Saturday, August 2, 2014

చిల్లుగొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

పండితులు, పీఠాధిపతులు, మహర్షులు కూడా తల్లిని గౌరవిస్తారు. ఏమిటి చూసుకుని మనబోటిగాళ్ళం తల్లిదండ్రులను అగౌరవపరుస్తామో అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా, మనం వాళ్ళని ఎన్ని సార్లు క్షమాపణం అడిగినా, మనసులో పశ్చాత్తాపం పోదు. అలాగని మళ్ళీ తప్పు చెయ్యకుండా కూడా ఉండము. అదే ఆలోచిస్తూ ఇవి వ్రాసాను.

నరక బాధకోర్చి మరణాన్ని దాటొచ్చి
పేగు తెంచి నాకు ప్రేమ పంచి
పెంచినాక నిన్ను వంచించినానొకొ
పంచనుండి కనక మంచి చెడుల

పాలుఁ గుడిపినావు పంటిగాటులకోర్చి
తగని వాడఁ నీదు త్యాగములకు
మెత్త గుండె ఒత్తు నెత్తురంతయి త్రాగి
తక్కువంచు తలచు రక్కసుడను

నెలల బాలుడపుడు మలమూత్రములఁ నీదు
వొంటి మీద విడిన చంటి పాప
పాలతోటి నీదు పాదములఁ గడుగక
పలుచనైన మాట పలికె నేడు

నడుమునొంచి నాకు నడక నేర్పిన నీవు
నడుము వొంగి కాస్త నలత చెంద
గడువు లేదటంచు కాళ్ళు పట్టనె, చిల్లు
గొడుగు మేలు యిట్టి కొడుకు కన్న

Wednesday, July 23, 2014

సరస్వతీ స్తుతి

ఈ రోజు ఏకాదశి అని కాసేపు కూర్చుని దైవచింతన చేద్దామని, శారదా దేవి గురించి కొన్ని పద్యాలు వ్రాసాను.పద్యరచన చేసి చాలా రోజులైంది. తప్పులుంటే చదువర్లు సరిచేయగలరు అని మనవి.

నిముషంబైనను చిక్కదే దినమునన్ నీ దివ్యరూపంబు, హే
విమలా! చిత్తమునందుఁ దల్చి రుచిగా గానంబుఁ గావించగన్
విమలాలై విలసిల్లు నీ గుణములన్, వేదాంత సందీపనీ!
క్షమియింపమ్మ, కృపాసముద్రహృదయా! కారుణ్య భావమ్మునన్

భ్రమలో చిక్కితి నీదు భిక్షయిన నా ప్రావిణ్యతన్ క్రొవ్వునన్
శ్రమతో పొందితినంచు తల్తునొకొ నా శౌర్యంబదే పాటిదో
గమనించన్ చననీదవిద్య, జననీ! జ్ఞానాగ్నితేజోమయీ!
తమముంద్రుంచవె మాయ వైదొలగి నీ ధామంబుఁ నేఁ జేరగన్

విలువేమున్నది వేల సంపదకు నే వేదాంతముందెల్వకన్
తెలివేమున్నది వేదశాస్త్రములలో దీనుల్ని చేపట్టకన్
బలమేమున్నది రాజస్నేహములలో వైరాగ్యమేతెంచకన్
మలగన్ కోర్కెలు నీ యనుజ్ఞనిడుమా మాయాత్మికా, యీశ్వరీ!

Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

Wednesday, January 29, 2014

వేటూరి పుట్టినరోజు


ఈ రోజు వేటూరి పుట్టినరోజు. దాదాపు మూడేళ్ళ క్రితం ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట వ్రాసాను. అందులో నాకు సంతృప్తిని ఇచ్చిన పంక్తి ఒకటుంది: మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట. ఇది వేటూరి గురించి నా అభిప్రాయాన్ని సూక్ష్మంగా చెప్తుంది. మనసు ఒక డబ్బా కాదు: ఒక డొల్ల, లోపల సరుకు ఉండటానికి. దానికి పొరలు ఉంటాయి. సరదాలు, కోఱికలు, పద్ధతులు, ఇష్టాలు, అనుబంధాలు, ఇలా. వేటూరి పాట ఈ పొరలన్నిటినీ దాటి ఆత్మీయమైంది - అంటే నా వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయింది. వేటూరి పాట ప్రతి రోజూ పనిఁగట్టుకుని వినకపోవచ్చును. కానీ, ఏదో పని చేస్తున్నప్పుడు ఒక మారు స్ఫురిస్తుంది. అది ఎప్పుడు స్ఫురిస్తుందో తెలియదు, కానీ స్ఫురించినప్పుడు పులకరం కలుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో రూపంలో వస్తుంది, ఒక్కో రసం ఒలికిస్తుంది. అదొక దోబూచులాట.

జీవితంలో ఒక్క సారి కూడా కలవని మనిషి, ఎటువంటి ఋణం లేని మనిషి, అన్నో ఇన్నో లోపాలు ఉన్న మనిషి, ఒక రకంగా చెప్పాలంటే "ఎవరో". అలాంటిది తెలుగుని ప్రేమించే ప్రతివాడికీ ఆయన అంటే కొద్దో గొప్పో గౌరవం ఉంది. ఎందుకు? ఆయన పాటల్లో ఏదో ఒకటి మహబాగా నచ్చేసి "ఈ పాట ఈయన తప్పితే ఎవరూ ఇంత బాగా వ్రాసి ఉండరేమో!" అని అనిపించి ఉంటుంది. ఒక ఎనిమిదేళ్ళ అతితెలివి కుఱ్ఱాడు homework చేస్తూ లెక్కకు సమాధానం చూసి గుణించాలో, భాగించాలో అంచనా వేసి సమాధానం వ్రాస్తాడు. అలాగే ఒక్కో సారి వేటూరి భావం అనేసుకుని పదాలను ఇరికించడం, పదాలను అనేసుకుని భావాన్ని కిట్టించడం చేసారు. ఒక్కో రోజు అసలు తెలివి ఖర్చు ఎందుకు అనుకుని వేఱే section లో వాడి దగ్గర home-work copy కొట్టి వ్రాసేస్తాడు. అలాగే వేటూరి కొన్ని అన్యభాషాగీతాలను యథాతథంగా అనువ"దించారు". పన్నెండేళ్ళొచ్చాక Social Studies పరీక్ష అంటే ఏదో ఒక లాగ రెండు pages జవాబు వ్రాయాలి అని అర్థం పర్థం లేని వాక్యాలను వ్రాసేస్తూ ఉంటాడు. కొన్ని వేటూరి పాటలలో భావం కాదు అసలు అర్థమే లేదేమో అనిపిస్తుంది. పదిహేను ఏళ్ళు వచ్చినా తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన తమ్ముడూ, వాడి స్నేహితులతో cricket ఆడుతూ ఉంటాడు. వేటూరికి కవిత్వపరిపక్వత ఉన్నా చిలిపి పాటలూ, సరదా పాటలూ వ్రాసారు. ఇరవై ఏళ్ళొచ్చాక ఏవో రెండు వాక్యాల చివరన ప్రాస కలిపేసి "నేను కవిని" అంటూ ఉంటాడు. వేటూరి కేవలం ప్రాస కోసం వ్రాసిన పంక్తులు ఎన్నో ఉన్నాయి. పాతికేళ్ళకు పక్కన పెళ్ళం ఉండగా ఎదుట పడిన అమ్మాయిని చూసి ఒక్క సారైనా "అబ్బా" అనుకుంటాడు. వేటూరి భావాన్ని పక్కన పడేసి సుస్పష్టంగా వ్రాసిన బూతుపాటలూ ఉన్నాయి.

ఈ దశలన్నీ దాదాపు అందరూ తమ తమ జీవితాలలో చూసినవే. మనకు అత్యంత సన్నిహితుడు ఇవన్నీ చేసి ఉండవచ్చును. అయినా మనకు అవసరమైనప్పుడు లోతైన అనుభవంతో ఒక సలహా ఇచ్చినా, బాధలో ఉన్నప్పుడు ఓదార్చే ఒక మాట మాట్లాడినా, మన మనసులో ఉన్నప్పటికీ మాటల్లో చెప్పలేని భావాన్ని పసిగట్టి తన మాటల్లో అందంగా చెప్పినా, మనం ఆరాధించే విషయాన్ని తనూ అంతే ఇష్టంతో ఆరాధించినా, ఆ వ్యక్తి మనకు సన్నిహితుడే. అదే విధంగా వేటూరి తెలుగువారికి సన్నిహితులయ్యారు. ఆయన వ్రాసిన ప్రతి పాటా ఆణిముత్యం కాకపోవచ్చును. కానీ కొన్ని పాటలు వెల కట్టలేని అమరమైన నేస్తాలు. ఆ పాటలు తెలుగు సంస్కృతి ఉన్నంత వరకూ ప్రచారంలో ఉండాలని, ఆయన మళ్ళీ తెలుగువాడిగా పుట్టి గొప్ప సాహిత్యాన్ని అందించాలనీ కోఱుకుంటున్నాను.