Friday, March 26, 2010

ధన్యోహం ఓ శబరీశా - వేటూరి

"అయ్యప్పస్వామి మహత్యం" చిత్రంలోని పాటలు ఎన్నిసార్లు విన్నా, నాకు మనసు నిండదు. నేను అయ్యప్పస్వామికి వీరభక్తుణ్ణి కాదు. ఎప్పుడో చిన్నప్పుడు మా వీధిలో అందరూ అయ్యప్పస్వామి మాలవేసుకుంటే చూడటమే తప్పితే, నేను అంత దగ్గరనుండి మాలధారులను కూడా చూడలేదు. ఐతే, మహదేవన్, వేటూరి, బాలు, చేసిన మహిమ వలన ఆ పాటలు ఎంతసేపైనా వినాలనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఈవేళ ఇంకో పాటను గుర్తుచేసుకున్నాను.

ఒక భక్తుడు ఈ మలినపూరితజగతిని చూసి దుఃఖిస్తూ మనఃశాంతిని వెతుక్కుంటూ ఆఖరికి స్వామి మాలను ధరించి ఆ హరిహరపుత్రుడి దర్శనం చేసుకుంటాడు. ఆ దర్శనం కలిగిన క్షణంలో అతని హృదయంలో పుట్టే ఆనందంతో కూడిన ఆవేశం ఈ పాట రూపంలో చెప్తాడు. ఆ భక్తుడి ఆవేశానికి తగినట్టు బాణీని సమకూర్చిన మహదేవన్, దానికి తన గళంతో న్యాయం చేకూర్చిన బాలు - ఇద్దరూ నిజంగా అభినందనీయులు. వేటూరి ఈ పాటలో సంస్కృతశబ్దాల ప్రయోగం ఎక్కువ చేసి, ఎంతో లోతైన భక్తిభావాన్ని, వేదసూత్రాల్ను ఎప్పటిలాగే ఒక మాలధారిని పాత్రధారిని చేసి చెప్పాడు.

ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగశబరిగిరిశృంగ, నిత్యనిస్సంగ, మంగళాంగ,
పంపాతరంగ,  పుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగ!

అయ్యప్పస్వామిని ఎంతో ఎత్తులో ఉండే శబరిగిరియొక్క శిఖరంతోనూ, పంపానదిలో తరంగాలతోనూ పోల్చి, భవబంధాలు లేని వాడిగా, శుభకరమైన రూపం కలిగినవాడిగా, మంచివారిని ప్రేమించేవాడిగా, మునుల మనస్సులను గ్రోలే (అందులోని భక్తిని అందుకొనే) తుమ్మెదగా అభివర్ణించాడు. అసలు, ఆ ప్రాస చూడండి! అద్భుతం. భావానికీ, భాషకీ న్యాయం చేకూరుస్తూ ఎంతో చక్కగా వ్రాశాడు.

బ్రహ్మచారినై, భక్తియోగినై, ద్వంద్వము అన్నది వీడి,
విగతకామినై, మోక్షగామినై, తాపత్రయమును విడచి
కన్నెసామినై, కర్మధారినై, కాలాంబరములు తొడిగి 
నీ దరి చేరితి నీలగిరీశా! బంధము తెంచితి పన్నగవాసా!

బ్రహ్మచారి అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. బ్రహ్మచారులు పరబ్రహ్మనే మనసులో ఉంచుకుని ఐహికవాంఛలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఈ కాలంలో బ్రహ్మచారులంటే ఆడపిల్లలు కనిపిస్తే కరిగిపోయే కాముకులకు పర్యాయపదంగా వాడుకోవడం మన భారతదేశసంస్కృతికి పట్టిన దుర్దశ. అయ్యప్పస్వామి మాల ధరించిన వారందరూ నిజంగా బ్రహ్మచారులై, ఆడువారికి దూరంగా ఉంటూ, ప్రతీ స్త్రీలోనూ తల్లిని చూస్తూ, అన్నీ ఆ పరమాత్ముడికోసం చేస్తూ భక్తియోగాన్ని అవలంబిస్తారు. చలి - వేడి, సుఖం-దుఃఖం వంటి ప్రాపంచికభావాలను విడచి కేవలం పరమాత్మ మీదనే దృష్టిని నిల్పుతారు. కామాన్ని విడిచి, మోక్షపథంలో నడిచి, దైనందినజీవితంలో కలిగే కష్టనష్టాలకు దూరంగా విధ్యుక్తకర్మను అనుసరిస్తూ నల్లని బట్టలు ధరించి ఆ అయ్యప్పస్వామి సన్నిధానానికి చేరుకుంటారు. ఇంతలోతైన భావాన్ని, చిన్నచిన్న మాటలతో వర్ణించాడు వేటూరి. నాకు ఈ చరణం వింటే భగవద్గీత చదివిన భావం కలుగుతోంది. భక్తియోగం, నిర్ద్వంద్వం, విగతకామి, మోక్షగామి, కర్మధారి, బంధములను తెంచుకోవడం - అంతా కృష్ణుడు భగవద్గీతలో బోధించినదే కదా? భగవద్గీత అంటే వేదసారమే కదా? అందుకే నేను చెప్పింది "వేటూరి వ్రాసిన భక్తిపాటల్లో వేదసారం ఉంటుంది", అని.

శరణం శరణం భవతరణ, శబరిగిరీశా అయ్యప్పా!
సుఖదం, శుభదం నీ చరణం, హరిహరపుత్రా అయ్యప్పా!
అయనరేఖలా సంగమవేళ మిథ్యావాదపు మధ్యస్థలిలో
సూన్యజగతిలో సూక్ష్మపరిధిలో నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచరసృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది,
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా, ఈ మహికి దేవుడే అయ్యప్ప!
శబరిగిరీశా ధన్యోహం ||

సూర్యుడు మకరరాశి మొదలుకొని కర్కాటకరాశివరకూ సాగించే ప్రయాణాన్ని (అంటే సుమారుగా ఆంగ్ళ క్యాలెండరు ప్రకారం జనవరి 13/14 తేదీలనుండి జూలై 13/14 తేదీలవరకు) ఉత్తరాయణం అని, అలాగే తిరిగి సింహరాశినుండి ధనుర్రాశివరకూ సాగించే ప్రయాణాన్ని దక్షిణాయనం అని అంటారు. ఈ రెండు అయనాలూ సంగమించేది  మకరసంక్రాంతిరోజు. ఆ పర్వదినాన మకరజ్యోతి కనబడుతుంది. "మకరసంక్రాంతిరోజు మిథ్యావాదాన్ని ఛేదిస్తూ ఆకాశంలో చిన్నదీపమై వెలిగేది మకరజ్యోతి - అది నీ మహిమే", అని అయ్యప్పస్వామిని వందిస్తున్నాడు వేటూరి.

ఈ "మహిమ, మహి" అన్న పదాలు కలిపి వాడటం వేటూరికి బాగా ఇష్టం అనుకుంటాను. "రాఘవేంద్ర" అనే (ప్రభాస్ హీరో గా వచ్చిన) సినిమాలో "నమ్మిన నా మది మంత్రాలయమేగా", అనే పాటలో "మహిని దాచిన మహిమంత, మరల చూపరా" అని వ్రాశాడు. అలాగే, "అర్జున్" చిత్రంలో "మధుర, మధురతర మీనాక్షి" అనే పాటలో "మహిని మహిమ కల మీనాక్షీ", అని వ్రాశాడు. కొన్నికొన్ని ప్రయోగాలు వేటూరి పదే పదే చేసినా వినడానికి ఇబ్బంది కలగవు! వాటిల్లో ఇది ఒకటి!

Thursday, March 25, 2010

మాలధారణం నియమాలతోరణం - వేటూరి

భక్తిరసప్రధానమైన చిత్రాలు తెలుగులో చాలా వచ్చాయి. వాటిల్లో చాలా మంది రచయితలు మంచి పాటలు వ్రాశారు. అలాంటి చిత్రాలలో "అయ్యప్పస్వామి మహత్యం" అనే చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో గీతసారాన్ని గీతాలలో నింపాడు రచయిత వేటూరి. ఒక్కో పాటా ఆణిముత్యం. భావం గంగమ్మలాగా ప్రవహిస్తే తెలుగు గోదారిగంగలాగా పారింది. ఈ పాటలు అయ్యప్పస్వామి భక్తులందరికీ అత్యంతప్రీతిపాత్రమైనవి.

ఈ పాటలను వేటూరే వ్రాసారని ragalahari.comలో చెప్పారు. అయినా నేను నిర్ధారించుకోవడానికి సినిమాలో titles చూశాను. అక్కడ ఆచార్య ఆత్రేయ పేరు (సహాయకులతో సహా) ఒక చోట, వేటూరి సుందరరామమూర్తి అని ఒక చోట పడ్డాయి. కానీ, వారు నిర్వహించిన బాధ్యతలను చెప్పే పదాలు backgroundలో ఉన్న వెలుగు వలన కనబడలేదు. ఆచార్య ఆత్రేయ సినిమాలకు మాటలు వ్రాసేవారు. అందుచేత ఆయన మాటలు వ్రాయగా వేటూరివారు పాటలు వ్రాశారని నా నమ్మకం. ప్రత్యేకించి ఈ పాట శైలి, సాగరసంగమంలో వేటూరి వ్రాసిన "ఓం నమఃశివాయ" శైలితో పోల్చదగినది (ఎందుకో క్రింద చెప్పాను). అందుకే ఇది వేటూరే వ్రాశారని నా నమ్మకం.

మాలధారణం, నియమాలతోరణం
జన్మతారణం, దుష్కర్మవారణం
శరణం, శరణం, శరణం, శరణం, అయ్యప్పస్వామి శరణం, అయ్యప్పస్వామి శరణం

"అయ్యప్పస్వామి మాలను ధరించడం అంటే నియమాలను దండగా చేసుకుని ధరించడం, భవసాగరాన్ని ఆ ఊతతో ఈదడం, చెడ్డపనులవైపు మనస్సు మరలకుండా అప్పడం", అని కవి వర్ణన. అంత్యప్రాస ఎంత చక్కగా కుదిరింది? భావం ఎంత లోతుగా ఉంది? భక్తిపాటలు వ్రాయడంలో తెలుగు చలనచిత్రపరిశ్రమలో వేటూరికి సాటి లేరు అని నా నమ్మకం. వైదీకసూత్రాలను కూలంకషంగా పరిశీలించి వ్రాసినట్టుగా గోచరిస్తాయి ఆయన పాటలు.

ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయసాధనలో
చతుర్వేదములలో రక్షణలో, పంచభూతముల పంజరశుకమై
ఆరుశత్రువుల ఆరడిలోపడి, ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల, మాలధారణం!

"ఉదయమూ సాయంత్రమూ, ధర్మం-అర్థం-కామం (తలచిన పని సిద్ధించాలని) ఈ మూడింటినీ తీరంగా పెట్టుకుని, నాలుగు వేదాల చేతా రక్షింపబడుతూ ఉంటారు మాలధారులు. పంచభూతములు అనే పంజరములో ఉన్న చిలుకలాగా, అరిషడ్వర్గాలు (కామక్రోధమోహలోభమదమాత్సర్యాలు) చేత వేధింపబడుతూ ఉన్న వారు నువ్వే ఏడు జన్మలకూ వీడని చేయూతవని నమ్మి నీ మాలను ధరిస్తారయ్యా!", అని భావం. ఎంత లోతైన వైదీకమర్మాలను చెప్పాడు? భక్తుల మనస్సులోనున్న ఆవేదన, వారి కష్టాలు, వారు భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తారు - అన్నీ చెప్పాడు.

మీరు గమనించినట్టైతే ఇక్కడ రెండు సంధ్యలు, మూడు పురుషార్థాలు, నాలుగు వేదాలు, పంచభూతాలు, ఆరు శత్రువులు, ఏడు జన్మలు" అన్నాడు కవి. పెరుగుతూ ఉన్న సంఖ్యలను చూడండి. సాగరసంగమం చిత్రంలో "ఓం నమఃశివాయ" పాటలో "త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, పంచభూతములు ముఖపంచకమై, ఆరు ఋతువులే ఆహార్యములై, ప్రకృతి పార్వతీ నీతో నడచిన ఏడు అడుగులూ స్వరసప్తకమై, నీ దృక్కులే అష్టదిక్కులై, నీ వాక్కులే నవరసమ్ములై, నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయా", అంటూ సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళాడు. అందుకే "మాలధారణం" పాట శైలిని "ఓం నమఃశివాయ" పాటతో పోల్చినది.

"అ-ఉ-మ" సంగమనాదంలో ఓం, ఓం, ఓం
హరిహరరూపాద్వైతంలో శరణం, శరణం, శరణం, శరణం
నిష్ఠురనిగ్రహయోగంలో, మండలపూజామంత్రఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే, ఆత్మహారతులు పట్టిన భక్తుల మాలధారణం!

ఈ చరణం గురించి చర్చించుకునే ముందు కే.వీ.మహదేవన్ గురించి చెప్పుకోవాలి. వేటూరి ఆయన్ని కలిసిన కొత్తల్లో tune చెప్పండయ్యా అంటే, "tune మేము చెప్తే ఇంక రచయితకు స్వేఛ్ఛ ఎక్కడుంటుందయ్యా? నువ్వు పాట వ్రాయి, నేను tune చేస్తాను", అన్నాడట. ఆహ! ఒక మలయాళీయుడయ్యుండి, తెలుగుజనాలకు తనపాటలతో మృష్టాన్నభోజనం తినిపించిన మహానుభావుడు మామ, మహదేవన్. మొదటి చరణానికీ రెండో చరణానికీ tune భేదం ఉంది గమనించండి. అంటే వేటూరి ముందు పాట వ్రాశాకా, దానికి లయలు నేర్పించాడు మామ! ఈ చరణం ముందు వచ్చే వేణునాదంలో భక్తితరంగాలు తాండవించాయి. మహదేవన్ నిజంగా మహానుభావుడు!

"ఓం" అనే నాదం, "అ", "ఉ", "మ" అనే మూడు స్వరాలను కలిపితే వచ్చింది అని వైదీకుల నమ్మకం. ఈ ప్రపంచం ఆ నాదంలోనుండి పుట్టింది అని మన విశ్వాసం. అయ్యప్పస్వామి హరిహరుల తనయుడని, వారిద్దరి మధ్యనా భేదాలు/విభేదాలు లేవని నిరూపించేందుకు పుట్టాడని ఆయన చరిత్ర చెబుతోంది. ఈ మూడు స్వరాల కలయికలో, ఆ రెండు మహాశక్తుల మేళనలో, ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తూ, మంత్రాలనడుమ భక్తులు వారు చేసిన పాపపుణ్యాలను కర్పూరం చేసి అయ్యప్పస్వామికి హారతిగా పడతారుట! కర్మ, దాని ఫలితం ఉన్నంతకాలమే ఆత్మ ఈ భౌతికప్రపంచంలో నడుస్తుంది. ఆ కర్మను నాశనం చేసేవాడు యోగేశ్వరుడైన పరమాత్మ. ఆ నైష్కర్మ్యాన్ని సాధించేందుకు భక్తులు స్వామి వద్దకు మాలను ధరించి వస్తున్నారు అని ఎంత లోతైన భావాన్ని తక్కువ మాటల్లో చెప్పడో వేటూరి!

ఈ చిత్రంలో మిగిలిన పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. త్వరలోనే ఆ పరమాత్ముడి దయతో అవన్నీ కూడా వ్రాయగలనని ఆశిస్తున్నాను. హరిః ఓం.

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు - రాముడిపై కొన్ని పద్యాలు :)

మీకూ, మీ ఇంటిల్లిపాదికీ, మీ శ్రేహోభిలాషులకూ నా మనఃపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు! శ్రీరామనవమి గురించి తలుచుకుంటే ఈ బ్లాగుకు రెండేళ్ళు నిండాయన్న సంగతి ఙప్తికి వచ్చింది. శ్రీరాముడి గురించి చెప్పడానికి నేను చాలను. వాల్మీకి, తులసీదాస్, విశ్వనాథ సత్యనారాయణ, త్యాగరాజు వంటి మహానుభావులు ఏళ్ళ తరబడి తపిస్తే వ్రాయగలిగిన పుణ్యగాధ శ్రీరామునిది. వారితో పోలిస్తే నేను మహాసాగరంలో ఒక నీటిబొట్టును. సముద్రానికి, జలబిందువుకూ పరిమాణంలో తేడా ఉన్నా, వాటిలోని గుణం ఒక్కటే. అలాగే ఆ మహాకవుల గొప్పదనానికి నేను సరితూగలేకపోయినా, వారిని నడిపించిన భక్తే నన్నూ నడిపిస్తుంది అన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను.

రాముడి గురించి ఏమైనా చెప్పుకునే ముందు, ఆదికవి వాల్మీకిని స్తుతించడం మన సంప్రదాయం. అందుకే ఒక్కమారు ఆయన్ని తలుచుకుందాము:
పద్యం:-
కూజంతం రామరామేతి మధురం, మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ||
భా:-
కవిత అనే కొమ్మనెక్కి "రామ, రామ" అనే మధురమైన అక్షరాలను తీయగా పాడుతున్న వాల్మీకి అనే కోకిలకు నేను నమస్కరిస్తున్నాను.

జంటగా కూస్తున్న రెండు పక్షులలో ఒకదానికి బోయవాడు గాయం చేయడం చూసిన వాల్మీకి ఆవేశంలో, మొట్టమొదటిసారిగా సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు. అందుకే రామాయణాన్ని "శోకంలో పుట్టిన శ్లోకంగా" చెప్పుకుంటారు. ఆ శ్లోకాన్ని, దాని కథని మీరు వాల్మీకికవి వికిపిడియా వ్యాసంలో చూడవచ్చును. అలాగే సంపూర్ణరామాయణం, ఆంగ్లానువాదం ఇక్కడ చూడవచ్చును.

వాల్మీకి నారదమునిని: "ఎవరయ్యా సర్వగుణసమిష్టిరూపం? సద్భుద్ధి కలిగినవాడు, ప్రతాపం కలిగినవాడు, ధర్మం తెలిసినవాడు, నిజమే మాట్లాడేవాడు, పట్టుదల ఉన్నవాడు, కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను జయించినవాడు - వాడెవ్వడయ్యా ఈ లోకంలో?", అని అడిగితే అప్పుడు నారదముని చెప్పిన సమాధానమే "రాముడు". రాముడు ఇతరభగవదవతారాల్లాగా మానవాతీతశక్తులను ప్రదర్శించినట్లుగా రామాయణంలో ఎక్కడా లేదు. ఒక సామాన్యుడు తన మనస్సును ధర్మమార్గంలో పెడితే అప్పుడు అతడు ఎలాగ ఉంటాడు అన్నది మాత్రమే రాముడు చూపించాడు. నాకు, మీకు, మనందరికీ ఆదర్శపురుషుడు రాముడు. పరమాత్ముడు, గురువు, తండ్రి, తల్లి, పినతల్లులు, తమ్ముళ్ళు, భార్య,  దేశం, ప్రజలు  - వీరందరి పట్లా తన ధర్మం తప్పక పాటించిన మహాత్ముడు రాముడు. ప్రపంచం తల్లక్రిందులైనా భరతఖండంలో ప్రతీ ఇసుకరేణువులోనూ నిండే కథ రామాయణం.

ఏకపత్నీవ్రతుడైన రాముడి ఔన్నత్యం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ముగ్గురిని పెళ్ళి చేసుకున్నవాడికి తెలియదు. ధర్మఙుడైన రాముడి ఙానం రామాయణంలో ఒక్క శ్లోకం కూడా చదవకుండా "చాకలి మాటకు ఇల్లాలిని అడవిపాలు చేశాడు", అని నిందించే కూహనామేధావులకి తెలియదు. భ్రాతృప్రేమకు నిలువుటద్దమైన రాముడి ప్రేమ సొంతతమ్ముడు తిన్నాడొ లేదో చూడకుండా బ్రతికేవాడికి తెలియదు. పితృవాక్పరిపాలకుడైన రాముడి గరిమ తండ్రి చివరిరోజుల్లో దగ్గరుండి సేవ చెయ్యాలని తెలియనివాడికి తెలియదు. సత్యానికి అధీనమై నడచుకున్న రాముడి గొప్పదనం నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెప్పే రాజకీయనాయకులకి తెలియదు. కేవలం నిర్మలమైన భక్తిని మనసులో నింపుకున్న భక్తుడికే తెలుస్తుంది. కలలో కనబడి పుస్తకం వ్రాయమంటే ఏళ్ళ తరబడి కూర్చుని వెన్న కన్నా, జున్ను కన్నా, తేనె కన్నా రుచికలిగిన పద్యాలతో స్వామి రసనాన్ని మెప్పించిన పోతరాజు (పోతన) వంటి మహాభక్తులకే తెలుస్తుంది. రామనామము అనేకకోటిసార్లు జపించిన త్యాగరాజుకు తెలుస్తుంది. ఒకటి - మనకు భక్తి ఉంటే ఆ మార్గంలో పయనించాలి. రెండు - మనకు లేకపోతే మన పని మనం చూసుకుని, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వాలి. కలియుగప్రభావాన ప్రస్తుతం ఈ రెండువర్గాలవారూ తక్కువే!

ఆ శ్రీరామకృపవలన నాకు అంతో ఇంతో భక్తిభావం మనసులో కలిగింది. సరస్వతి అనుగ్రహించినంతవరకు, నాకు వీలైన మాటల్లో, ఈ పద్యాలను వ్రాస్తున్నాను:

సీ:-
తండ్రిమాటకొఱకు తాటకనువధించి, యఙాన్ని కాచావు యతినిగూడి
పినతల్లి కోర్కెకై ఎనలేని భోగాలు, విడనాడి అడవికి వెడలినావు
ఇల్లాలి ముచ్చట నెరవేర్చగోరుచు, లేడివెనుక వేటలాడినావు
ధర్మాన్ని రక్షించ దశకంఠునోడించి, నీతికి రూపమై నిల్చినావు

తే:-
ప్రేమ, ధర్మంబు తోడుండ ఏమి లోటు?
కలిమి యెంతైన శౌర్యము కల్గునొక్కొ?
అడవిలోనైన, అయోధ్యనైన నీవె
రాజువుగదయ్య లోకాన! రఘుకులేశ!

ఆ:-
ఆంజనేయుఁగాను హృదయాన్ని చీల్చగ
త్యాగరాజుఁగాను రాగమనగ
పోతరాజుఁగాను కైతలు కురిపించ
పామరుండనయ్య పాహి రామ!

ఇంతసేపూ రాముణ్ణి పొగిడాను కదా. ఇప్పుడు సరదాగా రెండు పద్యాలు వ్రాద్దామనిపించింది. ఇది నా అఙానాన్ని ప్రదర్శించడమే తప్ప, రాముణ్ణి తక్కువ చేసే ప్రయత్నం కాదని రసఙులు గమనించగలరు.

ఆ:-
అందమందు నిండుచందురుడికి సాటి
గుణములోన మెరియు మణి కదయ్య
అమ్మలాగ యింటినాదరించెడి తల్లి
ఆమె చాలనియననద్భుతంబు !!!

కం:-
అందము కొంచెమె చాలయ
కందువ తెలియక మెలగుచు కాస్త శమముతో
అందరిని చూచి, మన్నన
పొందెడి సతి చాలనియన పొగడరె నన్నున్?

భా:- గొప్ప అందకత్తె, గుణంలో మణి, ప్రేమమూర్తి అయిన సీత ఒక్కత్తే చాలని నువ్వంటే అది ఒక అద్భుతం. (మరి, రాముడు ఏకపత్నీవ్రతుడు కదా!) కొద్దో గొప్పో అందం ఉంటే చాలు, కుట్రలు చేయకుండా, అందరినీ చూసుకుంటూ, కాస్త మెప్పు పొందే ఒక అమ్మాయి చాలు అంటే మాత్రం నన్నెవరూ పొగడరెందుకో?

Saturday, March 20, 2010

గురుచరణం శరణం - ఇళయరాజ

మలయాళంలో వచ్చిన "గురు" చిత్రం కథ వింటేనే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ కథ గురించి నేను గతంలో ఒక ఆంగ్లటప వ్రాశాను. ఈ చిత్రం ఎవరైనా మలయాళస్నేహితుడితో కలిసి చూడాలన్నది నా కోరిక. ఇందులో ఇళయరాజ  స్వరపరచిన "గురుచరణం శరణం" అనే పాట, నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఈ పాటలో ప్రతీ స్వరం భక్తిని, దయని నింపుకుంది. ఈ పాటను ఎలాగైనా ఆంధ్రీకరించాలన్న నా తపన ఈ రోజు తీరింది.

నాకు వీలైనంతగా ఈ పాటలో భక్తిరసాన్ని, భగవత్తత్వాన్ని నింపాను. పల్లవిలో "గురుచరణం" అన్నది మార్చి "నీ చరణం",  అని వ్రాయడానికి కారణం బాణీలో ఉన్న భక్తితత్వానికి  తగ్గట్టుగా భావాలకు ఇంకా విశాలమైన ప్రాంగణాన్ని కల్పిద్దాము అని. గురువుని కంటే భగవంతుడిని పొగడటానికి అవధులు తక్కువ - అందుకని.

మొదటి చరణంలో పంచభూతాలు, ఆకాశం (గగనం), నీరు (వరుణం), నేల (భువనం), గాలి (పవనం), నిప్పు (సూర్యుడు) అన్నింటినీ భగవంతుడి సృష్టిగా వర్ణించాను. ఇందులో తిగ్మతేజం అనడంలో నా ఉద్దేశం "వేడి కలిగిన ప్రకాశం" అని. కొంచం సంస్కృతభూయిష్టంగా ఉన్నా సందర్భానికి తగినట్లు ఉందని వ్రాయాల్సివచ్చింది. రెండవ చరణంలో ప్రకృతిలో ఉన్న అన్ని విశేషాల వెనుకా ఉన్నది ఆ పరమాత్ముడే అనే భావాన్ని కలిగేలా ప్రయత్నించాను. చివరగా ఆ పరమాత్మకు నమస్కారాలను సమర్పించాను.

చిత్రం: గురు (1997- మలయాళం)
దర్శకుడు: రాజీవ్ ఆంచల్
సంగీతం: ఇళయరాజ
మలయాళంలో గీతకర్త: రమేశన్ నాయర్


నీ చరణం శరణం స్వామీ! భవభయహరణం
పరమాణువు మొదలు జగం, నీ వశమేగా సకలం
ఆధారమై గావరా!

గగనం, నీలిమేఘం, వరుణం, ఇంద్రచాపం,
భువనం, హరితచేలం, పవనం, పుష్పగంధం,
చలిని తొలచు తిగ్మతేజమై, కనులు వెతుకు కాంతిపుంజమై
వెలయు రవీ [ఓంకారరూప] నీ మహిమే! [ఓం శాంతి ఓం]

కులికే కోకిలైనా, ఉరికే జింకలైనా
కురిసే చినుకులైనా, మురిసే ఆకులైనా
వెనుకనున్న ఉనికి నీవుగా!
విశ్వమంత నీకు రూపుగా
వెలసితివే! [ఆనందరూప] ప్రణతులివే [ఓం శాంతి ఓం]

Wednesday, March 17, 2010

కిట్టు కథలు - తండ్రి ప్రేమ

కిట్టుకి భాగ్యనగరంలో ఒక పెద్ద MNC లో ఉద్యోగం వచ్చింది. అందులో చేరిన వెంటనే తన తండ్రి సుబ్బారావుకి phone చేసి అక్కడ విషయాలన్నీ చెప్పాడు. అది విని సుబ్బారావు చాలా సంతోషించాడు. ఇక తనకున్న తగులూమిగులూ భూములని అమ్మి ఆ డబ్బు తీసుకుని భార్యతో సహా కిట్టు దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాడు. కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఏ తండ్రికైనా వచ్చే సంతోషమే తనకూ వచ్చింది.

రాత్రి దగ్గరే ఉన్న హోటల్లో భోజనం చేసి కిట్టు తన room-mateతో మాట్లాడుతూ ఇంటివైపికు నడుస్తున్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే అది కిట్టు వాళ్ళ మేనత్త కొడుకు, శివ. తను వరసకు బావ అయినా కిట్టు కంటే చాలా పెద్దవాడు. శివ తల్లికి, కిట్టు తండ్రికి పదిహేనేళ్ళ వయోభేదం ఉంది. అతను వైజాగ్లోనే కిట్టు ఇంటికి దగ్గరలో ఉంటాడు. ఎత్తగానే, "ఒరేయ్ నాన్న, నువ్వు urgent గా బయల్దేరి వైజాగ్ వచ్చెయ్యరా. నాన్నని ఆసుపత్రిలో చేర్పించాము.", అని అన్నాడు. కిట్టుకు అసలు ఏమీ అర్థం కాలేదు. తన తండ్రికి దగ్గూ, జ్వరం కూడా ఎప్పుడూ వచ్చిన గుర్తులేదు కిట్టుకి. ఉన్నట్టుండి hospitalలో admit చెయ్యడమేమిటా అనుకుంటుండగానే, "వివరాలన్నీ రేపు నువ్వు వచ్చాక మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి నువ్వు దొరికిన bus ఎక్కి వచ్చెయ్యి", అని పెట్టేశాడు శివ.

కిట్టు వెంటనే బస్సెక్కి వైజాగ్ చేరుకున్నాడు. ICU బయట తన తల్లి కళ్ళల్లో నీళ్ళతో కూర్చుని ఉంది. "ఒరేయ్ నాన్నా, మీ నాన్న నిన్న సీతాపురం వెళ్ళివచ్చారు. వస్తూనే ఏమీ మాట్లాడకుండా, భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళి పడుకున్నారు. కాసేపటికి వొళ్ళంతా చెమటలతో, మొహం ఎర్రగా అయిపోయి, "అరుణ, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది అన్నారు. వెంటనే శివగాడికి ఫోన్ చేశాను. వాడు వచ్చి హాస్పిటల్లో చేరిపించాడు. రాత్రినుండి ఇక్కడే కూర్చుని ఉన్నాను. ఎవరూ నాకు ఏమీ చెప్పట్లేదు. డాక్టర్ నువ్వు వచ్చాక మాట్లాడతానన్నారు. త్వరగా వెళ్ళి విషయం ఏంటొ కనుక్కోరా", అంది. తన తల్లికి కాస్త ధైర్యం చెప్పి ICUలోకి వెళ్ళాడు.

ఒంటినిండా వైర్లతో చుట్టూ మెషీన్లతో ఉన్న సుబ్బారావుని చూస్తూనే కిట్టుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెళ్ళి, "నాన్నా", అని పిలవగానే "సర్, ఆయన్నిప్పుడు మాట్లాడించకూడదు. మిమ్మల్ని doctorగారు కలవమని చెప్పారు", అంది ఒక నర్సు. కిట్టు బాధగా డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్, "మీరేనా సుబ్బారావుగారి అబ్బాయి?", అని అడిగాడు. "అవునండి", అన్నాడు కిట్టు. "కూర్చోండి. మీ నాన్నగారి పరిస్థితి గమనిస్తున్నాము. ప్రస్తుతానికి బానే ఉంది. కాకపోతే ఇంకా నయమైంది అని చెప్పలేము.", అన్నాడు డాక్టర్. "అసలేమైంది డాక్టర్? మా నాన్నగారికి ఎప్పుడూ అనారోగ్యం చెయ్యడం నేను చూడలేదు", అన్నాడు కిట్టు. "ఆయనకి BP ఉంది. ఎప్పటినుండో heart-related-problem ఉంది. ఆయన check చేయించుకోలేదు. మీరైనా చేయించి ఉండాల్సింది. యాభై ఏళ్ళు దాటాక అందరూ health-check చేయించుకుంటూ ఉండాలి అండి.", అన్నాడు డాక్టర్. "ఐతే ఇప్పుడు మా నాన్నగారికి  ఆపరేషన్ చెయ్యలా?", అడిగాడు కిట్టు. "ఇప్పుడు ఆయన గుండెకి ఆపరేషన్ కి తట్టుకునే బలం లేదు. కొన్నాళ్ళు observationలో పెట్టి అప్పుడు నిర్ణయించాలి. అప్పటిదాకా ఆయన్ని మాట్లాడించద్దు. మీ బంధువులని కూడా ICU లోనికి పోనివ్వద్దు అండి.", అన్నాడు డాక్టర్. "అలాగే అండి. ఉంటాను", అని చెప్పి కిట్టు బయటకు వచ్చేశాడు.

బయట బల్ల మీద కూర్చుండగా శివ వచ్చాడు. "ఒరేయ్ నాన్న, మీ నాన్నను చూశవా, డాక్టర్ తో మాట్లాడావా?", అని అడిగాడు. "చూశాను బావ. డాక్టర్ గారు ఇంకా అబ్సర్వ్ చెయ్యాలి అంటున్నారు", కిట్టు అన్నడు. "నాతో కూడా అలాగే అన్నారు. బాధ పడకురా. తండ్రిలాంటివాడే అన్యాయం చేస్తే ఎవరికి  గుండె మండదు?", అన్నాడు శివ. అదేమిటి అన్నట్టు చూశాడు కిట్టు. "నిన్న మీ నన్న సీతాపురమ్నుండి వస్తూ మీ ఇంటికి వెళ్ళేముందు మా ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం నాతో చెప్పాడు. మీ నాన్నకి ఉన్న భూములు అమ్మి నీ పేరున fixed depositలు వేద్దామని అనుకున్నాడురా. అందుకే తన భూములని ఎవరో కొనడానికి వస్తే చూపించడానికి సీతాపురం తోటకి వెళ్ళాడు. అక్కడ మీ తోటని కొలిస్తే రెండు ఎకరాలు తక్కువ వచ్చాయి. తాతయ్య చనిపోయినప్పుడు మావయ్యకి ఐదేళ్ళు. అమ్మమ్మకి (కిట్టూకు నాన్నమ్మ) అసలు ప్రపంచకఙానం లేదని మన చినతాతే తనవాటా, మన తాతయ్యవాటా కూడా చూశేవారు. మావయ్యను పెంచడానికి అమ్మమ్మ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు మావయ్య చదువు పూర్తయ్యాక చినతాత తాతయ్య వాటా మావయ్యకి ఇచ్చారు. నేను మావయ్యకి చెప్తూనే ఉన్నాను 'వొకసారి కొలిపించు మావయ్యా', అని. కొలిపించకుండా తీసుకున్నాడు. మావయ్యకి చినతాత అంటే గుడ్డినమ్మకం. తనను సొంతకొడుకులాగా పెంచిపెద్దచేసినవాడు తనను ఎందుకు మోసం చేస్తాడు అని! చినతాత మనిషి మంచివాడే అయినా, మావయ్య అంటే అభిమానం ఉన్నా తన భార్య అలాంటిది కాదు కదా. ఎప్పుడూ తన ఆస్తి ఏదో మనం తినేస్తున్నట్టుగా అనుకునేది. ఇప్పుడు ముప్ఫై ఏళ్ళ తరువాత చూసుకుంటే తెలిసింది, మావయ్యకు రావాల్సిన రెండు ఎకరాలు చినతాత ఉంచేసుకుని, తన కొడుకు పేర్న వ్రాసుకున్నాడు అని. ఆ విషయం తెలియగానే మావయ్య వెళ్ళి చినతాతని తన తోట తనకు ఇచ్చెయ్యమని అడిగితే చినతాత ఇవ్వనన్నాడు. సుమారు నూరేళ్ళు ఉంటాయి ఆయనకి, మునిమనవల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఐనా కూడా ఆయనకు డబ్బు మీద మక్కువ పోలేదు. మావయ్య నీకోసం దాచిన ఆస్తి ఆ భూమే. అదే నీకు దక్కనివ్వకపోతే ఆయనకు కోపం వచ్చి చినతాతతో తగువు పెట్టుకుని వచ్చేశాడు. అదే బాధ మనసులో పెట్టుకోవడం వలన ఇలాగ గుండెపోటు వచ్చింది", అన్నాడు. వింటూనే కిట్టుకు రక్తం మరిగిపోయింది. వెళ్ళి చినతాతని "నూరేళ్ళు వచ్చాయి. మునిమనమళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. నీ కళ్ళతో నీ కొడుకు వయసువాళ్ళు చనిపోవడం చూసి ఉంటావు. నీ మనవరాలు వయసు వాళ్ళు భర్తను కోల్పోవడం చూసి ఉంటావు. తాత, నీకు ఇంకా విరక్తి కలగలేదా?", అని అడుగుదామనిపించింది. కోపం కంటే కర్తవ్యం ముఖ్యమని అనుకుని తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, డాక్టర్తో మాట్లాడాను. రెండుమూడురోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. నువ్వు టిఫిన్ చేశావా? పద తిందుగాని?", అన్నాడు.

రెండుమూడురోజులు గడిచాక సుబ్బారావు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. త్వరలోనే general ward కి మారుస్తాము అని చెప్పాడు డాక్టర్. కిట్టుని తండ్రితో మాట్లాడనిచ్చారు. కిట్టు లోపలికి రాగానే సుబ్బారావు కుశలప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానం ఇచ్చి, నాలుగు మంచి మాటలు చెప్పిన కిట్టు, కాసేపటికి జరిగిన విషయం గుర్తుకొచ్చి, "నాన్న, పండుముసలివాడయిపోయి, నరాలు చచ్చుపడిపోతున్నా ఎందుకు నాన్న చినతాతకి అంత డబ్బు పిచ్చి. ఆయనేమీ చచ్చేటప్పుడు పట్టుకుపోడు కదా? వంద సంవత్సరాలు బ్రతికినా మనిషికి విరక్తి రాదేమిటి? పెళ్ళాం మాట పట్టుకుని మీకు ఎందుకు ద్రోహం చేశారు నాన్న?", అన్నాడు. అప్పటిదాకా శాంతంగా ఉండి, వీలైనంతవరకు నవ్వడానికి ప్రయత్నించిన సుబ్బారావు ఒక్కసారిగా, "నోర్ముయ్!", అన్నాడు. అప్పటిదాకా దీనంగా ఉన్న కిట్టుకు ఒక్కసారి కరణాలన్నీ జాగృతమయ్యాయి. "ఎవడ్రా మా బాబాయికి వందేళ్ళు అన్నది? ఆయన పుట్టింది 1917లో. ఇప్పటికి ఆయన వయసు 93 ఏళ్ళు. మా బాబాయి గురించి మాట్లాడటానికి మీకెవ్వరికీ హక్కు లేదు. పుట్టినరోజుకని నాకు బట్టలు కుట్టించడం కోసం డబ్బులు అడుగుదామని, మా అమ్మ తన పుట్టింటి నుండి ప్రయాణం చేసి వస్తే ఇంట్లోకి కూడా రమ్మనేది కాదు మా పిన్ని. బయట గంటలకొద్దీ చింతచెట్టుకింద చెప్పులు లేకుండా నిలబడేది మా అమ్మ నా కోసం. అప్పుడు మా బాబాయ్ వచ్చి మమ్మల్ని మనస్పూర్తిగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి గడ్డపెరుగు కలిపి పెట్టేవాడురా. ఆయన పెళ్ళాం మాట విని మాకు అన్యాయం చేసి ఉంటే ఇలాగ మనం ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. మా అన్నయ్య (చినతాత కొడుకు) ఉట్టి వెర్రిబాగులవాడురా. వాడికి ఏమీ తెలియదు. వాడి తెలివిదక్కువతనంతో ఎక్కడ కొంచం ఆస్తి పాడుచేసినా ఇంకా ఉంటాయని ఆ రెండు ఎకరాలూ తీసుకున్నాడు. ఐనా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు?", అన్నాడు సుబ్బారావు. కిట్టూ అలాగ చూస్తూ ఉండిపోయాడు. ICUలో ఉండి, కొడుకు కన్నీళ్ళతో వచ్చి కూర్చుంటే ఇలాగ తిట్టి, తనకు అన్యాయం చేసిన బాబాయ్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు తండ్రి అన్నది తనకు అంతు పట్టలేదు.

చిన్నబోయిన కిట్టూని చూసి, సుబ్బారావు కాస్త నెమ్మదిపడి, "ఒరేయ్ నాన్న, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు సహిస్తావా? లేదు కదరా? అలాగే మా బాబాయ్ ని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేనురా. వరసకు బాబాయే కానీ, ప్రేమకు తండ్రికి ఎప్పుడూ తీసిపోలేదురా. నా అక్కచెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. నన్ను చదివించాడు. నా ఆస్తిని ఇరవయ్యేళ్ళు కాశాడు. ఇంతకంటే ఇంకెవరు చెయ్యగలరురా?", అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు అక్కలందరికీ కట్నం కోసం చూసుకుని తక్కువ సంబంధాలు చేశాడని, తన ఆస్తిలో ఒక భాగం తీసేసుకుని మోసం చేశాడని, ఆ చినతాత సొంతబిడ్డలే అనుకుంటూ ఉండగా చాలాసార్లు కిట్టు విన్నాడు. అలాంటిది ఇంకా తన తండ్రి గుడ్డిగా చినతాతను నమ్మడం ఇంకా కిట్టు సహించలేకపోతున్నాడు. తను పరిస్థితి గమనించిన సుబ్బారావు, "నేను ఎందుకు తోటలు అమ్మాలనుకున్నానురా? ఆ డబ్బులు నీకు ఇద్దామనే కదా? అలాగే ఆ రెండు ఎకరాలూ తన కొడుక్కి ఇద్దామనుకున్నాడు మా బాబాయ్. ఎటొచ్చి అవి న్యాయంగా నాకు చెందాల్సినవి. అది నీకు అన్యాయం అనిపించవచ్చు. ఎప్పుడూ మా బాబాయ్ కి ఎదురుగా ఒక్క మాట కూడా మాట్లాడని నేను ఆ రోజు 'ఇకనుండి నువ్వు ఎవరో, నేను ఎవరో. నీకూ నాకూ సంబంధం లేదూ, అన్నాను తెలుసునా?", అన్నాడు సుబ్బరావు. ఇది విని కిట్టు ఆశ్చర్యపోయాడు. తన బంధువర్గమంతా "సుబ్బారావే వాళ్ళ బాబాయ్ కి కన్నకొడుకుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాడు.", అని పేరు. "బాబాయ్ ని అంత గౌరవించే నా చేత అంత మాట అనిపించిందిరా పిల్లల మీద ప్రేమ. మరి వయసు మీరిపోయి, కొడుకు అమాయకుడు, ఏమవుతాడో అన్న బెంగ ఆయనకు ఉంటుంది కదరా? అందుకే అలాంటి పని చేశాడు. సొంతపిల్లల మీద ప్రేమతో పెంచిన కొడుకు దగ్గర రెండు ఎకరాలు తీసుకోవడం తప్పైతే, పిల్లలమీద ప్రేమతో పెంచి పెద్ద చేసిన బాబాయ్ ని అంత మాట అనడం కూడా తప్పే!", అన్నాడు సుబ్బారావు. కిట్టుకి ఒక విషయం అర్థమయ్యింది. తన మీద ప్రేమతో తన తండ్రి చినతాతని ఎదిరించాడు తప్పితే, ఆ డబ్బు మీద అసలు సుబ్బారావుకు ఆశ లేదు. "నాన్నా, చినతాతయ్య గురించి నేను ఏమీ అనను. కానీ, ఆ రెండు ఎకరాల గురించి మీరు మరిచిపోండి. నేను సంపాదిస్తున్నాను కదా డబ్బులు. అవి చాలు నాన్నా మనకి. మీరు చెప్పించిన విద్యాబుద్ధులు ఉన్నాయి. అంతకు మించి నాకేమీ వద్దు నాన్న!", అన్నాడు కిట్టు. "నీకున్న పాటి బుద్ధి నాకు లేకపోయిందిరా. మా బాబాయ్ చెప్పించిన విద్యాబుద్ధులున్నాయి కదా. ఐనా ఆ భూమి కోసం నేను పెద్దపెద్ద మాటలన్నాను. బాధపడుతూ ఉంటాడేమో", అన్నాడు సుబ్బారావు. విని కిట్టూ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. సుబ్బారావుని rest తీసుకోమని చెప్పి బయటకు వచ్చాడు.

కిట్టు ICU బయట బల్ల మీద కూర్చుని ఆలోచించాడు, "ఏమిటి? నాన్నకి వాళ్ళ బాబాయ్ మీద అంత గౌరవం? కేవలం నాలుగు మంచిమాటలు మాట్లాడి, మా ఆస్తి కొన్నాళ్ళు చూసిపెట్టినందుకే? మరి నాన్న నన్ను పెంచి పెద్దవాడిని చేసి, ఏది అడిగితే అది కొనిపెట్టారు నాకు కూడా నాన్న పట్ల ఇంతే గౌరవం ఉందా? నాన్న ఏదైనా పొరబాటు చేస్తే నేను ఇలాగే సహనంతో ఓర్చుకుంటానా? ఏదేమైనా సరే, ఈ సంఘటన ద్వారా నాకు ఒకటి తెలిసింది. ఒక మనిషి మనకు కోపం తెప్పించినప్పుడు, ఆ మనిషి మనకు గతంలో చేసిన మంచిని మరిచిపోకూడదు. తప్పులందరూ చేస్తారు. కానీ, వాటిని అవతలవాళ్ళ దృష్టిలోనుండి అర్థం చేసుకుని క్షమించకపోతే అప్పుడు ఆ అనుబంధానికి విలువే లేదు. నాన్నా! నేను గొప్ప universityలో masters  చదివాను. కానీ, నాకు ఇలాంటి పాఠం ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ICUలో ఉండి మీరు చెప్పారు.", అనుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, నాన్న condition మెరుగుపడిందిటమ్మా. general ward లోకి shift చేస్తున్నారు.", అని చెప్పాడు. అప్పటిదాక కంట కునుకు లేకుండా ఉన్న అరుణ మొహంలో కాస్త కాంతి కనబడింది.

Sunday, March 14, 2010

సినిమా పాటల్లో మళ్ళీ మళ్ళీ కనబడే పదాలు, భావాలు

"చలనచిత్రగీతాలలో పదభావపౌనఃపున్యము" అని ఈ టపకు నామకరణం చేద్దామని అనుకుని, చదివే ఆ ఇద్దరు-ముగ్గురు కూడా, "ఇదేదో గ్రాంధికం గోలలాగా ఉంది. light తీసుకుందాము.", అనుకుంటారని కొంచం మామూలు మాటల్లో టైటిల్-ప్రదానం చేశాను. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఈ మధ్యన తెలుగుపాటలు వినీ వినీ, "ఈ నవసినీకవులకు ఇంక వేరే పదాలు/భావాలు దొరకవా? ఎంతసేపు ఇవే పట్టుకుని తిప్పితిప్పి వ్రాస్తూ ఉంటారు.", అని అనిపించింది. అందుకే సినిమాకవులకు ఉన్న ఊతపదాలు, ఉత్తిపదాలు, ఊదరగొట్టే పదాలు, ఊరిపోయిన పదాలు, రొటీనైపోయిన భావాలు, రోత పుట్టిస్తున్న, రోగాలు పట్టిన భావాలు ~ వీటి గురించి వ్రాద్దాము అని నిర్ణయించుకున్నాను.

తెలుగు వ్యాకరణం పుట్టినప్పటినుండి కవిత అంటే పద్యాలు అనే అర్థంగా ఉందేమో! నన్నయ్య పదకొండవ శతాబ్దం నుండి పద్యాలు వ్రాయటం మొదలుపెట్టాడు. ఆ తరువాత పదునాల్గవ శతాబ్దంలో పదకవితాపితామహుడు అన్నమయ్య కర్ణాటక సంగీతాన్ని ఆధారంగా కవిత్వాన్ని అల్లడం మనకు తెలుసును. ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. యతిప్రాసాదినియమాలతో రెండూ వ్రాసేవారికి ఒక పందిరి కట్టేవి. ఆ పందిరిపైన కవులు పదాలను తీగెలుగా చేసి కవితలను అల్లేవారు. ఒకచోట గణాలు ఉంటే, మరొక చోట రాగాలు ఉండేవి ~ రెండూ లయను (స్వరాలను) అందించడం కోసమే!

నేను తొమ్మిదో తరగతిలో ఉండగా, "ఊతపదాలు, వ్యర్థపదాలు" అనే ఒక పాఠ్యాంశాన్ని చదువుకున్నాను. అందులో, నన్నయ్య, తిక్కన, పోతన, వంటి మహాకవులు ఛందస్సు కోసం అక్కడక్కడా అనవసరమైన పదాలను పెట్టి కవితలు పూర్తిచేసేవారని, కొందరికైతే కొన్ని గణాలకు ready-made పదాలు ఉండేవి అని రచయిత చెప్పగా చదివాను. అది బహుశ: నిజమేనేమో! నాకూ పద్యాలు వ్రాయడంలో అనుభవం ఉంది కాబట్టి కొంతవరకు నేనూ గ్రహించగలను. ఇలాగ ఛందస్సు అనే గోడల మధ్యన వ్రాసే కవిత్వం యాంత్రికమైపోతోందని, కృష్ణశాస్త్రివంటి కవులు వీటిని ధిక్కరించి అప్పటికి సామాన్యమైన (గ్రాంధికం కాని) తెలుగులో భావకవితలను వ్రాయటం ప్రారంభించారు. అప్పట్లో ఛాందసులుగా పేరుబడిన పద్యకర్తలు కొందరు దీన్ని తీవ్రంగా ఖండించి భావకవిత్వానికి వ్యతిరేకంగా పుస్తకాలు కూడా ప్రచురించారు. ఐనప్పటికీ ప్రజాదరణ వలన భావకవిత్వానికి క్రమేపీ ప్రాచుర్యం లభించింది. ఈ పాటలను కొందరు దర్శకనిర్మాతలు స్వరకల్పన చేయించి తమ చిత్రాలలో వాడుకున్నారు కూడా! ప్రజలు భావకవిత్వాన్ని ఎంతగానో ఆదరించడంతో చలనచిత్రాలలో కూడా అవే మొదలయ్యాయి. చాలా రోజులపాటు మొదట కవి పాటవ్రాసి ఇస్తే అప్పుడు సంగీతదర్శకుడు దానికి బాణీ కట్టడం జరిగింది.

కొన్నాళ్ళకు ఇతరభాషల్లో హిట్టయిన పాటలను తెలుగులోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా మొదట బాణీ ఇచ్చి తరువాత దానిలో ఇమిడేట్టు పాటలు వ్రాయడం ప్రారంభించారు.  "పద్యాలు/పదకవితలు వ్రాసేటప్పుడు గణవిభజన చేసి, స్వరనియమాలను పాటిస్తూ వ్రాయడం వలన, భావాస్వేఛ్ఛ కంటే భాషాబంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది", అన్న విషయం మళ్ళీ మొదలైనది. ఇప్పుడు అవే బంధనాలు ముందుగా అల్లిన బాణీలుగా అవతరించాయి. సంగీతదర్శకుడు ఏదో ఒక పాశ్చాత్యబాణీ తెచ్చుకొచ్చి ఇందులో నువ్వు పదాలను నింపవయ్యా అంటే అప్పుడు కవులు మాత్రం ఏం చేస్తారు? దొరికిన అరకొర పదాలే నరికి ఇరికించి బరికేస్తారు. ఇందులో కొంచం వాడుకలోలేని పదాలు వచ్చినా, "ఏమిటయ్యా ఇది? తెలుగు text-book అనుకుంటున్నావా? కాస్త మామూలు మనిషికి అర్థమయ్యేలాగా వ్రాయి", అని పాటకారులని ఇబ్బంది పెడుతున్నారు. సినిమాకథల్లో కొత్తదనం లేకపోవడంతో అటు భావాలకు, బాణీలనూ/so-called వాడుకభాషనూ సంకెళ్ళుగా తగిలించడంతో ఇటు భాషకు స్వేఛ్ఛ లేకుండా తయారయ్యింది. దీంతో దిక్కుతోచని కవులు, "మనసు, వయసు, తెలుసు, అలుసు, సొగసు", "చిలుక, అలక, మొలక", "చెలియ, సఖియ", "అలుపు, గెలుపు", "వలపు, తలపు", "భామ, ప్రేమ, ధీమ" వంటి ready-made పదసమూహాలను జేబులో పెట్టుకుని పాటలు వ్రాస్తున్నారు. అక్కడక్కడా అవసరం లేకపోయినా సరే "ఏ" తగిలిస్తూ ఉంటారు. ఉదాహరణకి: "నా మనసు నీది" అందామనుకున్నప్పుడు సంగీతదర్శకుడు "లా లలలా లాల" అని రావాలి అని అంటే అప్పుడు కవి "నా మనసే నీది" అంటున్నాడు. అంటే, "మనసు ఒక్కటే నీది, తనువు వేరేవాళ్ళది", అనా? లేక, "నా మనసొక్కటే నీది, వేరే వాళ్ళ మనసులపైన నీకు హక్కు లేదు", అనా? అది వ్రాసేవాడికి, OK చెప్పేవాడికి, పాడేవాడికి, వినేవాడికి, award ఇచ్చేవాడికీ కూడా అంతుపట్టని అనవసరమైన విషయం. ఒక్కసారి "నా హృదయం నీది" అంటే సరిపోతోందే అని, ఆగి ఎందుకు ఆలోచించరో నాకు అర్థం కాదు. అలాగే "మరి", "ఇంక", "ఇక", "అంట", "అట" వంటి పదాలు ఎక్కడ పడితే అక్కడ వడ్రంగి చెక్కముక్కలమధ్యలో ఖాళీని నింపడానికి మక్కు పెట్టినట్టు పెడుతున్నారు.

సిరివెన్నెల, వేటూరి, వెన్నెలకంటి, భువనచంద్ర లాంటి సీనియర్లను వదిలేస్తే తక్కినవాళ్ళు యతి గురించి అసలు ఎప్పుడో మరిచిపోయారు. ప్రాస కావాలి. ఉదాహరణకు "బన్ని, చున్ని, పిన్ని" వంటి పదాలను కలిపి ఒకాయన పాట వ్రాస్తే అది సూపర్~డూపర్~హిట్టయ్యింది. "వినేవాడిననాలి అసలు", అనిపించింది. దీనికి కొంతవరకు సినిమాహీరోలను అనాలి. మహాపండితుడు, సామవేదం షణ్ముఖశర్మగారు ఒక చక్కని పాటని "మేలుకొలుపు తొలిరాగం సూర్యోదయం", అని వ్రాస్తే ఆ కథానాయకుడు "మేలుకొలుపు అనేది సంస్కృతపదం. ఇది సామాన్యులకెలాగ అర్థమవుతుంది?", అని అడిగాడట. ఆయన దాన్ని "పల్లవించు తొలిరాగం సూర్యోదయం", అని మార్చాల్సివచ్చిందట. అప్పుడు ఆ హీరో, "పల్లవించు అనేది తెలుగుపదం. ఇది సామాన్యూలకందరికీ అర్థమవుతుంది", అని మెచ్చుకున్నాడట. అమెరికాలో చదివిన ఆ అబ్బాయికి మేలుకొలుపు అచ్చతెలుగుపదమని, పల్లవించు అనేది సంస్కృతం నుండి వచ్చిన పదమని తెలియనప్పుడు ఎందుకు నా పనిలో వేలు పెట్టాలి అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపొయాడు ఆ మహానుభావుడు. ప్రస్తుతతెలుగుసినిమాకవులకు పూజ్యుడనిపించుకుంటున్న వేటూరి ఒకసారి ఇలాగ అన్నారు: "తెలుగు సినిమా పాట పాంచాలి లాంటిది. ఆమెకు ఐదుగురు భర్తలు. సంగీతదర్శకుడు, నిర్మాత, చిత్రదర్శకుడు, హీరో, వారి బంధువులు ~ తెలుగుసినిమాపాటకు భర్తలు". ఆ మధ్యన "ఏయ్ చికీతా కొమొస్తాస్" అనే పాట ఎందుకు అలగ వ్రాశారండి అని అడిగితే "హీరో వచ్చి, Spanish భాషలో దీని అర్థం 'ఏయ్ పిల్లా ఏట్ఠాగున్నావూ?' అని కాబట్టి అలాగ వచ్చేలా వ్రాయండి" అన్నాడని చెప్పారు ఆయన. ద్రౌపదికి అయితే పూర్వజన్మపుణ్యం వలన ఐదుగురుభర్తల ఉన్నా పాతివ్రత్యానికి ఏమీ భంగం కలగలేదు. ఇప్పుడు వచ్చే సినిమా పాటలను ద్రౌపదితో కాక వేరే రకం స్త్రీలతో పోల్చాల్సి వస్తోంది.

ఇన్ని కత్తుల మధ్యలో నడుస్తున్నా కూడా కవితకు న్యాయం చేసేవాళ్ళూ లేకపోలేదు. ఉదాహరణకు నేను వేటూరి పేరు చెప్తే ముక్కూ, చెవీ, నాలుకా ఇత్యాది శరీరభాగాలను కోసేసుకుంటాను కానీ, భాషకు, భావానికి సమతుల్యం చేకూర్చడంలో నేను సిరివెన్నెలకు వీరాభిమానిని. ఒకప్పుడు వేటూరి కూడా అలాగ వ్రాసేవారు. అయితే వృద్ధాప్యంవలనో ఏమో ఈ మధ్యన భాషకు అంత న్యాయం చేకూర్చట్లేదు అని నా అభిప్రాయం. నాకు పరిచయం ఉన్న ఔత్సాహికపాటకార్లు నన్ను తమ పాటలపై అభిప్రాయం అడిగినప్పుడు, "ఎందుకు ఇలాగ పదాలను ఇరికించావు?", అని అడిగితే, "ఇది మా చేతుల్లో లేదు. దర్శకనిర్మాతలు/సంగీతదర్శకుడూ దీన్ని ఇలాగ మార్చారు", అని చెప్తున్నారు. పాపం, వారినీ అనుకోవడానికి ఏమీ లేదు. "నువ్వు ఇలాగ నా పాటని మారిస్తే ఒప్పుకోను. నీకు కష్టమైతే పో", అని ధిక్కరించే స్థాయికి ఎదగాలంటే, "నేను నా ఇష్టమొచ్చినట్టు నీ పాటని మారుస్తాను. నీకు కష్టమైతే పో", అనే తుఘ్లక్లకు తలవొంచాల్సిందే. స్వయంగా నాకు పాటలు వ్రాయాలని ఉన్నా, నేను సినిమా ప్రపంచం జోలికి పోనిది అందుకే. తరాలు మారినా నాకు పోతన తత్వం నచ్చింది. "బాలరసాలనవపల్లవకోమలకావ్యకన్యకం" అని ఆయన సంస్కృతపదాలతో ఆఛ్ఛేదించి చెప్పినది: "నేను ప్రేమతో కన్న నా కవితలను రాజులకిచ్చి ఆ పడుపుకూడు తినడం కంటే రైతుగా మిగిలిపోవడం మంచిది", అని. "ఈనాటి సినిమాకవిత్వం broiler-chicken లాంటిది. పెంచుకునేది ప్రేమతో కాదు, ఆశతో", అని ఒకాయన చెప్పాడు. నిజమేనేమో అనిపిస్తుంది.

నింద మొత్తం సినిమావాళ్ళమీదా, కవులమీదా వేసేస్తామా? లేదండీ. ప్రేక్షకులను కూడా తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఉంది. పాటలు విని ఊరుకున్నా ఫరవాలేదు కానీ, అవి పిల్లలకు మప్పి మరీ stage మీద పాడిస్తున్న మహామహిమాన్వితమాతృమూర్తులను, పిచ్చిపిచ్చిడాన్సులకు రెచ్చిపోయి చప్పట్లు కొడుతున్న ఆదర్శపితృమూర్తులను కూడా అనాలి కదా? అసలు కోడినంటూ తినేవాడు ఉంటేనే కదా, వాటిని ఎవడైనా వాటిని పెంచేది?

దినదినమూ దుర్దశకు దగ్గరవుతున్న ఈ తెలుగు సినిమా పాటలను ఎవరూ రక్షించలేరు అనిపిస్తోంది. కానీ, ఒకప్పుడు ఇదే పరిస్థితిలో "ప్యార్ హో రహా హై, చేయ్న్ ఖో రహా హై, నీంద్ జా రహా హై", వంటి ప్రయోగాలను తిప్పితిప్పి వాడుకున్న హిందీ చిత్రాలు గుల్జర్, జావేద్ అఖ్తర్ పుణ్యమా అని ఇప్పుడు కొంచం కొత్తదనాన్ని అందుకున్నాయి. అలాగే ప్రాచుర్యం వచ్చిన నూతనతెలుగుసినిమాకవులలో కూడా ఎవరైనా కాస్త "వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేల్తలపెట్టవోయ్", అనుకుంటే ఇది తెలుగులో కూడా సంభవిస్తుంది అనే ఆశ ఉంది. ఒకప్పుడు అరిటిపండు ఒలిచి పెడితేనే తినే తెలుగుపాటలశ్రోతకు వేటూరి "పురుషుల్లోన పుంగవా" వంటి ప్రయోగాలను రచించడమే కాకుండా రుచింపజేశాడు! ఆయన అన్నట్టు "వెయ్ వెయ్ పునరపి బంధనం", అని ఎవరైనా తెలుగుపాటకారకుడు పూనుకోకపోతాడా అన్నదే నా ఆశ.

(ఈ వ్యాసంలో కనీసం ఒక డజను దుష్టసమాసాలు ఉన్నాయి. వాటిని "వాడుక భాషలో వ్రాద్దామనే" ప్రయత్నానికి పుట్టిన అక్రమసంతానంగా భావించి విడిచిపెట్టాల్సిందిగా నా మనవి.)

పూంగదవే తాళ్కిరవాయ్

ఈ మధ్యన పరభాషల్లో నాకు నచ్చిన ఇళయరాజ పాటల్ని తెలుగులోకి నేనే freemake చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాస్త పాడుకోవడానికి వీలుగా ఉండేలాగా, సినిమా పాటల లాగా కాకుండా కాస్త fresh గా ఉండేలాగా ప్రయత్నిస్తున్నాను. original లో ఉన్న పదాలు/భావాలు అలాగే ఉంచాలని నేను అనుకోవట్లేదు. అయితే దుఃఖాన్ని హర్షాతిరేకంగానూ, ఆనందాన్ని అంతులేని శొకంగానూ మార్చను. genre అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాను.

అక్కడక్కడా గురువు (లా) ఉండాల్సిన చోట రెండు లఘువులు (లల) వేస్తున్నాను, భావానికి న్యాయం చేయడం కోసం. అలాగే కొన్ని పదాలు గ్రాంధికంగా (యామిని=రాత్రి, కౌముది=వెన్నెల) వ్రాయడం పాట momentumకు అడ్డుపడచ్చును కానీ, అలాంటి చక్కని పదాలను కాస్త జనాలు గుర్తుచేసుకునేందుకు ఉపయోగపడతాయి అని వ్రాస్తున్నాను.

ప్రస్తుతానికి నేను తిరగవ్రాస్తున్న పాట: "పూంగదవే"!

ప:-
యామినిలో కౌముదిలా
రావా, ఓ పూవా!
నా కన్నుల నిండుగ

చ-1:-
నీ స్నేహం నా దీపం, ఆశలరాశులకది రూపం
నీ ఊహే ఆనందం, పెదవికి తెలియని మకరందం
మానసవేణువు నేర్చెనిలా, ఇదివరకెరుగని రాగం

చ-2:-
నీ చూపే కార్తీకం, తాకిన మనసుకు చలిస్నానం
నీ మాటే మధుగీతం, తేనెలు జారే జలపాతం
మారక ఆమని ఆగినదా? మనసులు కలసిన మనకోసం