Saturday, August 30, 2008

పొలాల అమావాస్య

శ్రావణ బహుళ అమావాస్య (అంటే దసరా ముందు వచ్చే అమావాస్య అన్నమాట) నాడు పోలాల అమావాస్య అంటారు. పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు. పూజలో భాగంగా కథ చెప్తారు. ఈ రోజు కథ విన్నదాన్ని బట్టి నాకు అర్థమైనది ఏమిటి అంటే - ఇది పెళ్ళయిన ఆడవాళ్ళు పిల్లల (శ్రేయస్సు) కోసం చేస్తారు అని. కథ క్లుప్తం గా చెప్పాలి అంటే:

"
ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏదో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. బాధ భరించలేక ఎదవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉన్చేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి - "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతారు. దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము - తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏట తప్పకుండా పోలాల అమావాస్య జరుపుకుంటుంది."

ఈ కథ విన్న తరువాత చెప్పినవారు: "పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు. వినడానికి కొంచం ఎబ్బెట్టుగా అనిపించచ్చు కానీ - అది పిల్లల మీద ప్రేమకు చిహ్నం. ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.

మా అమ్మ పుట్టినరోజు పొలాల అమావాస్య నాడే. ఎప్పటినుండో తప్పకుండా చేసుకుంటోంది ఈ పూజ!

No comments: