Sunday, May 22, 2011

వేటూరికి నివాళి

నేటికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం వేటూరి అస్తమించారు. ఆయనని తలుచుకుంటూ ఏవో నాలుగు మాటలు కూర్చాను. వారికి ఇదే నా పదాంజలి.

తలపులన్నీ మనసు-తలుపు తడుతున్నా, కలముతో ఈ పాట వ్రాయలేకున్నా
మాటలన్నీ మధుర జ్ఞాపకాలాయి, మనసులోన నింపె ఆనాటి హాయి
మరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...

తెలుగుకోకిలమ్మ మూగబోయింది, తేటగీతి నీవు ఇవ్వలేదంటూ
మనసు-తేనెటీగ మధువు చేదంది, పాత పాటపూల మధురమేదంటూ
పాటలన్నీ యిచ్చి పయనమైనావు, మైనమల్లే నీవు మాయమైనావు
కన్ను వెతుకుతోంది ఆనాటి వెలుగు, నిన్ను అడుగుతోంది నీ తల్లి తెలుగు...

రంపమంటి బాధ రగిలించె మంట*, రాగమాగనంటు కదిలింది వెంట
అంపశయ్య మీదె అల్లావు పాట, సాగి చేరుకుంది పదిమంది నోట
పాపగా ఎదిగావు తెలుగమ్మ కంట, పాటగా మిగిలావు మా అందరింట
మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట...

వెన్ను తట్టి లేపె ఈ నాటి ఉదయం, నిన్నటి నీ పాట తేనె నెమరేసె హృదయం...
మరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...

* వేటూరి గారు ఎన్నో పాటలు ICUలో ఉండి వ్రాశారని చాలామంది చెప్పగా విన్నాను.

Friday, May 20, 2011

రాధ-మధు

ఒకరోజు ఊరికెనే youtubeలో ఏదో వెతుకుతుంటే "రాధ-మధు" ధారావాహికలో ఒక అంకం (episode) ఎదురైంది. చూస్తే Maa TV వాళ్ళు ఆ ధారావాహికనంతా high resolutionలో youtube లో ఉంచారు. సరే అని ఆ అంకాన్ని నొక్కి చూస్తే ఎందుకో నచ్చింది. అలాగ నెమ్మదిగా అంకం తరువాత అంకం పూర్తి చేసుకుంటూ మొత్తానికి ఆ ధారావాహికను రెండు నెలలు తిరక్కుండా పూర్తిగా చూసేశాను (450 అంకాలు). ఒక్క ముక్కలో చెప్పలంటే అద్భుతంగా ఉంది. ఈ ధారావాహికలో నాకు నచ్చిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ఆ విశేషాలు నచ్చినవారు కూడా ఈ ధారావాహికని చూసి సంతోషిస్తారని ఈ టప వ్రాస్తున్నాను. చదువర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాధ పూర్తి పేరు రాధాకృష్ణ, మధు పూర్తి పేరు మధూళిక.
  • బలమైన స్త్రీపాత్రలు: రాజరాజేశ్వరి, మధూలిక, జానకమ్మ (రాధారాణి) ముఖ్యపాత్రలు కావడంతో వాటికి బరువుని కల్పించడం సహజం. కానీ అక్కడక్కడ కనబడే పాత్రలను కూడా చాలా చక్కగా రూపించారు. ఉదాహరణలు:
    • జూలూ, రాధ class కి ఎందుకు రావట్లేదో కనుక్కోమని తన friend ని అడుగుతుంది. ఆ friend కి పట్టుమని పది సన్నివేశాలు కూడా ఉండవు. కానీ, ఎంతో పరిపక్వతను కనబరుస్తుంది. ఆమె చెప్పే నాలుగు మాటల్లో కూడా చాలా అనుభవం కనబడుతుంది.
    • గోదావరి (రాధ వాళ్ళింట్లో పనిమనిషి) రెండు మూడు సార్లు రాధను ఎదిరించి మంచి చెప్తుంది. ఆ చెప్పటంలో కూడా ఆవేశం కంటే ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పాత్ర చాలా చక్కగా అల్లారు.
  • సున్నితత్వం ఉన్న పాత్రలు: దాదాపు అన్ని పాత్రలలోనూ సున్నితత్వాన్ని చూపించారు (బహుశా, మూర్తి తల్లి పాత్ర తప్ప). రెండు మాటల్లో ఎంతో లోతును ప్రదర్శించే అవకాశం దాదాపు అన్ని పాత్రలకూ లభించింది. ఉదాహరణలు:
    • మధూలిక రాధను విడిచి వెళ్ళిపోయే ముందు (అతనికి తెలియదు వెళ్ళిపోతోంది అని) చక్కగా వండి కొసరికొసరి వడ్డించి వెళ్ళిపోతుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. 
    • రాధ అత్యవసరమైన పనిని తన ఉద్యోగికి చెప్పి, "నాకు lunch time లోపల పని జరగాలి", అంటాడు. ఆ ఉద్యోగి వెళ్తూంటే, "చూడండి, మీరు lunch రోజూ చేసే time కే చెయ్యండి", అంటాడు. ఇందులో శ్లేషతో కూడిన హాస్యం కలిగే అవకాశమున్నా, రాధ కళ్ళల్లో ఆ సున్నితత్వం కనిపించి సన్నివేశాన్ని పండించింది. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూస్తుంటే ఈ తిట్టుకోవాడాలు, కొట్టుకోవడాలు ఉన్న చలనచిత్రాల కంటే ఈ ధారావాహికల్లోనే మనసుకు కాస్త ఊరట కలుగుతుంది అనిపించింది.
  • చక్కని మాటలు: మాటల రచయిత ఎవరో తెలియదు కానీ, మంచి హాస్యాన్ని, పదాల వాడుకలో మెళకువని, మనసుని స్పృశించే భావావేశాన్ని కనబరిచాడు. దాదాపు ప్రతి రెండు అంకాలకు ఒకసారి "హమ్మ, భలే మాట వాడాడురా" అనిపించింది. మచ్చుకు మూడు చెప్తున్నాను.
    • ఒక కార్మికనాయకుడు ఆ కర్మాగారానికి managerతో మాట్లాడే సందర్భంలో, "మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు" అంటాడు. వెంటనే ఆ manager, "మన factoryలో గాజులు తొడుక్కుని పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను అవమానించడం దేనికి? విషయం చెప్పండి.", అంటాడు. ఆ సన్నివేశానికి ఆ మాట వలన ఎంతో అందం చేకూరింది.
    • మిత్రా రాధను వెక్కిరిస్తూ, "ఆరంభించకుండా ఆగిపోయేవాడిని అధముడు అని, ఆరంభించి మధ్యలో వదిలేసేవాడిని మధ్యముడు అని, ఆరంభించిన పనిని పూర్తిచేసేవాడిని ఉత్తముడు అని అంటారు" (భర్తృహరి సుభాషితం), అంటాడు. రాధకు చాలా కోపం వచ్చి, "ఆరంభించక ముందే అపశకునం పలికేవాణ్ణి 'వాయి మూడు' అంటారు", అంటాడు. రచయత భాషాచాతుర్యాన్ని ప్రదర్శించడంతో చక్కని హాస్యం పండింది. ఇలాంటి హాస్యం ఇంకా చలా చోట్ల ఉంది.
    • మూర్తి మధూళికతో మాట్లాడుతూ రాధ దగ్గరనుండి భరణం అడగమని అంటాడు. ఇన్నాళ్ళు తను రాధ కుటుంబానికి చేసిన సేవకు ప్రతిఫలంగా అడగడంలో తప్పులేదని, అందులో గౌరవం పోయేదేమీ లేదని అంటాడు. అప్పుడు మధూ, "ఎవరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా, నన్ను నేను గౌరవించుకోవాలి కద మూర్తి", అంటుంది. ఆత్మగౌరవాన్ని ఇంత చిన్న మాటల్లో చెప్పడం నాకు బాగా నచ్చింది.
  • రాజేశ్వరి, మిత్ర, గోపాలం -- వీరి స్నేహం: ముగ్గురికి ముగ్గురు ఎంతో మానసికపరిపక్వత కలిగినవాళ్ళయ్యుండి కూడా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ వృద్ధాప్యం మనిషిలో ఉల్లాసానికి అడ్డు కాదు సుమీ అనిపిస్తారు. పెద్దరికం ఎంత కనబరుస్తారో, మాటలు అంత తేలికగా ఉంచుతారు.
  • తెలుగుదనం: ఎక్కడా మాటల్లో అతిగా ఆంగ్లాన్ని వాడలేదు. వాడినా అది information కోసమే వాడారు. ఉదాహరణకి నాకు french leave అంటే ఏమిటో ఈ ధారావాహిక ద్వారానే తెలిసింది. అక్కడక్కడ శతకపద్యాలను, మంచి సామెతలను గుర్తుచేశారు. మామూలు సన్నివేశాలలో "మార్దవం" లాంటి పదాలను వింటే మనసు పొంగిపోయింది. ఒక చోట బాపి, "మూర్తి ఉన్నాడా అండి", అని మూర్తి మరదల్ని అడిగితే "మూర్తి గారు" అనలేదు అని ఆమెకు కోపం వచ్చి, "ఓయ్, ఏమిటి? నువ్వేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, పేరు పెట్టి పిలుస్తున్నావు?" అంటుంది. ఆ మాట విని ఎన్ని రోజులైందో!
  • చిలిపిదనం: మొత్తం ధారావాహిక అంతా బోల్డంత చిలిపిదనం ఉంది. రాధ, మధు లాంటి యువదంపతుల మధ్యన అది ఉండటం సహజమే, కానీ వెంకట్రావు, జానకమ్మ వంటి వృద్ధదంపుతల మధ్యన కూడా చాలా చిలిపి సందర్భాలు చూపించారు. చూస్తూనే పెదాలపైన చిరునవ్వు వెలియవలసిందే!
 వెఱసి రాధ-మధు ఒక పరిపూర్ణమైన ధారావాహిక అయ్యింది. తీరిక ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది చూడాలని నా సలహా.

Tuesday, May 17, 2011

తెలుగు భారతికి వెలుగు హారతై, ఎద లయలో పదకవితలు కలయ... (అన్నమయ్య జన్మదినం)

ఈ రోజు అన్నమాచార్యుని పుట్టినరోజు. తెలుగువారందరూ ఎంతో గర్వించ-తగిన/వలసిన రోజు. తెలుగు భాషని, భాషకి సేవచేసిన మహానుభావులని మరిచిపోవడం మనకు వెన్నతో పెట్టిన విద్య అయినప్పటికీ ఈ రోజు కాస్త ఆ అలవాటుని పక్కన పెట్టి, ఆ మహానుభావుడిని ఒక్కసారి స్మరిద్దాము.

ఈ రోజుల్లో మన చలనచిత్రాల్లో వస్తున్న పాటలను చూస్తే "ఓసోసి, పాట వ్రాయడం అంటే ఇంత సులువా? నేనూ వ్రాస్తాను" అనుకుని "నిన్ను చూస్తే గుండె కొట్టుకుంది, మాయరోగం నన్ను పట్టుకుంది" అని వ్రాసేద్దామనిపిస్తుంది. చలనచిత్రకవులకు కూడా పదే పదే అదే సందర్భం ఇస్తే తరచూ అవే పదాలు/భావాలు దొర్లుతూ ఉంటాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. అలాంటిది ముప్ఫైవేలకు పైగా పాటలు, ఒక్కడంటే ఒక్కడి మీద, వ్రాయడం, ప్రతీ పాటలో వైవిధ్యం కనబరచడం, వాటిని భావితరాలకు నచ్చేలాగ/ఉపయోగపడేలాగా స్వరపరచడం, ఎక్కడా యాంత్రికంగా అనిపించకుండా ఆవు పొదుగు దగ్గరి పాలలాగ స్వఛ్ఛంగా ఉంచడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న కర్ణాటక సంగీతంలో ఇంతటి అద్భుతాన్ని సాధించినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చును (అంటే తక్కువ సంకీర్తనలను రచిస్తే తక్కువ కవులు/గాయకులు అని కాదు. కానీ రోజుకో అద్భుతమైన గేయం వ్రాయడం గుర్తించదగిన విషయం అని).

నేను గతసంవత్సరం అన్నమయ్య జన్మదినానికి ఒక పాట వ్రాశాను. స్వరాలంటారూ, నా లాంటి స్వరపరిజ్ఞానహీనుడు ఏం చేస్తాడు? ఏదో "ల లా ల" అనుకుంటూ పాట వ్రాశాను. ఈ ఏడాది కూడా ఎలాగైనా ఒక పాట అన్నమయ్య మీద వ్రాయాలని నా మనసు లాగింది. కానీ, గంటసేపు కూర్చున్నా ఏమీ తట్టట్లేదు. ఇప్పుడు నేను అన్నమయ్య అంత కవిని అనే దుస్సాహసం చేయట్లేదు, కాకపోతే ఏడాది ఖాళీ ఉన్నా అదే సందర్భానికి మఱొక పాట వ్రాయలేకపోతున్నాను. మఱి రోజూ వేంకటేశుడి మీదనే వ్రాయాలంటే ఎంత భక్తి, భావనాశక్తి, భాషాపటిమ ఉండాలో ఆలోచిస్తేనే అన్నమయ్యకు పొఱ్లుదణ్ణాలు పెట్టేయాలనిపిస్తోంది. ఐనా సాహసించి అన్నమయ్య గుఱించి ఏమైనా వ్రాద్దామంటే చలనచిత్రకవితాపితామహుడు వేటూరి ఇప్పటికే అద్భుతమైన పదాలను వాడి అన్నమయ్యని మెప్పించేశాడు. ఆ పాటలు తలుచుకుంటేనే "అమ్మో...నేను ఇలాగ వ్రాయలేను మొఱ్ఱో" అనాలనిపిస్తుంది.

అన్నమయ్య గళానికి (అదే...నందకానికి!) రెండు వైపులా పదునే. అటు సంఘాన్ని విమర్శించినా (బ్రహ్మమొకటే), ఇటు సంఘాన్ని విస్మరించినా (అదినే నెఱగనా); అటు శృంగారమైనా (ఏమొకో చిగురుటధరమున), ఇటు పరమవైరాగ్యమైనా (అంతర్యామి అలసితి); అటు గంభీరమైన సంస్కృతమైన (ఫాలనేత్రానలప్రబల), ఇటు జానపదమైనా (సిరుతనవ్వులవాడే సిన్నెక్క) -- అన్నీ ఆయనకు పుట్టుకతో వచ్చినవే అనిపిస్తుంది. ఒక వంద thesisలు వ్రాయగలిగినన్ని విషయాలు ఆయన పాటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన కవితాపటిమ గుఱించి చెప్పడానికి నా బోటి అల్పుడు సరిపోడు. ఆ ప్రయత్నం కూడా నేను చేయదలుచుకోలేదు.

కొంతమంది కారణజన్ములు అని వారిని చూడకపోయినా వారి సృష్టిని బట్టి చెప్పచ్చును. ఆది శంకరుడి గొప్పదనం తెలియడానికి ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ చదవక్కరలేదు. సంస్కృతంలో అక్షరం ముక్క తెలియని వాడైనా "అయి గిరి నందిని" అన్న శ్లోకం విన్నాడంటే, "ఇదెవరో మహానుభావుడు వ్రాశాడురోయ్!" అనుకుంటాడు. అలాంటి కారణజన్ముడే అన్నమాచార్యుడు కూడా. నేను దైనందినజీవితంలో విసిగిపోయినప్పుడు ఒక్కసారి ఆయన మాటలను గుర్తుచేసుకుంటుంటాను. ఆయన వైరాగ్యభరితమైన పాటలు వింటూవుంటే నా మనసుకు ఊరట కలుగుతుంది. భగవద్గీతలోని లోతంతా ఒక్క నిముషంలో చూసినంత ఎత్తుకు వెళ్ళిపోతాను.

"కోరిన కోఱ్కెలు కోయనికట్లు, తీరవు నీవవి తెంచక; మదిలో చింతలు మయిలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక"
"యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి; కొంతైన బ్రహ్మచింత కోటిలాభము"
"పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా"

 
ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్ని రోజులైనా చెప్పుకుంటూపోవచ్చును. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపి, పదకవితాకులంలో ఒక మరుగుజ్జునైన నేను మనసార ఆ మహాత్ముడికి ప్రణామం చేస్తున్నాను. "మహానుభావ... మళ్ళీ నీకు పుట్టే ఉద్దేశం ఉంటే చెప్పు, నీకు చెప్పులుకుట్టేవాడిగా పుట్టినా నాబోంట్ల జన్మ ధన్యమవుతుంది", అని గట్టిగా అరవాలనిపిస్తోంది.

PS: సోదరుడు శ్రవణ్ కుమార్, తన బ్లాగు ద్వారా అన్నమయ్య పాటలను నలుగురికీ అందే విధంగా చేస్తున్నాడు. ఆ బ్లాగులో అన్నమయ్య అనే అనంతరత్నాకరంనుండి గ్రహించిన అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి. చదువర్లు ఆ బ్లాగుని దర్శించవలసిందిగా నా మనవి.