Monday, September 1, 2008

నవరససుమమాలికా...

మేఘసందేశం సినిమాకి చాలా నంది అవార్డ్లు, జాతీయ అవార్డు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో సంగీతం, సాహిత్యం చక్కగా ఉన్నాయి. ఈ సినిమాలో వేటూరి వ్రాసిన పాటలలో కాస్త సంస్కృతపదాలు ఎక్కువ పడటంతో, కృష్ణశాస్త్రి గారి పాటల (ఆకులో ఆకునై) పక్కన కొంచం కష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఏదేమైనా రమేష్ నాయుడు గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం కలిసి రసికులకు మహదానందం కలిగిస్తాయి. వీటిలో నాకు నచ్చినది, జీవితాంతం మెచ్చుకునేది ఒక పాట ఉంది. అది "నవరస సుమ మాలికా..." అనే పాట. అందులో ఒక భావకవి ఎలాగ తన ప్రేయసిని వర్నిస్తాడో వేటూరిని చూసి తెలుసుకోవాలి సుమీ అనిపిస్తుంది.

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే - సంస్కృత పదాల వెల్లువ! భావుకత పెల్లుబిగి ప్రవహించింది! తనకు గురుతుల్యులైన త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్యలను తలుచుకుంటూ మొదలుపెట్టాడు మహానుభావుడు. ఎంతని చెప్పను, ఏమని చెప్పను ఈ పాట గురించి.


నవరససుమమాలికా, నా జీవనాధారనవరాగమాలికా...
త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయరసగీతికా

అందాలు అలలైన మందాకినీ, మందారమకరందరసవాహినీ
ఆమె చరణాలు అరుణకిరణాలు, ఆమె నయనాలు నీలగగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమ ఇల వంక!

అందాలే అలలుగా సాగే గంగాదేవి అనే పోలిక నాకు బాగా నచ్చింది. "మందారమకరంద" అనే సమాసం మరే కవి వాడినా నేను కోప్పడేవాడిని , "ఇది పోతనకే చెల్లుతుంది. దానిని ఎవరూ తిరిగి వాడటానికి అర్హులు కారు", అని. కానీ వేటూరి మొత్తం సంస్కృతంలో వ్రాసి నా నోటికి తాళం వేసేసాడు.

కృష్ణశాస్త్రి కవిత్వానికి ఏ మాత్రం తీసిపోలేదు నేను అన్నట్టుగా - తన కవిత్వంతో ప్రకృతిని ప్రతిష్టిమ్పజేసాడు. నది-అలలు, పువ్వు - తేనె, సూర్యుడు - కిరణాలు, గగనం - నీలం ఇలాగ ప్రకృతి సౌందర్యాన్ని వర్నించుకుంటూ వచ్చాడు. అయ్యింది కదా - జవ్వననికి ప్రాస ఏమి పెడతాడురా అనుకునే సమయానికి - బహుశా, "నీకు అంత అవకాశం ఇవ్వను. నా స్థాయి వేరే ఉంది", అన్నట్టు: "నైరుతి ఋతుపవనాలను", గుర్తు చేసాడు (చల్లని గాలులు). ఇక జాబిల్లిని ఎందుకు వదుల్తాను అంటూ - చిరునవ్వుతోనే విసిరాడు చిరప్రయోగం (ఎప్పటినుండో ఉన్న, ఎప్పటికీ ఉండిపోయే ప్రయోగం).

శృంగారరసరాజకల్లోలినీ, కార్తీకపూర్ణేందు కల్హారినీ
ఆమె అధరాలు ప్రణయమధురాలు, ఆమె చలనాలు శిల్పగమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందరసుఖతరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ!

ఇక్కడ మళ్ళీ సంస్కృతంలో చెడుగుడు. "శృంగారరసం ప్రవహించే మహానది", "కార్తీకపున్నమిలో కలువ", అంటూ తన ప్రియురాలిని ఉబ్బితబ్బిబ్బు చేసేసాడు. ఆమె పెదవులు మొహంతో నిండిన మధురాలు! ఆమె దర్శనం దొరికిన ప్రతిక్షణం అతని జన్మలో గుర్తుపెట్టుకోదగినంత గోప్పదిట! కనుచూపుతోనే ప్రేమలేఖలు వ్రాసేసి రాయబారాలు నడిపెస్తోందిట.

ఇలాటి పాట విన్న అమ్మాయి (తెలుగు పిల్ల ఐతే అనుకోండి) ఎవరైనా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నా నమ్మకం. అలాంటి పాటలు వేటూరి ఒకటో రెండో వ్రాయలేదు. అనేకానేకాలు వ్రాసాడు.

హడావుడిలో పడి రమేష్ నాయుడు గారిని మర్చిపోతే సరస్వతీ దేవి నన్ను క్షమించదు. (సరస్వతీ దేవి ప్రస్తావన తీసుకురావడానికి ఒక కారణం ఉంది - అది మళ్ళీ టప లో చెప్తాను). రమేష్ నాయుడు గారి సంగీతం లంగా-వోణీ వేసుకున్నతెలుగింటి పిల్లని గుర్తు చేస్తుంది!

2 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇరవై మూడేళ్ళ క్రితం మొదటి సారి విన్నప్పటినుండి ఇప్పటి వరకూ ఈ గీతార్ధం తెలియలేదు,ఇవ్వాళ్టికి మీ పుణ్యమా అని :).బ్బాబ్బాబు మిగిలిన పాటల గురించి కూడా రాసి పుణ్యం కట్టుకుందురూ

Sandeep said...

తప్పకుండా రాజేంద్రకుమార్ గారు! మిగతావాటిల్లో కూడా నాకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయి. వీలు చూసుకుని అవి కూడా చర్చిస్తాను!