Saturday, September 10, 2011

విడిపోవడం ఎలా?

యండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వవికాసం పైన వ్రాసిన పుస్తకం పేరులాగున్నా ఈ వ్యాసంలో అలాంటివి ఏమీ ఉండవని ముందుగానే చెప్తున్నాను. "ఎవరైనా కలిసుండటం ఎలాగ అని వ్రాస్తారు కానీ ఇలాగ విడిపోవడం ఎలాగ అని వ్రాస్తారా?" అని అడిగే చదువర్లకు వివరణ, ఈ వ్యాసానికి ఉపోద్ఘాతం రెండూ ఒకటే.

మనిషి ఒక విచిత్రమైన జంతువు. తను ఒక్కడూ ఉండలేడు, అలాగని మఱి కొందరితో ఉంటే వాళ్ళందరికంటే పై చేయి తనదవ్వాలని, తనకొక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. (ఈ గోలంతా మనం ఇదివరకే ఒక సారి చెప్పుకున్నామనుకోండి. దానికి ఇది కొనసాగింపు వ్యాసం అనుకోవచ్చునేమో.) ఈ ప్రత్యేకతని సంపాదించుకోవడానికి మొదట తన చుట్టూ ఒక బలగాన్ని ఏర్పరుచుకుని, ఆ బలగానికి తను నాయకుడై, ఆ బలగం బలం పెంచి మిగతావారిని ఓడిస్తాడు. ఓడిపోయినవారిలో గొప్ప ఎవరో పట్టించుకోరు, గెలిచినవాళ్ళలో నాయకుడి పేరే అందరికీ తెలుస్తుంది. ఫలితంగా అతడికి ప్రత్యేకత కలుగుతుంది. భాషలో సవర్ణదీర్ఘసంధి సూత్రం, గణితంలో పైతాగరస్ సూత్రం, భౌతికశాస్త్రంలో న్యూటన్ సూత్రం లాగా మనిషి అనే జంతువు ఆడే, సాంఘిక క్రీడలో ఇది ఒక సూత్రం/ఎత్తు. దీన్నే ముద్దుగా కూడలి-విడుగడ సూత్రం అని పిలుచుకుందాం. చదువర్లెవరైనా ఇంకా మంచి పేరును సూచిస్తే చాలా సంతోషిస్తాను.

ఇదే సూత్రాన్ని తరతరాలుగా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు. సరే ఒకప్పుడు ఛాందసం, మూర్ఖత్వం, సమాచారమాధ్యమాల లేమి కారణం అనుకుందాము. గొప్ప సూత్రం లక్షణం ఏమిటి అంటే అది కాలంతో పాటు మారిపోదు. సర్వకాల సర్వావస్థలలోనూ పని చేస్తుంది. కూడలి-విడుగడ సూత్రం కూడా ఒక గొప్ప సూత్రం. ప్రస్తుతకాలంలో కూడా ఈ సూత్రం వాడకంలో ఉందనడానికి సాక్ష్యాలను చెప్పడానికే ఈ వ్యాసం.

చైనీయులకు, మనకు చాలా సహస్రాబ్దాల నుండి వాణిజ్యసంబంధాలు ఉన్నాయి. చైనీయులకు చాలా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉన్నాయి. వాళ్ళ భాష, దేశం మొదలైన విషయాలపై వాళ్ళకు చాలా గౌరవం ఉంది. ప్రపంచమంతా ఉపాధి కోసం ఆంగ్లంలో చదువుకుంటూంటే వీళ్ళు మాత్రం తమ భాషని ఇంకా నిలబెట్టుకుంటూ ఆంగ్లాన్ని దూరంగానే ఉంచుతున్నారు. దానిలో మంచీ ఉంది, చెడూ ఉందనుకోండి. అది కాదు ఇక్కడ విషయం. 1940లలో ఒక చైనీయ శాస్త్రవేత్త ఒక గుహలో కొన్ని అస్తి పంజరాలను చూశాడు. అవి మానవరూపంలో ఉన్నప్పటికీ మానవులకు (Homo Sapiens) చెందినవి కావు. వారి (మన) పూర్వీకులైన Homo Erectus Pekinensis వి అని తెలుసుకున్నాడు. అంటే కోతిజాతిలో మన కంటే పూర్వం ఉన్న జంతువులవి అన్నమాట. వాటి ముఖాలు గుండ్రంగా, ముక్కు చప్పిడిగా ఉండటం గమనించి ఓహో, ఐతే మనందరం (చైనీయులు) వీరి సంతతి అన్నమాట అని "ఊహించాడు". అంతే రాజకీయనాయకులు వచ్చేశారు. దాన్ని దండోరా వేయించారు. అది పెద్ద రాజకీయవిషయమైంది, చైనీయజాతి గౌరవానికి సంబంధించిన విషయమైంది.

చూసారా? మొదట "మేము వేఱు" అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి వాళ్ళను కూడజేసారు. వారిని మిగతా జనాలనుండి విడదీశారు. చిటికెడంత ఆధారం దొరకగానే "మేము మామూలు మనుషులం కాఁవు, మేము మీ అందరికంటే ముందు పుట్టిన జాతినుండి వచ్చాము" అనే భ్రమలోకి ప్రజలను తోసి దాదాపు 50 ఏళ్ళు చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాల ద్వారా అదే మప్పారు. అంతే! నాయకులకు గొప్ప ఆదరణ లభించింది. చివరికి 1999లో జన్యుపరిశోధన ద్వారా ఎంతో దృఢంగా, అసలు చైనీయులకీ Homo Erectus కి ఏమీ పెద్ద సంబంధం లేదు, చైనీయులు కూడా అందరు మనుషులలాంటి వారే అని ఒక చైనీయ శాస్త్రవేత్తే తేల్చి చెప్పాడు. అతను చిన్నప్పటినుండి చదువుకున్న విషయం తప్పని తెలిసి ఎంతో బాధపడ్డానని స్వయంగా అతనే BBC కి ఇచ్చిన interview లో చెప్పాడు. అప్పటిదాకా "మేము వేఱు" అనే అబద్ధం పునాది గా నిర్మించుకున్న రాజకీయభవంతులన్నీ ఒక్క సారిగా చలించడం మొదలెట్టాయి.

సరే పొరుగు దేశంతో మొదలెట్టాము. ఇప్పుడు పొరుగు రాష్ట్రం. తమిళనాడులో చాలా రోజులు ద్రవిడులు వేఱు, ఆర్యులు వేఱు -- ఆర్యజాతి వారు ఉత్తరం నుండి ద్రావిళ్ళను తరిమి దక్షిణానికి పంపించారని ప్రచారం జరిగింది. దీనికి పాక్షికంగా కారణం ఆంగ్లేయులు. దక్షిణ, ఉత్తర భారతదేశ భాషలలో భేదాలను; పాశ్చాత్య, సంస్కృతభాషలలో సామ్యాన్ని వివరించడానికి వారికి ఈ ఆర్య-ద్రవిడ జాతిభేదం ఒకటే తోచింది. కానీ, అది కేవలం ఊహ. ఆ ఊహ EVR, కరుణానిధి మొదలైన వారికి ఉపయోగపడింది.

తమిళం భాషలన్నిటిలోకీ పురాతనమైనదని, సంస్కృతం ఈ మధ్యనే పుట్టిందని చాటింపేశారు. కాకపోతే వారికి ఎదురైన రెండు ప్రశ్నలు -- ఒకవేళ ఆర్యులు ద్రవిడులపై దండుకొస్తే అంత పెద్ద విషయం ఆ రెండు భాషలో చారిత్రాత్మక గ్రంథాలలోనూ ఎందుకు ప్రస్తావించలేదు అని. అప్పుడు మళ్ళీ సంస్కృతగ్రంథాలతో పని పడింది. వాటికి వక్రీకరించిన భాష్యాలతో వచ్చారు. రామాయణం కథ అంతా దక్షిణాది వాళ్ళను కోతులుగా, రాక్షసులుగా చూపించి కించపరచడానికి, ఉత్తరాది రాజు ఐన రాముడి ఆధిక్యతను చూపడానికి అని చెప్పారు. అలాగే అగస్త్యుడు ఉత్తరాది నుండి దక్షిణానికి రావడం వేదాలలో ఉంది కాబట్టి అది కూడా ఉత్తరాది నుండి ఆర్యులు దక్షిణాదికి రావడాన్ని సూచిస్తోందని చెప్పారు.

ఇప్పుడే ఒక చిన్న మెలిక పడింది. అగస్త్యుడు తమిళ వైయాకరణుడని అప్పటిదాకా చెప్పుకున్నవారు అగస్త్యుడు ఆర్యుడని, ఉత్తరం నుండి వచ్చాడని చెప్తే అప్పుడు సంస్కృతమే తమిళంగా కంటే పురాతనమైనది అవ్వాలి కదా? అబ్బే, తర్కం నిజాలపైన ఆధారపడాలి కుతర్కానికి నిజంతో పనేమిటి? పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ బ్రాహ్మలని (వీళ్ళే ఆర్యులట!) తిట్టి, వారిపైన సంఘంలోనే దురభిమానం కల్పించారు. అదిగో మళ్ళీ ద్రవిడులమంటూ కూడిక, ఆర్యులు వేఱంటూ విడతీయడం. ఉన్నట్టుండి EVR మహానేత అనిపించుకున్నాడు. ఇప్పటికీ ద్రవిడ మున్నేట్ర కళగం పేరిట (DMK) అవే భాష్యాలు కొనసాగుతూ ఉన్నాయి.

ఇక్కడ మఱి కొన్ని మెలికలు. "ద్రవిడ" అనే పదమే సంస్కృతపదం. భాగవతంలో ఆ పదం కనీసం మూడు సార్లు ఉంది. దాని అర్థం "దక్షిణాది దేశం" అని -- అది వేఱే జాతి అని కాదు. (వైదీక గ్రంథాలలో ఎక్కడా ద్రవిడ దేశంలో వేఱే జాతి వారు ఉన్నారు అని లేదు.) ఆ పదాన్ని ఆది శంకరులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. "నువ్వెవరు" అని ఉత్తరాదిలో ఎవరో అడిగితే, "ద్రవిడశిశువును" అని చెప్పారట. సరే తీగె లాగితే డొంక కదులుతోంది. అసలు విషయానికి వస్తే 2009లో ఒక బృహత్పరిశోధనా ఫలితంగా తేలింది ఏమిటంటే ద్రవిడ, ఆర్య సంస్కృతులు వేఱుగా ఉన్నాయో లేదో తెలియదు కానీ, రక్తాలైతే వేఱు కాదు అని. జన్యుపరంగా భారతదేశంలో రెండు జాతులు 40,000 సంవత్సరాల క్రితం (అంటే Homo Floresiensis వంటి మానవసంబంధజాతులు ఇంకా బ్రతికి ఉండగానే, శాస్త్రీయ అంచనాల ప్రకారం అప్పటికి మానవుడు ఇంకా మట్టికుండలు కూడా తయారు చేసి ఉండడు!) ఉన్నాయి కానీ ఈ మధ్యన ఏమీ లేవు అనే నిర్ధారణకు వచ్చారు. మొత్తం రెండు జాతుల భూటకం అంతా కూలిపోయే సమయం ఆసన్నమైంది.

సరే పొరుగు దేశం, పొరుగు రాష్ట్రం అయ్యాయి. ఇప్పుడు వేఱుబడదాం అనుకునే మన రాష్ట్రం వారి గురించి మాట్లాడుకుందాం. చైనీయులు "మేము మనుషులమే కాఁవు" అన్నారు, తమిళులు "మీరు మా జాతి మనుషులు కారు", అన్నారు. అదేదో చిత్రంలో చెప్పినట్టు, "కొట్టుకోవడానికి కారణం ఎందుకు? నిర్ణయించుకున్నాక కొట్టేసుకోవడమే" అన్నట్టు, ఆఖరికి భాష పేరు చెప్పి కొట్టేసుకుందాం అని తెలంగాణలో కొంతమంది సిద్ధమౌతున్నారు. అయ్యా, తెలంగాణాకు అన్యాయం జరిగి ఉండవచ్చును, తెలంగాణను ఆంధ్రనాయకులు దోచుకునీ ఉండవచ్చును, తెలంగాణ వేఱ్పాటు ప్రస్తుతం అత్యవసరం కూడా కావచ్చును -- నాకివేవీ తెలియవు. కానీ, తెలంగాణ అనేది వేఱే భాష అనడం, తెలుగు కవుల విగ్రహాలు పడగొట్టడం, హన్నన్న! ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకోని ఆలోచించండి. రాజకీయాలకు భాషకు ముడి ఏముంది? శ్రీకాకుళం యాస, నెల్లూరు యాస, తూర్పు గోదావరి యాస -- వీటన్నిటినీ మనం చూస్తూనే ఉంటాము, చలనచిత్రాలలో హాస్యానికి వాడుకుంటూనే ఉంటారు. ఉన్నట్టుండి భాష వేఱనడం కొంచెం విడ్డూరంగా లేదు? మళ్ళీ చెప్తున్నాను -- నాకు తెలంగాణా వేఱ్పడాలా వద్దా అన్నది తెలియదు. కానీ, భాష వేఱు అనడం మాత్రం నాకే కాదు, పరరాష్ట్రీయులైన నా మిత్రులకు కూడా విచిత్రంగా తోచింది. కూడలి-విడుగడ సూత్రానికి ఎంత చిన్న కీలు సరిపోతుందో చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

ప్రఖ్యాత విదూషకుడు George Carlin, "గర్వం అనేది నాకు కేవలం నా వ్యక్తిగత పురోగతి, సమర్థత, కార్యసిద్ధి వలనే కలుగుతుంది. నా పుట్టుక చేత పొందేది ఏదైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ, గర్వాన్ని కాదు" అని అన్నాడు. అమెరికాలాంటి సంపన్నమైన దేశంలో అతడు, "I am not proud to be an American. How can anyone be proud of an accidental event? I'm just happy to be born in America.", అని చెప్పాడు. అదే మనమూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పుట్టినందుకు  గర్విస్తున్నాను, తమిళనాడులో పెరిగినందుకు గర్విస్తున్నాను, మొదలైనవి కూడా పరుల కార్యసిద్ధిని దోచుకోవడంతోనే సమానం. మాట వరసకు అనవచ్చునేమో కానీ, అదే పట్టుకుని వేళ్ళాడితే బావిలో కప్పలలాగా ఉండిపోయే ప్రమాదం ఉంది. నిజంగా గర్వపడాలి అనుకుంటే ఆ భారతదేశచరిత్రకి, సంస్కృతికి నీవు ఏమైనా గొప్ప విషయాన్ని చేర్చి అప్పుడు గర్వపడాలి కానీ, ఊరికెనే మా తాతలు వేదాలు చదివారు -- మాకు వేదాలెన్నో కూడా తెలియవు -- అయినా మేము గొప్ప అనుకోవడం కేవలం మూర్ఖత్వం అని నా అభిప్రాయం.

PS:
1. చదువర్లు నా తెలుగు పదాల వాడుకలో ఏమైనా తప్పులుంటే తప్పక సవరించగలరని మనవి. ముఖ్యంగా "ద్రవిడులు అనాలా? ద్రావిడులు అనాలా?" అన్న విషయంపై నాకు అనుమానం ఉంది.
2. తెలంగాణ గురించి మాట్లాడితే కోపించి వ్యాఖ్యాస్థలిని రణరంగంగా మార్చేసే కొందరు ఔత్సాహికులు ఉన్నారు అని తెలుసును. సరైన పదాలు, సరైన ఉద్దేశం లేని వ్యాఖ్యలు తొలగించబడతాయి.

16 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

హిందీ వ్యతిరేక పోరాటంలో వారికి తర్వాత్తర్వాత బహిరంగ ఓటమి లభించిందిగా. హిందీ ప్రచారసభలో అదేపనిగా స్కూల్ లో లేని హిందీ ని ఎంతోమంది ఉత్సాహంగా నేర్చుకోవటం, హిందీ సినిమాలు, అరవ సినిమా పాటల్లో హిందీ వినియోగం బాగా పెరిగాయి.
కానీ అరవం సంస్కృతం కన్నా ముందుది అని అబద్ధాలు ప్రచారంచేసి , పక్కరాష్ట్రాల భాషా ప్రాచీనత మీద అసూయతో అబద్ధపు కేసులు వేసి మనకు చేయాల్సిన అన్యాయం మాత్రం చేసేశారు. హ్మ్.....

Baddipadige Sathish said...

nijame...rajakeeya avasarala kosam bhashalu veru anadam thappu.
Anni bhashalalo yaasalu untayi, antha mathrana avanni ververu bhashalu analemu. Ade vindhanga oka yaasa matrame sari ayinadi ani kuda analemu. Telegu vallantha anni yaasalanu gouravisthe baguntundi...

జేబి - JB said...

మీరు ఏది రాసినా, బాగా విశ్లేషించి మెచ్యూర్డ్(తెలుగు పదమేంటి?)గా రాస్తారండి!

Sandeep P said...

@జేబీ

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు అండి. Matured (n) అనే ఆంగ్లపదానికి మనం సాధారణంగా "పరిపక్వత" (ripe, ముగ్గిన) అనే పదాని వాడతాము.

Brown నిఘంటువు ఆధారంగా తంతన్యమాన (adj) అనే పదం కూడా సరైనదే అని తెలుస్తోంది.

kanthisena said...

ఈ కథనంలో చాలా మంచివిషయాలు తడిమారు.
"ప్రపంచమంతా ఉపాధి కోసం ఆంగ్లంలో చదువుకుంటూంటే వీళ్ళు మాత్రం తమ భాషని ఇంకా నిలబెట్టుకుంటూ ఆంగ్లాన్ని దూరంగానే ఉంచుతున్నారు. దానిలో మంచీ ఉంది, చెడూ ఉందనుకోండి."
వీళ్లే కాదు లెండి. రష్యన్లు, ఆంగ్లేతర యూరోపియన్లు కూడా తొలినుంచి ఇంగ్లీషును ఎంత అవసరమో అంత మేరకే తీసుకుంటూ తమ తమ బాషలను వృద్ధి పరుచుకుంటూ వచ్చారు. అందుకే రష్యా భాషలోనే సమస్త శాస్త్ర విజ్ఞానాలను బోధించారు. అంతరిక్ష అధ్యయన శాస్త్రాలను కూడా వారు తమ భాషలోనే చదువుకున్నారు. అయినా వారు రోదసీయాత్రల విషయంలో వెనుకబడిలేరే.. యూరప్ దేశాలలోని పలు షాపింగ్ మాల్స్ లో కూడా వారు స్వంత భాషలోనే వ్యవహారాలు జరుపుతారు. జపాన్ కూడా అంతే.
మీరన్నది నిజం ఇంగ్లీషులో మంచి ఉంది కాని మనలాగా దాన్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తే, సమస్త పాలనా, శాస్త్ర విషయాలను ఇంగ్లీషులోనే బోధించడం సాగిస్తే, ఇంగ్లీషుకు లేని గౌరవం ఆపాదిస్తే దేశభాషలు చచ్చి ఊరుకోవా? ఈ నిషయం రష్యన్లకు, చైనీయులకు, జపనీయులకు, చివరకు ఆంగ్లేతర యూరోపియన్లకు కూడా తెలీకనా వారు ఆంగ్ల వినియోగాన్ని పరిమితం చేసింది? దేశీయ భాషల పట్ల రాజకీయ నిర్ణయాలు సరిగా తీసుకుని ఉంటే మనభాషలకు ఇంత దుస్థితి పట్టేదా? ఐటీ ఒక్కటి మాత్రమే ప్రపంచం కాదు. ఈ రంగానికి ఇంగ్లీష్ తప్పనిసరి కావచ్చు. కాని వంద కోట్లపైగా జనంలో ఎంతమందికి ఐటీ రంగంలో అవకాశాలు ఉన్నాయి? కోట్లమందిలో ఒక పరిమిత జనాభాకోసం ఒకటవ తరగతి నుంచి పిల్లలను ఇంగ్లీష్ మానస పుత్రులుగా పెంచితే, పరబాషను ఆలా రుద్దితే ఏం జరగాలో అదే జరుగుతోంది. ఇంత చిన్న విషయం పర దశాలకు తెలియకనా ఇంగ్లీష్ అవసరాన్ని పరిమితం చేసింది? చివరకు బహుళ జాతి సంస్థలు తయారు చేసే ఉత్పత్తులను అమ్మె భారీ షాపింగ్ మాల్స్‌లో వ్యవహారాలను నడపడానికి ఎవరికయినా పదో తరగతి ఇంగ్లీష్ జ్ఞానం సరిపోతుంది. దీనికి బదులుగా జీవితాన్నే ఇంగ్లీష్ మయం చేస్తే ఎలా?

kanthisena said...

"ఆర్యజాతి వారు ఉత్తరం నుండి ద్రావిళ్ళను తరిమి దక్షిణానికి పంపించారని ప్రచారం జరిగింది... ద్రావిడ అంటే దక్షిణాది దేశం...."
ఆర్య, ద్రావిడ జాతి భేదం భోగస్ అని ఎప్పుడో తేలిపోయింది కాద. 15 ఏళ్ల క్రితమే అనుకుంటాను. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మానవసమూహాలు విడతలు విడతలుగా భారత దేశంలోని దక్షిణ ప్రాతానికి, ఉత్తర ప్రాతానికి వేరు వేరు దిశలనుంచి వేరు వేరు కాలాల్లో వచ్చాయని అప్పట్లోనే శాస్త్రవేత్తలు డీఎన్ఎ పరీక్షల ద్వారా నిరూపించారు.

"ద్రవిడ, ఆర్య సంస్కృతులు వేఱుగా ఉన్నాయో లేదో తెలియదు కానీ, రక్తాలైతే వేఱు కాదు"
మానవరక్తంలో ఎబీసీడీ గ్రూపు భేదాలు ఉన్నాయే తప్ప దాని మౌలికసారంలో తేడాల్లేవు కదా. చలిప్రాంతాల్లో జీవించేవారు తప్పనిసరిగా తెల్లగానే ఉంటారు. ఉష్ణ ప్రాంతాల్లో జీవించేవారు ఖచ్చితంగా నల్లగానే ఉంటారు. అది ప్రకృతి మనిషి శరీరానికి రక్షణ కవచంగా మలచిన రంగు భేదాలే కాని రంగులకూ, జాతిభేదాలకు, రక్తభేదాలకు పోలికే లేదనుకుంటున్నాను.

kanthisena said...

I am not proud to be an American. How can anyone be proud of an accidental event? I'm just happy to be born in America."
అద్భుతమైన వాక్యం. ఆ రచయితకు, తెలిపిన మీకూ నమస్సులు. ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో పుట్టడమే కాదు.అసలు పుట్టడమే ఒక యాదృచ్చిక ఘటన. మనిషిగా పుట్టినందుకు గర్విస్తున్నామంటే ఎంత అర్ధరహితంగా ఉంటుంది. సమస్త అహంకారాలు, జాతిహననాలు, మారణయుద్ధాలు ఈ జాతీయ, ప్రాంతీయ గర్వాలనుంచే వస్తున్నాయనుకుంటాను. చాలా మంచి ఆలోచనలను పంచుకున్నారు. ధన్యవాదాలు.
మీరు నా చందమామ బ్లాగులో నిన్న ఆదిలక్ష్మిగారిపై కథనానికి కామెంట్ పెట్టారు. అలా మీవద్దకు వచ్చాను. మీ బ్లాగ్ లింకును నా చందమామ బ్లాగులో చేరుస్తున్నాను. మంచి పరిచయాన్ని కొనసాగిద్ద్దాం.

Anonymous said...

@ సందీప్ గారు: ఈ భౌతిక ప్రపంచం ఎక్కువగా 'నిజం-అబద్ధం' అనే మౌలిక విషయముపై ఆధారపడి ఉంటుంది అని అంటాను ఇబ్బంది లేదుగా! ఈ విషయముపై మానవజాతి ఆధారపడినంతకాలం ఇలాంటి కుమ్ములాటలు తప్పవు. ఎందుకంటే ఈ 'నిజం-అబద్ధం' అనే విషయానికి జనం (మానవ సమూహం) నమ్మకము-అపనమ్మకము ప్రధానం, ప్రాణప్రదం. ఎప్పుడైతే మనం ఈ నిజాలనూ అబద్ధాలనూ వదలి 'సత్యం-అసత్యం' ఆధారంగా మన సమాజాన్ని నిర్మించుకుంటామో అప్పుడు మాత్రమే 'వసుధైక కుటుంబము' సాధ్యమవుతుంది. ఎందుకంటే సత్యాసత్యాలకు జనం నమ్మికతో పనిలేదు వాటికి స్థల-కాల భేదాలు ఉండవు. అయితే ప్రస్తుత ప్రవాహం జనం అభిప్రాయాలే కనుక మనకిష్టమున్నా లేకున్నా ఆ ప్రవాహములో ప్రయాణం సాగించాల్సిందే కనీసం గడ్డిపోచైనా (మార్పు) దొరికేవరకూ....

Praveen Mandangi said...

>>>>>
ఈ భౌతిక ప్రపంచం ఎక్కువగా 'నిజం-అబద్ధం' అనే మౌలిక విషయముపై ఆధారపడి ఉంటుంది అని అంటాను ఇబ్బంది లేదుగా!
>>>>>
భౌతిక ప్రపంచం సంభావ్యత (probability) మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సంభావ్యవాదాన్ని అంగీకరిస్తే దేవుడు, ఆత్మలు లాంటివి ఉనికిలో ఉండే అవకాశం లేదని అంగీకరించాల్సి వస్తుంది. అందుకే మత గురువులు భౌతికవాదాన్ని అంగీకరించరు.

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు.
జన్మతో వచ్చే వారసత్వాలకి గర్వించడం నాకు ఎప్పుడూ అర్ధం కాదు.
కానీ ఒకటి మాత్రం నిజం - బుర్ర కడుగుడు వల్లనో, లేక ఒక కాన్సెప్టు బాగా నచ్చేసి ఇదే నిజమైతే బాగుండు, దీనికి విరుద్ధంగా జరగడానికి వీల్లేదు అని మనసుకి పట్టి ఉండడం వల్లనో కొన్ని కొన్ని సత్యాల్ని ఒప్పుకోబుద్ధి కాదు, ప్రమాణాలు ప్రత్య్కషంగా కనిపిస్తున్నా సరే.

Vipanchi said...

చాలా బాగా రాసారు, చాలామంది అనుకునే సహజ మయిన విషయాలు, కానీ మీ అంత అందంగా అమర్చేలేము,
హత్స్ ఆఫ్
విపంచి
P.S:- బ్లాగు కాకుండా మీరు ఇంకా ఎమన్నా రచనలు చేస్తున్నారా?

Sandeep P said...

@నెలవంక, @కొత్తపాళి, @విపంచి
మీ మంచి మాటలకు ధన్యవాదాలు.

@అచంగ
భౌతికప్రపంచంలో నిజానిజాలను తెలుసుకోవడం వివిధరంగాల్లో వేఱుగా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా? అనే ప్రశ్నకు మనం అవునని, లేదని కూడా నూటపదకొండు విధాలుగా సమాధానం చెప్పవచ్చును. అందుకే కదా రాజకీయనాయకులు కొట్టుకుంటున్నది.

సత్యం, అసత్యం వాటి భేదం తెలుసుకోవడమనేది మామూలు మనుషులకు సాధ్యం కాదు అండి. సత్యాన్వేషణకు ఎక్కడా ego ఉండకూడదు. అది ఎంతమందికి సాధ్యపడుతుందంటారు?

@విపంచి
నేను మనోనేత్రం బ్లాగులో మాత్రమే వ్రాస్తూ ఉంటానున్ అండి. శాస్త్రీ శతకం అనే బ్లాగులో కందపద్యాలు కూడా వ్రాస్తూ ఉంటాను.

Anonymous said...

http://telugu.greatandhra.com/mbs/nov2011/tamil_part21_1.php

Sandeep P said...

@రామ

మంచి లంకెను చూపించారు. MBS చాలా బాగా వ్రాశారు. కృతజ్ఞతలు.

శ్యామలీయం said...

ఆలస్యంగా చూస్తున్నాను మీ బ్లాగును యీ మధ్యే. చాలా బాగుంది.
ముఖ్యంగా "ద్రవిడులు అనాలా? ద్రావిడులు అనాలా?" అన్న విషయంపై నాకు అనుమానం ఉంది. ద్రవిడజాతికి చెందినవారు ద్రావిడులు. అందుచేత ద్రావిడులు అనటమే సరైనది.
మెచ్యూర్డ్(తెలుగు పదమేంటి?) "పరిపక్వత" (ripe, ముగ్గిన) , తంతన్యమాన (adj) అనే పదాలకన్నా 'పరణతి' అన్న చాలా సరైన పదం. ఇది కూడా సంస్కృతపదమే ననుకోండి. అది వేరే సంగతి.

Anonymous said...

The Story of Our Origins
http://www.openthemagazine.com/article/living/the-story-of-our-origins
Just where did our ancestors come from? Indian diversity has long been reduced by many historians to a simple story of an invasion of Aryans pushing Dravidians further south in the Subcontinent. But an analysis of the genes that Indians bear throws up enough evidence to rubbish that theory, pointing instead to a far more complex set of migrations—and perhaps reverse migrations—many millennia earlier than commonly supposed.
_________________________________________________
http://www.tattvaanveshanam.org/2011/05/29/genetics-delivers-another-blow-to-aryan-myth/


To get a clearer picture of our origins, Open sent DNA samples of a couple of celebrities, John Abraham and Baichung Bhutia, alongwith those of four magazine staffers to the National Geographic Deep Ancestry Project. Based on the genetic markers thus identified and other research conducted by scientists, we present a plausible map of our origins. Be prepared for some surprises

+++

‘The diversity of India is tremendous; it is obvious; it lies on the surface and anybody can see it. It concerns itself with certain mental habits and traits. There is little in common… between the Pathan of the North-West and the Tamil in the far South. Yet…there is no mistaking the impress of India on the Pathan, as this is obvious on the Tamil…The Pathan and the Tamil are two extreme examples; the others lie somewhere in between…It is fascinating to find how the Bengalis, the Marathas, the Gujaratis, the Tamils, the Andhras, the Oriyas, the Assamese, the Canarese, the Malayalis, the Sindhis, the Punjabis, the Pathans, the Kashmiris, the Rajput, and the great central block comprising the Hindustani-speaking people, have retained their peculiar characteristics…’