Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (1)

ఈవేళ సియాటల్లో వర్షం పడుతోంది. సియాటల్ గురించి తెలియని వాళ్ళు "ఔనా?" అనుకుంటారేమో కానీ సియాటల్ గురించి తెలిసినవాళ్ళు "అందులో పెద్ద విశేషమేముంది?" అనడగుతారు. సియాటల్లో ఏటికి సుమారు అరవై-డబ్భై రోజుల్లో మాత్రమే సూర్యుడు నిరాటంకంగా గగనవీధిలో సంచరిస్తాడు. మిగతా రోజుల్లో మబ్బులూ, వర్షం సహజం. సియాటల్ ని అందరూ ఎప్పుడూ చీకటిగా ఉండే చోటని ఆడిపోసుకుంటారు. కానీ నాకు సియాటల్ బాగా నచ్చింది. నేను ఇళ్ళు వెతికేటప్పుడు కొంచెం వాస్తు చూస్తాను. తత్ఫలితంగానో, కాకతాళీయంగానో ఎప్పుడూ వెలుతురు బాగా వచ్చే ఇళ్ళలోనే ఉన్నాను. సూర్యుడు బయటకు రావాలే కానీ, మళ్ళీ ఇంటికెళ్ళేంత వరకు మా ఇంట్లోకి చూస్తూనే ఉంటాడు. అందుచేత మాకు పగటి వేళలో చీకటి గొడవ లేదు. కాస్త మబ్బుగానో, నెమ్మదిగా చినుకులు పడుతుండగానో, వసారాలో కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు. వెనకటికి నేను నర్శీపట్నం దగ్గర ఉండేటప్పుడు తోటల్లో తరచూ ఇదే చేసేవాళ్ళం.

ఏ విషయం గురించి మాట్లాడినా చివరకు ఆవు వ్యాసం అప్పజెప్పే కుఱ్ఱాడిలాగా, ఎటు తిప్పి ఎటు తిరిగినా నా మనసు గుర్తుచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి వేటూరి. వానకీ వేటూరికి బలమైన సంబంధమే ఉంది. వేటూరి వ్రాసిన వానపాటలు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కొన్ని పాటల్లో భావం ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి సునిశితంగా, మఱో సారి బాహాటంగా ఉంటుంది. విషయం భక్తి ఐనా, బూతైనా పదాలను పట్టుకోవడంలో వేటూరి చాకచక్యం ఏ కవినైనా కవ్విస్తుంది. వానపాటల్లో మరీను.

నాలోని శ్రోతకి వేటూరి ఎన్నో బహుమానాలు (అవే, పాటలు) ఇచ్చాడు కానీ నాలోని కవికి వేటూరి ఇచ్చిన స్ఫూర్తి కంటే, భయమే ఎక్కువ. పదాలను, భావాలను అనర్గళంగా, అనాయాసంగా చెప్పగలిగిన వేటూరిని చూస్తే నాకు "మన వల్ల కాదు బాబు!" అనిపిస్తుంది. ఒక్కోసారి చలనచిత్రాలలో చూపించినట్టు నా అంతరాత్మ ఎదుటపడి వివాహభోజనంబు చిత్రంలో కోట శ్రీనివాస రావు లాగా, "రాస్తే అట్టాంటి పాట రాయలే. బాలీ, నీ లెక్క ఔలా పాట రాస్తాడనుకున్నావ్రా?" అంటుంది.

సియాటల్లో వరుసవానల పుణ్యమా అని నాకు ఏ రోజు మానసిక పరిస్థితిని బట్టీ ఆ రోజు, వర్షం ఒక వేటూరి పాటను గుర్తు చేస్తుంది. ఉన్న మాట చెప్పుకోకపోవడం ఎందుకు. గుర్తొచ్చే పాటలలో అత్యధిక శాతం ప్రణ్యశృంగారావేశభరితంగా ఉంటాయి. అదే, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే పచ్చిగా ఉంటాయి. అర్థమైనవాడికి పదాలనే తీయని గుజ్జు వెనుక చేదైన బూతు విత్తనం తగలవచ్చును. అర్థం కానివాడికి వగరు తొక్క వెనకాల తీయని గుజ్జు కనిపించకపోవచ్చును. ఎవరేమన్నా ఆ పాటల్లో వగరూ, తీపి, చేదు అన్నీ ఉన్నాయి. వెరసి అది మావిడి పండు. కొంచం గంభీరంగా చెప్పాలంటే చూతపాకం అనాలేమో. అన్నట్టు మన్మథుడిని చూతాస్త్రుడు అంటారని బ్రౌహ్ణ్య నిఘంటువు ఉవాచ. వేటూరి పాటలలో ఉత్తుంగశృంగారభావాల కారణంగా ఆ కోణంలో కూడా ఆయన పాటలని చూతపాకం అనడం సబబేమో.

వాన చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయి? ఉరుము, మెరుపు, తళుకు, తొలకరి, జల్లు - ఇలాగ ఒక dozen పదాలుంటాయనుకోండి. వేటూరి కనీసం ఒక పాతిక వానపాటలు వ్రాసారు అనుకుంటున్నాను. ఉన్న డజను పదాలతో ఈ పాటల మధ్యన ఎంత వైవిధ్యం కుదురుతుంది? సందర్భాన్ని కూడా కలుపుకుందాము అంటారా? అవును శంకరా నాదశరీరాపర సందర్భం వేఱు, వాన వల్లప్ప వల్లప్ప సందర్భం వేఱు. కానీ "మన తెలుగు చలనచిత్రాలలో ఎన్ని సందర్భోచితమైన పాటలు ఉంటాయి?", అని ఆలోచిస్తే, ఆ పాతిక పాటల్లో పదిహేను పాటలకు సందర్భం ఇదే: "చిరంజీవికి, హీరోయిన్ కి love. వాన పడింది. పాట వ్రాయలయ్య కవి". ఐనా కూడా పాట పాటకీ కొత్త కొత్త భావాలను, పదాల గారడీని చూపించారు వేటూరి.

మొదట మనం భక్తి రసంతో మొదలేడదాము. వానపడుతోంది. ఒక భక్తుడులో "తను చేస్తున్న మంచిపనికి లోకం ఎందుకు హర్షించట్లేదు" అనే ఆవేశం కలిగింది. దాన్ని సాహిత్యంలో ఎంత ఎత్తుకు తీసుకెళ్ళవచ్చును అని (కే) విశ్వనాథుడు, (కే.వీ) మహాదేవుడు వేటూరిని అడిగితే, దానికి వేటూరి వినమ్రంగా ఇలా బెదిరించారు. శంకరాభరణం చిత్రంలో...
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది
అవధరించరా! విని తరించరా!
ఈ సంస్కృతం అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పటికీ నాకు అర్థమైనది సరో కాదో తెలియదు కానీ, "పొగరుతో (ధిక్కరి) ఉన్న ఇంద్రుణ్ణి జయించిన హిమ గిరీంద్రుడి (ఇంద్రుడి వర్షానికి, గాలులకీ హిమాలయాలు కదలవు కదా?) చలువు (సిత) గొంతులో (కంథర) నిండిన నీలకంథరా (విషం గొంతులో ఉన్నవాడు). సామాన్యులు (క్షుద్రులు) తెలుసుకోలేను రుద్రవీణ నిర్నిద్ర (అలుపు లేని) గానమిది, విను (అవధరించు), విని తరించు (సంతోషించు)". లోకులు మనిషిపై పెట్టే ఒత్తిడిని ఇంద్రుడితో పోల్చి, దాన్ని గెలిచిన హిమాలయాలను మనిషి పట్టుదలతో పోల్చి, అటువంటి మనిషిని ఆదరించేవాడిగా శివుణ్ణి వర్ణించి, కేవలం ధర్మాత్ములకు మాత్రమే అర్థమయ్యే తన జీవనగీతాన్ని చూసి సంతోషించమని శివుణ్ణి అడుగుతున్నాడు. ఆ అడగటంలో కూడా శంకరశాస్త్రి గాంభీర్యం మనకు కనబడుతుంది. అది వేటూరి సత్తా.

ఆ తఱువాత
మెరిసే మెరుపులు మురిసే పెదవుల ముసిముసి నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకుజారెనా శివగంగా
నా గానలహరిఁ నువు మునుగుంగా, ఆనందవృష్టిఁ నే తడువంగా
శివుడు పెట్టిన పరీక్షకు తను ఎలాగ ప్రతిస్పందిస్తున్నాడొ చూద్దామని లీలావినోది ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవి మెరుపులయ్యాయని, తన నడవడికి, గానానికి సంతోషించి శివుడు చేసే నాట్యంలో తుళ్ళుతున్న మువ్వల అలికిడి ఉరుములగానూ, ఆ వర్షం శివుడు తాదాత్మ్యంలో ఉండటం వలన గంగ క్రిందికి ఒలకడం గానూ వర్ణించడంలో వేటూరి మఱొక్క సారి "యద్భావం, తద్భవతి" అనే నానుడిని గుర్తుచేసాడు. శంకరశాస్త్రి "శాస్త్రి". శాస్త్రాలను, భగవంతుణ్ణి మూలంగా ఉంచుకుని నడిచే వ్యక్తి. అతనికి ఆకు కదిలినా, పువ్వు మెదిలినా శివలీలగా అనిపిస్తుంది. ముందు చరణంలో అచంచలమైన గాంభీర్యం పక్కనే రెండో చరణంలో చలింపజేసే భక్తి. వేటూరి కత్తికి రెండు వైపులా కాదు, తొమ్మిది వైపులా (నవరసాలు) పదునే.

ఒక్క ఉదాహరణే ఇస్తే ఎలాగ అంటారా? సరే వేటూరి గురించి పుస్తకాలే వ్రాసినవాళ్ళు ఉన్నారు. నేను మఱొక ఉదాహరణ ఇవ్వలేనా? సరిగమలు చిత్రంలో రవి శంకర్ శర్మ (బొంబాయి రవి) సంగీతానికి వేటూరి వ్రాసిన మాటలు చూద్దాము. ఇది వాన పాట కాదు కానీ వానతో కూడిన భావం. అంటే నిఖార్సైన ఉదాహరణే. అప్పటిదాకా సంగీతం చేతకాని వాడు గురువు అనుగ్రహం వలన, దైవబలం వలనా గొప్ప పాటగాడయ్యాడు. అప్పుడు వేటూరి అన్న మాటలు:
కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
అద్వైతభాష్యాలను చదివిన వాళ్ళకు కుండలో నింగి అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మమంతా ఒకటే అనడానికి దృష్టాంతాలంకారంతో గౌడపాదులు (శంకరాచార్యుల గురువుకు గురువు) చెప్పిన ఉదాహరణ ఇది.
బ్రహ్మం ఆకాశంలాగా అంతటా ఉంది. కుండలలోనూ ఉంది, బయటా ఉంది. కుండల వలన అది వేఱు వేఱుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే మాయ (మట్టి)ని తొలగిస్తే అంతటా ఉన్నది బ్రహ్మమే (ఆకాశమే). 
అలాగే ఇన్నాళ్ళూ తనలో ఉంచుకున్న సంగీతశక్తి తనకు ఆ కుండ అవధి కాదని తెలుసుకుని ఒక్కసారిగా ఉరిమింది అని కవి భావన. ఈ మధ్యన నేను అద్వైతసాహిత్యం ఎక్కువగా చదవడం వలన నాకు ఈ విషయం అర్థమైంది. తఱువాత సోదరుడు ఫణీంద్ర పుణ్యమా అని కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో వేటూరి ఇచ్చిన వివరణ చదివిన తఱువాత మరింత సంతోషం కలిగింది. వేటూరి భావాలను అర్థం చేసుకోగలగడంలో ఉండే తృప్తి అలా ఉంటుంది.  వెయ్యండిరా నూరు వీరతాళ్ళు అనాలనిపించట్లేదు?

కొనసాగుతుంది...

7 comments:

కామేశ్వరరావు said...

"ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా"

ఇది "దిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకందరా నీలకంధరా" అనుకుంటున్నాను. దీని అర్థమేమిటని నన్ను అడగకండి! :-) "ధిక్కారి" సరైన పదం, "ధిక్కరి" కాదు. అంచేత ఇక్కడ "దిక్కరి"యే అవ్వాలి. "దిక్కరీంద్ర జిత" అంటే "దిగ్గజమును(దిగ్గజాలను) గెలిచిన". "కందరము" అంటే గుహ. "కంధరము" అంటే కంఠము, మేఘము అని అర్థాలున్నాయి. "నీలకంధరా" అంటే అర్థం స్పష్టం - నీలకంఠుడు.
"దిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర సితకంధరా" అని అనుకుంటే "దిక్కరి అయిన ఐరావతాన్ని, హిమగిరిని, తెల్లని మేఘాన్ని జయించినవాడా" అనే అర్థం తీసుకోవచ్చు. శివుడు తెల్లనివాడు. ఐరావతమూ, హిమగిరి, తెల్లని మేఘమూ మూడూ తెల్లనివే కాబట్టి అంత కన్నా తెల్లనివాడు అనే అర్థం వస్తుంది. కానీ బాలుగారి గానంలో "సితకందరా" అన్నప్పుడు వత్తు ధ్వనించడం లేదు, "నీలకంధరా" అనేటప్పుడు వత్తు స్పష్టంగా ధ్వనిస్తుంది. "సితకందరము" అంటే "తెల్లనిగుహ" అనే అర్థం వస్తుంది. దీనికి అన్వయం సరిగా కుదరడం లేదు. దీనికి వేటూరి కాని ఇంకెవరైనా కాని ఎక్కడైనా వివరణ యిచ్చారేమో నాకు తెలీదు.

Anonymous said...

చాలా బాగా రాశారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

గజాసురుని గెలిచినవాడా అనీ
హిమగిరిశిఖరాలపై ధవళ వర్ణంతో తెల్లని కొండపై తెల్లని మబ్బు తేలుతున్నట్టుగా ఉన్నవాడా అనీ
నాకు అనిపించింది.

రవి said...
This comment has been removed by the author.
Chari Dingari said...

సరిగమలు సంగీత దర్శకుడు విద్యాసాగర్ కాదు, "పద్మశ్రీ" రవి (బొంబాయి) గారు, వారి ఏ మేరి జోహర జాబీన్ ఇందులో సరిగమలాపవయ్య గా తెలుగు లో చేసారు

రవి said...

కం ధరతి ఇతి కంధరః - క అంటే జలము. జలమును ధరించువాడు,(ధరించునది) - కంధరః - అంటే కంఠము. జలమును (గంగను) ధరించేవాడు ఈశ్వరుడు కాబట్టి ఆయనకు కూడా ఈ అన్వయం చెప్పుకోవచ్చుననుకుంటాను.

Sandeep P said...

@కామేశ్వర రావు గారు, రవి గారు

బాలు ఉచ్చారణ ఒక్కోసారి గొప్ప చిక్కే తెచ్చి పెడుతుంది. ఇప్పుడే youtubeలో బాలు ఈ మధ్యన పాడిన ప్రతిని విన్నాను. అందులో ధిక్కరి లో ధి ని పట్టి మరీ పలికాడు. కానీ మీరన్నట్టూ ధిక్కరి అంటే కుదరలేదు. నేనూ పొరబడ్డాను. దిక్కులను మోసే ఏనుగులలో ఏ ఒక్కటీ మఱొకదాని కంటే ఎక్కువ అన్నట్టు నేను వినలేదు. మరి దిక్కరీంద్రుడు అని సంబోధించడం దేనికి అని అర్థం కావట్లేదు. దిక్పాలకులను దిక్కరులతో పోల్చి దిక్కరీంద్రుడు అని ఇంద్రుణ్ణి సంబోధించాడా అని కూడా ఒక సందేహం ఉంది. ఏదేమైనా కొంచెం చిక్కుగా ఉంది.

ఈ అన్వయం చూడండి: దిక్కరీంద్ర! జితహిమగిరీంద్ర సితకంధరా! (దిక్కులను మోసే ఏనుగులలో శ్రేష్ఠుడా, హిమాలయాలను జయించిన తెల్లని మేఘమా, నీలకంఠుడా!). సంస్కృతంలో జిత్ అనే శబ్దం పదం చివరన వచ్చినప్పుడు జిత గా మారదనుకుంటున్నాను. అభిజిత్ + ముహూర్తం, సత్రజిత్, ఇంద్రజిత్ లాగ. అందుచేత ఈ సంస్కృతసమాసంలో "ధిక్కరీంద్రజిత" ఒక భాగం అయ్యే అవకాశం లేదు. అందుచేత ధిక్కరీంద్ర, జిత + హిమగిరీంద్ర, సిత కంధరా అనాలేమోననిపిస్తోంది. కవితావిశేషం ఏమిటంటే ఒకపక్కన సితకంధరా అంటూ మఱో పక్కన నీలకంధరా అనడంలో వ్యతిరేకార్థాలున్న పదాలతో ఒకే వ్యక్తిని పొగుడుతున్నాడు ("అనేకదన్ తం భక్తానాం, ఏకదంతముపాస్మహే" లాగ. అన్నట్టు, ఇదేం అలంకారం చెప్మా?).

@dnc పొరబాటుని సవరించాను. నెనర్లండి.

@లక్ష్మీదేవి గారు, గజాసురుడిని దిక్కరీంద్రుడు అని అనడం కుదరదేమో? పైగా గజాసురుడు శివభక్తుడు కదా?