Friday, July 16, 2010

మనిషి నైజం - 1

(సూచన: ఈ వ్యాసంలోని భావాలన్నీ నా ఊహలే. వాటిల్లో నిజాలెన్నో, అబద్ధాలేన్నో చదువరులు తమకు తాముగా తెలుసుకోవాలి. ఈ వ్యాసం, "మనిషి నైజం" అనే శీర్షికలోని మొదటిభాగం.)

మనిషి జాతి, కులం, మతం, ప్రాంతం, రంగు, ఎత్తు అంటూ తనకు తాను ఎన్ని విషయాలను ఆపాదించుకున్నా, నైసర్గికంగా మానవనైజం మాత్రం ఒక్కటే. చరిత్ర చూసినట్టైతే, ప్రపంచంలో వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాలలో జరిగిన ఒకేలాంటి సంఘటనలు ఒకే పరిణామానికి దారితీశాయని తెలుస్తుంది. మనుషులు ఏ దేశంలో పుట్టినా, ఏ సంప్రదాయంలో పెరిగినా, ఏ నాగరికత మరిగినా - చివరికి అన్ని సమూహాల్లోనూ అన్ని రకాల మనుషులూ ఉన్నారు. ఒక మనిషికి స్ఫురించేటువంటి ఆలోచన, ఎక్కడో భూమికి అటువైపు మఱొక మనిషికి స్ఫురించవచ్చును. ఆ ఆలోచన ఇచ్చే ఫలితం మాత్రం దాదాపుగా అదే ఉంటుంది.

ఒక ఉదాహరణ తీసుకుందాం. మనిషికి, "ఈ ప్రకృతిని సృజింపజేసినది ఎవరు?" అనే ప్రశ్న కలిగి, దానికి "పరమాత్మ"(1) అని సమాధానం ఇచ్చుకున్నాడు. ఎప్పుడో ఐదువేల సంవత్సరాల క్రితం సనాతనధర్మం (దాన్నే "హిందూయిసం" అంటారు), రెండున్నరవేల సంవత్సరాల క్రితం జుడాయిసం, రెండువేల సంవత్సరాల క్రితం క్రిష్టియానిటీ, పదిహేనువందల సంవత్సరాల క్రితం ఇస్లాం - అన్నీ అదే ప్రశ్నకు సమాధానాలుగా వచ్చాయి. దీన్నే మామూలు భాషలో మతం అంటారు. మనిషిని పరమాత్ముడి దగ్గరకు చేర్చడం మతం ఉద్దేశం.

ఒక మతానికి కాని, నమ్మిన వ్యక్తికి కాని ఒక్క పరమాత్మతో తప్ప, వేరేవాళ్ళతో సంబంధం ఉండకూడదు. ఒక బ్యాంకుకెళ్తే ఎవరి ఎకౌంటు వాళ్ళది. ఒకరి వివరాలు మఱొకరికి చెప్పరు కదా? పరమాత్మకి, మనిషికి అనుసంధానమైనది మతం ఐతే, మరి దాంట్లో "సమాజం" ప్రస్తావన ఎందుకు వచ్చింది?". అక్కడ మళ్ళీ మనిషి ఒక ఆలోచన చేశాడు: "ప్రజలకు దేవుడంటే భయమో భక్తో ఉంటుంది. దానిని మనం ఉపయోగించుకుంటే సమాజంలో మార్పు తీసుకురావడం సులువు", అని. మనిషి generalizations చెయ్యడం మొదలుపెట్టి, "ఆడవాళ్ళు ఇలాగ ఉంటారు. మగవాళ్ళు ఇలాగ ఉంటారు. అందుకని వీళ్ళు ఇది చెయ్యాలి, వాళ్ళు అది చెయ్యాలి", అంటూ సంఘాన్ని ఒక రూపుకు తీసుకువచ్చే యత్నం చేశాడు. ఒక్కొక్క నియమం అప్పటి సమాజస్థితిని బట్టి సృష్టించాడు. సమాజంలో పరిస్థితులు మారాయి, నియమాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీని వలన ఇప్పుడు దాదాపు అన్ని మతాలూ ఎంతో కొంత అత్యాచారానికి ఆధారలౌతున్నాయి.

మనిషి మతాన్ని మాటల్లో పెట్టాలనుకున్నాడు. కానీ, ఆ మాటల్ని ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చదివి "నేనే రైటు", అనుకుంటాడన్న విషయాన్ని ఊహించలేకపోయాడు. దానితో అన్ని మతాల్లోనూ చీలికలు బయల్దేరాయి. అన్నిటికంటే పాత మతమైన సనాతనధర్మంలో "శివుడు గొప్పా? విష్ణువు గొప్పా?", అని కొట్టుకున్నారు. అలాగే కులాలన్నారు. ఆ తరువాత బుద్ధిసం, సిఖిసం అని వేరే మతాలు కూడా పుట్టాయి. జుడాయిసం కూడా ఇలాగ క్రిష్టియానిటీకి, ఇస్లాంకి దారులు వేసింది. క్రిష్టియన్లు ప్రొటెష్టెంట్, కేతలిక్ అని; ముస్లింలు సూఫీ, సూని అని కొట్టుకున్నారు.

హిందువులు ఏసు-క్రీస్తు హిమాలయాల్లో ఒక సాధువు దగ్గర జ్ఞానోదయం పొందాడని, క్రిష్టియన్లు హైందవమతం బోధిస్తున్నది క్రీస్తు గురించేనని, ముస్లింలు హైందవమతపురాణాలు చెప్తున్నది అల్లా గురించేనని - ఎవరికి వారు, మాదే పైచేయి అని వాదించుకుంటున్నారు. ఇహ కొన్ని మతాలు తమను విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నం సంగతి నేను చెప్పక్కరలేదు. మనిషికి ఒక అలవాటు ఉంది. ఒక వాహనం ఎక్కి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత గమ్యం గురించి మరిచిపోయి, ఆ వాహనం తనదని, ఆ దారిలో పరిచయినవి శాశ్వతమని అనుకోవడం. అందుకే పరమాత్ముడి మీద దృష్టి సృతి తప్పి, అది మతం మీద పడటం సంభవించి అనర్థాలకు దారి తీస్తోంది. ఈ మతకలంకం అంటని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. మతం ఏదైనా, దానిలో జరిగే మార్పులు, దాని వలన వచ్చే పరిణామాలు - వీటిల్లో చాలా సారూప్యం ఉంది. మతానికి కూడా మనిషి లాగా, "కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం" వంటి దశలు ఉన్నాయి అన్నమాట! అంతే కదా? మతం ప్రతిబింబించేది మనిషి ఆలోచనని. అదే ఆలోచన ఎక్కడ పుట్టినా మనిషిదే కదా! అందుకే ఈ సారూప్యం.

సశేషం...

(1) ఈ పదాన్ని లింగభేదం లేకుండా వాడుతున్నాను.

1 comment:

Sandeep P said...

Gollapudi wrote a similar article this week:

http://www.koumudi.net/gollapudi/071910_matam_hitam.html

It is a lot more informative.