Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

5 comments:

Sudha Rani Pantula said...

తెల్లార్లూ మేలుకుని మీరు రాసిన ఈగేయం చివరివరకూ బాగా వచ్చింది సందీప్ గారు. రేయమ్మ నింగంతా ముగ్గేసినా- చుక్కలగురించి చెప్పక్కర్లేదు లెండి..ముగ్గు అంటేనే చుక్కలతో కూడినది అనే అర్థం వచ్చేస్తోంది కదా. బిగువు సగము దిగవా ప్రయోగం బావుంది. కలతో, ఇది అలకో, నలతో విధినడతో వీటిగురించి ఆలోచించాలేమో మరోసారి. ఏకాంతంవాడలో అనేకన్నా ఏకాంతపు వాడ లో నిట్టూరుపు వేడిలో అని కొద్దిగా మార్పు చేస్తేనో...... ఏదో తోచినట్టు రాసాను. అన్యథా భావించరన్న ఆశతో.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

సందీప్ గారు, అద్భుతమైన పాట వ్రాసినారండీ.
ఎంత బాగుందో చెప్పలేను. వేటూరి ఇక లేరన్న బాధ మొదటి సారి కొంచెం తగ్గింది.
చాలా చాలా చాలా బాగుంది.
సుధగారు,
బిగువు నగము అనుకుంటానండి. కొండ అని.....

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

మంచి ప్రయత్నం సందీప్ గారు. ఏకాంతపు వాడ అంటే బావుంటుందేమో

Sandeep P said...

శ్రీకాంత్, సుధ గారు

ఏకాంతం వాడ దగ్గర సంధి కలపవచ్చును కానీ, బాణీకి దగ్గరగా ఉంటుంది (సాయంత్రం, ఏకాంతం లయ సరిపోతుంది) అని అలాగ వ్రాసాను. మీరన్నట్టు ఏకాంతపు, నిట్టూరుపు ప్రయోగం కూడా బాగుంది. చక్కని సలహా.

లక్ష్మీ దేవి గారు అన్నట్టు అది "బిగువు (పట్టుదల) నగము (కొండ)". కోపం/అలక వస్తే "కొండెక్కి కూర్చుంది" అంటారు కదా. అందుకని అలాగ వ్రాసాను.

రాధ రాకపోతే ఆవిడకేమైందో ఆలోచించకుండా అది పట్టుదల అని కృష్ణుడు నిర్ధారించెయ్యడం ప్రేమకు వ్యతిరేకం అవుతుంది అని, మొదట - "మనసు బాగోలేదా, నా మీద అలిగిందా, ఒంట్లో బాగోలేదా, లేక ఏమైనా అనుకోని కారణం వచ్చి పడిందా" అని అనుకున్నట్టు వ్రాసి. తరువాత పట్టుదల విషయం ప్రస్తావించాను. అందుకే "అలక, నలత, కలత ..." వచ్చాయి. విధి నడత ఒక్కటీ కొంచెం వ్యావహారికమైన భాషలో లేదు. కానీ తప్పలేదు. పల్లవి మొత్తంలో విధి, నగము అనేవే సంస్కృతపదాలు. వీలైనంత వరకు కృష్ణుడి చేత తెలుగే పలికిద్దామనుకున్నాను.

మీ సూచనలకు నెనర్లు అండి.

కామేశ్వరరావు said...

బాగుంది. కొన్ని భావాలూ, పదాలూ చాలా బాగున్నాయి. వేటూరిగారి ప్రభావం బాగానే కనిపిస్తోంది :-)

>> చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు
అలా చెప్పకుండా ఉండడమే మంచి కవిత్వం!

>>మువ్వల సవ్వడి కానరాదేఁ
కానరావడం అంటే కనిపించడం. మువ్వల సవ్వడి ఎలా కనిపిస్తుంది? :-)
"మువ్వల్ల సవ్వడి చేరరాదే" అంటే సరిపోతుంది.

పల్లవి చివరి రెండు పంక్తులూ వరస కొంచెం తేడాగానే ఉంది. చరణాలు చివరి వాక్యాలలో కూడా కొద్దిగా వరస తేడా ఉంది.

>>వేచున్నా నే
"వేచానే నే" అంటే ఇంకా బాగుంటుంది.