Monday, April 23, 2012

కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?

చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఎప్పుడైన ఆయన దౌహిత్రులు (కూతిరి కొడుకులు) ఇంటికి వచ్చినప్పుడు "కాస్త అలా నడుద్దాము పద", అని వీధిలోనే కొంతసేపు నడిచేవారు. ఈ సారి కిట్టు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది.

"ఒరేయ్ నాన్న, ఒక సారి రావు గారి ఇంటికి వెళ్ళివద్దాము పద. ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు.", అన్నారు కృష్ణయ్య. రావు గారంటే అదే వీధిలో ఉండే మఱొక వ్యాపరస్థుడు. చాలా ఆస్తి, మందిబలం ఉన్న వ్యక్తి. ఇంట్లో ఆడవాళ్ళతో చెప్పి కిట్టు, కృష్ణయ్య కలిసి రావు గారి ఇంటికి వెళ్ళారు. రావు గారు ఒక పడకకుర్చీలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనన్నట్టు చూస్తున్నారు. కృష్ణయ్య గారిని చూసి "రండి, కూర్చోండి", అంటూ ఇంట్లో ఆడవాళ్ళకు వినబడేలాగా, "కృష్ణయ్య గారు, ఆయని మనవడు వచ్చారు. coffeeలు పట్టుకురండి", అన్నారు.

ఇంతలో రావు గారు, కృష్ణయ్య గారు కూర్చుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వారి పిల్లలు ఎలాగ నడుపుతున్నారో చర్చించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కిట్టుకు ఇదేమీ అర్థం కాక చుట్టూ ఉన్న చిత్రపటాలను చూస్తున్నాడు. ఇంతలో coffeeలు వచ్చాయి. ముగ్గురూ తాగడం మొదలెట్టారు. మెల్లగా, అటు తిరిగి ఇటు తిరిగి, మాట ఆస్తుల పంపకాల గురించి వచ్చింది.

రా: ఏఁవయ్య కృష్ణయ్య, నీ వీలునామా వ్రాసావా?
కృ: ఎప్పుడో! ఆ మధ్యన 90లలో అనారోగ్యం చేసినప్పుడే వ్రాసాను. ఆడపిల్లలని, అబ్బాయిని పిలిచి విషయం చెప్పి సంతకాలు పెట్టించాను.
రా: కొడుక్కి కొంచెం ఎక్కువ ఇచ్చావా? అందరికీ సమానంగా పంచావా?
కృ: కూతుళ్ళకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసాను కదా. కొడుక్కే దాదాపు అంతా వ్రాసాను.
రా: అలాగెలాగ కుదురుతుంది? నీకు మీ నాన్న దగ్గరనుండి ఆస్తి సంక్రమించింది కదా?
కృ: నా మొహం లే. సుబ్బన్న (తన తండ్రి) గారు నన్ను చాలా ప్రేమగా పెంచారు కానీ నాకు ఇవ్వడానికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలలేదు. అరయెకరం ఇచ్చారేమో. మాకున్న అప్పులకు కూడా అది సరిపోలేదు. అప్పులోళ్ళకి ఆ ఉన్న పొలాన్ని హామీ ఇచ్చి, ఈ వూరొచ్చి వ్యాపారం చేసి చేతులూ కాళ్ళూ కాల్చుకుని ఐదారేళ్ళ తఱువాత తీర్చాను.
రా: ఏమైతేనేఁ నీకు ఆయన దగ్గరనుండి సంక్రమించిన ఆస్తి నువ్వు పెట్టిన వ్యాపారానికి ఉపయోగపడింది కదా? నువ్వు అది అనుభవించావు కదా?
కృ: అర ఎకరానికి కూడా "అనుభవించడం" లాంటి మాటలెందుకులే.
రా: ఏమైనా స్వామీ, నీ కూతుళ్ళు న్యాయస్థానంలో దావా వేస్తే నువ్వు నీ ఆస్తిని సమానంగా పంచి తీరాల్సింది.

కృష్ణయ్య గారు కాఫీ త్రాగుతున్నారు కానీ ఆయన కళ్ళు ఎఱ్ఱగా మారుతున్నాయి. ఆయన కొంతసేపు మౌనం వహించారు. కిట్టు ఇది గమనించాడు. రావు గారి ఇంటికి కృష్ణయ్య గారి ఇంటికి మధ్యన నాలుగు ఇళ్ళు దూరం. ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటే కిట్టు వెళ్ళాక చెప్పచ్చును. ఆయన ఉద్దేశం హెచ్చరించడం అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఆయన ఉద్దేశాన్ని ఊహిస్తే, అంత మంచి అభిప్రాయం కలగదు. కృష్ణయ్య కాస్త ఓరిమి తెచ్చుకుని మాట్లాడారు.

కృ: పోనీలే, నా కూతుళ్ళు అలాగ అడిగేవాళ్ళు కాదు.
రా: బాగుంది, నీ మీద ప్రేమతో ఇప్పుడేమనట్లేదు. వాళ్ళకూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చేయాలి కదా. మరి కట్నాలు కానుకల దగ్గర నువ్వు సాయం చెయ్యకపోతే ఊరుకుంటారా?
కృ: నేను చేసేది చేస్తూనే ఉన్నానయ్యా. ఎప్పుడూ నా కూతుళ్ళకు నేను లోటు చెయ్యలేదు.
రా: మరి అలాంటప్పుడు ఆస్తి కూడా చెరిసమానంగా పంచాలి కదా?

కృష్ణయ్య మహాకోపీష్టి. కాకపోతే అనారోగ్యంతో ఉన్న పెద్దమనిషిని పలకరిద్దామని వచ్చి తిరిగి జవాబు చెప్పడం దేనికని ఊరుకున్నారు. కిట్టు అది గమనించాడు. తను మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని అందుకున్నాడు.

కి: తాతగారు, మీరు అన్నది సబబేనండి. కూతుళ్ళకు కూడా సమానమైన వాటా ఇవ్వాలి.

తాత్కాలికంగా రావుగారి కళ్ళు వెలిగిపోయాయి. ఆయన సాయంత్రం సఫలమైంది అని భావమో ఏమో. కృష్ణయ్యకి కొంచెం బెంగ పట్టుకుంది.

కి: కానీ, దాదాపు ముప్పై ఏళ్ళనుండి మా అమ్మ కానీ, పిన్నులు కానీ, వాళ్ళ సంతతి కానీ మా తాతగారి పక్కన లేము. మేము వేఱే ఊరిలో ఉన్నాము. ఆయనకు జ్వరం వస్తే ఒక మాత్రా ఇవ్వలేదు, రొంత చారు కాచలేదు. మా మటుకు మేము ఎండాకాలం సెలవులలో రావడం, సరదాగా గడిపి వెళ్ళిపోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆయన ఇంట్లో ఒక బీరువా సర్దలేదు, ఒక చింతా పంచుకోలేదు, ఆయన వ్యాపారానికి ఏమీ సాయమూ చెయ్యలేదు. మరి మా మేనమావ, బావలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. మా తాతగారు ఒక కేక వేస్తే పలికే వాడికే కదా ఆస్తి చెందాల్సింది?

కృష్ణయ్య గారి కళ్ళల్లో కాస్త తెరిపి కనబడింది. రావు గారు వాదించడానికి మళ్ళీ మొదలయ్యారు. ఇంతలోనే కిట్టు...

కి: పోనీ ఆ అరయెకరం గురించే మాట్లాడుకుందాం. నేను LKG, UKG ఇక్కడే చదువుకున్నాను. అల్లుడి దగ్గర రూపాయి తీసుకోను అని మా తాతగారు నా fees ఆయనే కట్టారు. ఆ తఱువాత engineering చదివేటప్పుడు కొంచం డబ్బులు అవసరమైతే సర్దారు. మా తాతగారు ఆయన తండ్రి అరయెకరం మీదనే ఈ ఆస్తి అంతా సంపాదించారు కాబట్టి అందులో భాగం ఆయన పిల్లలకు చెందాలంటే, నేను ఆ LKG, UKG, engineering వలనే ఈ రోజు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నా ఆస్తిలో మా తాతగారికో, మా మేనమాఁవకో వాటా ఇస్తున్నానా? లేదు కదా? అరయెకరం ఆస్తి చేతిలో ఉండి, ఎకరం పాటి అప్పుండి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కష్టపడి, వ్యాపారం పెట్టుకుని, సుఖపడి నలుగిరికి అన్నం పెట్టే పరిస్థితులో ఉన్నారో చెప్పండి. దానికి ఆ అరయెకరమే కారణమనుకోవాలా? లేక ఆ వ్యక్తి వ్యాపారదక్షతే కారణం అనుకోవాలా?

కి: మఱోలా అనుకోకండి కానీ, మా తాతగారి ఆయన కూతుళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అభిమానంగా పలకరించి, నాలుగు అనుభవపూర్వకమైన మాటలు చెప్తే అదే పదివేలు.

రావు గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కృష్ణయ్య అంతటితో ఆపి, "నాన్న కిట్టు, పదరా బయల్దేరదాము. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.", అని చెప్పి చేతి కఱ్ఱ పట్టుకున్నారు. కిట్టు వెళ్ళి ఆయన చెప్పులు కాళ్ళ దగ్గర సర్దాడు. ఆయన, కిట్టు, రావు గారికి నమస్కారం చెప్పి నడవసాగారు.

కొంచెం దూరం వచ్చాక, కృష్ణయ్య కిట్టు భుజాల మీద చెయ్యివేసి కొంచెం దగ్గరకు లాగి, "ఒరేయ్ నాన్న, ఈ రోజు నాకు మహదానందం కలిగించే మాట అన్నావురా. ఆయన ఎంత పుల్లలు పెట్టాలని చూసిన, నువ్వే అడ్డుకునేసరికి ఆయనకు బుఱ్ఱ తిరిగిపోయింది. అందుకేరా అన్నది:

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో 
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
 కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
 శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

అని...తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టే పిల్లల బుద్ధులుంటాయిరా. మీ అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకడి రూపాయి కోసం ఆశించలేదు. నేను పుచ్చుకోలేదు కానీ మీ నాన్న నీ చదువుకైన డబ్బులిచ్చేస్తాననే వచ్చాడు. మరి అదే లక్షణాలు మీకూ వచ్చాయి. చెట్టుని బట్టే కాయలు ఉంటాయిరా. కిత్తనార మొక్కకి అనాసకాయలు కాస్తాయా?"
 
వృద్ధాప్యంలో అన్ని విషయాలపైనా విరక్తి కలిగి అరుదుగా సంతోషం కనబడే వాళ్ళ తాతయ్య మొహంలోని తృప్తి కిట్టు మనసులో ప్రతిబింబించింది.

Sunday, February 12, 2012

వేటూరి - అనువాదగీతాలు


నిప్పు లేనిదే పొగ పుట్టదు అంటారు. అలాగని వందమంది అన్నంతమాత్రాన కాకి కోకిలా అవ్వదు కదా? అందుచేత ప్రజలలో ఎక్కువగా వినబడే అభిప్రాయాన్ని రెండు వైపుల నుండీ జాగ్రత్తగా విశ్లేషించి కానీ ఒక అభిప్రాయానికి రాలేము. ఇంతకీ ఆ పొగ ఏమిటి అంటే "వేటూరి అనువాదగీతలు సరిగ్గా వ్రాయలేదు. వాటిల్లో చెప్పుకోదగ్గ పాట ఒకటి కూడా లేదు. దానికి కారణం ఆయనలో ఉన్న అశ్రద్ధ." ఇది ఒక వాదన. కొంతమంది ఈ వాదనని కొంచెం సాగదీసి, "వేటూరి 1990 లలో ఎప్పుడో retire అయిపోయి ఉండాల్సింది" అని ఒక గాలి-సలహా [1] ఇస్తూ ఉండేవారు. బావుంది.

ముందు ఆ సలహా గురించి కొంచెం చర్చించుకుందాం. ఆ తఱువాత అసలు విషయానికి వద్దాము.  అసలు retirement ఎందుకు తీసుకుంటారు? ఇంద్రియాలు సహకరించకపోయినా, పని చెయ్యాలనే కోఱిక తగ్గిపోయినా, పటిమ (ability) తగ్గిపోయినా విరమిస్తారు.  వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాము. వేటూరిని ఆయన ఆరోగ్యం బాగా ఇబ్బందిపెట్టింది, నిజమే. అందుకని విరమించవలసిందా? కాదు అని అంటాను. కవి వాడే ఇంద్రియం అంతరింద్రియం, శరీరం కాదు. మఱోలా చెప్పలంటే కవి యొక్క హృదయం పనిచెయ్యడం మానేయడానికి అది engine కాదు. అదే ఇంధనం. శరీరం సహకరించాలి కానీ, హృదయం ఉన్నంతకాలం పరిగెట్టడానికి సిద్ధమే.

వేటూరి 1970, 1980 ల లో వ్రాసినన్ని మంచిపాటలు 1990, 2000 లలో వ్రాయలేదు అని దాదాపు అందరూ ఒప్పుకుంటారు. దీనికి కారణాలు అనేకం చెప్పుకోవచ్చును. మంచి సందర్భాలు ఇచ్చే కే. విశ్వనాథ్, బాపు, జంధ్యాల, వంశీ వంటివారి ఉద్ధృతి తగ్గిపోవడం, చలనచిత్రగీతసంగీతంలో తెలుగుదనం తగ్గిపోవడం, సీతారామశాస్త్రి, భువనచంద్ర వంటివారు ఎదగడం ఎంతో కొంత కారణం అని నేను అనుకుంటున్నాను. లేదు కోఱిక, పటిమ తగ్గిపోవడమే కారణం అనుకుంటే, అనువాదగీతాలతో పాటు మామూలు గీతాలు కూడా పెద్ద బాగా కుదిరేవి కాదు అనడం సబబే కదా? అందుకని వేటూరి ఎప్పుడూ అద్భుతంగా వ్రాసిన విశ్వనాథ్, బాపు ల 1990-2000 ల చిత్రాలను పరిశీలిద్దాము.

వేటూరి విశ్వనాథ్ కి 1984 లో సాగరసంగమం తఱువాత 1995 లో శుభసంకల్పం కి పాటలు వ్రాశారు. అందులో "సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు", "చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి" వంటి గీతాలు చాలా చక్కగా, గొప్పగా ఉన్నాయి. ఆ తఱువాత వచ్చిన 2004 లో వచ్చిన స్వరాభిషేకంలో "వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతి ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై నిలిచే పరవశమంతా మనదే, మన ఇద్దరిదే" అంటూ శృంగారంలో కూడా అద్వైతాన్ని చూపించగలగడం ఒక ఎత్తైతే, "ఉసురుగాలులను వెదురు పాటలుగ మలచు వేణువుకు గొబ్బిళ్ళో" అంటూ కృష్ణుడి మురళికి తెలుగుదనాన్ని అద్ది కొత్త రాగాలు పలికించడం మఱొక ఎత్తు. అలాగే బాపుతో 1993 లో "త్యాగరాజ కృతిలో సీతాకృతిని" తలపింపజేసినా, 1996 లో "చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ" పెట్టినా, మొన్న 2005 లో రాధాగోపాళంలో "సూరీడు చుట్టూ భూగోళం, రాధమ్మ చుట్టూ గోపాళం" అన్నా, నా మనసు స్వఛ్ఛందంగా అద్భుతం అని ఈల వేసింది. నిన్న, మొన్న వచ్చిన మాయాబజార్, ఆనంద్, గోదావరీ లాంటి చిత్రాల గురించి కూడా చెప్పుకోవచ్చును. కానీ సారం ఏమిటయ్యా అంటే వేటూరి చివరి చిత్రం (వరుడు) దాకా ఆయనలో పటిమ, కోఱిక తగ్గలేదు. సరైన అవకాశం దొరికితే ఆయన ఎప్పుడూ మంచి సాహిత్యాన్నే అందించారు.

అందుచేత వేటూరి విరమించి ఉంటే బాగుండు అనుకోవడం సరి కాదు. ఆ మాటకు వస్తే వేటూరే కాదు, సి.నా.రే కానీ, సిరివెన్నెల కానీ, కవిత్వం నుండి విరమించాలి అని అనుకోవడం పొఱబాటు. ఒక సందర్భానికి చక్కని ఉపమానమో, శ్లేషో, ఆఖరికి పదమో పడినప్పుడు మనసులో కలిగే ఆ తృప్తి అనుభవించకుండా కవికి సలహా ఇవ్వడం, ఎడారిలో ఉండి గోదారి ఒడ్డున ఉన్నవాళ్ళకు రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్ళు త్రాగాలో చెప్పినట్టుంటుంది.

ఇక అనువాదగీతాలు విషయానికి వద్దాము. నాకు అనువాదగీతాలు వ్రాసిన అనుభవం లేదు కానీ, ఇళయరాజా పాటలు కొన్ని నేను తెనుగీకరించాను. దాదాపు రెండు మూడు గంటలు కూర్చుంటే కొన్ని ఇఱికింపులతో, కాస్త వినసొంపుగానే వచ్చాయి. కానీ, lip-synchronization (అధరసమతుల్యం?) బాగా తక్కువైంది. అందుచేత అది కొంచెం ఇబ్బందే అనుకుంటున్నాను. ఒక పక్కన lip-sync, మఱొక పక్కన అప్పటికే చిత్రీకరించబడిన దృశ్యాలు, మఱొక పక్కన మాతృకలో భావాలు -- ఇవన్నీ తూగాలంటే కొంచెం కష్టమే. 

శ్రీ శ్రీ, రాజశ్రీ అనువాదచిత్రాలకు మంచి సాహిత్యం వ్రాసారు అని అంటారు. నాకు శ్రీ శ్రీ గురించి పెద్దగా తెలియదు. నాకు రాజశ్రీ వ్రాసిన పాటలు చాలానే నచ్చాయి. అలాగని అవి కూడా ఎప్పుడూ బాగుండేవి అంటే నా మనసు అంగీకరించదు. ఉదాహరణకు "డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో", "చెయ్యాలి కుఱ్ఱకారు పూజ", "నిన్న కాదు, నేడు కాదు, ఎప్పుడూ నే రాజ", వంటి వాక్యాలు నాకు రుచించవు. ఆ వాక్యాలలో భావం తెలుస్తోంది కానీ, అర్థం ఐతే భావంతో సమాంతరంగా లేదు. కొన్ని సార్లు ఆయన బాగా వ్రాసినా మిగతావారందరూ కలిసి దాన్ని రుచించకుండా చేసారు. ఆయన వ్రాసిన ఆఖరి చిత్రం ప్రేమికుడులో "అధరం, ఉదరం నడుమన ఏదో అలజడి రేగెనులో" అనే వాక్యం ఉన్నికృష్ణన్, రహ్మాన్ కలిసి "అధరమూదరము నడుమన" అంటూంటే అప్పట్లో నా పసి మనసుకు అర్థం కాలేదు. ఏదేమైనా, రాజశ్రీ అనువాదగీతాలు బాగా వ్రాసారు అంటే నేను కచ్చితంగా ఒప్పుకుంటాను.

ఇప్పుడు వేటూరి విషయానికి వద్దాము. వేటూరి అనువాదగీతాల వ్రాసేటప్పుడు lip-sync కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని నేను విన్నాను. అందులో నిజం ఉంది. ఎంతవరకు నిజం ఉంది అంటే "చూసుకున్నవాళ్ళకు చూసుకున్నంత మహాదేవా" అని సమాధానిమిస్తాను. అదేమైనా వేటూరి వయసా నిఖార్సుగా చెప్పడానికి? వాద-ప్రతివాదాలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చును.

చిన్నప్పుడు మణిరత్నం దిల్-సే చిత్రాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు సిరివెన్నెల పేరు చూసి మా తమ్ముడు, నేను సంబరపడ్డాము. (అప్పట్లో మేము రహ్మాన్, సిరివెన్నెలలకు వీరాభిమానులం. ఇప్పుడు కూడా అభిమానులమే కానీ, ఇతర సంగీతదర్శకులు, కవులు కూడా ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నారు అన్న విషయం గుర్తించాము. అప్పట్లో వేటూరి గురించి పెద్దగా తెలియదు. మెరుపు కలలు వంటి అనువాదచిత్రాలకు పాటలు వ్రాసారని తెలిసి, అవి అర్థం కాక చిన్నచూపు చూసేవాడిని.) అప్పటికే (జీన్స్) "నాకేనక" వంటి సాహిత్యంతో విసిగిపోయిన మేము, ఇన్నాళ్ళకు రహ్మాన్ అనువాదగీతాలు అర్థమయ్యే అవకాశం వచ్చిందని ఉత్సాహంగా cassette కొనుక్కుని విన్నాము. కానీ అందులో కూడా "ఛయ్య ఛయ్య" పాట విని నిరాశ చెందాము. ఓ పట్టాన అర్థం కాలేదు. నిస్సందేహంగా  చాలా వరకు కారణం సుఖ్విందర్ సింఘ్ పలికిన తీరు, అసలు తెలుగు పదాలు ఇమడటం కష్టమైన బాణీ. అసలు lip-sync లేదు. అందుచేత అనువాదగీతాలకు అన్నీ కుదరవు అన్న విషయం అర్థమైంది. ఉదాహరణకు అదే దర్శకుడు తీసిన గురు చిత్రంలో "రూఖి రె ఓ రూఖి రె, కాటొరె కాటె కటెనా" అని వచ్చినప్పూడు తెలుగులో దాన్ని వేటూరి "రుచే లేదు ఏ రాత్రీ, కాటేసే కదా కలైనా" అని వ్రాసారు. ఇక్కడ గమనిస్తే వీలైనంతవరకూ అవే అక్షరాల వరుసని వాడుతూ వచ్చారు. నేను ఇలాంటి ఉదాహరణలు బోళ్ళు గమనించాను. అందుచేత వేటూరి lip-syncను దృష్టిలో ఉంచుకున్నారు అనడంలో సందేహమేమీ లేదు.

వేటూరి అనువాదగీతాలతో వచ్చిన మఱొక చిక్కు చెప్పే ముందు నా అనుభవాలు కొన్ని చెప్పాలి. నాలుగు స్తంభాలాట చిత్రంలో వేటూరి ఎంతో అద్భుతంగా వ్రాసిన "చినుకులా రాలి" పాటని నేను చిన్నప్పుడు విని, "చినుకులు ఆరాలి అంటున్నాడు. ఏ ఒడియాలో ఎండబెట్టుకోవాలేమో?" అనుకున్నాను.  అలాగే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో "ముల్లోకాలే కుప్పెలై" అన్న వాక్యం విన్నప్పుడు "కాల్లో ముల్లు విన్నాను కానీ ముల్లులో కాలేమిటి?" అనుకున్నాను. గోదావరి చిత్రంలో వేటూరి మూడు దశాబ్దాలు వెనక్కు తిప్పిన "రామచక్కని సీతకు" పాట విని నా మిత్రుడు "ఆ మాటకు అర్థం పర్థం లేదు. రామ, చక్కని -- ఆ రెండింటికి సంబంధం ఏమిటి?" అని అడిగాడు. విషయమేమిటి అంటే ఒక్కోసారి శ్రోత కొన్ని పదాలను పక్కపక్కన చూడటానికి అలవాటు పడక ఒప్పుకోలేకపోతాడు. అప్పుడు ఆ పదసమూహానికి అర్థం లేదనో, రచయితకు జ్ఞానం లేదనో అనేసుకుని తన అహాన్ని సంతృప్తిపెడతాడు. ఈ ప్రక్రియకు ఎక్కువగా గురయ్యేవి వేటూరి పాటలు.

Surrealism కోసం ప్రాకులాడే వేటూరికి, pseudo-realism కు అలవాటు పడిన శ్రోతకు మధ్యలో ఇది నిత్యసంఘర్షణ. ఒకరుగోదావరిలో "మనసా వాచా" పాట వింటూ "కలలు వెన్నెలై కాటేస్తున్నా" అన్న వాక్యం విని "కల కాటేయడమేమిటి?" అని అడిగారు. ఏం చెప్తాను? ఏమీ చెప్పలేక తడబడి ఊరుకున్నాను. తెలుగు దర్శకులు ఇలాంటి surrealism ని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకు సృష్టిలో ఉన్న విషయాలన్నీ తెలుసును కాబట్టి, వేఱెవరికీ తెలియవు కాబట్టి. కాకపోతే అనువాదగీతాలు వ్రాసినప్పుడు ఆ దర్శకులు, కథానాయకపాత్రధారులు వేధించరు కాబట్టి కవికి కొంచెం స్వేఛ్ఛ వస్తుంది. అది దొరికినప్పుడే వేటూరి కొంచెం వేఱుగా వ్రాసే ప్రయత్నం చేసిన సందర్భాలు కొన్ని గమనించాను.

ఉదాహరణకు విలన్ (వేటూరి చివరి అనువాద చిత్రం)లో "మనసుని ఇవ్వవే మగనాలా" అనే వ్రాసారు. చిన్నప్పుడైతే మగనాల అనే పదాన్ని మగ, నాలా అని నాస్తిసంధి విడదీసుకుని "మగవాడు ఇచ్చినంత సులువుగా మనసుని ఇవ్వుమా, అంటున్నాడు కవి. ఏడ్చినట్టుంది" అనుకునేవాణ్ణి. ఇప్పుడు బ్రౌహ్ణ్య నిఘంటువు తెరిచి "మగనాల అంటే వివాహిత" అని అర్థం తెలుసుకున్నాను. మనసు, మగనాల యతి, సందర్భం కుదిరాయి కదా అనుకుని వేటూరి అలాగ వ్రాసి ఉండచ్చును. పైగా చిత్రంలో ఈ దృశ్యంలో విక్రం పెదాలు కదపడు. అందుకని స్వేఛ్ఛగా వ్రాసుకున్నది జనాలకు అర్థం కాక వేటూరి పిచ్చి పిచ్చిగా వ్రాస్తున్నారు అనుకుని ఉంటారు.

చిన్నప్పుడు నేను చిఱాకు పడిన మెరుపు కలలు చిత్రంలో "తల్లో తామర మడిచే" తామర మడవడం ఏమిటి? తురుముకోవడం అనాలి కదా అనుకున్నాను. తమిళంలో "తంగత్తామర మగళే" అని ఉంది. ప్రతీ పదానికి మొదటి అక్షరమైనా కలిసేలాగ వ్రాసే ప్రయత్నంలో తురుముకి బదులుగా మడుచు అని వ్రాసారు. ప్రతిఫలంగా నాకు పాట పల్లవే విచిత్రంగా తోచింది. నిజానికి పాఠ్యపుస్తాలలో పూర్వకవులు యతిమైత్రి కోసం ఇదే పని చేస్తే "ఓహో, ఎంత గొప్ప vocabulary" అనుకునేవాడిని.  "అట్టిట్టాయెను మనమే" అంటే అర్థం కాలేదు. అట్టా, ఇట్టాను ని అలాగ కలిపేయవచ్చునా? అసలు "మన ఇద్దరి (మనం) గురించి మాట్లాడుతూ అయ్యెను అంటాడేమిటి? అయ్యాము అనాలి కదా? అసలీ కవికి తెలుగు వచ్చునా?" అనుకున్నాను. Ignorance is bliss అన్నారు. "ఒడిలో హృదయం కాగడం ఏమిటి?" అనే సందేహం వచ్చింది. ఆ తఱువాత సంస్కృతం పాఠ్యపుస్తకంలో "రామేణ భరతః అంకే ఆరోపితః" అని చదివి "ఒళ్ళో కూర్చోపెట్టుకోవడానికి భరతుడేమైనా చంటికూచా?" అనుకుంటుంటే మా ఉపాధ్యాయుడు "అంకే అంటే పక్కనే అని భావం" అని చెప్పారు. అది సంగతి. నాకు వేటూరి సాహిత్యాన్ని అర్థం చేసుకునే అనుభవం లేక ఆ పాటంతా పిచ్చిపిచ్చిగా అనిపించింది. ఇక కంఠం వరకూ ఆశలు, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టడం, యదను మూతపెట్టుకోవడం, పరువం వచ్చిన పోటుతుమ్మెదలు, గలబాకప్పలు, ఎడారి కోయిల పెంటిని వెతకడం, విరాళిగీతం, నఖం కొరికిన పిల్ల, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ, కౌగిలి భాష -- ఇవన్నీ నాకేమర్థమౌతాయి చెప్పండి? అదే మన తెలుగు దర్శకులు ఐతే ఈ అర్థం కాని శృంగారాన్ని తీసేసి చక్కగా అందరికీ అర్థమయ్యే బూతులు వ్రాయించేవారు. చెప్పవచ్చేదేమిటి అంటే వేటూరి అనువాదగీతాలలో కొంచెం పరుషమైన భాష, భావం వాడేవారు. అది అర్థం కాక కొంతమంది ఆ పాటలను చెత్త పాటలనుకున్న సందర్భాలు ఉన్నాయి.

వేటూరిని బాగా వెనకేసుకుని వస్తున్నావు. అసలు బాగా వ్రాసిన పాటలేంటో చెప్పు అని అడిగేవాళ్ళుంటారు. వేటూరి పాటలో ప్రతి వాక్యం అంతే అందంగా, ఒక ధార (flow) లో ఉండాలనుకుంటే వేటూరి సరదా పాటలు, అనువాదగీతాలు వినద్దు అని చెప్తాను. వేటూరి పాటలో కొన్ని వాక్యాల impact ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనువాదగీతాల్లో అవధానంలాగా lip-sync, దృశ్యాలు, బాణీ అన్నీ గుర్తుపెట్టుకుని వ్రాసినప్పుడు ఇది మరింత జరుగుతుంది.

ఉదాహరణకు సూర్య s/o కృష్ణన్ చిత్రంలో పాత్రధారులు పాడుతున్నట్టు ఉండే దృశ్యాలకు పదానికి పదం అనువదించి, చిన్న చిన్న మార్పులతో కానించేసి, background లో వచ్చే "నిదరే కల ఐనది" పాటలో చక్కని ప్రయోగాలు చేసారు. ఈ పాట తెలుగులో ఇక్కడ చూడచ్చును, తమిళంలో ఆంగ్లానువాదంతో ఇక్కడ చూడచ్చును.


నిదురే కల ఐనది, కలయే నిజమైనది
బ్రతుకే జత ఐనది, జతయే అతననన్నది
మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా...

మొదటి సారి పాట విన్నప్పుడు, నిదుర కల అవ్వడం ఏమిటి? అనుకున్నాను. మళ్ళీ ఆలోచిస్తే "కల అవ్వడం" అంటే జరగకపోవడం అని తెలిసింది. "సుఖంగా తినడం కలైపోయిందనుకో" అంటే "ఈ మధ్యన సుఖంగా తినట్లేదు" అని అర్థం. ఇక్కడ వేటూరి తెలివిగా నిదుర కల ఐంది అన్నారు. అంటే నిద్ర పట్టట్లేదు. కానీ నిద్రపోనిదే కల రాదు. అదే కవి చమత్కారం. అది అర్థం కాకపోతే మన అజ్ఞానం.

"బ్రతుకు జత అవ్వడం" ఏమిటి? అని మఱొక సందేహం. బ్రతుకు అంటే జీవితం, ప్రాణం అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చును. జీవితం అనుకుంటే, అప్పటిదాక తన మనసుకు నచ్చే విధంగా లేని తన జీవితం ఇప్పుడు తనతో పాటు (అనుకూలంగా) నడుస్తోంది అని. లేదా అతడి జతే తనకు బ్రతుకైంది అని. బ్రతుకు అంటే ప్రాణం అనుకుంటే అతడిని చూసినప్పటినుండి ప్రాణం లేచి వచ్చింది అని (అప్పటిదాక జీవం లేనట్టు ఉంది అని). ఇన్ని అర్థాలు ఉండటం ఏదో నేరం లాగా చూడకుండా అదొక అందం లాగా చూడలేని వాళ్ళు వేటూరి పాటలకు దూరంగా ఉండాలని నా సలహా. ఒలిచిన అఱటిపళ్ళు కావాలనుకుంటే వేటూరి అప్పుడప్పుడు నిరాశపరుస్తారు కానీ అలాంటప్పుడే శ్రమపడి కొబ్బరికాయ ఒలిచి, పగలగొట్టి త్రాగాలనుకునేవాళ్ళకు మరింత ఆనందం కలిగిస్తారు. 

చరణాల్లో సందర్భాన్ని మరింతగా వివరిస్తూ వ్రాసారు. ఈ చిత్రంలో నాయిక దివ్య మొదట్లో మద్యానికి బానిసైన సూర్యని చూస్తుంది. తఱువాత అతను ఆ చెడ్డ అలవాటునుండి బయటపడి ప్రయోజకుడైనప్పుడు అతడిని ఇష్టపడుతుంది. అది ఎంత చక్కగా చెప్పారో చూడాలి.

వయసంతా వసంతగాలి, మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి, చిగురులతో చిలకలతో
యమునకొకే సంగమమే కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై నిలిచినది తన కొఱకే
పడిన ముడి, పడుచు ఒడి ఎదలో చిరుమువ్వుల సవ్వడి

వసంత గాలి లాంటి ప్రయోగాలను శిష్టులు దౌష్ట్యం అనుకోవచ్చును. కాకపోతే మనసు పెట్టి చేసిన ప్రయోగమే. అతడిపైన కేవలం మనసు పడటం వలనో, లేక అతడిని తనవాడిగా భావించడం వలనో ఆమె వయసు ఉన్నట్టుండి వసంతావరణాన్ని చూపిస్తోందిట. అప్పటిదాకా ఎడారి దారి అనుకున్నది ఉన్నట్టుండి చిగురులేసిన, చిలకలు నిండిన చెట్లతో ఉందిట. యమునకు సంగమం కడలితో కాదు, కేవలం గంగతో వ్రాసిపెట్టి ఉంది. అలాగే అతడు చెడిపోయినప్పటినుండి మళ్ళీ బాగుపడేదాకా ఆమె ఓర్పుగా వేచి ఉంది. ఏర్పడిన ఈ బంధం ఆమె గుండెల్లో చిరుమువ్వల సవ్వడిలాగా తీయగా అనిపించింది.

రెండో చరణంలో వేటూరి ఆత్రేయ కండువా ధరించి ఒక వాక్యం వ్రాసారు.

అభిమానం అనేది మౌనం, పెదవులపై పలుకదులే
అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే
నిను  కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి
నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి
ఎదుట పడి కుదుటపడే మమకారపు నివాళి లే ఇది

అభిమానాన్ని మౌనం తో పోల్చడం, అను"రాగం" స్వరాలకు దొరకదు అంటూ చమత్కరించడం నాకు నచ్చాయి. మధుమురళి చిగురించడం (వేటూరి trade-mark రాధాకృష్ణుల ప్రణయాన్ని గుర్తు చెయ్యడం) అంటూ మూగబోయిన వేణువు రాగాలు తీయగా పాడుతోంది అని రెండు పదాల్లో చెప్పడం మొ. అంశాలు అన్నీ బాగున్నాయి అనిపించింది. ఆ తఱువాతి వాక్యం వచ్చేటప్పుడు దృశ్యంలో శృంగారానికి తగ్గట్టుగా ఎద రగిలి, తనువు పులకరించింది అనడం కూడా సముచితంగా ఉంది. ఇంకా ఇది చెత్తపాట అనుకుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? అలాగే సఖి చిత్రంలో "అలై పొంగెరా" అనే పాట, వేఱొక విషాద గీతం ఎంతో అందంగా వ్రాసారు. ఇవన్నీ ఈ వ్యాసం వ్రాస్తున్నప్పుడు గుర్తుకొచ్చిన పాటలు. అందుచేత వేటూరి వ్రాసిన మంచి అనువాదగీతాలు ఉన్నాయి. ఎన్ని అనే విషయం పైన వాదించుకోవచ్చును. కాకపోతే "అసలు లేవు" అనే మాట మాత్రం పొఱబాటు.

[1] గాలి-సలహా అంటే ముఖాముఖీ ఇవ్వకుండా జనాలు పక్కవాడితో చెప్తే, అది వ్యాపించి, చివరికి media వాళ్ళు దాన్ని ప్రచారం చేయడం ద్వారా అసలు వ్యక్తికి తెలియడం.

Wednesday, January 18, 2012

రాంబాబు కథలు - సుబ్బారావ్ బాబాయ్

(ఉపోద్ఘాతం: రాంబాబు, వెంకట్, చందు బెంగుళూర్లో ఒక ఇంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.)

అది అర్థరాత్రి అమావాస్య. జుట్టు విరబూసుకున్న దెయ్యాలు అన్నీ ఒక చోట చేరాయి. వాళ్ళ పెదాలు నెత్తురు పూసుకున్నట్టు ఎఱ్ఱగా ఉన్నాయి. చుట్టూ చెవులు పగిలిపోయేలాగా కేకలు వినిపిస్తున్నాయి. అంతా చీకటిగా ఉన్నా అక్కడక్కడ అదో రకమైన తెలుపులో వెలుగు, అప్పుడప్పుడు ఎఱ్ఱని కాంతి వచ్చి మాయమైపోతోంది. కొన్ని దెయ్యాలు గుమ్మిగూడి పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాయి. మఱి కొన్ని దెయ్యాలు బాగా బలిసిన మగవాళ్ళని గొంతు మీద కొఱుకుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తోంది. ఇంతలో ఒక దెయ్యం అతడికేసి వచ్చి "అగ్గిపెట్టుందా?" అని అడిగింది. ఉన్నా సరే ఇస్తే, "నా పేరు అగ్ని, జమదగ్ని" అని ముక్కుతో dialogue చెప్పి తనను తగలబెడుతుందేమోనని భయమేసింది. "లేదు" అన్నాడు. ఆ దెయ్యం తనకేసి కోపంగా చూస్తూ మీదకు రాసాగింది. తనకేం చెయ్యాలో తెలియక వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ చీకట్లో ఎన్నో గుహలు దాటుకుంటూ బయటకు వచ్చేసరికి tar road కనిపించింది. ఆశ్చర్యంతో అసలు తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని పైకి చూశాడు. "Capital Pub, M.G. Road" అని ఉంది. ఆ క్రిందనే, కన్నడంలో "క్యాపిటలో పబో, ఎమో. జీ. రోడో", అని కూడా ఉంది. "ఓహో ఇంతసేపూ నేను ఉన్నది పబ్ లోనా" అనుకుంటూండగ వెనకాలనుండి ఒకరు తన భుజం మీద చెయ్యి వేసారు. వెనక్కి తిరిగినవాడు, "కెవ్వ్.....", అని అరిచాడు.

Scene త్రుంచితే రాంబాబు, చందు పరిగెట్టుకుంటూ వెంకట్ గదిలోకి వచ్చారు. అతను మంచం మీద ఒళ్ళంతా తడిసిపోయి, తల అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు. రాంబాబు, "మూర్ఛరోగమేమో, ఇంటి తాళాలు చేతులో పెట్టు", అన్నాడు. చందుకు సమయస్ఫూర్తి ఎక్కువ, "ఇప్పుడు మనం చెయ్యాల్సింది అది కాదు", అని కాస్త వెనక్కి జరిగి front-foot వేసిన తెండుల్కర్ లాగా ముందుకు వచ్చి చాచి వెంకట్ గూబ మీద ఒక్కటిచ్చాడు. అంతే వెంకట్ లేచి కూర్చున్నాడు.

వెం: ఏమైంది?
రాం: నీకు చెప్తే case అవుతుంది. నువ్వు చెప్పు. నీకేమైంది? నీకు మూర్ఛరోగమేమైనా ఉందా?
వెం: లేదు. ఏదో పీడకల వచ్చింది.
చం: అంత భయంకరమైన పీడకల ఏమిటిరా?
వెం: నేను అర్థరాత్రి పబ్ కి వెళ్ళానట. అక్కడ lip-stick పూసుకున్న అమ్మాయిలు, కాన్పుకు దగ్గరైన అబ్బాయిలు మందు కొడుతున్నారు.
రాం: కాన్పుకు దగ్గరైన అబ్బాయిలా?
వెం: అదే నాకూ అర్థం కాలేదు.
చం: Experience ఉన్న engineerలు అనుకుంటాను. పొట్టలు వికసించి ఉంటాయి.  ఐతే ఏమైంది?
వెం: అక్కడ ఒక అమ్మాయిని చూసి దెయ్యం అనుకుని పరిగెట్టుకుంటూ వస్తూంటే అక్కడ....అక్కడ...అక్కడ...
చం: మీ manager ఎదురయ్యాడా?
రాం: ఓహో, మీ manager శకునం వస్తూంటే బయల్దేరావు. దారిలో traffic police పట్టుకుని arrest చేసాడు. అంతేనా? మీ manager పిల్లి కళ్ళు చూసినప్పటినుండే నాకు వాడి శకునం మంచిది కాదని అనుమానం.
వెం: నీ శకునాల గోల ఆపు. ఇది అంతకంటే భయంకరమైనది.
చం: ఒరేయ్ బాబు, నువ్వు ఇంత build-up ఇచ్చి business man cinema లో flash back లాగా ముక్కిపోయిన తొక్కలో కథ చెప్పవు కదా. ఐనా దెయ్యాలు disco చేసుకునే timeలో మాకీ suspense ఏమిటిరా?
వెం: సుబ్బారావ్ బాబాయ్.
రాం: ఆయనెవరు.
వెం: మా ఊళ్ళో ఇంటి పక్కనే ఉండే మా బాబాయ్ నన్ను వెతుక్కుంటూ బెంగుళూరు కూడా వచ్చాడు అని కల.
చం: నా బ్రతుకు, తుబుకు తుబుకు. ఒకడేమో వచ్చీ రాని ఇంగ్లీషుతో, చాదస్తంతో వేపుకు తింటున్నాడు. పోనీలే నువ్వు మామూలోడివే కదా అనుకుంటే TV serial లో లాగా అణాకు ఆఠాణా action చేసి అర్థరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్టు హడావుడి చేస్తున్నావు.
వెం: అంతేరా. నీకేం తెలుస్తాయి నా కష్టాలు.
చం: నువ్వు గతంలో నక్స్లైట్వా?
వెం: (అనుమానం గా చూస్తూ) కాదు.
చం: ఏమోలే జల్సా cinemaలో పవన్ కళ్యాణ్వి అనుకున్నాను. కాదు కదా. (పక్కనే ఉన్న కొవ్వొత్తిని తీసి వెంకట్ చేతిలో పెట్టి, కళ్ళు పెద్దవి చేసి అణుచుకోలేని ఆవేశంతో ) ఐతే నవరంధ్రాల్లోనూ మైనం కూఱుకుని పడుకో. నన్ను కెలకమాక. (అని గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు)
వెం: (రాంబాబు కేసి జాలిగా చూస్తూ...) నువ్వైనా నా బాధను పంచుకుంటావా?
రాం: (దుష్కుతూహలంతో తన ముఖాన్ని వెంకట్ దగ్గరకీ జరిపి) Does your small-father have cat-eyes? అన్నాడు.

అప్పటికే రాంబాబు ఇంగ్లీషుకు అలవాటు పడిన వెంకట్, small-father అంటే చిన్నాన్న అని గుర్తించి, వేగంగా వస్తున్న బంతిని square-cut కొట్టడం కోసం అన్నట్టు వెనక్కు జరిగి రాంబాబు ముఖానికి తనకు ఎడం ఏర్పరుచుకుని చాచిపెట్టి కొడితే రాంబాబు నోరెళ్ళబెట్టుకుని చూసాడు. వెంటనే చేతిలో ఉన్న కొవ్వొత్తిని రాంబాబు నోట్లో పెట్టి, "మైనం కూరేస్తా" అన్నాడు. రాంబాబు గప్-చుప్ గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రంతా వెంకట్ కి అదే పీడకల మళ్ళీ మళ్ళీ వచ్చింది.

మర్నాడు చందూ coffee తాగుతూ వెంకట్ గదిలోకి వచ్చాడు. వెంకట్ ఇంకా ముందురోజు రాత్రి పీడకలనుండి తేరుకోలేదు అని అర్థమైంది. దగ్గరకు వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసాడు.

చం: Sorry రా. నిన్న నిద్ర మధ్యలో లేపితే తిక్కలో ఉన్నాను. అసలు మీ బాబయంటే నీకు ఎందుకు అంత భయం. ఆయనకు క్షుద్రపూజలు తెలుసునా? లేక నిన్ను చిన్నప్పుడు పదే పదే కొట్టేవారా? లేక...
వెం: ఇవన్నీ చిన్న చిన్న విషయాలురా. మా బాబాయ్ వీటన్నిటికంటే బలమైన విద్య తెలుసును.
చం: (చూపుడు వేలిని, ఉంగరం వేలిని జతపరచి చేతిని తిప్పుతూ) మర్మకళా?
వెం: కాదు, వర్మ కళ.
చం: అంటే?
వెం: మాట మాటకీ చిఱాకు తెప్పించగలగడం.
రాం: (కొత్త చొక్కా వేసుకుని గదిలోకి వస్తూ) In not more than 300 words or 6 paragraphs, please explain your answer. పక్కన bracketsలో 10 marks.
చం: (రాంబాబుని చూపిస్తూ) మీ బాబాయ్ కూడా వీళ్ళాగే మాట్లాడతారా?
వెం: చాలా తేడా ఉంది. వీడు మాట్లాడితే "వీడు వెధవ" నుండి "వీణ్ణి చంపేయాలి" అనే range లో feelings ఉంటాయి. మా బాబాయ్ మాట్లాడితే, "నేను వెధవిని" నుండి "నన్ను చంపేయండి" అనే rangeలో feelings ఉంటాయి.
రాం: త్రివిక్రంలాగా మంచి quotationతో answer ప్రారంభించావు. రాజమౌళి లాగా మంచి interval bang కూడా ఇవ్వు.
చం: (కళ్ళు పెద్దవి చేసి రాంబాబు కేసి చూసి) అరవ cinema లాగా చివరికి నిన్ను చంపేస్తాడు. సరేనా?
(అని వెంకట్ కేసి చూస్తూ) అలాగేం చేస్తారురా బాబు. చెప్పు.
వెం: ఎక్కడినుండి మొదలెట్టను. ఆఁ

నాకు BITS-Pilani లో seat వచ్చినప్పుడు ఆనందంగా వెళ్ళి, "బాబాయ్, నాకు BITS లో seat వచ్చింది.", అన్నాను. కళ్ళు చిన్నవి చేసి చూసి, "ఏడాదికి ఎంతౌతుందేంటి", అన్నాడు. నేను సందేహిస్తూ చూసి, "డబ్భై వేలౌతుంది", అన్నాను. "ఓరినీ, బాగా చదువుకోవాల్సింది కదరా? మన పక్కింటి పిసినారి మాష్టారు వాళ్ళ అబ్బాయికి మన వీధి చివర engineering college లో free seat వచ్చింది. నీకేమో donation కట్టాల్సొచ్చింది. మీ నాన్నకు చెప్తూనే ఉన్నాను, పండితపుత్రా పరమశుంఠా అంటారు కానీ, పరమశుంఠ కొడుకు కూడా పరమశుంఠే అవుతాడని. విన్నాడు కాదు.", అన్నాడు. (చందు, రాంబాబు జాలిగా చూస్తున్నారు. వెంకట్ కళ్ళు చమర్చాయి.) ఒరేయ్ ఎవరైనా బాగా చదవకపోతే తిట్టచ్చు, పోనీ అపార్థం చేసుకుని నన్ను తిట్టచ్చు, ఒకే దెబ్బతో, నన్ను మా నాన్నని కూడా కలిపి తిట్టగలగడం ఒక్క మా బాబాయ్ కే సాధ్యంరా.
రాం: వెంటనే, "మఱి మీ నాన్న పండితుడా, శుంఠా" అని అడగాల్సింది కదా?
వెం: చాలా తెలివైన ప్రశ్న. మా బాబాయ్ నన్ను, మా నన్ననే తిడితే నేను మా తాతని, తననీ కూడా తిట్టి overall గా మా వంశమే పరమశుంఠల వంశమనాలా?

చం: (వెంకటి భుజాన్ని తడుతూ) పోన్లేరా. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఆ తఱువాత నీ గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవడం విని తెలుసుకుని ఉంటారు.
వెం: పిచ్చివాడా. పిల్లకాకికేం తెలుసు హుండేలు దెబ్బ. ఆ తఱువాత వేసవి సెలవలకి మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళబ్బాయి friends వచ్చి ఆడుకుంటున్న సమయంలో నేను బాబాయ్ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో లేడు అని తెలిసి వెనక్కి తిరుగుతుంటే వచ్చాడు. friends అందరూ తింటున్న తాయిలాన్ని కాకొచ్చి ఎత్తుకుపోయినట్టు తెల్లబోయారు. మా బాబాయ్ మొహం ఎఱ్ఱగా ఐంది. పక్కనే నన్ను గమనించాడు.
రాం: వాణ్ణి చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నాడా?
వెం: ప్చ్...(రాంబాబు తల నిమురుతూ) "సరిగ్గా చదువుకోపోతే వాడిలాగా ఎడారుల్లో తిరుగుతూ చదువుకోవాలి. వెధవ ఒంటె మొహాలు, మీరూను.", అన్నాడు.
చం: అమ్మనీ -- ఏం దెబ్బ కొట్టార్రా.

రాం: నీకు gold-medal వచ్చినప్పుడు చూపించాల్సింది కదరా?
వెం: హ హ హ -- You naughty boy. అన్నీ చిలిపౌడియాలే. అదే చేద్దామని నా gold medal నాన్నగారికి కూడా చూపించకుండా ముందు బాబాయ్ దగ్గరకు తీసుకెళ్ళాను. చూపించగానే దాన్ని తీసి అరుగుకేసి గీసి "నిజమైన బంగారమే" అని మురిసిపోయి "నాతో రా", అని cycle మీద ఎక్కించుకుని బయల్దేరాడు.
చం: మీ నాన్నగారి దగ్గరకా?
వెం: అనుకున్నావా? నేనూ అదే అనుకున్నాను. తిన్నగా బంగారం కొట్టుకు తీసుకెళ్ళి, దాన్ని తూకం వేయించి ఎంత పలుకుతుందో అడిగాడు. అక్కడున్న శెట్టిగారు అది చూసి, "యాభై వేలు పలుకుతుంది. ఐనా దీన్ని అమ్ముకోవడం దేనికండి. గొప్పగా దాచుకోవాలి కానీ", అంటే మా బాబాయ్ "అవునులేవయ్యా. ధర తగ్గించడానికి మీ శెట్ట్లు ఇలాగే కొనడం ఇష్టం లేనట్టు మాట్లాడతారు. మావాణ్ణి చదివించడానికి మా అన్నయ్య పొద్దనకా రాత్రనకా కష్టపడి బోళ్ళు డబ్బులు పంపిస్తే మావాడికి ఆ college వాళ్ళు చివరికి ఈ బంగారం ఇచ్చారు. దీని విలువ కనీసం నాలుగు లక్షలుంటుంది. మఱొక మాట లేదు.", అన్నాడు. నాకు ఏఁవీ తోచలేదు. శెట్టికేసి జాలిగా చూసాను. మా బాబాయ్ నన్ను జబ్బ పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, "ఏరా, నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే ఆ college వాళ్ళు నిన్ను మోసం చేసి ఇదిగో పావలా అంత బంగారం ముక్క చేతిలో పెట్టారు. నేను ఏదో ఒక లాగ దీనికి మంచి ధర తెద్దామని శెట్టితో బేరమాడుతుంటే ఆ బిత్తర చూపులేమిటిరా తిరణళ్ళలో తప్పిపోయిన తింగరోడి లాగా?", అన్నాడు. నాకు బుఱ్ఱ పనిచేయలేదు.
రాం: (చందు త్రాగిన coffee glass తీసుకుని, అందులో ఉన్న చెంచా తో గంట కొట్టి) Last 5 minutes. త్వరగా రాయలమ్మా, ఆ కబుర్లేటి? ఏం మీ ఇద్దరినీ debar చెయ్యాలా?
చం: (ఆవదం త్రాగిన ముఖం పెట్టి రాంబాబు కేసి తిరిగి) చొక్కా బాగుందిరా, కొత్తదా?
రాం: హీ...అవును
చం: అంతా బానే ఉంది కానీ కుడిభుజం మీద బల్లి బొమ్మ ఒక్కటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది.
రాం: నేను కొన్నప్పుడు బల్లి బొమ్మ లేదే?
చం: ఐతే నిజం బల్లి అయ్యుంటుంది.
(అది వింటూనే రాంబాబు కంగారు పడుతూ పరిగెట్టుకుని bathroomలోకి వెళ్ళిపోయాడు. చందు ముఖం లో చిఱాకు కాస్తా శాంతంగా మారి వెంటనే జాలైంది. వెంకట్ కేసి చూస్తూ).
చం: ఆ తఱువాత?
వెం: ఏం చేస్తాను. ఏడ్చుకుంటూ ఆ medal పట్టుకుని పరుగెట్టి ఇంటికి పోయాను.
చం: ఆ medal...?
వెం: మా నాన్నతో చెప్పి SBI లో locker తీసుకుని అందులో ఉంచాను. ఎప్పుడు మా బాబయ్ నన్ను చూసిన అది అమ్మెయ్యమనే గొడవ.
చం: భలేవారురా, మీ బాబాయ్. ఇంటి రక్షకుడిని ఈశ్వరుడు కూడా ఆపలేడు అన్నమాట.

వెం: ఏం చెప్పమంటావు? ఎవరైనా Google తో interviews ఐతే ఏమంటారురా?
చం: All the best చెప్తారు.
వెం: మా బాబాయన్న మాటలేంటో తెలుసునా? "నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ ఉద్యోగం నీకు రాకూడదు." (చందు shock అయి చూస్తున్నాడు. వెంకట్ నిట్టూర్చి) ఏం చెప్పమంటార్రా? "Google అంటే ఏమిటి" అన్నాడు. "Search engine", అన్నాను. "Computer లో కనబడతుందా?" అని అడిగాడు. laptopలో google.com తెరిచి చూపించాను. పైకి కిందకు చూసి, "ఒక బొమ్మ, ఒక డబ్బా ఉన్నాయి. వీడికే తిండానికేమీ ఉండి ఉండదు. నీకేం పెడతాడురా? నీ వాలకం చూస్తే వాడు ఉద్యోగమివ్వగానీ సకిలించి మరీ తీసేసుకునేట్టు ఉన్నావు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఈ ఉద్యోగం నీకు రాకూడదు."  (చందు నిశ్చేష్టుడైపోయాడు.)

ఇంతలో వెంకట్ cell మ్రోగింది. Screen పైన "Danger Babai calling..." అని చూస్తూనే తన గుండె వేగం రెండింతలైంది, చమటలు పట్టడం మొదలైంది. వెంకట్ పక్కనుండి చూస్తూ, "ఎత్తరా. నేను ఉన్నానుగా? భయం దేనికి? పోనీ speaker on చెయ్యి", అన్నాడు. వెంకట్ తన ధైర్యాన్నంతా కూడబెట్టుకుని on చేసాడు.

phoneలో సుబ్బారావ్: ఒరేయ్ వెంకట్ నేను. STD call కనుక ఉభయకుశలోపరి. మొత్తానికి మీ నాన్న చాదస్తం నుండి నీ gold-medal ని విడిపించి శెట్టిగారికి నలభై వేలకి అమ్మేసాను. నీకు అప్పుడు శెట్టి చెప్పిన ధర నచ్చక పిల్లాడి చేతిలోంచి కోతి కొబ్బరి చిప్ప లాక్కున్నట్టు అది లాక్కుని ఇంటికిపోకుండా ఉంటే హీనపక్షం లక్ష వచ్చేది. పోనీలే, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం." (ఇది వింటూనే వెంకట్ phone పరుపు మీద పడేసి గోడకేసి తలకొట్టుకుంటున్నాడు)

"ఇంతకీ మఱొక విషయం. నువ్వు పని చేస్తున్న companyకి పెద్ద పేరు లేదు. ప్రపంచంలో నాలుగే మంచి కంపెనీలు ఉన్నాయట Infosys, TCS, CTS, Wipro. నువ్వు వాటిలో ఏదో ఒక దానికి మారకపోతే పిసినారి మాష్టారు గారి అమ్మాయిని నీకు ఇవ్వమంటున్నారు. అసలే ఆయన పిసినారి. లక్ష కట్నం ఇవ్వడానికి కూడా ఏడ్చేలాగ ఉన్నాడు. నీదా ఒంటె చదువు, ఒంటి డబ్బా company. ఇలాగైతే అది కూడా రావడం కష్టం. ఏదో కొంత కష్టపడి నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని interviewలో చీదేసి వాటిల్లో ఒక దాంట్లో చేరిపో. మిగతావన్నీ నేను ఇక్కడ చూసుకుంటాను."

(ఇంతలో రాంబాబు bathroomలోంచి బయటకు వచ్చి, పంచాంగం తీసుకుని కంగారుగా వెంకట్ గదిలోకి వచ్చి)

రాం: చందు, ఇంట్లో ఆవదం ఉందా? Urgent రా. నేను ఆవదంతో దీపం పెట్టాలి -- లేకపోతే ప్రమాదమని పంచాంగంలో ఉంది. 

phoneలో సు: హలో, ఒరేయ్ సన్నాసి? లేచావా? నిద్రమత్తులో తూగుతున్నావా?

(చందు, వెంకట్ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. చందు phone తీసి షోయబ్ అఖ్తర్ బంతిని విసిరినట్టు గంటకు నూటయాభై మైళ్ళ వేగంతో రాంబాబు పైకి విసిరాడు.)

...

PS: మన ఇళ్ళల్లో పెద్దలు software గురించి ఏవో నాలుగు విషయాలు తెలుసుకుని అవి మనతో చెప్పి తమకు కూడా ఈ విషయాలపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి అని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైన చెప్పబడిన companyల పేర్లు మన పెద్దలందరికీ బాగా తెలుసు కాబట్టి వాటిని ప్రస్తావించడం జరిగింది తప్ప, వేఱే దురభిమానం ఏమీ లేదు. నా సోదరులు ఇద్దరు Infosys, TCS లో పనిచేస్తున్నారు. పాఠకమిత్రులకెవరికైనా అది తప్పుగా గోచరిస్తే క్షమించి, తెలియజేస్తే తొలగించగలను.

Monday, January 2, 2012

అందమైన అమ్మాయి (పద్యాలు)

రాత్రి రెండు దాటాక నేను మాట్లాడేదానికే అర్థం ఉండదు (అప్పుడప్పుడు పగలు కూడా). అలాంటిది జాలపౌరులు అందరూ చూడగలిగే బ్లాగు వ్రాస్తున్నాను. ఏమైనా అర్థరహితంగా (అదే, పిచ్చి పిచ్చిగా) అనిపిస్తే క్షమించాలి.

అసలు విషయానికి వస్తే: మొన్న ఒక పూటకూళ్ళయింటికి (restaurant) వెళ్ళాను. అక్కడ తిండిని అందించే ఒక అమ్మాయి వర్ణించలేనంత అందంగా క/అనిపించింది. సరే, ఈ మధ్య మనం కాస్త సృజనాత్మకంగా వ్రాసినది ఏమీ లేదు కదా! "బొత్తిగా తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటదీ?" అనుకుని, డిక్కీలో తొంగున్న నా కవిహృదయాన్ని కాస్త బయటకు తీసి, దుమ్ము దులిపి, బ్రౌహ్ణ్య నిఘంటువుని ఊతగా ఇచ్చి పద్యాలు వ్రాయమన్నాను.  ఇవిగో, ఈ క్రిందివి రాలాయి. చదువర్లకు నా తవికలు నచ్చినా నచ్చకపోయినా, నా ప్రయోగాలకు వారి మనసులు నొచ్చుకోకుండా ఉంటే అదే పదివేలు.

గమనికలు:-

పై వాక్యంలో నచ్చు, నొచ్చు -- ఇది అనుకుని వేసిన ప్రాస కాదు. ఎంత డిక్కీలో ఉన్నా నా కవిహృదయానికి ఇంత డొక్కు భావనలు లేవు అని నా నమ్మకం. డిక్కీ, డొక్కు...హ్మ్...రాత్రి రెండు దాటింది! కంగారు పడకండి, ఈ పద్యాలు రోజూ పడుకునే ముందు ఒక్కొక్కటి చప్పున వ్రాసుకుంటూ వచ్చాను. రెండు దాటాక వ్రాసిన పద్యం సివరాకరి కంద పద్యం ఒకటే.

ఔత్సాహిక కవిని కాబట్టి నా పద్యాలలో ఉత్సాహం కనిపించినట్టు భావం కనిపించకపోవచ్చును. పెద్దలు పద్యాలను సవరించడానికి, ఔత్సాహికపాఠకులకు నా బాధేంటో చెప్పడానికి పద్యాల క్రింద (నేను అనుకున్న) భావాన్ని వ్రాస్తున్నాను.

శా:-
దేవీ యెవ్వరివీవు? యీ పురమునన్ దేవాంగనల్ జొచ్చిరే?
ఏ వైజ్ఞానికుడైన శిల్పములలోనెక్కించెనా ప్రాణముల్?
భావావేశము గల్గి బ్రహ్మ రుచితో భావించి నిర్మించెనా?
నీ విభ్రాజితమూర్తి కీర్తి నుడువన్ నేనెంత వాడన్, కొమా!

భా:- ఓ దేవి, నువ్వు ఎవరివి? ఈ మధ్యన మా ఊళ్ళోకి దేవతలు ప్రవేశించారా? ఎవరైనా శాస్త్రజ్ఞుడు శిల్పాలకు ప్రాణం పోయడం నేర్చుకున్నాడా? భావావేశం కలిగి బ్రహ్మ ప్రత్యేకమైన శ్రద్ధతో నిన్ను మలిచాడా? నీ వెలుగులీనే రూపాన్ని కీర్తించడానికి నేను సరిపోను.

చం:-
సుమములఁ బోలు నీ యధరశోభకు లొంగని వారునుందురే?
తమిగొను వారికిన్ మిగులు దాహము తీరగ దారి యున్నదే?
ప్రమదము కల్గి భంగపడు ప్రాణులలో మగవారి తోటివై
భ్రమపడి యెన్ని తుమ్మెదలు భ్రామరమొందగ వాలె నీ యెడన్

భా:- పువ్వులలా మెరిసే నీ పెదవుల శొభకు లొంగనివాళ్ళుంటారా? నీ మోహంలో పడినవారికి కలిగే పిపాస తీరే మార్గం ఉన్నదా? నీ మాయలో పడి (అనుకున్నది దక్కక) చిన్నబోయిన ప్రాణులలో మగవాళ్ళతో పాటు (నీ పెదవులను పూవులనుకుని మోసపోయిన) తేనెటీగలెన్నున్నాయి?

మ:-
ఎవరా ఈశ్వరుడంచు ప్రేలు మొరకుల్ హెచ్చైన నీ పొంకమున్
అవలోకించిన తత్క్షణంబు మదిలోనజ్ఞానమున్ వీడరే?
స్తవముంజేయరె హేతువాదిగణముల్ సర్వేశుఁ గుర్తించి, సం
భవమే కూర్చగ నిన్ను ఈ ప్రకృతికిన్ పైవాడు లేకుండగన్?

భా:- "ఈశ్వరుడు ఎవరు?" అని పొగరుగా అడిగే మూర్ఖులు ఇంత గొప్ప అందాన్ని చూసి వెంటనే తమకున్న అజ్ఞానాన్ని వదిలేసి, దేవుడున్నాడు అని గుర్తించి ఆయనను స్తుతించడం మొదలెడతారు. పైవాడు లేకపోతే, ఇంత అందమైన నిన్ను తయారుచేయడం (ఆలోచనలు లేని) ఈ ప్రకృతికి వీలౌతుందా?

గ:- చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో గుఱ్ఱం జాషువా వ్రాసిన "గిజిగాడు" పద్యాలు చదివిన స్ఫూర్తి ఇంకా ఉందేమో! అందులో ఒక పద్యంలోని "నాస్తికులు నిన్ను చూసి మనసు మార్చుకుంటారు" అనే భావనని పైన జాతీయం చేసాను.

నిజానికి ఆమెను చూసిన వెంటనే, నా పక్కనే ఉన్న నా నాస్తిక మిత్రుడి వైపు తిరిగి, "ఎవఱ్ఱా దేవుడు లేదన్నది? ఆ అమ్మాయిని చూడు. ఇంత అందగత్తె కేవలం by chance తయారైందా? ఎవరో చెక్కినట్టు లేదు?" అన్నాను :)

ఉ:-
మోహిని చెన్నుకున్ మురిసి మూర్ఛిలినారని దానవాళికిన్
సాహసమున్న రీతి తగు సంయమమేదని యన్నవాడనే!
వ్యాహతునైతి నీ యెదుట, వైఖరి మార్చిన నాదు గుండెపై
ద్రోహము జేసెనంచు మతి దోషము లెంచక నూరకుండె, హా!

భా:- మోహిని అందానికి మురిసిపోయి, మూర్ఛపోయిన రాక్షసులకు సాహసం ఉన్నంతగా సంయమం (మనసును అదుపులో ఉంచుకోవడం) లేదు అన్నవాణ్ణి, నీ అందం ముందు ఓడిపోయి నిలిచాను. నా బుద్ధి మనసు తనకు ద్రోహం చేసిందని చిఱాకు పడకుండా ఉండిపోయింది (మనసు, బుద్ధి ఆమె అందానికి దాసోహం అన్నాయి).

త:-
ఒడలు స్పందన లేకనున్నది ఉన్నపాటుగ మైకమా?
ఘడియ మారక గిపోయెను కాలమాగెన? నా భ్రమా?
ఉడుకు నెత్తురు మంచు ముద్దయెనూడి మేఘము రాలెనా?
నొడవనీయక డ్డుతున్నది నువ్వు వేసిన మంత్రమా?

భా:- ఒళ్ళు తెలియట్లేదు, ఉన్నట్టుండి నాకు మైకం కలిగిందా? గడియలు మారుతున్నట్టు అనిపించట్లేదు - కాలమాగిపోయిందా? లేక ఉత్త భ్రమా? ఎప్పుడూ దూకుడు గా ఉండే నా నెత్తురు చల్లబడిపోయింది. ఆకశంలోంచి మబ్బేమైనా ఊడు నా మీద పడిందా? నేను మాట్లాడ లేకపోతున్నాను -- నువ్వు ఏమైనా మంత్రం వేసావా?

సీ:-
దీపపు కాంతికి తెలినవ్వు మెరిసెనో? 
                          నవ్వుకు వెలిగెనో దివ్వెలెల్ల?
చెక్కిలి వెలుగుకు దిక్కులు రంజిలె
                          ఎవ్విధి పొందితివింత సొగసు?
కనురెప్పలున్నట్టి గండెలు లేవని
                          వింటిని యిన్నేళ్ళు వేయినోళ్ళ!
నీ నీలికన్నుల మీనాలఁ గాచేటి
                          కందెర్లఁ గమనించి కంటి నిజము

భా:- ఈ దీపాల వెలుగుకు నీ నవ్వు మెరుస్తోందో, నీ నవ్వుకే ఈ దీపాలు మెరుస్తున్నాయో తెలియట్లేదు. నీ బుగ్గల ఎఱుపుకు దిక్కులన్నీ వెలుగుతున్నాయి. ఇంత అందం నీకు ఎక్కడిది?

కనురెప్పలున్న చేపలు లేవు అని ఇన్నాళ్ళు అందరూ అంటుండగా విన్నాను. కానీ నీ నల్లని కళ్ళనే చేపలను కాస్తున్న, కను-తెరలు (కనురెప్పలు) గమనించాక నిజం తెలిసింది.

గ:- గండెలు, కందెర్లు -- జై బ్రౌన్ దొర!

ఆ:-
నీవు రెప్ప మోడ్చు నింపాది తాళంబు
నేర్చి నాదు గుండె మార్చె లయను
నడుచు వేళ నీదు నడుమును చూడగ
నటుయిటు కదలాడి యలిసె కనులు

భా:- నీవు నెమ్మదిగా రెప్పలు వేసే "నింపాది తాళం" (ఆది తాళం మీద pun :) ) నచ్చి నా గుండె దానితో పాటుగా కొట్టుకుంటోంది. నువ్వు నడుస్తుంటే కదులుతున్న నడుమును చూడటానికి అటూ ఇటూ ఊగి కళ్ళు అలిసిపోయాయి.

కం:-
కలరే నీయందమునకు
తులతూగే పురుషులిలను? దొరకరె లలనా!
అల వైకుంఠపురములో
కొలువైన హరి సరిజోడు కోమలి నీకున్!

భా:- నీ అందానికి సరితూగే మగవాడు ఈ ప్రపంచంలో దొరకరే అమ్మాయి! వైకుంఠంలో కొలువైన శ్రీహరే నీకు సరిజోడీ.

గ:- పోతన భాగవతం స్ఫూర్తి సుస్పష్టంగా కనబడుతోంది. ప్రత్యేకించి చెప్పక్కరలేదు అనుకుంటాను :)

అమ్మాయి అందాన్ని మెచ్చుకుంటున్నాను కానీ  పిచ్చి పిచ్చి మాటలు, థాటులు (thoughts) లేవనే విషయాన్ని తేటపరచడానికే ముగింపు పద్యంలో "శ్రీమద్రమారమణ గోవిందో హరి!".

Wednesday, December 7, 2011

శ్రీరామరాజ్యం పాటలు - 1

(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)

శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు ఆయన. సంస్కృతంలో disco పాట (మహర్షి చిత్రంలో "ఊర్వశి - అస్మద్విద్వత్విద్యుత్ దీపిక త్వం ఏవ"), తెలుగు తిట్లదండకం (ష్...గప్ చుప్ లో "ఒరేయ్ త్రాపి") లాంటి ప్రయోగాలెన్నో చేసారు. గతంలో కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి  పాట గురించి కూడా చెప్పాను.

శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.

1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!

ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
  • "రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే" - మకారంతో వేసిన అనుప్రాస.
  • "రామశాసనం తిరుగులేనిదని జలధి బోధ చేసె" - రాముడు సముద్రుడిపై బాణాన్ని వేసిన ఉదంతం గుర్తు చెయ్యడం.
  • "రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం" - భక్తియోగాన్ని రెండు ముక్కల్లో వివరించడం.
  • "శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే" - భక్తులకు మనసులో కలిగే భావాన్ని కూడా ఒక్క ముక్కలో చెప్పడం.
పాట మొదటి చరణం ముందు వచ్చే వాయిద్యాల సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఇళయరాజకు తప్పితే ఇంత ఆర్ద్రత కలిగించే సంగీతం ఎవరికి సాధ్యపడుతుంది అనిపించేలాగ ఉంది.

2. శ్రీరామ లేరా ఓ రామ!
    ఈ పాటలో ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేసారు జొన్నవిత్తుల. వాల్మీకి రామాయణం చదివితే రాముడి గురించి ఏమనిపిస్తుందో అలాగే ఉంది ఈ వర్ణన. ఒక్కో వాక్యమూ కడిగిన ముత్యం.
    • "దరిసనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరథి"  - ఎవరైనా (ప్రజలు/భక్తులు) పిలువగానే రాముడు ఆలస్యం లేకుండా వెళ్తాడు.
    • "తొలుతనె ఎదురేగి కుశలమునడిగి హితమ్ను గావించే ప్రియవాది" - తాను రాజుననే గర్వం లేకుండా ఎవరైనా వస్తే తానే ముందుగా వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చి, "ప్రియం కలిగే విధంగా" మాట్లాడేవాడు రాముడు.
    • "ధీరమతియై, న్యాయపతియై ఏలు రఘుపతియే, ప్రేమస్వరమై స్నేహకరమై మేలునొసగునులే" - శ్రీరాముడు స్థిరమతి (స్థితప్రజ్ఞుడై) న్యాయం నిలబెడతాడు, అలాగే అనురాగం నిండిన గొంతుతో మంచి చేస్తాడు. ఇక్కడ స్నేహకరం అనడంలో నాకు శ్లేష గోచరిస్తోంది. స్నేహం కలిగించే విధంగా ఉండేది స్నేహకరం. రాముడు స్నేహకరమయ్యాడు అంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా నడుచుకున్నాడు అని. అలాగే, కరం అంటే చెయ్యి అనే అర్థం ఉంది. కనుక రాముడు స్నేహంతో నిండిన చెయ్యిగా మారి మేలు చేస్తాడు అనే ధ్వని కూడా ఉంది. అద్భుతం!
    • "అందరునొకటేలే, రాముడికి ఆదరమొకటేలే, సకలగుణధాముని రీతిని రాముని రీతిని ఏమని తెలుపుదులే" - రాముడికి తన-పర భేదం లేదు (స్థిరమతి), అందరినీ ఒకేలాగ ఆదరించేవాడు. ఆయన విధానాలని వర్ణించడం కష్టం!
    • "తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం, శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం" - ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే శ్రీరామచంద్రుడి శృంగారరూపం ఆమె హృదయంలో ఉదయిస్తోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం రేయిలో శ్రీరామ "చంద్రుడు" ఉదయిస్తున్నాడు అని. చక్కని భావుకత.
    • "మౌనం కూడా మధురం" - శ్రీరామచంద్రుడి మాట లాగే మౌనం కూడా తీయగా ఉంటుందట. మొదటి చరణంలో చెప్పిన "ప్రియవాది" కి జోడుగా ఇది రెండొ చరణంలో చెప్పారు.
    • "పిలిచే సమ్మోహన సుస్వరమా!" - రామ అనే పదానికి అర్థం "ఆకర్షించగలిగేది" అని. రాముడి మాట, రూపం సమ్మోహనాస్త్రం లాగా ఉన్నాయని కవి భావం.
    •  "సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా?" - సీతాదేవికి భర్తపైన ఉన్న ఆరాధన పరమాత్ముడికే (హరి) హరిచందనంతో (పసుపురంగు గంధం) వేసిన బంధంలాగ ఉందిట. "హరి" అంటూ యమకం వేసారు కవీశ్వరులు.
    • "శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధము" - రాముడు వేదాలకు సారం ఐతే అమ్మవారు దానికి అనువాదం అట. ఎంత చక్కని భావుకత! కాళిదాసు వాగర్ధావివను స్ఫురింపజేసింది ఈ వాక్యం.

    3. ఎవడున్నాడీ లోకంలో

    ఇది హరికథ లాగా కూర్చిన పాట. నిజమే ఇది హరి కథే కదా, అందుచేత ఒక్కటైనా అలాంటి పాట ఉండాలి. బాలు నారదుడికి, వాల్మీకికీ గొంతు మార్చి చక్కగా పాడారు. వాల్మీకికి పాడేటప్పుడు వినయంతో, నారదుడికి పాడినప్పుడు ఆనందంతో పాడారు.

    వాల్మీకికి ఒక ఇతిహాసం వ్రాయాలనిపించినప్పుడు నారదుడిని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమంటూ కొన్ని లక్షణాలను సూచించాడు (బాలకాండ 2-4 శ్లోకాలు). వాటిని జొన్నవిత్తుల చక్కగా అనువదించారు.

    • "ఎల్లరికీ చలచల్లనివాడు" - అందరితోనూ ప్రియంగా ఉండేవాడు అంటూ రాముడి గురించి ప్రతీ పాటలోనూ చెప్పడం చాలా బాగుంది.
    • "ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు" - ఓంకారం బ్రహ్మస్వరూపం. "రామ" శబ్దం కూడా బ్రహ్మస్వరూపం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా చదివాను. అందుకని వారిద్దరికీ పోలికను చెప్పడం చాలా బాగా కుదిరింది. ఇది అందరు కవులకీ సాధ్యపడే ఊహాశక్తి కాదు. 
    • "విలువలు కలిగిన విలుకాడు" అంటూ మఱో యమకం వేసారు. విల్లుంటే బలవంతుడు అవుతాడు, కానీ విలువలుంటేనే గొప్పవాడౌతాడు. రాముడికీ రెండూ ఉన్నాయి. అది చక్కని ప్రాసతో చెప్పారు.
    • "పలు సుగుణాలకు చెలికాడు" - సుగుణాలను స్త్రీతో పోల్చడంతో స్త్రీలను గౌరవించడమే కాక సుగుణాలు మిత్రులు, అవగుణాలు శత్రువులని గుర్తుచేయడం బాగుంది.
    4. గాలి నింగి నీరు

    "ఏడుపు పాట" అని తీసేద్దామనుకున్నా గుండెను పదే పదే తట్టేలాగ ఈ పాటను ఇళయరాజ, జొన్నవిత్తుల, బాలు, నటుడు శ్రీకాంత్ చేసారు. ఎంత ఆర్ద్రత ఉన్న పాట!

    "గాలి నింగి నీరు భూమి నిప్పు" అంటూ పంచభూతాలను (భూమికి బదులుగా నేల అని ఉంటే అన్నీ తెలుగుపదాలయ్యుండేవి), "రారే మునులు, ఋషులు? ఏమైరి వేదాంతులు?" అంటూ తత్త్వజ్ఞులను (వీరందరూ రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అడ్డుకొందామని ప్రయతించినవారే. ఒకాయనైతే ఏకంగా రాముడికి నాస్తికత్వాన్ని బోధించబోయి నాలుక కరుచుకున్నాడు), "కొండ, కోన, అడవి, సెలయేరు, సరయూనదీ" (ఇవన్నీ సీతారాముల అనురాగాన్ని గమనించినవి) అంటూ ప్రకృతిని, ప్రశ్నించడం ఎంతో లోతుగా ఉంది.

    "విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే" అనడంలో విధికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదట తలరాత/బ్రహ్మదేవుడు (destiny) అనే అర్థంలో వాడితే రెండవసారి మార్గం అనే అర్థంలో వాడారు. అందుకని ఇది మఱొక యమకం. అలాగే "ఏడేడు లోకాలకీ సోకేను ఈ శొకం"  అనడంలో కూడా శబ్దాలు యమకానికి దగ్గరగా ఉన్నాయి (సోకు, శొకం).

    "అక్కడితో ఐపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా" -- అబ్బబ్బా, గుండె పిండేసారు కదండి. ప్రతిసారి సీతమ్మవారిని అదే అపవాదు అనే రక్కసి ఏడిపిస్తోంటే జగద్రక్షకుడైన శ్రీరాముడే ఏమీ చెయ్యలేక విలపిస్తున్నాడు. "ఈ లెక్కన అసలు దైవం అంటూ ఉందా?" అనే సందేహం ఎవరికి మాత్రం కలిగి ఉండదు? కొన్నిసార్లు ఊహ కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే బరువు ఎక్కువ ఉంటుంది!

    "సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా" -- మఱొక అద్భుతమైన ప్రయోగం. సూర్యుని (సహజంగా వెలుగున్నవాడు) వంశాన్ని తన సుగుణంతో వెలిగించిన (భర్తతో అడవులకు వెళ్ళింది, అగ్నిప్రవేశం చేసింది) ఈ కోడలిని ఆ సూర్యవంశ వెలుగే (ప్రతిష్టే) వెలివేస్తే ఈ లోకంలో ఇక వెలుగు ఎక్కడిది?

    5. సీతా సీమంతం

    పండుగని సన్నాయితోనే పలికించారు ఇళయరాజ. కోకిల, పల్లవి, పున్నమి, ఆమని అంటూ జొన్నవిత్తుల ప్రకృతివర్ణనతో వ్రాసారు.

    ఈ పాటలో "కాశ్మీరం నుండి కుంకుమ", "కర్ణాటక నుండి కస్తూరి" అన్నారు కవి. రామాయణం జరిగినప్పటికి ఇంకా కర్ణాటక రాజ్యం ఏర్పడలేదు. ఈ పొఱబాటుని "ఇంత చక్కని గీతసమూహానికి ఇది దిష్టిచుక్క" అనుకుని మనం వదిలేయాలి.

    "ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే, అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమే" అనడంలో ఆశ్రమంలోని ప్రేమ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు. పాట మొత్తానికి నాకు నచ్చిన వాక్యం "ఎక్కడున్నా నువ్ గానీ, చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడూ" అంటూ రాముడిలో సగానికి మఱో సగాన్ని గురించి చెప్పడం ఎంతో ముద్దుగా ఉంది.

    6. రామ రామ రామ అనే రాజమందిరం

    చిన్నప్పుడు రాముడు చేసిన అల్లరి గురించి చెప్తూ సాగే ఈ పాటలో, "మర మర మర" అనడం వాల్మీకి గురించిన కథని గుర్తు చేసింది.

    నేను ఒక సారి సోదరుడు రాఘవని "రామచక్కని" అంటే ఏమిటి అని అడిగితే "రాఁవుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, అందమైనవాటికి ముందర రాముణ్ణి చేర్చుకుని చెప్పుకోవడం మనకు అలవాటు", అన్నాడు. నాకు ఆ వివరణ ఎంతగానో నచ్చింది. అలాగే ఈ "రామసుందరం" అనే పదం ముద్దుగా ఉంది. తదనుగుణంగానే "ముద్దుగారి పోతడంట" అనడంలో ఎంతో నిండుదనం ఉంది.

    ఈ పాటలో జొన్నవిత్తుల అనుకుని చేసారో లేక నా మనసుకే అనిపిస్తోందో మొదటి చరణంలో ప్రతీ వాక్యం రామాయణకథల్లో ఒక ఘట్టాన్ని/పాత్రని గుర్తుచేస్తోంది.
    • "బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట" - హనుమంతుడు, వానరసేన
    • "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" - కాకిపైన రాముడు బ్రహ్మాస్త్రం సంధించిన కథ
    • "సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట" - శబరి ఎంగిలి తినడం (అన్నట్టు, "రామచిలక" అనడం కూడా మన తెలుగువాళ్ళే అందమైన చిలకకు ఇచ్చిన బిరుదు)
    • "ఖజ్జురాలు ద్రాక్షలూ ఉడతలకీ పెడతడంట" - ఉడతలు రాముడికి సాయపడడం
    • "దాక్కుంటడంట చెట్టుచాటుకెళ్ళి" - వాలి వధ
    • "రాళ్ళేస్తాడంట చెరువులోకి మళ్ళీ" - సేతు బంధనం
    రెండవ చరణంలో అద్దాన్ని సంచిలో దాచిన కథ కూడా సరదాగా ఉంది. పల్లవిలో "తేప తేప తీయన" అన్నారు. "తేప" అనేది ఒక తీయని వంటకం అని చదివిన గుర్తు, దాని గురించి ఒక సరదా కథ కూడా విన్నాను. మఱి ఇది అదో కాదో తెలియదు. చదువర్లు చెప్పాలి.


    ఇంకా ఉంది...

    Wednesday, November 30, 2011

    దృష్టాంతాలంకారము


    వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> దృష్టాంతాలంకారము


    లక్షణం: చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంతస్తదలంకృతః
    వివరణ: వాక్యములు ఒకదానికొకటి బింబప్రతిబింబాలుగా (reflections) గా ఉంటే దాన్ని దృష్టాంతాలంకారం అందురు.

    ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
    త్వమేవ కీర్తిమాన్ రాజన్! విధురేవ కాంతిమాన్

    భా:- ఓ రాజా, నువ్వే కీర్తిమంతుడవు; చంద్రుడే కాంతిమంతుడు.
    వి:- గతంలో ఉపమాలంకరాములో ఉపమేయము, ఉపమానము, సమానధర్మము చూసాము. దృష్టాంతాలంకారంలో సమానధర్మం ఉండదు! కాకపోతే ధర్మాలకు మధ్యన పోలిక ఉంటుంది. ఉదాహరణ కీర్తికి, కాంతికి కొంత పోలిక ఉంది -- రెండూ అన్నివైపులా ప్రాకుతాయి. అందుచేత వీటికి పొసిగింది. సూటిగా రాజుని చంద్రుడు అని కానీ, కీర్తి కాంతి వంటిది అని కానీ అనకపోయినా -- రెండు వాక్యాల నిర్మాణం దాదాపు ఒకేలాగ ఉండటం వలన ఇది అర్థమౌతోంది.


    దృష్టాంతాలంకారం కేవలం కవిత్వప్రయోజనాలకే కాక, తర్కానికి కూడా మన దేశంలో ఎక్కువగా వాడారు. శంకరాచార్యులు వివేక చూడామణిలో దృష్టాంత పద్ధతి ద్వారా చాలా విషయాలను బోధపరిచారు.

    63-64:- శత్రువులను జయించకుండా "నేను రాజుని" అన్నంత మాత్రాన రాజువు కావు. మాయని నశింపజేసి ఆత్మ తత్త్వం తెలుసుకోకుండా "బ్రహ్మం" అన్నంత మాత్రాన ముక్తి రాదు.

    65:- దాచిపెట్టి ఉన్న నిధి "నువ్వు రా" అన్నంత మాత్రాన వచ్చిపడదు. మాయ అడ్డుగా నిలబడిన ఆత్మతత్త్వం  వాదనల వలన తెలియదు.

    348:- చూస్తున్నది పాము కాదు, తాడు అని తెలిస్తే భయం పోతుంది. ఎదుటనున్నది సత్యం కాదు మాయ అని తెలిస్తే బంధం పోతుంది, మోక్షం కలుగుతుంది.

    243-244:- ఈశ్వరుడి ఉపాధి మహత్, జీవుడి ఉపాధి పంచకోశం -- ఉపాధి తీసేస్తే ఉన్నది ఒక్కటే -- అది బ్రహ్మం. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, డాలు పట్టుకున్నవాడు భటుడు. సింహాసనం, డాలు తీసేస్తే అక్కడ ఉన్నది మనిషి మాత్రమే.


    శంకరాచార్యుల కవిత్వం పక్కనే వేఱే ఎవరిదీ వ్రాయకూడదనో ఏమో, నాకు ఈ అలంకారం ఉన్న చలనచిత్రగీతాలు గుర్తుకు రావట్లేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.

    పొడిగింపు:
    మందాకిని గారి వ్యాఖ్య చూసాక నాకు మఱొక మంచి పాట గుర్తొచ్చింది.
    ఉదా:- (చిత్రం: ప్రణం ఖరీదు, రచన: కీ. శే. జాలాది రాజ రావ్)
    యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.
    ఉదా:- (చిత్రం: మాతృదేవోభవ, రచన: కీ. శే. వేటూరి సుందరరామమూర్తి) 
    కన్నీటికి కలువలు పూచేనా? కాలానికి ఋతువులు మారేనా?
    మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా? మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా?

    Monday, November 7, 2011

    అదేం పలకరింపు స్వామీ?

    ఎవరినైనా పలకరించేటప్పుడు "హలో" అనడం సాధారణం. "నమస్కారం, బాగున్నారా?" అనడం గౌరవసూచకం. కొంతమంది పలకరింపు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు హాస్యానికి, కొన్ని సార్లు వ్యంగ్యానికి మఱికొన్ని సార్లు ఎలాగ మాట్లాడాలో తెలియక ఇబ్బంది వలన, ఇంకొన్ని సార్లు... ఆ వ్యక్తి తీరే అంత. ఎందుకో ఈ రోజు అవన్నీ గుర్తొచ్చాయి.

    మా ఊరు విశాఖ జిల్లా తాండవ జంక్షన్ (తునికి, నర్సీపట్నానికి మధ్యలో) దగ్గర "ఎఱ్ఱవరం" లోపల సీతారామపురం. అక్కడ దాదాపు రెండు వందల ఎకరాల మామిడి, జీడి తోటల మధ్యలో ఐదారు కుటుంబాలుండేవి. ఉప్పు కావాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. మేము తునిలో ఉండి చదువుకునే రోజుల్లో ఒక్కోసారి రెండు మూడు రోజులు సెలవలు వస్తే మా ఊరు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎఱ్ఱవరంలో దిగి కబుర్లు చెప్పుకుంటూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవరైనా తెలిసినవాళ్ళు ఎడ్లబండి మీదనో, సైకిల్ మీదనో వెళ్తూ చూసి ఎక్కించుకుని తీసుకుపోయేవారు.

    ఒక సారి ఏడో తఱగతిలోననుకుంటా, నేను ఒక్కడినే వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండలో తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవరైనా తెలిసినవాళ్ళు తగలకపోతారా అని మధ్యమధ్యలో వెనక్కి చూస్తూ నడుస్తూ ఉంటే, నాకు తెలిసిన ఒక తాతగారు Luna మీద వస్తూ కనబడ్డారు. మా ఊళ్ళో ఉండే ఐదు కుటుంబాలలో ఆయన ఒక కుటుంబానికి పెద్ద. సరే ఆయన పెద్ద మనిషి, నేను చిన్న పిల్లాణ్ణి, ఇది మిట్టమధ్యాహ్నం -- ఈ సమీకరణంలో ఎలాగ చూసుకున్నా ఆయన నాకు "lift" ఇచ్చే తీరాలి అనుకుని సూర్యుడి కంటే వెలిగిపోతున్న మొహంతో "బాగున్నారా?" అని అడిగాను. ఆయన గంటకు ఇరువై కిలోమీటర్ల వేగంతో వెళ్తూ, నన్ను గమనించి, దాటి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కన్నడ కంఠీరవ రాజ్కుమార్ లాగా ఒక ముసిముసి నవ్వు నవ్వి "వస్తున్నావా? రా రా..." అంటూ వెళ్ళిపోయారు.

    నాకు మహాకోపం వచ్చింది. పొఱబాట్న ఆయన ఊళ్ళో కనబడితే "నువ్వేం పెద్దమనిషివయ్యా? చిన్నపిల్లాడు ఎండలో నడుస్తున్నాడు? కాస్త ఎక్కించుకుని తీసుకెళ్ళలేవు? పోనీ నీ షష్టిపూర్తైన బండికి అంత ఓపిక లేకపోతే ఒక్క నిముషం ఆగి, ఆ విషయం చెప్పి పోకూడదు? పైగా ఆ ప్రశ్నేమిటి, "వస్తున్నావా? రా రా!", అని. నేను ఇక్కడిదాక వచ్చి ఊరు చివర అత్తిపత్తి మొక్కలతో (touch-me-not) ఆడుకుని, బోరింగు పంపులో కిలుం పట్టిన నీళ్ళు తాగేసి, bus stand లో పడుకుని తిరిగి రేతిరికి తుని వెళ్ళిపోతాననుకున్నావా? (బ్రహ్మానందం styleలో) అసలు మాట్లాడితే meaning ఉండాలి. ఈ ఊళ్ళో నువ్వు తద్దినం పెట్టినప్పుడల్లా వచ్చే ఏకైక భోక్త మా నాన్నగారే. ఆ విషయం మరిచిపోకు.", అందాం అనుకున్నాను. మహానుభావుడు ఆ రెండుమూడు రోజులూ మళ్ళీ కనబడలేదు.

    ఇదేదో పల్లెటూరు, అందుకే ఇలాగ జరిగింది అనుకోవడానికి లేదు. ఇది పెద్ద నగరాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మొన్నీ మధ్యన నా స్నేహితుణ్ణి కలవడానికి California వెళ్ళాను. వాడు నన్ను విమానాశ్రయం నుండి తన బండిలో ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ దిగుతూనే ఒక అమ్మాయి ఎదురొచ్చింది. ఆమె వీడిని చూసి సిగ్గుతో నవ్వుతూ తల దించుకుని తన car వైపు వెళ్ళింది. వీడు ఆమెను చూసి ఒక విరక్తిభరితమైన నవ్వు నవ్వాడు. సరేలే "ఆళ్ళిద్దరికీ ఏఁవండర్ష్టాండింగుందో మనకేటి తెలుసు", అనుకుని మా వాడితోటి నడిచాను.

    మరునాడు apartment basement లో lift లో మాతో పాటు ఒకాయన ఎక్కాడు. అప్పుడు జరిగిన సంభాషణ నాకు విచిత్రంగా తోచింది. అందరం భారతీయులమేనని గమనించి ఆయన నా మిత్రుడికి shake-hand ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. మా వాడు "హలో, నా పేరు ప్రసాద్" అని నా మిత్రుడు చెప్తే, అదేదో ఇళయరాజ అని చెప్పినట్టు అతడు కళ్ళు పెద్దవి చేసి, "ఓ, ప్రసాదా? అంటే మీరూ, మా ఆవిడా - ఆఁ, ఆఁ, ఆఁ", అని కనుబొమలెగరేసి సిగ్గుతో కూడిన ఆశ్చర్యం వలన కలిగిన నవ్వును ప్రసరింపజేశాడు. వెంటనే నా మిత్రుడు విజయోత్సాహంతో కూడిన జాలి వలన కలిగిన నవ్వు ఒకటి విసిరాడు. ఇద్దరూ నవ్వుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వచ్చేసాము.

    అనకూడదు కానీ, ఎంతటి పత్నీవ్రతుడి గురించి అయినా సందేహం కలిగేలాగ ఉన్నాయి వాళ్ళ సంభాషణ, మొహాలలో హావభావాలు. నా కుతూహలం కట్టలు తెంచుకుని గొంతులోంచి "ఒరేయ్, ఏం జరుగుతోందిరా? నాకు తెలియాలి...నాకు తెలియాలి...నాకు తెలియాలి! " అని అడిగేలాగ చేసింది. వాడు నవ్వుకుని అసలు కథ చెప్పాడు, "మా ఆవిడ parking లో car నడుపుతుంటే, వాళ్ళావిడ చూసుకోకుండా car reverse చేసి accident చేసింది. మొదట్లో వాళ్ళావిడ మా ఆవిడదే తప్పని వాదిస్తే నేను వెళ్ళి తగులుకున్నాను. ఆ సమయంలో వీడు ఊళ్ళో లేడనుకుంటాను. చివరికి ఆవిడ ఒప్పుకుని insurance వాళ్ళ చేత డబ్బులు ఇప్పించింది",  అన్నాడు. "ఓహో, వాడి మొహంలో సిగ్గు, ఆశ్చర్యం ఏమిటో, నీ మొహంలో విజయోత్సాహం, జాలి ఏమిటో ఇప్పుడు అర్థమయ్యాయి. నాయనా, ఇలాంటి దిక్కుమాలిన expressions తో పలకరించుకోవడం చూడటం ఇదే మొదటి సారి.", అనుకున్నాను.

    పెద్దయ్యాక ఈ పలకరింపులు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఎదురౌతాయి. కానీ బాల్యంలో (సరదాగా) ఇబ్బంది కలిగించడానికి ఇలాంటి పలకరింపులు ఎదురౌతూ ఉంటాయి. చిన్నప్పుడు మేము ఏటా వేసవి సెలవులకు విజయవాడ వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య మమ్మల్ని ఉడికించడానికి ఎప్పుడూ వెటకారంగానే ఆహ్వానించేవారు. "ఒసేయ్ అమ్మాయ్, మాఁవిడి పళ్ళన్నీ దాచెయ్ వే. తూర్పోళ్ళొచ్చారు. దొరికితే పరకలు పరకలు లాగించేస్తారు.", అని గట్టిగా అరవడం. "బాబు, ఎందుకొచ్చారు నాయనా? మా ఇంట్లో ఏమీ లేవు. మీ సీతారాంపురం వెళ్ళి జీడిపిక్కలేరుకోండి", అనడం. మేము అది విని పౌరుషపడటం -- ఇది రివాజు. చాలా గంభీరంగా, "అమ్మ, వెనక్కెళ్ళిపోదాం పద!" అన్నా అందరూ నవ్వడం చూసి చాలా కోపం కలిగేది.

    అదేమిటో ఎప్పుడు మా అన్నయ్య విజయవాడ వెళ్ళినా అదో రకం పలకరింపే ఎదురయ్యేది. ఒక సారి ఆత్రంగా మధ్యాహ్నం పన్నెండికి వెళ్ళి తలుపు కొడితే, మా అమ్మమ్మ వచ్చి తలుపు తెరిచి, తీక్ష్ణంగా చూసి, "ఆయనిప్పుడే భోజనానికి కూర్చున్నారండి. కాస్త చల్లబడ్డాక రండి.", అని చెప్పి తలుపు వేసేసింది. మా అమ్మమ్మ కళ్ళజోడు పెట్టుకోవడం మరిచిపోయిందన్నమాట. దానికి తోడు అంతకు ముందు వేసవి మా అన్నయ్య విజయవాడ వెళ్ళలేదు. ఎదిగే వయసు కద! ఉన్నట్టుండి ఒక అడుగు ఎదిగేసరికి మా అమ్మమ్మకు కనీసం "వీడు మనవాడేమో",   అని అనుమానం కూడా కలగలేదు.

    ఒక సారి మా అన్నయ్య వెళ్తూనే మా అమ్మమ్మ కనబడింది. "అమ్మమ్మ, నాకూ బియ్యం పెట్టేయ్" అన్నాడు. (మా వైపు "నాకూ అన్నం వండు", అనడానికి అలాగ అంటారు. సరిగ్గా అన్నం వండే సమయానికి ఇంటికి వచ్చాడు కాబట్టి వంట చేసేవాళ్ళకు మళ్ళీ రెండు ఎసర్లు పెట్టడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రాగానే తన రాకను declare చేసాడు.). పక్కనే అలమర తలుపు మూసి వెలుగులోకి వచ్చిన మా తాతయ్య, "ఏఁవిటి నాయనా? మిట్టమధ్యనం వచ్చి బియ్యం పెట్టమంటున్నావు? సన్న్యాసమేమైనా పుచ్చుకున్నావా?", అన్నారు. వెంటనే మా అన్నయ్య ఒక వంకర నవ్వు నవ్వితే, "వేద్ధవ, బావున్నావా? తాతయ్యేడి అని అడగడం మానేసి అదేం పలకరింపు" అన్నారు. ఇంక అప్పటినుండి మా అన్నయ్య రావడం చూసినప్పుడల్లా మా తాతయ్య, "ఒసేవ్, చిన్నాడొచ్చాడు. బియ్యం పెట్టేయ్", అని చెప్తుంటారు.

    మఱొక సారి మా తాతయ్యకి ఒంట్లో బాగోక వైద్యశాలలో చేర్పిస్తే మా అన్నయ్య కంగారుగా వెళ్ళాడు. ఆయాస పడుతూ తలుపు తెరిచి చూస్తే మా తాతయ్య నిబ్బరంగా పరుపు మీద కూర్చుని, వెటకారంగా, "ఏరా? అంతలా పరిగెట్టుకుని వచ్చావు, ఏఁవౌతుందనుకునావేంటి?", అన్నారు. అప్పటి దాక కంగారు పడ్డ మా అన్నయ్యకు అప్పుడు మనసు కుదుటపడింది.

    వ్యంగ్యమైన పలకరింపులకి వయసుతో పనేమీ లేదు, వెటకారం చెయ్యడానికి అవతల వ్యక్తి బలహీనత, అలవాట్లనే వాడుకోవక్కరలేదు అని నా బాల్యస్నేహితుడొకడు నిరూపించాడు. వాడు ఆదివారం వాళ్ళ నాన్నకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అది నా ఎనిమిదో తఱగతి అనుకుంటాను. ఒక సారి pen తెచ్చుకోవడం మరిచిపోయాను. వాడు ఎప్పుడూ మూడు నాలుగు రంగుల pen లు compass box లో పెట్టుకుని తిరిగేవాడు. వాడిని అడుగుదామని విరామంలో "ఒరేయ్", అన్నాను. వాడు వెనక్కి తిరిగి చాలా నిర్లిప్తమైన చూపుతో, "ఆఁ, చెప్పమ్మా" అన్నాడు. ఇదేం పలకరింపురా నాయనా అనుకుని, "నాకు ఒక pen కావాలి - సాయంత్రం ఇచ్చేస్తాను", అన్నాను. వాడు "ఏ color అమ్మ, blue ఆ, black ఆ, red ఆ?", అని అడిగాడు. నేను "blue ఐతే better" అన్నాను. దానికి వాడు, "blue stockలో లేదమ్మ. రేపొచ్చి కనబడు. black ఐతే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఐనా black తో ఉన్న look blue కి రాదమ్మ", అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక అలాగ ఉండిపోయాను. వాడు వెంటనే నవ్వి, "black ఏ ఉందిరా. ఇదిగో", అని ఇచ్చాడు.

    సరే అందరి గురించి చెప్పి నా గురించి చెప్పుకోకపోతే ఎలాగ? నా వంతు విచిత్రమైన పలకరింపులు నేనూ చేసాను. చిన్నప్పుడు మా ఉపాధ్యాయుడికి నేనంటే చాలా అభిమానం ఉండేది. ఆయన అంటే నాకూ చాలా గౌరవం ఉండేది. నాలుగో తఱగతిలోనో ఎప్పుడో, ఒక రోజు ఆయన "ఎవరైనా పెద్దలు కనబడితే Good Morning/Afternoon/Evening." చెప్పాలి అన్నారు. చిన్న hint ఇస్తే చెలరేగిపోతాను అని మా పాఠశాలలో నా గురించి మంచి talk ఉండేది. అది నిరూపించుకోవాలన్నట్టు, ఆ రోజు సాయంత్రం పాఠశాల నుండి విడిచిపెట్టాక నడుస్తూంటే రెండు వీధుల అవతల ఆయన్ని చూసి "సార్ సార్" అని అరుచుకుంటూ పరిగెట్టాను. ఆయన ఏదో ఉపద్రవం వచ్చినందుకుని కంగారుగా వెనక్కి తిరిగి "What happened Sandeep?" అంటూ ఆత్రంగా అడిగారు. నేను ఆయసంతో ఊపిరి ఎగబీలుస్తూ, "Good Morning ఛి ఛి... Good Evening sir" అన్నాను. ఆయనకు నవ్వాలో ఏడవాలో తెలియక "OK" అని చెప్పి వెళ్ళిపోయారు. "ఆయన చెప్పింది మనం practical గా చేసి చూపించినా ఈయనకెందుకు ముచ్చటెయ్యలేదు చెప్మా", అనుకుంటూ నేనూ ఇంటికి వెళ్ళిపోయాను.

    నా జీవితంలోనే మరిచిపోలేని ఘోరమైన పలకరింపు చేసింది నా మిత్రుడు కిట్టు. వాడికి intermediate పరీక్షలలో చక్కని marks వచ్చినందుకు విజయవాడ నుండి వాళ్ళ దూరబ్బంధువు ఒకాయన ప్రత్యేకించి phone చేసి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వాడి తల మీద తన చెయ్యి పెట్టి దువ్వుతూ ఉంది. వాడికా చదువు తప్పితే ఏఁవీ తెలిసేది కాదు. ఆయన గురించి అసలేమీ తెలియదు. వాళ్ళ అమ్మ చద్దన్నం పెఱుగులో కలిపి పెట్టినప్పుడల్లా వాడు చిఱాకు పడుతుంటే, "నాన్న, రావు తాతయ్య గారు లేరు? ఆయనకు బోళ్ళు డబ్బులున్నా ఇప్పటికీ రోజూ చద్దన్నమే తింటారు. ఆయన్ని చూడు ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యం గా ఉంటారో. చద్దన్నం బలం.", అనేది. కర్మ కాలి వాడికప్పుడు ఆ విషయమే గుర్తొచ్చి, "రావు తాతగారు! మీ గురించి మా అమ్మ చెప్తూ ఉంటుందండి. మీరు ఇప్పటికీ చద్దన్నం తింటూనే ఉంటారుట కదా.", అన్నాడు. వాళ్ళమ్మ ఒక్క సారిగా దువ్వడం మానేసి నెత్తి మీద మొట్టింది. ఎందుకు మొట్టిందో అప్పట్లో వాడికి ఎంతకీ అర్థం కాలేదు.

    ఇలాంటి పలకరింపులు తలుచుకున్నప్పుడల్లా నవ్వాగదు.