Sunday, June 21, 2015

సియాటల్ లో మన్మథ నామ నూతన సంవత్సర యుగాది కవి సమ్మేళణం

2014 ఉగాదికి సియాటల్ లో జరిగిన కవి సమ్మేళణానికి మంచి ప్రతిస్పందన లభించింది. ఆ స్ఫూర్తితో ఈ సారి కూడా జరుపుదామనుకున్నాము. ఈ సారి శ్రీరామ నవమి, ఉగాది కలిపి జరపాలని "మన సంస్కృతి" సంస్థ నిర్ణయించింది. శ్రీ సీతారాముల కల్యాణం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగింది. కొంచం ఆలస్యం అవ్వడంతో కవి సమ్మేళణానికి సమయం లేకపోయింది. అయినప్పటికి ప్రశ్నలను, ప్రోత్సాహాన్ని అందించిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి, కొత్తపాళి గారికి కృతజ్ఞులము. కవిసమ్మేళనానికి గానూ వ్రాసిన పద్యాలలో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సీతా రామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

ఇస్సీ అనే పదం మనకు ప్రస్తుతం వాడుకలో లేదు. ఇస్సీ అంటే "అయ్యో, అక్కట" అనే అర్థంలో వాడతారు(ట). దీన్ని చాలా అద్భుతంగా పూరించినవారు లంకా సూర్య రవీంద్ర.

నా త్రాణంబును, నాదు బ్రాణములు, నా దార్ఢ్యంబు శ్రీ రాముడే!
నా తండ్రిన్, నన జానకీతనయ నే దావాలకంపింపనే?
నీతిన్ దప్పక నీకు జేసినటి వాగ్ద్విత్వంబు జెల్లింప, నా
సీతారామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

సామాన్యంగా మనం సమస్యను "సీతా! రామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని చదువుతాము. సీతాదేవి రామునికి ద్రోహం ఎప్పుడు చేసిందా అనుకుంటాము. ఐతే పూరకులు దాన్ని "సీతారామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని అర్థం వచ్చేలాగా వ్రాసారు. పై పద్యంలో భావం: దశరథుడు కైకేయతో "నా మాటను నెపంగా పెట్టుకుని నా సర్వస్వమైన సీతారాముణ్ణి, సీతని అడవులకు పంపించి అతనికి ద్రోహం చేస్తావా?" అని అంటున్నాడట.

మారా మారాము మానుమా రామునితో

ఇది సులభమైనదే. మన్మథుడు రామునితో మారాం చేస్తున్నాడట. దీనికి పూరణ:

శారదమయ ఘనచంద్రిక
తారావళి తోడ గూడి తాపము బెంచన్,
భారమె, సీతా విరహము!
మారా! మారాము మాను మా రామునితో!

సీత అశోకవనంలో ఉన్నప్పుడు రాముడు విరహంతో బాధపడుతున్న విషయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు బులుసు మల్లిక్. ఐతే వసంతంలో సీతారాములు వేఱ్వేఱు చోట్లలో ఉన్నారు అని ఆధారమేమిటి? కిష్కింధ కాండలో దీనికి ఆధారాలు ఉన్నాయి.

దత్తపది: బీర, వంగ, కంద, కాకర - ఉగాది పచ్చడి

ఇది పరిపరి విధాలుగా ఆలోచించాను. పెద్ద పెద్ద పద్యాలు వ్రాసి కిట్టించవచ్చునేమో కానీ, నాకు చిన్న పద్యం వ్రాస్తేనే శ్రోతలకు కాస్త ఆసక్తి ఉంటుంది అనిపించి చివరకు నన్ను ఆదరించిన కందాన్ని ఆశ్రయించాను.

మనసు కందనీక మనియేమి ఫలితంబు
బీరముండ కుండ పేలవంగ
మలగమంది చూడు మనుగాది పచ్చడి
రాతి రీతి కాక రసమయంగ

ఎప్పుడూ సుఖాన్ని (తీపిని) మాత్రమే కోఱుకుంటూ వెళ్ళకుండా కాస్త నాలుగు రుచులూ చూడమని ఉగాది పచ్చడి సందేశం అని భావం. ఉదాహరణకు చిన్నతనంలో చెయ్యాలనుకుని చెయ్యలేని పని ఇప్పుడూ చెయ్యడం పులుపు. వ్యాయామం చెయ్యడం చేదు. ఇలాగ ఆరు రుచులూ కలిస్తేనే జీవితం రసమయం అవుతుంది. లేకపోతే రాయి లాగ బ్రతుకుతున్నట్టే.


దత్తపది: మలైక, సన్నీ, కరీన, ప్రియాంక - మన్మథవత్సరానికి స్వాగతం

ఇది కొంచం కష్టమైనదే. అన్నీ అందమైన అమ్మాయిల పేర్లతో మన్మథ నామ సంవత్సరానికి స్వాగతం పలకాలి. కానీ ఎక్కడా అసభ్యత కనిపించకూడదు. ఇది పూరించడంలో బులుసు మల్లిక్ గారు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

వచ్చెను మన్మథుండు నవవత్సరమై - విమలైకదృశ్యమై
విచ్చెను పద్మినుల్ గుబురు వెన్నెల వోలిన సన్నివేశమై
నచ్చిన శాంకరీ నగవు నాచిన మోహన పుష్పధన్వి తా
తెచ్చెను రాగదీపికల తేనియలొల్కెడి విష్ణుసూనుడున్

ఇందులో భావం: "మన్మథుడు ఒక సంవత్సరంగా వచ్చాడు. దానితో ఎంతో అందమైన దృశ్యం ఏర్పడింది. తామరపువ్వులు గుబురుగా ఏర్పడి వెన్నెల విరిసినట్టు ఉన్నాయి. ఆ పరమేశ్వరి తేనెలొలికే నవ్వును దోచుకుని మన్మథుడు సౌందర్యదీపికలను తీసుకుని వచ్చాడు." అని. అమ్మవారి నవ్వు మన్మథుడు దోచుకోవడం ఏమిటి అంటే సౌందర్యలహరిలో దీనికి సంకేతంగా ఒక శ్లోకం (86 వ ది) ఉంది.

దత్తపది: రంభ, మేనక, ఘృతాచి, మనోరమ - సీతారామ కల్యాణం

అప్సరసల పేర్లతో సీతారామ కల్యాణం వర్ణించమన్నారు. వీళ్ళందరూ వచ్చి సీతమ్మ అందాన్ని చూచి చిన్నబోయారనో, దంపతులను చూచి సంతోషించారనో పూరించవచ్చును. అప్పుడు పృచ్ఛకుని శ్రమను అవమానించినట్టు అవుతుంది. అందుకని మంచి స్ఫూర్తితో పూరించడం జరిగింది. ఘృతాచి ఒక అప్సరస. అదే పదానికి "ఆజ్యాన్ని (నెయ్యిని) హోమాగ్నిలో పోసే గరిటె" అని కూడా అర్థం ఉంది. అది ఆధారంగా దొరికింది. అందుకని ఇలాగ పూరించాను.

అనలం రేగె ఘృతాచి నుండి పడగా ఆజ్యంబు, ఆ రీతినే
ఇనవంశీయుని సొంపు మేనఁ కళలున్, హెచ్చయ్యె సీతమ్మఁవా 
కొనచూపుల్ పడగా మనోరమముగా, కోలాహలంబంతటా
కనువారందరి సంబరం భళి భళీ గానాలుఁ, కేరింతలై

(శ్రీ సీతారాముల కల్యాణంలో జరుగుతున్న హోమంలో) ఘృతాచి నుండి పడిన నెయ్యి తగిలి అగ్ని రేగింది. అలాగనే సీతమ్మ కొనచూపులు పడి శ్రీరాముడి ఒంటి వెలుగు కూడా హెచ్చైందిట. ఇది చూసినవారందరి కబుర్లు, కేరింతలూ చేరి అంతటా కోలాహలంగా ఉందిట.

భైరవభట్ల కామేశ్వర రావు, బులుసు మల్లిక్, లంకా సూర్య రవీంద్ర గార్లకు కృతజ్ఞలు.