Wednesday, December 29, 2010

నిత్యజీవితంలో పద్యాలు - శారదాదేవి

ఉ:-
శ్రీకరపాదపద్మముల చేతులఁ దాకగఁజాల లేక యీ
చీకటి కోటలోనిరికి చిత్తము చంచలమై భ్రమించుచున్
వేకువ కోరి వేడితిని వేదముఁబట్టిన దివ్యహస్త! ఈ
నా కనుదోయిలో నిలిచి నాటకమున్ కడతేర్చుమా భువిన్

చం:-
కరణములన్ని ప్రాణహరకాంతికి మ్రొగ్గెడి మూఢమక్షికల్
తరణము చేతఁగాక భవతామససాగరమందు చిక్కితిన్
శరణను నన్ను గావగ ప్రసన్నతనొందుమ, హంసవాహినీ!
కరుణను చూచుమా జనని! కామితదాయిని! లోకపావనీ!

చాలా రోజులు పద్యాలకు దూరంగా ఉన్నాను అని ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకుని రెండు పద్యాలు వ్రాశాను. తప్పులుంటే సవరించగలరు.

Wednesday, December 22, 2010

నా అనుభవాలు: 1

("నా అనుభవాలు" పేరుతో వ్రాస్తున్న ఈ శీర్షికలో నా చిట్టి అనుభవంలో చూసిన/విన్న సంఘటనల గురించి వ్రాస్తున్నాను. దీనిలో కేవలం మనోభావాలు, అధ్యాత్మిక విషయాలు వంటివి ఉంటాయి. హాస్యం ఉండదు.)

కామేశ్వరరావు గొప్ప భక్తుడు. ఒకప్పుడు సైనికవిభాగంలో పని చేశాడు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా రోజూ ఒక గంటసేపు తన ఇష్టదైవాన్ని ధ్యానించేవాడు. ఎప్పుడూ మద్యమాంసాల జోలికి పోలేదు. ఇప్పుడు ఆయన పదవిని విరమించి స్వగ్రామంలో ఉంటున్నాడు. ఆయన జీవితంలో ఒక సారి జరిగిన ఘట్టం వారి అబ్బాయి (నా మిత్రుడు) నాతో చెప్పాడు. అదే ఈ చిన్నకథ.

ఒక రోజు కామేశ్వరరావు పూజ ముగించి వరండాలో కూర్చున్నాడు. తన మిత్రుడు ఎవరో ఒక అపరిచితవ్యక్తిని వెంటబెట్టుకుని గుమ్మం ముందుకు వచ్చాడు. మర్యాద కోసమని కామేశ్వరరావు వెళ్ళి వాళ్ళను పలకరించి ఇంట్లోకి పిలిచాడు. అందరూ కాఫీలు పుచ్చుకున్న తఱువాత, కామేశ్వరరావు మిత్రుడు తనతో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ, ఆయన గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి అని, ఎవరింట్లో ఐనా పూజగది చూసి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ చెప్పగలడని చెప్పాడు. కామేశ్వరరావుకి కుతూహలం ఆగలేదు. వెంటనే ఆయన్ని పూజగదిలోకి తీసుకెళ్ళాడు.

ఆ వ్యక్తి గంభీరమైన ముఖంతో ఉన్నాడు. నుదుట విభూతి గాని కుంకుమ గాని లేదు. పూజగదిలోకి అడుగు పెడుతూనే ఒక్క సారి చుట్టూ చూశాడు. దేవుడి పాటాలను, దీపాలను చూసినదాని కంటే మిగతా దిక్కులను ఎక్కువ చూసి "మీ నాన్నగారు మీ చిన్నప్పుడే పోయారు. ఆయన చామంచాయ, ఆరడుగులు ఎత్తు, మీసం ఉండదు - అవునా", అన్నాడు. కామేశ్వరరావు ఆశ్చర్యచకితుడైనాడు. వాళ్ళ నాన్నగారికి ఒక నమ్మకం ఉండేది - photo తీయించుకుంటే సహజసౌందర్యం దెబ్బ తింటుంది అని. అందుకే ఆయన ఎప్పుడూ photo తీయించుకోలేదు. ఈ వ్యక్తి తన తండ్రి photo సంపాదించి ఈ విషయం చెప్తున్నాడు అనడానికి ఆస్కారం లేదు. అలాగే తన చిన్నదనంలోనే చనిపోయిన తండ్రిని తన భార్య, బిడ్డలు చూసే కూడా చూడనేలేదు. ఈ వ్యక్తి చూసే అవకాశం కూడా లేదు. ఒక వేళ ఇదివరకు ఇతను తన తండ్రిని స్వయంగా చూశాడా అంటే ఇతడు కామేశ్వరరావు కంటే చిన్నవాడాయె. ఇదంతా తనకు నమ్మశక్యంగా లేదు. కాసేపటికి తేరుకుని ఆయన చెప్పినవన్నీ నిజమేనని ఒప్పుకుని సాష్టాంగప్రణామం చేసినంత పని చేశాడు. ఆ తఱువాత ఆ వ్యక్తి మరిన్ని వివరాలు చెప్పడం, కామేశ్వరరావు ఊ కొట్టడం జరిగాయి. చివరికి ఆయనకు భోజనం కూడా పెట్టి పంపించాడు.

కామేశ్వరరావు ఈ విషయాన్ని సత్వరమే తన గురువుగారికి చెప్పాలని ఆ మఱునాడు బయల్దేరి ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన నుదుటన, విభూతి, కుంకుమ పెట్టుకుని ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. కామేశ్వరరావుని చూసి, "కామేస్వరం, నిన్న మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తే పూజగది చూపించావు కదూ?" అన్నాడు. మళ్ళీ కామేశ్వరానికి మతి పోయింది. ఇదివరకు ఎప్పుడూ ఈ గురువుగారు మానవాతీతశక్తి ఉన్నట్టుగా ప్రవర్తించలేదు, అనిపించలేదు. ఉన్నట్టుండి ఈయనకు కూడా ఈ శక్తి ఎక్కడినుండి వచ్చింది? ఇది కలా? నిజమా? అని అనుకుంటూ, "అవును స్వామీ, ఆ విషయం చెప్దామనే ఇక్కడికి వచ్చాను", అన్నాడు. ఆయన గంభీరమైన ముఖాన ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వి, "తప్పు చేశావు కామేస్వరం. పూజగది మన ఆధ్యాత్మికబలానికి నెలవు. అక్కడికి ఎవరినిబడితే వారిని రానివ్వకూడదు. శక్తికి కూడా రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ప్రకృతికి అనుకూలమైన దైవీకశక్తి, రెండవది ప్రకృతిధర్మాలను ధిక్కరించే శక్తి. మనం మల్లెబాటలో వెళ్ళాలయ్యా. ఇంకెప్పుడూ అలాంటివాళ్ళను ఆశ్రయించకు", అన్నాడు.

కుతూహలం ఆగని కామేశ్వరరావు, "స్వామీ, మీరు చెప్పింది పాటిస్తాను. ఆ విషయాన్ని మీరు మరింత వివరిస్తే వినాలనుంది", అన్నాడు. గురువుగారి ముఖంలో గాంభీర్యం తగ్గి కాస్త శాంతం చోటు చేసుకుంది, "కామేశ్వరం, మీ ఇంటికి వచ్చిన వ్యక్తిది దైవబలం కాదు. దైవబలం ఉన్న వ్యక్తులు ఎప్పుడుబడితే అప్పుడు వారి శక్తిని వాడరు. పిండోదకక్రియలను సక్రమంగా ఆచరిస్తున్న నీకు పితృదేవతల అండ ఉంది. అతను మీ పితృదేవతలతో మాట్లాడాడయ్యా. ఇది పెద్ద విద్యేం కాదు. కాకపోతే అది ప్రకృతివిరుద్ధం. నీ పితృదేవతలు కూడా నీకు ప్రశ్నలుంటే, అవి ముఖ్యమైనవైతే, నువ్వు నీ వారిపట్ల నీ ధర్మాలను సరిగ్గా ఆచరిస్తే నీకు కల ద్వారానో, లేక మఱొక మార్గంలోనో సూచనలనిస్తారు. ఇలాంటి వ్యక్తులు వాడేవి ప్రకృతివిరుద్ధమైన మార్గాలు. వారు మీ పితృదేవతలను ఇబ్బంది పెట్టగలరు. నిన్నూ నమ్మించి మోసం చెయ్యగలరు. వీరిని నమ్మితే నువ్వు నీ పితృదేవతల అండని, భగవంతుడి కృపని వదులుకోవలసి రావచ్చును. అందుకనే వీళ్ళకు దూరంగా ఉండమంటున్నది", అన్నాడు. కామేశ్వరరావుకు విషయం అర్థమైంది. అప్పటి నుండి ఇలాంటి మాయలకు దూరంగా ఉంటున్నాడు.