Saturday, January 2, 2010

నిత్యజీవితంలో పద్యాలు

కళ నిత్యజీవితంలో భాగమైతేనే దాన్ని మనిషి అనుభవించగలడు. ఒకసారి గరికిపాటి వారు చెప్పారు, "అవధానం అభ్యసించడానికి నిత్యజీవితంలో ఏది ఎదురైనా దాని గురించి ఆలోచించేటప్పుడు పద్యరూపంలో ఆలోచించాలి", అని. అది అక్షరసత్యం అనిపిస్తుంది. అందుకే ఈ మధ్యన నా కవితాశక్తిని పెంపొందించుకోవడానికి నేను వీలైనప్పుడల్లా పద్యాలు వ్రాస్తున్నాను. అలాంటి పద్యాలు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ పద్యాలలో తప్పులను సరిచేసి, మరింత అందంగా అమర్చిన శ్రీ చింతా రామకృష్ణారావుగారికి నా ధన్యవాదాలు! ఇందులోని కొన్ని పద్యాలు ఆయనతో సంభాషిస్తూ వ్రాసినవే!

[ప్రియదర్శిని విఘ్నేశ్వరుని మీద వ్రాయమనగా]
ఆ:-
చందమామఁ బోలు చక్కని రూపంబు
చలువకనులు చల్లు చందనములు
జగతిఁ గాచునట్టి చక్కని దైవమా!
కావుమయ్య మమ్ము గణపతయ్య

[రామకృష్ణారావుగారు సరస్వతీదేవి కృప గురించి మాట్లాడుతుండగా]
ఆ:-
చక్కనైన కవిత జాలువారగనోట
చదువులమ్మ చలువు చాలు మనకు
ఆమె కనుల వెలుగు అంతరంగములోన
మెదలునంతవరకు పదములొలుకు!

[రామకృష్ణారావుగారి పద్యంలో లేని దోషాన్ని వెదికిన నా తెలివి పైన]
ఆ:-
మొదటి పాదమొదిలి మునకలేసితి నేను
అవకతవక మదికి అర్థమయ్యె
మీదు కవితలోన లేదండి దోషంబు
నాదు బుర్రలోన నాచుబట్టె!

[శైలజగారు "నూతనసంవత్సరం వచ్చినా స్నేహితుడితో అనుబంధము మారలేదు" అని అర్థం వచ్చేట్టు వ్రాయమని అడుగగా]
కం:-
నూతనవత్సరమడుగిడె
చైతన్యము నింపె మదిని చలువకలలతో
పాతాయెను కాలము, మరి
నీతో గడిపిన సమయము నిధిగా మిగిలెన్

[పై పద్యము నాకు నచ్చలేదు అని నేను అంటే, చక్కగా ఉందని అన్న శైలజగారి ఉదారస్వభావాన్ని వర్ణిస్తూ]
ఆ:-
తీపి పలుకు చూడ తేనెబొట్టుకరణి
పేర్మియున్న మనసు వెన్నపూస
పెంచుకున్న మంచి పంచదారకు సాటి
నెయ్యి కమ్మదనము నెయ్యమందు!

[ఇద్దరు ప్రేమికులు వారి బంధం కాలంతో పాటూ మారలేదు అని చెప్పుకునే విధంగా వ్రాయమని శైలజగారు అడిగిన సందర్భానికి]
కం:-
చేరితివే నా ముంగిట
తీరని మధుమాసమువలె తిరముగ నిలువన్
మారిన కాలము మురిసెను
మారని మన ప్రేమనుగని మదినిండంగన్

["నల్లని మేని", "తెల్లని కన్నులు", "ఎర్రని నామం", "పచ్చని పూమాల" - ఈ పదాలకు పర్యాయపదాలతో వేంకటేశుని మీద పద్యం వ్రాయమని శైలజగారు అడిగితే]
కం:-
నల్లని మేనియె చదలుగ
తెల్లని కన్నుల జిలుగదె తెలిపూవయె, రా
జిల్లెడి పూమాల పసుపు
విల్లెత్తిన కనులు మోసె పింజరనామం!

[ధనుర్మాసం హడావుడిలో పద్యానికి సందర్భం అడిగితే శైలజగారు "విష్ణువు", "పూమాల", "గోదమ్మ", "పొంగలి" - ఈ పదాలకు పర్యాయపదాలతో ఒక పద్యం చెప్పమన్నప్పుడు]
ఆ:-
పుష్పమాలబట్టి పూబాల గోదమ్మ
విష్ణుమూర్తి కనుల వెన్నెలాయె
వారి నడుమ వలపు వరమాయె కళ్ళకు
పొంగలేల మాకు భోజనముగ


[వేంకటేశ్వరుని పైన ఒక పద్యం వ్రాయమని శైలజగారు అడిగినప్పుడు]
కం:-
సిరులనొసగురేడు శేషశైలముపైన
కొలువుదీరె భక్తకోటి కొరకు!
ఏడుకొండలెక్కి ఏడేడులోకాల
కాయుచుండు వాడు కలియుగమున!


["స్వామి పదములు", "అవి చూసినప్పుడు పలికే పదములు(మాటలు)", "మొక్కిన చేతులు", "కలిగే అనందం" - వీటిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమని శైలజగారు అడిగినప్పుడు]
కం:-
కరములు జోడించ కురిసె
స్వరములు నానోట స్వామి సన్నుతి సలుపన్
వరదగ పదములు పొంగెను
వరదుని పాదాలుజూడ పద్యము గూర్చన్

[రామకృష్ణగారు వేగంగా పద్యాలు అల్లుతున్నట్టు నేను అల్లలేక, అలిసిపోయి]
ఆ:-
పాలకడలి పైన పన్నగాగ్రణి ముందు
బీడు బావిలోని భేకమెంత
వెండికొండపైన వేల్పు చందము మీరు
క్రింది భూమిలోని క్రిమిని నేను

[రామకృష్ణగారితో మాట్లాడుతూ ఒక పద్యంలో ప్రాసనియమం వదిలేసినందుకు ప్రాయశ్చిత్తంతో]
ఆ:-
ప్రాస నియమమెరుగి పద్యాలనల్లితే
బాగుగానెయుండు పాఠకులకు
సూక్ష్మమెరుగలేక సుత్తిలాంటికవిత
చెప్ప మీకు చెవుల నొప్పి కలిగె

No comments: