Friday, September 30, 2011

సంగీతమేఘం (ఉదయగీతం)


తమిళంలో ఇళయరాజ చేసిన శ్రావ్యమైన గీతాల జాబితాను తయారు చేయడం వారికి కూడా అసంభవం అని నా నమ్మకం. ఏ జన్మపుణ్యఫలమో ఆయనకు అనుకోగానే మధురాతిమధురమైన బాణీలు ఇట్టే స్ఫురిస్తాయి. అలాంటి మధురమైన గీతాలలో నాకు నచ్చిన ఒక పాట ఇది. దీన్ని ఉదయగీతం అనే చిత్రానికి ముత్తులింగం అనే రచయిత వ్రాసారు, బాలు పాడారు. చిత్రంలో కథానాయకుడు పాటకాడు. సంగీతం పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, ఇష్టాన్ని ఈ పాట ద్వారా చెప్తాడు అని నాకు చూచాయిగా అర్థమైంది. ఆ పాటను తెలుగులో కూడా వ్రాద్దామనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను.

పాటలో చాలా వాక్యాలు వేటూరిని, ఇళయరాజ ని దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. మొదటి చరణంలో సాహిత్యం గురించి, రెండవ చరణంలో సంగీతం గురించి వ్రాసాను. పాట Commerical గా ఉండకుండా వీలైనంతవరకు ప్రయత్నించాను. రోజంతా కూర్చుని వ్రాయవచ్చును కానీ, అంత సమయం లేదు కాబట్టి రెండున్నర గంటల్లో తోచిందేదో వ్రాసాను. పల్లవి ఆఖరిలో పూర్తి చేసినందుకో ఏమో అంత బలంగా అనిపించలేదు.

సంగీతమేఘం వర్షించే గానం
మనసుల్లో పండిస్తుంది ఆనందం
గానం నా జీవితం, గీతం మీకంకితం
ఎపుడూ సాగాలి ఈ సంబరం

మాట పూల తోటలో బాటసారి శ్వాసలో
తావి కలిసిన తీపి గాలుల మాధుర్యమూ
భావమేఘమాలలో  ఆస చుక్కల డోలలో
మేను మరిచిన గుండెజాబిలి సౌందర్యమూ
ఇలా పాటై తేనె వూటై పొంగెనీ గొంతులో (2)
పాటే నా గమ్యం...

తీపి స్వరముల సవ్వడో, స్వాతి చినుకుల తాకిడో
గుండె ఝల్లని పొంగు క్షణమున నేనెఱుగను!
భావమెఱిగిన రాగమూ, తాళశ్రుతులకు యోగమూ
మేళవించిన గీతమందు అదే అనుభవం
ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా (2)
పాటే నా జీవం...

తమిళ పల్లవిలో "సంగీతమేఘం తేన్సిందుం రాగం", మొదటి చరణం చివరిలో వచ్చే "ఇంద దేగం, మరైందాలుం ఇసయాయ్ మళర్వేన్" -- ఈ రెండు వాక్యాలనూ తస్కరించి వాడాను. మొదటిది తమిళ పాట తెలిసినవాళ్ళకు (నాకు కూడా) బొత్తిగా తలా తోకా లేకుండా పూర్తిగా కొత్త పల్లవి ఇష్టం లేక. రెండవది నాకు ఆ వాక్యం బాగా నచ్చింది కనుక. నిజానికి ఆ వాక్యం పాతలో రెండు సార్లు వస్తుంది -- దాన్ని వేటూరికి అన్వయించినప్పుడు "ఈ దేహం మన్నైనా పాటై నిలుస్తా, పాటల్లో భావాన్నై (లై) మీలో వసిస్తా" అని పాడుకునేవాడిని. ఇక్కడ మాత్రం బీజగీతంలో లాగ మొదటి వాక్యం మాత్రమే ఉంచాను.

Thursday, September 29, 2011

వివేక చూడామణి - 1

సనాతన ధర్మానికి వేదాలు మూలం. వేదాలు తిరుగు లేనివన్నది సనాతనధర్మంలో మొదటి సూత్రం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు తరతరాలుగా సనాతనధర్మంలో గురుముఖతః ప్రచారం ఔతూ, పరంపర ద్వారా కొనసాగుతూ వచ్చాయి.

భారతంలోనే చార్వాకం, బౌద్ధం, జైనధర్మం మొదలైన మతాలు ఉన్నాయి. ఇవన్నీ వేదాల యొక్క పరమోత్కృష్టతని ఉల్లంఘించిన మతాలు. శంకరాచార్యుడు జన్మించిన సమయానికి ఇవన్నీ భారతదేశంలో బలంగా పాతుకుపోయాయి. సనాతనధర్మానికి విలువ లేక, నాస్తికత ప్రజ్వలించింది. అటువంటి సమయంలో శంకరాచార్యులు వాటన్నిటినీ తిరస్కరించి తిరిగి భారతదేశంలో సనాతనధర్మాన్ని పునఃస్థాపించారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసి, వారి గురువులైన గోవిందభగవత్పాదుల అనుగ్రహంతో అద్వైతాన్ని జగత్తుకు అందించారు. ముప్పై రెండేళ్ళ జీవితంలో ఆయన సాధించిన విజయాలను, ఆయన అందించిన భాష్యాలను, స్తోత్రరత్నాలను పరిశీలిస్తే ఆయన దైవాంశసంభూతులనడంలో, ఆత్మవంచన చేసుకోని ఏ ఒక్కరికీ, సందేహం ఉండదు.

శంకరాచార్యుల గురించి చెప్పడానికి ఒక జీవితం సరిపోదు. కానీ, ఆయన ఆశించినది, ఆయన గురించి మనం చెప్పుకోవడం కాదు, మనం అద్వైతానుభవాన్ని పొంది విముక్తులమవ్వాలని. అందుకే ఆయన ఆలోచనల సారాన్ని మనకు వివేకచూడామణి గా అందించారు. ఆ వివేకచూడామణి శ్లోకాలను, స్వామీ తురియానంద వ్రాసిన అనువాదాన్ని ఈ మధ్యనే నేను చదివాను.

వివేకచూడామణికి, భగవద్గీతకి చాలా దగ్గర సంబంధం ఉన్నా వివేకచూడామణి అధ్యాత్మికంగా చాలా పురోగమించినవాళ్ళకు తప్ప జీర్ణం కాదు. భగవద్గీతలో పిల్ల, పెద్ద, పండితుడు, పామరుడు అందరూ అర్థం చేసుకోగలిగిన ఘట్టాలు ఉంటాయి. కృష్ణపరమాత్మ కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలను సూచించి వీటిల్లో భక్తియోగం సులభమైనదని, అందరికీ ఆచరణయోగ్యమైనది అని నిర్దేశించాడు. అది మనందరికీ శిరోధార్యం. ఆది శంకరుడు భారతదేశాన్ని చుట్టినప్పుడు బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధమతం వేదాలను, ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తుంది. మఱొక్క అడుగు ముందుకేసి ఏకంగా "ఆత్మ" అనేదే లేదు అంటుంది. అటువంటి వారితో వాదించి సనాతనధర్మ వైశిష్ట్యాన్ని చూపడానికి శంకరుడు కూడా అదే స్థాయి abstraction ని ఉపయోగించి, వారి వాదనాపద్ధతులను కూడా అనుసరించి వారిని ఓడించారు. స్వయంగా భక్తిమార్గాన్ని కూడా అనుసరిస్తూనే, జ్ఞానమార్గంలో వెళ్ళి ఉపనిషత్తులను ఎంతో లోతుగా అధ్యయనం చేసి, వాటి సారం జీవాత్మ-పరమాత్మల యొక్క ఏకత్వమని, ఆ అద్వైతాన్ని ప్రబోధించారు.

అధ్యాత్మవిద్యను అధ్యయనం చేయడం చాలా కష్టం, దాన్ని ఆచరించడం మరింత కష్టం. అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇలా అన్నాడు:

మనుష్యాణాం సహస్రేషు, కశ్చిత్ యతతి సిద్ధయే
యతతాం అపి సిద్ధానాం, కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః

దీని భావం, "వెయ్యిమంది మనుషులలో మోక్షం కొఱకు ప్రయత్నించేవాడు ఒక్కడు ఉంటాడు. అలాంటివారిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను అర్థమవుతాను", అని.

కృష్ణుడు చెప్పిన యోగాలన్నీ కూడా, "అనుసరిస్తున్నాము" అనుకుని ఆత్మవంచన చేసుకునేవారు నిత్యజీవితంలో కనిపిస్తూ ఉంటారు. జీవితాంతం తన సంతృప్తి కోసం కర్మలని ఆచరిస్తూ, ఫలితాలను చూసి మురిసిపోతూ చివరికి అంతా భగవంతుడికి అర్పిస్తున్నాను అనుకుంటారు. అది కర్మయోగమని వారు అనుకున్నా, ఒక రకంగా చెప్పాలి అంటే ఎంగిలే. మఱి కొందరు జ్ఞానయోగంలో ఉన్నాము అనుకుంటూ పుస్తకాలు తిరగేస్తూ వాదించుకుంటూ ఉంటారు. పఠనం, వాదన రెండూ తప్పు కావు కానీ, ఆ వాదనలో ఎంత వరకు మోక్షప్రయాస ఉందో కూడా గమనించుకోకుంటే అది పాండిత్యం కాదు, శబ్దప్రచ్చన్నపామరత్వం అవుతుంది. ధ్యానయోగం పేరుతో అంతర్యానం చేసుకోకపోతే అది నిద్రతోనే సమానం. అందుకే అర్జునుడు కూడా ధ్యానయోగాన్ని కృష్ణపరమాత్మ సూచించగానే "నా వల్ల కాదు", అన్నాడు. చివరిగా భక్తియోగం అనుసరిస్తున్నాము అనుకునే వారు కూడా సమదర్శిత్వాన్ని, స్థితప్రజ్ఞని, అనన్యచింతనని ఇవ్వకపోతే భగవంతుడికి కొంచెం దగ్గరవ్వడం, పుణ్యార్జన జరుగుతాయి కానీ, మోక్షాణికి ఒకడుగు ఇటు ప్రక్కన వదిలేసే అవకాశం ఉంది.

ముఖ్యంగా భక్తిని సరిగ్గా అర్థం చేసుకోని వారు ఆ మార్గంలో వెళ్తున్నాము అనుకుంటారే కానీ పరమాత్ముణ్ణి కూడా తమ దైనందినజీవితంలో ఒక వస్తువు లాగా భావించే ప్రమాదంలో ఉంటారు. భక్తి పేరుతో కొందరు, ప్రజల సొమ్ము దోచుకున్నదంతా దోచుకుని, దేవాలయాలకు కిరీటాలు విరాళంగా ఇచ్చి వారి పాపాలు తొలగిపోయాయి అనుకుంటారు. కొందరు రోజూ పొద్దున్న దణ్ణం పెడుతూనే దేవుడు వారికేదో ఋణపడిపోయినట్టు భావిస్తుంటారు. అడిగితే, "He is my best friend." అంటారు. మఱి కొందరు నామమాత్రంగా పూజలు, జపాలు చేస్తూ ఉంటారు. పూజ, జపం చేసినప్పుడల్లా దృష్టి ఫలితం మీదనే. ఆ ఫలితం ప్రసాదం కావచ్చును, కార్యసిద్ధి కావచ్చును. కొందరు మాత్రమే దైవాన్ని తలుచుకున్నప్పుడు ఆ దైవం సామీప్యతను అనుభవించగలుగుతారు. 

ఈ విషయాన్ని గుర్తించో ఏమో శంకరులు నిర్ద్వంద్వంగా ఈ విధంగా అన్నారు:

5. పఠంతు శాస్త్రాణి, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంతు దేవతాః
ఆత్మైకబోధేన వినాపి ముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేऽపి

13. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః
న స్నానేన, న దానేన, న ప్రాణాయామశతేన వా

ఈ శ్లోకాల భావం "శాస్త్రాలు చదివినా, దేవతల ప్రీత్యర్థం యజ్ఞాలు చేసినా, దేవతలను భజించినా, మనిషి తాను ఆత్మ అన్న విషయం తెలుసుకోకపోతే కోటి-కోటి సంవత్సరాలైనా ముక్తిని పొందలేడు. పుణ్యనదీస్నానాలు, దానాలు, ప్రాణాయామాదులు సత్యం తెలుసుకోవడానికి దోహదపడవు. కేవలం గురూక్తులపైన దృష్టిని ఉంచి అర్థం చేసుకోవడం వలనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ", అని.

భక్తియోగాన్ని నమ్మినవారికి ఈ రెండు పద్యాలూ కర్కశంగా తోచవచ్చును. స్వయంగా కృష్ణపరమాత్ముడే "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని చెప్పాడు కదా? మఱి దేవుడు మోక్షాన్ని ఇవ్వడంటారేమిటి అని. శంకరాచార్యులు చెప్తోన్నది ఈ దేహంలోని వాసనలు నీకు ఉన్నంత కాలం, "నేను" అన్నప్పుడు "దేహాన్ని" కూడా కలుపుకొంటున్నంత కాలం నీకు ముక్తి లేదు అని. భక్తిమార్గంలో కూడా సరిగ్గా పయనిస్తున్నవారికి ఆత్మైక భావం కలుగుతుంది. అది కలగకుంటే ఎక్కడో పొరబాటు ఉంది అని.

శంకరుడు వివేకచూడామణిలో రెండుమూడు సార్లు తప్ప దేవుడు అన్న పదాన్ని ప్రస్తావించలేదు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమో, ఆయనకు భక్తియొగంపైన నమ్మకం లేకనో కాదు. కర్మ, జ్ఞానం, ధ్యానం, భక్తి -- ఏ యోగాన్ని అనుసరించిన ముముక్షువుకైనా ఆయన చెప్పిన విషయాలు ఏదో ఒక సమయంలో ఎదురౌతాయి అని.

(ఇంకా ఉంది...)

Saturday, September 10, 2011

విడిపోవడం ఎలా?

యండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వవికాసం పైన వ్రాసిన పుస్తకం పేరులాగున్నా ఈ వ్యాసంలో అలాంటివి ఏమీ ఉండవని ముందుగానే చెప్తున్నాను. "ఎవరైనా కలిసుండటం ఎలాగ అని వ్రాస్తారు కానీ ఇలాగ విడిపోవడం ఎలాగ అని వ్రాస్తారా?" అని అడిగే చదువర్లకు వివరణ, ఈ వ్యాసానికి ఉపోద్ఘాతం రెండూ ఒకటే.

మనిషి ఒక విచిత్రమైన జంతువు. తను ఒక్కడూ ఉండలేడు, అలాగని మఱి కొందరితో ఉంటే వాళ్ళందరికంటే పై చేయి తనదవ్వాలని, తనకొక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. (ఈ గోలంతా మనం ఇదివరకే ఒక సారి చెప్పుకున్నామనుకోండి. దానికి ఇది కొనసాగింపు వ్యాసం అనుకోవచ్చునేమో.) ఈ ప్రత్యేకతని సంపాదించుకోవడానికి మొదట తన చుట్టూ ఒక బలగాన్ని ఏర్పరుచుకుని, ఆ బలగానికి తను నాయకుడై, ఆ బలగం బలం పెంచి మిగతావారిని ఓడిస్తాడు. ఓడిపోయినవారిలో గొప్ప ఎవరో పట్టించుకోరు, గెలిచినవాళ్ళలో నాయకుడి పేరే అందరికీ తెలుస్తుంది. ఫలితంగా అతడికి ప్రత్యేకత కలుగుతుంది. భాషలో సవర్ణదీర్ఘసంధి సూత్రం, గణితంలో పైతాగరస్ సూత్రం, భౌతికశాస్త్రంలో న్యూటన్ సూత్రం లాగా మనిషి అనే జంతువు ఆడే, సాంఘిక క్రీడలో ఇది ఒక సూత్రం/ఎత్తు. దీన్నే ముద్దుగా కూడలి-విడుగడ సూత్రం అని పిలుచుకుందాం. చదువర్లెవరైనా ఇంకా మంచి పేరును సూచిస్తే చాలా సంతోషిస్తాను.

ఇదే సూత్రాన్ని తరతరాలుగా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు. సరే ఒకప్పుడు ఛాందసం, మూర్ఖత్వం, సమాచారమాధ్యమాల లేమి కారణం అనుకుందాము. గొప్ప సూత్రం లక్షణం ఏమిటి అంటే అది కాలంతో పాటు మారిపోదు. సర్వకాల సర్వావస్థలలోనూ పని చేస్తుంది. కూడలి-విడుగడ సూత్రం కూడా ఒక గొప్ప సూత్రం. ప్రస్తుతకాలంలో కూడా ఈ సూత్రం వాడకంలో ఉందనడానికి సాక్ష్యాలను చెప్పడానికే ఈ వ్యాసం.

చైనీయులకు, మనకు చాలా సహస్రాబ్దాల నుండి వాణిజ్యసంబంధాలు ఉన్నాయి. చైనీయులకు చాలా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నాయి. వాళ్ళ భాష, దేశం మొదలైన విషయాలపై వాళ్ళకు చాలా గౌరవం ఉంది. ప్రపంచమంతా ఉపాధి కోసం ఆంగ్లంలో చదువుకుంటూంటే వీళ్ళు మాత్రం తమ భాషని ఇంకా నిలబెట్టుకుంటూ ఆంగ్లాన్ని దూరంగానే ఉంచుతున్నారు. దానిలో మంచీ ఉంది, చెడూ ఉందనుకోండి. అది కాదు ఇక్కడ విషయం. 1940లలో ఒక చైనీయ శాస్త్రవేత్త ఒక గుహలో కొన్ని అస్తి పంజరాలను చూశాడు. అవి మానవరూపంలో ఉన్నప్పటికీ మానవులకు (Homo Sapiens) చెందినవి కావు. వారి (మన) పూర్వీకులైన Homo Erectus Pekinensis వి అని తెలుసుకున్నాడు. అంటే కోతిజాతిలో మన కంటే పూర్వం ఉన్న జంతువులవి అన్నమాట. వాటి ముఖాలు గుండ్రంగా, ముక్కు చప్పిడిగా ఉండటం గమనించి ఓహో, ఐతే మనందరం (చైనీయులు) వీరి సంతతి అన్నమాట అని "ఊహించాడు". అంతే రాజకీయనాయకులు వచ్చేశారు. దాన్ని దండోరా వేయించారు. అది పెద్ద రాజకీయవిషయమైంది, చైనీయజాతి గౌరవానికి సంబంధించిన విషయమైంది.

చూసారా? మొదట "మేము వేఱు" అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి వాళ్ళను కూడజేసారు. వారిని మిగతా జనాలనుండి విడదీశారు. చిటికెడంత ఆధారం దొరకగానే "మేము మామూలు మనుషులం కాఁవు, మేము మీ అందరికంటే ముందు పుట్టిన జాతినుండి వచ్చాము" అనే భ్రమలోకి ప్రజలను తోసి దాదాపు 50 ఏళ్ళు చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాల ద్వారా అదే మప్పారు. అంతే! నాయకులకు గొప్ప ఆదరణ లభించింది. చివరికి 1999లో జన్యుపరిశోధన ద్వారా ఎంతో దృఢంగా, అసలు చైనీయులకీ Homo Erectus కి ఏమీ పెద్ద సంబంధం లేదు, చైనీయులు కూడా అందరు మనుషులలాంటి వారే అని ఒక చైనీయ శాస్త్రవేత్తే తేల్చి చెప్పాడు. అతను చిన్నప్పటినుండి చదువుకున్న విషయం తప్పని తెలిసి ఎంతో బాధపడ్డానని స్వయంగా అతనే BBC కి ఇచ్చిన interview లో చెప్పాడు. అప్పటిదాకా "మేము వేఱు" అనే అబద్ధం పునాది గా నిర్మించుకున్న రాజకీయభవంతులన్నీ ఒక్క సారిగా చలించడం మొదలెట్టాయి.

సరే పొరుగు దేశంతో మొదలెట్టాము. ఇప్పుడు పొరుగు రాష్ట్రం. తమిళనాడులో చాలా రోజులు ద్రవిడులు వేఱు, ఆర్యులు వేఱు -- ఆర్యజాతి వారు ఉత్తరం నుండి ద్రావిళ్ళను తరిమి దక్షిణానికి పంపించారని ప్రచారం జరిగింది. దీనికి పాక్షికంగా కారణం ఆంగ్లేయులు. దక్షిణ, ఉత్తర భారతదేశ భాషలలో భేదాలను; పాశ్చాత్య, సంస్కృతభాషలలో సామ్యాన్ని వివరించడానికి వారికి ఈ ఆర్య-ద్రవిడ జాతిభేదం ఒకటే తోచింది. కానీ, అది కేవలం ఊహ. ఆ ఊహ EVR, కరుణానిధి మొదలైన వారికి ఉపయోగపడింది.

తమిళం భాషలన్నిటిలోకీ పురాతనమైనదని, సంస్కృతం ఈ మధ్యనే పుట్టిందని చాటింపేశారు. కాకపోతే వారికి ఎదురైన రెండు ప్రశ్నలు -- ఒకవేళ ఆర్యులు ద్రవిడులపై దండుకొస్తే అంత పెద్ద విషయం ఆ రెండు భాషలో చారిత్రాత్మక గ్రంథాలలోనూ ఎందుకు ప్రస్తావించలేదు అని. అప్పుడు మళ్ళీ సంస్కృతగ్రంథాలతో పని పడింది. వాటికి వక్రీకరించిన భాష్యాలతో వచ్చారు. రామాయణం కథ అంతా దక్షిణాది వాళ్ళను కోతులుగా, రాక్షసులుగా చూపించి కించపరచడానికి, ఉత్తరాది రాజు ఐన రాముడి ఆధిక్యతను చూపడానికి అని చెప్పారు. అలాగే అగస్త్యుడు ఉత్తరాది నుండి దక్షిణానికి రావడం వేదాలలో ఉంది కాబట్టి అది కూడా ఉత్తరాది నుండి ఆర్యులు దక్షిణాదికి రావడాన్ని సూచిస్తోందని చెప్పారు.

ఇప్పుడే ఒక చిన్న మెలిక పడింది. అగస్త్యుడు తమిళ వైయాకరణుడని అప్పటిదాకా చెప్పుకున్నవారు అగస్త్యుడు ఆర్యుడని, ఉత్తరం నుండి వచ్చాడని చెప్తే అప్పుడు సంస్కృతమే తమిళంగా కంటే పురాతనమైనది అవ్వాలి కదా? అబ్బే, తర్కం నిజాలపైన ఆధారపడాలి కుతర్కానికి నిజంతో పనేమిటి? పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ బ్రాహ్మలని (వీళ్ళే ఆర్యులట!) తిట్టి, వారిపైన సంఘంలోనే దురభిమానం కల్పించారు. అదిగో మళ్ళీ ద్రవిడులమంటూ కూడిక, ఆర్యులు వేఱంటూ విడతీయడం. ఉన్నట్టుండి EVR మహానేత అనిపించుకున్నాడు. ఇప్పటికీ ద్రవిడ మున్నేట్ర కళగం పేరిట (DMK) అవే భాష్యాలు కొనసాగుతూ ఉన్నాయి.

ఇక్కడ మఱి కొన్ని మెలికలు. "ద్రవిడ" అనే పదమే సంస్కృతపదం. భాగవతంలో ఆ పదం కనీసం మూడు సార్లు ఉంది. దాని అర్థం "దక్షిణాది దేశం" అని -- అది వేఱే జాతి అని కాదు. (వైదీక గ్రంథాలలో ఎక్కడా ద్రవిడ దేశంలో వేఱే జాతి వారు ఉన్నారు అని లేదు.) ఆ పదాన్ని ఆది శంకరులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. "నువ్వెవరు" అని ఉత్తరాదిలో ఎవరో అడిగితే, "ద్రవిడశిశువును" అని చెప్పారట. సరే తీగె లాగితే డొంక కదులుతోంది. అసలు విషయానికి వస్తే 2009లో ఒక బృహత్పరిశోధనా ఫలితంగా తేలింది ఏమిటంటే ద్రవిడ, ఆర్య సంస్కృతులు వేఱుగా ఉన్నాయో లేదో తెలియదు కానీ, రక్తాలైతే వేఱు కాదు అని. జన్యుపరంగా భారతదేశంలో రెండు జాతులు 40,000 సంవత్సరాల క్రితం (అంటే Homo Floresiensis వంటి మానవసంబంధజాతులు ఇంకా బ్రతికి ఉండగానే, శాస్త్రీయ అంచనాల ప్రకారం అప్పటికి మానవుడు ఇంకా మట్టికుండలు కూడా తయారు చేసి ఉండడు!) ఉన్నాయి కానీ ఈ మధ్యన ఏమీ లేవు అనే నిర్ధారణకు వచ్చారు. మొత్తం రెండు జాతుల భూటకం అంతా కూలిపోయే సమయం ఆసన్నమైంది.

సరే పొరుగు దేశం, పొరుగు రాష్ట్రం అయ్యాయి. ఇప్పుడు వేఱుబడదాం అనుకునే మన రాష్ట్రం వారి గురించి మాట్లాడుకుందాం. చైనీయులు "మేము మనుషులమే కాఁవు" అన్నారు, తమిళులు "మీరు మా జాతి మనుషులు కారు", అన్నారు. అదేదో చిత్రంలో చెప్పినట్టు, "కొట్టుకోవడానికి కారణం ఎందుకు? నిర్ణయించుకున్నాక కొట్టేసుకోవడమే" అన్నట్టు, ఆఖరికి భాష పేరు చెప్పి కొట్టేసుకుందాం అని తెలంగాణలో కొంతమంది సిద్ధమౌతున్నారు. అయ్యా, తెలంగాణాకు అన్యాయం జరిగి ఉండవచ్చును, తెలంగాణను ఆంధ్రనాయకులు దోచుకునీ ఉండవచ్చును, తెలంగాణ వేఱ్పాటు ప్రస్తుతం అత్యవసరం కూడా కావచ్చును -- నాకివేవీ తెలియవు. కానీ, తెలంగాణ అనేది వేఱే భాష అనడం, తెలుగు కవుల విగ్రహాలు పడగొట్టడం, హన్నన్న! ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకోని ఆలోచించండి. రాజకీయాలకు భాషకు ముడి ఏముంది? శ్రీకాకుళం యాస, నెల్లూరు యాస, తూర్పు గోదావరి యాస -- వీటన్నిటినీ మనం చూస్తూనే ఉంటాము, చలనచిత్రాలలో హాస్యానికి వాడుకుంటూనే ఉంటారు. ఉన్నట్టుండి భాష వేఱనడం కొంచెం విడ్డూరంగా లేదు? మళ్ళీ చెప్తున్నాను -- నాకు తెలంగాణా వేఱ్పడాలా వద్దా అన్నది తెలియదు. కానీ, భాష వేఱు అనడం మాత్రం నాకే కాదు, పరరాష్ట్రీయులైన నా మిత్రులకు కూడా విచిత్రంగా తోచింది. కూడలి-విడుగడ సూత్రానికి ఎంత చిన్న కీలు సరిపోతుందో చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

ప్రఖ్యాత విదూషకుడు George Carlin, "గర్వం అనేది నాకు కేవలం నా వ్యక్తిగత పురోగతి, సమర్థత, కార్యసిద్ధి వలనే కలుగుతుంది. నా పుట్టుక చేత పొందేది ఏదైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ, గర్వాన్ని కాదు" అని అన్నాడు. అమెరికాలాంటి సంపన్నమైన దేశంలో అతడు, "I am not proud to be an American. How can anyone be proud of an accidental event? I'm just happy to be born in America.", అని చెప్పాడు. అదే మనమూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు  గర్విస్తున్నాను, తమిళనాడులో పెరిగినందుకు గర్విస్తున్నాను, మొదలైనవి కూడా పరుల కార్యసిద్ధిని దోచుకోవడంతోనే సమానం. మాట వరసకు అనవచ్చునేమో కానీ, అదే పట్టుకుని వేళ్ళాడితే బావిలో కప్పలలాగా ఉండిపోయే ప్రమాదం ఉంది. నిజంగా గర్వపడాలి అనుకుంటే ఆ భారతదేశచరిత్రకి, సంస్కృతికి నీవు ఏమైనా గొప్ప విషయాన్ని చేర్చి అప్పుడు గర్వపడాలి కానీ, ఊరికెనే మా తాతలు వేదాలు చదివారు -- మాకు వేదాలెన్నో కూడా తెలియవు -- అయినా మేము గొప్ప అనుకోవడం కేవలం మూర్ఖత్వం అని నా అభిప్రాయం.

PS:
1. చదువర్లు నా తెలుగు పదాల వాడుకలో ఏమైనా తప్పులుంటే తప్పక సవరించగలరని మనవి. ముఖ్యంగా "ద్రవిడులు అనాలా? ద్రావిడులు అనాలా?" అన్న విషయంపై నాకు అనుమానం ఉంది.
2. తెలంగాణ గురించి మాట్లాడితే కోపించి వ్యాఖ్యాస్థలిని రణరంగంగా మార్చేసే కొందరు ఔత్సాహికులు ఉన్నారు అని తెలుసును. సరైన పదాలు, సరైన ఉద్దేశం లేని వ్యాఖ్యలు తొలగించబడతాయి.