Showing posts with label పాటలు. Show all posts
Showing posts with label పాటలు. Show all posts

Friday, September 11, 2026

అశ్వమేధం : ఓ ప్రేమా

 బోళ్ళంత పనిలో ఉన్నాను - ఇంటి పని, బయట పని, ఆఫీసు పని. ఐనా సరే నా మనసుని కదిలించి బ్లాగు రాయించగల మహానుభావుడు వేటూరి.

అశ్వమేధం (1992) సినిమాలో "ఓ ప్రేమా" అని ఒక పాట ఉంది. బహుశా మూడు దశాబ్ధాల తరువాత ఈ మధ్యనే విన్నాను. అందులో నగ్మా (పాత్ర), మీనా (పాత్ర) ఇద్దరూ బాలకృష్ణ (పాత్ర) ని ప్రేమిస్తారు. కాకపోతే బాలకృష్ణ నగ్మా ని ఇష్టపడుతున్నాడు అని తెలిసి మీన ఆగిపోతుంది. ఒకే పాటలో ఈ ఇద్దరు అమ్మాయిల మనఃస్థితిని వినిపించి చూపించాలని దర్శకుడి ప్రయత్నం. నగ్మా వచ్చే భాగాలన్నీ పాలరాతి మేడలలో హుషారుగా ఉంటాయి. మీన వచ్చే భాగాలన్నీ ఎడారిలో నిరాశతో ఉంటాయి (గీతాంజలి సినిమాలో "ఓ ప్రియా ప్రియా" లాగా). 

వేటూరి చాలా బాగా రాశారు. హుషారు భాగాల్లో చిలిపి ప్రయోగాలు సరదాగా బాగుంటాయి కానీ నిరాశ భాగాల్లో ఉండే సాహిత్యం లోతుతో పోలిస్తే తేలిపోతాయి.

హుషారు భాగాల్లో నాకు నచ్చిన కొన్ని మాటలు:

పల్లవిలో...

(ఆమె) అదరాలి నాలో అందం అధరాలు అందిస్తే
(అతడు) ముదరాలి చుమ్మా చుమ్మం మురిపాలు పిండేస్తే

చరణాల్లో...

(ఆ) చలువరాతి హంసమేడలో ఎండే చల్లన (ఎండైనా చల్లగా ఉంటుంది)
(అ) వలువ చాటు అందగత్తెలో వయసే వెచ్చనా
(ఆ) వసంతపు తేనెతోనే తలంటులే పోయనా
(అ) వరూధినీ సోయగాల స్వరాలు నే మీటనా
(ఆ) కౌగిలింతల్లోనే కానీ కల్యాణం
(అ) సందెమైకంలోనే పండే తాంబూలం

అదరాలి, అధరాలు - యమకం వంటి పదక్రీడ, వసంతపు తేనెతో తలంటులు, సందెమైకంలో తాంబూలం పండటం (ఇందులో వెతికే వారికి వెతికినంత శృంగారం దొరుకుతుంది 😀). వేటూరి చిలిపిదనం విషయంలో ఎప్పుడూ form లోనే ఉంటారు.

నిరాశభాగాలు  నాకు నచ్చిన మాటలు:

పల్లవిలో:
(ఆ): విధి నిన్ను ఓడిస్తుంటే వ్యధలాగ నేనున్నా
(అ) కథ మారి కాటేస్తుంటే కొడిగట్టిపోతున్నా

చరణాల్లో...
(ఆ) నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం, నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
(అ): నువ్వు కవ్విస్తుంటే నవ్విందీ రాగం, రెండు గుండెల్లోనా తప్పింది తాళం
(ఆ) ఎడబాటే ఎద పాటై చలినీడగా సాగేవేళ
(ఆ) మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవి
(అ) ఇసుక మీద కాలిగురుతులై నిలిచేనా అవి
(ఆ) ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా
(అ) ఎదారిన దారిలోన షికారులే నావిగా

"ఎడారిలో కోయిలమ్మ కచేరి" అనడంలో surrealism, ఎద ఆరిన దారిలో షికారు అనడంలో యమకం వంటి పదక్రీడ, ఒకరిపట్ల ఒకరికి ఉన్న అభిమానంలో అంతరం చెప్పడానికి "గుండెల్లో తప్పిన తాళం" అనడం ఒక వైపు ఐతే, నిరాశని, తాత్కాలికతని వ్యక్తపరిచే ప్రయోగాలు: ఇసుక మీద కాలి గురుతులు, అతడు కల్లోకొస్తే తెల్లారడం, చూడాలనుకుంటే దీపం కొండెక్కడం, అతడు కొడిగట్టిపోవడం. అన్నీ అద్భుతమైన ప్రయోగాలు.

ఇళయరాజ, బాలు గురించి చెప్పక్కరలేదు. ఆశా భోఁస్లే కూడా కష్టపడి చక్కగా తెలుగు ఉచ్చరించింది. మంచి పాట. తెర మీద కనబడకుండానే వేటూరి, ఇళయరాజ, బాలు, ఆశస భోఁస్లే పాత్రల భావాలను అద్భుతంగా తెలియపరిచారు.


Sunday, April 17, 2022

ఎన్నియల్లో మల్లియల్లో

ఒక్కోసారి వేటూరి పాట వింటే ఆశ్చర్యం వేస్తుంది. పదాల అల్లికలో పచ్చి శృంగారాన్ని దాచేసిన వైనం చూస్తే పట్టపగలు బ్యాంకుదోపిడీ చేసి రోడ్డు మీద నిర్భయంగా నడిచినవాడిలా అనిపిస్తారు. మొన్ననే ఎందుకో శివ సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది. సరే విందాం కదా అని కూర్చుని, వినగానే ముక్కున వేలేసుకున్నాను.

సున్నితంగా "ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు, ఒళ్ళంటుకుంటే చాలు నాట్యాలు" అని పాట మొదలైంది. అతడి స్పర్శకి ఆ అందమైన అమ్మాయి మెలికెలు తిరుగుతోంది అనడం బాగుంది కదా అనుకున్నాను. ఆత్రంగా మొదటి చరణం విన్నాను. "సిగ్గేయగా బుగ్గమొగ్గ మందారధూళే దులిపే" - అమ్మాయికి సిగ్గేస్తే మొగ్గలాంటి లేత బుగ్గ ఎఱ్ఱబడింది అనడానికి మందారధూళి దులిపింది అనడం బాగుంది. ధూళి అంటే పరాగం (పుప్పొడి) అని కూడా అర్థం ఉంది. పువ్వులలో పుప్పొడి, తేనె రెండూ ఆస్వాదించడానికి తేనెటీగలు వస్తాయి. ఒకే వాక్యంలో మహానుభావుడు శ్లేష కూడా విసిరి, రెండు శృంగారవంతమైన అర్థాలను వినిపించారు. ఇక ఆపైన వాక్యాలలో దాపరికం ఏమీ లేదు. "(ఆ) ఒత్తిళ్ళతో ఒలిచేస్తుంటే వడ్డించనా వయసంతా", "(అ) వెలుగులో కలబడే కళలు కన్నా, తనువులో తపనలే కదిపిన కథకళిలోన" అని రాస్తే ఏమని వివరించాలి, ఆ భావనాపటిమకు చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప? వారి గదిలో ఒక చిన్న దీపం ఉంది అని గుర్తించి ముందుకు నడవడమే. అది చిన్న దీపం అని ఎందుకు అనుకోవాలంటే దానికి వెంటనే రెండో చరణంలో జవాబు ఇచ్చారు.

"(అ) ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలణిగే, (ఆ) ఈ దివ్వెల క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే" - చీకటే ఆమె చీర అట, దివ్వెల క్రీనీడలు ఆమె మీద నెమ్మదిగా పడుతున్నాయట. "(అ) నీ మబ్బులే గుడికడుతుంటే జాబిల్లిలా పడుకోనా" - అతడు మబ్బులా ఆమెను కౌగిలించుకుంటే చంద్రుడిలా ఆమె నిద్రపోతుందిట. ఈ భోగంలో అనురాగం కొంత పలికించారు - సంతోషం! ఇదంతా రాత్రి సంగతి ఐతే పొద్దున్న పరిస్థితి వర్ణిస్తూ పాట ముగించారు "(ఆ) ఉదయమే అరుణమై ఉరుముతున్నా, చెదరని నిదురలో కుదిరిన పడకలలోనా" - అలసిపోయి పడుకున్న వీరికి పొద్దున్న సూర్యకాంతి తగిలితే ఉరుములలా తోచిందట, ఐనా నిదుర చెదరకుండా పడుకున్నారట. అసంపూర్ణంగా వదిలిన చరణం చివరి వాక్యానికి పల్లవిని కలుపుకుందాం అంటే ఉదయపుటరుణానికి ఎన్నియలకి వైరమాయె! చంద్రుడిలో మచ్చలను వెతకడం కంటే వెన్నెలను ఆస్వాదించడమే నయం కాబట్టి పాటను మళ్ళీ మళ్ళీ తలుచుకుని సంబరపడుతున్నాను.

పాట చూసిన తరువాత అనిపించిన విషయాలు. పాటలో చీర ఉంది కానీ అమల ఎక్కడా చీర కట్టుకోలేదు. ఆమె నృత్యం చక్కగా చేసింది - నాగార్జున ఆమె ముందు తేలిపోయాడు. బాలు, చిత్రం గానం గురించి చెప్పుకోవక్కరలేదు. ఇళయరాజ బాణీలకు కొంచెం భిన్నంగా ఉండే బాణీ ఇది - చాలా నచ్చింది. ముఖ్యంగా చరణాలలో ఆఖరి నాలుగు లైన్లకు బాణీ అద్భుతం. పాటకు సెట్స్, ఆర్ట్ అంత కుదరలేదు అనిపించింది. కాకపోతే ఇదే సినిమాలో "సరసాలు చాలు శ్రీవారు" పాటకు కూడా సుమారుగా ఇదే సందర్భం, సెట్ కాబట్టి ఇలాగ చేసారేమో అనిపించింది.

Wednesday, August 12, 2015

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చుకున్నాడు. అంతటి లయ ఉన్న పాట ఇది.

అన్నమయ్య నిజంగా నందకం అవతారమా, లక్కమాంబకు నిజంగా ఆలస్యంగా పిల్లలు పుట్టారా వంటి ప్రశ్నలు యోగులకు, చరిత్రకారులకు పనికొచ్చే ప్రశ్నలు. మనబోటి సామన్యప్రేక్షకులకు తగిన ప్రశ్న "ఈ సందర్భానికి, కథకు కవి న్యాయం చేశాడా?" అని. అది పరిశీలిద్దాము.

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పల్లవిలోనే వేటూరి అన్నమయ్యని బాగా ఉన్నయించాడు (elevate). అన్నమయ్య కాలానికి ముందే నన్నయ, తిక్కన వంటివారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యాన్ని వ్రాసారు. ఐతే అవి సంస్కృతపదభూయిష్టమైన మహాకావ్యాలు - సామాన్యులకు అందుబాటులో లేనివి. అన్నమయ్య అచ్చ తెలుగుమాటలకు పెద్ద పీట వేస్తూ, ఛందస్సు కంటే లయకు ప్రాధాన్యతను ఇస్తూ సామన్యజనులకు అర్థమయ్యేటువంటి పాటలు వ్రాసారు. ఒక సారి అన్నమయ్య పాటలలో పల్లవులని చూస్తే ఈ విషయం తేటబడుతుంది: "చక్కని తల్లికి ఛాంగుభళా", "అదివో అల్లదివో", "అలరులు కురియగ", "చందమామ రావో జాబిల్లి రావో", "ఏమొకో చిగురుటధరమున ఏడనెడ కస్తూరి నిండెను", "నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన ఊరెడి ఉవ్విళ్ళో" మొదలైన పల్లవులలో తెలుగుదనం తాండవిస్తుంది. 

అంతటి సున్నితమైన పల్లవులలోనే ఎంతో గంభీరమైన భక్తి, వైరాగ్య భావాలు దాగున్నాయి. ఉదాహరణకు ఈ చిత్రంలో వినిపించిన "అంతర్యామి అలసితి సొలసితి" అనే పాటలో "భారపు బగ్గాలు పాప పుణ్యములు", "మదిలో చింతలు మైలలు మణుగులు", "జనుల సంగముల జక్క రోగములు" వంటి పంక్తులు సాధకులు తమ మనసుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవలసినటువంటివి. అలతి పదాలలో లోతైన జ్ఞానాన్ని వినిపించారు కాబట్టే ఆయన "జానపదానికి జ్ఞానపథాన్ని" చూపించారు. ఏడు కొండల పైన వేంకటేశ్వరుడిలాగ ఏడు స్వరాలను అన్నమయ్య పొదరిల్లుగా చేసుకుని మన మనసుల్లో స్థిరబడ్డారు. ఇంతటి లోతైన భావాన్ని నాలుగే నాలుగు చిన్న పంక్తులలో వేటూరి వెల్లడించారు.

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీశ్శులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుద్ధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించి ఆ నందకము నందనానందకారకము

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

భగవద్గీత, 2వ అధ్యాయంలో కృష్ణపరమాత్ముడు అన్న ఈ మాటలు సాధకులకు మొదటి పాఠం.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

దీనికి కొంచం వదలుగా తెనుగిస్తే "ఒక వస్తువుని విడిచిపెట్టాలని మనం దాన్ని దూరం చేస్తే, వస్తువు దూరమౌతుంది కానీ కోరిక మిగిలిపోతుంది. అదే ఆ వస్తువు కంటే ఉత్తమమైన వస్తువుని రుచి చూస్తే, అప్పుడు మునుపటి కోరిక కూడా పోతుంది" అని. అరిషడ్వర్గాలకు (కోరిక, కోపం, వలపు, కక్కూర్తి, పొగరు, ఓర్వలేనితనం) మూలం అహం (దేహాత్మబుద్ధి). ఈ చౌకబారు ఆలోచనలను దాటాలంటే ఉన్నతమైన భక్తి, వైరాగ్య భావలను రుచిచూడాలి. అన్నమయ్య పాటలు ఆ భావాలను, వాటిలో ఆనందాన్ని చెప్పేవి. అన్నమయ్యని విష్ణువు ఆయుధమైన నందకానికి అవతారంగా భావిస్తారు. అందుకని కవి అన్నమయ్యని "అరిషడ్వర్గాన్ని తెగనరికే హరి ఖడ్గమ్ము"  అన్నాడు. అరి, హరి ప్రాసతో పాటు తరువాత "షడ్", "ఖడ్" కు కూడా ప్రాస కలిపాడు. లయ చక్కగా కుదిరింది.

విష్ణులోకంలో మొదలైన నందకం తరువాత నెమ్మదిగా మిగతా లోకాలను దర్శించుకుని అక్కడ నాదాన్ని ఆకళించుకుని లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. బ్రహ్మలోకంలో బ్రహ్మ, సరస్వతీ దేవి వీణా నాదం; శివలోకంలో శివుడి ఢమరుక నాదం; ఇంద్రాది సభలలో అప్సరసల గాననృత్యాల లయ; మబ్బులలో విహరించే నారదుడు, ఆయన వీణైన మహతీ, తుంబురుడు - వారి భక్తినాదం అన్నీ చూసి హిమాలయాల మీదుగా వచ్చిందట. ఇక్కడ నాకు రెండు విషయాలు అనిపించాయి. నిజమో కాదో వేటూరికే ఎరుక. 1. అప్పటిదాకా నాదప్రధానమైన విషయాలు మాట్లాడుతూ "దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి" అనడంలో "నందకం శృంగారరసాన్ని కూడా తెలుసుకుంది" అనే ధ్వని వినిపిస్తోంది. ఎంతైనా అన్నమయ్య శృంగార సంకీర్తనలకు పెట్టింది పేరు. 2. "శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని" అన్నారు. "శిత హిమ కంధర" అంటే తెల్లని హిమాలయాల దగ్గర అని; "యతిరాజ్ సభ" అంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల చోటు అని నాకు అనిపించింది. వారి తపస్సుకు ఫలితంగా ఈ నందకం అవతారం ఎత్తింది అని కవి భావం అని అనిపిస్తోంది.

గర్భాశయం, గర్భాలయం - ఛందోబద్ధంగా రెండూ ఒకేలాగ ధ్వనిస్తున్నాయి (UUIU). గర్భాశయం అనేది వాడుకలో ఉన్న శబ్దం. వేటూరి గర్భాలయం అనే పదం వాడి అన్నమయ్యకీ, ఆయన తల్లికీ కూడా తగిన పదసత్కారం చేసారు అనిపించింది. చివరిగా ఈ చరణంలో చెప్పుకోవలసిన పదలయ: "ప్రవేశించెను ఆ నందకము, నందన ఆనంద కారకము". నందకము అంటే విష్ణువు ఆయుధము. నందనుడు అంటే కొడుకు. ఆనందము అంటే సంతోషం. ఆనందకము అంటే ఆనందము కలిగించేది. ఇక్కడ "నం, ద", "ఆ, నం, ద" అనే అక్షరాల వరుసలు రెండు మూడు సాల్రు వచ్చాయి. దీన్నే వృత్త్యనుప్రాసం అంటారు. ఒక అక్షరంతో వృత్త్యనుప్రాసం సామాన్యమే. రెండు మూడు అక్షరాలతో చెయ్యడం విశేషం. అలాగే, "ఆ నందకము" అంటే - "ఆ విష్ణువు ఆయుధం" అని. "ఆనందకము" అంటే ఆనందం కలిగించేది అని - ఈ రెండు అర్థాలు ఉండటం వలన శ్లేష ఐంది. ఒక చిన్న వాక్యంలో ఒక శబ్దాలంకారాన్ని, ఒక అర్థాలంకారాన్ని ఉపయోగించి వేటూరి తెలుగు వ్యాకరణం తెలిసినవారికి, తెలియని వారిని కూడా మెప్పించారు. భళా! 


పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై 
ఆంధ్ర సాహితీ అమరకోశమై 
అవతరించెను అన్నమయ్య 
అసతో మా సద్గమయా

"ఉసురు" అంటే "ఊపిరి", "జీవము" అని అర్థం. బహుశా నందకం అచేతనమైనది కనుక అన్నమయ్యకు విష్ణువు జీవం పోసాడు అని కావి భావం అనిపిస్తోంది. "అమర కోశం" అంటే "ఎప్పటికీ నిలిచే నిధి" అని అర్థం. సంస్కృత భాషకు ఒక ప్రముఖమైన "నిఘంటువు" లేదా "థిసారస్ (thesaurus)" పేరు కూడా అమరకోశం. "ఆంధ్ర సాహితీ అమరకోశమై" అనడంలో "తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచే నిధి" అని, లేదా "తెలుగులో అమర కోశం" (తెలుగు పదాలకు ఆలవాలం/నిఘంటువు) అని రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎలాగ చూసుకున్నా సబబైన మాట. 

"అవతరించెను అన్నమయ" కు యతి, అంత్యప్రాస కూడా కుదిరే విధంగా పవమాన మంత్రాలలో ఒకటైన "అసతో మా సద్గమయా" ను వాడటం ఈ పాటకు చాలా అందాన్ని తెచ్చింది. కొంచెం చాదస్తంగా చూసుకునేవారు " 'అసతో మా సద్గమయా' అంటే 'అసత్యం నుండి నన్ను సత్యం వైపు' నడిపించూ కదా. అన్నమయ్య పుట్టడానికి దానికీ సంబంధం ఏమిటి? " అని అడుగవచ్చును. దీన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చును అని నాకు అనిపించింది. 1. కవి అన్నమయ్యను స్వయంగా అడుగుతున్నాడు "నన్ను నీ పాటల ద్వారా అసత్యం  నుండి బ్రహ్మం (సత్) వైపు తీసుకువెళ్ళు" అని. 2. "అసతో మా సద్గమయ" అనే మంత్రానికి ప్రతిస్పందనగా విష్ణువు అన్నమయ్యను పుట్టించాడు అని కూడా అర్థం చేసుకోవచ్చును. నిజానికి కవి లయకు, లోతుకు ప్రాధాన్యతని ఇచ్చి ఇక్కడ విషయాన్ని అస్పష్టంగా విడిచాడు అనిపించింది. ఇది కొందరికి నచ్చకపోవచ్చును. కానీ నాకు నచ్చింది.

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేబట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎద లయలో పదకవితలు కలయ 
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య 
తమసో మా జ్యోతిర్గమయా

"అరముద్దలు" అనే పదం నాకు బాగా నచ్చింది. సామాన్యంగా ముద్ద కలిపి, గోటితో మధ్యలోకి త్రుంచి పిల్లలకు పెడతారు. కచ్చితంగా తెలియదు కానీ అందుకే దాన్ని గోరుముద్ద అంటారు అనుకుంటున్నాను. ఇక్కడ కవి అరముద్దలు అని కూడా అందుకే అంటున్నారు అని అర్థమైంది. సరే, "హరి" కి "అర" కి యతి యేనా, లేక ప్రాసయతి కూడా ఉందా అని చూసాను. నిఘంటువులో "అర" అంటే "అర్ధము, సగము" అని (అరగంట లో అర); "అఱ" అంటే "లోపలి" అని (అఱచేయి) ఉంది. సంస్కృతం ర కి తెలుగు ర కి ప్రాస కుదురుతుంది కానీ, సంస్కృతం ర కి తెలుగు ఱ కి కాదు. కవి ఎక్కడికక్కడ, ప్రాస, యతి, ప్రాసయతి చూసుకుంటూ వ్రాసాడనడానికి ఇది ఆధారం.

"తెలుగు భారతికి వెలుగు హారతి" చక్కనైన ప్రయోగం. భారతి అంటే "మాట, శబ్దం, సరస్వతీ" అని అర్థాలు ఉన్నాయి. తెలుగు పదాలకు హారతి పట్టినవాడు అన్నమయ్య. తెలుగు, వెలుగు; భారతి, హారతి - ఎంత చక్కగా ప్రాస కుదిరింది. తెలుగు పద కవితలను సృజింపజేస్తూ ఉంటే ఆయన ఎద లయలో అవి కలిసిపోయాయి. ఆ తరువాత తెలుగు వారి అందరి ఎద లయలో కూడా అవి కలిసిపోయాయి. అందుకే ఆయనని "ఆంధ్ర పద కవితా పితామహుడు" అన్నారు.

పాటను ముగిస్తూ వేటూరి "తాళ్ళపాకలో వెలసెనన్నమయ తమసోమా జ్యోతిర్గమయ" అంటూ మళ్ళీ ఒక పవమాన మంత్రాన్ని కలిపారు. ఈ సారి "తాళ్ళపాక" కు యతి గా "తమసో మా జ్యోతిర్గమయ" అన్నారు. మామూలు మనిషికి కూడా సాహిత్యాన్ని అందించే రసికుణ్ణి, భక్తుణ్ణి చేసిన అన్నమయ్య నిజంగా మనని అంధకారం నుండి  తేజస్సువైపుకు తీసుకెళ్ళారు.

ఈ పాటంతా ఎక్కడికక్కడ యతి, ప్రాస, ప్రాసయతులతో అందంగా వచ్చింది. దానికి కీరవాణి పూర్తిగా న్యాయం చేసాడు. తెలుగు చలన చిత్ర గీతాలలో ఇది కచ్చితంగా ఒక "classic".

Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

Wednesday, January 29, 2014

వేటూరి పుట్టినరోజు


ఈ రోజు వేటూరి పుట్టినరోజు. దాదాపు మూడేళ్ళ క్రితం ఆయన్ని తలుచుకుంటూ ఒక పాట వ్రాసాను. అందులో నాకు సంతృప్తిని ఇచ్చిన పంక్తి ఒకటుంది: మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట. ఇది వేటూరి గురించి నా అభిప్రాయాన్ని సూక్ష్మంగా చెప్తుంది. మనసు ఒక డబ్బా కాదు: ఒక డొల్ల, లోపల సరుకు ఉండటానికి. దానికి పొరలు ఉంటాయి. సరదాలు, కోఱికలు, పద్ధతులు, ఇష్టాలు, అనుబంధాలు, ఇలా. వేటూరి పాట ఈ పొరలన్నిటినీ దాటి ఆత్మీయమైంది - అంటే నా వ్యక్తిత్వంలో ఒక భాగమైపోయింది. వేటూరి పాట ప్రతి రోజూ పనిఁగట్టుకుని వినకపోవచ్చును. కానీ, ఏదో పని చేస్తున్నప్పుడు ఒక మారు స్ఫురిస్తుంది. అది ఎప్పుడు స్ఫురిస్తుందో తెలియదు, కానీ స్ఫురించినప్పుడు పులకరం కలుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో రూపంలో వస్తుంది, ఒక్కో రసం ఒలికిస్తుంది. అదొక దోబూచులాట.

జీవితంలో ఒక్క సారి కూడా కలవని మనిషి, ఎటువంటి ఋణం లేని మనిషి, అన్నో ఇన్నో లోపాలు ఉన్న మనిషి, ఒక రకంగా చెప్పాలంటే "ఎవరో". అలాంటిది తెలుగుని ప్రేమించే ప్రతివాడికీ ఆయన అంటే కొద్దో గొప్పో గౌరవం ఉంది. ఎందుకు? ఆయన పాటల్లో ఏదో ఒకటి మహబాగా నచ్చేసి "ఈ పాట ఈయన తప్పితే ఎవరూ ఇంత బాగా వ్రాసి ఉండరేమో!" అని అనిపించి ఉంటుంది. ఒక ఎనిమిదేళ్ళ అతితెలివి కుఱ్ఱాడు homework చేస్తూ లెక్కకు సమాధానం చూసి గుణించాలో, భాగించాలో అంచనా వేసి సమాధానం వ్రాస్తాడు. అలాగే ఒక్కో సారి వేటూరి భావం అనేసుకుని పదాలను ఇరికించడం, పదాలను అనేసుకుని భావాన్ని కిట్టించడం చేసారు. ఒక్కో రోజు అసలు తెలివి ఖర్చు ఎందుకు అనుకుని వేఱే section లో వాడి దగ్గర home-work copy కొట్టి వ్రాసేస్తాడు. అలాగే వేటూరి కొన్ని అన్యభాషాగీతాలను యథాతథంగా అనువ"దించారు". పన్నెండేళ్ళొచ్చాక Social Studies పరీక్ష అంటే ఏదో ఒక లాగ రెండు pages జవాబు వ్రాయాలి అని అర్థం పర్థం లేని వాక్యాలను వ్రాసేస్తూ ఉంటాడు. కొన్ని వేటూరి పాటలలో భావం కాదు అసలు అర్థమే లేదేమో అనిపిస్తుంది. పదిహేను ఏళ్ళు వచ్చినా తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన తమ్ముడూ, వాడి స్నేహితులతో cricket ఆడుతూ ఉంటాడు. వేటూరికి కవిత్వపరిపక్వత ఉన్నా చిలిపి పాటలూ, సరదా పాటలూ వ్రాసారు. ఇరవై ఏళ్ళొచ్చాక ఏవో రెండు వాక్యాల చివరన ప్రాస కలిపేసి "నేను కవిని" అంటూ ఉంటాడు. వేటూరి కేవలం ప్రాస కోసం వ్రాసిన పంక్తులు ఎన్నో ఉన్నాయి. పాతికేళ్ళకు పక్కన పెళ్ళం ఉండగా ఎదుట పడిన అమ్మాయిని చూసి ఒక్క సారైనా "అబ్బా" అనుకుంటాడు. వేటూరి భావాన్ని పక్కన పడేసి సుస్పష్టంగా వ్రాసిన బూతుపాటలూ ఉన్నాయి.

ఈ దశలన్నీ దాదాపు అందరూ తమ తమ జీవితాలలో చూసినవే. మనకు అత్యంత సన్నిహితుడు ఇవన్నీ చేసి ఉండవచ్చును. అయినా మనకు అవసరమైనప్పుడు లోతైన అనుభవంతో ఒక సలహా ఇచ్చినా, బాధలో ఉన్నప్పుడు ఓదార్చే ఒక మాట మాట్లాడినా, మన మనసులో ఉన్నప్పటికీ మాటల్లో చెప్పలేని భావాన్ని పసిగట్టి తన మాటల్లో అందంగా చెప్పినా, మనం ఆరాధించే విషయాన్ని తనూ అంతే ఇష్టంతో ఆరాధించినా, ఆ వ్యక్తి మనకు సన్నిహితుడే. అదే విధంగా వేటూరి తెలుగువారికి సన్నిహితులయ్యారు. ఆయన వ్రాసిన ప్రతి పాటా ఆణిముత్యం కాకపోవచ్చును. కానీ కొన్ని పాటలు వెల కట్టలేని అమరమైన నేస్తాలు. ఆ పాటలు తెలుగు సంస్కృతి ఉన్నంత వరకూ ప్రచారంలో ఉండాలని, ఆయన మళ్ళీ తెలుగువాడిగా పుట్టి గొప్ప సాహిత్యాన్ని అందించాలనీ కోఱుకుంటున్నాను.

Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

Friday, May 3, 2013

తెలుగందాలే - వేటూరి

ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.



“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది.

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.
ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.
ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.
గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.
ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.
అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.

Sunday, March 31, 2013

వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి...


నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది పంక్తులు మనందరికీ వర్తిస్తాయి అని నా అభిప్రాయం.

You've crossed the finish line
Won the race but lost your mind
Was it worth it after all?


అందరం ఒకటే పరుగులో ఉన్నాము. ఒక సారి ఆగి వెనక్కి తిరిగి మనని ఇంత దూరం పంపిన వాళ్ళను, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళను పలకరించే తీరిక లేని హడావుడిలోనే ఉన్నాము. అదే ఆలోచిస్తూ ఈ కింది పంక్తులను వ్రాసాను.

మంచం దిగాక, మైకం విడాక, మళ్ళీ పరుగులంటున్నావు
కొంచెం చిరాగ్గా, కొంచం చలాగ్గా, సాగే ప్రయాణం కోఱావు
ఎన్నాళ్ళైందో నువ్వు, చిందించి ఓ నవ్వు
వెనకకు తిరిగి చూడు ఓ బాటసారి

తీరం చేరాక, జోరెంతదాక, దూరం పెరుగుతోంది నీతో
పందెం నెగ్గాక, పతకం దక్కాక, పతనం తెలియకుంది నీకు
వెన్నుని నిమిరే నన్ను, వెతకదేల నీ కన్ను?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

సైన్యం ముందుంటే, ధన్యం జన్మంటూ, పోరే యుద్ధంలో మేలు  (యాదృఛ్ఛయా చోపపన్నం...)
శత్రువు లోనుంటే, గమ్యం బైటంటూ, పోయే మోసంలో లేదు
కలలు చూపు నీ కళ్ళు, చూపవ నా కన్నీళ్ళు?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

Monday, February 25, 2013

వేటూరి పాటల్లో సంస్కృతం - ఒక విహంగవీక్షణం

ఈ వ్యాసం తొలుత veturi.in లో ప్రచురింపబడినది. దయచేసి veturi.in ని సందర్శించండి.


వేటూరి ఒక అచ్చతెలుగు కవి. ఆయనకు తెలుగు అంటే ఉన్న మమకారం మనందరికీ తెలుసును. ఆయన పాటల్లో తెలుగుదనాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు సంపదను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం ఇదివరకు చర్చిన్చుకున్నదే. వీటికి తోడు వేటూరి పాటల్లో నాకు నచ్చే మరొక అంశం ఏమిటి అంటే, ఆయన వాడే సంస్కృత సమాసాలు. కొన్ని గంభీరంగా ఉంటాయి, కొన్ని ముద్దుగా ఉంటాయి, కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి, కొన్ని తప్పులు కూడా. ఏది ఏమైనా ఆయన ధారగా సంస్కృత పదాలను వాడి తెలుగు పాటలకు మరింత అందాన్ని చేకూర్చారు. ఆయన సౌరమానజన్మదినం సందర్భంగా అలాంటి కొన్ని ఉదాహరణలు గుర్తు చేసుకుందాము.

తొలుత ఆయన సంపూర్ణంగా సంస్కృతంలో వ్రాసిన ఒక పాటను గమనిద్దాము. అది సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" అనే పాట. అందులో మూడు చరణాలలో ముగురమ్మలను వర్ణిస్తూ వ్రాసారు. ఈ మధ్యనే ఈ పాటను "పాడుతా తీయగా"లో ఎవరో పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు "(ఇది వ్రాసింది ఎవరు అన్నది) నాకు అనుమానం ఉంది. ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట. ఇది చిత్రంలో వినియోగించడం జరిగింది (అనుకుంటున్నాను)." అన్నారు. వెంటనే న్యాయనిర్ణేతగా వచ్చిన సామవేదం షణ్ముఖ శర్మ గారు "కొన్ని శబ్దాలు చూస్తుంటే వేటూరి మాత్రమె చెయ్యగలరు అనిపిస్తోంది. ఉదాహరణకు శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి -- ఈ అందం, పైగా శిల్పరచన అంతా చూస్తుంటే వేటూరి గారిదే అనిపిస్తోంది. అలాగే మొదటి చరణంలో పార్వతి, రెండవ చరణంలో మహాలక్ష్మి, మూడవ చరణంలో సరస్వతి గురించి చెప్పి నాలుగవ చరణంలో సమన్వయం చేస్తూ తీసుకురావడంలో ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ చేసిన అద్భుతమైన రచన ఇది (ఇది వేటూరి శైలే.)", అన్నారు. ఆయన అంతగా పొగడటం వేటూరి పండిత-పామర జనరంజకంగా పాటలు వ్రాస్తారు అని అందరికీ తెలిసిన విషయానికి మరొక రుజువు. తఱువాత బాలు అది వేటూరి వ్రాసిన పాటేనని రూఢీ చేసారు.

ఈ పాటలో అందమైన సమాసాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సామవేదం గారు చెప్పినవి: శర్వార్ధగాత్రి అంటే శర్వుడి (శివుడి) శరీరంలో సగభాగం అని, సర్వార్థ సంధాత్రి అంటే అన్ని పనులనూ నేరవేర్చే శక్తి అని. పార్వతీ దేవికి ఇది ఎంత అందమైన వర్ణన? సరస్వతీ దేవిని వర్ణిస్తూ సరససాహిత్య, స్వరస సంగీత స్తనయుగళే అన్నారు. అంటే సంగీతం సాహిత్యం రెండు వక్షోజాలుగా కలిగింది అని చెప్తున్నారు. బిడ్డలకు కలిగే కళాపిపాసను తీర్చగలిగిన తల్లి ఆవిడే కదా, మరి. నాకు ఇంకా నచ్చినది శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని గణ పూజిత శుభచరణే అనడం. సమాసం కాలవ్యతిరేకక్రమంలో ఉన్నా భాగవతం చెప్పిన శుకుడి దగ్గర నుండి రామాయణం వ్రాసిన ఆదికవి వాల్మీకి దాక అందరూ ఆవిడ పాదాలను పూజించారు అనడంలో మన సాహిత్యం మొత్తానికి ఆవిడే ఆధారభూతం అని వ్యక్తం అవుతోంది. చక్కని మాట. అలాగే వింధ్యాటవీవాసినే కి ప్రాస కుదిరేలాగా యోగ సంధ్యా సముద్భాసినే అనడం చక్కగా ఉంది. యోగాభ్యాసం పూర్తీ కావస్తుంటే అమ్మ ఉద్భాసిస్తుంది (వెలుగుతూ కనిపిస్తుంది) అని లోతైన భావాన్ని చెప్పారు!

అదొక్కటే కదా సంస్కృతంలో వ్రాసిన పాట అనుకుంటున్నారా? ఆలాపన చిత్రంలో ఆరు ఋతువులు అనే పాటలో రెండో చరణాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అని నేను ఇక్కడ వ్రాయట్లేదు అంతే. అది ఒక సారి విని చూడండి. మీకు పూర్తిగా అర్థమైతే నాకు చెప్పండి. మరొక చక్కని పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో జై చిరంజీవా జగదేక వీర. చిన్న చిన్న పదాలతో చక్కగా సాగే భక్తీగీతం.

తరువాత అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలో ఆయన వ్రాసిన పాట ఒకటి చూద్దాము. 
ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుం శబరీ గిరి శృం, నిత్య నిస్సం, మంగళాంగ, 
పంపాతరం, పుణ్యానుషం, మునిహృదయ జలజ భృం
ఇందులో గమనిస్తే " అంగ"  తో వృత్త్యనుప్రాస నడిపించారు. అయ్యప్ప స్వామిని ఎత్తైన శబరిమల అంచుగా, సర్వసంగ పరిత్యాగిగా (ఆయన పెళ్లి చేసుకోలేదు, భక్తులు ఆయనకు తప్పితే వేరే పనీ లేదు), మంగళ కరమైన విగ్రహం కలిగిన వాడిగా, పంపానది తరంగంగా, పుణ్యాత్ములను ప్రేమించేవాడిగా, మునుల హృదయాలు అనే తామర పూవులలోని భక్తి అనే  తేనెను త్రాగే భ్రమరంగా పోల్చారు. ఎంత లోతైన వర్ణన, ఎంత అందమైన పదాల గమనం? 

మరొక పాట భైరవద్వీపంలో  శ్రీ తుంబుర నారద నాదామృతం. పాట పల్లవిలో
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం
సంగీతామృత పానం,
ఇది స్వరసురజగతీ సోపానం
గమనిస్తే ఒక్క "ఇది" అనే మాట తప్ప మిగతాది అంతా సంస్కృతమే. ఒకటి రెండు పదాలు పునరుక్తిలాగా అనిపించినా భావం చక్కగా ఉంది. పదాల అల్లిక శ్రావ్యంగా ఉంది. ముఖ్యంగా భక్తిపాటలలో ఇలాంటి ప్రయోగాలు వేటూరి చాలా చేసారు.

వేటూరిలో ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే -- మనం ఆయన్ని గురించి ఒక మాట చెప్పగానే, దానికి వ్యతిరేకమైన మాట కూడా నిజమేనని గుర్తు చేస్తారు. ఇప్పుడే భక్తీ పాటలు అన్నానా? వెంటనే "నాయనా, భక్తికి సంస్కృతానికి సంబంధం ఏమిటి?"  అన్నట్టు మరొక పాట గుర్తొచ్చింది. వినేవాళ్ళకు ఆశ్చర్యంగానో, వెటకారం గానో, అసభ్యంగానో అనిపించినా వేటూరి వ్రాసిన ఒక mass పాటలో మరొక అందమైన ప్రయోగం ఉంది.
ఇందువదన, కుందరదన, మందగమన, మధురవచన, సొగసులలన, గగనజఘునవే
చంద్రుడిలాంటి ముఖం కలదానా, మల్లెపూల వంటి పలువరుస కలిగిన దాన, నెమ్మదిగా నడిచేదానా (నెమ్మదిగా నడవడంలో అందం కూడా ఉంటుంది అని కవులు ఇలాగ అంటారు), చక్కగా మాట్లాడేదాన, అందమైన దాన అంటూ నాయికను పొగిడి మళ్ళీ "ఆకాశం వాలే విశాలమైన వంటి కటిప్రదేశం కలిగినది" అంటూ తమదైన శైలిలో కొంచెం సంస్కృతం సమాసాల-మసాలా కూడా దట్టించారు.

ఇక చిటిపొటి సమాసాలను చూద్దాము. అంటే ఇవి పాటకి సందర్భానికి/బాణీకి సరిపోగా వేటూరి అల్లిన సరదాసమాసాలన్న మాట. చూడాలని ఉంది చిత్రంలో యమహానగరి పాటలో ఒక చోట శరన్నవలాభిషేకం అన్నారు. నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు చిరంజీవి పిచ్చితో ఆ మాట అర్థం కాకుండానే పాడుతుంటే మా అక్క చెప్పింది అది "శరత్ నవల అభిషేకం" (అంటే శరత్ చంద్ర నవలల వెల్లువ) అని. నిజానికి నాకు తెలిసి నవల అనేది సంస్కృత శబ్దం కాదు, అది ఆంగ్ల "novel" నుండి గ్రహించబడిన వ్యావహారికశబ్దం. (తెలుగులో నవల అంటే స్త్రీ అని అనుకోండి. అది ఇక్కడ అనవసరం.) కానీ సందర్భానికి కుదిరంది కదా అని వేటూరి కొంచెం చొరవ చేసి ఈ పదాలను కలిపారు. నిజానికి ఇది సమాసం అనడం కంటే అనునాసిక, సవర్ణదీర్ఘ సంధులు అనడం సబబు అనుకుంటున్నాను. అదే పాటలో జనగణ మనముల స్వరపదవనముల హృదయపు లయలను శృతిపరిచిన ప్రియ శుక పీక ముఖ సుఖ రవళులతో అని కూడా అన్నారు.

స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో వేటూరి కొన్ని గమ్మత్తైన ప్రయోగాలు చేసారు. బహుశా దానికి కారణం ఆ చిత్రదర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ కూడా సాహిత్యాభిలాషి అవ్వడం కావచ్చును. చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం అనే శృంగారరసభరితగీతంలో పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు అని అన్నారు. పిపీలికాదిబ్రహ్మ అనడం సాధారణమే కానీ దానికి యతిని, ప్రాసను కూడా కలిపి పిపాసను పక్కన పెట్టడం వేటూరి చిలిపి గాంభీర్యం.

ఇక ఊహించని తరుణంలో కొన్ని సంస్కృతపదాలను చేరుస్తూ కూడా ఉంటారు. గీతాంజలి చిత్రంలో ఆమనీ పాడవే తీయగా పాటలో ఒక చోట వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక అన్నారు. ఆ భావం ఎంత లోతైనదో మరీచిక అనే పదానికి అర్థం ఎండమావి అని తెలిస్తే బోధపడుతుంది. అదిగో భావం లోతు అన్నాను. ఇప్పుడు వేటూరి భావం లోటుని కూడా గుర్తు చేసారు. అదీ చూద్దాము. హిట్లర్ చిత్రంలో నడక కలిసిన నవరాత్రి అనే పాటలో ఒక చోట మరాళి అన్నారు. అంటే హంస అని అర్థం. ఆ మాట చుట్టూ ఎంత ముతక మసాలా ఉన్నా అక్కడ ఈయనకు ఎలాగో ఈ పదం తోచింది. ఇలాంటి ఉదాహరణలు చిరంజీవి చిత్రాలలో చాలానే ఉన్నాయిలెండి.

చివరిగా వేటూరి దుష్టసమాసాలను కూడా ఒక సారి చెప్పాలి. ఎందుకంటే ఆయన వాటితో కూడా అందంగా కవిత్వం చెప్పగలరు. దుష్టసమాసం అంటే సమాసం పొసగని పదాలకు సమాసం కలపడం. ఉదాహరణకు తెలుగు పదాలను, సంస్కృత పదాలను నియమాలకు వ్యతిరేకంగా కలిపెయ్యడం. ఆయన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గంగోత్రి చిత్రంలోని జీవనవాహిని పాటను చర్చిస్తూ జలదీవెన అన్నది దుష్టసమాసమే కానీ, "మనం భక్తిపాటలు అనట్లేదు? మరి అదీ దుష్టసమాసమే" అని సమర్థించారు. సమాసాల గురించి చదువుకున్న మనమే భక్తిపాటలు అనగా లేని తప్పు చిత్రంలో ఎక్కువగా చదువు అబ్బని వాడు జలదీవెన అని భక్తితో అనడంలో తప్పేముంది, అది అతని భక్తి -- అందులోనూ అందం ఉంది.

అదిగో నేను భక్తి అన్నాను. ఇప్పుడు కేసెట్ రెండో వైపును గుర్తు చేసారు వేటూరి. ఒక ముద్దొచ్చే చిలిపి దుష్టసమాసం దేవరాగం అనే మళయాళ చిత్రానువాదంలో యా యా యా నెమలి కన్నుల కలయా అనే పాటలో కృష్ణుణ్ణి కౌగిళ్ళనిలయా అనడం. నిజమే మరి ఎంతో మంది గోపికలు ఆయనే సర్వస్వం అనుకుని వారి కౌగిలిలో బంధించే ప్రయత్నం చేసారు. ఎవరికి వారే యమునా తీరే అని ఊరేకేనే అన్నారా? మరి అన్ని కౌగిళ్ళలో ఒకే సారి నివసించినవాడు కృష్ణుడే కదా? అందుచేత సబబేను. తప్పొప్పులు పక్కన పెడితే ఈ ప్రయోగం ముద్దుగా లేదు? కవిత్వం అంటే అదే కాదా -- చక్కని భావాన్ని తీయని పదాలతో పండితులకు, పామరులకు నచ్చేలాగా చెప్పడం. వేటూరికి వచ్చింది,  ఆయన మనకు ఇచ్చింది, మనకు నచ్చింది అదే కదా!

ఈ పదాలలోనే ఆయనను చూసుకుంటూ, తలుచుకుంటూ సాగుదాము.


Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు. 

Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (3)

"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా వ్రాసారని ఆయనకు అనిపించిందేమో.

ఇక ప్రణయం, శృంగారం సందర్భంగా వేటూరి వ్రాసిన వానపాటలను చూద్దాము. ఇలాంటి పాటలు వేటూరి బోలెడు వ్రాసారు. ఒక్కో పాటకు శృంగారం పాళ్ళు ఒక్కోలా ఉంటాయి. కొన్ని పాటలలో వాక్యాలు ఇక్కడ వ్రాయడానికి కూడా ఇబ్బందిపెట్టేవి ఉన్నాయన్నమాట వాస్తవమే. అందుకని చర్చించే పాటలను శృంగారం మోతాదుని బట్టి వరుసపరిచాను.


వేటూరి వానపాటల్లో బహుశా అన్నింటికంటే ప్రజాదరణ పొందిన classic కే.వీ.మహాదేవన్ స్వరపరిచినది. ఇది కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "వేటగాడు" చిత్రంలో "ఆకు చాటు పిందె తడిసే" అనే పాట. పాట చిత్రీకరణ ఎంత శృంగారసూచకంగా ఉందో భావం అంత సున్నితంగా ఉంది అని నా అభిప్రాయం.
ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే
పురుషుడు సౌందర్యాన్ని గురించి ఆలోచించడం, స్త్రీ భావావేశాన్ని గురించి ఆలోచించడం రివాజు. అందుకేనేమో పల్లవిలో నాయకుడు ఆ వనపరిసరంలోని పిందెలతో, పూవులతో అమ్మాయిని పోలుస్తుంటే, అమ్మాయి తన మనసులో గుట్టుగా ఉన్న భావాలను గురించి చెప్తోంది.
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడ లాగా నవ్వుతుంటే
ఈ చరణంలో చినుకును ఊతగా పట్టుకుని అమ్మాయిని వర్ణిస్తున్నారు. ఒక చినుకు అమ్మాయిని తాకి ఆ మెరుపు పూసుకుని ముత్యంలాగా మెరిసిపోతోందట. మంచి భావుకత మాత్రమే కాదు అది వ్యక్తపరచడానికి పదాలపై పట్టూ ఉండాలి. వేటూరి వీలైనంతవరకు పదాల మధ్యన యతి కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ముద్దిచ్చి, ముత్యం; చిగురాకు, సిరిమువ్వ; తాకి, డియారు గమనించండి. అలాగ వ్రాసిన పంక్తులు నాలుకపైన సులువుగా ఆడుతాయి.
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
నాయకుడు చినుకు గురించి చెప్తుంటే, నాయిక మెరుపు గురించి చెప్తోంది. మొదటి పంక్తిలో మెరుపు ఆమె చూపుల్లో తనపై ఉన్న ఆకర్షణకు చిహ్నం అని అనిపిస్తోంది. అలాగ జరుగుతుంటే ఆమె మనసులో ఒక కోఱిక మఱొక మెరుపైందట. ఇంతలో అబ్బాయి చూపు మఱొక మెరుపు, నవ్వు మఱొక మెరుపు అయ్యి అంతటా మెరుపులే కనిపిస్తున్నాయట.
నీ పాట విని మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి,
చలిని పెంచి, చెలిమి పంచి, తలలు వెచ్చంగా తడియార్చుకోవాలి
నాయిక పాటకు వర్షం మరింతగా పెరిగితే, ఆమె తన ఒళ్ళు జలదరించడంలో ఉన్న సోయగాన్ని అతడికి ముడుపు చెల్లించుకోవాలట. అది వారి నడుమ ప్రణయాన్ని బలపర్చి, వారిద్దరూ దగ్గరవ్వాలని అతడి కోఱిక. ఈ పంక్తిలో నాకు నచ్చింది "నీ విరుపులు ముడుపులిచ్చి" అనడంలో శృంగారమే కాక సౌందర్యం కూడా చాలా ఉందని నా అభిప్రాయం.


"కేక" చిత్రంలో చక్రి స్వరపరచిన పాటను చూద్దాము. ఒక యువకుడు, ఒక యువతి వానలో ఉన్నారు. పెద్దగా పరిచయం లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చి line వేస్తున్నాడు. ఈ సందర్భంలో శృంగారానికి ఎక్కువ తావు లేదు. అబ్బాయి అమ్మాయిని పదే పదే తమ మధ్యన కలిగిన ప్రణయభావాన్ని బయటపెట్టమన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయి దానికి ఇంకా సమయం రాలేదన్నట్టు చెప్తుంది.
అ: మెరిసే మేఘం కురిసేదెప్పుడో
ఆ: కురిసే వర్షం వెలిసేటప్పుడే

అ: ముసురుకున్నది ఏదో చిలిపి కోరిక
ఆ: ముదరనివ్వకు కథలే చాలు చాలిక
వర్షం కురియాల్సినప్పుడు కురుస్తుంది కానీ, అడిగితే కురవదు కదా. అలాగే వలపు కూడా అంతేనని ఆమె భావం.
అ: మెరిసే తొలకరిలో నిను కనులారా చూసా
ఆ: చలిలో గిలిగిలిలో కొసమెరుపులు ఆరేసా
అబ్బాయి వానలో అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నానని చెప్తుంటే తను చూపించింది కేవలం కొసమెరుపులు మాత్రమేనని అమ్మాయి చమత్కరించింది. అంటే ఆ వాన స్వయంగా అందంగా ఉంటే దానికి చిగురున అమ్మాయి మరింత మెరుపు అద్దిందని అయి ఉండవచ్చును, లేక అమ్మాయి అందం తను ఇంకా కొస మాత్రమే చూసాడని అయి ఉండవచ్చును. బహుశా ఆయన శ్లేషనే ఉద్దేశించి ఉండవచ్చును. వేటూరి పాటకు "ఇదే" భావం అని ఆయన తప్పితే వేఱెవరూ చెప్పలేము.
అ: ముసిరే గాలివానలలో ముదిరే ముద్దుపిలుపులలో
ఆ: తడిసే వానచినుకులలో పడకు మత్తుకవితలలో
 ఇక్కడ కూడా అబ్బాయి ముందుకు మనసులోని ఆలోచనలకు అమ్మాయి కళ్ళాలను వేస్తోంది. ఇక్కడ ఏడు రంగులను చిలకడం అనే ప్రయోగం నాకు నచ్చింది.
అ: ఆడపిల్ల మాటలే అందమైన మాయలే, అర్థమైతే చాలులే అంతకంత హాయిలే
ఇది వేటూరి ముద్ర. ఆడపిల్ల మాటలు అందమైన మాయ. నిజమే "ఆడువారి మాటలకు అర్థాలు వేఱులే"  అనే ఎప్పుడో పింగళి చెప్పారుగా. ఆ మాటలు నిజంగా అర్థమైతే ఆ మాయ ఎంత లోతు అంతకంతా హాయి కలుగుతుందిట. అద్భుతం. నాలుగు ముక్కలలో అమ్మాయిల మాటల గురించి చెప్పారు.
ఆ: ఉడికే వయసులలో తొలి గిలిగింతల వాన
అ: చినుకే చిటపటగా దరువేసెను మదిలోన
గ్రీష్మమంతా వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షఋతువులో తొలకరి కురుస్తుంది. ఉడికే వయసులు అనడంలో యవ్వనాన్ని గ్రీష్మంగా వర్ణిస్తూ, వలపును వానగా చెప్తున్నారు. "టప్ టప్" అంటూ పడటాన్ని "దరువు" వేయడం అనడం సరదాగా ఉంది.


"ఆఖరి పోరాటం" లో వేటూరి-ఇళయరాజ-బాలు-లతా మంగేష్కర్ కలిసి చేసిన పాటలో రెండు వాక్యాలు అద్భుతంగా కుదిరాయి.. వాటి అర్థం లతా మంగేష్కర్ కి చెప్తే ఆవిడ చాలా సంబరపడి మెచ్చుకున్నారని వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయిలో చెప్పారు. ఆ రెండు వాక్యాలు కూడా వర్షానికి సంబంధించినవే.

ఆషాఢం ఉరుముతుంటే, నీ మెరుపే చిదుముకున్నా
హేమంతం కరుగుతుంటే, నీ అందం కడుగుతున్నా
ఈ పాటలో కూడా ("నిరంతరమూ వసంతములే" పాటలో లాగ) వేటూరి ఋతువులలో ప్రేమికుల భావాలను వర్ణించారు. కాకపోతే ఇందులో శృంగారాన్ని వర్ణించారు. కానీ, ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా వ్రాసారు. ఆషాఢ మాసంలో మేఘాము ఉరుముతుంటే మెరుపు మాత్రం అమ్మాయి ఒంట్లోనుండి వచ్చినట్టు అనిపిస్తోందట, అబ్బాయికి. హేమంతంలో మంచు కరుగుతూ ఉంటే దానితో అతడు ఆమె అందాన్ని కడుగుతున్నాడట. అద్భుతం!


"అడవి దొంగ"లో "వానా వానా వందనం" అనే పాటని చూద్దాము. ఈ పాట అంతా అంత్యప్రాసతో వ్రాసారు. కొన్ని చోట్ల పదాలు ఇరికించినట్టు అనిపించాయి కానీ కనీసం ఆ పదాలు రివాజు పదాలు కాదు. అందుచేత ఎబ్బెట్టుగా లేవు.
చలి పెంచే నీ చక్కదనం, కౌగిట దూరే గాలిగుణం
గాలివానలా కలిసి రేగుతూ కమ్ముకుపోతే యవ్వనం
(అ) మెరుపుని నీలో చూస్తుంటే, (ఆ) ఉరుములు నీలో పుడుతుంటే
వాటేసుకుని తీర్చుకో వానదేవుడి వలపు ఋణం
అమ్మాయిని అబ్బాయిని గాలివానతో పోల్చడం కొత్తగా ఉంది. అబ్బాయిని గంభీరమైన ఉరుముతోనూ, అమ్మాయిని అందమైన మెరుపుతోనూ పోల్చి వాటిని సృష్టించిన వానదేవుడి ఋణం తీర్చుకోవడానికి వాళ్ళు కౌగిలించుకోవాలని కవితాత్మకంగా చెప్పారు. ఇదే పాటలో రెండో చరణంలో అంత చెప్పుకోదగిన అంశాలు కనబడలేదు. ఎంతటి వేటూరైనా ఒక చిత్రంలో వానపాట hit అయిందని ప్రతీ చిత్రంలోనూ వ్రాయమంటే ఇదే జరుగుతుందేమో.


"యముడికి మొగుడు" చిత్రంలో రాజ్-కోటి సంగీతసారధ్యంలో చిరంజీవి, విజయశాంతుల నడుమ సాగే వానపాటలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు చూద్దాము.
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా?
మళ్ళీ అబ్బాయి ఊపిరిని వర్షఋతు గాలులతో, అమ్మాయి వయసుని గ్రీష్మఋతు వేడ్మితో పోల్చారు. ఇందాకటి పోలికకి ఇప్పటికి పదాలన్నీ మారిపోయాయి గమనించారా? అది వేటూరి పదాల గారడీ.
అ: తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తల దాచుకో
అమ్మాయిని వాన నుండి రక్షించడానికి అన్నట్టు అబ్బాయి ఆమెను వాటేసుకున్నాడట. తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నాను అంటే ఎవడు నమ్ముతాడు. ఉన్న విషయాన్ని అబ్బాయి సరదాగా చెప్పడం బాగుంది.
ఆ: వడగట్టేసి బిడియాలనే వొడి చేరాను వాటేసుకో
"డ" అనుప్రాస కోసం, బిడియాలని వదిలిపెట్టడాన్ని "బిడియాలను వడగట్టాను" అని చెప్పారు. ఇలాంటి ప్రయోగాలు లోతైనవి కాకపోవచ్చును. కానీ మామూలు భావాలని మళ్ళీ మళ్ళీ అవే పదాలతో వాడకుండా వేఱుగా చూపించడం చలనచిత్ర కవికి కావలసిన లక్షణం. వేటూరి ఈ పాటల్లో మనకు చూపించింది అదే.


వేటూరి చిరంజీవికి చాలా వాన పాటలు వ్రాసారు అని ఇప్పటికే చదువర్లు గమనించి ఉంటారు. ముచ్చటగా మూడో చిరంజీవి పాట. "అన్నయ్య" చిత్రంలో మణిశర్మ స్వరపరిచినది. వాన పాటలో కొన్ని ఎబ్బెట్టు వాక్యాలుండటం సహజమే కానీ ఇందులో పల్లవిలో మొదటి వాక్యం కొంచెం ఎబ్బెట్టుగా వ్రాసారు. అది పక్కన పెడితే ఇందులో కొత్తగా వాడిన ప్రయోగం ఏమిటంటే ప్రేమకు ప్రాసగా "తేమ"ను వాడారు.
ప్రేమ రాగం, తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మళ్ళీ వేటురికి నచ్చిన ఆషాఢం, మేఘాలు, దేశం, పదాలు వచ్చాయి. కాకపోతే ఇదివరకుటి వరసలో కాదు, ఆ భావంతో కాదు.
ఆషాఢ మాసంలో, నీటి అందాల ముసుగుల్లో
మేఘాలదేశంలో, కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డ ఒంటినిండా ఈడు కుంపట్లు రాజేస్తే
ఆషాఢ మాసం వర్షం ముసుగులో అమ్మాయికి అబ్బాయితో ఏర్పడిన బంధం (మెరుపు ఆకర్షణకు, కలలకు చిహ్నంగా వాడి ఉండవచ్చును)  ఆమెలో దాహాన్ని రేకెత్తించింది (అబ్బాయి వర్షం అన్నమాట).
పూలంగి గొడుగుల్లో నిన్ను బంధించి ఒడుపుల్లో
చిత్రంలో అమ్మాయి దగ్గర గొడుగు లేక అబ్బాయి గొడుగులోకి వస్తుంది. ప్రణయానికి చిహ్నంగా ఆ గొడుగుని పూలంగి గొడుగు అంటున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే గొడుగుకి ప్రాసగా "ఒడుపు" అనడం. అంటే అమ్మాయికి తన మనసులో ఉన్న విషయం తెలియకుండా గొడుగులోకి లాక్కుంటున్నట్టుగా పట్టుకోవడం. ఇలాంటి చమత్కారాలు వేటూరి ప్రత్యేకత.


ఇప్పుడు "బంగారు బుల్లోడు" చిత్రంలో రాజ్-కోటి బాణీ వలన బాగా ప్రజాదరణ పొందిన పాటని చూద్దాము.
అ: స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన
ఆ: సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన
సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వచ్చే వానని స్వాతివాన అంటారు. ఈ సమయంలో నత్తచిప్పలలో పడిన నీరు ముత్యాలుగా మారుతుంది అని ఒక నుడి. అందుకే అబ్బాయి ఒక స్వాతీసాయంత్రం వేళ వాన తనని  "ముత్యమంత ముద్దు" లాగా ముట్టుకుంది అంటున్నాడు. అమ్మాయి వాన గురించి కాక, చీకటి తనలో సిగ్గు కలిపిస్తోంది అంటోంది. వాన పాటల్లో ఈ పల్లవి కొంచెం కొత్తగా అనిపించింది, నచ్చింది.  ఈ పాటలో వేటూరి మెరుపులకు, ఉరుములకు కొత్త అందాలను అద్దారు.
మేనక మెరుపులు, ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
మేనక మెరుపు అనడంలో ఆమె అందాలు అనే అర్థం ఉంది, ఊర్వశి ఉరుములు అనడంలో నాకు లోతైన అర్థమేమీ కనబడట్లేదు. కేవలం యతి కోసం వాడి ఉంటారు. రెండో చరణంలో వేటూరి కొంచెం శృంగారం పాళ్ళని పెంచారు.
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుముల కొమ్మల తొడిమలు వణికే వాన
ఇక్కడ అన్నిటికీ రెండు రెండు అర్థాలు ఉన్నాయి. మనం మామూలు అర్థాన్నే చూద్దాము. పూవులపై తుమ్మెదలు వాలి తేనె పీల్చుకోవడం వలన మిగిలిన మరకలను ఈ వాన కడుగుతోందిట. వాన ధాటికి వాలిపోతున్న తొడిమలు వణుకుతున్నాయట. వాన శృంగారాన్ని సూచిస్తోంది అని పూవులని, తేనెటీగలను అడ్డుపెట్టుకుని చెప్పారు. ఇంక వెతుక్కునవాళ్ళకు వెతుక్కున్నంత.
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
ఇక్కడ వేటూరి చిలిపిదనం నాకు బాగా నచ్చింది. వాన-వల్లప్ప పాటలో లాగానే గొడుగులో గుస-గుసని వర్ణిస్తూ నాలుగు అడుగుల గొడుగులో ఇద్దరు సర్దుకోవడానికి ఇబ్బంది పడటమే వాన (అందుకోసమే వాన) అంటున్నారు.
గాలివాన గుళ్ళోన ముద్దేలే జేగంట
గాలి-వాన వచ్చినప్పుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలంటే జంట దగ్గరవ్వడమే మార్గమనడానికి పై వాక్యం. భావలకోసం కానీ, పదాల కోసం కానీ వేటూరి వెతుక్కోరు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఇది వినగానే, "కేక" చిత్రంలో ఇందాక మనం ప్రస్తావించుకున్న పాటలో "వానదేవుడొచ్చినప్పుడే వయసే మొక్కు తీర్చుకోక తప్పదు. చినుకు తేలు కుట్టినప్పుడే జతగా మంత్రమేసుకోక తప్పదు" అనే పంక్తులు గుర్తొచ్చాయి.


వేటూరి భావాల కంటే, ఆ మాటకొస్తే అర్థం కంటే లయకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్రాసిన పాటలు "అల్లరి అల్లుడు" చిత్రంలో కీరవాణి స్వరపరిచినవి. నాకు గుర్తున్న అన్ని పాటల్లోనూ వేటూరి భావాలకు కొంచెం అన్యాయమే చేసారు. ఇందులో "కమ్మని ఒడి బొమ్మని" అని ఒక వాన పాట ఉంది. అందులో రెండో మూడో వాక్యాలు బాగున్నాయి.
మిడిసిపడకె తొలిసొగసు మొగలిపూరేకా! కస బుస కస కసిగా
పడగ విడిచి విరిపడక పరుచుకున్నాగా పగ వగ ఇదే పదరా
అమ్మాయిని మొగలిపూవుతో పోల్చడం రివాజే. ఈ వాక్యాల్లో వేటూరి శృంగారంలో అబ్బాయి తగువుని, అమ్మాయి తెగువని కొంచెం భిన్నంగా చెప్పారు అని నా అభిప్రాయం.


ఇక చివరిగా వేటూరి వ్రాసిన వానపాటల్లోకల్లా అత్యంత బూతుగా అనిపించిన వాక్యాన్ని చెప్తున్నాను. అసలు ఇది వ్రాయడం నాకు ఇష్టం లేకపోయినా ఎంత బూతునైనా వేటూరి పదాల మాయలో అందంగా కనబడేలాగా చేయగలరు అని చెప్పడానికే వ్రాస్తున్నాను. ఇది "నా అల్లుడు" చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన "పట్టుకో పట్టుకో" అనే పాటలోనుండి.
అందము తడిసిన వేళ, ఆడది ఒక జ్వాల
కూసం విడిచిన వేళ, కుదుపుల ఉయ్యాల
గమనిస్తే రెండు వాక్యాలలోనూ ఆది ప్రాస, అంత్యప్రాస కూడా కలిపారు.

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

వేటూరి - వానపాటలు (1)

ఈవేళ సియాటల్లో వర్షం పడుతోంది. సియాటల్ గురించి తెలియని వాళ్ళు "ఔనా?" అనుకుంటారేమో కానీ సియాటల్ గురించి తెలిసినవాళ్ళు "అందులో పెద్ద విశేషమేముంది?" అనడగుతారు. సియాటల్లో ఏటికి సుమారు అరవై-డబ్భై రోజుల్లో మాత్రమే సూర్యుడు నిరాటంకంగా గగనవీధిలో సంచరిస్తాడు. మిగతా రోజుల్లో మబ్బులూ, వర్షం సహజం. సియాటల్ ని అందరూ ఎప్పుడూ చీకటిగా ఉండే చోటని ఆడిపోసుకుంటారు. కానీ నాకు సియాటల్ బాగా నచ్చింది. నేను ఇళ్ళు వెతికేటప్పుడు కొంచెం వాస్తు చూస్తాను. తత్ఫలితంగానో, కాకతాళీయంగానో ఎప్పుడూ వెలుతురు బాగా వచ్చే ఇళ్ళలోనే ఉన్నాను. సూర్యుడు బయటకు రావాలే కానీ, మళ్ళీ ఇంటికెళ్ళేంత వరకు మా ఇంట్లోకి చూస్తూనే ఉంటాడు. అందుచేత మాకు పగటి వేళలో చీకటి గొడవ లేదు. కాస్త మబ్బుగానో, నెమ్మదిగా చినుకులు పడుతుండగానో, వసారాలో కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు. వెనకటికి నేను నర్శీపట్నం దగ్గర ఉండేటప్పుడు తోటల్లో తరచూ ఇదే చేసేవాళ్ళం.

ఏ విషయం గురించి మాట్లాడినా చివరకు ఆవు వ్యాసం అప్పజెప్పే కుఱ్ఱాడిలాగా, ఎటు తిప్పి ఎటు తిరిగినా నా మనసు గుర్తుచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి వేటూరి. వానకీ వేటూరికి బలమైన సంబంధమే ఉంది. వేటూరి వ్రాసిన వానపాటలు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కొన్ని పాటల్లో భావం ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి సునిశితంగా, మఱో సారి బాహాటంగా ఉంటుంది. విషయం భక్తి ఐనా, బూతైనా పదాలను పట్టుకోవడంలో వేటూరి చాకచక్యం ఏ కవినైనా కవ్విస్తుంది. వానపాటల్లో మరీను.

నాలోని శ్రోతకి వేటూరి ఎన్నో బహుమానాలు (అవే, పాటలు) ఇచ్చాడు కానీ నాలోని కవికి వేటూరి ఇచ్చిన స్ఫూర్తి కంటే, భయమే ఎక్కువ. పదాలను, భావాలను అనర్గళంగా, అనాయాసంగా చెప్పగలిగిన వేటూరిని చూస్తే నాకు "మన వల్ల కాదు బాబు!" అనిపిస్తుంది. ఒక్కోసారి చలనచిత్రాలలో చూపించినట్టు నా అంతరాత్మ ఎదుటపడి వివాహభోజనంబు చిత్రంలో కోట శ్రీనివాస రావు లాగా, "రాస్తే అట్టాంటి పాట రాయలే. బాలీ, నీ లెక్క ఔలా పాట రాస్తాడనుకున్నావ్రా?" అంటుంది.

సియాటల్లో వరుసవానల పుణ్యమా అని నాకు ఏ రోజు మానసిక పరిస్థితిని బట్టీ ఆ రోజు, వర్షం ఒక వేటూరి పాటను గుర్తు చేస్తుంది. ఉన్న మాట చెప్పుకోకపోవడం ఎందుకు. గుర్తొచ్చే పాటలలో అత్యధిక శాతం ప్రణ్యశృంగారావేశభరితంగా ఉంటాయి. అదే, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే పచ్చిగా ఉంటాయి. అర్థమైనవాడికి పదాలనే తీయని గుజ్జు వెనుక చేదైన బూతు విత్తనం తగలవచ్చును. అర్థం కానివాడికి వగరు తొక్క వెనకాల తీయని గుజ్జు కనిపించకపోవచ్చును. ఎవరేమన్నా ఆ పాటల్లో వగరూ, తీపి, చేదు అన్నీ ఉన్నాయి. వెరసి అది మావిడి పండు. కొంచం గంభీరంగా చెప్పాలంటే చూతపాకం అనాలేమో. అన్నట్టు మన్మథుడిని చూతాస్త్రుడు అంటారని బ్రౌహ్ణ్య నిఘంటువు ఉవాచ. వేటూరి పాటలలో ఉత్తుంగశృంగారభావాల కారణంగా ఆ కోణంలో కూడా ఆయన పాటలని చూతపాకం అనడం సబబేమో.

వాన చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయి? ఉరుము, మెరుపు, తళుకు, తొలకరి, జల్లు - ఇలాగ ఒక dozen పదాలుంటాయనుకోండి. వేటూరి కనీసం ఒక పాతిక వానపాటలు వ్రాసారు అనుకుంటున్నాను. ఉన్న డజను పదాలతో ఈ పాటల మధ్యన ఎంత వైవిధ్యం కుదురుతుంది? సందర్భాన్ని కూడా కలుపుకుందాము అంటారా? అవును శంకరా నాదశరీరాపర సందర్భం వేఱు, వాన వల్లప్ప వల్లప్ప సందర్భం వేఱు. కానీ "మన తెలుగు చలనచిత్రాలలో ఎన్ని సందర్భోచితమైన పాటలు ఉంటాయి?", అని ఆలోచిస్తే, ఆ పాతిక పాటల్లో పదిహేను పాటలకు సందర్భం ఇదే: "చిరంజీవికి, హీరోయిన్ కి love. వాన పడింది. పాట వ్రాయలయ్య కవి". ఐనా కూడా పాట పాటకీ కొత్త కొత్త భావాలను, పదాల గారడీని చూపించారు వేటూరి.

మొదట మనం భక్తి రసంతో మొదలేడదాము. వానపడుతోంది. ఒక భక్తుడులో "తను చేస్తున్న మంచిపనికి లోకం ఎందుకు హర్షించట్లేదు" అనే ఆవేశం కలిగింది. దాన్ని సాహిత్యంలో ఎంత ఎత్తుకు తీసుకెళ్ళవచ్చును అని (కే) విశ్వనాథుడు, (కే.వీ) మహాదేవుడు వేటూరిని అడిగితే, దానికి వేటూరి వినమ్రంగా ఇలా బెదిరించారు. శంకరాభరణం చిత్రంలో...
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది
అవధరించరా! విని తరించరా!
ఈ సంస్కృతం అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పటికీ నాకు అర్థమైనది సరో కాదో తెలియదు కానీ, "పొగరుతో (ధిక్కరి) ఉన్న ఇంద్రుణ్ణి జయించిన హిమ గిరీంద్రుడి (ఇంద్రుడి వర్షానికి, గాలులకీ హిమాలయాలు కదలవు కదా?) చలువు (సిత) గొంతులో (కంథర) నిండిన నీలకంథరా (విషం గొంతులో ఉన్నవాడు). సామాన్యులు (క్షుద్రులు) తెలుసుకోలేను రుద్రవీణ నిర్నిద్ర (అలుపు లేని) గానమిది, విను (అవధరించు), విని తరించు (సంతోషించు)". లోకులు మనిషిపై పెట్టే ఒత్తిడిని ఇంద్రుడితో పోల్చి, దాన్ని గెలిచిన హిమాలయాలను మనిషి పట్టుదలతో పోల్చి, అటువంటి మనిషిని ఆదరించేవాడిగా శివుణ్ణి వర్ణించి, కేవలం ధర్మాత్ములకు మాత్రమే అర్థమయ్యే తన జీవనగీతాన్ని చూసి సంతోషించమని శివుణ్ణి అడుగుతున్నాడు. ఆ అడగటంలో కూడా శంకరశాస్త్రి గాంభీర్యం మనకు కనబడుతుంది. అది వేటూరి సత్తా.

ఆ తఱువాత
మెరిసే మెరుపులు మురిసే పెదవుల ముసిముసి నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకుజారెనా శివగంగా
నా గానలహరిఁ నువు మునుగుంగా, ఆనందవృష్టిఁ నే తడువంగా
శివుడు పెట్టిన పరీక్షకు తను ఎలాగ ప్రతిస్పందిస్తున్నాడొ చూద్దామని లీలావినోది ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవి మెరుపులయ్యాయని, తన నడవడికి, గానానికి సంతోషించి శివుడు చేసే నాట్యంలో తుళ్ళుతున్న మువ్వల అలికిడి ఉరుములగానూ, ఆ వర్షం శివుడు తాదాత్మ్యంలో ఉండటం వలన గంగ క్రిందికి ఒలకడం గానూ వర్ణించడంలో వేటూరి మఱొక్క సారి "యద్భావం, తద్భవతి" అనే నానుడిని గుర్తుచేసాడు. శంకరశాస్త్రి "శాస్త్రి". శాస్త్రాలను, భగవంతుణ్ణి మూలంగా ఉంచుకుని నడిచే వ్యక్తి. అతనికి ఆకు కదిలినా, పువ్వు మెదిలినా శివలీలగా అనిపిస్తుంది. ముందు చరణంలో అచంచలమైన గాంభీర్యం పక్కనే రెండో చరణంలో చలింపజేసే భక్తి. వేటూరి కత్తికి రెండు వైపులా కాదు, తొమ్మిది వైపులా (నవరసాలు) పదునే.

ఒక్క ఉదాహరణే ఇస్తే ఎలాగ అంటారా? సరే వేటూరి గురించి పుస్తకాలే వ్రాసినవాళ్ళు ఉన్నారు. నేను మఱొక ఉదాహరణ ఇవ్వలేనా? సరిగమలు చిత్రంలో రవి శంకర్ శర్మ (బొంబాయి రవి) సంగీతానికి వేటూరి వ్రాసిన మాటలు చూద్దాము. ఇది వాన పాట కాదు కానీ వానతో కూడిన భావం. అంటే నిఖార్సైన ఉదాహరణే. అప్పటిదాకా సంగీతం చేతకాని వాడు గురువు అనుగ్రహం వలన, దైవబలం వలనా గొప్ప పాటగాడయ్యాడు. అప్పుడు వేటూరి అన్న మాటలు:
కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
అద్వైతభాష్యాలను చదివిన వాళ్ళకు కుండలో నింగి అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మమంతా ఒకటే అనడానికి దృష్టాంతాలంకారంతో గౌడపాదులు (శంకరాచార్యుల గురువుకు గురువు) చెప్పిన ఉదాహరణ ఇది.
బ్రహ్మం ఆకాశంలాగా అంతటా ఉంది. కుండలలోనూ ఉంది, బయటా ఉంది. కుండల వలన అది వేఱు వేఱుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే మాయ (మట్టి)ని తొలగిస్తే అంతటా ఉన్నది బ్రహ్మమే (ఆకాశమే). 
అలాగే ఇన్నాళ్ళూ తనలో ఉంచుకున్న సంగీతశక్తి తనకు ఆ కుండ అవధి కాదని తెలుసుకుని ఒక్కసారిగా ఉరిమింది అని కవి భావన. ఈ మధ్యన నేను అద్వైతసాహిత్యం ఎక్కువగా చదవడం వలన నాకు ఈ విషయం అర్థమైంది. తఱువాత సోదరుడు ఫణీంద్ర పుణ్యమా అని కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో వేటూరి ఇచ్చిన వివరణ చదివిన తఱువాత మరింత సంతోషం కలిగింది. వేటూరి భావాలను అర్థం చేసుకోగలగడంలో ఉండే తృప్తి అలా ఉంటుంది.  వెయ్యండిరా నూరు వీరతాళ్ళు అనాలనిపించట్లేదు?

కొనసాగుతుంది...

Sunday, February 12, 2012

వేటూరి - అనువాదగీతాలు


నిప్పు లేనిదే పొగ పుట్టదు అంటారు. అలాగని వందమంది అన్నంతమాత్రాన కాకి కోకిలా అవ్వదు కదా? అందుచేత ప్రజలలో ఎక్కువగా వినబడే అభిప్రాయాన్ని రెండు వైపుల నుండీ జాగ్రత్తగా విశ్లేషించి కానీ ఒక అభిప్రాయానికి రాలేము. ఇంతకీ ఆ పొగ ఏమిటి అంటే "వేటూరి అనువాదగీతలు సరిగ్గా వ్రాయలేదు. వాటిల్లో చెప్పుకోదగ్గ పాట ఒకటి కూడా లేదు. దానికి కారణం ఆయనలో ఉన్న అశ్రద్ధ." ఇది ఒక వాదన. కొంతమంది ఈ వాదనని కొంచెం సాగదీసి, "వేటూరి 1990 లలో ఎప్పుడో retire అయిపోయి ఉండాల్సింది" అని ఒక గాలి-సలహా [1] ఇస్తూ ఉండేవారు. బావుంది.

ముందు ఆ సలహా గురించి కొంచెం చర్చించుకుందాం. ఆ తఱువాత అసలు విషయానికి వద్దాము.  అసలు retirement ఎందుకు తీసుకుంటారు? ఇంద్రియాలు సహకరించకపోయినా, పని చెయ్యాలనే కోఱిక తగ్గిపోయినా, పటిమ (ability) తగ్గిపోయినా విరమిస్తారు.  వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాము. వేటూరిని ఆయన ఆరోగ్యం బాగా ఇబ్బందిపెట్టింది, నిజమే. అందుకని విరమించవలసిందా? కాదు అని అంటాను. కవి వాడే ఇంద్రియం అంతరింద్రియం, శరీరం కాదు. మఱోలా చెప్పలంటే కవి యొక్క హృదయం పనిచెయ్యడం మానేయడానికి అది engine కాదు. అదే ఇంధనం. శరీరం సహకరించాలి కానీ, హృదయం ఉన్నంతకాలం పరిగెట్టడానికి సిద్ధమే.

వేటూరి 1970, 1980 ల లో వ్రాసినన్ని మంచిపాటలు 1990, 2000 లలో వ్రాయలేదు అని దాదాపు అందరూ ఒప్పుకుంటారు. దీనికి కారణాలు అనేకం చెప్పుకోవచ్చును. మంచి సందర్భాలు ఇచ్చే కే. విశ్వనాథ్, బాపు, జంధ్యాల, వంశీ వంటివారి ఉద్ధృతి తగ్గిపోవడం, చలనచిత్రగీతసంగీతంలో తెలుగుదనం తగ్గిపోవడం, సీతారామశాస్త్రి, భువనచంద్ర వంటివారు ఎదగడం ఎంతో కొంత కారణం అని నేను అనుకుంటున్నాను. లేదు కోఱిక, పటిమ తగ్గిపోవడమే కారణం అనుకుంటే, అనువాదగీతాలతో పాటు మామూలు గీతాలు కూడా పెద్ద బాగా కుదిరేవి కాదు అనడం సబబే కదా? అందుకని వేటూరి ఎప్పుడూ అద్భుతంగా వ్రాసిన విశ్వనాథ్, బాపు ల 1990-2000 ల చిత్రాలను పరిశీలిద్దాము.

వేటూరి విశ్వనాథ్ కి 1984 లో సాగరసంగమం తఱువాత 1995 లో శుభసంకల్పం కి పాటలు వ్రాశారు. అందులో "సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు", "చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి" వంటి గీతాలు చాలా చక్కగా, గొప్పగా ఉన్నాయి. ఆ తఱువాత వచ్చిన 2004 లో వచ్చిన స్వరాభిషేకంలో "వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతి ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై నిలిచే పరవశమంతా మనదే, మన ఇద్దరిదే" అంటూ శృంగారంలో కూడా అద్వైతాన్ని చూపించగలగడం ఒక ఎత్తైతే, "ఉసురుగాలులను వెదురు పాటలుగ మలచు వేణువుకు గొబ్బిళ్ళో" అంటూ కృష్ణుడి మురళికి తెలుగుదనాన్ని అద్ది కొత్త రాగాలు పలికించడం మఱొక ఎత్తు. అలాగే బాపుతో 1993 లో "త్యాగరాజ కృతిలో సీతాకృతిని" తలపింపజేసినా, 1996 లో "చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ" పెట్టినా, మొన్న 2005 లో రాధాగోపాళంలో "సూరీడు చుట్టూ భూగోళం, రాధమ్మ చుట్టూ గోపాళం" అన్నా, నా మనసు స్వఛ్ఛందంగా అద్భుతం అని ఈల వేసింది. నిన్న, మొన్న వచ్చిన మాయాబజార్, ఆనంద్, గోదావరీ లాంటి చిత్రాల గురించి కూడా చెప్పుకోవచ్చును. కానీ సారం ఏమిటయ్యా అంటే వేటూరి చివరి చిత్రం (వరుడు) దాకా ఆయనలో పటిమ, కోఱిక తగ్గలేదు. సరైన అవకాశం దొరికితే ఆయన ఎప్పుడూ మంచి సాహిత్యాన్నే అందించారు.

అందుచేత వేటూరి విరమించి ఉంటే బాగుండు అనుకోవడం సరి కాదు. ఆ మాటకు వస్తే వేటూరే కాదు, సి.నా.రే కానీ, సిరివెన్నెల కానీ, కవిత్వం నుండి విరమించాలి అని అనుకోవడం పొఱబాటు. ఒక సందర్భానికి చక్కని ఉపమానమో, శ్లేషో, ఆఖరికి పదమో పడినప్పుడు మనసులో కలిగే ఆ తృప్తి అనుభవించకుండా కవికి సలహా ఇవ్వడం, ఎడారిలో ఉండి గోదారి ఒడ్డున ఉన్నవాళ్ళకు రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్ళు త్రాగాలో చెప్పినట్టుంటుంది.

ఇక అనువాదగీతాలు విషయానికి వద్దాము. నాకు అనువాదగీతాలు వ్రాసిన అనుభవం లేదు కానీ, ఇళయరాజా పాటలు కొన్ని నేను తెనుగీకరించాను. దాదాపు రెండు మూడు గంటలు కూర్చుంటే కొన్ని ఇఱికింపులతో, కాస్త వినసొంపుగానే వచ్చాయి. కానీ, lip-synchronization (అధరసమతుల్యం?) బాగా తక్కువైంది. అందుచేత అది కొంచెం ఇబ్బందే అనుకుంటున్నాను. ఒక పక్కన lip-sync, మఱొక పక్కన అప్పటికే చిత్రీకరించబడిన దృశ్యాలు, మఱొక పక్కన మాతృకలో భావాలు -- ఇవన్నీ తూగాలంటే కొంచెం కష్టమే. 

శ్రీ శ్రీ, రాజశ్రీ అనువాదచిత్రాలకు మంచి సాహిత్యం వ్రాసారు అని అంటారు. నాకు శ్రీ శ్రీ గురించి పెద్దగా తెలియదు. నాకు రాజశ్రీ వ్రాసిన పాటలు చాలానే నచ్చాయి. అలాగని అవి కూడా ఎప్పుడూ బాగుండేవి అంటే నా మనసు అంగీకరించదు. ఉదాహరణకు "డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో", "చెయ్యాలి కుఱ్ఱకారు పూజ", "నిన్న కాదు, నేడు కాదు, ఎప్పుడూ నే రాజ", వంటి వాక్యాలు నాకు రుచించవు. ఆ వాక్యాలలో భావం తెలుస్తోంది కానీ, అర్థం ఐతే భావంతో సమాంతరంగా లేదు. కొన్ని సార్లు ఆయన బాగా వ్రాసినా మిగతావారందరూ కలిసి దాన్ని రుచించకుండా చేసారు. ఆయన వ్రాసిన ఆఖరి చిత్రం ప్రేమికుడులో "అధరం, ఉదరం నడుమన ఏదో అలజడి రేగెనులో" అనే వాక్యం ఉన్నికృష్ణన్, రహ్మాన్ కలిసి "అధరమూదరము నడుమన" అంటూంటే అప్పట్లో నా పసి మనసుకు అర్థం కాలేదు. ఏదేమైనా, రాజశ్రీ అనువాదగీతాలు బాగా వ్రాసారు అంటే నేను కచ్చితంగా ఒప్పుకుంటాను.

ఇప్పుడు వేటూరి విషయానికి వద్దాము. వేటూరి అనువాదగీతాల వ్రాసేటప్పుడు lip-sync కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని నేను విన్నాను. అందులో నిజం ఉంది. ఎంతవరకు నిజం ఉంది అంటే "చూసుకున్నవాళ్ళకు చూసుకున్నంత మహాదేవా" అని సమాధానిమిస్తాను. అదేమైనా వేటూరి వయసా నిఖార్సుగా చెప్పడానికి? వాద-ప్రతివాదాలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చును.

చిన్నప్పుడు మణిరత్నం దిల్-సే చిత్రాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు సిరివెన్నెల పేరు చూసి మా తమ్ముడు, నేను సంబరపడ్డాము. (అప్పట్లో మేము రహ్మాన్, సిరివెన్నెలలకు వీరాభిమానులం. ఇప్పుడు కూడా అభిమానులమే కానీ, ఇతర సంగీతదర్శకులు, కవులు కూడా ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నారు అన్న విషయం గుర్తించాము. అప్పట్లో వేటూరి గురించి పెద్దగా తెలియదు. మెరుపు కలలు వంటి అనువాదచిత్రాలకు పాటలు వ్రాసారని తెలిసి, అవి అర్థం కాక చిన్నచూపు చూసేవాడిని.) అప్పటికే (జీన్స్) "నాకేనక" వంటి సాహిత్యంతో విసిగిపోయిన మేము, ఇన్నాళ్ళకు రహ్మాన్ అనువాదగీతాలు అర్థమయ్యే అవకాశం వచ్చిందని ఉత్సాహంగా cassette కొనుక్కుని విన్నాము. కానీ అందులో కూడా "ఛయ్య ఛయ్య" పాట విని నిరాశ చెందాము. ఓ పట్టాన అర్థం కాలేదు. నిస్సందేహంగా  చాలా వరకు కారణం సుఖ్విందర్ సింఘ్ పలికిన తీరు, అసలు తెలుగు పదాలు ఇమడటం కష్టమైన బాణీ. అసలు lip-sync లేదు. అందుచేత అనువాదగీతాలకు అన్నీ కుదరవు అన్న విషయం అర్థమైంది. ఉదాహరణకు అదే దర్శకుడు తీసిన గురు చిత్రంలో "రూఖి రె ఓ రూఖి రె, కాటొరె కాటె కటెనా" అని వచ్చినప్పూడు తెలుగులో దాన్ని వేటూరి "రుచే లేదు ఏ రాత్రీ, కాటేసే కదా కలైనా" అని వ్రాసారు. ఇక్కడ గమనిస్తే వీలైనంతవరకూ అవే అక్షరాల వరుసని వాడుతూ వచ్చారు. నేను ఇలాంటి ఉదాహరణలు బోళ్ళు గమనించాను. అందుచేత వేటూరి lip-syncను దృష్టిలో ఉంచుకున్నారు అనడంలో సందేహమేమీ లేదు.

వేటూరి అనువాదగీతాలతో వచ్చిన మఱొక చిక్కు చెప్పే ముందు నా అనుభవాలు కొన్ని చెప్పాలి. నాలుగు స్తంభాలాట చిత్రంలో వేటూరి ఎంతో అద్భుతంగా వ్రాసిన "చినుకులా రాలి" పాటని నేను చిన్నప్పుడు విని, "చినుకులు ఆరాలి అంటున్నాడు. ఏ ఒడియాలో ఎండబెట్టుకోవాలేమో?" అనుకున్నాను.  అలాగే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో "ముల్లోకాలే కుప్పెలై" అన్న వాక్యం విన్నప్పుడు "కాల్లో ముల్లు విన్నాను కానీ ముల్లులో కాలేమిటి?" అనుకున్నాను. గోదావరి చిత్రంలో వేటూరి మూడు దశాబ్దాలు వెనక్కు తిప్పిన "రామచక్కని సీతకు" పాట విని నా మిత్రుడు "ఆ మాటకు అర్థం పర్థం లేదు. రామ, చక్కని -- ఆ రెండింటికి సంబంధం ఏమిటి?" అని అడిగాడు. విషయమేమిటి అంటే ఒక్కోసారి శ్రోత కొన్ని పదాలను పక్కపక్కన చూడటానికి అలవాటు పడక ఒప్పుకోలేకపోతాడు. అప్పుడు ఆ పదసమూహానికి అర్థం లేదనో, రచయితకు జ్ఞానం లేదనో అనేసుకుని తన అహాన్ని సంతృప్తిపెడతాడు. ఈ ప్రక్రియకు ఎక్కువగా గురయ్యేవి వేటూరి పాటలు.

Surrealism కోసం ప్రాకులాడే వేటూరికి, pseudo-realism కు అలవాటు పడిన శ్రోతకు మధ్యలో ఇది నిత్యసంఘర్షణ. ఒకరుగోదావరిలో "మనసా వాచా" పాట వింటూ "కలలు వెన్నెలై కాటేస్తున్నా" అన్న వాక్యం విని "కల కాటేయడమేమిటి?" అని అడిగారు. ఏం చెప్తాను? ఏమీ చెప్పలేక తడబడి ఊరుకున్నాను. తెలుగు దర్శకులు ఇలాంటి surrealism ని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకు సృష్టిలో ఉన్న విషయాలన్నీ తెలుసును కాబట్టి, వేఱెవరికీ తెలియవు కాబట్టి. కాకపోతే అనువాదగీతాలు వ్రాసినప్పుడు ఆ దర్శకులు, కథానాయకపాత్రధారులు వేధించరు కాబట్టి కవికి కొంచెం స్వేఛ్ఛ వస్తుంది. అది దొరికినప్పుడే వేటూరి కొంచెం వేఱుగా వ్రాసే ప్రయత్నం చేసిన సందర్భాలు కొన్ని గమనించాను.

ఉదాహరణకు విలన్ (వేటూరి చివరి అనువాద చిత్రం)లో "మనసుని ఇవ్వవే మగనాలా" అనే వ్రాసారు. చిన్నప్పుడైతే మగనాల అనే పదాన్ని మగ, నాలా అని నాస్తిసంధి విడదీసుకుని "మగవాడు ఇచ్చినంత సులువుగా మనసుని ఇవ్వుమా, అంటున్నాడు కవి. ఏడ్చినట్టుంది" అనుకునేవాణ్ణి. ఇప్పుడు బ్రౌహ్ణ్య నిఘంటువు తెరిచి "మగనాల అంటే వివాహిత" అని అర్థం తెలుసుకున్నాను. మనసు, మగనాల యతి, సందర్భం కుదిరాయి కదా అనుకుని వేటూరి అలాగ వ్రాసి ఉండచ్చును. పైగా చిత్రంలో ఈ దృశ్యంలో విక్రం పెదాలు కదపడు. అందుకని స్వేఛ్ఛగా వ్రాసుకున్నది జనాలకు అర్థం కాక వేటూరి పిచ్చి పిచ్చిగా వ్రాస్తున్నారు అనుకుని ఉంటారు.

చిన్నప్పుడు నేను చిఱాకు పడిన మెరుపు కలలు చిత్రంలో "తల్లో తామర మడిచే" తామర మడవడం ఏమిటి? తురుముకోవడం అనాలి కదా అనుకున్నాను. తమిళంలో "తంగత్తామర మగళే" అని ఉంది. ప్రతీ పదానికి మొదటి అక్షరమైనా కలిసేలాగ వ్రాసే ప్రయత్నంలో తురుముకి బదులుగా మడుచు అని వ్రాసారు. ప్రతిఫలంగా నాకు పాట పల్లవే విచిత్రంగా తోచింది. నిజానికి పాఠ్యపుస్తాలలో పూర్వకవులు యతిమైత్రి కోసం ఇదే పని చేస్తే "ఓహో, ఎంత గొప్ప vocabulary" అనుకునేవాడిని.  "అట్టిట్టాయెను మనమే" అంటే అర్థం కాలేదు. అట్టా, ఇట్టాను ని అలాగ కలిపేయవచ్చునా? అసలు "మన ఇద్దరి (మనం) గురించి మాట్లాడుతూ అయ్యెను అంటాడేమిటి? అయ్యాము అనాలి కదా? అసలీ కవికి తెలుగు వచ్చునా?" అనుకున్నాను. Ignorance is bliss అన్నారు. "ఒడిలో హృదయం కాగడం ఏమిటి?" అనే సందేహం వచ్చింది. ఆ తఱువాత సంస్కృతం పాఠ్యపుస్తకంలో "రామేణ భరతః అంకే ఆరోపితః" అని చదివి "ఒళ్ళో కూర్చోపెట్టుకోవడానికి భరతుడేమైనా చంటికూచా?" అనుకుంటుంటే మా ఉపాధ్యాయుడు "అంకే అంటే పక్కనే అని భావం" అని చెప్పారు. అది సంగతి. నాకు వేటూరి సాహిత్యాన్ని అర్థం చేసుకునే అనుభవం లేక ఆ పాటంతా పిచ్చిపిచ్చిగా అనిపించింది. ఇక కంఠం వరకూ ఆశలు, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టడం, యదను మూతపెట్టుకోవడం, పరువం వచ్చిన పోటుతుమ్మెదలు, గలబాకప్పలు, ఎడారి కోయిల పెంటిని వెతకడం, విరాళిగీతం, నఖం కొరికిన పిల్ల, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ, కౌగిలి భాష -- ఇవన్నీ నాకేమర్థమౌతాయి చెప్పండి? అదే మన తెలుగు దర్శకులు ఐతే ఈ అర్థం కాని శృంగారాన్ని తీసేసి చక్కగా అందరికీ అర్థమయ్యే బూతులు వ్రాయించేవారు. చెప్పవచ్చేదేమిటి అంటే వేటూరి అనువాదగీతాలలో కొంచెం పరుషమైన భాష, భావం వాడేవారు. అది అర్థం కాక కొంతమంది ఆ పాటలను చెత్త పాటలనుకున్న సందర్భాలు ఉన్నాయి.

వేటూరిని బాగా వెనకేసుకుని వస్తున్నావు. అసలు బాగా వ్రాసిన పాటలేంటో చెప్పు అని అడిగేవాళ్ళుంటారు. వేటూరి పాటలో ప్రతి వాక్యం అంతే అందంగా, ఒక ధార (flow) లో ఉండాలనుకుంటే వేటూరి సరదా పాటలు, అనువాదగీతాలు వినద్దు అని చెప్తాను. వేటూరి పాటలో కొన్ని వాక్యాల impact ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనువాదగీతాల్లో అవధానంలాగా lip-sync, దృశ్యాలు, బాణీ అన్నీ గుర్తుపెట్టుకుని వ్రాసినప్పుడు ఇది మరింత జరుగుతుంది.

ఉదాహరణకు సూర్య s/o కృష్ణన్ చిత్రంలో పాత్రధారులు పాడుతున్నట్టు ఉండే దృశ్యాలకు పదానికి పదం అనువదించి, చిన్న చిన్న మార్పులతో కానించేసి, background లో వచ్చే "నిదరే కల ఐనది" పాటలో చక్కని ప్రయోగాలు చేసారు. ఈ పాట తెలుగులో ఇక్కడ చూడచ్చును, తమిళంలో ఆంగ్లానువాదంతో ఇక్కడ చూడచ్చును.


నిదురే కల ఐనది, కలయే నిజమైనది
బ్రతుకే జత ఐనది, జతయే అతననన్నది
మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా...

మొదటి సారి పాట విన్నప్పుడు, నిదుర కల అవ్వడం ఏమిటి? అనుకున్నాను. మళ్ళీ ఆలోచిస్తే "కల అవ్వడం" అంటే జరగకపోవడం అని తెలిసింది. "సుఖంగా తినడం కలైపోయిందనుకో" అంటే "ఈ మధ్యన సుఖంగా తినట్లేదు" అని అర్థం. ఇక్కడ వేటూరి తెలివిగా నిదుర కల ఐంది అన్నారు. అంటే నిద్ర పట్టట్లేదు. కానీ నిద్రపోనిదే కల రాదు. అదే కవి చమత్కారం. అది అర్థం కాకపోతే మన అజ్ఞానం.

"బ్రతుకు జత అవ్వడం" ఏమిటి? అని మఱొక సందేహం. బ్రతుకు అంటే జీవితం, ప్రాణం అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చును. జీవితం అనుకుంటే, అప్పటిదాక తన మనసుకు నచ్చే విధంగా లేని తన జీవితం ఇప్పుడు తనతో పాటు (అనుకూలంగా) నడుస్తోంది అని. లేదా అతడి జతే తనకు బ్రతుకైంది అని. బ్రతుకు అంటే ప్రాణం అనుకుంటే అతడిని చూసినప్పటినుండి ప్రాణం లేచి వచ్చింది అని (అప్పటిదాక జీవం లేనట్టు ఉంది అని). ఇన్ని అర్థాలు ఉండటం ఏదో నేరం లాగా చూడకుండా అదొక అందం లాగా చూడలేని వాళ్ళు వేటూరి పాటలకు దూరంగా ఉండాలని నా సలహా. ఒలిచిన అఱటిపళ్ళు కావాలనుకుంటే వేటూరి అప్పుడప్పుడు నిరాశపరుస్తారు కానీ అలాంటప్పుడే శ్రమపడి కొబ్బరికాయ ఒలిచి, పగలగొట్టి త్రాగాలనుకునేవాళ్ళకు మరింత ఆనందం కలిగిస్తారు. 

చరణాల్లో సందర్భాన్ని మరింతగా వివరిస్తూ వ్రాసారు. ఈ చిత్రంలో నాయిక దివ్య మొదట్లో మద్యానికి బానిసైన సూర్యని చూస్తుంది. తఱువాత అతను ఆ చెడ్డ అలవాటునుండి బయటపడి ప్రయోజకుడైనప్పుడు అతడిని ఇష్టపడుతుంది. అది ఎంత చక్కగా చెప్పారో చూడాలి.

వయసంతా వసంతగాలి, మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి, చిగురులతో చిలకలతో
యమునకొకే సంగమమే కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై నిలిచినది తన కొఱకే
పడిన ముడి, పడుచు ఒడి ఎదలో చిరుమువ్వుల సవ్వడి

వసంత గాలి లాంటి ప్రయోగాలను శిష్టులు దౌష్ట్యం అనుకోవచ్చును. కాకపోతే మనసు పెట్టి చేసిన ప్రయోగమే. అతడిపైన కేవలం మనసు పడటం వలనో, లేక అతడిని తనవాడిగా భావించడం వలనో ఆమె వయసు ఉన్నట్టుండి వసంతావరణాన్ని చూపిస్తోందిట. అప్పటిదాకా ఎడారి దారి అనుకున్నది ఉన్నట్టుండి చిగురులేసిన, చిలకలు నిండిన చెట్లతో ఉందిట. యమునకు సంగమం కడలితో కాదు, కేవలం గంగతో వ్రాసిపెట్టి ఉంది. అలాగే అతడు చెడిపోయినప్పటినుండి మళ్ళీ బాగుపడేదాకా ఆమె ఓర్పుగా వేచి ఉంది. ఏర్పడిన ఈ బంధం ఆమె గుండెల్లో చిరుమువ్వల సవ్వడిలాగా తీయగా అనిపించింది.

రెండో చరణంలో వేటూరి ఆత్రేయ కండువా ధరించి ఒక వాక్యం వ్రాసారు.

అభిమానం అనేది మౌనం, పెదవులపై పలుకదులే
అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే
నిను  కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి
నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి
ఎదుట పడి కుదుటపడే మమకారపు నివాళి లే ఇది

అభిమానాన్ని మౌనం తో పోల్చడం, అను"రాగం" స్వరాలకు దొరకదు అంటూ చమత్కరించడం నాకు నచ్చాయి. మధుమురళి చిగురించడం (వేటూరి trade-mark రాధాకృష్ణుల ప్రణయాన్ని గుర్తు చెయ్యడం) అంటూ మూగబోయిన వేణువు రాగాలు తీయగా పాడుతోంది అని రెండు పదాల్లో చెప్పడం మొ. అంశాలు అన్నీ బాగున్నాయి అనిపించింది. ఆ తఱువాతి వాక్యం వచ్చేటప్పుడు దృశ్యంలో శృంగారానికి తగ్గట్టుగా ఎద రగిలి, తనువు పులకరించింది అనడం కూడా సముచితంగా ఉంది. ఇంకా ఇది చెత్తపాట అనుకుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? అలాగే సఖి చిత్రంలో "అలై పొంగెరా" అనే పాట, వేఱొక విషాద గీతం ఎంతో అందంగా వ్రాసారు. ఇవన్నీ ఈ వ్యాసం వ్రాస్తున్నప్పుడు గుర్తుకొచ్చిన పాటలు. అందుచేత వేటూరి వ్రాసిన మంచి అనువాదగీతాలు ఉన్నాయి. ఎన్ని అనే విషయం పైన వాదించుకోవచ్చును. కాకపోతే "అసలు లేవు" అనే మాట మాత్రం పొఱబాటు.

[1] గాలి-సలహా అంటే ముఖాముఖీ ఇవ్వకుండా జనాలు పక్కవాడితో చెప్తే, అది వ్యాపించి, చివరికి media వాళ్ళు దాన్ని ప్రచారం చేయడం ద్వారా అసలు వ్యక్తికి తెలియడం.