Thursday, November 23, 2017

పోతన భాగవతం

మొన్న బోతల్ నగరంలో జరిగిన "మన దీపావళి" కార్యక్రమానికి వ్యాఖ్యానం (MC) చేసాను. కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం - "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటిక. వందకు పైగా పిల్లలు అందరూ అద్భుతంగా నటించటమే కాక పద్యాలను కూడా వినిపించారు. పద్మలత గారి రచనలో నాకు ముఖ్యంగా నచ్చింది - పోతనకై ప్రత్యేకంగా ఉంచిన సన్నివేశం. పోతనలోని లోతుని తెలిపేలాగ "శారద నీరదేందు", "బాల రసాల", "పలికెడిది భాగవతమట" మొదలైన పద్యాలను చిన్నారుల చేత చక్కగా చెప్పించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలగడం నా భాగ్యం.

ప్రేక్షకులకు కృష్ణతత్త్వాన్ని, పోతన తత్త్వాన్ని తెలిపేందుకు సిద్ధపడుతూ పోతన తీయని పద్యాలను మళ్ళీ గుర్తుచేసుకున్నాను. "కేళీ లోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్, మహా నందాంగనా డింభకున్" అని చదువుతుంటే పోతనలోని ఔన్నత్యం నా కళ్ళు చమర్చేలాగా చేసింది. "సృష్టి అనే ఒక ఆటను నడపుతూ ప్రకాశించే చూపుల వల నుండి పుట్టిన అనేక బ్రహ్మాండాలను తనలో ఇముడ్చుకున్న వాడు" అంటూ విష్ణువుని (అంతటా వ్యాపించినవాడిని) స్తుతిస్తూ పక్కనే "మహా నందాంగనా డింభకున్" (నందుడి భార్య ఐన యశోద బిడ్డ) అనడంలో - యశోదని, అమ్మని ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాడో అనిపించింది. ఇక "కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడనేల ఏడ్చెదో" అని ఆయన అమ్మ శారదను ఓదారుస్తుంటే - ఎవరు తల్లో, ఎవరు బిడ్డో తెలియని ఆత్మీయత కనబడుతోంది. కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించిన మహా యోగి పోతన. ఆయన మన తెలుగువాడు అవ్వడం మన జాతి అదృష్టం.

భాగవతం అంతటా సీసపద్యాలు మల్లెతీగెల లాగా కనబడుతూ ఉంటాయి. "మందార మకరంద మాధుర్యమునఁదేలు" అన్న పద్యంలోని అనుభూతి పాడుకుంటే గానీ తెలియదు. "నల్లనివాడు పద్మనయనంబులవాడు" అంటూ గోపికలు పాడే పద్యంలోని ప్రణయమే నిజమైన ప్రణయం. నేను కుచేలోపాఖ్యానం పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటే, ఎనుబది ఏళ్ళ వయసులో మా తాతయ్య అనర్గళంగా ఆర్ద్రతతో "ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ గరుణాలవాలు, భాసురకపోలుఁ" అంటూ నన్ను దాటుకుని వెళ్ళిపోయిన సంగతి నా కళ్ళ ముందు మెదిలింది. పద్యం చదివితే అలాగ చదవాలి కదా అనిపించింది. "విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు" అని పోతన తేటగీతిని ముగిస్తే "అబ్బా, ఏం వేసాడురా అనుప్రాస" అని ఇప్పటికీ అనుకుంటాను. "అడిగెదనని కడు వడిఁ జను" అనే పద్యం కంఠస్థం చేయడానికి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కాదు. "అమ్మలగన్నయమ్మ" అని అచ్చ తెలుగు మాటలతోనూ, "శారద నీరదేందు" అని సంస్కృతపదాలతోనూ అమ్మను స్తుతించిన కావ్యసవ్యసాచి పోతన గొప్పదనం చెప్పడం నాబోంట్లకు వీలు కాదు.

పదేళ్ళ క్రితం మొదట అమెరికా వచ్చిన రోజుల్లో surasa.net లో ఉషశ్రీ సువర్ణకంఠంలో విన్న భాగవతం గుర్తుకు వచ్చి మళ్ళీ విన్నాను. Law of Diminishing Marginal Utility అని అర్థశాస్త్రజ్ఞులు చెప్పిన చట్టం తప్పు కదా అనిపించింది. ఎన్ని సార్లు విన్నా ఇంకా తియ్యగానే ఉంటుంది. ఈ మధ్యన మఱొక అద్భుతమైన అంతర్జాలవిషయం తెలుసుకున్నాను. http://telugubhagavatam.org లో పోతనభాగవతాన్ని పూర్తిగా, టీకాతాత్పర్యసహితంగా ఉంచారు. అంతేగాక బంగారునగలోని ముత్యాలలాగా ఉండేటువంటి పద్యాలను ప్రత్యేకంగా క్రమపరిచారు. ఈ మహోపకారం చేసిన మహానుభావులకు ఆ శారదా దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని నా నమ్మకం.

ఏ దేశంలో ఉన్నా మన తెలుగువాళ్ళు కచ్చితంగా తినవలసిన, నెమరేసుకోవలసిన పనసతొనలు పోతన పద్యాలు. వాటిని మళ్ళీ గుర్తుచేసుకుని పాడుకోవడం వలన దైనందినతాపాలతో ఎండిపోయిన నా మనోవనంపైన తొలకరి జల్లులు పడినట్టైంది. మహాకవి పోతనకు అనంతకోటి వందనాలు.