెదో" అని ఆయన అమ్మ శారదను ఓదారుస్తుంటే - ఎవరు తల్లో, ఎవరు బిడ్డో తెలియని ఆత్మీయత కనబడుతోంది. కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించిన మహా యోగి పోతన. ఆయన మన తెలుగువాడు అవ్వడం మన జాతి అదృష్టం.

భాగవతం అంతటా సీసపద్యాలు మల్లెతీగెల లాగా కనబడుతూ ఉంటాయి. "మందార మకరంద మాధుర్యమునఁదేలు" అన్న పద్యంలోని అనుభూతి పాడుకుంటే గానీ తెలియదు. "నల్లనివాడు పద్మనయనంబులవాడు" అంటూ గోపికలు పాడే పద్యంలోని ప్రణయమే నిజమైన ప్రణయం. నేను కుచేలోపాఖ్యానం పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటే, ఎనుబది ఏళ్ళ వయసులో మా తాతయ్య అనర్గళంగా ఆర్ద్రతతో "ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ గరుణాలవాలు, భాసురకపోలుఁ" అంటూ నన్ను దాటుకుని వెళ్ళిపోయిన సంగతి నా కళ్ళ ముందు మెదిలింది. పద్యం చదివితే అలాగ చదవాలి కదా అనిపించింది. "విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు" అని పోతన తేటగీతిని ముగిస్తే "అబ్బా, ఏం వేసాడురా అనుప్రాస" అని ఇప్పటికీ అనుకుంటాను. "అడిగెదనని కడు వడిఁ జను" అనే పద్యం కంఠస్థం చేయడానికి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కాదు. "అమ్మలగన్నయమ్మ" అని అచ్చ తెలుగు మాటలతోనూ, "శారద నీరదేందు" అని సంస్కృతపదాలతోనూ అమ్మను స్తుతించిన కావ్యసవ్యసాచి పోతన గొప్పదనం చెప్పడం నాబోంట్లకు వీలు కాదు.

పదేళ్ళ క్రితం మొదట అమెరికా వచ్చిన రోజుల్లో surasa.net లో ఉషశ్రీ సువర్ణకంఠంలో విన్న భాగవతం గుర్తుకు వచ్చి మళ్ళీ విన్నాను. Law of Diminishing Marginal Utility అని అర్థశాస్త్రజ్ఞులు చెప్పిన చట్టం తప్పు కదా అనిపించింది. ఎన్ని సార్లు విన్నా ఇంకా తియ్యగానే ఉంటుంది. ఈ మధ్యన మఱొక అద్భుతమైన అంతర్జాలవిషయం తెలుసుకున్నాను. http://telugubhagavatam.org లో పోతనభాగవతాన్ని పూర్తిగా, టీకాతాత్పర్యసహితంగా ఉంచారు. అంతేగాక బంగారునగలోని ముత్యాలలాగా ఉండేటువంటి పద్యాలను ప్రత్యేకంగా క్రమపరిచారు. ఈ మహోపకారం చేసిన మహానుభావులకు ఆ శారదా దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని నా నమ్మకం.

ఏ దేశంలో ఉన్నా మన తెలుగువాళ్ళు కచ్చితంగా తినవలసిన, నెమరేసుకోవలసిన పనసతొనలు పోతన పద్యాలు. వాటిని మళ్ళీ గుర్తుచేసుకుని పాడుకోవడం వలన దైనందినతాపాలతో ఎండిపోయిన నా మనోవనంపైన తొలకరి జల్లులు పడినట్టైంది. మహాకవి పోతనకు అనంతకోటి వందనాలు.

Sunday, July 24, 2016

గురుపాదుకా స్తోత్రం - తాత్పర్యం

ఎప్పటినుండో "గురుపాదుకా స్తోత్రం" నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మొన్న "గురు పౌర్ణమి" సందర్భంగా ఆ స్తోత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వ్రాసుకున్నాను. అది ఇక్కడ వ్రాస్తున్నాను.ఏమైనా పొరబాట్లు కనిపిస్తే చదువర్లు సరి చేయగలరు.

ఏదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు వచ్చే సమస్య: స్తోత్రం ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం. అదే సమస్య ఇక్కడా వచ్చింది. నేను "శృంగేరి శారదా పీఠం" వారి ప్రతినుఅనుసరించాను.

నాళీక నీకాశ పదాహృతాభ్యాం
నానా విమోహాది నివారికాభ్యాం
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

నాళీక - తామర పువ్వు
నీకాశ - వలె కనిపించు
పద ఆహృతాభ్యాం - పాదములను అంటిపెట్టుకునేవి
నానా - రకరకాల
విమోహ ఆది - వ్యామోహాలు మొదలైనవి
నివారికాభ్యాం - తొలగించేవి
నమత్ - నమస్కరించే
జన - జనుల
అభీష్ట తతి - కోర్కెలను అన్నింటినీ
ప్రదాభ్యాం - ప్రసాదించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

తామర పువ్వుల వంటి గురువు పాదాలను అంటిపెట్టుకున్న పాదుకలు రకరకాల వ్యామోహాలను తొలగిస్తాయి. నమస్కరించిన వారి కోర్కెలను అనంటినీ నెరవేర్చేవి. వాటికి నమస్సులు.

శమాది షట్క ప్రద వైభవాభ్యాం
సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం
రమా ధవాంఘ్రి స్థిర భక్తిదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

శమాది షట్క ప్రద - శమము మొదలుగా గల ఆరు లక్షణాలను ఇచ్చే
వైభవాభ్యాం - మహత్తు కలిగినవి
సమాధి - బ్రహ్మంతో ఐక్యత
దాన - ఇవ్వడం (అనే)
వ్రత - వ్రతాన్ని
దీక్షితాభ్యాం - దీక్షగా తీసుకున్నవి
రమా - లక్ష్మీ దేవి
ధవ - భర్త
అంఘ్రి - పాదాలు
స్థిర - నిలకడగా
భక్తిదాభ్యాం - భక్తిని ప్రసాదించేటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురు పాదుకలు (వివేక చూడామణిలో చెప్పబడిన) శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే మోక్షప్రదమైన గుణాలను ప్రసాదించే మహత్తు కలిగినవి. శ్రద్ధగా ఉన్న వారికి బ్రహ్మపదాన్ని అందించడమే కర్తవ్యంగా ఉన్నవి. నారాయణుని పాదాల పట్ల భక్తిని నిలకడగా ఉంచగలిగినవి. వాటికి నమస్సులు.

నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి
సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యాం
నృపత్వదాభ్యాం నత లోక పంక్తేః
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

నృప ఆళి - అనేక రాజుల
మౌళి - కిరీటాల
వ్రజ - గుంపు (యొక్క)
రత్న కాంతి - రత్నాల కాంతి (యొక్క)
సరిత్ - నది (లో)
విరాజత్ - మెరిసేటి
ఝష కన్యకాభ్యాం - అందమైన చేపల వంటివి
నత - నమస్కరించిన వారికి
లోక పంక్తేః - లోకాలు అన్నింటికీ
నృపత్వదాభ్యాం - ఆధిపత్యం ఇచ్చేటివి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

అనేకమంది రాజుల కిరీటాలను ఒక చోట చేర్చగా వాటిలో ఉన్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే అంతటి వెలుగులో కూడా మెరిసేటి చేపల వంటివి గురువు పాదుకలు. అంటే ఎంతటి సిరులు, అధికారం కూడా గురువు చెప్పుల పాటి చెయ్యవు. ఆ గురువు పాదుకలకు నమస్కరించిన వారికి అనేక లోకాల ఆధిపత్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగినవి గురువు పాదాలు. వాటికి నమస్సులు.

అనంత సంసార సముద్ర తార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

అనంత - అంతు లేని
సంసార - ప్రపంచం అనే
సముద్ర - కడలి (ని)
తార - దాటించే
నౌకాయితాభ్యాం - నౌకల వంటివి
గురుభక్తిదాభ్యాం - గురువు పట్ల భక్తిని ఇచ్చేటివి
వైరాగ్య - వైరాగ్యం అనే
సామ్రాజ్యద - సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళదాయకమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురుపాదుకలు అంతులేని సంసారం అనే కడలిని దాటించే నౌకలు. అవి గురువు పైన భక్తిని కలిగించి నిలుపుతాయి. అవి (నిస్సారమైన ప్రపంచం పై) వైరాగ్యం అనే సామ్రాజ్యాన్ని పొందడానికి పూజించదగినవి. వాటికి నా నమస్కారములు.

పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం
జాడ్యాబ్ధి సంశోషణబాడబాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

పాప - పాపము (అనెడి)
అంధకార - చీకటి (కి)
అర్క - సూర్యుల
పరంపరాభ్యాం - వరుస వంటివి
తాపత్రయ - తాపత్రయము (అనెడి)
అహి + ఇంద్ర - అత్యంత శక్తివంతమైన పాముకు
ఖ + గ + ఈశ్వరాభ్యాం - ఆకాశంలో సంచరించే వాటికి (పక్షులకు) అధిపతి (గరుత్మంతుడు - గెద్ద) వంటివి
జాడ్య + అబ్ధి - అజ్ఞానం అనే సముద్రాన్ని
సంశోషణ - ఎండబెట్టేటి
బాడబాభ్యాం - భయంకరమైన నిప్పు వంటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురువు పాదుకలు పాపము అనే చీకటిని మొత్తంగా నాశనం చేసేటి వేలాది సూర్యులతో సమానం. అవి తాపత్రయాలు అనే పాముని చంపేటి గెద్ద వంటివి. అజ్ఞానం అనే కడలిని ఎండబెట్టేటి బలమైన నిప్పు వంటివి. వాటికి నమస్సులు.

కవిత్వ వారాశి నిశాకరాభ్యాం
దౌర్భాగ్య దావాంబుదమాలికాభ్యాం
దూరీకృతానమ్ర విపత్తతిభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

కవిత్వ - కవిత్వం (అనే)
వారాశి - కడలి (కి)
నిశాకరాభ్యాం - చంద్రుడి వంటివి (వన్నె తెచ్చెడివి)
దౌర్భాగ్య - దురదృష్టం (అనే)
దావ - మంట (కు)
అంబుద మాలికాభ్యాం - నీటి మాలల (కుండపోత వర్షం) వంటివి
దూరీకృత - దూరం చెసినవి
ఆనమ్ర - మొక్కెడి వారికి
విపత్ తతిభ్యాం - ఆపదల వరుసను
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురు పాదుకలు కడలికి చంద్రుడి వలె విద్యకు వన్నె తెచ్చెడివి. దురదృష్టం అనే మంటను ఆర్పేటి జడివానలు. మొక్కెడి వారికి వచ్చిన ఆపదలను అన్నింటినీ తొలగించెడివి. వాటికి నమస్సులు.

నతా యయో శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

యయోః - వేటికైతే
కదాచిత్ - ఎప్పుడో ఒక సారి మాత్రమే
నతా - మొక్కిన వారు
అపి - అయినా
హి - కచ్చితంగా
ఆశు - వెంటనే
దరిద్రవర్యాః - అత్యంత దరిద్రంలో ఉన్న వారు
శ్రీపతితాం - సిరులకు నెలవు
చ - మరియు
మూకాః - మూగవారు
వాచస్పతితాం - మాటలకు నెలవు (దేవ గురువు బృహస్పతి)
సమీయుః - వలే ఐనారో
తాభ్యాం - వాటికి
శ్రీ గురుపాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

ఎప్పుడో ఒక సారి మాత్రమే మొక్కినప్పటికీ వెంటనే దరిద్రులను నారాయణునితో (లక్ష్మీ దేవి భర్త), మూగవారిని బృహస్పతితో సమానంగా కచ్చితంగా చెయ్యగల గురువు పాదుకలకు నమస్సులు

కామాది సర్ప వ్రజ భఙ్జకాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం
బోధప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

కామ + ఆది - కామము మొదలైన
సర్ప వ్రజ - పాముల వరుస
భఙ్జకాభ్యాం - త్రుంచేవి
వివేక - ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే తెలివి
వైరాగ్య - అశాశ్వతమైన వాటి పైన కోరిక లేకుండుట
నిధి ప్రదాభ్యాం - (వివేకము, వైరాగ్యము అనే) నిధులను ప్రసాదించెడివి
బోధప్రదాభ్యాం - జ్ఞానాన్ని బోధించేవి
ద్రుత - వేగంగా
మోక్షదాభ్యాం - మోక్షాన్ని కలిగించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురు పాదుకలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు పాములను (అరిషడ్వర్గం) నాశనం చేస్తాయి. వివేకం, వైరాగ్యం అనే గొప్ప సిరులను ప్రసాదిస్తాయి. జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, త్వరగా మోక్షాన్ని ఇస్తాయి. వాటికి నమస్సులు.

స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

స్వ - వాటిని
అర్చ - మొక్కడమే
పరాణాం - తమ కర్తవ్యంగా కలవారికి
అఖిల - అన్ని
ఇష్టదాభ్యాం - ఇష్టాలనూ నెరవేర్చేవి
స్వాహా - స్వాహా దేవి (కి)
సహాయః - తోడుగా ఉండెడి వాడిని (అగ్ని: ఆయన భార్య స్వాహా దేవి)
అక్ష - కన్నుగా కలవాడికి (శివుడికి)
ధురంధరాభ్యాం - సమానమైన శక్తి కలవాటికి
స్వాంత - హృదయం
అచ్ఛ - శుద్ధి
భావ - స్థితి
ప్రద - ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

వేటిని అర్చించడంలో మునిగిన వారికి అన్ని కోర్కెలూ నెరవేరుతాయో, శివుడికి ఉన్నంత శక్తి వేటికి కలదో, వేటిని పూజిస్తే మనస్సు నిర్మలమౌతుందో - ఆ గురువు పాదుకలకు నమస్సులు.

శ్రీ గురు పాదుకాభ్యాం నమః

Thursday, February 18, 2016

శ్రీ వేంకటేశ్వర పదములు - మనిషిగ పుట్టెను ఒక మట్టి

కథానాయకదర్శకనిర్మాతాదుల ఒత్తిడి లేకుండా వ్రాయడం ఏ చలన చిత్ర కవికైనా వరమే. బహుశా అందుకేనేమో, వేటూరి private albums కొన్నిటికి ఆణిముత్యాల వంటి పాటలు వ్రాసారు. "శ్రీ వేంకటేశ్వర పదములు" అనే album లో భక్తిని, వేదాంతాన్ని కలగలిపి వ్రాసిన సాహిత్యం విన్న ప్రతి ఒక్కరికీ నచ్చితీరుతుంది. ఆ పాటల్లో నాకు పదే పదే గుర్తొచ్చేది "మనిషిగ పుట్టెను ఒక మట్టి" అనే పాట. దీన్ని స్వరపరిచినది కే.వీ.మహదేవన్, పాడింది ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. వీరిద్దరూ వేటూరి సాహిత్యానికి తగిన న్యాయాన్ని చేకూర్చారు.

వేదాంతం అంతా మూడిటి మధ్య సంబంధం గురించి చెబుతుంది. అవి జీవుడు (జీవాత్మ), ప్రపంచం (జాగత్తు), ఈశ్వరుడు (పరమాత్మ). ఈ మూడూ ఒకటే అనేది అద్వైతవేదాంతం. అద్వైతం అంటే - "రెండవది లేనిది" అని అర్థం. అద్వైతసారం: ఉన్నది ఒకటే - బ్రహ్మం. మాయ వలన బ్రహ్మమే విడి విడిగా అనేక జీవులుగా, వస్తువులుగా (ప్రపంచం), ఈశ్వరుడిగా కనిపిస్తోంది. తెల్లదైన సూర్యరశ్మి తేమ ద్వారా చూస్తే ఏడు రంగులుగా కనిపించినట్టు అన్నమాట. శంకరాచార్యుల నుండి, నిసర్గదత్త వరకు గురువులు అందరూ ఇదే విషయాన్ని అనేక దృష్టాంతాలతో (ఉదాహరణలతో) వర్ణించి చెప్పారు. వీటిలోని అనేక అంశాలను స్పృశిస్తూ వేటూరి కలం నుండి పల్లవించిన ఈ పాట ఆ పరమేశ్వరుడి చరణాలను చేరింది అని నా నమ్మకం.

ఈ పాటలో పల్లవి, చరణాలూ పంచభూతాలలో ఒక్కొక్క దాన్నీ వర్ణించుకుంటూ వెళ్తాయి. కవి వాటిని చూసి జిజ్ఞాసతో తేలిక మాటలలో లోతైన ప్రశ్నలను అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం తెలిస్తే వేదాంతం అర్థమైనట్టే. (అర్థమైనంత మాత్రాన అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రానప్పుడు అర్థమైనా కానట్టే.) ఆ ప్రశ్నలు, వాటికి వేదాంతంలో నాకు తెలిసిన సమాధానాలు కూడి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. ఈ వ్యాసం చదువుతుంటే మీకు "వేటూరి ఈ ఉద్దేశంతోనే వ్రాసుంటారా?" అని అనిపిస్తే, మీరు ఏకాకి కాదు. వ్రాస్తున్నప్పుడు నాకే బోలెడు సార్లు అలాగ అనిపించింది. కచ్చితంగా ఈ పాటలో చాలా లోతైన భావాలను కొద్దిపాటి పదాలలో చెప్పారు. అందుచేత ఆయన రచించిన వేరే పాటలలో భావాలను, శైలిని బట్టి కవిహృదయాన్ని ఊహించవలసి వచ్చింది. ఆ ప్రక్రియలో పొరబాట్లు కూడా దొర్లి ఉండవచ్చును. ఇది వేటూరి పాటల్లో తరచూ జరిగే (నాకు ఇష్టమైన) విషయం. ఒక వేళ మీకు "ఈ పాటలో ఉన్న పది పదాలకు, వీడు వేయి మాటల్లో వేదాంతం వివరించాలా?" అని అనిపిస్తే మన్నించాలి. ఈ పాట నేను అప్పుడప్పుడూ చదువుకున్న వేదాంత తర్కసారాలను మనసు లోపొరల్లోంచి తవ్విస్తుంది. అందుకు కృతజ్ఞతగా ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను.

మనిషిగ పుట్టెను ఒక మట్టి
తన మనసును పెంచినదే మట్టి
మానై పుట్టెను ఒక మట్టి
తన పూవై పూసినదే మట్టి

మట్టిలోంచే అంతా వస్తుంది, మట్టిలోకే అంతా వెళ్తుంది అన్నది వీధి వేదాంతం. అంటే - అందరికీ తెలిసిన వాదం, అందరూ సుమారుగా అంగీకరించే వాదం. శరీరానికి మట్టి ముడిసరుకు. మరి, మనసు కనబడదు, తాకడానికి వీలు కాదు కదా - దానికి ముడిసరుకు ఏది? మాను మట్టి లోంచే పుట్టింది, ఆ మానుకు భిన్నంగా ఉండి, కళను తెచ్చే పువ్వు ఎక్కడనుండి వచ్చింది?

అంతా మట్టి అని మనం అంటాము. అంతా బ్రహ్మం అని వేదాంతులు అంటారు. మనిషి దేహం మట్టిలోంచి వచ్చింది. మనసు అదృశ్యం, అస్పృశ్యము, అభౌతికము కదా, దానికి మూలం ఏమిటి? దానికి జవాబు "అజ్ఞానం (అవిద్య)". జీవుడికి "నేను ఈ దేహాన్ని" అనే మోహం కలిగించేది అజ్ఞానం. ఈ అజ్ఞానానికి కొమ్మలు - బుద్ధి, మనసు, అహంకారం, చిత్తం. సూక్ష్మంగా వీటిలో భేదాలు ఉన్నా, స్థూలంగా వీటిని కలిపి "మనసు" అంటాము. దేహంలోని ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసి మనసు కోరికలను, బంధాలను ఏర్పరుచుకుని బలపడుతుంది. ఆ దేహం వాసయోగ్యం కానప్పుడు ఇంకా మనసు మిగిలిపోతే - అది మళ్ళీ వేరే దేహాన్ని ఆశ్రయిస్తుంది. మనిషి-మనసులకు ఉపమానాలుగా మాను, పువ్వులను చెప్పారు. చెట్టు నుండి పువ్వు వస్తుంది. పువ్వు నుండి చెట్టు వస్తుంది.

ఆయువు పోసెను ఒక గాలి
జీవాత్మలనూదినదే గాలి
వేణువులూదెను ఒక గాలి
పరమాత్మునికూపిరి ఏ గాలి

జీవుడికి ఒక దేహంలో ఆయువుని ఇచ్చేది గాలి. మరి దేహాలను మారుస్తూ పోయే జీవాత్మలను కల్పించినది ఏ గాలి? ఈ జీవాత్మల జీవనవేణువులు (జీవితంలో రాగాలు - అనుభూతులు) ఊదుతున్నది ఏ గాలి? అది ఈశ్వరుడు అనుకుంటే మరి ఈశ్వరుడికి ఆధారం ఏమిటి? §

ప్రాణం అంటే మామూలు భాషలో ఊపిరి. యోగాభ్యాసంలో జీవుడి ఉనికిని (vitality, life-breath) ప్రాణం అంటారు. దీన్నే తెలుగులో ఉసురు అని అంటాము. దేహంలో ఉసురు ఉన్నంతవరకే జీవుడు అందులో నివసిస్తాడు, దీన్నే ఆయువు అంటాము. కవి ప్రాణాన్నే గాలి అంటున్నాడు.

అద్వైతంలో "సృష్టి" అనేది ప్రపంచానికి ఉందేమో కానీ జీవాత్మలకు లేదు. కృష్ణభగవానుడు కూడా గీతలో "న త్వేవాహం జాతు నాసం న త్వం న ఇమే జనాధిపాః" అన్నాడు కదా. జీవాత్మ తను బ్రహ్మం నుండి వేరని భావించడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానానికి ఆది ఉండదు. ఉదాహరణకు, ఒకడు తాడును చూసి పాము అనుకున్నాడు. వాడు దాన్ని పాము అని అనుకుంటుండగా "అక్కడ పాము ఎంత సేపటినుండి ఉంది?" అని అడిగితే వాడు రెండు రోజులన్నా, రెండు కోట్ల సంవత్సరాలన్నా పొరబాటే. ఎందుకంటే అక్కడ ఉన్నది అసలు పామే కాదు. పోనీ, వాడు అది తాడు అని తెలుసుకున్న తరువాత, "అక్కడ పాము ఎంత సేపటినుండి ఉంది?" అని అడిగితే ఆ ప్రశ్నే నిరర్థకం. అలాగ "జీవాత్మ, అజ్ఞానం ఎప్పుడు సృష్టింపబడ్డాయి?" అంటే దానికి సమాధానం "అసలు అవి సృష్టింపబడలేదు". బహుశా అందుకేనేమో వేటూరి "సృష్టించిన" అనే భావం రాకుండా, సున్నితంగా జీవాత్మలను "ఊదినది" ఏ గాలి అన్నారు.

ఈ జీవాత్మలకు అనుభవాలు కలగాలి అంటే వారికి ఒక పరిసరం కావాలి. ప్రపంచాన్ని సృష్టించి వారి జీవనవేణువులను ఊదినది ఏ గాలి అని కవి అడుగుతున్నాడు. దానికి సమాధానం ఈశ్వరుడు అని చెప్పచ్చును. మరి ఆ ఈశ్వరుడికి ఉసురు ఎవరు పోసారు? అసలు జీవాత్మనే ఎవరూ సృష్టించలేదు అంటే, మరి పరమాత్మ సంగతి అడగాలా? ఆయనా సనాతనుడే. ఆ వాదం నచ్చలేదూ, వేదం మరొక ఆధారం ఇచ్చింది -  "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యంలో. అంటే తమ తమ ఉనికిని గుర్తించే సకలజీవాలలోనూ "నేను ఉన్నాను" అనే జ్ఞానమే (అనుభవం, స్ఫురణ) బ్రహ్మం. ఆంగ్లంలో దీన్ని consciousness అంటారు. మరి ఆ జ్ఞానాన్ని ఎవరు సృష్టించారు అంటే - ఆ ప్రశ్నే నిరర్థకం. సృష్టించేవాడికి జ్ఞానం ఉండాలి కదా, అంటే స్రష్ట కంటే ముందు జ్ఞానం ఉంది అన్నమాట. అంటే జ్ఞానం సృష్టించబడినది కాదు, సనాతనమైనది. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు - ఆయనా సనాతనుడే.

ఆకలి పెంచినదొక నిప్పు
తన అంగము పెంచినదే నిప్పు
కన్నుగ వెలిగెను ఒక నిప్పు
తన వెన్నుని గాంచినదే నిప్పు

నిప్పుకు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి మండటం, రెండు వెలగడం. దేహానికి ఆ రెండూ అవసరం. ఎప్పటికప్పుడు ఆకలి అగ్ని లాగా మండుతున్న అనుభవాన్ని ఇస్తుంది. తిండి పెడితే దాన్ని జీర్ణించుకుని శరీరభాగాలకు బలాన్ని ఇచ్చి, పెంచుతుంది. ఇది నిరంతరం దేహంలో జరిగే యజ్ఞము. అన్ని ఇంద్రియాల లోకీ ముఖ్యమైనది కన్ను. ఆ కంటికి ఏదైనా కనబడేందుకు ఆధారం వెలుగు. ఇదంతా బానే ఉంది, మరి ఈ దేహానికి చైతన్యాన్ని ఇచ్చిన నిప్పు ఏమిటి?

మనిషి వెన్ను క్రింది కొన దగ్గర ఒక శక్తి ఉంటుంది అని యోగుల అనుభవం. దాన్నే కుండలినీ శక్తి అంటారు. దీన్ని పాముతోనూ, నిప్పుతోనూ పోలుస్తారు. ఈ శక్తి భౌతికమైన దేహానికి, అధ్యాత్మికమైన బ్రహ్మానికి ఒక వంతెన. ఎందుకంటే వేదాంతులు ఆ శక్తి మరేదో కాదు - ప్రజ్ఞానమే అంటారు. దీనికే అఖండాకార వృత్తి, అహం ("నేను ఉన్నాను") స్ఫురణ అనే పేర్లు కూడా ఉన్నాయి. "వెన్నును చూసిన నిప్పు" అంటే జీవుడి వెనుకనున్న "చైతన్యం" - అది బ్రహ్మం అన్నమాట.

దాహము తీర్చెను ఒక నీరు
తన దేహపుటొరవడి ఏ నీరు
కడలై పొంగిన దొక నీరు
తన కన్నుల పొంగినదే నీరు

దాహం తీరుస్తున్న నీరు తెలుసును. మరి దేహాన్ని నడుపుతున్న నీరు ఏమిటి? ఫలానా పరిస్థితుల మధ్యన ఈ జీవుడు దేహాన్ని పొందుతాడు అని నిర్దేశించేది ఏమిటి? దానికి జవాబు - కర్మ. జీవుడు తన మనసులో కోరికలు (దాహం) తీర్చుకోవడానికి ప్రస్తుతదేహంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మ ప్రతిఫలాన్ని, మిగిలిన మనసును (వాసనలను) బట్టి ఈ దేహపు ఆయువు తీరాక, మరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు.

కడలిలో నీటికి కడవలో (కుండ) నీటికి తేడా ఏమిటి? కడలిలో ఎంత నీరు పోసినా ఇంకా పడుతుంది. కడవలో నీటి రంగు, రూపు, రుచి మొదలైన గుణాలు మార్చనవుతుంది. కడలిలో నీటిని మార్చడం అసంభవం. కడవలో పోసిన నీరు వెనక్కి తీసుకోవచ్చును. కడలిలో పోసిన నీరు వెనక్కి రావు. ఇక్కడ కడలి ఈశ్వరుడు, కడవ జీవుడు. జీవుడు తాను దేహాన్ని అనుకుని కర్మను చేస్తే ప్రతిఫలం అనుభవించాలి. అదే, జీవుడు కర్మను ఈశ్వరుడికి సమర్పించి చేస్తే, అది ఈశ్వరుడి కర్మ అవుతుంది. దానికి ప్రతిఫలం జీవుడికి రాదు. దీన్నే కర్మయోగం అంటారు.

క్రమేపి కడలి వంటి ఈశ్వరుడి విస్తారాన్ని, లోతుని గుర్తించిన జీవుడి కన్నుల్లో భక్తి పొంగి కర్మయోగం భక్తియోగం గా పరిణమిస్తుంది.

అటనట నిలిచెను ఒక గగనం
తన ఘటమున నిండినదేగగనం
ఘటనాఘటనల నడుమ నటనలో
మెరుపులు మెరిసినదే గగనం

ఎక్కడ వేరే వస్తువు లేదో అక్కడ ఆకాశం (space) ఉన్నట్టే కదా. ఆ లెక్కన అణువుకూ అణువుకూ మధ్యలో కూడా ఆకాశం ఉంది, అంటే ఆకాశం అంతటా ఉంది. ఒక ఖాళీ కుండ ఉంది అనుకోండి. ఆ కుండలో కూడా ఆకాశం ఉంది. ఆ లోపలి ఆకాశం, బయటన ఉన్న ఆకాశం ఒకటేనా? జరిగేవాటితో, జరగనివాటితో ప్రపంచం నడుస్తుండగా ఉన్నట్టుండి మెరుపులు మెరుస్తున్నాయి - అవి ఏ ఆకాశానివి? కుండ బయట ఉన్న ఆకాశానివా? అది కాక మరొక ఆకాశం ఉందా? ఇదంతా కవి ఆలోచిస్తున్నాడు.

ఈ పాట చరణాలన్నిటిలోనూ నాకు అత్యంత ఇష్టమైన చరణం ఇదే. వేదాంతంలో ఘటాకాశ దృష్టాంతం (ఉదాహరణ) అని చెప్తారు. ఆకాశం అంతటా ఉంది. కుండ (ఘటము) లోపలా ఉంది, బయటా ఉంది. కుండ ఉన్నంత కాలం లోపల ఉన్న ఆకాశం (ఘటాకాశం) వేరుగా, బయట ఉన్నది (మహాకాశం) వేరుగా అనిపిస్తాయి. ఒక సారి ఘటం ముక్కలైపోతే మిగిలేది మహాకాశమే. ఇక్కడ ఆకాశం ప్రజ్ఞానానికి (బ్రహ్మానికి) ప్రతీక. ఒక్కటే ప్రజ్ఞానం అఖండంగా ఉంది. అజ్ఞానమనే మట్టితో కొన్ని కుండలు (జీవాత్మలు) ఏర్పడ్డాయి. ఆ అజ్ఞానపు ఆవరణ వలన "నేను వేరు, బయట వేరు" అనే భావన జీవాత్మలకు కలుగుతోంది. ఆవరణ లోపల ఉన్నది మాత్రమే "నేను" అనే భ్రమ జీవాత్మ అయ్యింది. ఆవరణ లోంచి బయటకు చూస్తే ప్రజ్ఞానమే చిత్రవిచిత్రంగా విక్షేపం (projected) అయ్యి ప్రపంచంగా కనిపిస్తోంది. ఒక సారి ఆ అజ్ఞానం ఛిన్నమైపోతే జీవుడూ, ప్రపంచం, బ్రహ్మమూ అంతా ఒకటే అని గోచరిస్తుంది.

ఒక వేదిక పైన ఇద్దరు మనుషుల సంభాషణ హేతుబద్ధంగా ఉండవచ్చును, నిజం అనిపించవచ్చును. ఒక్క సారి హేతుబద్ధంగా జరగవలసింది జరగకపోతే అది రంగస్థలం అని, వారిది నటన అని మనకు అనుమానం వస్తుంది. అలాగే, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికీ భౌతికంగా ప్రత్యక్షహేతువు (rationale) గోచరిస్తోంది. కానీ ఏ ఒక్క విషయాన్ని పరిపూర్ణంగా నిర్దేశించడం కుదరదు. ఒక్కోసారి పరిపూర్ణ ప్రయత్నానికి ప్రతిఫలం రాకపోతే మనం చేసేది కూడా నటన ఏమో అనిపిస్తుంది. ఈ నటన మనం చేస్తుంటే, ప్రపంచాన్ని అనుకోని మలుపులు (మెరుపులు) తిప్పుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు వేదాంతం ఇచ్చే సమాధానం ఈశ్వరుడు (సగుణ బ్రహ్మం). మామూలుగా బ్రహ్మానికి గుణాలు ఉండవు. ఉదాహరణకు బ్రహ్మం ఏ రంగులో ఉంటుంది అంటే, దానికి సమాధానం - "బ్రహ్మానికి రంగు లేదు" అని. బ్రహ్మానికి నిర్వచనం సత్ (ఎప్పటికీ ఉండేది, మారనిది), చిత్ ("నేను ఉన్నాను" అనే స్ఫురణ), (అనంతమైన) ఆనందం. మరి సగుణ బ్రహ్మం ఎవరు? అజ్ఞానం జీవాత్మకు ప్రపంచంతో పాటు, ఈశ్వరుడు అనే పాలకుణ్ణి చూపిస్తోంది. ఆ పాలకుడి దగ్గర "మాయ" అనే శక్తిని కూడా ఉందని చూపిస్తోంది. ఈ సగుణ బ్రహ్మాన్ని ఒక్కో జీవి (తన వాసనలను బట్టి) ఒక్కో లాగా చూస్తాడు. మాయ ఒకడికి శివుడిగా, మరొకడికి విష్ణువుగా, ఇంకొకడికి అమ్మవారిగా అనిపిస్తుంది. సగుణ బ్రహ్మానికి జీవాత్మ దృష్టిలో గుణాలు ఉంటాయి. నిజానికి - జీవాత్మ, ప్రపంచం, ఈశ్వరుడు అన్నీ ఒక్కటే - ప్రజ్ఞానం (బ్రహ్మం).

పంచభూతముల పంజరశుకమై
అలమట జెందిన నేనెవరో
ఏడు కొండలా ఎత్తున నిలిచి
బదులే పలుకని నీవెవరో!
ఇంతకు నాకు నీవెవరో!

చరమచరణంలో జీవుడు (కవి) తనకూ ఈశ్వరుడికీ ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు. వేదాంతానికి పునాది అయిన ఈ ప్రశ్నను ఇక్కడ లేవనెత్తాడు. ప్రతి ముముక్షువు (మోక్షాన్ని కాంక్షించేవాడు) "పంచభూతాలతో చేసిన పంజరం (దేహం) లో చిక్కుకున్న చిలుకను నేను, పంజరం నుండి పంజరానికి మారుతూ దుఃఖపడుతున్నాను, నాకు శాంతి కావాలి!" అనే అనుకుంటాడు. జీవుడు ఎంత వేదన పడుతున్నా, ఏడు కొండలపైన ఉన్న వేంకటేశ్వరుడు (ఈశ్వరుడు) బదులు చెప్పట్లేదు. ఎందుకంటే ఈశ్వరుడిని గుర్తించాలంటే బయట కాదు, లోపల వెతకాలి. నిజమైన భగవదుపదేశం మౌనంలోనే ఉంది. అందుకేనేమో ఇదే album లో మరొక పాటలో వేటూరి "మౌనమైన నీ జ్ఞానబోధలే కానక నివురున కలిసితిని" అన్నారు.




§ ఈ చరణంలో ఆఖరి రెండు పంక్తులకు చాలా అన్వయాలు గోచరించాయి. కొంచం సులభంగా అన్వయించుకోవాలి అంటే “సాక్షాత్తు ఆ ఈశ్వరుడే కృష్ణపరమాత్ముడై వేదాన్ని నాదంగా ఊదాడు. అప్పుడు ఆయనకు ఊపిరి అయ్యి, వేణువులో రాగజీవాన్ని పోసినది కూడా ఈ గాలే,” అని అనుకోవచ్చును. కానీ, “వేణువులు” అని బహువచనం ఉపయోగించడం, గతంలో వేటూరి "జీవన వేణువులూదగా" అని ప్రయోగించడం కారణంగా ఇలాగ అన్వయించాలి అనిపించింది.

ప్రాణానికి, మనసుకు అవినాభావ (ఒకటి లేక మరొకటి లేదు) సంబంధం  ఉంది అని శాస్త్రం. అందుకే యోగులు, సాధకులు ప్రాణాయామం చేసి ఊపిరిని అదుపులో పెట్టుకుని, తద్ద్వారా మనసును అదుపులో ఉంచుకుంటారు.

అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం" అన్నారు.