Wednesday, March 17, 2010

కిట్టు కథలు - తండ్రి ప్రేమ

కిట్టుకి భాగ్యనగరంలో ఒక పెద్ద MNC లో ఉద్యోగం వచ్చింది. అందులో చేరిన వెంటనే తన తండ్రి సుబ్బారావుకి phone చేసి అక్కడ విషయాలన్నీ చెప్పాడు. అది విని సుబ్బారావు చాలా సంతోషించాడు. ఇక తనకున్న తగులూమిగులూ భూములని అమ్మి ఆ డబ్బు తీసుకుని భార్యతో సహా కిట్టు దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాడు. కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఏ తండ్రికైనా వచ్చే సంతోషమే తనకూ వచ్చింది.

రాత్రి దగ్గరే ఉన్న హోటల్లో భోజనం చేసి కిట్టు తన room-mateతో మాట్లాడుతూ ఇంటివైపికు నడుస్తున్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే అది కిట్టు వాళ్ళ మేనత్త కొడుకు, శివ. తను వరసకు బావ అయినా కిట్టు కంటే చాలా పెద్దవాడు. శివ తల్లికి, కిట్టు తండ్రికి పదిహేనేళ్ళ వయోభేదం ఉంది. అతను వైజాగ్లోనే కిట్టు ఇంటికి దగ్గరలో ఉంటాడు. ఎత్తగానే, "ఒరేయ్ నాన్న, నువ్వు urgent గా బయల్దేరి వైజాగ్ వచ్చెయ్యరా. నాన్నని ఆసుపత్రిలో చేర్పించాము.", అని అన్నాడు. కిట్టుకు అసలు ఏమీ అర్థం కాలేదు. తన తండ్రికి దగ్గూ, జ్వరం కూడా ఎప్పుడూ వచ్చిన గుర్తులేదు కిట్టుకి. ఉన్నట్టుండి hospitalలో admit చెయ్యడమేమిటా అనుకుంటుండగానే, "వివరాలన్నీ రేపు నువ్వు వచ్చాక మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి నువ్వు దొరికిన bus ఎక్కి వచ్చెయ్యి", అని పెట్టేశాడు శివ.

కిట్టు వెంటనే బస్సెక్కి వైజాగ్ చేరుకున్నాడు. ICU బయట తన తల్లి కళ్ళల్లో నీళ్ళతో కూర్చుని ఉంది. "ఒరేయ్ నాన్నా, మీ నాన్న నిన్న సీతాపురం వెళ్ళివచ్చారు. వస్తూనే ఏమీ మాట్లాడకుండా, భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళి పడుకున్నారు. కాసేపటికి వొళ్ళంతా చెమటలతో, మొహం ఎర్రగా అయిపోయి, "అరుణ, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది అన్నారు. వెంటనే శివగాడికి ఫోన్ చేశాను. వాడు వచ్చి హాస్పిటల్లో చేరిపించాడు. రాత్రినుండి ఇక్కడే కూర్చుని ఉన్నాను. ఎవరూ నాకు ఏమీ చెప్పట్లేదు. డాక్టర్ నువ్వు వచ్చాక మాట్లాడతానన్నారు. త్వరగా వెళ్ళి విషయం ఏంటొ కనుక్కోరా", అంది. తన తల్లికి కాస్త ధైర్యం చెప్పి ICUలోకి వెళ్ళాడు.

ఒంటినిండా వైర్లతో చుట్టూ మెషీన్లతో ఉన్న సుబ్బారావుని చూస్తూనే కిట్టుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెళ్ళి, "నాన్నా", అని పిలవగానే "సర్, ఆయన్నిప్పుడు మాట్లాడించకూడదు. మిమ్మల్ని doctorగారు కలవమని చెప్పారు", అంది ఒక నర్సు. కిట్టు బాధగా డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్, "మీరేనా సుబ్బారావుగారి అబ్బాయి?", అని అడిగాడు. "అవునండి", అన్నాడు కిట్టు. "కూర్చోండి. మీ నాన్నగారి పరిస్థితి గమనిస్తున్నాము. ప్రస్తుతానికి బానే ఉంది. కాకపోతే ఇంకా నయమైంది అని చెప్పలేము.", అన్నాడు డాక్టర్. "అసలేమైంది డాక్టర్? మా నాన్నగారికి ఎప్పుడూ అనారోగ్యం చెయ్యడం నేను చూడలేదు", అన్నాడు కిట్టు. "ఆయనకి BP ఉంది. ఎప్పటినుండో heart-related-problem ఉంది. ఆయన check చేయించుకోలేదు. మీరైనా చేయించి ఉండాల్సింది. యాభై ఏళ్ళు దాటాక అందరూ health-check చేయించుకుంటూ ఉండాలి అండి.", అన్నాడు డాక్టర్. "ఐతే ఇప్పుడు మా నాన్నగారికి  ఆపరేషన్ చెయ్యలా?", అడిగాడు కిట్టు. "ఇప్పుడు ఆయన గుండెకి ఆపరేషన్ కి తట్టుకునే బలం లేదు. కొన్నాళ్ళు observationలో పెట్టి అప్పుడు నిర్ణయించాలి. అప్పటిదాకా ఆయన్ని మాట్లాడించద్దు. మీ బంధువులని కూడా ICU లోనికి పోనివ్వద్దు అండి.", అన్నాడు డాక్టర్. "అలాగే అండి. ఉంటాను", అని చెప్పి కిట్టు బయటకు వచ్చేశాడు.

బయట బల్ల మీద కూర్చుండగా శివ వచ్చాడు. "ఒరేయ్ నాన్న, మీ నాన్నను చూశవా, డాక్టర్ తో మాట్లాడావా?", అని అడిగాడు. "చూశాను బావ. డాక్టర్ గారు ఇంకా అబ్సర్వ్ చెయ్యాలి అంటున్నారు", కిట్టు అన్నడు. "నాతో కూడా అలాగే అన్నారు. బాధ పడకురా. తండ్రిలాంటివాడే అన్యాయం చేస్తే ఎవరికి  గుండె మండదు?", అన్నాడు శివ. అదేమిటి అన్నట్టు చూశాడు కిట్టు. "నిన్న మీ నన్న సీతాపురమ్నుండి వస్తూ మీ ఇంటికి వెళ్ళేముందు మా ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం నాతో చెప్పాడు. మీ నాన్నకి ఉన్న భూములు అమ్మి నీ పేరున fixed depositలు వేద్దామని అనుకున్నాడురా. అందుకే తన భూములని ఎవరో కొనడానికి వస్తే చూపించడానికి సీతాపురం తోటకి వెళ్ళాడు. అక్కడ మీ తోటని కొలిస్తే రెండు ఎకరాలు తక్కువ వచ్చాయి. తాతయ్య చనిపోయినప్పుడు మావయ్యకి ఐదేళ్ళు. అమ్మమ్మకి (కిట్టూకు నాన్నమ్మ) అసలు ప్రపంచకఙానం లేదని మన చినతాతే తనవాటా, మన తాతయ్యవాటా కూడా చూశేవారు. మావయ్యను పెంచడానికి అమ్మమ్మ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు మావయ్య చదువు పూర్తయ్యాక చినతాత తాతయ్య వాటా మావయ్యకి ఇచ్చారు. నేను మావయ్యకి చెప్తూనే ఉన్నాను 'వొకసారి కొలిపించు మావయ్యా', అని. కొలిపించకుండా తీసుకున్నాడు. మావయ్యకి చినతాత అంటే గుడ్డినమ్మకం. తనను సొంతకొడుకులాగా పెంచిపెద్దచేసినవాడు తనను ఎందుకు మోసం చేస్తాడు అని! చినతాత మనిషి మంచివాడే అయినా, మావయ్య అంటే అభిమానం ఉన్నా తన భార్య అలాంటిది కాదు కదా. ఎప్పుడూ తన ఆస్తి ఏదో మనం తినేస్తున్నట్టుగా అనుకునేది. ఇప్పుడు ముప్ఫై ఏళ్ళ తరువాత చూసుకుంటే తెలిసింది, మావయ్యకు రావాల్సిన రెండు ఎకరాలు చినతాత ఉంచేసుకుని, తన కొడుకు పేర్న వ్రాసుకున్నాడు అని. ఆ విషయం తెలియగానే మావయ్య వెళ్ళి చినతాతని తన తోట తనకు ఇచ్చెయ్యమని అడిగితే చినతాత ఇవ్వనన్నాడు. సుమారు నూరేళ్ళు ఉంటాయి ఆయనకి, మునిమనవల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఐనా కూడా ఆయనకు డబ్బు మీద మక్కువ పోలేదు. మావయ్య నీకోసం దాచిన ఆస్తి ఆ భూమే. అదే నీకు దక్కనివ్వకపోతే ఆయనకు కోపం వచ్చి చినతాతతో తగువు పెట్టుకుని వచ్చేశాడు. అదే బాధ మనసులో పెట్టుకోవడం వలన ఇలాగ గుండెపోటు వచ్చింది", అన్నాడు. వింటూనే కిట్టుకు రక్తం మరిగిపోయింది. వెళ్ళి చినతాతని "నూరేళ్ళు వచ్చాయి. మునిమనమళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. నీ కళ్ళతో నీ కొడుకు వయసువాళ్ళు చనిపోవడం చూసి ఉంటావు. నీ మనవరాలు వయసు వాళ్ళు భర్తను కోల్పోవడం చూసి ఉంటావు. తాత, నీకు ఇంకా విరక్తి కలగలేదా?", అని అడుగుదామనిపించింది. కోపం కంటే కర్తవ్యం ముఖ్యమని అనుకుని తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, డాక్టర్తో మాట్లాడాను. రెండుమూడురోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. నువ్వు టిఫిన్ చేశావా? పద తిందుగాని?", అన్నాడు.

రెండుమూడురోజులు గడిచాక సుబ్బారావు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. త్వరలోనే general ward కి మారుస్తాము అని చెప్పాడు డాక్టర్. కిట్టుని తండ్రితో మాట్లాడనిచ్చారు. కిట్టు లోపలికి రాగానే సుబ్బారావు కుశలప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానం ఇచ్చి, నాలుగు మంచి మాటలు చెప్పిన కిట్టు, కాసేపటికి జరిగిన విషయం గుర్తుకొచ్చి, "నాన్న, పండుముసలివాడయిపోయి, నరాలు చచ్చుపడిపోతున్నా ఎందుకు నాన్న చినతాతకి అంత డబ్బు పిచ్చి. ఆయనేమీ చచ్చేటప్పుడు పట్టుకుపోడు కదా? వంద సంవత్సరాలు బ్రతికినా మనిషికి విరక్తి రాదేమిటి? పెళ్ళాం మాట పట్టుకుని మీకు ఎందుకు ద్రోహం చేశారు నాన్న?", అన్నాడు. అప్పటిదాకా శాంతంగా ఉండి, వీలైనంతవరకు నవ్వడానికి ప్రయత్నించిన సుబ్బారావు ఒక్కసారిగా, "నోర్ముయ్!", అన్నాడు. అప్పటిదాకా దీనంగా ఉన్న కిట్టుకు ఒక్కసారి కరణాలన్నీ జాగృతమయ్యాయి. "ఎవడ్రా మా బాబాయికి వందేళ్ళు అన్నది? ఆయన పుట్టింది 1917లో. ఇప్పటికి ఆయన వయసు 93 ఏళ్ళు. మా బాబాయి గురించి మాట్లాడటానికి మీకెవ్వరికీ హక్కు లేదు. పుట్టినరోజుకని నాకు బట్టలు కుట్టించడం కోసం డబ్బులు అడుగుదామని, మా అమ్మ తన పుట్టింటి నుండి ప్రయాణం చేసి వస్తే ఇంట్లోకి కూడా రమ్మనేది కాదు మా పిన్ని. బయట గంటలకొద్దీ చింతచెట్టుకింద చెప్పులు లేకుండా నిలబడేది మా అమ్మ నా కోసం. అప్పుడు మా బాబాయ్ వచ్చి మమ్మల్ని మనస్పూర్తిగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి గడ్డపెరుగు కలిపి పెట్టేవాడురా. ఆయన పెళ్ళాం మాట విని మాకు అన్యాయం చేసి ఉంటే ఇలాగ మనం ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. మా అన్నయ్య (చినతాత కొడుకు) ఉట్టి వెర్రిబాగులవాడురా. వాడికి ఏమీ తెలియదు. వాడి తెలివిదక్కువతనంతో ఎక్కడ కొంచం ఆస్తి పాడుచేసినా ఇంకా ఉంటాయని ఆ రెండు ఎకరాలూ తీసుకున్నాడు. ఐనా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు?", అన్నాడు సుబ్బారావు. కిట్టూ అలాగ చూస్తూ ఉండిపోయాడు. ICUలో ఉండి, కొడుకు కన్నీళ్ళతో వచ్చి కూర్చుంటే ఇలాగ తిట్టి, తనకు అన్యాయం చేసిన బాబాయ్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు తండ్రి అన్నది తనకు అంతు పట్టలేదు.

చిన్నబోయిన కిట్టూని చూసి, సుబ్బారావు కాస్త నెమ్మదిపడి, "ఒరేయ్ నాన్న, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు సహిస్తావా? లేదు కదరా? అలాగే మా బాబాయ్ ని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేనురా. వరసకు బాబాయే కానీ, ప్రేమకు తండ్రికి ఎప్పుడూ తీసిపోలేదురా. నా అక్కచెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. నన్ను చదివించాడు. నా ఆస్తిని ఇరవయ్యేళ్ళు కాశాడు. ఇంతకంటే ఇంకెవరు చెయ్యగలరురా?", అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు అక్కలందరికీ కట్నం కోసం చూసుకుని తక్కువ సంబంధాలు చేశాడని, తన ఆస్తిలో ఒక భాగం తీసేసుకుని మోసం చేశాడని, ఆ చినతాత సొంతబిడ్డలే అనుకుంటూ ఉండగా చాలాసార్లు కిట్టు విన్నాడు. అలాంటిది ఇంకా తన తండ్రి గుడ్డిగా చినతాతను నమ్మడం ఇంకా కిట్టు సహించలేకపోతున్నాడు. తను పరిస్థితి గమనించిన సుబ్బారావు, "నేను ఎందుకు తోటలు అమ్మాలనుకున్నానురా? ఆ డబ్బులు నీకు ఇద్దామనే కదా? అలాగే ఆ రెండు ఎకరాలూ తన కొడుక్కి ఇద్దామనుకున్నాడు మా బాబాయ్. ఎటొచ్చి అవి న్యాయంగా నాకు చెందాల్సినవి. అది నీకు అన్యాయం అనిపించవచ్చు. ఎప్పుడూ మా బాబాయ్ కి ఎదురుగా ఒక్క మాట కూడా మాట్లాడని నేను ఆ రోజు 'ఇకనుండి నువ్వు ఎవరో, నేను ఎవరో. నీకూ నాకూ సంబంధం లేదూ, అన్నాను తెలుసునా?", అన్నాడు సుబ్బరావు. ఇది విని కిట్టు ఆశ్చర్యపోయాడు. తన బంధువర్గమంతా "సుబ్బారావే వాళ్ళ బాబాయ్ కి కన్నకొడుకుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాడు.", అని పేరు. "బాబాయ్ ని అంత గౌరవించే నా చేత అంత మాట అనిపించిందిరా పిల్లల మీద ప్రేమ. మరి వయసు మీరిపోయి, కొడుకు అమాయకుడు, ఏమవుతాడో అన్న బెంగ ఆయనకు ఉంటుంది కదరా? అందుకే అలాంటి పని చేశాడు. సొంతపిల్లల మీద ప్రేమతో పెంచిన కొడుకు దగ్గర రెండు ఎకరాలు తీసుకోవడం తప్పైతే, పిల్లలమీద ప్రేమతో పెంచి పెద్ద చేసిన బాబాయ్ ని అంత మాట అనడం కూడా తప్పే!", అన్నాడు సుబ్బారావు. కిట్టుకి ఒక విషయం అర్థమయ్యింది. తన మీద ప్రేమతో తన తండ్రి చినతాతని ఎదిరించాడు తప్పితే, ఆ డబ్బు మీద అసలు సుబ్బారావుకు ఆశ లేదు. "నాన్నా, చినతాతయ్య గురించి నేను ఏమీ అనను. కానీ, ఆ రెండు ఎకరాల గురించి మీరు మరిచిపోండి. నేను సంపాదిస్తున్నాను కదా డబ్బులు. అవి చాలు నాన్నా మనకి. మీరు చెప్పించిన విద్యాబుద్ధులు ఉన్నాయి. అంతకు మించి నాకేమీ వద్దు నాన్న!", అన్నాడు కిట్టు. "నీకున్న పాటి బుద్ధి నాకు లేకపోయిందిరా. మా బాబాయ్ చెప్పించిన విద్యాబుద్ధులున్నాయి కదా. ఐనా ఆ భూమి కోసం నేను పెద్దపెద్ద మాటలన్నాను. బాధపడుతూ ఉంటాడేమో", అన్నాడు సుబ్బారావు. విని కిట్టూ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. సుబ్బారావుని rest తీసుకోమని చెప్పి బయటకు వచ్చాడు.

కిట్టు ICU బయట బల్ల మీద కూర్చుని ఆలోచించాడు, "ఏమిటి? నాన్నకి వాళ్ళ బాబాయ్ మీద అంత గౌరవం? కేవలం నాలుగు మంచిమాటలు మాట్లాడి, మా ఆస్తి కొన్నాళ్ళు చూసిపెట్టినందుకే? మరి నాన్న నన్ను పెంచి పెద్దవాడిని చేసి, ఏది అడిగితే అది కొనిపెట్టారు నాకు కూడా నాన్న పట్ల ఇంతే గౌరవం ఉందా? నాన్న ఏదైనా పొరబాటు చేస్తే నేను ఇలాగే సహనంతో ఓర్చుకుంటానా? ఏదేమైనా సరే, ఈ సంఘటన ద్వారా నాకు ఒకటి తెలిసింది. ఒక మనిషి మనకు కోపం తెప్పించినప్పుడు, ఆ మనిషి మనకు గతంలో చేసిన మంచిని మరిచిపోకూడదు. తప్పులందరూ చేస్తారు. కానీ, వాటిని అవతలవాళ్ళ దృష్టిలోనుండి అర్థం చేసుకుని క్షమించకపోతే అప్పుడు ఆ అనుబంధానికి విలువే లేదు. నాన్నా! నేను గొప్ప universityలో masters  చదివాను. కానీ, నాకు ఇలాంటి పాఠం ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ICUలో ఉండి మీరు చెప్పారు.", అనుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, నాన్న condition మెరుగుపడిందిటమ్మా. general ward లోకి shift చేస్తున్నారు.", అని చెప్పాడు. అప్పటిదాక కంట కునుకు లేకుండా ఉన్న అరుణ మొహంలో కాస్త కాంతి కనబడింది.

2 comments:

satvika said...

bavundi katha... kani chivarlo india lone university lo masters chesanu... "india" ani specify cheyatam venuka uddesham ??

Sandeep P said...

నువ్వు చెప్పింది నిజమే సాత్విక. నాకూ అదే అనిపించి India అన్న మాట అక్కడనుండి తొలగించాను. నా ఉద్దేశం ఏమిటంటే - "దేశమంతా తిరిగినా విద్య నేర్పుతున్నారే కానీ, విధేయత ఎవరూ నేర్పట్లేదు", అని.