Thursday, March 3, 2011

శివరాత్రి సందర్భంగా పద్యాలు

శివరాత్రి గురించి బహుశః పాఠకులందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను పనికట్టుకుని కొత్తగా చెప్పేది ఏముంది?  శివతత్త్వం ఒక్క మాటలో చెప్పాలంటే "ప్రాణులన్నింటినీ ప్రేమించడం. అహాన్ని జయించడం." -- అంతే.  భగవంతుని కృప చేత మనందరిలోనూ దాగున్న అరిషడ్వర్గాలు నశించాలని ఆశిస్తున్నాను. ఇదే విషయాన్ని పద్యాల రూపంలో ఉంచాను. తప్పులేమైనా కనబడితే సవరించగలరని ప్రార్థన.

ఉ:-
ధ్యానములోనిమగ్నమయి ధారుణిలో మను పాపకర్ములన్
కానకనుంటివో? తగదు! కాదిది ధర్మము నీలకంధరా!
ఆనక నేత్రముల్ దెరువ అంధము రాజ్యము జేయుఁభూమిపై
మానవజాతి దానవుల మారణహోమపు యజ్ఞధేనువై

భా:-
శివా! ధ్యానంలో ఉండిపోయి భూమిపైనున్న పాపులను చూడటం మానేశావా? ఇది నీకు ధర్మం కాదు. నువ్వు కొంచెం ఆలస్యం చేసి కళ్ళు తెరచినా ఇక్కడ మిగిలేది - మానవరూపరాక్షసుల మారణహోమానికి దేవతైన అంధకారం మాత్రమే.

మ:-
తలపై శీతలగంగ భూతలముపై తానెట్టి దౌర్భాగ్యమున్
గలదై నిత్యము శోకసాగరములో గాసిల్లి వేసారెనో
తెలుపన్ చూడదె? ఆమె బాధ గనవా? తీర్చంగ సర్వేశ్వరా!
తలమే ఆమెను ఏపరించు తెగులై తారాడు కాలుష్యమున్

భా:-
నీ తలపైన ఉన్న గంగ తను భూమిపై ఎంత దౌర్భాగ్యానికి లోనౌతోందో, శోకసాగరంలో తపిస్తోందో (అన్ని నదులు సాగరంలో కలిస్తే గంగ శోకసాగరంలో కలుస్తోంది) చెప్పలేదా? భార్య బాధను చూసి ఆమెను వేధిస్తున్న కాలుష్యం అనే రోగాన్ని నువ్వు నయం చెయ్యలేవా?

శా:-
కైలాసంబున కాపురంబదెటులో కాశ్మీరు యుద్ధాలతో?
కాలాకారుడవంచు వేదములలో కైవారముంజేసిరే?
కాలే జీవుల సాక్షిగానెఱుగుమా కాదంచునీ సత్యమున్
కాలేవయ్య నవీనమానవతకున్ కాసింత పోటీ హరా!

భా:-
కాశ్మీర్లో నిత్యం యుద్ధాలు జరుగుతుంటే కైలాసంలో నువ్వు కాపురమెలాగ ఉంటున్నావయ్యా? ఐనా వేదాలలో నిన్ను కాలరూపుడు (మృత్యురూపుడు) అన్నారు కానీ మా మానవజాతి సృష్టిస్తున్న విధ్వంసం సాక్షిగా తెలుసుకోవయ్యా - నువ్వు మాకు ఏ మాత్రం పోటే రాలేవు.

కం:-
అవలక్షణదాసులగుచు
అవధులునెఱుగక యెగబడి యావజ్జనులున్
అవనిని నాశము జేసిరి
శివునాజ్ఞకు భయము లేదు చీమలకైనన్

భా:-
మనుషులు ధర్మాన్ని విడచి ఎవరికి నచ్చినట్టు వారి ఈ భూమిని నాశనం చేస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేక చీమైనా కదలదంటారు కానీ, నిజానికి ఈ ప్రపంచంలో చీమకు కూడా నీ ఆజ్ఞపైన గౌరవం లేదు.

సీ:-
సాగరాల తుదల సంగతులేలయ్య? నగరంబు నరకమై నలిగె గోవు
పచ్చగడ్డిని మేసి పాలిచ్చు గోమాతరొమ్ము చీల్చి రుధిరమమ్ముకొనుచు
వాలము చేబట్టి వైతరణినిఁద్రోయ, తనయాడపడుచుల తాపమెఱిగి
ధరణిపై జరిగేటి దారుణాలను నీకు వర్ణించి చెప్పడే వృషభరాజు?

భా:-
"చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు" అంటారు కదా? ఆ సాగరాల చివరిదాక ఎందుకు పట్టణాలే గోవులకు నరకమైపోతున్నాయి. ఎవ్వరూ ఆశించని గడ్డిని తీసుకొని కమ్మని పాలనిచ్చే ఆ గోమాతని హింసించి ఆమె రొమ్ము చీల్చుకుని మరీ రక్తంతో కూడిన పాలను అమ్ముకునేటువంటి మనుషులు తయారయ్యారు. ఆవు తోక పట్టుకుని వైతరణి దాటడం కాదు, బ్రతికున్న ఆవునే తోకతో లాగి వైతరణిలోకి తోసేస్తున్న దుఃస్థితి ఇది. తన ఆడపడుచుల కష్టం చూసి నందీశ్వరుడైనా నీకు మానవుల దౌష్ట్యాన్ని గురించి చెప్పలేదా?

ఆ:-
భూమి చాలదంచు వ్యోమయానముఁ జేసి
చందమామ తలమునందుకొనిరి
తనకు భూమి స్థితియె తప్పదేమోనంచు
విధువు చేయలేద విన్నపములు?

భా:-
భూమి చాల్లేదని చివరకు చంద్రమండలం మీద కూడా జెండా పాతాము. తనకు కూడా భూమి స్థితే పట్టి కాలుష్యంతో, దుష్టులతో నిండిపోతాడేమోనని భయపడి చంద్రుడు నిన్ను ఏమీ అడగలేదా?

చం:-
గరళము త్రాగి దేవతలఁ గాసితివందురు సత్యమా శివా?
మరణము లెక్కజేయక ప్రమాదముఁదెచ్చెడి రాక్షసాళికిన్
వరములనిచ్చు దానగుణవంతుడవందురు నమ్మవచ్చునా?
కరుణకు రూపమన్న నుడి కల్పన కాదుగ, శైలమందిరా?

భా:-
విషం తాగి దేవతలను కాశావు అంటారు? మరణాన్ని సైతం లెక్కచేయకుండా రాక్షసులకు వరాలిచ్చిన దానవీరుడవంటారు? కరుణకు నీవు నిలువెత్తు రూపం అంటారు. ఇవన్నీ నిజమేనా? లేక మా అపోహలా?

శా:-
బోళాశంకరుడన్న మాట రుజువై, భూమాత హర్షించగన్!
కైలాసంబున ధ్యానయోగతపముల్ కాసేపు చాలించుమా
మా లోకంబున ధర్మరక్షకుడవై మాలిన్యమున్ తెంచుమా
నీలో పేర్మిని మానవాళి మఱగన్ నేర్పించఁ రా దైవమా!

భా:-
ఇవన్నీ నిజమని, నువ్వు బోళామనిషివి అని రుజువయ్యే లాగా -- భూమాత ఆనందించేలాగా కొన్నాళ్ళు కైలాసంలో ధ్యానం మాని మా లోకంలో ధర్మాన్ని రక్షించు. నీలో ఉన్న గొప్ప గుణాలన్నీ మానవజాతికి మప్పు.