Saturday, October 22, 2011

ప్రియతమా, నను పలకరించి ప్రణయమా (వేటూరి)

ఇళయరాజ, వేటూరి అంటే నాకు ఎంత ఇష్టమో నన్నెరిగినవాళ్ళకు ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు. వారిద్దరి కలయికలో వచిన పాటలన్నీ నాకు ఇష్టం. చిరంజీవి, శ్రీదేవి నటించిన, విజయవంతమైన చిత్రం "జగదేక వీరుడు, అతిలోక సుందరి" లో అలాంటి పాటలు చాలా ఉన్నాయి. నాకు ప్రత్యేకించి నచ్చినది, "ప్రియతమా, నను పలకరించు ప్రణయమా" అనే పాట.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వేటూరి వ్రాసిన చాలా పాటలు (ముఖ్యంగా యుగళగీతాలు) అద్భుతంగా ఉంటాయి. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే కథానాయిక దేవకన్య కావడం. ఆ విషయాన్ని వేటూరి పాటలో చాలా సార్లు ప్రస్తావించి, ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అని నాకు అనిపిస్తుంది.

ఇళయరాజా సంగీతం గురించి వర్ణించడానికి నేను అనర్హుణ్ణి. స్వరజ్ఞానం లేని నా వరకు ఇది ఒక అద్భుతమైన బాణీ, స్వరకల్పన. జానకమ్మ, బాలు గురించి నేను చెప్పేదేముంది -- ఈ పాటలో వారి ఉచ్చారణ కొత్త గాయనీగాయకులకు నిఘంటువు వంటిది అని నా అభిప్రాయం.

చిత్రంలో ఈ పాట సందర్భం ఏమిటి అంటే: రాజు (చిరంజీవి) అనే యువకుడు కొంతమంది అనాథలను పెంచుకుంటూ ఉంటాడు. అతడు ఒక పని నిమిత్తమై హిమాలయాలకు వెళ్తే అక్కడ ఇంద్రుని కుమార్తె ఇంద్రజ (శ్రీదేవి) చెలికత్తెలతో ఆడుకుంటూ పారవేసుకున్న ఉంగరం దొరుకుతుంది. ఇంద్రజకు ఆ ఉంగరం లేనిదే స్వర్గ ప్రవేశం లేదు. ఆ ఉంగరం సంగ్రహించడానికి భూమిపైకి వచ్చి రాజును ఏదో ఒక లాగ మభ్యపెట్టి అది తీసుకుని పోదామనుకుంటుంది. కాకపోతే రాజు మంచితనానికి, తనతో ఉన్న పిల్లలతో ఏర్పడిన అనుబంధానికి లొంగిపోయి ఉంగరం దొరికినా వెళ్ళలేక ఉండిపోతుంది.

ఈ లోపు రాజుకు నాయిక ఇంద్రుని కుమార్తె అని తెలిసి, పశ్చాత్తాపంతో ఉంటాడు. వారు ఇద్దరూ కలుసుకుని తమ వలపును తెలుపుకునే సమయంలో వచ్చే యుగళగీతం ఇది.


గానం: బాలు, జానకి
రచన: వేటూరి సుందరరామ మూర్తి
దర్శకత్వం: రాఘవేంద్ర రావు
సంగీతం: ఇళయరాజ

ప్రియతమా! నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా
మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా

నాయిక నాయికుణ్ణి "నను పలకరించు ప్రణయమా" అనడంలో "అతడు ప్రణయానికి మూర్తీభవించిన రూపం" అని భావం. అస్పృశ్యమైన ప్రణయానికి, స్పృశ్యమైన నాయకుడికి సామ్యాన్ని చూపడం వేటూరి ముద్ర.అతిథి అంటే చెప్పకుండా వచ్చేవాడు అని అర్థం (అ+తిథి). దేవకన్యలు మానవులను పెండ్లి చేసుకుందామని అనుకోరు కనుక నాయిక జీవితంలోకి నాయకుడు అనుకోకుండా వచ్చాడు అని కవి భావం.

పల్లవిలో మూడు ప్రయోగాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నాయిక నాయకుణ్ణి బ్రతుకులోని బంధం, పలుకలేని భావం, మరువలేని స్నేహం గా వర్ణించడం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా "పలుకలేని భావమా" అన్నప్పుడు సప్తపదిలో "అనగల రాగమై తొలుత వీనులలరించి, అనలేని రాగమై (అనురాగం) మరలా వినిపించి" అనడం గుర్తొచ్చింది. అలాగే యువరాజు చిత్రంలో "తొలివలపే తీయనిది" అనే పల్లవి తో ఉన్న పాటలో "వేదం లాగా లిపి లేనిది" అని ప్రేమను వర్ణించడం ద్వారా వేటూరి ప్రేమను అనుభవించాలి కానీ, మాటల్లో వివరించలేము అని వర్ణించారు. ఇటీవల వచ్చిన "సూర్య S/O క్రిష్ణ" చిత్రంలో కూడా "అభిమానం అనేది మౌనం, పలకదులే పెదవులపై" అని వ్రాసారు.

ఇక్కడ ఒక విమర్శ ఏమిటంటే "నాయకుడు తన కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు, మరలి రాని నేస్తం ఎందుకయ్యాడు? మరలి పోని నేస్తం అయ్యాడంటే అర్థం ఉంది కానీ?". దీనికి సమాధానం ఆ మహానుభావుడికే తెలియాలి. ఇంత అద్భుతమైన పాటలో ఈ చిన్ని విషయాన్ని ఆయన విస్మరించారు అంటే నాకు నమ్మకం కుదరట్లేదు.

ప్రియతమా ||
ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా?

నాయకుడు ఇంద్రజని "ఎదుట ఉన్న స్వర్గం" అనడంలో శ్లేష ఉంది. స్వర్గంలో ఉన్న అందం అంతా తన కళ్ళ ఎదుట ఉంది అని ఒక అర్థం అయితే, తనతో ఉంటే అతనికి స్వర్గంలో ఉన్నట్టు (హాయిగా) ఉందని మఱొక అర్థం.

అందాన్ని కావ్యంతో పోల్చడం వేటూరికి కొత్త ఏమీ కాదు. ఛాలేంజ్ చిత్రంలో "ఓం శాంతి" అనే పాటలో, "కన్నె నడుమా కల్పనా? కవులు పాడే కావ్యమా" అని అనడం ద్వారా స్పృశ్యమైన (tangible) వస్తువులని అస్పృశ్యమైన వస్తువులతో పోల్చడం చేశారు. కౌగిలి విడితే ప్రాణాలు పోతున్నాయా అని చిలిపిగా అడగడం నాకు నచ్చింది. గుర్తు రావట్లేదు కానీ, ఇవే మాటలు మఱొక పాటలో కూడా వాడినట్టున్నారు.

నింగి వీణకేమొ నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి

వేటూరికి తెలుగు మీద ఉన్న అభిమానం గురించి నేను చెప్పక్కరలేదు. అందుకేనేమో ప్రత్యేకించి దేవకన్యకు కూడా తెలుగు నచ్చిందని చెప్తున్నారు :) నింగి వీణ సంగీతం ఆలపించాలి -- అలాంటిది నేల మీదటి తెలుగు పాటలు వచ్చాయట. పారిజాతం (చదువర్లకు పారిజాతాపహరణం గుర్తుంటే ఇంద్రుడికి, పారిజాతానికి ఉన్న సంబంధం గుర్తొస్తుంది) కాస్తా పచ్చి మల్లెమొగ్గ (సిగ్గు పడే ఆడపిల్ల) లాగా తనలో విరిసి (తనలో మెదిలి) ప్రేమను తెలిపిందట. రెండు వాక్యాలలోనూ స్వర్గాన్ని గురించి మాట్లాడారు.

మచ్చలెన్నొ ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మ  కన్న చీరకట్టుకున్న పడుచుదనమే నాలో మురిసే

దేవకన్యలో ఆకాశంలో కదా విహరించేది. ఇంద్రజకు (నాయికకు) మచ్చలున్న చందమామ కంటే (ఈ మాటల్లో కూడా శ్లేష ఉంది) మచ్చలేని (గుణవంతుడైన) నాయకుడే నచ్చాడట. తారల్లో ఒక దానిగా వెలగడం కంటే చీర కట్టుకొని ప్రియుడి కోసం వేచి ఉండటం బాగుందట. (ఇదే చిత్రంలో "యమహో నీ యమ యమ అందం" అనే పాటలో "తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి" అని అనడం కూడా నాకు నచ్చింది.) ఇందులో నాయిక కూడా ఆకాశం కంటే భూమే బాగుందని చెప్పింది.

మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం, తెలిసే హృదయం
తారలన్ని దాటగానె తగిలే గగనం, రగిలే విరహం

నాయిక తన ఉంగరాన్ని సంగ్రహించాక (తస్కరించాక) స్వర్గానికి వెళ్తూ ఉంటే తారలు దాటగానే విరహం మొదలైందట :) ఈ ప్రయోగం ఘాటు నాకు బాగా నచ్చింది. ఇక్కడ గగనం అంటే శూన్యం (ఏమీ లేకపోవడం) అనే ధ్వని కూడా వినబడుతోంది.

వ్రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే

మొదటి రెండు వాక్యాలూ "పలుకలేని భావం" కి కొనసాగింపులు. కన్నుల మధ్యన సాగే రాయబారాలకు వ్రాతలెందుకు. గతంలో "లిపిలేని కంటి బాస" అనే పాట పల్లవిలో, తఱువాత "మాయాబజార్" (రాజ, భూమిక నటించిన కొత్తది) చిత్రంలో "ప్రేమే నేరమౌన బ్రోవ భారమా? మాట మౌనమైన రాయబారమా?" అనే పాటలో ఈ భావాలను వ్రాసారు వేటూరి.

రాయి లాంటి గొంతు అంటే నా గొంతు లాగా వినడానికి కంకర్రాళ్ళు రుబ్రోల్లో వేసి దంచినట్టు ధ్వనించే గొంతు కాదని, (సిగ్గుతో) చలనం లేని గొంతు అని చదువర్లు గుర్తించే ఉంటారు :)

ప్రాణవాయువేదొ వేణువూదిపోయే శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంతా యెంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి

దేవతలకు మనకు కొన్ని భేదాలుంటాయి -- వారికి చమట పట్టదు, కళ్ళు రెప్పలు పడవు, పాదాలు నేలను తాకవు, శరీరానికి దుమ్ము అంటదు, వాళ్ళు ధరించిన పూమాలలు వాడవు. బహుశః వాళ్ళకు ప్రాణవాయువు (అదే మన oxygen) పీల్చుకోవలసిన అవసరం లేదు అని వేటూరి ఉద్దేశం అయి ఉండవచ్చును. ఆ ప్రాణవాయువు నాయకుడి శ్వాసతో తనది కలిపి, వేణుగానంలో (ప్రణయంలో) ముంచి పోయింది అని నాయిక భావం. అలాగే, వేటూరి ఎంకి పాటల గురించి ప్రస్తావించడంతో నాయికకు మఱింత తెలుగుదనాన్ని అద్దారు.

వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వచ్చా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి

నాయిక వెన్నెల వలే (ఆకర్షించి) వేదమంత్రం (పెళ్ళి) గా మారిందట. ఇక్కడ "బహుశా" అనడం బహుశా ఖాళీ-పూరింపు చర్య అయ్యి ఉండవచ్చును. కానీ ఇంత అందంగా వ్రాసిన పాటకు ఇలాంటి ఒకటి రెండు మాటలు దిష్టి చుక్కలుగా భావిస్తాను. లేదా నా అజ్ఞానం అనుకుంటాను.

నాకు పాటలోకి శ్రేష్ఠమైన వాక్యంగా గోచరించింది పై రెండో వాక్యం. మేనకల్లే (నాయకుణ్ణి ముగ్గులోకి దింపడానికి) వచ్చి జానకల్లే (నిష్ఠగా, సహధర్మచారిణి గా) మారిందట నాయిక.
ఇక్కడ కులము, గుణము అనడంలో నాయకుడి అనుయాయులు, అలవాట్లు అని ధ్వని.

నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం, విధికే విలయం
నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం, మనసే మరణం

నాయికానాయకులు ఒకరు లేని మఱొకరికి వారి సొంత ప్రపంచం అంటే విరక్తిని చెప్తున్నారు. ఐతే, నాకు నచ్చిన ప్రయోగం "మనసే మరణం" -- మనసు ఉంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అనే భావం నాకు నచ్చింది.

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై రగిలే

వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో -- తెలుగులో ఇది వేటూరి, సిరివెన్నెల మాత్రమే చేయగలిగిన ప్రయోగం అని నా అభిప్రాయం. వానవిల్లు ఏర్పడాలంటే సూర్యకాంతి మబ్బుల్లోని నీటి పొరల ద్వారా చీలి కనపడాలి. దేవలోకంలోని నాయికకు భూమి చేరగానే గుండెలో ఎన్నో భావాలు (ప్రణయం, సిగ్గు, అభిమానం మొ.) పుడుతున్నాయని పరోక్షమైన ఉపమానంగా నాకు నచ్చింది. నాయకుడు చిలిపిగా "అమృతం పంచేటప్పుడు (సరసంలో) హద్దులు దేనికి?" అని తిరిగి అడిగాడు.

12 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

సందీప్ గారు
ఇది మీరే రాశారా అనిపిస్తోంది అంటే నమ్మండి. ఎందుకంటే మీరింకా బాగారాస్తారు. ఈవేళ ఏదో తొందరలో రాసినట్టు ఉందిమరి. కొన్ని పేరా ల్లొ మీ మార్క్ ఉంది.
మీరీ సినిమా చూడలేదా? ఇందులో అందమైన శ్రీదేవి కథానాయిక. ఇంద్రజ కాదు. ఇంద్రుని కూతురన్నట్టు ఇంద్రజ అన్నారా ఏమిటి? ఏమో..!
ఇక మరలిరాని నేస్తమా అని ఎందుకన్నాడో అన్నారు కదా, ఒకవేళ స్వర్గంనుంచీ వచ్చిన నాయిక తిరిగి వెళ్ళిపోయినట్టుగా కథ ఆయనకు చెప్పారో ఏమో, మొదట. తర్వాత కథ మార్చినా పాట సాహిత్యం మార్చాలన్న ఇంగితం కానీ , సాహిత్యాభిమానం కానీ సినిమా తీసేవాళ్ళకు లేవంటే ఆశ్చర్యపోనక్కర లేదు. కథ మార్చారేమో అని ఎందుకన్నానంటే...
తారలన్నీ దాటగానే ...వాక్యం మీద వ్యాఖ్యానం చేస్తూ మీరు ఉంగరాన్ని సంగ్రహించాక స్వర్గానికి వెళ్తున్నప్పటి భావనలన్నారు. అసలు చివరకు కానీ నాయిక కు ఉంగరం నిజంగా దొరకదు. దొరకంగానే నాయకుడి కోసం ఉంగరాన్ని సముద్రంలో పడేసి వదిలించుకుంటుంది కానీ స్వర్గానికి వెళ్ళటమే ఉండదు కదా. పోగొట్టుకున్నపుడు స్వర్గానికి వెళ్ళాక చూసుకున్నా అప్పటికి నాయకుడితో వలపేమీ ఉండదుకదా! (అందుకే అనిపించింది మీరు చూడలేదా సినిమా అని)అయినా వేటూరి సాహిత్యం గురించి చెప్తే మీరే చెప్పాలండి. :-)

Sandeep P said...

@మందాకిని గారు

మీ వ్యాఖ్యకు నెనర్లు అండి. ఇప్పుడే చిత్రంలో ఈ పాట వచ్చే ముందు సందర్భం మళ్ళీ చూశాను.ఈ పాట ముందు పాప (బేబీ షామిలి) అనారోగ్యంతో ఉంటుంది. తను రాజు నుండి ఉంగరం తీసుకుని ఇంద్రజ (heroine) కి ఇస్తుంది. ఆ తఱువాత రాజు ఆంజనేయస్వామిని వేడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంద్రజ బేబీ షామిలికి ఉన్న అనారోగ్యాన్ని (దెబ్బలని) నయం చేస్తుంది. అది బేబీ శాలిని చూస్తుంది, ఆ విషయాన్ని వెళ్ళి రాజుతో చెప్తే అప్పుడు రాజుకు శ్రీదేవి నిజంగా దేవకన్య అన్న విషయం తెలుస్తుంది. ఈ లోగా శ్రీదేవి స్వర్గానికి వెళ్దామనుకున్నదే మళ్ళీ ఆగిపోతుంది. శ్రీదేవి తన మనసులో ఉన్న భావాలను హరిణి (ఒక లేడితో) చెప్తుంది -- వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాను అంటుంది. అప్పుడు చిరంజీవి పశ్చాత్తాప్తంతో ఉండగా, తమ వలపును తెలుపుకునే సన్నివేశంలోని పాట ఇది. మీరు అన్నట్టు కథ వేటూరికి వేఱే సందర్భం చెప్పి కూడా ఉండవచ్చును.

కథానాయిక పేరు ఇంద్రజ అని చెప్పనందున కొంచెం గందరగోళం జరిగింది. సరి చేసాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఓహ్ ! అవునా, మర్చిపోయానో ఏమిటో మరి.
sorry.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

పాటకు నువ్వు రాసిన వివరణ బాగుందని నేను ప్రయేకించి చెప్పనక్కర్లేదు :)

బహుశా అనే పదం వేటూరికి చాలా ఇష్టమైన పదమే! కచ్చితంగా ఖాళీ-పూరింపుకై ఉండదన్నది నా ఉద్ధేశం.

"బహుశ" అనే పదంతోనే పల్లవులుకూడా రాశారు అయ్యవారు.

"బహుశా నిను బందర్లో చూసియుంటా..."
"బహుశా ఓ చంచలా..." వరుడులో!

మరి కొన్ని పాట్లల్లోకూడా బహుశా బానే వాడారు.

రాఘవ said...

చాలా చక్కగా వ్రాసారు. నాకు నచ్చింది :) +1

రాజ్ కుమార్ said...

excellent....!

Phanindra said...

చక్కని వ్యాఖ్య. నాకు తోచినవి కొన్ని:

1. పల్లవిలో "మరలి రాని నేస్తమా" అనడంలో కొంత గందరగోళం ఉండడం వాస్తవమే. నా ఊహ ఏమిటంటే వేటూరి మొదటి లైన్లు చిరంజీవి పాడినట్టు, తర్వాత లైన్లు శ్రీదేవి పాడినట్టు రాస్తే రికార్డింగ్‌లో ఇది తిరగేసి ఉంటారు. ఈ పాట సందర్భానికి ఇద్దరి మధ్యా ప్రేమవ్యక్తమౌతుంది కానీ, శ్రీదేవి భూమ్మీదే ఉండిపోతుంది అని నిశ్చయించబడదు. కాబట్టి "మరలి రాని స్నేహమా" అని శ్రీదేవిని ఉద్దేశించి చిరంజీవి అనడం సముచితం అవుతుంది. అలాగే అతిథి అన్నది శ్రీదేవికే ఎక్కువ సరిపోతుంది చిరంజీవి కన్నా. స్వర్గలోకం నుంచి వచ్చిన శ్రీదేవి "ఎదుట ఉన్న స్వర్గమా" ("నేను ఇంకా స్వర్గం లోనే ఉన్నాను. అది నువ్వే" అన్న భావం) అని చిరంజీవిని సంబోధించడమూ సరిపోతుంది. "కౌగిలింత ప్రాణమా" అంటే "నీ స్నేహం ద్వారా నాకు ప్రాణం పోశావు. స్వర్గంలోది కాదు నీతోటిదే జీవితం, ఇదే నాకు కొత్త జన్మ" అన్న అర్థం కూడా తీసుకోవచ్చు.

2. అడుగే పడక గడువే గడిచి పిలిచే - ఇది "అడుగే కడతా గడువే గడిచి పలిచే" అనుకుంటా. గడువు గడిచే లోపు శ్రీదేవి స్వర్గం చేరకుంటే దివ్యత్వం పోయి మానవత్వం వచ్చేస్తుంది. కాబట్టి తను నిర్ణయించుకోవాలి. ఇక్కడ "నీతో కలిసి అడుగులేస్తాను" అనడం ద్వారా తన మనసుని కొంత తేటపరుస్తోంది. నిజానికి ఈ పాట రెండో చరణంలోనే ఇద్దరూ స్పష్టపరుచుకుంటారు కలిసి ఉండాలి అని, అప్పటి దాకా కేవలం ఇష్టం వ్యక్తపరుచుకోవడమే. అందుకే చిరంజీవి అంటాడు "వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయె బహుశా" - వేదమంత్రం పెళ్ళికి సూచిక. ఈ అమ్మాయి తనని పెళ్ళిచేసుకునేందుకు ఇష్టపడుతోంది బహుశా. వెంటనే పక్క లైనులో "సీత వంటి గొప్ప సుగుణవతివి నువ్వు, నాకూ అంగీకారమే" అని పరోక్షంగా చెప్పడం.

3. జగమే అణువై యుగమే క్షణమై రగిలే - ఇది "క్షణమై మిగిలే" అనుకుంటా. ఆఖరి మూడు లైన్లు ఒకరితో ఒకరు అనుకున్నట్టు కాక, ఒక వ్యాఖ్య చేస్తున్నట్టు భావిస్తే భావం బాగా కుదురుతుంది. ఇది ప్రేమపై వ్యాఖ్య. ప్రేమ అనే వానవిల్లులో మాత్రమే నీటికి రంగులు వస్తాయి. ప్రేమ తెచ్చే కళ అలాటిది మరి. ప్రేమ అనే అమృతాల విందులో (అమృతాల విందు అంటే శృంగారపరమైన అర్థమే తీసుకోవాలని లేదు) ఏ హద్దూ లేదు. ఇక్కడ తను మానవుడు, ఆమె దేవకన్య కావడం ఆటంకం కాదు. ప్రేమ ముందు మొత్తం జగం ఒక అణువుగా, యుగమైనా క్షణముగా మారుతుంది. అదీ ప్రేమ గొప్పతనం.

lalithag said...

వ్యాఖ్య ద్వారా ఇటు వచ్చి ఈ టపా చదివి ఈ పాట సాహిత్యాన్ని మరింత సన్నిహితంగా పరిశిలించి ఆనందిచగలిగాను ఈ రోజు. Thanks.
"పలుకలేని భావమా" అన్నప్పుడు సప్తపదిలో "అనగల రాగమై తొలుత వీనులలరించి, అనలేని రాగమై (అనురాగం) మరలా వినిపించి" అనడం గుర్తొచ్చింది. "
నాకు సరిగ్గా అదే పోలిక గుర్తు వస్తుంది. "అనగల రాగమై..." నాకు ఎంతో నచ్చిన లైన్లు. ఆ అర్థం ఎవరో వివరిస్తే తెలిసింది. అప్పట్నుంచీ ఆ భావాన్ని ఎన్ని సార్లు జ్ఞాపకం చేసుకుంటుంటానో.
'అతిథి ' లా రావడాన్ని 'దేవకన్య ' కావడానికి లింకు పెట్టక్కర్లేదనుకుంటా. అనుకోకుండా ప్రేమ కలగడాన్ని ఎప్పుడైనా అలానే వర్ణించచ్చేమో.
'మరలి రాని నేస్తమా' అంటే పోతే మళ్ళీ దొరకనిది (వదిలేస్తే మళ్ళీ కలుసుకోవడం జరగదేమో) అనే భావన కనిపించింది నాకు మరి.
'తెలుగు ' తెలియడం అంటే మానవ భాష అని అర్థమేమో. తెలుగు మీద ప్రత్యేకాభిమాన అంటారా? ఆలోచిస్తున్నాను.
"పలుకలేని భావమా" అన్నప్పుడు సప్తపదిలో "అనగల రాగమై తొలుత వీనులలరించి, అనలేని రాగమై (అనురాగం) మరలా వినిపించి" అనడం గుర్తొచ్చింది. " హ్మ్మ్ ... దీని వివరణలో కూడా విభేదిస్తున్నాను. తారాలోకం నుంచి ప్రయాణం ఇక్కడ పైనుంచి కిందకి రావడాన్ని తనకి ఈ లోకం ఆకాశంలాగా అనిపించడమేమో? బాగా చెప్పలేకపోయాను కానీ పైకి వెళ్ళడం గురించి కాక భూమి మీదకు రావడాన్ని వర్ణించడమేమో కదా అని నా భావం. మబ్బులు వీడిపోవడం లో కూడా రెండు అర్థాలు - clarity, మబ్బుల లోకం నుంచి కిందకి రావడం అయుండచ్చు అనిపిస్తోంది.
అమృతాల విందులో హద్దులు - దేవతలకు మానవులకు మధ్య ఉన్న హద్దులని నా అభిప్రాయం.
"అడుగే పడక గడువే గడిచి పిలిచే" ఇది కూడా వ్యాఖ్యాత చెప్పినట్టు కాక ఆమె సంఘర్షణని చూపిస్తోందేమో? అడుగు పడట్లేదు అతనిని విడిచిపోవడానికి. అక్కడ గడువు ముగిసిపోతోంది అని.
ఏమో ఇలానే అనుకుని ఆనందించాను ఇన్నాళ్ళూ. ఈ టపా, వ్యాఖ్య మూలంగా కాస్త దగ్గరిగా ప్రతి లైనూ మళ్ళీ విని ఎంత బావుందొ కదా సాహిత్యం అనుకున్నాను. అందమైన ఊహా ప్రపంచంలో అందుకోగలిగే భావాలు కొన్ని, అలరించేవి ఇంకొన్ని. చాలా బావున్నాయి అనుకుంటూ నాకు తోచిన మాటలు ఇక్కడ పంచుకుంటున్నాను.

lalithag said...

second time when I quoted 'anagala ragami', this is the one I actually intended.
"తారలన్ని దాటగానె తగిలే గగనం, రగిలే విరహం"

Pranav Ainavolu said...

Nice review. Unveiled the beauty of song through its meaning. Chala bagundi :)

Pavan Rohit Kuppili said...

మీ టపా చాలా బాగుంది అండీ!!! మీరు మరిన్ని టపాలు రాయాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. వేటూరి పాటలు అన్ని ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా??

Sandeep P said...

@రోహిత్

మీ మంచి మాటలకు ధన్యవాదాలు. వేటూరి పాటలు వినడానికైతే YouTube, ramaneeya.com లో ఉంటాయి. చదవడానికైతే ఒక అద్భుతమైన సంకలనాన్ని మీరు veturi.in నుండి దింపుకోవచ్చును.

సందీప్