Showing posts with label ధర్మం. Show all posts
Showing posts with label ధర్మం. Show all posts

Sunday, February 24, 2013

అమ్మవారి పైన కొన్ని పద్యాలు



ఎందుకో ఒక రోజు శారదాదేవిని తలుచుకుంటే ఈ పద్యం స్ఫురించింది. నాకు ఎంతగానో నచ్చిన పద్యాలలో ఇది ఒకటి. సంగీతం, సాహిత్యం అమ్మకు రెండు స్తనాలు అని పెద్దల ఉవాచ. అదే అమ్మ మళ్ళీ నా చేత చెప్పించింది. 

తోటకం
కలుషారికి మంగళకారిణికిన్
కలితామృతకావ్యవికాసినికిన్
కలకంఠికి శ్రావ్యసుగానఝరీ
జలదాయినికిన్ నమ (నతి) శారదకున్


అమ్మవారు మాయా. అంటే స్వతహాగా గుణాతీతమైన బ్రహ్మానికి రంగులు దిద్దిన శక్తి. ఆవిడ వలనే మనకు ఈ ప్రపంచం ఇన్ని హంగులతో కనిపించి ఆకర్షిస్తోంది. ఆవిడ తలుచుకుంటే ఈ చిక్కునుండి ఒక్క చిటికలో విడిపించగలదు. అలాగ చేస్తే మఱి సృష్టి ఎలాగ కొనసాగుతుంది?

మత్తేభం
తగునా ఈ నలుసంటి జీవి మదిలో దట్టంపు చీకట్లిలా
ఎగదోయన్? దిశ కానకున్నది గదా! ఏ వైపుకుంజూచినా
పగిలే నమ్మిక గాదు నాది జననీ, బ్రహ్మైక్యసంధాయినీ
దిగులొందన్ తిమిరాపహా! ఎరుగనే దీపాంధముల్ నీవుగా?

మత్తకోకిల
చెల్లు దాగుడుమూతలాడుట చిట్టిపాపడి ఖేలకున్
తల్లిగానక పాపయేడ్వగ తానుగా దరిఁజేరదే?
తల్లడిల్లితి నిన్నుఁజూడక దర్శనంబుకుఁ జాలనే?
ఒల్లకుంటివి నాదు ప్రార్థననొందవా దయ శంకరీ!

మన దేశంలో గొప్ప గొప్ప ఋషులు, మునులు, కవులు కూడా స్త్రీని ఎంత శృంగారవతిగా వర్ణించినా తల్లిగానే భావించారు. అది మన సంస్కృతి. రమణ మహర్షీ, రామకృష్ణ పరమహంస ప్రభృతులు వేశ్యలలో కూడా అమ్మవారిని చూసారు. అలాంటి ద్రష్టలు, మహానుభావులు నడిచిన ఈ దేశంలో స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాలను గురించి విన్నప్పుడల్లా మనసు రగిలిపోతుంది. మొన్న డిసంబర్లో ఢిల్లీ జరిగిన ఘోరాని గురించి విని వ్రాసిన పద్యాలు. 

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తహ్ ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

శంకరాచార్యుల సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోని తొలి రెండు పాదాలు ఇవు. వీటి భావం "అమ్మవారు లేకుండా శివుడు కొంచెం కూడా స్పందించలేడు" అని. ఈ భావానికి "శివాజ్ఞ లేక చీమైనా కదలదు" అనే నానుడికి కలిపి వ్రాసిన మొదటి రెండు పాదాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినవి. చివరి రెండు వాక్యాలలో కొమ్మ అనే పదంలో శ్లేష వేటూరి ప్రభావం.

ఆటవెలది

శివునియాజ్ఞ లేక చీమయు కదలదు
శక్తి లేక శివుడు జరుగలేడు
మగువ లేక జగతి మనలేదు క్షణమైన
ననిన ధర్మభూమి మనది గాదె?

అట్టి మాటలన్ని వట్టివాయెను నేడు
ఆడుదాని బ్రతుకు మోడు బారె
కామరోగులైరి కర్కోటకులునైరి
పుణ్యభూమిలోని పురుషులెల్ల

ఇట్టి మనుషులున్న మట్టిలో నే రీతి
సుఖము, శాంతి, కీర్తి, శొభలుండు?
అధములెల్ల జేరి యాధారమౌ కొమ్మ
నెంత క్రుంగదీయనంత హాని

తెలుగులో వెలది అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది. తత్ఫలితంగా ఆట-వెలది అంటే ఒక చెడ్డ అర్థం కూడా ఉంది. స్త్రీల పట్ల మన సంస్కృతికి ఉన్న గౌరవాన్ని ఆ పద్యరీతిలో చెప్పడం వలన ఆ అర్థం వ్యర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇదే విషయమై వేటూరి చేసిన ఒక చిన్న ప్రయోగం చెప్పాలి. "సిరికాకొలను చిన్నది" నాటికలో ఒకడు ఒక దేవదాసిని (కథానాయిక) చూసి "ఆ వెలది ఆట-వెలదా?" అంటాడు. దానికి మఱొకడు "ఆట-వెలదో కోవెలదో" అంటాడు. పరమాత్మ విగ్రహరూపుడై గుడిలో ఎలాగ కొలువుతీరతాడో, ప్రతి మనిషీ దేహరూపాన్ని ఒక స్త్రీ గర్భంలోనే పొందుతాడు. అందుకే ప్రతి స్త్రీ ఒక కోవెల వంటిది. ఈ మాట ఆమె నడవడి, వ్యక్తిత్వం, మంచి/చెడుకి సంబంధం లేకుండా వర్తిస్తుంది. దానికి రమణ మహర్షి వంటివారే నిదర్శనం. 

Saturday, August 20, 2011

మనిషికో రోగం, మనసుకో భోగం

ఆత్మబంధువు అనే అనువాదచిత్రంలో బహుశా రాజశ్రీ అనుకుంటాను ఒక పాట వ్రాశారు - "మనిషికో స్నేహం, మనసుకో దాహం" అని.ఈ రోజు ప్రపంచాన్ని చూస్తే దీన్ని "మనిషికో రోగం, మనసుకో భోగం" అని మార్చాలనిపిస్తోంది.

ప్రతి మనిషీ తనకో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. అందులో తప్పు లేదు. కొందరు దానికోసం రాత్రింబవళ్ళు శ్రమించి సాధించుకుంటే కొందరు సులభమార్గాలను వెతుక్కుంటారు. నేను బెంగుళూరులో పని చేస్తుండగా నా సహోద్యోగి ఒకాయన అన్నాడు, "Most people are ordinary, and that is by definition." అని. నాకు భలే నచ్చింది. నిజమే! సామాన్యం అనే పదానికి అర్థమే "అత్యధికంగా సంభవించే విషయం" అని. లేకపోతే అమెరికాలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళను విచిత్రంగానూ, మన దేశంలో అవైవాహికసహజీవనాన్ని (live-in relationship) విచిత్రంగానూ ఎందుకు చూస్తున్నారు? సరే, అది మఱొక సున్నితమైన విషయం కాబట్టి దాన్ని విడిచిపెడదాము.

ప్రతి మనిషికీ ఒక అభద్రతాభావం ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి తన చుట్టూ ఒక సమూహాన్ని (ఇల్లు, ఊరు, మొదలైనవి) ఏర్పరుచుకుంటాడు. ఆ సమూహం బలంగా ఉంటే తనూ బలంగా ఉంటాడని ఒక నమ్మకం. అది స్వార్థమా లేక ఔన్నత్యమా అన్నది ఎవరికిష్టమొచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చును.

ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్రబిందువు (central point) ఏమిటయ్యా అంటే, వివాదాస్పదమైన వ్యాఖ్యలతో, పనులతో ఈ రెండూ (తమ ఉనికి చాటుకోవడం, ఒక గుంపులో మెలగడం) సాధించుకునేవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది.  అంటే అభద్రత అనే రోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమకంటూ ఒక అవాస్తవిక అస్తిత్వాన్ని (false identity), పరపతిని ఏర్పరుచుకుని దాన్నే భోగంగా భావించే వారి గురించే ఈ వ్యాసం. వారి వాదనలోని మూర్ఖత్వాన్ని, అసంగతాన్ని (incoherence) వారికి ఎలాగ తెలియజేయాలో అర్థం కాదు. వారికి నిజం కంటే వారి డొల్ల-పునాదితో ఏర్పడిన అభిప్రాయాలే ముఖ్యం. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాము.

ఇటీవల Ace Ventura - The Pet Detective అనే చలనచిత్రాన్ని చూశాను. Jim Carrey నటించిన ఈ చిత్రం హాస్యరసభరితంగా ఉంటుంది అని విని, ఓపిగ్గా చూశాను. అప్పుడప్పుడు నవ్వు వచ్చింది, కొన్ని చోట్ల జుగుప్స కలిగింది. పతాకసన్నివేశంలో ఒక dolphin ని దొంగిలించినవాడు ఎవరో కాదు, ఆ ఫిర్యాదును పర్యవేక్షిస్తున్న ఆడ police ఏ నని తెలుస్తుంది. ఇదేమిటి ఆ వ్యక్తి ఇంతకీ వాడా, ఆమా౨ అన్న సందేహానికి సమాధానం -- రెండూను. అవును, ఆ వ్యక్తి ద్విలింగి (transgender). కథలో ఏడాగోడానికి (confusion) అదే మూలకారణం. దొంగిలించిన వ్యక్తి మగ అని కొన్ని ఆధారాలు, ఆడ అని కొన్ని ఆధారాలూ దొరికి చివరికి రెండూ అని తెలుసుకుంటాడు నాయకుడు. ఆ ద్విలింగిని శిక్షిస్తారు. ఇక్కడిదాక విషయం ఫరవాలేదు.

ఈ చలనచిత్రం చూసిన ద్విలింగులు, ఈ చిత్రం ద్విలింగుల పట్ల దుగ్ధతో తీసినదని, ద్విలింగులను తప్పుడు కోణంలో చూపించిందని గొడవకు దిగారు. అయ్యా, ఒక ప్రశ్న: ద్విలింగులని వేఱుగా/వింతగా చూస్తే, "మమ్మల్ని వెలివేస్తున్నారు, మాకు సమానమైన హక్కులు, హోదా కావాలి", అని ధర్నాలకు దిగుతున్నారు. నిజంగా మీ మనసులో సమానభావం ఉంటే, తమరు ద్విలింగులు అనే అభద్రతాభావం లేకుంటే; ఒకవేళ ద్విలింగులు, ఏకలింగులూ సమానం అనే దృక్కోణానికి సమాజం అలవాటు పడి; తరతరాలుగా స్త్రీలనో, పురుషులనో చెడ్డవారిగా చూపించిన చిత్రాలను అన్నిటినీ నిషేధించాలని ఒక ఆరువందలకోట్ల ఆడవారు, మగవారు కూడా ధర్నాకు దిగి, మీరు కూడా వారికి మద్దతును తెలపాలి అంటే ఏం చేస్తారు?

 కథ అన్న తఱువాత మంచిని, చెడుని కొందరు మనుషుల రూపేణ చూపించడం అన్ని సంస్కృతులలోనూ ఉన్న విషయమే కదా? ఎవరికి వారు "మమ్మల్ని తక్కువగా చూపిస్తున్నారు" అంటే ఎలాగ?

హమ్మయ్య, అందరు NRIల లాగా నేను మొదట జన్మభూమిని అవమానించలేదు. ఆ పాఙ్తేయం (fashion?), పైత్యం నాకు ఇంకా వంటబట్టలేదు అనుకుంటాను. సరే, ఇకనైన మన దేశాన్ని విమర్శించకపోతే నన్ను NRIలు అందరూ అపాఙ్తేయుణ్ణని వెలివేస్తారు కాబట్టి ఒకసారి భారతదేశం కేసి చూద్దాము.

మన దేశంలో ఆరక్షణ (reservation) చట్టాలు విస్తృతమౌతున్న దశలో నాకో సందేహం. మొదట ఒక విషయం మాత్రం తేటతెల్లం చెయ్యాలి -- దళితులకు అన్యాయం జరిగింది, అవమానం కలిగింది. దీనిలో సందేహం ఏమాత్రం లేదు. వారికి కొంతవరకు, కొన్నాళ్ళు ఆరక్షణ కల్పించడం కూడా సబబే! నా సమస్య అది కాదు. సందేహం ఏమిటయ్యా అంటే లోక్పాల్ చట్టానికి మీకూ సంబంధం ఏమిటి అని. లోక్పాల్ మనువాది ఉద్యమం అని, ఊర్ధ్వకులాల కుట్ర అని వాపోతున్న మహాధ్యాపకులు (professors?) ఆ సంబంధాన్ని సశాస్త్రీయంగా, తర్కించి విశదీకరిస్తే బాగుంటుంది. లోక్పాల్ లో ఎక్కడైనా దళితులు ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించక్కరలేదు అని ఉందా? పోనీ, దళిత సంఘాల్లో జరిగే కుంభకోణాలను, రంభకోణాలను (సహస్రావధాని గరికపాటి వారి పాదలాకు మ్రొక్కుతూ ఈ ప్రయోగాన్ని తస్కరించాను :) ) మొదట/ఆఖర వెదకాలని ఏమినా ప్రత్యేకించి ఒక వాక్యం ఉందా? ఓహోహో రాజ్యాంగం వ్రాసిన అంబేద్కర్ దళితుడా? ఆ రాజ్యాంగాన్ని గాంధీ స్ఫూర్తితో మారుస్తున్న హజారే దుష్టుడా? సరే. మీకు ఇప్పుడు ఇంకో చిక్కు ప్రశ్న.

మన దేశంలో స్వలింగసంపర్కం క్రూరమైన దుష్చర్యగా (criminal offense) నిర్ణయించిన మహానుభావుడు ఎవరయ్యా? అంబేద్కరే కదా? నవీనకులతత్త్వానికి (modern casteism) నిర్వచనం ఏమిటి? ఒకడు పుట్టిన పరిస్థితులని బట్టి వాడి జీవితంలో ఏదైనా చేసి తీరాలి, చెయ్యకూడదు అని చెప్పడం తప్పు అనే కదా? అంటే దళితుడైతే ఎవరినీ ముట్టుకోకూడదనో, బ్రాహ్మడైతే అందరూ కాళ్ళ మీద పడాలనో అంటే ఎందుకు తప్పు? వాడు పుట్టిన కుటుంబాన్ని బట్టి వాడికి గౌరవాన్నో, అవమానాన్నో కల్పించడం అహేతుకం అనేనా? సరేనయ్యా. మరి మగవాడిగా పుడితే ఆడదాన్నే కామించాలని ఎవరు నిర్ణయించారట? దేవుడెక్కడైనా చీటి వ్రాసిపెట్టాడా? మఱి గబ్బిలాల్లో స్వలింగసంపర్కుల సంఖ్య ఎక్కువగా ఉంది, వాటికి ఏ గ్రుడ్డిగుహలోనో చీటీ చదువుకోవడం వీలు కావట్లేదు అనుకుంటాను. వెటకారం అటుంచితే, మఱొక సందేహం. ఇప్పుడు దళిత స్వలింగసంపర్కులు అంబేద్కర్ ని పొగడాలా? తిట్టాలా? అమ్మో, జటిలప్రశ్నే. సరే నేను దళితుణ్ణీ కాదు, స్వలింగసంపర్కుణ్ణీ కాదు - అందుచేత నేను ఏమీ వ్యాఖ్యానించను. (ఈ వాక్యం కూడా దట్టపరిచెయ్యాలని (bold) ఎందుకో మనసు పీకుతోంది :) )

ఎవరండక్కడ? ఏమిటి? అంబేద్కర్ ఉపవాసాలు మొదలైనవాటిని నిషేధించాడా? మఱి ధర్నాలు ప్రోత్సహించాడా? దండోరాలు, రాస్తా రోకోలూ ప్రబోధించాడా? సరే అదీ వదిలెయ్యండి.

అయ్యా, మీరు మహాధ్యాపకులు, తాత్వికులు కదా. ఇప్పుడు మఱొక ప్రశ్న. మీరు దళితులు అంటూనే కిరస్తానీలు అంటున్నారు. నాకు అద్వైతం మీద గురి కావడం చేత సోదరులైన కిరస్తానీయులపైన ఏమీ దురభిమానం లేదు. ఐతే దళితులు చాలా మంది క్రైస్తవాన్ని పుచ్చుకుని హైందవాన్ని దూషిస్తున్న పరిస్థితుల్లో నాదొక ప్రశ్న -- క్రైస్తవులు తరతరాలుగా నల్లవారిని (అదే నీగ్రోలు అని కొందరు పిలిస్తూ ఉంటారు) కించపరుస్తూ, వారిని బానిసలుగా తిప్పుకున్నారు. మరి మీకు వారిలో కులోన్మాదం ఉంది అనిపించట్లేదా?

పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఏం తెలుసని వ్యాఖ్యానిస్తున్నారో కానీ, మీరు వ్యాధగీత (వ్యాధుడు అంటే బోయవాడు - నికార్సైన దళితుడు) గురించి తెలుసునో లేదో. భగవద్గీత లాగానే భారతంలో ఒక బోయవాడు తపస్వికి చేసిన జ్ఞానబోధ గురించి ఉంది. అంటే (జ్ఞానం ఉన్న) యాదవుడైన కృష్ణుడు, శూద్రుడైన వ్యాధుడు కూడా పొగరుబోతు బ్రాహ్మడి కంటే గొప్పవారని చెప్తోంది మన సంస్కృతి. అయ్యో వ్యాసం ప్రవచనం అయిపోతోంది. క్షమించాలి.

అబ్బెబ్బే, ఈ రోజు నాకేదో ఐంది, ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వివాదాస్పదప్రశ్నావళికి ఇంక ముగింపు పెట్టి మఱొక ఉదాహరణ చూద్దాము.

ఎంత అద్వైతిని ఐనా పొరుగువాడిని నిందించకపోతే ఈ వెధవ జన్మకు నిద్ర పట్టేలా లేదు. ఈ సారి తమిళనాస్తికమిత్రులకు కొన్ని ప్రశ్నలు. కొందరు ద్రవిడకళగభజనాతత్పరులు రావణుడిని పూజించడం మొదలెట్టారు. అదేమిటి అంటే "రాముడు ఆర్యుడు, ఆయన ఎక్కడో వాయవ్యమ్నుండి వచ్చాడు. అమాయకుడైన మా రావణుణ్ణి, ద్రవిడులని అవ్యాజమైన కక్షతో చంపివేశాడు" అంటున్నారు. అబ్బబ్బ, మళ్ళీ ప్రశ్నావళి.

రావణ అనే శబ్దమే సంస్కృతపదం. ఆయన అనేకశాస్త్రాలలో పండితుడని రామాయణం చెప్తోంది. బ్రహ్మకు, ఆయనకు బంధుత్వాన్ని సూచిస్తోంది. ఆయన మహాశివభక్తుడు, రాముడు కూడా సైకితలింగాన్ని నిర్మించాడు. మఱి ఒకరు ఆర్యుడు అయ్యి, మఱొకరు వేరే జాతి ఎందుకు అయ్యారు? వదిలెయ్యండి.

దక్షిణభారతంలోని వారిని కించపరచడానికే వారిని కోతులుగా, రాక్షసులుగా చూపించారని అంటారా? సరే, "హనుమంతుడు చక్కనైన సంస్కృతభాష మాట్లాడుతున్నాడు. ఇలాంటివాడు మనకు తోడుంటే ఎవరినైనా జయించవచ్చును", అని రాముడన్నది దక్షిణభారతీయుడైన హనుమంతుణ్ణే. సోదరసమానుడిగా భావించి గౌరవించిన విభీషణుడు రాక్షసుడే. పతివ్రతగా పరిగణించబడిన మండోదరి కూడా...ఆఁయ్. ఉన్నట్టుండి వీరందరూ మీకు దగ్గర బంధువులు, రాముడికి శత్రువులు ఎలాగయ్యారయ్యా? ఆర్య అయిన కైకని చెడ్డదానిగా ఎందుకు చిత్రీకరించారో? మంథరను ద్రవిడదుర్మతిగా చూపిస్తే కథ ఇంకా రక్తి కట్టేదేమో? అక్కడ నీతి -- వానరుడైనా, మనిషి అయినా, రాక్షసుడైనా, మగైనా, ఆడైనా మనిషి నడవడిని బట్టే గౌరవించాలని. ద్రవిడుడోయంటూ కరుణానిధికి పట్టం కట్టారు. ఏమైంది? ఏ రంగు పూసినా బల్లి బల్లి కాక ఊసరవెల్లి అవుతుందా?

ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలా గుర్తొస్తున్నాయి. కానీ, వ్యాసం చదివేవారికి వేఱే వ్యాసంగాలు (vocation) కూడా ఉంటాయి కదా. ఇక్కడితో ఆపుతున్నాను. కాకపోతే ఒక చిన్న నివృత్తితో.

మనిషిని మనిషిగా గుర్తించాలి, అతనిలో మంచిచెడులను విశ్లేషించాలి, తదనుసారం గౌరవించాలి. గుంపుతనం (mob-mentality), కఱుడుఁగట్టిన అభిప్రాయాలు, వితండవాదాలు, అకార్మికంగా కీర్తిని, డబ్బుని, ఆశించడం, సంచలనప్రియత్వం, బహుమతాన్ని (majority) వ్యతిరేకించి గొప్ప అనుకోవడం ఇవన్నీ అభద్రతకు, హృదయదౌర్బల్యానికి సూచనలు. మనిషి ప్రేమించాల్సింది నిజాన్ని. 


వ్యాసంలో ఎక్కడబడితే అక్కడ కొత్తకొత్త తెలుగు/సంస్కృత పదాలను సృష్టించాను. తప్పులుంటే మన్నించగలరు, సవరించగలరు అని మనవి.

Wednesday, July 27, 2011

రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

Wednesday, July 20, 2011

మహాభారతంలో యజోపయజుల కథ

(వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథపర్వంలో ఈ కథ కనబడుతుంది. దీన్ని ఆంగ్ళంలో ఇక్కడ చదువవచ్చును, సంస్కృతంలో ఇక్కడ చదువవచ్చును.)

ద్రోణుడి చేతులో పరాభవం పొందిన ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుడిపైన పగ తీర్చుకోవాలనే తపనతో దానికి కావలసిన యోగబలం పొందడం కోసం యజ్ఞయాగాదులు తెలిసిన గొప్ప బ్రాహ్మణుల కోసం వెదుకసాగాడు. యమునా, గంగాతీరాలలో వెదుకుతూ ఉండగా ఒకానొక ఆశ్రమంలో కశ్యపుడి వంశంలో జన్మించిన యజుడు, ఉపయజుడు అనే ఇద్దరు బ్రాహ్మలను చూశాడు. వారు ఇద్దరూ ఎంతో గొప్ప తపోబలం కలిగినవారని తెలుసుకుని వారికి సేవలు చేయనారంభించాడు. వారిరువురిలో తమ్ముడే గొప్పవాడని నిర్ణయించుకుని ఉపయజుడితో, "ద్రోణుడు నాకు కలుగజేసిన అవమానానికి ప్రతీకారంగా అతడిని వధించగలిగే ఒక పుత్రుడు నాకు కలిగే విధంగా ఏమైనా యజ్ఞం చేస్తే మీకు 10,000 గోవులను ఇస్తాను", అన్నాడు. మహాజ్ఞాని అయిన ఉపయజుడు "ద్రుపద, ఇటువంటి చెడు ఉద్దేశాలతో నేను పవిత్రమైన యజ్ఞాలను చేయలేను", అన్నాడు.

అయినా పట్టు వదలకుండా ద్రుపదుడు ఉపయజుణ్ణి మఱొక సంవత్సరం సేవిస్తాడు. అప్పుడు ఉపయజుడు అతడితో, "ద్రుపద, ఒక రోజు అడవిలో సంచరిస్తుండగా నా అన్న యజుడు మలినమయమైన నేల పైన రాలిన ఒక పండుని తీసుకుని సేవించడం నేను చూశాను. జ్ఞానం కలిగినవాడై కూడా అందులో అతనికి ఏమీ తప్పు తోచలేదు. ఒక చోట మలినాన్ని పట్టించుకోనివాడు, మిగతా అన్ని చోట్లా పట్టించుకుంటాడు అని అనుకోలేము. ఇంతకు ముందు మా గురువు గారి వద్దనుండగా అతడు గురుకులంలోని మిగతావారు విడిచిపెట్టిన తినుబండారాలను తినడం నేను చూశాను. అతడికి నచ్చని తిండి గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. తిండి పట్ల ఇంత యావ ఉన్నవాడికి తప్పక ఐహికమైన వాంఛలు బలీయమైనవయి ఉంటాయి. కనుక నీకు కావలసిన యజ్ఞం అతడు చేస్తాడు అని అనిపిస్తోంది", అన్నాడు.

ఉపయజుని అంత గొప్పవాడు కాడని అనుకున్నా, ద్రుపదుడు యజుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు, "గురువర్యా, మీరు నా కోసం ఒక యజ్ఞం చేసినట్టైతే మీకు 80,000 గోవులని ఇస్తాను. ద్రోణుడు చేసిన అవమానం నన్ను దహించివేస్తోంది. బ్రహ్మాస్త్రం సంపాదించిన అతడు మఱో పరశురాముని వలే తన బ్రహ్మతేజంతో క్షత్రియుల నాశనాన్ని తలబెడుతున్నాడు. నా దగ్గర క్షత్రియశక్తి ఉన్నప్పటికీ, అతడిని అడ్డుకొనే బ్రహ్మతేజం లేదు. కానీ, మీరు అతని కంటే గొప్ప బ్రహ్మజ్ఞాని. మీరు తప్పక ఈ యజ్ఞాన్ని జరిపి నాకు బ్రహ్మశక్తిని కూడా జత చేయగలరు.". యజుడు యజ్ఞం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

యజుడు ఈ యజ్ఞం చాలా కష్టమైనది అని గ్రహించి, ఉపయజుడి సహాయం కూడా అడుగుతాడు. ఉపయజుడు ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. వారిద్దరూ కలిసి జరిపిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వారికి నామకరణం కూడా యజుడే చేశాడు. (నిజానికి, ద్రౌపది నల్లగా ఉండటం చేత ఆమెకు "కృష్ణా" అనే పేరు పెట్టారు. కానీ, ద్రుపద రాజు కూతురు కావడం చేత ఆమెను ఎక్కువగా ద్రౌపది అని సంబోధించడం చూస్తున్నాము.) ద్రుపదుడు ఎంతో సంతోషించి యజుడికి తాను మాటిచ్చినట్టుగా అనేక గోవులను దానం చేసి సత్కరించాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్ళంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది.

Monday, July 18, 2011

జంతువు - దైవం

ఇటీవల ఒక గూగుల్ సమూహంలో ఒక కథ చదివాను. ఇది R.K. Narayan రచించిన A tiger of Malgudi అనే పుస్తకం లోనిదని చెప్పారు. ఆ కథ నాలో నిద్రాణమైన ప్రశ్నలని కొన్నింటిని మేలుకొల్పింది. ఆ కథ నేను అసలు పుస్తకం నుండి చదవలేదు కనుక నా మాటల్లో, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. మూలకథకుని మాటల్లో వింటే ఇంకా బాగుంటుందనడంలో ఏమీ సందేహం లేదు.

ఒక పులి ఒక సాధువుని కలిసిందిట. ఆ సాధువు పులికి దేవుడి గురించి బోధ చేశాడట. "దేవుడంటే అద్వితీయమైన శక్తి కలవాడు, ఆయన కనుసన్నలలోనే మనమందరం మెలుగుతున్నాము, ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది", ఇలాగ కొంచెం లోతుగా వర్ణించి చెప్పాడట. ఆ పులికి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆశ్చర్యం నిండిన కన్నులతో చూడసాగిందట. అలాగ కాసేపు వర్ణించిన తరువాత ఆ సాధువు, పులిని "నేను చెప్పినదాన్ని బట్టి దేవుడు ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు?", అని అడిగాడట. అప్పుడు ఆ పులి, "దేవుడు చాలా పెద్ద ఆకారం కలిగిన పులి. ఆయన తోకతో భూమిని మొత్తం చుట్టేయగలడు. ఆయన ఒక్క చూపు చూస్తే అన్ని జంతువులూ భయపడిపోతాయి.", అంటూ చెప్పుకొచ్చిందట. కథ అంతే.

కథలోని నీతి ఏమిటయ్యా అంటే, మనుషులు ఏ విధంగా దేవుడు మనిషే అయ్యి ఉంటాడు అనుకుంటున్నారో, అదే విధంగా మిగతా జీవులు కూడా దేవుడిని నమ్మితే తమ లాగే ఉంటాడు అనుకుంటాయి/అనుకోవాలి కదా? సరే, ఇప్పుడు ఇంకొక కథ విందాం. దీనికి ఆధారం నాకు తెలియదు కానీ, ఇది చైనా/భారతదేశాలలో ప్రచారంలో ఉన్న కథే.

ఒక రోజు ఒక మహర్షి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక గాయపడిన ఎలుక మూలుగుతూ కనబడిందట. ఆ మహర్షి ఆ ఎలుకని చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకోసాగాడట. మహర్షికి ఆ ఎలుక అంటే విపరీతమైన అభిమానం ఏర్పడి, ఆ ఎలుకను తన కూతురుగా భావించసాగాడు. ఒకానొక రోజు ఆ మహర్షికి ఎలుక పెళ్ళీడుకి వచ్చింది అనిపించింది. ఆ ఎలుకకు తగిన భర్త కోసం అన్వేషించసాగాడు.

ఒక రోజు ఉదయం స్నానం తరువాత సూర్యుడికి నమస్కరించుకుంటూండగా ఆయనకు, "సూర్యుడి కంటే అందగాడు, సులక్షణసంపన్నుడు ఎవరుంటారు? ఈతడే నాకు అల్లుడు కాదగ్గవాడు", అనుకుని వెంటనే తన తపోబలంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తాడు. సూర్యుడు కంగారుగా ప్రత్యక్షమయ్యి విషయం కనుక్కుంటాడు. కనుక్కున్నాక ఖంగు తిని, "ఇదెక్కడి చిక్కురా బాబు, మరీ సూర్యుడి భార్య ఎలుక అంటే ఎలాగ?" అనుకుంటాడు. కొంచెం ఆలోచించి, "మహర్షీ, నాకు నీ కుమార్తెను పెళ్ళి చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఒక్క సారి ఆలోచించు. నేను ఎంత తేజోసంపన్నుణ్ణైనా, మబ్బు వస్తే మసిబారిపోతాను. నా కంటే మబ్బులే శక్తివంతాలు. అందుచేత నువ్వు వరుణుణ్ణి సంప్రతించు", అని అంతర్ధానమవుతాడు.

మహర్షి ఆయన తపోబలాన్ని మళ్ళీ ఉపయోగించి ఈ సారి వరుణుణ్ణి రప్పిస్తాడు. ఆయన కూడా కాసేపు ఆలోచించి, "మహర్షీ, నీకు అల్లుడవ్వడం నా అదృష్టమే. కానీ, నీకు అల్లుడు కాదగిన వాడు వాయువు. ఎందుకంటే నేను ఎంత బలవంతుణ్ణైనా స్వతంత్రుణ్ణి కాను. వాయువు నన్ను ఎటు నడిపిస్తే అటు పోతాను. అందుచేత నువ్వు వాయువుని అల్లుణ్ణి చేసుకుంటే బాగుంటుంది", అంటాడు. మహర్షికి ఉన్నపాటుగా హనుమంతుడు, భీముడు మొదలైనవారి బలానికి మూలమైన వాయువు పట్ల మక్కువ పెరిగుతుంది.

ఈ సారి వాయువుని ఆహ్వానిస్తాడు. వాయువు ప్రత్యక్షమయ్యి, కాసేపు తలగోక్కుని, "మహర్షీ, నాకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకోవాలనే ఉంది", అనగానే మహర్షి చిఱాకు పడుతూ, "మఱి ఇంకేమిటి?" అంటాడు. వాయువు, "నేను ఎంత బలవంతుణ్ణైనా కొండలను కదిలించగలనా? అందుకే కదా అవి అచలాలైనాయి? అందుచేత నీకు తగిన అల్లుడు హిమవంతుడని నా అభిప్రాయం.", అంటాడు. ఆలోచిస్తే మహర్షికి అదీ నిజమేననిపించి వాయువుకు సెలవు ఇస్తాడు.

సరే, ఈ సారి ఏదేమైనా సరే హిమవంతుడితో ఎలుకకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకుని హిమవంతుణ్ణి పిలుస్తాడు. ఆయన ఆలోచించి "మహర్షీ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ పిలుపు విని దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు అంటే వారందరికంటే నీవే బలవంతుడవని విదితమౌతోంది. నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం నా భాగ్యం గా భావిస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి అని నువ్వు అనుకోవడం నా అదృష్టం. ఐతే నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎంత బలవంతుణ్ణైనా నన్ను తొలిచేయగల సామర్థ్యం ఒక్క ఎలుకకే ఉంది. అందుచేత నీ మూషికానికి మఱొక మూషికాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది", అని మాయమౌతాడు. ఇది విన్న మహర్షికి ఒక్క సారి వివేకం మేల్కొని, "ఏమిటి నా ఈ ప్రయాస, ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు ఇంత ప్రాకులాడాను?", అని విచారించి, ఆ ఎలుకని మఱొక ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే మనకు ప్రేమ ఉంది కదా అని, మన దృష్టిలో శ్రేష్ఠమైనదాన్ని మనకు ప్రియమైనవారికి తగిలించాలని చూడకూడదు, వారికి ఏది సరిపోతుందో, నచ్చుతుందో అదే ఇవ్వాలి. అంతర్లీనంగా ఉన్న మఱొక నీతి ఏమిటంటే ఏ జీవి గొప్పదనం దానిది. ఏదీ మఱొక దాన్ని కంటే సంపూర్ణంగా ఉన్నతం కాదు.

మొదటి కథకి రెండొ కథకి మధ్యన పెద్ద పొంతన ఏమీ లేదు కానీ, మనిషి జంతువు దృష్ట్యా కూడా ఒక్కసారి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడేమోననే నా అభిప్రాయానికి ఇవి బలాన్ని చేకూరుస్తాయి. సకలచరాచరసృష్టిలో పరమాత్ముడు లేని విషయం ఏముంది? అలాంటప్పుడు ఒక జీవి ఎక్కువ, మఱొక జీవి తక్కువ అనుకుంటే మనకు దైవం అర్థం కానట్టే కదా?

Thursday, January 20, 2011

కిట్టు కథలు - పెళ్ళికానుకలు


అసలు పెళ్ళి అనగానే అందరికీ గుర్తొచ్చేవి షరామామూలే. కిట్టుకు మటుక్కు, పెళ్ళి హడావుడి కంటే పెళ్ళయ్యాక జరిగే ఒక తంతు మాత్రం మహాముచ్చటగా అనిపిస్తుంది. హన్నన్నా - తప్పుగా అనుకోకండి! నేనంటున్నది పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ వచ్చే బహుమతులను తెరిచి చూస్తూ ఉండటం గురించి. ఇది అంటే కిట్టుకు ఒక అది కలగడానికి కారణం తన మేనమామ కొడుకు పెళ్ళి లో ఎదురైన ఒక అనుభవం. ఆ పెళ్ళి జరుగుతున్నంత సేపూ కిట్టు వాళ్ళ తాతయ్యగారి (మాతామహుడు) పక్కనే ఉన్నాడు. పెళ్ళయ్యాక ఎవరి గొడవలో వాళ్ళుండగా తాతయ్య కిట్టును పిలిచి, "ఒరేయ్, వెళ్ళి ఆ బహుమతులబుట్ట పట్టుకురా అన్నారు" (పెళ్ళికూతురిని తీసుకురావడానికి వాడే బుట్ట తరువాత బహుమతులబుట్ట అవుతుందిలెండి). సరే అని కిట్టు నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున అన్నీ తీసుకుని వచ్చాడు. తాతయ్య ఆయన పడకగదిలో పడకకుర్చీలో వెనక్కి ఆనుకొని ఆ కుర్చీ చేతుల మీద ఒక కాగితం పెట్టి, కలంతో "శ్రీరామ" వ్రాశారు. "ఈ సారి ఒక్కోటీ తీసి ఏముందో చూసి నాకు లెక్క చెప్పు", అన్నారు. కిట్టు మొదలెట్టబోతుంటే, "ఆగు, చిన్న చిన్న coverలన్నీ మొదట తెరిచి చూడు", అన్నారు. సరేనని కిట్టు ఒకటి తెరిచాడు - అందులో నూటపదహార్లున్నాయి. ఆ cover పైన ఉన్న పేరు, సంఖ్య చెప్తే తాతయ్య నెమ్మదిగా ఎక్కించుకుంటున్నారు. ఇలాగ కొంతసేపు సాగింది.

అప్పటికీ cover పట్టుకోగానే అందులో ఎంత ఉందో తెలిసిపోతోంది కిట్టుకు. cover లు చింపడం మీద మిగులు ఆత్మవిశ్వాసం కలిగి పరపరా చింపేస్తున్నాడు. ఒక్క నిముషం తాతయ్య కాగితం మీద దృష్టి కిట్టు చేతుల మీదకు మరల్చారు. వెంటనే కిట్టుకు అర్థమైంది ఏదో తప్పు జరుగుతోంది అని. తాతయ్య కిట్టుకేసి చూసి - "నువ్వు ఒక పది నోటైనా చింపకుండా ఈ రోజు మన లెక్క తేలదుర", అన్నారు. "ఛఛ! తాతయ్యది చాదస్తం. ఇంకా నేను పదో తఱగతి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను software-engineerని", అనుకుని - "అబ్బే లేదు తాతయ్య", అని ఒక వెకిలి నవ్వు నవ్వి తప్పించుకున్నాడో లేదో అదే జరిగిపోయింది. తిడతారు ఏమో అనుకుని బేల మొహం వేసుకుని, నాలుక కరుచుకుంటూ - "తాతయ్యా...", అన్నాడు. ఆయన తల తిప్పకుండా, "చెప్పానా - సరే అది మీ పెద్దన్నయ్యకి ఇవ్వు - వాడి bank లో మార్చుకుని తీసుకొస్తాడు", అన్నారు. "ఓహో, ఇంకా నోటు చిరక్కుండానే నోటు చిరిగితే ఏం చెయ్యాలో ఆలోచించారు అన్నమాట", అనుకుని ముక్కున వేలేసుకున్నాడు కిట్టు. మఱి ముప్పై పెళ్ళిళ్ళు చేయించిన అనుభవం తాతయ్యది, మొదటిసారి పెళ్ళిని విహంగవీక్షణంగా కాకుండా వియ్యాలవారి పక్షంగా చూస్తున్న శైశవం కిట్టుది.

ఇంతలో ఒక cover చాలా బరువుగా ఉంది - తెరిచి చూశాడు. అందులో పదివేలు ఱొక్కం ఉంది. కిట్టు నివ్వెరపోయాడు. దాన్ని తాతయ్యగారికి చూపించాడు. తాతయ్య కుర్చీలోంచి ముందుకు వంగి  "అబ్బో, ఎవర్రోయ్" అన్నారు. కిట్టు పేరు చదవగానే, "ఓహో, వాడా!", అన్నారు. ఇంతలో coffee ఇవ్వడానికి గదిలోకి కిట్టు మేనత్త భార్యకు (పెళ్ళికొడుకు తల్లి) అది చూస్తూనే ముఖం వెలిగిపోయింది. కిట్టు తాతయ్య ఒక చిరునవ్వు నవ్వి, "వీడు 1990లో దివాళా తీశాడురా. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు - నాకు వాడి నిజాయతీ,వ్యాపరమెలకువల మీద నమ్మకం ఉంది. blank-cheque వ్రాశిచ్చి 'నువ్వెప్పడికైనా గొప్పవ్యాపారస్థుడవౌతావురా' అని చెప్పి ఇచ్చాను. వాడు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని వెళ్ళాడు. నా నమ్మకం ఋజువైంది - వాడు మళ్ళీ పోయిందంతా సంపాదించుకున్నాడు. అందుకే ఇలాగ వాడి కృతజ్ఞతను చెప్పుకుంటున్నాడు", అన్నారు. ఆ రోజుకు కిట్టు తాతయ్య దగ్గరనుండి నేర్చుకోవలసిన పాఠం నేర్చుకున్నాను. ఇంకేదొచ్చినా అదనమే. ఒక్కసారి ఆయన కోడలి వైపు చూసి "వాడికి ఆ cheque ఇచ్చిన రోజు నువ్వేమన్నావే అమ్మాయి?", అన్నారు. ఆవిడ ముఖం ఇంకా సంతోషం నుండి తేరుకోలేదు. "ఊ", అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. "ఈ సారి వాళ్ళు ఇంటికి వస్తే పింగాణీ glassలో పరమాన్నం పెడుతుంది మీ అత్తయ్య", తాతయ్య అన్నారు నవ్వుతూ.

"coverలన్నీ అయిపోయాయి తాతయ్య", అన్నాడు కిట్టు. "ఈ సారేం...చిన్నచిన్న డబ్బలతో ఉన్న gift-packలు తెరువు. అరచేతిలో పట్టాలి", అన్నారు. ఆయన కాగితంలోకి తొంగి చూశాడు కిట్టు - ఆయన రెండు అడ్డగీతలు గీసి ఇదివరకు చెప్పిన సంఖ్యల మొత్తాన్ని అక్కడ వ్రాశారు. కిట్టు జాగ్రత్తగా gift-packలు తెరుస్తూ ఉన్నాడు. మొదటిదాంట్లో ఒక వెండి కుంకంభరిణ ఉంది. అది చూస్తూనే తాతయ్య "right, ఊహించాను", అన్నారు. నెమ్మదిగా, అలాంటివాటిల్లో కిట్టు నాలుగు భరిణలు ఉండే పసుపుకుంకుమల stand, చిన్న చిన్న దేవతావిగ్రహాలు మొదలైనవి చూశాడు. ఇక అలాంటివి లేవు. మఱికొంచెం పెద్దవి వచ్చాయి. తాతయ్య ఈ విషయం గమనించి ఒక దాన్ని చూసి, "ఏమిటి బాబూ, వినాయకుడి ప్రతిమా?" అని అడిగారు. తెరిచి చూస్తే అదే. "సరే, అది జాగ్రత్తగా ఆ packలోనే ఉంచేయ్. ఇప్పటికే ఇంటినిండా అవే ఉన్నాయి.", అన్నారు. ఈ సారి ఒక పుస్తకం పరిమాణంలో ఒక pack ఉంది. అది కూడా చూస్తూ, "శాయీ బాబా పటమో, photo-frame ఓ అయ్యి ఉంటుంది", అన్నారు. అది దేవత చిత్రం కలిగిన ఒక photo-frame. ఇంక మరికొద్ది పెద్దవి వచ్చేసరికి, "ఇది hot-pack అయ్యుంటుంది, ఇది cup-saucer pack అయ్యుంటుంది", అని అన్నీ చెప్పేస్తూనే ఉన్నారు. కిట్టు ఇంక packetలు తెరవడం కంటే తాతయ్య చెప్పినదాన్ని బట్టి, అది తెరవకుండా వేరే పెళ్ళిళ్ళకు పేరు మార్చి ఇచ్చెయ్యవచ్చు అని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి అన్నీ పూర్తయ్యాక, పెద్దపెద్ద వస్తువులని అటక మీదకు చేర్చేదాక తాతయ్య పని చెప్పారు. మధ్యలో మళ్ళీ కిట్టువాళ్ళ అత్త వచ్చింది. "అమ్మాయి, నీ మేనల్లుడు చాలా కష్టపడ్డాడు, ఒక coffee పట్టుకురా", అన్నారు.

అంతా బానే ఉంది కానీ, కిట్టుకు ఒక సందేహం కలిగింది. తాతయ్య ఇంత ధనవంతులు కదా, స్వశక్తి మీద నమ్మకం కలిగిన వ్యక్తి కదా - మఱి కట్నం ఎందుకు తీసుకున్నారు? అని ఆ అనుమానం. "ఇంకేమిటి నాన్న, సంగతులు?", అన్నారు తాతయ్య. "తాతయ్యా, మీరు కట్నం తీసుకున్నారా?", అని అడిగాడు కిట్టు. "నా పెళ్ళి సమయానికి మేము చాలా బీదవాళ్ళం. కట్నం అడిగితే మీ అమ్మమ్మే - 'నీ మొహానికి నేనే ఎక్కువ!' అనేసేదిరా. ఐనా మా మాఁవగారి దగ్గరా డబ్బులేదురా. జోగీ జోగీ పూసుకుంటే బూడిద రాలింది అన్నట్టు", అని నవ్వారు. కిట్టు కూడా నవ్వి, "మఱి మావయ్య పెళ్ళికి?", అని ప్రశ్నను కొనసాగించాడు. "లేదు నాన్న. నాకు ఎవరి సొమ్మూ వద్దు. నేను కట్నం కావలన్నాను అనుకో, వాడెవడో కూతురు పెళ్ళికోసం బల్లలకింద చేతులు పెట్టో, వ్యాపారంలో మోసం చేసో, అప్పు చేసిన దుఃఖంతోనో ఆ డబ్బు తీసుకొచ్చి నా బిడ్డకు ఇస్తాడు. అది వాడికి క్షేమం కాదు. అయినా సమర్థత ఉన్నవాడికి పరాయివాడి సొమ్మెందుకురా", అన్నారు. కిట్టుకు సంతోషం కలిగింది. "మఱి ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు?", అన్నాడు కిట్టు. గట్టిగా నవ్వారు తాతయ్య. "నాన్న, నీకు ఇక్కడ ఒక సూక్ష్మం తెలియదురా", అన్నారు. ఆగి, లేచి నిలుచుండి డబ్బాలోంచి చుట్ట తీసి గోడకేసి చూస్తూ fan ఆపమని సైగ చేశారు. కిట్టు ఆ పని చేస్తూ, తాతయ్యకేసి చూశాడు. ఒక్కసారి బలంగా పొగ పీల్చి, నెమ్మదిగా అది బయటకు వదులుతూ, తాతయ్య అన్నారు, "నాకు కట్నం తీసుకోవాలని ఎప్పుడూ లేదు. మీ మావయ్య పెళ్ళప్పుడు మీ అమ్మమ్మ ఎప్పుడూ నా విషయాలలో కలగజేసుకోలేదు. అది ఒకవేళ అడిగినా, 'నువ్వేం తెచ్చావే నీతో' అని నోరు మూయించేసేవాడిని. మరి ఇప్పుడు జరిగేది నా కొడుకు పెళ్ళి కాదు - వాడి కొడుకు పెళ్ళి. మరి పెళ్ళికొడుకు తల్లిదండ్రులేమంటున్నారో చూసుకోవద్దు?", అన్నారు. కిట్టుకు విషయం అర్థమైంది. "అందరూ వాళ్ళ గతాన్ని గుర్తు పెట్టుకుంటారా? ఐనా అందులోనూ మనం కొంత సామం ఉపయోగించాము.", అని ఒక చిరునవ్వుతో అన్నారు.

"అదొక్కటే కాదు - ఇక్కడ ఇంకో విషయం ఉంది. నాకు ఒక్కడే కొడుకు. ఆడబిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేసేశాను. మరి వాడికి ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ ఒకే స్థోమత ఉన్న కుటుంబం నుండి పిల్లలు రావాలని లేదు కదా? కట్నం తీసుకున్నాం అనుకో కలిగిన ఇంటి పిల్ల దగ్గరనుండి ఒకింత తక్కువ తీసుకుంటే రేపు 'నేను ఉన్న ఇంట్లోంచి వచ్చానూ, అని అదంటే మఱొకత్తి, 'నేను ఎక్కువ తీసుకొచ్చానూ అంటుంది. సరిపోదూ?", కిట్టుకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ, ఇది పూర్తిగా తాతయ్య అంగీకారంతో జరుగుతున్నది కాదు అని అర్థమయ్యి తల ఊపాడు. "ఐనా - నాకూ ఆడపిల్లలున్నారురోయ్! అందుకే నేను ఇంకో తండ్రిని ఇబ్బందిపెట్టను. మీ పెద్దమ్మ పెళ్ళినాటికి నా దగ్గర ఆస్తి లేదు. మఱి నాకు తెలియదా ఆ బాధ?", అని కిట్టు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, తూకం నెత్తిన ఉండే సూది లాగా తలను అటూ ఇటూ ఊపారు. కిట్టు అవునన్నట్టు తల ఊపాడు. "కట్నం పది దగ్గర మొదలైందిరా", అని ఆయన అంటుంటే కిట్టు నమ్మలేనన్నట్టుగా చూశాడు. "మఱి నేను సామం వాడి ఒకటిన్నరకు దించాను", అనగానే కిట్టు అదెలాగ అన్నట్టు చూశాడు.

"పెళ్ళి వాళ్ళ ఊళ్ళో జరగడం రివాజు. అలాగ జరిగితే మన వ్యాపరంలో భాగస్వాములు, మన దగ్గరకు వచ్చే customerలు, మనకు సరుకులు ఇచ్చే supplierలు వీళ్ళెవరూ రావడం వీలు కాదు. మఱి వీళ్ళందరూ వస్తేనే వాళ్ళకు మనం గుర్తుంటాము కదరా. అది వ్యాపారసూక్ష్మం. అందుకని పెళ్ళి మా ఊళ్ళో చెయ్యమని చెప్పి మూడు కట్నం కోసేశాను. మన బంధువులందరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. మనవాళ్ళందరికీ ticketల ఖర్చు మిగులు. మఱి వాళ్ళందరూ లేకుండా పెళ్ళెలాగరా?", అన్నారు. ఇంతలో కిట్టు, "తలకో వెయ్యినూటపదహార్లు ఇస్తారు అని వేసుకున్నా వాళ్ళకి రాను పోనూ ticketలే ఖర్చవుతాయి", అన్నాడు. తాతయ్య గట్టిగా నవ్వుతూ, "అదీ నిజమే. ఆ డబ్బు వాళ్ళు మనఃపూర్వకంగా పెళ్ళికొడుక్కి ఇవ్వాలి గానీ, ప్రయాణం చేస్తే ఎవరికిచ్చిన సొమ్ము? ఈ ఊళ్ళో మనం ఎన్ని పెళ్ళిళ్ళు చేశామురా? మనకు షామియానాల నుండి బ్రహ్మగారి వరకు అన్నిటిలోనూ discount ఉంది. వియ్యంకుణ్ణి వాళ్ళకు పరిచయం చేశాను. ఆయనకు ఈ ఊళ్ళో కూడా బోలెడు బంధువులున్నారు. సులువైపోలేదు. ", అన్నారు.

కిట్టు "ఇంకా?" అన్నట్టు చూశాడు. తాతయ్య మంచినీళ్ళకోసం సైగ చేస్తే కిట్టు అక్కడ ఉన్న మఱచెంబులోంచి నీళ్ళను గ్లాసులోకి ఒంపి అది అందించాడు. అది త్రాగాక తాతయ్య, "మనకు cash ఐతే ఆదాయపన్ను శాఖ సమస్య అవుతుంది అని చెప్పి, మూడు పెట్టి మీ అమ్మాయికి నగలు చేయించి ఇచ్చెయ్యండి అన్నాను", అన్నారు. మఱి ఇందులో తగ్గించిందేముంది అన్నట్టు చూశాడు కిట్టు. "మనం మూడంటే వాళ్ళు మూడు పెట్టి చేయిస్తారా? అందులో ఎంతో కొంత తగ్గుతుందిలే - అయినా వాళ్ళు చిన్నప్పటినుండి అమ్మాయికి చేయించినవే పంపిస్తారు.", అన్నారు. కిట్టు నవ్వుకుని, "ఎన్ని పెళ్ళిళ్ళు చేసిన/చూసిన అనుభవమో!", అనుకున్నాడు. "మరి మిగతాది", అన్నాడు కిట్టు. "వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటారో లెక్కేశాను. ఒక ఐదువందలమందిదాక వస్తారు అని చెప్పారు. కుటుంబానికి వెయ్య వేసుకున్నా రెండు లెక్క తేలింది. వియ్యంకుణ్ణి పిలిచి అమ్మాయి పేరున వచ్చిన వస్తువులు అమ్మాయితో పాటు వస్తాయి - డబ్బులే ఆయనకు వస్తాయి అని చెప్పాను. వాళ్ళవాళ్ళందరికీ ఆ విషయం తెలిసి డబ్బులే ఇచ్చారు. మఱి అది ఆయనకు కలిసి వచ్చినట్టేనా?", అన్నారు. కిట్టుకు చుక్కలు కనబడటం మొదలైంది. శ్రీకృష్ణరాయబారంలాగా, "అసలు ఈయన ఎవరి పక్షం మహప్రభో?" అని నివ్వెరపోతూ చూశాడు. "ఇంకెంత మిగిలిందిరా?", అన్నారు తాతయ్య. కిట్టు, "రెండు తాతయ్య. సరిపోయింది.", అన్నాడు కిట్టు. లెక్క తెగింది కదా అనుకుని గుక్క తిప్పుకోబోతుంటే, "ఇంకా లేదు, చెప్తాను విను", అని నెమ్మదిగా నడుం వాల్చారు తాతయ్య.

"మిగిలిన రెండు ఆమె పేరునే fixed వెయ్యమన్నాను. ఆ విషయం కూడా పెళ్ళి తఱువాత చూసుకుందాం అన్నాను. దానితో ఆయన మన చేతికి ఇవ్వాల్సిందీ లేదు, మనం ఆయన చేతికి ఇవ్వాల్సిందీ లేదు. లెక్క సరిపోయింది ఇప్పుడు", అన్నారు. కిట్టు మనసులో ఏదో తెలియని ఉత్సాహం కలిగింది, ఏదో వెల్తి పూరింపబడింది, సుమారు రెండుతులాల బరువు గుండెలోంచి తీసేసినట్టు అనిపించింది. తాతయ్య కనబడటానికి ఆరడుగుల ఆజానబాహువు. ఈ చర్చతో ఆయన ఎత్తు ఇంకా ఎక్కువగా అనిపించడం మొదలైంది. "సరే, నేను కాసేపు పడుకుంటాను. నాలుగవుతూనే లేపెయ్. భక్తి TVలో మంచి ప్రసంగం వస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు light కట్టేయ్", అని జోడించిన అరచేతుల్లోకి చూస్తూ నమస్కరించుకుని ఆవలించారు. కిట్టు light కట్టి తలుపు వైపుగా వెళ్తుంటే, "నేను చెప్పిన లెక్కలు వంటింటి దాక చేరితే మీ అత్తయ్య నీకు sweetలు, నాకు చీవాట్లూ పెడుతుంది", అన్నారు. ఒక చిరునవ్వు నవ్వి, "అబ్బే...లేదు తాతయ్యా", అని కిట్టు తలుపు దగ్గరకేస్తుండగా ఆ తలుపు పక్కగా ఉన్న తాతయ్య తాతయ్య చుట్టలడబ్బా, మఱచెంబూ చూశాడు. తనకు ఊహ తెలిసినప్పటినుండీ తాతయ్య అవే వాడుతున్నారు అన్న విషయం మఱొక్కసారి గుర్తొచ్చింది.

Wednesday, December 22, 2010

నా అనుభవాలు: 1

("నా అనుభవాలు" పేరుతో వ్రాస్తున్న ఈ శీర్షికలో నా చిట్టి అనుభవంలో చూసిన/విన్న సంఘటనల గురించి వ్రాస్తున్నాను. దీనిలో కేవలం మనోభావాలు, అధ్యాత్మిక విషయాలు వంటివి ఉంటాయి. హాస్యం ఉండదు.)

కామేశ్వరరావు గొప్ప భక్తుడు. ఒకప్పుడు సైనికవిభాగంలో పని చేశాడు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా రోజూ ఒక గంటసేపు తన ఇష్టదైవాన్ని ధ్యానించేవాడు. ఎప్పుడూ మద్యమాంసాల జోలికి పోలేదు. ఇప్పుడు ఆయన పదవిని విరమించి స్వగ్రామంలో ఉంటున్నాడు. ఆయన జీవితంలో ఒక సారి జరిగిన ఘట్టం వారి అబ్బాయి (నా మిత్రుడు) నాతో చెప్పాడు. అదే ఈ చిన్నకథ.

ఒక రోజు కామేశ్వరరావు పూజ ముగించి వరండాలో కూర్చున్నాడు. తన మిత్రుడు ఎవరో ఒక అపరిచితవ్యక్తిని వెంటబెట్టుకుని గుమ్మం ముందుకు వచ్చాడు. మర్యాద కోసమని కామేశ్వరరావు వెళ్ళి వాళ్ళను పలకరించి ఇంట్లోకి పిలిచాడు. అందరూ కాఫీలు పుచ్చుకున్న తఱువాత, కామేశ్వరరావు మిత్రుడు తనతో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ, ఆయన గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి అని, ఎవరింట్లో ఐనా పూజగది చూసి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ చెప్పగలడని చెప్పాడు. కామేశ్వరరావుకి కుతూహలం ఆగలేదు. వెంటనే ఆయన్ని పూజగదిలోకి తీసుకెళ్ళాడు.

ఆ వ్యక్తి గంభీరమైన ముఖంతో ఉన్నాడు. నుదుట విభూతి గాని కుంకుమ గాని లేదు. పూజగదిలోకి అడుగు పెడుతూనే ఒక్క సారి చుట్టూ చూశాడు. దేవుడి పాటాలను, దీపాలను చూసినదాని కంటే మిగతా దిక్కులను ఎక్కువ చూసి "మీ నాన్నగారు మీ చిన్నప్పుడే పోయారు. ఆయన చామంచాయ, ఆరడుగులు ఎత్తు, మీసం ఉండదు - అవునా", అన్నాడు. కామేశ్వరరావు ఆశ్చర్యచకితుడైనాడు. వాళ్ళ నాన్నగారికి ఒక నమ్మకం ఉండేది - photo తీయించుకుంటే సహజసౌందర్యం దెబ్బ తింటుంది అని. అందుకే ఆయన ఎప్పుడూ photo తీయించుకోలేదు. ఈ వ్యక్తి తన తండ్రి photo సంపాదించి ఈ విషయం చెప్తున్నాడు అనడానికి ఆస్కారం లేదు. అలాగే తన చిన్నదనంలోనే చనిపోయిన తండ్రిని తన భార్య, బిడ్డలు చూసే కూడా చూడనేలేదు. ఈ వ్యక్తి చూసే అవకాశం కూడా లేదు. ఒక వేళ ఇదివరకు ఇతను తన తండ్రిని స్వయంగా చూశాడా అంటే ఇతడు కామేశ్వరరావు కంటే చిన్నవాడాయె. ఇదంతా తనకు నమ్మశక్యంగా లేదు. కాసేపటికి తేరుకుని ఆయన చెప్పినవన్నీ నిజమేనని ఒప్పుకుని సాష్టాంగప్రణామం చేసినంత పని చేశాడు. ఆ తఱువాత ఆ వ్యక్తి మరిన్ని వివరాలు చెప్పడం, కామేశ్వరరావు ఊ కొట్టడం జరిగాయి. చివరికి ఆయనకు భోజనం కూడా పెట్టి పంపించాడు.

కామేశ్వరరావు ఈ విషయాన్ని సత్వరమే తన గురువుగారికి చెప్పాలని ఆ మఱునాడు బయల్దేరి ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన నుదుటన, విభూతి, కుంకుమ పెట్టుకుని ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. కామేశ్వరరావుని చూసి, "కామేస్వరం, నిన్న మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తే పూజగది చూపించావు కదూ?" అన్నాడు. మళ్ళీ కామేశ్వరానికి మతి పోయింది. ఇదివరకు ఎప్పుడూ ఈ గురువుగారు మానవాతీతశక్తి ఉన్నట్టుగా ప్రవర్తించలేదు, అనిపించలేదు. ఉన్నట్టుండి ఈయనకు కూడా ఈ శక్తి ఎక్కడినుండి వచ్చింది? ఇది కలా? నిజమా? అని అనుకుంటూ, "అవును స్వామీ, ఆ విషయం చెప్దామనే ఇక్కడికి వచ్చాను", అన్నాడు. ఆయన గంభీరమైన ముఖాన ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వి, "తప్పు చేశావు కామేస్వరం. పూజగది మన ఆధ్యాత్మికబలానికి నెలవు. అక్కడికి ఎవరినిబడితే వారిని రానివ్వకూడదు. శక్తికి కూడా రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ప్రకృతికి అనుకూలమైన దైవీకశక్తి, రెండవది ప్రకృతిధర్మాలను ధిక్కరించే శక్తి. మనం మల్లెబాటలో వెళ్ళాలయ్యా. ఇంకెప్పుడూ అలాంటివాళ్ళను ఆశ్రయించకు", అన్నాడు.

కుతూహలం ఆగని కామేశ్వరరావు, "స్వామీ, మీరు చెప్పింది పాటిస్తాను. ఆ విషయాన్ని మీరు మరింత వివరిస్తే వినాలనుంది", అన్నాడు. గురువుగారి ముఖంలో గాంభీర్యం తగ్గి కాస్త శాంతం చోటు చేసుకుంది, "కామేశ్వరం, మీ ఇంటికి వచ్చిన వ్యక్తిది దైవబలం కాదు. దైవబలం ఉన్న వ్యక్తులు ఎప్పుడుబడితే అప్పుడు వారి శక్తిని వాడరు. పిండోదకక్రియలను సక్రమంగా ఆచరిస్తున్న నీకు పితృదేవతల అండ ఉంది. అతను మీ పితృదేవతలతో మాట్లాడాడయ్యా. ఇది పెద్ద విద్యేం కాదు. కాకపోతే అది ప్రకృతివిరుద్ధం. నీ పితృదేవతలు కూడా నీకు ప్రశ్నలుంటే, అవి ముఖ్యమైనవైతే, నువ్వు నీ వారిపట్ల నీ ధర్మాలను సరిగ్గా ఆచరిస్తే నీకు కల ద్వారానో, లేక మఱొక మార్గంలోనో సూచనలనిస్తారు. ఇలాంటి వ్యక్తులు వాడేవి ప్రకృతివిరుద్ధమైన మార్గాలు. వారు మీ పితృదేవతలను ఇబ్బంది పెట్టగలరు. నిన్నూ నమ్మించి మోసం చెయ్యగలరు. వీరిని నమ్మితే నువ్వు నీ పితృదేవతల అండని, భగవంతుడి కృపని వదులుకోవలసి రావచ్చును. అందుకనే వీళ్ళకు దూరంగా ఉండమంటున్నది", అన్నాడు. కామేశ్వరరావుకు విషయం అర్థమైంది. అప్పటి నుండి ఇలాంటి మాయలకు దూరంగా ఉంటున్నాడు.

Wednesday, March 17, 2010

కిట్టు కథలు - తండ్రి ప్రేమ

కిట్టుకి భాగ్యనగరంలో ఒక పెద్ద MNC లో ఉద్యోగం వచ్చింది. అందులో చేరిన వెంటనే తన తండ్రి సుబ్బారావుకి phone చేసి అక్కడ విషయాలన్నీ చెప్పాడు. అది విని సుబ్బారావు చాలా సంతోషించాడు. ఇక తనకున్న తగులూమిగులూ భూములని అమ్మి ఆ డబ్బు తీసుకుని భార్యతో సహా కిట్టు దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాడు. కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఏ తండ్రికైనా వచ్చే సంతోషమే తనకూ వచ్చింది.

రాత్రి దగ్గరే ఉన్న హోటల్లో భోజనం చేసి కిట్టు తన room-mateతో మాట్లాడుతూ ఇంటివైపికు నడుస్తున్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే అది కిట్టు వాళ్ళ మేనత్త కొడుకు, శివ. తను వరసకు బావ అయినా కిట్టు కంటే చాలా పెద్దవాడు. శివ తల్లికి, కిట్టు తండ్రికి పదిహేనేళ్ళ వయోభేదం ఉంది. అతను వైజాగ్లోనే కిట్టు ఇంటికి దగ్గరలో ఉంటాడు. ఎత్తగానే, "ఒరేయ్ నాన్న, నువ్వు urgent గా బయల్దేరి వైజాగ్ వచ్చెయ్యరా. నాన్నని ఆసుపత్రిలో చేర్పించాము.", అని అన్నాడు. కిట్టుకు అసలు ఏమీ అర్థం కాలేదు. తన తండ్రికి దగ్గూ, జ్వరం కూడా ఎప్పుడూ వచ్చిన గుర్తులేదు కిట్టుకి. ఉన్నట్టుండి hospitalలో admit చెయ్యడమేమిటా అనుకుంటుండగానే, "వివరాలన్నీ రేపు నువ్వు వచ్చాక మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి నువ్వు దొరికిన bus ఎక్కి వచ్చెయ్యి", అని పెట్టేశాడు శివ.

కిట్టు వెంటనే బస్సెక్కి వైజాగ్ చేరుకున్నాడు. ICU బయట తన తల్లి కళ్ళల్లో నీళ్ళతో కూర్చుని ఉంది. "ఒరేయ్ నాన్నా, మీ నాన్న నిన్న సీతాపురం వెళ్ళివచ్చారు. వస్తూనే ఏమీ మాట్లాడకుండా, భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళి పడుకున్నారు. కాసేపటికి వొళ్ళంతా చెమటలతో, మొహం ఎర్రగా అయిపోయి, "అరుణ, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది అన్నారు. వెంటనే శివగాడికి ఫోన్ చేశాను. వాడు వచ్చి హాస్పిటల్లో చేరిపించాడు. రాత్రినుండి ఇక్కడే కూర్చుని ఉన్నాను. ఎవరూ నాకు ఏమీ చెప్పట్లేదు. డాక్టర్ నువ్వు వచ్చాక మాట్లాడతానన్నారు. త్వరగా వెళ్ళి విషయం ఏంటొ కనుక్కోరా", అంది. తన తల్లికి కాస్త ధైర్యం చెప్పి ICUలోకి వెళ్ళాడు.

ఒంటినిండా వైర్లతో చుట్టూ మెషీన్లతో ఉన్న సుబ్బారావుని చూస్తూనే కిట్టుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెళ్ళి, "నాన్నా", అని పిలవగానే "సర్, ఆయన్నిప్పుడు మాట్లాడించకూడదు. మిమ్మల్ని doctorగారు కలవమని చెప్పారు", అంది ఒక నర్సు. కిట్టు బాధగా డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్, "మీరేనా సుబ్బారావుగారి అబ్బాయి?", అని అడిగాడు. "అవునండి", అన్నాడు కిట్టు. "కూర్చోండి. మీ నాన్నగారి పరిస్థితి గమనిస్తున్నాము. ప్రస్తుతానికి బానే ఉంది. కాకపోతే ఇంకా నయమైంది అని చెప్పలేము.", అన్నాడు డాక్టర్. "అసలేమైంది డాక్టర్? మా నాన్నగారికి ఎప్పుడూ అనారోగ్యం చెయ్యడం నేను చూడలేదు", అన్నాడు కిట్టు. "ఆయనకి BP ఉంది. ఎప్పటినుండో heart-related-problem ఉంది. ఆయన check చేయించుకోలేదు. మీరైనా చేయించి ఉండాల్సింది. యాభై ఏళ్ళు దాటాక అందరూ health-check చేయించుకుంటూ ఉండాలి అండి.", అన్నాడు డాక్టర్. "ఐతే ఇప్పుడు మా నాన్నగారికి  ఆపరేషన్ చెయ్యలా?", అడిగాడు కిట్టు. "ఇప్పుడు ఆయన గుండెకి ఆపరేషన్ కి తట్టుకునే బలం లేదు. కొన్నాళ్ళు observationలో పెట్టి అప్పుడు నిర్ణయించాలి. అప్పటిదాకా ఆయన్ని మాట్లాడించద్దు. మీ బంధువులని కూడా ICU లోనికి పోనివ్వద్దు అండి.", అన్నాడు డాక్టర్. "అలాగే అండి. ఉంటాను", అని చెప్పి కిట్టు బయటకు వచ్చేశాడు.

బయట బల్ల మీద కూర్చుండగా శివ వచ్చాడు. "ఒరేయ్ నాన్న, మీ నాన్నను చూశవా, డాక్టర్ తో మాట్లాడావా?", అని అడిగాడు. "చూశాను బావ. డాక్టర్ గారు ఇంకా అబ్సర్వ్ చెయ్యాలి అంటున్నారు", కిట్టు అన్నడు. "నాతో కూడా అలాగే అన్నారు. బాధ పడకురా. తండ్రిలాంటివాడే అన్యాయం చేస్తే ఎవరికి  గుండె మండదు?", అన్నాడు శివ. అదేమిటి అన్నట్టు చూశాడు కిట్టు. "నిన్న మీ నన్న సీతాపురమ్నుండి వస్తూ మీ ఇంటికి వెళ్ళేముందు మా ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం నాతో చెప్పాడు. మీ నాన్నకి ఉన్న భూములు అమ్మి నీ పేరున fixed depositలు వేద్దామని అనుకున్నాడురా. అందుకే తన భూములని ఎవరో కొనడానికి వస్తే చూపించడానికి సీతాపురం తోటకి వెళ్ళాడు. అక్కడ మీ తోటని కొలిస్తే రెండు ఎకరాలు తక్కువ వచ్చాయి. తాతయ్య చనిపోయినప్పుడు మావయ్యకి ఐదేళ్ళు. అమ్మమ్మకి (కిట్టూకు నాన్నమ్మ) అసలు ప్రపంచకఙానం లేదని మన చినతాతే తనవాటా, మన తాతయ్యవాటా కూడా చూశేవారు. మావయ్యను పెంచడానికి అమ్మమ్మ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు మావయ్య చదువు పూర్తయ్యాక చినతాత తాతయ్య వాటా మావయ్యకి ఇచ్చారు. నేను మావయ్యకి చెప్తూనే ఉన్నాను 'వొకసారి కొలిపించు మావయ్యా', అని. కొలిపించకుండా తీసుకున్నాడు. మావయ్యకి చినతాత అంటే గుడ్డినమ్మకం. తనను సొంతకొడుకులాగా పెంచిపెద్దచేసినవాడు తనను ఎందుకు మోసం చేస్తాడు అని! చినతాత మనిషి మంచివాడే అయినా, మావయ్య అంటే అభిమానం ఉన్నా తన భార్య అలాంటిది కాదు కదా. ఎప్పుడూ తన ఆస్తి ఏదో మనం తినేస్తున్నట్టుగా అనుకునేది. ఇప్పుడు ముప్ఫై ఏళ్ళ తరువాత చూసుకుంటే తెలిసింది, మావయ్యకు రావాల్సిన రెండు ఎకరాలు చినతాత ఉంచేసుకుని, తన కొడుకు పేర్న వ్రాసుకున్నాడు అని. ఆ విషయం తెలియగానే మావయ్య వెళ్ళి చినతాతని తన తోట తనకు ఇచ్చెయ్యమని అడిగితే చినతాత ఇవ్వనన్నాడు. సుమారు నూరేళ్ళు ఉంటాయి ఆయనకి, మునిమనవల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఐనా కూడా ఆయనకు డబ్బు మీద మక్కువ పోలేదు. మావయ్య నీకోసం దాచిన ఆస్తి ఆ భూమే. అదే నీకు దక్కనివ్వకపోతే ఆయనకు కోపం వచ్చి చినతాతతో తగువు పెట్టుకుని వచ్చేశాడు. అదే బాధ మనసులో పెట్టుకోవడం వలన ఇలాగ గుండెపోటు వచ్చింది", అన్నాడు. వింటూనే కిట్టుకు రక్తం మరిగిపోయింది. వెళ్ళి చినతాతని "నూరేళ్ళు వచ్చాయి. మునిమనమళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. నీ కళ్ళతో నీ కొడుకు వయసువాళ్ళు చనిపోవడం చూసి ఉంటావు. నీ మనవరాలు వయసు వాళ్ళు భర్తను కోల్పోవడం చూసి ఉంటావు. తాత, నీకు ఇంకా విరక్తి కలగలేదా?", అని అడుగుదామనిపించింది. కోపం కంటే కర్తవ్యం ముఖ్యమని అనుకుని తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, డాక్టర్తో మాట్లాడాను. రెండుమూడురోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. నువ్వు టిఫిన్ చేశావా? పద తిందుగాని?", అన్నాడు.

రెండుమూడురోజులు గడిచాక సుబ్బారావు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. త్వరలోనే general ward కి మారుస్తాము అని చెప్పాడు డాక్టర్. కిట్టుని తండ్రితో మాట్లాడనిచ్చారు. కిట్టు లోపలికి రాగానే సుబ్బారావు కుశలప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానం ఇచ్చి, నాలుగు మంచి మాటలు చెప్పిన కిట్టు, కాసేపటికి జరిగిన విషయం గుర్తుకొచ్చి, "నాన్న, పండుముసలివాడయిపోయి, నరాలు చచ్చుపడిపోతున్నా ఎందుకు నాన్న చినతాతకి అంత డబ్బు పిచ్చి. ఆయనేమీ చచ్చేటప్పుడు పట్టుకుపోడు కదా? వంద సంవత్సరాలు బ్రతికినా మనిషికి విరక్తి రాదేమిటి? పెళ్ళాం మాట పట్టుకుని మీకు ఎందుకు ద్రోహం చేశారు నాన్న?", అన్నాడు. అప్పటిదాకా శాంతంగా ఉండి, వీలైనంతవరకు నవ్వడానికి ప్రయత్నించిన సుబ్బారావు ఒక్కసారిగా, "నోర్ముయ్!", అన్నాడు. అప్పటిదాకా దీనంగా ఉన్న కిట్టుకు ఒక్కసారి కరణాలన్నీ జాగృతమయ్యాయి. "ఎవడ్రా మా బాబాయికి వందేళ్ళు అన్నది? ఆయన పుట్టింది 1917లో. ఇప్పటికి ఆయన వయసు 93 ఏళ్ళు. మా బాబాయి గురించి మాట్లాడటానికి మీకెవ్వరికీ హక్కు లేదు. పుట్టినరోజుకని నాకు బట్టలు కుట్టించడం కోసం డబ్బులు అడుగుదామని, మా అమ్మ తన పుట్టింటి నుండి ప్రయాణం చేసి వస్తే ఇంట్లోకి కూడా రమ్మనేది కాదు మా పిన్ని. బయట గంటలకొద్దీ చింతచెట్టుకింద చెప్పులు లేకుండా నిలబడేది మా అమ్మ నా కోసం. అప్పుడు మా బాబాయ్ వచ్చి మమ్మల్ని మనస్పూర్తిగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి గడ్డపెరుగు కలిపి పెట్టేవాడురా. ఆయన పెళ్ళాం మాట విని మాకు అన్యాయం చేసి ఉంటే ఇలాగ మనం ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. మా అన్నయ్య (చినతాత కొడుకు) ఉట్టి వెర్రిబాగులవాడురా. వాడికి ఏమీ తెలియదు. వాడి తెలివిదక్కువతనంతో ఎక్కడ కొంచం ఆస్తి పాడుచేసినా ఇంకా ఉంటాయని ఆ రెండు ఎకరాలూ తీసుకున్నాడు. ఐనా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు?", అన్నాడు సుబ్బారావు. కిట్టూ అలాగ చూస్తూ ఉండిపోయాడు. ICUలో ఉండి, కొడుకు కన్నీళ్ళతో వచ్చి కూర్చుంటే ఇలాగ తిట్టి, తనకు అన్యాయం చేసిన బాబాయ్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు తండ్రి అన్నది తనకు అంతు పట్టలేదు.

చిన్నబోయిన కిట్టూని చూసి, సుబ్బారావు కాస్త నెమ్మదిపడి, "ఒరేయ్ నాన్న, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు సహిస్తావా? లేదు కదరా? అలాగే మా బాబాయ్ ని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేనురా. వరసకు బాబాయే కానీ, ప్రేమకు తండ్రికి ఎప్పుడూ తీసిపోలేదురా. నా అక్కచెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. నన్ను చదివించాడు. నా ఆస్తిని ఇరవయ్యేళ్ళు కాశాడు. ఇంతకంటే ఇంకెవరు చెయ్యగలరురా?", అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు అక్కలందరికీ కట్నం కోసం చూసుకుని తక్కువ సంబంధాలు చేశాడని, తన ఆస్తిలో ఒక భాగం తీసేసుకుని మోసం చేశాడని, ఆ చినతాత సొంతబిడ్డలే అనుకుంటూ ఉండగా చాలాసార్లు కిట్టు విన్నాడు. అలాంటిది ఇంకా తన తండ్రి గుడ్డిగా చినతాతను నమ్మడం ఇంకా కిట్టు సహించలేకపోతున్నాడు. తను పరిస్థితి గమనించిన సుబ్బారావు, "నేను ఎందుకు తోటలు అమ్మాలనుకున్నానురా? ఆ డబ్బులు నీకు ఇద్దామనే కదా? అలాగే ఆ రెండు ఎకరాలూ తన కొడుక్కి ఇద్దామనుకున్నాడు మా బాబాయ్. ఎటొచ్చి అవి న్యాయంగా నాకు చెందాల్సినవి. అది నీకు అన్యాయం అనిపించవచ్చు. ఎప్పుడూ మా బాబాయ్ కి ఎదురుగా ఒక్క మాట కూడా మాట్లాడని నేను ఆ రోజు 'ఇకనుండి నువ్వు ఎవరో, నేను ఎవరో. నీకూ నాకూ సంబంధం లేదూ, అన్నాను తెలుసునా?", అన్నాడు సుబ్బరావు. ఇది విని కిట్టు ఆశ్చర్యపోయాడు. తన బంధువర్గమంతా "సుబ్బారావే వాళ్ళ బాబాయ్ కి కన్నకొడుకుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాడు.", అని పేరు. "బాబాయ్ ని అంత గౌరవించే నా చేత అంత మాట అనిపించిందిరా పిల్లల మీద ప్రేమ. మరి వయసు మీరిపోయి, కొడుకు అమాయకుడు, ఏమవుతాడో అన్న బెంగ ఆయనకు ఉంటుంది కదరా? అందుకే అలాంటి పని చేశాడు. సొంతపిల్లల మీద ప్రేమతో పెంచిన కొడుకు దగ్గర రెండు ఎకరాలు తీసుకోవడం తప్పైతే, పిల్లలమీద ప్రేమతో పెంచి పెద్ద చేసిన బాబాయ్ ని అంత మాట అనడం కూడా తప్పే!", అన్నాడు సుబ్బారావు. కిట్టుకి ఒక విషయం అర్థమయ్యింది. తన మీద ప్రేమతో తన తండ్రి చినతాతని ఎదిరించాడు తప్పితే, ఆ డబ్బు మీద అసలు సుబ్బారావుకు ఆశ లేదు. "నాన్నా, చినతాతయ్య గురించి నేను ఏమీ అనను. కానీ, ఆ రెండు ఎకరాల గురించి మీరు మరిచిపోండి. నేను సంపాదిస్తున్నాను కదా డబ్బులు. అవి చాలు నాన్నా మనకి. మీరు చెప్పించిన విద్యాబుద్ధులు ఉన్నాయి. అంతకు మించి నాకేమీ వద్దు నాన్న!", అన్నాడు కిట్టు. "నీకున్న పాటి బుద్ధి నాకు లేకపోయిందిరా. మా బాబాయ్ చెప్పించిన విద్యాబుద్ధులున్నాయి కదా. ఐనా ఆ భూమి కోసం నేను పెద్దపెద్ద మాటలన్నాను. బాధపడుతూ ఉంటాడేమో", అన్నాడు సుబ్బారావు. విని కిట్టూ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. సుబ్బారావుని rest తీసుకోమని చెప్పి బయటకు వచ్చాడు.

కిట్టు ICU బయట బల్ల మీద కూర్చుని ఆలోచించాడు, "ఏమిటి? నాన్నకి వాళ్ళ బాబాయ్ మీద అంత గౌరవం? కేవలం నాలుగు మంచిమాటలు మాట్లాడి, మా ఆస్తి కొన్నాళ్ళు చూసిపెట్టినందుకే? మరి నాన్న నన్ను పెంచి పెద్దవాడిని చేసి, ఏది అడిగితే అది కొనిపెట్టారు నాకు కూడా నాన్న పట్ల ఇంతే గౌరవం ఉందా? నాన్న ఏదైనా పొరబాటు చేస్తే నేను ఇలాగే సహనంతో ఓర్చుకుంటానా? ఏదేమైనా సరే, ఈ సంఘటన ద్వారా నాకు ఒకటి తెలిసింది. ఒక మనిషి మనకు కోపం తెప్పించినప్పుడు, ఆ మనిషి మనకు గతంలో చేసిన మంచిని మరిచిపోకూడదు. తప్పులందరూ చేస్తారు. కానీ, వాటిని అవతలవాళ్ళ దృష్టిలోనుండి అర్థం చేసుకుని క్షమించకపోతే అప్పుడు ఆ అనుబంధానికి విలువే లేదు. నాన్నా! నేను గొప్ప universityలో masters  చదివాను. కానీ, నాకు ఇలాంటి పాఠం ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ICUలో ఉండి మీరు చెప్పారు.", అనుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళి, "అమ్మా, నాన్న condition మెరుగుపడిందిటమ్మా. general ward లోకి shift చేస్తున్నారు.", అని చెప్పాడు. అప్పటిదాక కంట కునుకు లేకుండా ఉన్న అరుణ మొహంలో కాస్త కాంతి కనబడింది.

Wednesday, August 12, 2009

వంశవృక్షం - ధర్మం

బాపు తీసిన "వంశవృక్షం" అనే ఒక సినిమా ఈ మధ్యన చూసాను. సినిమా లో బొత్తిగా గ్లామర్ లేదు. సినిమా మొత్తం బ్రాహ్మల democracy కనబడుతుంది.అంటే, "by the brahmins, for the brahmins, of the brahmins" అన్న మాట. ఆ సినిమా మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. నాకు మాత్రం కొంత నచ్చింది. ఎందుకు నచ్చింది? ఏమిటి నచ్చింది?

ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఇందులో characters ని పరిచయం చెయ్యాలి. సోమయాజులు ఒక కృష్ణ భక్తుడు. వాళ్ళ వంశం పేరు "బృందావనం" వారు. వాళ్ల వంశం లో అందరూ కృష్ణ భక్తులు. వాళ్ళకు రోజు అంటే పొద్దున్నే లేచి కృష్ణనామస్మరణ చేస్తూ పడుకునేవరకు కృష్ణుణ్ణి సేవించడమే. సోమయజులుకు ఒక కొడుకు ఉంటాడు. అతడికి పెళ్లి అయ్యి ఒక పిల్లాడు పుడతాడు. కానీ కొడుకు పుట్టగానే సోమయాజులు కొడుకు చనిపోతాడు. అప్పుడు అతని భార్య (జ్యోతి) వైధవ్యం స్వీకరిస్తుంది. తెల్ల బట్టలు వేసుకుంటుంది. సౌందర్యానికి సంబంధించిన విషయాన్నీ దగ్గరకు రానివ్వదు. యవ్వనం లో ఉండగా కలిగే కోరికలను చంపుకోవడానికి రాత్రుళ్ళు కేవలం మజ్జిగన్నం తింటుంది. కొడుకుని చూసుకుంటూ ఉంటుంది.

కొంత కాలానికి జ్యోతికి MA చెయ్యాలనే కోరిక కలుగుతుంది. చెప్పగానే వాళ్ళ అత్తగారు, "మా ఇంట వంట లేదమ్మా ఇలాగ. వద్దే తల్లి. అనవసరమైన కోరికలు కలుగుతాయి", అంటుంది. కానీ సోమయాజులు ఎంత ఛాందసుడైనా అమ్మాయికి ఇంట్లో ఏమి తోచట్లేదు అని నాలుగు మంచి ముక్కలు చెప్పి చదువుకోవడానికి తన శిష్యుడు (కాంతా రావు, కాలేజీ ప్రిన్సిపాల్) దగ్గరకు పంపిస్తాడు. ప్రతి రోజు లాంచి లో పట్నం వెళ్లి కాంతారావు తమ్ముడు (అనిల్ కపూర్) దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. అనిల్కపూర్ జ్యోతి కి ఆసలు కల్పిస్తాడు, "నాకు నువ్వంటే ఇష్టం. వైధవ్యం నీకు వద్దు. నన్ను పెళ్లి చేసుకో. మీ నాన్న, మగ పిల్లల కోసం, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నువ్వు భర్త మరణించాక వేరే పెళ్లి చేసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి?", అని. జ్యోతి బాగా తటపటాయించి చివరికి ఒకర రోజు కాలేజీ కి వెళ్ళినట్టే వెళ్లి అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది.

కొన్నాళ్ళకు ఆమెకు పుత్రుడి మీద ఉన్న మమకారం వాడిని తనతో తీసుకేల్దాము అనే ఆశ కలిగిస్తుంది. వెళ్లి సోమయజులును అడుగుతుంది. అప్పుడు వారిద్దరి మధ్యన సంభాషణ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

(సో: సోమయాజులు, జో: జ్యోతి).

సో: రా అమ్మ. ఈవేళ మా అబ్బాయి తద్దినం. మీ అత్తగారు నీకు ప్రసాదం పెడుతుంది, తిను.
జ్యో: మామగారు, నాకు నా బిడ్డను తీసుకెళ్ళాలి అని ఉంది.
సో: దాని గురించి మాట్లాడుకుందాం. ముందు మా వాడికి నమస్కారం చేసుకుని భోజనం చేయి.
(భోజనం తరువాత జ్యోతి తండ్రి వచ్చి తనను బాగా తిడతాడు.).
జ్యో: నాన్న, నన్ను ఏమైనా అనే హక్కు నా మావగారికి ఉందేమో కానీ, నీకు కాదు. అమ్మ బ్రతికి ఉండగానే మగపిల్లల కోసం నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు.
(సోమయాజులు జ్యోతి తండ్రికి నచ్చ జెప్పి పంపిస్తాడు. జ్యోతిని వేరే గదిలోకి తీసుకొచ్చి మాట్లాడతాడు).
సో: అమ్మ, నీకు మళ్ళీ పెళ్లి అయ్యింది. మళ్ళీ పిల్లలు కలుగుతారు. మాకు ఈ వయస్సులో కావలసిన కొడుకు ప్రేమ పోయింది. అనాథలమయ్యిపొయాము. మీ బిడ్డే మా ఊపిరి తల్లి. వాడిలోనే మా బిడ్డను చూసుకుంటున్నాము. దయచేసి వాడిని మాకు వదిలెయ్యి. నీకు కావలసినప్పుడు వచ్చి చూసుకో.
జ్యో: మామగారు. మీరు కర్మ గురించి అన్ని సిద్ధాంతాలు చెప్తారు. మనం గోదావరికి ఎంత పెద్ద బాణ పట్టికేల్తే అంతే నీరు వస్తుంది. ఇదే మీకు ప్రాప్తం. మీ కోసం నేను త్యాగం చెయ్యలేను. నాకు నా సంతోషం ముఖ్యం.
సో: అది ధర్మం కాదు తల్లి.
జ్యో: మామగారు, ధర్మం విషయంలో మీకు నాకు చుక్కెదురు. మనిషి ధర్మం కోసం నడవాలి అని మీరు అంటారు. ధర్మం మనిషి కోసం నడవాలి అని నేను అంటాను.
సో: (నివ్వేరేపోతూ కోపాన్ని శాంతంగా మార్చుకుంటూ విరక్తితో కూడిన చిరునవ్వుతో) సరే, ధర్మం విషయం పక్కన పెడదాము. సాధకబాధకాలే మాట్లాడుకుందాము. వీడు నీకూ, మా అబ్బాయికి పుట్టాడు. నువ్వు వీడిని తీసుకెళ్ళి నీ దగ్గర పెంచిన తరువాత, తన తండ్రి వేరే ఉన్నాడు అని, తన బంధువులు వేరే వున్నారు అని తెలిసి వాడు నిన్ను ద్వేషిస్తే, నన్ను నా బంధువుల దగ్గరనుండి ఎందుకు దూరం చేసావు అని నిలదీస్తే. ఈ ప్రేమ, ఆస్తి అనుభవించే హక్కును నాకు ఎందుకు దూరం చేసావు అని అడిగితే?

ఈ క్షణం లో జ్యోతికి ఏం చెప్పాలో పాలుపోదు. నా కొడుకు అలాగా చెయ్యడు అని ధైర్యం గా చెప్పలేదు. ఎందుకంటే, ప్రేమించే వాళ్లు దూరమయ్యే కొద్దీ వాళ్ల మీద ప్రేమ పెరుగుతుంది. దాని కోసం ఏ బంధాన్నైన, ఇష్టాన్నైనా వదులుకోవాలి అనిపిస్తుంది. అది తనకు కూడా తెలుసును. అలాగని, బిడ్డను వదిలెయ్యలేదు. వచ్చి చూసుకుని వెళ్ళిపోలేదు. భారమైన హృదయంతో వెళ్ళిపోతుంది.

ఒక ఏడాది తరువాత తన బిడ్డను చూసుకున్న కళ్ళల్లో వచ్చే ఆనందబాష్పాలు, బిడ్డ కోసం తల్లడిల్లిపోయే తల్లి వేదన, వాడిని మళ్ళీ తన కళ్ళారా చూసుకోవడం వీలు కాదేమో అనే దుఃఖం, అటు భర్త, ఇటు కొడుకు మధ్యలో నలిగిపోతూ ఉన్న జ్యోతిని చూసి కరుగని మనసు ఉండదేమో. చివరకు వాడి గురించే పరితపిస్తూన్న తనకు ఆఖరు ఘడియల్లో వాడి దర్శనం దొరికినప్పుడు ఆమె ముఖంలో కలిగే భావాలను బాపు తెరకెక్కించిన విధం నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది.

అసలు ఈ సినిమాలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి:
  1. అసలు జ్యోతి మళ్ళీ పెళ్లి చేసుకోవడం రైట్ ఆ?
  2. వేరే పెళ్లి చేసుకున్న అంతమాత్రాన తను తొమ్మిది నెలలు మోసి, కని, పెంచిన కొడుకు మీద సర్వహక్కులు కోల్పోతుందా?
  3. ఏదో కొడుకు భవిష్యత్తులో తనను ద్వెషిస్తాడేమో అన్న భయంతో తనను విడిచిపెట్టేయ్యడం వివేకమా? అసలు తను పెంచి, పెద్దచేసిన కొడుకు తనను ఎందుకు ద్వేషిస్తాడు?
  4. కొడుకు పోయి, కోడలు చెప్పా,పెట్టకుండా ఎవర్నో పెళ్లి చేసుకుని, తన మొదటి భర్త తద్దినం రోజే తన బిడ్డను అడగటానికి వస్తే కుమిలిపోతున్న తల్లిదండ్రులను "మీ కర్మ ఇంతే, నా బిడ్డను ఇచ్చెయ్యండి", అనడం సబబా?
ఇవన్నిటికీ సమాధానం సోమయాజులు ఒక్క ముక్కలో చెప్తాడు,"ఏది మంచో, ఏది చెడో చెప్పడానికి నేను ఎవర్నయ్యా? అన్నీ చూసుకోవడానికి కృష్ణపరమాత్మే ఉన్నాడు. నాకు ఏది ధర్మం అనిపించిందో, అది నేను చేస్తాను". నిజమే, మనం ఎవరం? అందరికీ ఏదో ఒకటి రైట్ అనిపించబట్టే చేస్తారు. నూటికి తొంభై మంది, "ఇది తప్పు", అని తెలిస్తే చెయ్యరు. అందరికీ స్వార్థం ఏదో ఒక మొత్తం లో ఉంటుంది. దానిని బట్టే తప్పు, ఒప్పు అనిపిస్తూ ఉంటాయి.

ఈ సినిమా లో నేను మరిచిపోలేని డైలాగ్ ఒకటి ఉంది. కోడలు రాత్రైనా తిరిగి రాలేదు అని సోమయాజులు, వంట మనిషి (డబ్బింగ్ జానకి) కలిసి లాంతరుతో గోదావరి ఒడ్డుకు వెళ్లి వేచి చూస్తారు. జ్యోతి అప్పటికే అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది. కోడలు ఎంతకీ రాకపోతే, సోమయాజులు వంట మనిషితో, "చీకటి పడింది కదా! దారి తప్పి ఉంటుంది", అంటాడు. చక్కని మాట.

అన్నీ చూసుకోవడానికి కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురుం!

గమనిక: నేను కూడా ఈ సినిమా లో ఎదురయ్యిన ప్రశ్నల గురించి ఆలోచించాను. నాకు ఏమిటి అనిపించింది అంటే, జ్యోతి రోజూ పిల్లాణ్ణి ఇంట్లో వదిలి, చదువుకోవడానికి పట్నం వెళ్ళేదికదా? పెళ్లి అయ్యాక కూడా అలాగే, పొద్దున్నంతా సోమయాజుల ఇంటికి వచ్చి పిల్లాణ్ణి చూసుకుని సాయంత్రం భర్తా దగ్గరకు వెళిపోతే సరిపోయేది కదా? ఎలాగూ అనిల్ కపూర్ పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రమే ఇంటికి వస్తాడు కదా? అని.

ఎలాగుంది నా అవుడియా? మరీ చిన్నపిల్లాడి లాగా ఉందా? తప్పంటారా?

Saturday, June 6, 2009

బ్రహ్మఙానం, సాంప్రదాయం, చాదస్తం

నేను సరదాగా ఉండే మనిషిని అని బహుశా నన్ను ఎరిగిన వాళ్లందరూ చెప్తారు. నాకు సీరియస్ గా ఉండటం అంత ఇష్టం ఉండదు. అలాంటిది నేను ఇలాంటి సీరియస్ టప వ్రాయాల్సివచ్చింది అంటే, అది ఎంతో ఆవేశం కలిగి వ్రాస్తున్న విషయం అని నా నమ్మకం. నాకు అసలు ఈ విషయం మీద ఒక టపావళి (బ్లాగు) వ్రాద్దాము అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ టప తో ఆపుతాను.

మన వేదాల్లో ఉన్న విషయాలు ఇతరమతాలలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి నాకు ఇస్లాం లో ఉన్న చాలా సృష్టిసూత్రాలు వైదీక (అదే ఈ మధ్యన "హైందవ" అంటున్నారు, అలాగా అనడం నాకు ఇష్టం ఉండదు) విశ్వాసాలకు దగ్గరగా అనిపిస్తాయి.

బ్రహ్మజ్ఞానానికి, సాంప్రదాయానికి, చాదస్తానికి చాలా దూరం ఉంది. బ్రహ్మజ్ఞానం అంటే అది ఏదో వైదీకులకి సంబంధించిన పదం లాగా వాడలేదు. అది పరమాత్ముడుకి (దేవుడుకి) సంబంధించిన జ్ఞానం అనే ఉద్దేశం తో అన్నాను. పరులకు హాని చేస్తే ఆ ఫలితం మనకు తగులుతుంది అనేది చాలా సామాన్యంగా తెలిసే సూత్రం. దాన్నే మనం కర్మసిద్ధాంతం అంటాము. ఇది ఒక పధ్ధతి కాదు, ఇది ఒక సూత్రం. ఇది దాదాపు అన్ని మతాల్లోనూ ఉన్నదే. ఏ మతంలో కూడా "నువ్వు వెళ్లి వెధవ పని చేసుకురా, దేవుడు నిన్ను క్షమిస్తాడు", అని చెప్పరు, నాకు తెలిసి.

అదే ఇస్లాంలో అమ్మాయిలు బురఖా వేసుకోవాలి అన్నదో, వైదీకుల్లో ఆడవాళ్ళు జడ వేసుకోవాలి అన్నదో - అది ఒక సాంప్రదాయం, ఒక పధ్ధతి, ఒక సామాజిక నిర్ణయం. అది పాటించకపోతే దేవుడికి కోపం వచ్చి చంపెయ్యడు. కాకపొతే, అది మన సమాజానికి మనం గౌరవం ఇస్తున్నాము, ఒక కట్టుబాటుకు నిలబడుతున్నాము అని చెప్పడానికి. "ఒక స్కూల్లో చదువుకునేటప్పుడు అందరూ ఒక uniform వేసుకోవలి" అన్నట్టే! స్కూలు చిన్నసమూహం ఐతే, సమాజం పెద్దసమూహం, అంతే తేడా!. సర్వసామాన్యంగా ఈ పద్ధతుల వెనుక ఒక సామాజికకారణం ఉంటుంది. ఆ కారణం కొన్ని సాంఘికపరిస్థితులను బట్టి ఏర్పడేది. కనుక పరిస్థితులు మారినప్పుడు అవి మారడంలో తప్పులేదు.

ఇక చాదస్తం అంటే అది సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా చేస్తే మిగిలేది. ఉదాహరణకి "వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు", అని కొందరు తలిదండ్రులు అనుకుంటారు. నిజానికి అందులో తప్పు కంటే ముందుచూపే ఎక్కువ ఉంది. ఐతే, అసలు హద్దుల్లో ఉండి మాట్లాడినా కూడా అది తప్పే అనడం చాదస్తంగా మారినట్టు అనిపిస్తుంది.

పాతతరం వారి నమ్మకాలను కొత్తతరానికి బోధిద్దాము అనుకుంటే అది కొత్తతరం వాళ్ళకి చాదస్తంలాగా, కొత్తతరం వాళ్లు వాళ్ల పద్ధతులని పెద్దవాళ్ళకు నేర్పిద్దాము అనుకుంటే అది వాళ్ళకు బరితెగించడంలాగా అనిపించడం సామాన్యం. ఐతే ఈ పాత నుండి కొత్తకు మారే దారిలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. "ఒక కట్టుబడి ఎందుకు పెట్టారు, దానిని తీసెయ్యడం వలన నష్టం ఏముంది?" అన్నది నవతరానికి అంతగా అర్థం కాదు. అర్థమైనా అది అనుభవం లేకపోవడం వలన దాని ప్రాముఖ్యత అర్థం కాదు. "అసలు అది కట్టుబడా లేక బ్రహ్మజ్ఞానంలో అంశమా?", అన్నది తెలుసుకోవడానికి వాళ్ళకి తీరిక, ఓపిక - ముఖ్యంగా కోరిక ఉండవు. కానీ అమ్మ, నాన్న చేసేదానికి రున్నింగ్ చొమ్మెంతర్య్ ఇవ్వమంటే మాత్రం సిద్ధం.

ఈ బ్రహ్మజ్ఞానం గురించి మతంలో గురువులు (అది వ్యాసుడు కావచ్చు, మొహమ్మద్ ప్రోఫేట్ కావచ్చు, గురునానక్ కావచ్చు, లేక జీసస్ క్రైస్ట్) కావచ్చు ఎంతో శ్రమించి తెలుసుకున్న సూత్రాలు మనం మన ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాము. నన్ను అడిగితే ఇది పూర్తిగా అజ్ఞానం. శంకరభగవత్పాదుడు కాని, రమణమహర్షి కాని, వివేకానందుడు కాని, పరమహంస కాని ఏళ్ల తరబడి చేసిన ధ్యానంతో సాధించి నిర్దేశించిన జ్ఞానాన్ని వీళ్ళు పుడుతూనే పొందేసినట్టు అనుకునేవాళ్ళను చూసి నేను చాలా బాధపడతాను అవుతాను.

ఒకసారి, ఒడుగు కాకుండా గాయత్రిమంత్రం చదవమని ఒకావిడ నాకు బోధించింది - నేను, "అది తప్పు", అన్నాను. దానికి ఆవిడ, "అయితే నీ నమ్మకం వేరు, నా నమ్మకం వేరు", అంది. అదేదో, "నీకు వంకాయకూర ఇష్టం నాకు బెండకాయ కూర ఇష్టం", అన్నట్టు. ఏమైనా అంటే ఎవరి అభిప్రాయలు వాళ్ళవి అనడం. అవును, అది వ్యక్తిగతమైన విషయాలకు. గాయత్రిమంత్రాన్ని ఆవిడే కనిబెట్టి, "ఫరవాలేదు నీకు ఇష్టం వచ్చినప్పుడు చదువుకో", అంటే అప్పుడు నేను అసలు ఏమీ అనుకోను. మనం కార్, బైక్, ఫ్రిజ్, టీవీ కొన్నప్పుడు మాత్రం మాన్యువల్ చదివి వాడుకుంటాము. అదే దేవుడు/దేవుడికి సంబంధించిన మంత్రాలు, తంత్రాలు మాత్రం మన ఇష్టం మనది! అవును, మరి దేవుడు ఎదురొచ్చి అడగడు కదా. ఒక మంత్రాన్ని సరిగ్గా వాడితే అది ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో, అదే తప్పుగా వాడితే అంతకన్నా ఎక్కువ దుష్ఫలితాన్ని ఇవ్వగలదు అని పెద్దల ద్వారా తెలుసుకున్నాను. ఇది స్వయంగా అనుభవించకుండా, పెద్దల దగ్గరనుండి తెలుసుకోకుండా (పెద్దలు అంటే తలిదండ్రులు కాదు. బ్రహ్మజ్ఞానంలో పెద్దలు అని) "నా ఇష్టం నాది, నా విలువలు నేను నిర్ణయించుకుంటాను", అనేవాళ్ళకి మనం ఏం చెప్తాము. "చెరువు మీద అలిగితే చేటెవరికి", అనుకుని విడిచిపెట్టేస్తాము.

నా విజ్ఞప్తి ఒకటే, "పెద్దలు ఏదైనా చెప్తే, అది ఎందుకు చెప్తున్నారో కోరికతో, ఓర్పుతో తెలుసుకోండి. అయినా అది మంచిది కాదు అనిపిస్తే అప్పుడు విడిచిపెట్టండి". మనిషికి అవయవాలు, మనస్సు, బుద్ధి, ఆత్మా - అదే వరుసలో జ్ఞానం కలిగి ఉంటాయి. ఎప్పుడూ బుద్ధిని నమ్మండి - మనసుని కాదు. మీ ఆత్మకి, బుద్ధికి సంబంధం ఏర్పడినట్లయితే అప్పుడు మీరే దేవుడు. అది అంత సులువు కాదు లెండి!

Thursday, August 7, 2008

నాకు స్ఫూర్తినిచ్చే పాట!


ఇది వ్రాసింది నేను అని చెప్పే అర్హత నాకు లేదు. అవి నా జీవితంలో అతి పెద్ద దెబ్బ తగిలిన రోజులు. బ్రతుకులో బాధ్యతలు తప్పితే కోరికలు/ఆశయాలు కనబడని రోజులు. మౌంటైన్ వ్యూ లో ఉన్నాను. ఒక ప్రభాతవేళ నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి వ్రాసింది ఈ పాటని, అని నా నమ్మకం.

ఈ పాటలో వ్యాకరణదోషాలు ఉండచ్చు - అప్పటికే నేను సంసృతంలో మాట్లాడి ఒక ఐదు ఏళ్ళు దాటింది. కానీ ఆ భావం నేను అనుభవించగలుగుతున్నాను...ఒక్క సారిగా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. కష్టానికి, సుఖానికి తేడా తెలియదు. నాలో ఉన్నా మనిషి చచ్చిపోయి, దైవం మిగుల్తుంది....శివోహం అనిపిస్తుంది. అది అనుభవించాలి!

మానవరూపేశివోహం, వర్ణధారాధృతోహం
అర్ణవమథనాసమయే గరళం పీత్వాపి సజీవోహం ||


మాయామృత్తికాయాముత్పన్న, వాంఛాలతాః దగ్ధ్వా
కాయం నిత్యమాఛ్ఛేదయామి, భస్మితలిప్సాః ధృత్వా
హృదయేజాతభావసందోహం, కఠిన్యేణ హత్వా
మానసరుద్రభూమ్యాం చరామి నిత్యం, మామేవ జీత్వా
నిత్యాహారం కపాలే సత్యం, స్థితప్రఙా మే వృషభవాహనం
సర్వేషామపి బంధువత్ అహం, నాస్తి మే కోపి మిత్రం ||


విధిదత్తం మహోత్తరం కార్యం, మానసకర్ణైః శ్రుత్వా,
నిత్యం తాన్ హి ధారామి కాయే , విషసర్పాః కృత్వా
అనుభవనామజటాం తు మూర్ధ్నే, గాఢతరేణ బధ్ధ్వా
నిరతం సమ్నియమ్య తిష్టామి, గాత్రగంగాం గృహీత్వా
సత్యేందుర్మే నిత్యభూషణం, లజ్జా మహ్యం భవతి అంబరం
అర్థాంగీ తు విధ్యుక్త ధర్మం, ఙానం భవతి త్రినేత్రం ||

మామూలు మాటల్లో చెప్పాలంటే:

మానవుడి రూపంలో ఉన్నా శివుణ్ణి నేను. అక్షరాల ధారను మోస్తున్నాను (శివుని ఢమరుకంలోనుండి శబ్దాలు వెలువడ్డాయి). సముద్రాన్ని మథనం చేసినప్పుడు పుట్టిన విషం తాగినా ఇంకా బ్రతికే ఉన్నాను.

మాయ అనే మట్టిలో (పాంచభౌతిక ప్రపంచం మాయ - అంటా మట్టే) పుట్టిన కోరిక అనే తీగలను నేను తగలబెట్టి ఆ బూడిదతో నన్ను నేను అలంకరించుకుంటాను. మనసులో పుట్టిన భావాల సమూహాన్ని నేను నిర్దాక్షణ్యంగా చంపి, ఆ స్మశానంలో, నన్ను (నా భావాలను) నేను జయించి తిరుగుతూ ఉంటాను. నాకు నిజమే ఆహారం. స్థితప్రఙ నాకున్న వృషభవాహనం (బలానికి, నిబ్బరానికి చిహ్నం). అందరికీ నేను బంధువునే. కానీ నాకు ఎవరూ మిత్రులు కారు. (నేను ఎవరడిగినా సాయం చేద్దామనే చూస్తాను. కానీ, నేను ఎవరి దగ్గరనుండి ఏది ఆశించను).

నాకు విధి ఒక కర్తవ్యాన్ని ఇచ్చింది. అది నా మనసు గ్రహించింది. ఆ కర్తవ్యాన్నే విషసర్పాలుగా ధరిస్తున్నాను. ఎంత కష్టమైనా, ప్రమాదమైనా అవే నాకు అలంకారం. అనుభవం అనే జడలో గంగలాగా ప్రవహిస్తున్న నా అంగాలను బలంగా బంధించి ఆ సంనియమంలోనే నేను సంతృప్తిని పొందుతాను. నాకు సత్యమే చంద్రుడివంటి భూషణం, లజ్జ నిజమైన కట్టుబట్ట, విధి నిర్దేశించిన బాధ్యతే భార్య (భరించవలసినది), ఙానం మూడో కన్ను.

నా జీవితంలో నన్ను అన్నిటికంటే ప్రభావితం చేసిన పుస్తకం మనిషి వ్రాసింది కాదు. మాధవుడు చెప్పింది, మహర్షి వ్రాసింది! అది భగవద్గీత. భగవద్గీతను అందరి కంటే యథాతథంగా అనుసరించేది - విష్ణువుకి అతిశ్రేష్ఠుడైన  భక్తుడు, మిత్రుడు - శివుడు. ఆ శివుడికి నేను చిన్నప్పటినుండి కింకరుణ్ని. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినవాల్లల్లో మొదటివాడు కూడా శివుడే. ఆయనకు మనసా, శిరసా అనేకకోటి నమస్కారాలు చేస్తూ నా చేతులమీద ఆయన వ్రాయించుకున్న పాట తిరిగి ఆయనకే అంకితం చేస్తున్నాను.