Showing posts with label రమేష్ నాయుడు. Show all posts
Showing posts with label రమేష్ నాయుడు. Show all posts

Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

Tuesday, November 24, 2009

ముద్దమందారం, ముగ్ధశృంగారం

కన్నెపిల్లను వర్ణించవయ్యా అంటే తన విశ్వరూపం చూపించని కవి ఉంటాడా? అందులోనూ వేటూరికి ఈ మాట చెపితే, కపి~నేనంటూ, కపినే~నంటూ వచ్చేస్తాడు. అప్పుడు యే జంధ్యాలవంటి మహానుభావుడో కాస్త "చూసి వస్తే చాలు స్వామీ, కాల్చి రావక్కరలేదు", అని చెప్పకపోతే ప్రమాదమాయె ఈ సర్వబూతాత్మకుడికి. (మీరు సరిగ్గానే చదివారు: "అన్నిటిలోనూ బూతును చూడగలిగే వ్యక్తి", అని వేటూరిని ముద్దుగా ఇలాగ పిలుచుకుంటూ ఉంటాను.

ఇప్పుడు నేను చెప్పబోయే పాట "తెలుగింటి అమ్మాయిని" వర్ణించడానికి వేటూరి పెట్టిన ఒక ప్రమాణం. ఆ తరువాత తన ప్రమాణానికి తగ్గట్టు, "మంచి తెలుగుదనం ఉన్న బాణీ ఇస్తే చక్కని తెలుగుపదాలు కూరుస్తాను", అనే ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ, "పూసింది పూసింది పున్నాగ" లాంటి ఎన్నో గొప్పపాటలను వ్రాశాడు. ఇతర సినీకవుల్లో సిరివెన్నెల వ్రాసిన "చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా", అనే పాట ఈ పాటకు తుల తూగుతుంది అని నా నమ్మకం.

ఈ పాట, "ముద్దమందారం", అనే జంధ్యాల సినిమాలోనిది. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ పాటకి వేటూరి ఎంతో చక్కని ఉపమానాలతో తెలుగు ఆడపడుచును పొగుడుతూ పదాలను అల్లాడు. నాకు నచ్చిన విశేషాలు:

అడుగులా అష్టపదులా, నడకలా జీవినదులా?

విన్న ఆడపడుచు, ఆడనే పడిపోవాలని వేటూరి వ్యూహం అనుకుంటాను :) మరీ, ఆమె అడుగులని జయదేవుడి అష్టపదులతో (రాధాకృష్ణుల ప్రణయకలాపాలను రమ్యంగా చెప్పే పాటలు) పోలిస్తే అమ్మాయి ఏ పొన్నచెట్టో (అంటే రాధ పొన్నచెట్టూ దగ్గర కదా కృష్ణుడి కోసం వేచి చూసేది. అందుకే కొంచం శైలి మార్చాను.) ఎక్కి పడిపోదు? కన్నెపిల్ల అలాగ నడుస్తూ ఉంటే, ఆ గజ్జలమ్రోత నదులు పారుతుంటే వచ్చే శబ్దతరంగాలను పోలి ఉంటుంది అని, వేటూరి అభిప్రాయం. నాది కూడాను!

పరువాల పరవళ్ళు, పరికిణీ కుచ్చిళ్ళు, విరివాలుజడకుచ్చుల సందళ్ళు

(కొంచెం సిగ్గుతో కూడిన నవ్వుతో) ఈ వాక్యం ఎందుకు నచ్చింది అంటే ఏం చెప్పమంటారు. కొన్ని కొన్ని విని సంతోషించాలి అంతే అంటాను :) "పొట్టిజుట్టు పొలతలూ కుళ్ళుకోవద్దు, జీనుపాంటుల జేజెమ్మలు ఉడుక్కోవద్దూ", అని తరువాతి రెండు వాక్యాలూ పూర్తి చేస్తే బాగుండు :P

కన్నెపిల్లా కాదు కలలకాణాచి

మరి ఇదే వేటూరికీ సామాన్యులకీ తేడా. "కాణాచి" అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే "inherited right", అని బ్రౌహ్ణ్య నిఘంటువు అర్థం చెబుతోంది. అంటే, "మా కలలన్నింటి మీదా హక్కుదారివి నువ్వే", అని చెప్తున్నాడన్నమాట! అమ్మ బాబోయ్! వేటూరి ఒక్కో సారి ఇలాగ శరీరంలేని విశేషణాలకు కూడా వరసలు కలిపేస్తుంటాడు, ఆడపిల్లల్ని పడెయ్యటానికి. మొన్నటికి మొన్న "ఏయ్ చికిత్తా, సొంపుల సొంత మేనత్త", అని ఒక హీరోయిన్ని ["అర్జున్" సినిమాలో] పడేశాడు.

మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు

"మలిసంజ" అంటే సాయంత్రం సూర్యాస్తమయవేళ. ఆ వెలుగు నారింజపండు రంగు లో ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయి బుంగమూతి (ఎర్రని పగడాలతో పోల్చాడు) పెట్టుకుని వడగళ్ళు కురిపిస్తోంది అని అలకే ఉబ్బితబ్బిబ్బయ్యేలాగా వర్ణించాడు. ఈ నారింజరంగులని వేటూరి ఇంకా వదల్లేదు. ఈ మధ్యన "స్వాగతం" అనే సినిమాలో "సాయంకాలం నీరెండల్లో, సాయం కోరే నారింజల్లో", అని ఈ నారింజని మలిపొద్దు వర్ణానికో, చెలికాడి చిలిపిదనానికో, చినదాని అందాలకో తెలియకుండా వాడేశాడు!

మల్లెపువ్వా కాదు, మరుల మారాణి! బంతిపూవా పసుపు కాలిపారాణి!

పొరబాటున అందరినీ ఆకట్టుకుంటున్నది మల్లెపూవు తావి ఏమో అనుకునేరు, కాదు ఈ ప్రేమదేవత! ఎరుపు, పసుపు కలిపి బంతిపువ్వులాగా ఉంది ఏమిటొ అనుకుంటున్నారా? అది ఆమె పారాణి పెట్టిన కాలు. ఎంత దారుణం స్వామీ, ఈ అమ్మాయి కోసం మల్లెపూవుని, బంతిపూవినీ తక్కువ చేసేస్తావా!

ఇలాగ పొగిడితే ఏ అమ్మాయి ఎలాగ ఫీల్ అవుతుందో నాకు తెలియదు కానీ, ఈ పాట విన్నప్పుడల్లా నాకు చందమామ పుస్తకంలో చంద్రబింబంలాంటి ముఖారవిందంతో కనబడే అందగత్తె గుర్తుకొస్తుంది.

చిత్రం: ముద్దమందారం
దర్శకుడు: కీ.శే. జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
గానం: బాలు

ముద్దుకే ముద్దొచ్చే మందరం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం, ముగ్ధశృంగారం

అడుగులా అష్టపదులా, నడకలా జీవనదులా?
పరువాల పరవళ్ళు, పరికిణీ కుచ్చిళ్ళు, విరివాలుజడకుచ్చుల్ల సందళ్ళు
కన్నెపిల్లా కాదు కలలకాణాచి, కలువకన్నులా కలలదోబూచి

పలుకులా రాచిలకలా?, అలకలా ప్రేమమొలకలా?
మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు, మరుల మారాణి, బంతిపూవా పసుపు కాలిపారాణి

Tuesday, November 17, 2009

కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో!

కీ.శే. జంధ్యాలకి వేటూరి ఎన్నో చక్కని పాటలను వ్రాసాడు. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న దర్శకుడి చేతిలో పడాలే కానీ, వేటూరి ఎంతో చక్కని తెలుగు పాటలు వ్రాస్తాడు. అలాంటి పాటల్లో "రెండు రెళ్ళు ఆరు" అనే సినిమాలో "కాస్త అందుకో" అనే పాట ఒకటి.

జంధ్యాల మాటలు వ్రాసాక వేటూరి పల్లవి వ్రాశాడో, వేటూరి పల్లవి వ్రాసాక జంధ్యాల మాటలు వ్రాశాడో తెలియదు కానీ, పల్లవి వేటూరి స్థాయికి తగ్గట్టు ఉంటుంది. "అరెరే భలే భలే" అనిపించే పదాలగారడీ తో మొదలుపెట్టి, "ఆహా, ఎంత చక్కని భావం", అని అనిపించడం వేటూరి శైలిగా చెప్పుకోవచ్చును.

సినిమాలో హీరో (వెంకట శివం) హీరోయిన్ని(విఘ్నేశ్వరి) ప్రేమించి "నా ప్రేమకు దరఖాస్తు పెట్టుకుందాము అనుకుంటున్నాను", అంటాడు. ప్రేమకు దరఖాస్తు అంటే ఏమిటో తెలియక తికమక పడ్డ హీరోయిన్కి అది ముద్దు అని తెలిసినప్పుడు వచ్చే పాట ఇది. పాట మొత్తంలో "ముద్దు" అని అనకుండా వ్రాసాడు వేటూరి. లేదు లేదు, గీతాంజలిలో "ముద్దు" మీద వ్రాసిన "ఓం నమః" పాటకు ఈ పాట పోటీ రాదు కానీ, లలితంగా సాగిపోయే పాట అవ్వడం చేత నాకు నచ్చింది.

కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో

"కాస్త", "దరఖాస్తూ", "ధర కాస్త" అంటూ ప్రాసను కాస్తూ వ్రాసాడు వేటూరి. "ప్రేమ వెల" గా ముద్దును వర్ణించడంలో సద్భావాన్నే జనాలు గ్రహించాలి అని అనుకుంటున్నాను :-)

చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మేరుపంత నవ్వునా చినుకైన రాలునా?

చిరుగాలిని (స్వేచ్చ,వేగం)  పురుషునితోనూ, కరిమబ్బును (గంభీరం/సిగ్గు) స్త్రీతోనూ పోల్చి, చిరుగాలి కరిమబ్బును తాకడాన్ని ముద్దుతో పోల్చి చెప్పాడు. స్త్రీ ముఖములో చిగురించే సిగ్గుతో కూడిన నవ్వును మెరుపుతో పోల్చడం, అలాగే మెరుపుని కరిమబ్బు నవ్వుతో పోల్చడం కూడా అద్భుతంగా అనిపించింది.

నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?

చందమామను చూసి ప్రియుణ్ణి గుర్తు చేసుకుంటూ మురిసిపోతున్న ఆడపిల్లకు సిగ్గుతో  చెక్కిళ్ళు ఎరుపెక్కడాన్ని వెన్నెలగా కొత్త,చిలిపి నిర్వచనం ఇచ్చాడు.

దరి చేరి కూడా దరఖాస్తులేలా?

చివరలో ఆడపిల్ల  అర్థం అయ్యీ కాకుండా ఉండేటట్టు "ఇంత దగ్గరలో ఉన్న ఇంకా దరఖాస్తులేల" అంటూ "ఇంకా మొహమాటం ఏమిటి?" అని చిలిపిగా అనడంతో ఈ "ధర లేని" పాట "కాస్తా" పూర్తి అయ్యింది.

చిత్రం: రెండు రెళ్ళు ఆరు
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: వేటూరి
పాడింది: జానకి, బాలు

కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో!
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో!

కాస్తందుకో, దరఖాస్తందుకో, భామ (?) ధర కాస్తందుకో!
దగ్గర చేరి దత్తతు (?) చేసి ప్రేయసి కౌగిలి అందుకో!

చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మేరుపంత నవ్వునా చినుకైన రాలునా?
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు, వరదల్లె పొంగునా కడలింట చేరునా?
శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే!

చలిగాలి దరఖాస్తు తోలియీడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా?
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
దరి చేరి కూడా దరఖాస్తులేలా?

Friday, October 2, 2009

లిపిలేని కంటి భాష తెలిపింది కొంటె ఆశ

ఈ రోజు వేటూరి చేసిన ప్రయోగాల్లోకల్లా కాస్త సులువుగా అర్థమయ్యి, ద్వంద్వార్థాలు లేని ఒక్క పాట చూద్దాము.

ఒక అమ్మాయి తన మనసులో ఉన్నా సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపించింది. అతడు అది చదివి ఆ అమ్మాయికి బొక్కబోర్లా పడిపోయాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ పారే ప్రణయరాసాన్ని వేటూరి ఎంతో సున్నితంగా మంచి భావుకతతో వ్రాసాడు. మొత్తం పాట గురించి నేను వ్యాఖ్యానించెంత టైం లేదు కానీ, నాకు నచ్చిన ప్రయోగాలు మాత్రమే చెప్తాను.

- మోహంలో ఉన్న అమ్మాయి కళ్లు మాట్లాడుతున్నాయి అనడానికి "లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ" అని ఎంతో చిలిపిగా చెప్పాడు.
- తెలుగు పదాలతో గారడీ చెయ్యవయ్యా అని దరఖాస్తు పెట్టుకోకుండానే అవలీలగా చేసేసి మురిపించేయ్యడం వేటూరికి కొత్త కాదుగా. "గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను", అని అమ్మాయి, "నువ్వు లేని జీవితం నాకు నచ్చలేదు", అని చెప్తే, "గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను", అని అదే భావాన్ని మాటలు ముందుకూ, వెనక్కీ మార్చి అబ్బాయి చెప్పడం నా చేత ఐతే, "సాహో వేటూరి, నీకు లేదు సాటి", అనిపించింది.

ఇక్కడ చెప్పుకోవలసింది ఒకటి ఉంది. వేటూరి కొందరు దర్శకులకు ఎప్పుడూ మంచి సాహిత్యాన్నీ అందిస్తూ ఉంటాడు. విశ్వనాథ్, జంధ్యాల, రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, దాసరి నారాయణ రావు వంటి వారికి గతంలో అద్భుతమైన పాటలు వ్రాసాడు.

(డబ్భైమూడేళ్ళ మనిషిని పట్టుకుని, "డు-కారం", వాడుతున్నాడు అని కారాలూ మిరియాలూ నూరేయ్యకండి. అదివేటూరిని "మమ" (సంస్కృతంలో "నా") అనుకున్న "మమకారం".)


చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం: రమేష్ నాయుడు
గాయకులూ: బాలు, జానకి
దర్శకుడు: కీ. శే. జంధ్యాల

లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుకలేఖలలో, నీ సొగసుల కవితారేఖలలో
ఇలా... ఇలా... చదవనీ నీ లేఖని ప్రణయలేఖని
బదులైన లేని లేఖ, బ్రతుకైనా ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా... ఇలా... వ్రాయనీ నా లేఖని ప్రనయరేఖనీ!

అమావాస్య నిశిలో కోటి తారలున్నా ఆకాశం
వెతుకుతూ ఉంది వేదన తానై విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలేన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతుంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదాలు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను
గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను.

Monday, September 1, 2008

నవరససుమమాలికా...

మేఘసందేశం సినిమాకి చాలా నంది అవార్డ్లు, జాతీయ అవార్డు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో సంగీతం, సాహిత్యం చక్కగా ఉన్నాయి. ఈ సినిమాలో వేటూరి వ్రాసిన పాటలలో కాస్త సంస్కృతపదాలు ఎక్కువ పడటంతో, కృష్ణశాస్త్రి గారి పాటల (ఆకులో ఆకునై) పక్కన కొంచం కష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఏదేమైనా రమేష్ నాయుడు గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం కలిసి రసికులకు మహదానందం కలిగిస్తాయి. వీటిలో నాకు నచ్చినది, జీవితాంతం మెచ్చుకునేది ఒక పాట ఉంది. అది "నవరస సుమ మాలికా..." అనే పాట. అందులో ఒక భావకవి ఎలాగ తన ప్రేయసిని వర్నిస్తాడో వేటూరిని చూసి తెలుసుకోవాలి సుమీ అనిపిస్తుంది.

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే - సంస్కృత పదాల వెల్లువ! భావుకత పెల్లుబిగి ప్రవహించింది! తనకు గురుతుల్యులైన త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్యలను తలుచుకుంటూ మొదలుపెట్టాడు మహానుభావుడు. ఎంతని చెప్పను, ఏమని చెప్పను ఈ పాట గురించి.


నవరససుమమాలికా, నా జీవనాధారనవరాగమాలికా...
త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయరసగీతికా

అందాలు అలలైన మందాకినీ, మందారమకరందరసవాహినీ
ఆమె చరణాలు అరుణకిరణాలు, ఆమె నయనాలు నీలగగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమ ఇల వంక!

అందాలే అలలుగా సాగే గంగాదేవి అనే పోలిక నాకు బాగా నచ్చింది. "మందారమకరంద" అనే సమాసం మరే కవి వాడినా నేను కోప్పడేవాడిని , "ఇది పోతనకే చెల్లుతుంది. దానిని ఎవరూ తిరిగి వాడటానికి అర్హులు కారు", అని. కానీ వేటూరి మొత్తం సంస్కృతంలో వ్రాసి నా నోటికి తాళం వేసేసాడు.

కృష్ణశాస్త్రి కవిత్వానికి ఏ మాత్రం తీసిపోలేదు నేను అన్నట్టుగా - తన కవిత్వంతో ప్రకృతిని ప్రతిష్టిమ్పజేసాడు. నది-అలలు, పువ్వు - తేనె, సూర్యుడు - కిరణాలు, గగనం - నీలం ఇలాగ ప్రకృతి సౌందర్యాన్ని వర్నించుకుంటూ వచ్చాడు. అయ్యింది కదా - జవ్వననికి ప్రాస ఏమి పెడతాడురా అనుకునే సమయానికి - బహుశా, "నీకు అంత అవకాశం ఇవ్వను. నా స్థాయి వేరే ఉంది", అన్నట్టు: "నైరుతి ఋతుపవనాలను", గుర్తు చేసాడు (చల్లని గాలులు). ఇక జాబిల్లిని ఎందుకు వదుల్తాను అంటూ - చిరునవ్వుతోనే విసిరాడు చిరప్రయోగం (ఎప్పటినుండో ఉన్న, ఎప్పటికీ ఉండిపోయే ప్రయోగం).

శృంగారరసరాజకల్లోలినీ, కార్తీకపూర్ణేందు కల్హారినీ
ఆమె అధరాలు ప్రణయమధురాలు, ఆమె చలనాలు శిల్పగమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందరసుఖతరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ!

ఇక్కడ మళ్ళీ సంస్కృతంలో చెడుగుడు. "శృంగారరసం ప్రవహించే మహానది", "కార్తీకపున్నమిలో కలువ", అంటూ తన ప్రియురాలిని ఉబ్బితబ్బిబ్బు చేసేసాడు. ఆమె పెదవులు మొహంతో నిండిన మధురాలు! ఆమె దర్శనం దొరికిన ప్రతిక్షణం అతని జన్మలో గుర్తుపెట్టుకోదగినంత గోప్పదిట! కనుచూపుతోనే ప్రేమలేఖలు వ్రాసేసి రాయబారాలు నడిపెస్తోందిట.

ఇలాటి పాట విన్న అమ్మాయి (తెలుగు పిల్ల ఐతే అనుకోండి) ఎవరైనా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నా నమ్మకం. అలాంటి పాటలు వేటూరి ఒకటో రెండో వ్రాయలేదు. అనేకానేకాలు వ్రాసాడు.

హడావుడిలో పడి రమేష్ నాయుడు గారిని మర్చిపోతే సరస్వతీ దేవి నన్ను క్షమించదు. (సరస్వతీ దేవి ప్రస్తావన తీసుకురావడానికి ఒక కారణం ఉంది - అది మళ్ళీ టప లో చెప్తాను). రమేష్ నాయుడు గారి సంగీతం లంగా-వోణీ వేసుకున్నతెలుగింటి పిల్లని గుర్తు చేస్తుంది!