Saturday, October 22, 2011

ప్రియతమా, నను పలకరించి ప్రణయమా (వేటూరి)

ఇళయరాజ, వేటూరి అంటే నాకు ఎంత ఇష్టమో నన్నెరిగినవాళ్ళకు ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు. వారిద్దరి కలయికలో వచిన పాటలన్నీ నాకు ఇష్టం. చిరంజీవి, శ్రీదేవి నటించిన, విజయవంతమైన చిత్రం "జగదేక వీరుడు, అతిలోక సుందరి" లో అలాంటి పాటలు చాలా ఉన్నాయి. నాకు ప్రత్యేకించి నచ్చినది, "ప్రియతమా, నను పలకరించు ప్రణయమా" అనే పాట.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వేటూరి వ్రాసిన చాలా పాటలు (ముఖ్యంగా యుగళగీతాలు) అద్భుతంగా ఉంటాయి. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే కథానాయిక దేవకన్య కావడం. ఆ విషయాన్ని వేటూరి పాటలో చాలా సార్లు ప్రస్తావించి, ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అని నాకు అనిపిస్తుంది.

ఇళయరాజా సంగీతం గురించి వర్ణించడానికి నేను అనర్హుణ్ణి. స్వరజ్ఞానం లేని నా వరకు ఇది ఒక అద్భుతమైన బాణీ, స్వరకల్పన. జానకమ్మ, బాలు గురించి నేను చెప్పేదేముంది -- ఈ పాటలో వారి ఉచ్చారణ కొత్త గాయనీగాయకులకు నిఘంటువు వంటిది అని నా అభిప్రాయం.

చిత్రంలో ఈ పాట సందర్భం ఏమిటి అంటే: రాజు (చిరంజీవి) అనే యువకుడు కొంతమంది అనాథలను పెంచుకుంటూ ఉంటాడు. అతడు ఒక పని నిమిత్తమై హిమాలయాలకు వెళ్తే అక్కడ ఇంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) చెలికత్తెలతో ఆడుకుంటూ పారవేసుకున్న ఉంగరం దొరుకుతుంది. ఇంద్రజకు ఆ ఉంగరం లేనిదే స్వర్గ ప్రవేశం లేదు. ఆ ఉంగరం సంగ్రహించడానికి భూమిపైకి వచ్చి రాజును ఏదో ఒక లాగ మభ్యపెట్టి అది తీసుకుని పోదామనుకుంటుంది. కాకపోతే రాజు మంచితనానికి, తనతో ఉన్న పిల్లలతో ఏర్పడిన అనుబంధానికి లొంగిపోయి ఉంగరం దొరికినా వెళ్ళలేక ఉండిపోతుంది.

ఈ లోపు రాజుకు నాయిక ఇంద్రుని కుమార్తె అని తెలిసి, పశ్చాత్తాపంతో ఉంటాడు. వారు ఇద్దరూ కలుసుకుని తమ వలపును తెలుపుకునే సమయంలో వచ్చే యుగళగీతం ఇది.


గానం: బాలు, జానకి
రచన: వేటూరి సుందరరామ మూర్తి
దర్శకత్వం: రాఘవేంద్ర రావు
సంగీతం: ఇళయరాజ

ప్రియతమా! నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా
మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా

నాయిక నాయికుణ్ణి "నను పలకరించు ప్రణయమా" అనడంలో "అతడు ప్రణయానికి మూర్తీభవించిన రూపం" అని భావం. అస్పృశ్యమైన ప్రణయానికి, స్పృశ్యమైన నాయకుడికి సామ్యాన్ని చూపడం వేటూరి ముద్ర.అతిథి అంటే చెప్పకుండా వచ్చేవాడు అని అర్థం (అ+తిథి). దేవకన్యలు మానవులను పెండ్లి చేసుకుందామని అనుకోరు కనుక నాయిక జీవితంలోకి నాయకుడు అనుకోకుండా వచ్చాడు అని కవి భావం.

పల్లవిలో మూడు ప్రయోగాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నాయిక నాయకుణ్ణి బ్రతుకులోని బంధం, పలుకలేని భావం, మరువలేని స్నేహం గా వర్ణించడం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా "పలుకలేని భావమా" అన్నప్పుడు సప్తపదిలో "అనగల రాగమై తొలుత వీనులలరించి, అనలేని రాగమై (అనురాగం) మరలా వినిపించి" అనడం గుర్తొచ్చింది. అలాగే యువరాజు చిత్రంలో "తొలివలపే తీయనిది" అనే పల్లవి తో ఉన్న పాటలో "వేదం లాగా లిపి లేనిది" అని ప్రేమను వర్ణించడం ద్వారా వేటూరి ప్రేమను అనుభవించాలి కానీ, మాటల్లో వివరించలేము అని వర్ణించారు. ఇటీవల వచ్చిన "సూర్య S/O క్రిష్ణ" చిత్రంలో కూడా "అభిమానం అనేది మౌనం, పలకదులే పెదవులపై" అని వ్రాసారు.

ఇక్కడ ఒక విమర్శ ఏమిటంటే "నాయకుడు తన కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు, మరలి రాని నేస్తం ఎందుకయ్యాడు? మరలి పోని నేస్తం అయ్యాడంటే అర్థం ఉంది కానీ?". దీనికి సమాధానం ఆ మహానుభావుడికే తెలియాలి. ఇంత అద్భుతమైన పాటలో ఈ చిన్ని విషయాన్ని ఆయన విస్మరించారు అంటే నాకు నమ్మకం కుదరట్లేదు.

ప్రియతమా ||
ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా?

నాయకుడు ఇంద్రజని "ఎదుట ఉన్న స్వర్గం" అనడంలో శ్లేష ఉంది. స్వర్గంలో ఉన్న అందం అంతా తన కళ్ళ ఎదుట ఉంది అని ఒక అర్థం అయితే, తనతో ఉంటే అతనికి స్వర్గంలో ఉన్నట్టు (హాయిగా) ఉందని మఱొక అర్థం.

అందాన్ని కావ్యంతో పోల్చడం వేటూరికి కొత్త ఏమీ కాదు. ఛాలేంజ్ చిత్రంలో "ఓం శాంతి" అనే పాటలో, "కన్నె నడుమా కల్పనా? కవులు పాడే కావ్యమా" అని అనడం ద్వారా స్పృశ్యమైన (tangible) వస్తువులని అస్పృశ్యమైన వస్తువులతో పోల్చడం చేశారు. కౌగిలి విడితే ప్రాణాలు పోతున్నాయా అని చిలిపిగా అడగడం నాకు నచ్చింది. గుర్తు రావట్లేదు కానీ, ఇవే మాటలు మఱొక పాటలో కూడా వాడినట్టున్నారు.

నింగి వీణకేమొ నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి

వేటూరికి తెలుగు మీద ఉన్న అభిమానం గురించి నేను చెప్పక్కరలేదు. అందుకేనేమో ప్రత్యేకించి దేవకన్యకు కూడా తెలుగు నచ్చిందని చెప్తున్నారు :) నింగి వీణ సంగీతం ఆలపించాలి -- అలాంటిది నేల మీదటి తెలుగు పాటలు వచ్చాయట. పారిజాతం (చదువర్లకు పారిజాతాపహరణం గుర్తుంటే ఇంద్రుడికి, పారిజాతానికి ఉన్న సంబంధం గుర్తొస్తుంది) కాస్తా పచ్చి మల్లెమొగ్గ (సిగ్గు పడే ఆడపిల్ల) లాగా తనలో విరిసి (తనలో మెదిలి) ప్రేమను తెలిపిందట. రెండు వాక్యాలలోనూ స్వర్గాన్ని గురించి మాట్లాడారు.

మచ్చలెన్నొ ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మ  కన్న చీరకట్టుకున్న పడుచుదనమే నాలో మురిసే

దేవకన్యలో ఆకాశంలో కదా విహరించేది. ఇంద్రజకు (నాయికకు) మచ్చలున్న చందమామ కంటే (ఈ మాటల్లో కూడా శ్లేష ఉంది) మచ్చలేని (గుణవంతుడైన) నాయకుడే నచ్చాడట. తారల్లో ఒక దానిగా వెలగడం కంటే చీర కట్టుకొని ప్రియుడి కోసం వేచి ఉండటం బాగుందట. (ఇదే చిత్రంలో "యమహో నీ యమ యమ అందం" అనే పాటలో "తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి" అని అనడం కూడా నాకు నచ్చింది.) ఇందులో నాయిక కూడా ఆకాశం కంటే భూమే బాగుందని చెప్పింది.

మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం, తెలిసే హృదయం
తారలన్ని దాటగానె తగిలే గగనం, రగిలే విరహం

నాయిక తన ఉంగరాన్ని సంగ్రహించాక (తస్కరించాక) స్వర్గానికి వెళ్తూ ఉంటే తారలు దాటగానే విరహం మొదలైందట :) ఈ ప్రయోగం ఘాటు నాకు బాగా నచ్చింది. ఇక్కడ గగనం అంటే శూన్యం (ఏమీ లేకపోవడం) అనే ధ్వని కూడా వినబడుతోంది.

వ్రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే

మొదటి రెండు వాక్యాలూ "పలుకలేని భావం" కి కొనసాగింపులు. కన్నుల మధ్యన సాగే రాయబారాలకు వ్రాతలెందుకు. గతంలో "లిపిలేని కంటి బాస" అనే పాట పల్లవిలో, తఱువాత "మాయాబజార్" (రాజ, భూమిక నటించిన కొత్తది) చిత్రంలో "ప్రేమే నేరమౌన బ్రోవ భారమా? మాట మౌనమైన రాయబారమా?" అనే పాటలో ఈ భావాలను వ్రాసారు వేటూరి.

రాయి లాంటి గొంతు అంటే నా గొంతు లాగా వినడానికి కంకర్రాళ్ళు రుబ్రోల్లో వేసి దంచినట్టు ధ్వనించే గొంతు కాదని, (సిగ్గుతో) చలనం లేని గొంతు అని చదువర్లు గుర్తించే ఉంటారు :)

ప్రాణవాయువేదొ వేణువూదిపోయే శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంతా యెంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి

దేవతలకు మనకు కొన్ని భేదాలుంటాయి -- వారికి చమట పట్టదు, కళ్ళు రెప్పలు పడవు, పాదాలు నేలను తాకవు, శరీరానికి దుమ్ము అంటదు, వాళ్ళు ధరించిన పూమాలలు వాడవు. బహుశః వాళ్ళకు ప్రాణవాయువు (అదే మన oxygen) పీల్చుకోవలసిన అవసరం లేదు అని వేటూరి ఉద్దేశం అయి ఉండవచ్చును. ఆ ప్రాణవాయువు నాయకుడి శ్వాసతో తనది కలిపి, వేణుగానంలో (ప్రణయంలో) ముంచి పోయింది అని నాయిక భావం. అలాగే, వేటూరి ఎంకి పాటల గురించి ప్రస్తావించడంతో నాయికకు మఱింత తెలుగుదనాన్ని అద్దారు.

వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వచ్చా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి

నాయిక వెన్నెల వలే (ఆకర్షించి) వేదమంత్రం (పెళ్ళి) గా మారిందట. ఇక్కడ "బహుశా" అనడం బహుశా ఖాళీ-పూరింపు చర్య అయ్యి ఉండవచ్చును. కానీ ఇంత అందంగా వ్రాసిన పాటకు ఇలాంటి ఒకటి రెండు మాటలు దిష్టి చుక్కలుగా భావిస్తాను. లేదా నా అజ్ఞానం అనుకుంటాను.

నాకు పాటలోకి శ్రేష్ఠమైన వాక్యంగా గోచరించింది పై రెండో వాక్యం. మేనకల్లే (నాయకుణ్ణి ముగ్గులోకి దింపడానికి) వచ్చి జానకల్లే (నిష్ఠగా, సహధర్మచారిణి గా) మారిందట నాయిక.
ఇక్కడ కులము, గుణము అనడంలో నాయకుడి అనుయాయులు, అలవాట్లు అని ధ్వని.

నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం, విధికే విలయం
నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం, మనసే మరణం

నాయికానాయకులు ఒకరు లేని మఱొకరికి వారి సొంత ప్రపంచం అంటే విరక్తిని చెప్తున్నారు. ఐతే, నాకు నచ్చిన ప్రయోగం "మనసే మరణం" -- మనసు ఉంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అనే భావం నాకు నచ్చింది.

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై రగిలే

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో -- తెలుగులో ఇది వేటూరి, సిరివెన్నెల మాత్రమే చేయగలిగిన ప్రయోగం అని నా అభిప్రాయం. వానవిల్లు ఏర్పడాలంటే సూర్యకాంతి మబ్బుల్లోని నీటి పొరల ద్వారా చీలి కనపడాలి. దేవలోకంలోని నాయికకు భూమి చేరగానే గుండెలో ఎన్నో భావాలు (ప్రణయం, సిగ్గు, అభిమానం మొ.) పుడుతున్నాయని పరోక్షమైన ఉపమానంగా నాకు నచ్చింది. నాయకుడు చిలిపిగా "అమృతం పంచేటప్పుడు (సరసంలో) హద్దులు దేనికి?" అని తిరిగి అడిగాడు.

Sunday, October 2, 2011

వివేక చూడామణి - 2

శంకరాచార్యులు బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పారు. ఉత్తుత్తి వాదాల కోసం బ్రహ్మాన్ని గురించి చర్చించుకోవడం అనవసరం అని అదే విషయాన్ని మఱొక్క సారి చెప్తున్నారు.

వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా

భా:- వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు.

సనాతనధర్మంలో పదే పదే చెప్పే విషయం, గురుశుశ్రూష. కృష్ణపరమాత్ముడు కూడా ఆయన గురువు దగ్గర కొంత కాలం ఉండి విద్యలభ్యసించారు. అలాంటిది మామూలు మనుషులెంత? అందుకే శంకరాచార్యులు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళమన్నారు.

అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమం

భా:- ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక గురువును సమీపించాలి.

ఒక వ్యక్తి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి నాలుగు లక్షణాలు ఉండాలి. వీటిని శంకరాచార్యులు లక్షణాలు అనలేదు, సాధనాలు అన్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మన కర్తవ్యం (అద్వైతభావం) పూర్తి చేసుకోవాలి.

ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే
ఇహాముత్రఫలభోగవిరాగస్తదనంతరం
శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం


ఈ సాధనాల గురించి ఒక్కొక్కటిగా వివరించారు.

1. నిత్యం, అనిత్యం -- ఈ రెండిటి మధ్యనా భేదాన్ని గుర్తించగలగడం

నిత్యం, అనిత్యం మధ్యన భేదం సులభంగా తోచుతుంది. కానీ, దాన్ని అనుసరించడం చాలా కష్టం. ఉదాహరణకు మనం ఒక కొత్త వస్తువు కొనగానే పగిలిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది.మనకీ తెలుసును, ఆ వస్తువు ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేదేనని. కాకపోతే, తెలియడం వేఱు, దాన్ని జీర్ణించుకోవడం వేఱు. శంకరాచార్యులు చెప్తున్నది అది బుద్ధిలో పూర్తిగా జీర్ణించుకుపోవడం గురించి. 

2. ఇహంలో, పరంలో భోగాలపై విరక్తి

ఈ లోకమే కాదు, ఉన్నతలోకాలు కూడా శాశ్వతమైనవి కావు. మోక్షం మాత్రమే శాశ్వతమైన స్థితి. అందుకే పాపపుణ్యాలు రెండూ ముముక్షువుకు ప్రతిబంధకాలని శాస్త్రాలు చెప్తున్నది. అన్నమయ్య అన్నట్టు "భారపు పగ్గాలు, పాపపుణ్యములు". ఒక రూపాయి దానం చేసిన వెంటనే మనసులో ఒక తృప్తి పుడుతుంది, "ఈ రోజు ఒక మంచి పని చేశాను", అని. అంటే ఆ దానానికి ప్రతిఫలం అప్పుడే అనుభవిస్తున్నాము. "నా డబ్బు నేను ఇంకొకడికి దానం చేసాను" అనుకుంటూ చేసిన దానం పుణ్యం అవుతుంది, మఱో జన్మలో మనకు వెనక్కొస్తుంది. ఇది మంచి విషయంలా అనిపిస్తున్నా, ఆ పుణ్యం వెనక్కి రావాలి అంటే మనకు మఱో జన్మ ఉండాలి కదా? అందుకే దానం చేసేటప్పుడు, "ఇది నా ధర్మం. ఈ డబ్బు నాది కాదు.", అనే భావం ఉండాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినది.

దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం

భా:- "ఇది ఇవ్వడం నా ధర్మం" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయంలో, సందర్భంలో ఇచ్చే దానమే సాత్త్వికమైన దానం.

దానం చేసాను అనే సంతృప్తి కలగడం ఇహంలో భోగం, ఈ డబ్బు నాది అని మనసులో ఉండటం పుణ్యలోకాలలో భోగాన్ని ఆశించడం -- ఈ రెండూ మనను దానం చేసినప్పుడల్లా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుస్తోందిగా ఆ రెండవ సాధనం పొందటం ఎంత కష్టమో? ఇది సాధన చేస్తూ ఉంటే కానీ రాదు.

వైరాగ్యాన్ని శంకరుడు వర్ణించిన తీరు:

తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః
దేహాదిబ్రహ్మపర్యంతే హ్యానిత్యే భోగవస్తుని

భా:- దేహం మొదలుకొని బ్రహ్మం వరకు అనిత్యమైన వస్తువులందు "నాకు వద్దు" అనే భావం కలగడం వైరాగ్యం.

మనిషికి అన్నిటికంటే సులువుగా లభించే ఆనందాలు ఇంద్రియాలనుండి వస్తున్నాయి. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన, స్పర్శ -- ఇవే కదా వస్తువుల ద్వారా వస్తున్న ఆనందం. ఇవి కేవలం శరీరాన్ని సంతృప్తిపరచవచ్చును (తినడం), మనసుని సంతృప్తి కలిగించవచ్చును (ఇష్టమైనవారిని చూడటం), బుద్ధికి సంతృప్తిని కలిగించవచ్చును (కష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి). ఇవేవీ శాశ్వతం కావు. అందుకే ఇది వద్దు, ఇది వద్దు అనే వదులుకుంటూ కేవలం శాశ్వతమైన (బ్రహ్మపదం) వాటిని కోరుకోవడమే వైరాగ్యం.

3. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)

శమాది లక్షణాలన్నిటికీ నైఘంటికవివరణలు ఉన్నా శంకరాచార్యులు ప్రత్యేకించి వివరించారు.

3.1. శమం

విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే

భా:- మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని అధీనంలో ఉంచుకోవడం).

3.2. దమం

విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే
ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః

భా:- రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.

3.3. ఉపరతిః

బాహ్య అనాలంబనం వృత్తేరేషోపరతిః ఉత్తమా

భా:- బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.

3.4. తితిక్ష

సహనం సర్వదు:ఖానాం అప్రతీకారపూర్వకం
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే

భా:- అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడాన్ని ఉపరతి అంటారు.

3.5. శ్రద్ధ

శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం
సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే

భా:- ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.

3.6. సమాధానం

సర్వదా స్థాపనం బుద్ధః  శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనం

భా:- ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.

4. ముముక్షుత్వం

అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్
స్వస్వరూపావబోధేన మోక్తుమిఛ్ఛా ముముక్షుతా

భా:- అహంకారం మొదలుకొని ఈ దేహం వరకు అన్నిటిపైనా అజ్ఞానం వలన మనం కల్పించుకున్న బంధాలను, వీటి స్వరూపాలను అర్థం చేసుకుని, తెంచుకోవాలనే కోరికే ముముక్షుత అంటారు.

ముముక్షుత్వం అంటే "మోక్షం కావాలి" అనే బలమైన కోరిక. ఇది అన్నిటికీ మూలమైనది. మోక్షం కావాలనుకోబట్టే మనకు వివేకం, వైరాగ్యం, శమాది గుణాలు సాధనాలు అవుతున్నాయి.

"బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మోక్షానికీ తేడా ఉందా?" అని అడగవచ్చును గాక. బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైన పని అంటే మోక్షం గురించి బలమైన కోరిక లేకపోతే మధ్యలో ఆగిపోతారు. ఒక సారి బ్రహ్మైక భావాన్ని అనుభవిస్తే ఇంక ఈ లోకం పైన మక్కువ ఉండదు. అందుచేత బ్రహ్మజ్ఞానం, మోక్షం పక్కపక్కనే ఉంటాయి అని నాకు అర్థమనది.


చిలక మనం నేర్పిన మాటలనే (ఆ పదాలు అర్థం కాకపోయినా) మళ్ళీ మాట్లాడుతుంది. అలాగే పైన చెప్పినవన్నీ శంకరాచార్యులు చెప్పినవి నేను (నాకర్థమైనంతలో) మళ్ళీ చెప్పాను. ఇవన్నీ జీర్ణించుకోవడానికి నాకు సంవత్సరాలు పడతాయి. ఇలాగ వ్రాయడం వలన కేవలం నాకు మననం చేసుకోవడం సులువౌతుంది, ఈ గ్రంథాన్ని చదువని వారికి పరిచయం ఏర్పడుతుంది.