Friday, January 15, 2010

నిత్యజీవితంలో పద్యాలు

ఈ మధ్యన కాస్త పని ఎక్కువగా ఉండటంతో నేను ఆట్టే బ్లాగించలేకపోతున్నాను. అందుకే ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటున్న "సాఫ్ట్వేర్ ప్రపంచం-2", "నామకరణం", "తమిళాయణం" వంటి టపలు పూర్తి చెయ్యలేకపోయాను. ప్రస్తుతానికి నేను వ్రాసిన కొన్ని పద్యాలు బ్లాగుతున్నాను.

సం:-
శైలజగారు నాకు గరళఫ్రెండు (girl friend) ఎందుకు లేదో అడిగితే
ఆ:-
మగువ మనసు పువ్వొ, మకరందమును దాచ!
గ్రోలనైతినాయె కోతి నేనొ?
నారి హృత్తు కనగ నారికేళమొ, నీరు!
త్రాగనైతి తేనెటీగ నేనొ?
భా:-
అమ్మాయి మనసు పువ్వయ్యి, నేను కోతినవ్వడం చేత అందులోని తేనెను నేను గ్రహించలేకపోతున్నానో; లేక అమ్మాయి మనసు కొబ్బరిబోండాం అయ్యి నేను తేనెటీగను కావడం వలన గ్రహించలేకపోతున్నానో!

కం:-
తిరవుగ సత్యము తెలియదు
నెరవుగ శొధన జరపిన, నేరమదేమో!
తరుణుల మదిలో మర్మము
యెరుగగ లేకుంటినకట యేందులకిటులో!
భా:-
ఈ రెండిటిలో ఏది నిజమో ఎంత ఆలోచించా తెలియట్లేదు. మొత్తానికి నాకు అమ్మాయిలు అయితే అర్థం కారు, ఎందుకో!

సం:-
అన్నమయ్య మీద ఒక పద్యం వ్రాయమని అడిగితే
ఆ:-
అఖిల లోకములకు ఆకలి బాపేటి
అమ్మ, లక్ష్మి సతిగ అవతరించ
కొండపైన స్వామి గొదగొన్న సమయాన
అన్నమయ్య పాటె అన్నమయ్యె!
భా:-
సమస్తలోకాలకీ ఆకలి తీర్చేటి అమ్మ తనకు భార్యగా చేరింది కానీ,ఆయనకు ఆకలి వేస్తే మాత్రం అన్నమయ్య పాటే కావాలంటాడు వేంకటేశ్వరుడు

కం:-
పాటలతో కవితిలకుడు
పోటెత్తగ జడిసెను గద, భూధరచయముల్
గాటపుగోడలుగ వెలయు
కూటము కోటగ కులికెడి కొండలఱేడే!
భా:-
అన్నమయ్య పాటలతో పోటెత్తితే (భక్తితో ప్రార్థిస్తే/యుద్ధానికి దిగితే) కొండలసమూహాలు గోడలుగా ఉన్న పర్వతశిఖరాన్ని కోటగా చేసుకున్న వేంకటేశ్వరుడు జడిశాడు (దయచూపించాడు/భయపడ్డాడు).

2 comments:

Chari Dingari said...

annamayya paate annamayye...excellent

satvika said...
This comment has been removed by the author.