Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (3)

"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా వ్రాసారని ఆయనకు అనిపించిందేమో.

ఇక ప్రణయం, శృంగారం సందర్భంగా వేటూరి వ్రాసిన వానపాటలను చూద్దాము. ఇలాంటి పాటలు వేటూరి బోలెడు వ్రాసారు. ఒక్కో పాటకు శృంగారం పాళ్ళు ఒక్కోలా ఉంటాయి. కొన్ని పాటలలో వాక్యాలు ఇక్కడ వ్రాయడానికి కూడా ఇబ్బందిపెట్టేవి ఉన్నాయన్నమాట వాస్తవమే. అందుకని చర్చించే పాటలను శృంగారం మోతాదుని బట్టి వరుసపరిచాను.


వేటూరి వానపాటల్లో బహుశా అన్నింటికంటే ప్రజాదరణ పొందిన classic కే.వీ.మహాదేవన్ స్వరపరిచినది. ఇది కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "వేటగాడు" చిత్రంలో "ఆకు చాటు పిందె తడిసే" అనే పాట. పాట చిత్రీకరణ ఎంత శృంగారసూచకంగా ఉందో భావం అంత సున్నితంగా ఉంది అని నా అభిప్రాయం.
ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే
పురుషుడు సౌందర్యాన్ని గురించి ఆలోచించడం, స్త్రీ భావావేశాన్ని గురించి ఆలోచించడం రివాజు. అందుకేనేమో పల్లవిలో నాయకుడు ఆ వనపరిసరంలోని పిందెలతో, పూవులతో అమ్మాయిని పోలుస్తుంటే, అమ్మాయి తన మనసులో గుట్టుగా ఉన్న భావాలను గురించి చెప్తోంది.
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడ లాగా నవ్వుతుంటే
ఈ చరణంలో చినుకును ఊతగా పట్టుకుని అమ్మాయిని వర్ణిస్తున్నారు. ఒక చినుకు అమ్మాయిని తాకి ఆ మెరుపు పూసుకుని ముత్యంలాగా మెరిసిపోతోందట. మంచి భావుకత మాత్రమే కాదు అది వ్యక్తపరచడానికి పదాలపై పట్టూ ఉండాలి. వేటూరి వీలైనంతవరకు పదాల మధ్యన యతి కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ముద్దిచ్చి, ముత్యం; చిగురాకు, సిరిమువ్వ; తాకి, డియారు గమనించండి. అలాగ వ్రాసిన పంక్తులు నాలుకపైన సులువుగా ఆడుతాయి.
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
నాయకుడు చినుకు గురించి చెప్తుంటే, నాయిక మెరుపు గురించి చెప్తోంది. మొదటి పంక్తిలో మెరుపు ఆమె చూపుల్లో తనపై ఉన్న ఆకర్షణకు చిహ్నం అని అనిపిస్తోంది. అలాగ జరుగుతుంటే ఆమె మనసులో ఒక కోఱిక మఱొక మెరుపైందట. ఇంతలో అబ్బాయి చూపు మఱొక మెరుపు, నవ్వు మఱొక మెరుపు అయ్యి అంతటా మెరుపులే కనిపిస్తున్నాయట.
నీ పాట విని మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి,
చలిని పెంచి, చెలిమి పంచి, తలలు వెచ్చంగా తడియార్చుకోవాలి
నాయిక పాటకు వర్షం మరింతగా పెరిగితే, ఆమె తన ఒళ్ళు జలదరించడంలో ఉన్న సోయగాన్ని అతడికి ముడుపు చెల్లించుకోవాలట. అది వారి నడుమ ప్రణయాన్ని బలపర్చి, వారిద్దరూ దగ్గరవ్వాలని అతడి కోఱిక. ఈ పంక్తిలో నాకు నచ్చింది "నీ విరుపులు ముడుపులిచ్చి" అనడంలో శృంగారమే కాక సౌందర్యం కూడా చాలా ఉందని నా అభిప్రాయం.


"కేక" చిత్రంలో చక్రి స్వరపరచిన పాటను చూద్దాము. ఒక యువకుడు, ఒక యువతి వానలో ఉన్నారు. పెద్దగా పరిచయం లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చి line వేస్తున్నాడు. ఈ సందర్భంలో శృంగారానికి ఎక్కువ తావు లేదు. అబ్బాయి అమ్మాయిని పదే పదే తమ మధ్యన కలిగిన ప్రణయభావాన్ని బయటపెట్టమన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయి దానికి ఇంకా సమయం రాలేదన్నట్టు చెప్తుంది.
అ: మెరిసే మేఘం కురిసేదెప్పుడో
ఆ: కురిసే వర్షం వెలిసేటప్పుడే

అ: ముసురుకున్నది ఏదో చిలిపి కోరిక
ఆ: ముదరనివ్వకు కథలే చాలు చాలిక
వర్షం కురియాల్సినప్పుడు కురుస్తుంది కానీ, అడిగితే కురవదు కదా. అలాగే వలపు కూడా అంతేనని ఆమె భావం.
అ: మెరిసే తొలకరిలో నిను కనులారా చూసా
ఆ: చలిలో గిలిగిలిలో కొసమెరుపులు ఆరేసా
అబ్బాయి వానలో అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నానని చెప్తుంటే తను చూపించింది కేవలం కొసమెరుపులు మాత్రమేనని అమ్మాయి చమత్కరించింది. అంటే ఆ వాన స్వయంగా అందంగా ఉంటే దానికి చిగురున అమ్మాయి మరింత మెరుపు అద్దిందని అయి ఉండవచ్చును, లేక అమ్మాయి అందం తను ఇంకా కొస మాత్రమే చూసాడని అయి ఉండవచ్చును. బహుశా ఆయన శ్లేషనే ఉద్దేశించి ఉండవచ్చును. వేటూరి పాటకు "ఇదే" భావం అని ఆయన తప్పితే వేఱెవరూ చెప్పలేము.
అ: ముసిరే గాలివానలలో ముదిరే ముద్దుపిలుపులలో
ఆ: తడిసే వానచినుకులలో పడకు మత్తుకవితలలో
 ఇక్కడ కూడా అబ్బాయి ముందుకు మనసులోని ఆలోచనలకు అమ్మాయి కళ్ళాలను వేస్తోంది. ఇక్కడ ఏడు రంగులను చిలకడం అనే ప్రయోగం నాకు నచ్చింది.
అ: ఆడపిల్ల మాటలే అందమైన మాయలే, అర్థమైతే చాలులే అంతకంత హాయిలే
ఇది వేటూరి ముద్ర. ఆడపిల్ల మాటలు అందమైన మాయ. నిజమే "ఆడువారి మాటలకు అర్థాలు వేఱులే"  అనే ఎప్పుడో పింగళి చెప్పారుగా. ఆ మాటలు నిజంగా అర్థమైతే ఆ మాయ ఎంత లోతు అంతకంతా హాయి కలుగుతుందిట. అద్భుతం. నాలుగు ముక్కలలో అమ్మాయిల మాటల గురించి చెప్పారు.
ఆ: ఉడికే వయసులలో తొలి గిలిగింతల వాన
అ: చినుకే చిటపటగా దరువేసెను మదిలోన
గ్రీష్మమంతా వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షఋతువులో తొలకరి కురుస్తుంది. ఉడికే వయసులు అనడంలో యవ్వనాన్ని గ్రీష్మంగా వర్ణిస్తూ, వలపును వానగా చెప్తున్నారు. "టప్ టప్" అంటూ పడటాన్ని "దరువు" వేయడం అనడం సరదాగా ఉంది.


"ఆఖరి పోరాటం" లో వేటూరి-ఇళయరాజ-బాలు-లతా మంగేష్కర్ కలిసి చేసిన పాటలో రెండు వాక్యాలు అద్భుతంగా కుదిరాయి.. వాటి అర్థం లతా మంగేష్కర్ కి చెప్తే ఆవిడ చాలా సంబరపడి మెచ్చుకున్నారని వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయిలో చెప్పారు. ఆ రెండు వాక్యాలు కూడా వర్షానికి సంబంధించినవే.

ఆషాఢం ఉరుముతుంటే, నీ మెరుపే చిదుముకున్నా
హేమంతం కరుగుతుంటే, నీ అందం కడుగుతున్నా
ఈ పాటలో కూడా ("నిరంతరమూ వసంతములే" పాటలో లాగ) వేటూరి ఋతువులలో ప్రేమికుల భావాలను వర్ణించారు. కాకపోతే ఇందులో శృంగారాన్ని వర్ణించారు. కానీ, ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా వ్రాసారు. ఆషాఢ మాసంలో మేఘాము ఉరుముతుంటే మెరుపు మాత్రం అమ్మాయి ఒంట్లోనుండి వచ్చినట్టు అనిపిస్తోందట, అబ్బాయికి. హేమంతంలో మంచు కరుగుతూ ఉంటే దానితో అతడు ఆమె అందాన్ని కడుగుతున్నాడట. అద్భుతం!


"అడవి దొంగ"లో "వానా వానా వందనం" అనే పాటని చూద్దాము. ఈ పాట అంతా అంత్యప్రాసతో వ్రాసారు. కొన్ని చోట్ల పదాలు ఇరికించినట్టు అనిపించాయి కానీ కనీసం ఆ పదాలు రివాజు పదాలు కాదు. అందుచేత ఎబ్బెట్టుగా లేవు.
చలి పెంచే నీ చక్కదనం, కౌగిట దూరే గాలిగుణం
గాలివానలా కలిసి రేగుతూ కమ్ముకుపోతే యవ్వనం
(అ) మెరుపుని నీలో చూస్తుంటే, (ఆ) ఉరుములు నీలో పుడుతుంటే
వాటేసుకుని తీర్చుకో వానదేవుడి వలపు ఋణం
అమ్మాయిని అబ్బాయిని గాలివానతో పోల్చడం కొత్తగా ఉంది. అబ్బాయిని గంభీరమైన ఉరుముతోనూ, అమ్మాయిని అందమైన మెరుపుతోనూ పోల్చి వాటిని సృష్టించిన వానదేవుడి ఋణం తీర్చుకోవడానికి వాళ్ళు కౌగిలించుకోవాలని కవితాత్మకంగా చెప్పారు. ఇదే పాటలో రెండో చరణంలో అంత చెప్పుకోదగిన అంశాలు కనబడలేదు. ఎంతటి వేటూరైనా ఒక చిత్రంలో వానపాట hit అయిందని ప్రతీ చిత్రంలోనూ వ్రాయమంటే ఇదే జరుగుతుందేమో.


"యముడికి మొగుడు" చిత్రంలో రాజ్-కోటి సంగీతసారధ్యంలో చిరంజీవి, విజయశాంతుల నడుమ సాగే వానపాటలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు చూద్దాము.
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా?
మళ్ళీ అబ్బాయి ఊపిరిని వర్షఋతు గాలులతో, అమ్మాయి వయసుని గ్రీష్మఋతు వేడ్మితో పోల్చారు. ఇందాకటి పోలికకి ఇప్పటికి పదాలన్నీ మారిపోయాయి గమనించారా? అది వేటూరి పదాల గారడీ.
అ: తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తల దాచుకో
అమ్మాయిని వాన నుండి రక్షించడానికి అన్నట్టు అబ్బాయి ఆమెను వాటేసుకున్నాడట. తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నాను అంటే ఎవడు నమ్ముతాడు. ఉన్న విషయాన్ని అబ్బాయి సరదాగా చెప్పడం బాగుంది.
ఆ: వడగట్టేసి బిడియాలనే వొడి చేరాను వాటేసుకో
"డ" అనుప్రాస కోసం, బిడియాలని వదిలిపెట్టడాన్ని "బిడియాలను వడగట్టాను" అని చెప్పారు. ఇలాంటి ప్రయోగాలు లోతైనవి కాకపోవచ్చును. కానీ మామూలు భావాలని మళ్ళీ మళ్ళీ అవే పదాలతో వాడకుండా వేఱుగా చూపించడం చలనచిత్ర కవికి కావలసిన లక్షణం. వేటూరి ఈ పాటల్లో మనకు చూపించింది అదే.


వేటూరి చిరంజీవికి చాలా వాన పాటలు వ్రాసారు అని ఇప్పటికే చదువర్లు గమనించి ఉంటారు. ముచ్చటగా మూడో చిరంజీవి పాట. "అన్నయ్య" చిత్రంలో మణిశర్మ స్వరపరిచినది. వాన పాటలో కొన్ని ఎబ్బెట్టు వాక్యాలుండటం సహజమే కానీ ఇందులో పల్లవిలో మొదటి వాక్యం కొంచెం ఎబ్బెట్టుగా వ్రాసారు. అది పక్కన పెడితే ఇందులో కొత్తగా వాడిన ప్రయోగం ఏమిటంటే ప్రేమకు ప్రాసగా "తేమ"ను వాడారు.
ప్రేమ రాగం, తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మళ్ళీ వేటురికి నచ్చిన ఆషాఢం, మేఘాలు, దేశం, పదాలు వచ్చాయి. కాకపోతే ఇదివరకుటి వరసలో కాదు, ఆ భావంతో కాదు.
ఆషాఢ మాసంలో, నీటి అందాల ముసుగుల్లో
మేఘాలదేశంలో, కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డ ఒంటినిండా ఈడు కుంపట్లు రాజేస్తే
ఆషాఢ మాసం వర్షం ముసుగులో అమ్మాయికి అబ్బాయితో ఏర్పడిన బంధం (మెరుపు ఆకర్షణకు, కలలకు చిహ్నంగా వాడి ఉండవచ్చును)  ఆమెలో దాహాన్ని రేకెత్తించింది (అబ్బాయి వర్షం అన్నమాట).
పూలంగి గొడుగుల్లో నిన్ను బంధించి ఒడుపుల్లో
చిత్రంలో అమ్మాయి దగ్గర గొడుగు లేక అబ్బాయి గొడుగులోకి వస్తుంది. ప్రణయానికి చిహ్నంగా ఆ గొడుగుని పూలంగి గొడుగు అంటున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే గొడుగుకి ప్రాసగా "ఒడుపు" అనడం. అంటే అమ్మాయికి తన మనసులో ఉన్న విషయం తెలియకుండా గొడుగులోకి లాక్కుంటున్నట్టుగా పట్టుకోవడం. ఇలాంటి చమత్కారాలు వేటూరి ప్రత్యేకత.


ఇప్పుడు "బంగారు బుల్లోడు" చిత్రంలో రాజ్-కోటి బాణీ వలన బాగా ప్రజాదరణ పొందిన పాటని చూద్దాము.
అ: స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన
ఆ: సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన
సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వచ్చే వానని స్వాతివాన అంటారు. ఈ సమయంలో నత్తచిప్పలలో పడిన నీరు ముత్యాలుగా మారుతుంది అని ఒక నుడి. అందుకే అబ్బాయి ఒక స్వాతీసాయంత్రం వేళ వాన తనని  "ముత్యమంత ముద్దు" లాగా ముట్టుకుంది అంటున్నాడు. అమ్మాయి వాన గురించి కాక, చీకటి తనలో సిగ్గు కలిపిస్తోంది అంటోంది. వాన పాటల్లో ఈ పల్లవి కొంచెం కొత్తగా అనిపించింది, నచ్చింది.  ఈ పాటలో వేటూరి మెరుపులకు, ఉరుములకు కొత్త అందాలను అద్దారు.
మేనక మెరుపులు, ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
మేనక మెరుపు అనడంలో ఆమె అందాలు అనే అర్థం ఉంది, ఊర్వశి ఉరుములు అనడంలో నాకు లోతైన అర్థమేమీ కనబడట్లేదు. కేవలం యతి కోసం వాడి ఉంటారు. రెండో చరణంలో వేటూరి కొంచెం శృంగారం పాళ్ళని పెంచారు.
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుముల కొమ్మల తొడిమలు వణికే వాన
ఇక్కడ అన్నిటికీ రెండు రెండు అర్థాలు ఉన్నాయి. మనం మామూలు అర్థాన్నే చూద్దాము. పూవులపై తుమ్మెదలు వాలి తేనె పీల్చుకోవడం వలన మిగిలిన మరకలను ఈ వాన కడుగుతోందిట. వాన ధాటికి వాలిపోతున్న తొడిమలు వణుకుతున్నాయట. వాన శృంగారాన్ని సూచిస్తోంది అని పూవులని, తేనెటీగలను అడ్డుపెట్టుకుని చెప్పారు. ఇంక వెతుక్కునవాళ్ళకు వెతుక్కున్నంత.
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
ఇక్కడ వేటూరి చిలిపిదనం నాకు బాగా నచ్చింది. వాన-వల్లప్ప పాటలో లాగానే గొడుగులో గుస-గుసని వర్ణిస్తూ నాలుగు అడుగుల గొడుగులో ఇద్దరు సర్దుకోవడానికి ఇబ్బంది పడటమే వాన (అందుకోసమే వాన) అంటున్నారు.
గాలివాన గుళ్ళోన ముద్దేలే జేగంట
గాలి-వాన వచ్చినప్పుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలంటే జంట దగ్గరవ్వడమే మార్గమనడానికి పై వాక్యం. భావలకోసం కానీ, పదాల కోసం కానీ వేటూరి వెతుక్కోరు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఇది వినగానే, "కేక" చిత్రంలో ఇందాక మనం ప్రస్తావించుకున్న పాటలో "వానదేవుడొచ్చినప్పుడే వయసే మొక్కు తీర్చుకోక తప్పదు. చినుకు తేలు కుట్టినప్పుడే జతగా మంత్రమేసుకోక తప్పదు" అనే పంక్తులు గుర్తొచ్చాయి.


వేటూరి భావాల కంటే, ఆ మాటకొస్తే అర్థం కంటే లయకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్రాసిన పాటలు "అల్లరి అల్లుడు" చిత్రంలో కీరవాణి స్వరపరిచినవి. నాకు గుర్తున్న అన్ని పాటల్లోనూ వేటూరి భావాలకు కొంచెం అన్యాయమే చేసారు. ఇందులో "కమ్మని ఒడి బొమ్మని" అని ఒక వాన పాట ఉంది. అందులో రెండో మూడో వాక్యాలు బాగున్నాయి.
మిడిసిపడకె తొలిసొగసు మొగలిపూరేకా! కస బుస కస కసిగా
పడగ విడిచి విరిపడక పరుచుకున్నాగా పగ వగ ఇదే పదరా
అమ్మాయిని మొగలిపూవుతో పోల్చడం రివాజే. ఈ వాక్యాల్లో వేటూరి శృంగారంలో అబ్బాయి తగువుని, అమ్మాయి తెగువని కొంచెం భిన్నంగా చెప్పారు అని నా అభిప్రాయం.


ఇక చివరిగా వేటూరి వ్రాసిన వానపాటల్లోకల్లా అత్యంత బూతుగా అనిపించిన వాక్యాన్ని చెప్తున్నాను. అసలు ఇది వ్రాయడం నాకు ఇష్టం లేకపోయినా ఎంత బూతునైనా వేటూరి పదాల మాయలో అందంగా కనబడేలాగా చేయగలరు అని చెప్పడానికే వ్రాస్తున్నాను. ఇది "నా అల్లుడు" చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన "పట్టుకో పట్టుకో" అనే పాటలోనుండి.
అందము తడిసిన వేళ, ఆడది ఒక జ్వాల
కూసం విడిచిన వేళ, కుదుపుల ఉయ్యాల
గమనిస్తే రెండు వాక్యాలలోనూ ఆది ప్రాస, అంత్యప్రాస కూడా కలిపారు.

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

వేటూరి - వానపాటలు (1)

ఈవేళ సియాటల్లో వర్షం పడుతోంది. సియాటల్ గురించి తెలియని వాళ్ళు "ఔనా?" అనుకుంటారేమో కానీ సియాటల్ గురించి తెలిసినవాళ్ళు "అందులో పెద్ద విశేషమేముంది?" అనడగుతారు. సియాటల్లో ఏటికి సుమారు అరవై-డబ్భై రోజుల్లో మాత్రమే సూర్యుడు నిరాటంకంగా గగనవీధిలో సంచరిస్తాడు. మిగతా రోజుల్లో మబ్బులూ, వర్షం సహజం. సియాటల్ ని అందరూ ఎప్పుడూ చీకటిగా ఉండే చోటని ఆడిపోసుకుంటారు. కానీ నాకు సియాటల్ బాగా నచ్చింది. నేను ఇళ్ళు వెతికేటప్పుడు కొంచెం వాస్తు చూస్తాను. తత్ఫలితంగానో, కాకతాళీయంగానో ఎప్పుడూ వెలుతురు బాగా వచ్చే ఇళ్ళలోనే ఉన్నాను. సూర్యుడు బయటకు రావాలే కానీ, మళ్ళీ ఇంటికెళ్ళేంత వరకు మా ఇంట్లోకి చూస్తూనే ఉంటాడు. అందుచేత మాకు పగటి వేళలో చీకటి గొడవ లేదు. కాస్త మబ్బుగానో, నెమ్మదిగా చినుకులు పడుతుండగానో, వసారాలో కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు. వెనకటికి నేను నర్శీపట్నం దగ్గర ఉండేటప్పుడు తోటల్లో తరచూ ఇదే చేసేవాళ్ళం.

ఏ విషయం గురించి మాట్లాడినా చివరకు ఆవు వ్యాసం అప్పజెప్పే కుఱ్ఱాడిలాగా, ఎటు తిప్పి ఎటు తిరిగినా నా మనసు గుర్తుచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి వేటూరి. వానకీ వేటూరికి బలమైన సంబంధమే ఉంది. వేటూరి వ్రాసిన వానపాటలు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కొన్ని పాటల్లో భావం ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి సునిశితంగా, మఱో సారి బాహాటంగా ఉంటుంది. విషయం భక్తి ఐనా, బూతైనా పదాలను పట్టుకోవడంలో వేటూరి చాకచక్యం ఏ కవినైనా కవ్విస్తుంది. వానపాటల్లో మరీను.

నాలోని శ్రోతకి వేటూరి ఎన్నో బహుమానాలు (అవే, పాటలు) ఇచ్చాడు కానీ నాలోని కవికి వేటూరి ఇచ్చిన స్ఫూర్తి కంటే, భయమే ఎక్కువ. పదాలను, భావాలను అనర్గళంగా, అనాయాసంగా చెప్పగలిగిన వేటూరిని చూస్తే నాకు "మన వల్ల కాదు బాబు!" అనిపిస్తుంది. ఒక్కోసారి చలనచిత్రాలలో చూపించినట్టు నా అంతరాత్మ ఎదుటపడి వివాహభోజనంబు చిత్రంలో కోట శ్రీనివాస రావు లాగా, "రాస్తే అట్టాంటి పాట రాయలే. బాలీ, నీ లెక్క ఔలా పాట రాస్తాడనుకున్నావ్రా?" అంటుంది.

సియాటల్లో వరుసవానల పుణ్యమా అని నాకు ఏ రోజు మానసిక పరిస్థితిని బట్టీ ఆ రోజు, వర్షం ఒక వేటూరి పాటను గుర్తు చేస్తుంది. ఉన్న మాట చెప్పుకోకపోవడం ఎందుకు. గుర్తొచ్చే పాటలలో అత్యధిక శాతం ప్రణ్యశృంగారావేశభరితంగా ఉంటాయి. అదే, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే పచ్చిగా ఉంటాయి. అర్థమైనవాడికి పదాలనే తీయని గుజ్జు వెనుక చేదైన బూతు విత్తనం తగలవచ్చును. అర్థం కానివాడికి వగరు తొక్క వెనకాల తీయని గుజ్జు కనిపించకపోవచ్చును. ఎవరేమన్నా ఆ పాటల్లో వగరూ, తీపి, చేదు అన్నీ ఉన్నాయి. వెరసి అది మావిడి పండు. కొంచం గంభీరంగా చెప్పాలంటే చూతపాకం అనాలేమో. అన్నట్టు మన్మథుడిని చూతాస్త్రుడు అంటారని బ్రౌహ్ణ్య నిఘంటువు ఉవాచ. వేటూరి పాటలలో ఉత్తుంగశృంగారభావాల కారణంగా ఆ కోణంలో కూడా ఆయన పాటలని చూతపాకం అనడం సబబేమో.

వాన చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయి? ఉరుము, మెరుపు, తళుకు, తొలకరి, జల్లు - ఇలాగ ఒక dozen పదాలుంటాయనుకోండి. వేటూరి కనీసం ఒక పాతిక వానపాటలు వ్రాసారు అనుకుంటున్నాను. ఉన్న డజను పదాలతో ఈ పాటల మధ్యన ఎంత వైవిధ్యం కుదురుతుంది? సందర్భాన్ని కూడా కలుపుకుందాము అంటారా? అవును శంకరా నాదశరీరాపర సందర్భం వేఱు, వాన వల్లప్ప వల్లప్ప సందర్భం వేఱు. కానీ "మన తెలుగు చలనచిత్రాలలో ఎన్ని సందర్భోచితమైన పాటలు ఉంటాయి?", అని ఆలోచిస్తే, ఆ పాతిక పాటల్లో పదిహేను పాటలకు సందర్భం ఇదే: "చిరంజీవికి, హీరోయిన్ కి love. వాన పడింది. పాట వ్రాయలయ్య కవి". ఐనా కూడా పాట పాటకీ కొత్త కొత్త భావాలను, పదాల గారడీని చూపించారు వేటూరి.

మొదట మనం భక్తి రసంతో మొదలేడదాము. వానపడుతోంది. ఒక భక్తుడులో "తను చేస్తున్న మంచిపనికి లోకం ఎందుకు హర్షించట్లేదు" అనే ఆవేశం కలిగింది. దాన్ని సాహిత్యంలో ఎంత ఎత్తుకు తీసుకెళ్ళవచ్చును అని (కే) విశ్వనాథుడు, (కే.వీ) మహాదేవుడు వేటూరిని అడిగితే, దానికి వేటూరి వినమ్రంగా ఇలా బెదిరించారు. శంకరాభరణం చిత్రంలో...
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది
అవధరించరా! విని తరించరా!
ఈ సంస్కృతం అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పటికీ నాకు అర్థమైనది సరో కాదో తెలియదు కానీ, "పొగరుతో (ధిక్కరి) ఉన్న ఇంద్రుణ్ణి జయించిన హిమ గిరీంద్రుడి (ఇంద్రుడి వర్షానికి, గాలులకీ హిమాలయాలు కదలవు కదా?) చలువు (సిత) గొంతులో (కంథర) నిండిన నీలకంథరా (విషం గొంతులో ఉన్నవాడు). సామాన్యులు (క్షుద్రులు) తెలుసుకోలేను రుద్రవీణ నిర్నిద్ర (అలుపు లేని) గానమిది, విను (అవధరించు), విని తరించు (సంతోషించు)". లోకులు మనిషిపై పెట్టే ఒత్తిడిని ఇంద్రుడితో పోల్చి, దాన్ని గెలిచిన హిమాలయాలను మనిషి పట్టుదలతో పోల్చి, అటువంటి మనిషిని ఆదరించేవాడిగా శివుణ్ణి వర్ణించి, కేవలం ధర్మాత్ములకు మాత్రమే అర్థమయ్యే తన జీవనగీతాన్ని చూసి సంతోషించమని శివుణ్ణి అడుగుతున్నాడు. ఆ అడగటంలో కూడా శంకరశాస్త్రి గాంభీర్యం మనకు కనబడుతుంది. అది వేటూరి సత్తా.

ఆ తఱువాత
మెరిసే మెరుపులు మురిసే పెదవుల ముసిముసి నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకుజారెనా శివగంగా
నా గానలహరిఁ నువు మునుగుంగా, ఆనందవృష్టిఁ నే తడువంగా
శివుడు పెట్టిన పరీక్షకు తను ఎలాగ ప్రతిస్పందిస్తున్నాడొ చూద్దామని లీలావినోది ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవి మెరుపులయ్యాయని, తన నడవడికి, గానానికి సంతోషించి శివుడు చేసే నాట్యంలో తుళ్ళుతున్న మువ్వల అలికిడి ఉరుములగానూ, ఆ వర్షం శివుడు తాదాత్మ్యంలో ఉండటం వలన గంగ క్రిందికి ఒలకడం గానూ వర్ణించడంలో వేటూరి మఱొక్క సారి "యద్భావం, తద్భవతి" అనే నానుడిని గుర్తుచేసాడు. శంకరశాస్త్రి "శాస్త్రి". శాస్త్రాలను, భగవంతుణ్ణి మూలంగా ఉంచుకుని నడిచే వ్యక్తి. అతనికి ఆకు కదిలినా, పువ్వు మెదిలినా శివలీలగా అనిపిస్తుంది. ముందు చరణంలో అచంచలమైన గాంభీర్యం పక్కనే రెండో చరణంలో చలింపజేసే భక్తి. వేటూరి కత్తికి రెండు వైపులా కాదు, తొమ్మిది వైపులా (నవరసాలు) పదునే.

ఒక్క ఉదాహరణే ఇస్తే ఎలాగ అంటారా? సరే వేటూరి గురించి పుస్తకాలే వ్రాసినవాళ్ళు ఉన్నారు. నేను మఱొక ఉదాహరణ ఇవ్వలేనా? సరిగమలు చిత్రంలో రవి శంకర్ శర్మ (బొంబాయి రవి) సంగీతానికి వేటూరి వ్రాసిన మాటలు చూద్దాము. ఇది వాన పాట కాదు కానీ వానతో కూడిన భావం. అంటే నిఖార్సైన ఉదాహరణే. అప్పటిదాకా సంగీతం చేతకాని వాడు గురువు అనుగ్రహం వలన, దైవబలం వలనా గొప్ప పాటగాడయ్యాడు. అప్పుడు వేటూరి అన్న మాటలు:
కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
అద్వైతభాష్యాలను చదివిన వాళ్ళకు కుండలో నింగి అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మమంతా ఒకటే అనడానికి దృష్టాంతాలంకారంతో గౌడపాదులు (శంకరాచార్యుల గురువుకు గురువు) చెప్పిన ఉదాహరణ ఇది.
బ్రహ్మం ఆకాశంలాగా అంతటా ఉంది. కుండలలోనూ ఉంది, బయటా ఉంది. కుండల వలన అది వేఱు వేఱుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే మాయ (మట్టి)ని తొలగిస్తే అంతటా ఉన్నది బ్రహ్మమే (ఆకాశమే). 
అలాగే ఇన్నాళ్ళూ తనలో ఉంచుకున్న సంగీతశక్తి తనకు ఆ కుండ అవధి కాదని తెలుసుకుని ఒక్కసారిగా ఉరిమింది అని కవి భావన. ఈ మధ్యన నేను అద్వైతసాహిత్యం ఎక్కువగా చదవడం వలన నాకు ఈ విషయం అర్థమైంది. తఱువాత సోదరుడు ఫణీంద్ర పుణ్యమా అని కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో వేటూరి ఇచ్చిన వివరణ చదివిన తఱువాత మరింత సంతోషం కలిగింది. వేటూరి భావాలను అర్థం చేసుకోగలగడంలో ఉండే తృప్తి అలా ఉంటుంది.  వెయ్యండిరా నూరు వీరతాళ్ళు అనాలనిపించట్లేదు?

కొనసాగుతుంది...

Thursday, June 7, 2012

రాంబాబు కథలు - పెళ్ళి చేసి చూడు (3)

"పెళ్ళిచేసి చూడు" అనే అంకంలో ముందు భాగాలు: 1, 2.

రాం: ఆసక్తితో పాటు విరక్తిని కూడా కలిగించడం నీకే సాధ్యం రా!
వెం: Thank you. Of course, ఉత్త విరక్తి కలిగించాలంటే నీకు నువ్వే సాటిలే.
చం: ఇంకా కథలు చెప్పరా అబ్బాయ్!
వెం: కొన్ని matrimony profiles, e-mails లాగా ఉంటాయి. వీళ్ళు eye-tex నేటి మహిళలు అన్నమాట. Profile description లో వాళ్ళ గురించి చెత్తా చెదారం రాసి జనాలను ఊదరగొడతారు. ఉదాహరణకి
Hi
This is Rota. Myself, a software engineer in a reputed MNC in Hyderabad. I have studied in IIT Amalapuram. My interests include but are not limited to సెల్లు-లొ-సొల్లు, parlor లో బిల్లు, pub లో థ్రిల్లు, ఒళ్ళు కొవ్వు ఫుల్లు, home management లో డల్లు, responsibility నిల్లు. 

ఇలాగ రాసుకుంటూ పోతారు.
రాం: ఈవిణ్ణి చేసుకున్న వాడి గతి హెల్లు.
వెం: చివర్లో ఒక చిన్న చణక్కుంటుందిరోవ్. All the best for your search. అని ఒక ముక్కుంటుంది. రాతి యుగంలో websites లో వ్రాసేవారు "Thanks for visiting my website" అని. పెళ్ళయ్యాక మొగుడికి ఉంటుందో లేదో కానీ, profile description లో ఈ పనికిమాలిన courtesy ఒకటి.
చం: పోనీలేరా, కొంతమంది కొంచెం social గా వ్రాస్తారు. దానిదేముంది? అవును, English లో తప్ప తెలుగులో ఉండవా ఈ profiles?
వెం: ఉండవు. తమ profiles తామే సర్దుకునేవాళ్ళకు తెలుగు అంటే చిన్నచూపు. పిల్లల profiles చక్కదిద్దే తల్లిదండ్రులకు తెలుగులో ఎలాగ రాయాలో తెలియదు. వాళ్ళ English కష్టాలు చూడాలి. అసలు, వాళ్ళ్ రాతల్లో నన్ను అన్నిటికంటే ఎక్కువ బాధపెట్టే సమాసం, "homely girl".
రాం: అందులో తప్పేముందిరా?  Girl next door అంటే పక్కింటి అందమైన అమ్మాయి అన్నట్టు, homely girl అంటే సంప్రదాయం కలిగిన అమ్మాయి అనే కదా అర్థం?
చం: రెండూ తప్పేరా. ఒకటి, మన పక్కింటి అమ్మాయి అందంగా ఉంది అనడం అందం అనే పదాన్ని పాతాళంలో పాతిపెట్టడంతో సమానం. రెండు, homely అంటే English లో negative పదం. పెద్ద అందంగా లేకపోతే homely అంటారు. అంటే "సామాన్యమైన" అనే ఉద్దేశంతో.
వెం: మన పక్కింటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదురా?
చం: నీ time బాగుంది. ఈవేళే newspaper లో చదివాను. lip-stickలో మెరుపు రావడానికి చేపపొలుసులు వాడతారట. ఈ లెక్కన ఆవిడ రోజుకు వాడే lip-stickకే రెండు తిమింగళాలని చంపాలి. అది ఇప్పుడెందుకు కానీ, నువ్వు నీ కథ కొనసాగించు.
వెం: ఎవరైనా handsome boy కావాలి అని అడుగుతారు, ఒక profile లో We want a boy with a handsome salary అని ఉంది.
చం: కలికాలం!
వెం: కొంతమంది మితభాషులు ఉంటారు. వాళ్ళు విషయానికి మించి ఒక్క పదం కూడా ఎక్కువ చెప్పకూడదు అనుకుని రాస్తూ ఉంటారు. ఉదాహరణకి: "good girl, job in mnc in bangalore, 1 elder brother, married, father works in telegraph department, mother house-wife, snb." ఈ రాతల్లో capital letters ఉండవు, full-stop, comma ఉండవు, is, am మొదలైన అనవసరమైన పదాలు ఉండవు. ఇది నేను మొదట చదివినప్పుడు, commaలు లేక, 1 elder brother married father అని చదివి నేను ఖంగు తిన్నాను.
రాం: హ హ, SNB ఏమిటిరా? ISI లాగ ఏమైనా మార్కా?
వెం: SNB తెలియదా? పిచ్చివాడా...SNB అంటే sub-sect no bar. అంటే within the caste communists అన్నమాట.
చం: పోనీలే అదీ మంచిదే.

రాం: అవును, communist అంటే గుర్తొచ్చింది...ఈ జాతకాలు....
వెం: అబ్బా....ఎందుకురా ఇప్పటిదాక బాగానే ఉన్నాము కదా? ఇప్పుడదెందుకు గుర్తు చేస్తావు?
చం: (ముసిముసి నవ్వులు నవ్వుతూ) వాడు జాతకాలు అన్నాడు, జాఁవకాయ్ లు అనలేదు.
వెం: హా, (పిడికిలి బిగించి నోటి మీద పెట్టుకుని) జాఁవకాయల సంగతి నీకు ఎలాగ తెలుసును?
రాం: అదేంటిరా? జామకాయలు ఏమైనా చిరంజీవి నూటేభయ్యో చిత్రం title ఆ -- ఎవరికీ తెలియకపోవడానికి?
వెం: నువ్వు నోర్ముయ్...చందూ, చెప్పు -- నీకు ఎలాగ తెలిసింది జాఁవకాయల కథ?
చం: హ హ హ...మొన్న చాలా రోజుల తఱువాత శ్రీకాంత్ కి (చందూకి, వెంకట్ ని పరిచయం చేసిన స్నేహితుడు) phone చేసాను. వాడు చెప్పాడు.
రాం: ఆ కథేంటిరా?
వెం: No, చందూ! ఆ కథ చెప్పడానికి వీల్లేదు.
చం: నువ్వు ఇన్ని tragedy కథలు చెప్పిన తఱువాత నేను ఒక్క comedy కథైనా చెప్పకపోతే ఎలాగరా?
రాం: వెంకీ, నువ్వు ఈ పాలకోవా తిను. చందూ, నువ్వు కథ చెప్పరా.
చం: ఎవరికైనా శత్రువులు మనుషులో, జంతువులో ఉంటారు. మనవాడికి జాఁవచెట్టు శత్రువు.
రాం: Interesting...అదెలాగ?
చం: మనవాడికి జాఁవచెట్టు ఎప్పుడూ అచ్చిరాలేదు. వాళ్ళ వసారాలో జాఁవచెట్టు ఒకటి ఉంది. మనవాడు tender 20s లో ఉండగా ఒక రోజు ఆ చెట్టు కింద కూర్చుని చదువుతున్నట్టుగా pose ఇస్తూ పక్కింటి అమ్మాయికి సైట్ కొడుతున్నాడట.
వెం: అది అబద్ధం. అలాంటి పని మా ఇంటా వంటా లేదు. నిప్పుని కడిగే వంశం మాది.
రాం: అంటే fire-department ఆ?
చం: ఇంతలో ఒక రాయి వచ్చి వీడి జబ్బకు తగిలింది. ఏంటా అని చూస్తే ఒక ఏడెనిమిదేళ్ళ కుఱ్ఱాడు జాఁవకాయల కోసం రాళ్ళు విసురుతున్నాడు. వీడు ఒక్క కేక పెట్టాడు, "ఎవర్రా నువ్వు?" అని. అంతే కుఱ్ఱాడు వీడి దేహపుష్టి చూసి "Sorry uncle, మీరు ఉన్నారు అని చూసుకోలేదు", అన్నాడు. అంతే పక్కింటి అమ్మాయి ఫక్కున నగియెన్. వీడికి కోపమొచ్చి "ఒరేయ్, నన్ను అన్నయ్య అని పిలు", అన్నాడు. దానికా కుఱ్ఱాడు, "మా అన్నయ్య 5th class చదువుతున్నాడు, uncle" అన్నాడు. అంతే వీడికి మరీ కాలింది, "నన్ను uncle అని పిలిస్తే నీకు ఒక్క జాఁవపండు కూడా ఉండదు. పైగా మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో నువ్వు అల్లరి చేస్తున్నావని చెప్తాను, ఫో", అని కసిరి గెంటేసాడు. ఆ కుఱ్ఱాడు మౌనంగా వెళ్ళిపోయాడు. మనవాడు కాస్త కుదుటపడి పడకకుర్చీ మీద పడుకుని ముఖం మీద పుస్తకం పెట్టుకుని తనలో తానే దుర్యోధనుడి ఏకపాత్రాభినయం వేసుకుంటుండగా మఱొక రాయి వచ్చి పడింది. దానితో కోపం నషాలానికి అంటి వీరావేశంతో వీధితలుపు తెరిచి చూస్తే అక్కడ ఒక పదిమంది కుఱ్ఱాళ్ళు ఉన్నారు. అందరూ "Uncle, ఒక్క జాఁవపండు ఇవ్వండి, uncle!" అనడం మొదలెట్టారు. మధ్యలో తల నెమ్మదిగా పైకెత్తుతూ, వెక్కిరింతతో కూడిన నవ్వుతో ముందటి కుఱ్ఱాడు కసిగా చూసాడు. వెంటనే కొంచెం పక్కకి తిరిగి, "అక్క, నువ్వైనా uncle కి చెప్పక్కా...", అన్నాడు. మనవాడి మొహం చూడాలి. RGV కీ ఆగ్ cinema, multiplex లో black ticket కొనుక్కుని మరీ చూసి బయటకు వచ్చినవాడిలాగా పగతో రగిలిపోయింది.
రాం: హ హ హ, నలుగురు బుడంకాయల చేతులో పరాభవానికి గురైన వెంకట్.
(వెంకట్ గోడకు తలాంచి మౌనంగా ఉన్నాడు. ఒక్క సారిగా వెనక్కి తిరిగి...)
వెం: జాతకాలు నప్పితే అమ్మాయి నచ్చదు, అమ్మాయి నచ్చితే జాతకాలు నప్పవు. అందుకే ఇదివరకు రెండూ కలిపి పంపేవాళ్ళు. ఒక వేళ అమ్మాయి photo నచ్చకపోయినా జాతకం నప్పలేదు అని diplomatic గా చెప్పవచ్చును కదా అని.
రాం: బాగా try చేసావు రా. ఒక్క నిముషం వోల్డేయ్! చందూ, నువ్వు చెప్పరా...
చం: అంతే కాదు, ఒక సారి అదే అమ్మాయికి exercise చేస్తున్నట్టు pose ఇద్దామని జాఁవ కొమ్మ పట్టుకుని ఊగబోతే అది కాస్తా విరిగి మనవాడి నడుం పచ్చడైంది.
వెం: ఐపోయిందా...నీ feeling అంతా చెప్పేసావా? ఈ చేదు జ్ఞాపకాలు Hutch కుక్కలాగా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతున్నాయి.
చం: హ హ...ఇంకో కథ ఉంది. ఇది sweet 16s లో. జాఁవకాయలు కోసి ఇచ్చి అదే అమ్మాయిని impress చేద్దామని, చెట్టేక్కబోతుంటే ఆ చెట్టు కొమ్మ ఎప్పటికంటే నున్నగా తగిలింది. ఏమిటా పచ్చపచ్చగా, మెత్తమెత్తగా ఉంది అని చూస్తే అది కొండచిలువ. ఒక్క పెట్టున దూకి పరుగో పరుగు. అప్పటిదాక hero pose లు ఇచ్చి ఒక్క సారిగా పలాయనమంత్రం పఠించిన కథ వీళ్ళ college అంతా తెలిసింది.
రాం: అమ్మ దొంగ, నీకు చాలా flash-back ఏ ఉందే.
చం: ఇప్పుడు over to వెంకట్.
వెం: నాకూ time వస్తుందిరా. అప్పుడు చెప్తాను.
రాం: ఇప్పుడే చెప్పు ... నీ matrimony కథలు.

వెం: ఈ మధ్యన ఆడపిల్ల తరఫు వాళ్ళు వేటికవి step-by-step చేయమంటున్నారు. దానివలన ఎవరికి లాభమో తెలియదు. మా పెదనాన్న సామాన్యంగా అన్ని వివరాలూ అడిగి, అన్నీ చూసుకుని అవుననో కాదనో చెప్తాడు.  ఒకాయన "జాతకాలు నప్పాయో లేదో చెప్పండి, అప్పుడు photo పంపిస్తాము", అన్నాడు. సరే జాతకాలు నప్పాయి అని చెప్పాము. అప్పుడు photo పంపించారు. అమ్మాయి మా అన్నయ్య కి నచ్చలేదు. అమ్మాయి తండ్రికి ఏ కారణం చెప్పి వద్దనాలో పెదనాన్నకి తెలియలేదు. వేఱే ఏమీ చెప్పడానికి లేదు, photo చూడకముందే అమ్మాయి గురించి అన్ని వివరాలు, జాతకాలు నప్పాయన్న విషయం తెలుసును. ఇంక చేసేదేమీ లేక phone చేసి "అమ్మాయ్ మా వాడికి నచ్చలేదండి.", అన్నాడు. దానికి అవతలాయనకు కోపం వచ్చి, "ఐతే photo వెనక్కి పంపేయండి", అన్నాడు.
రాం: మరి పంపారా?
వెం: E-mail లో పంపిన photoని వెనక్కి ఎలాగ పంపుతామురా? ఆ విషయం తెలియక, ఆయన కూతురు మాకు నచ్చలేదు అని చెప్పామనే ఆవేశంలో, అలాగ అన్నాడు.

కొనసాగుతుంది...