Showing posts with label అద్వైతం. Show all posts
Showing posts with label అద్వైతం. Show all posts

Sunday, July 24, 2016

గురుపాదుకా స్తోత్రం - తాత్పర్యం

ఎప్పటినుండో "గురుపాదుకా స్తోత్రం" నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మొన్న "గురు పౌర్ణమి" సందర్భంగా ఆ స్తోత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వ్రాసుకున్నాను. అది ఇక్కడ వ్రాస్తున్నాను.ఏమైనా పొరబాట్లు కనిపిస్తే చదువర్లు సరి చేయగలరు.

ఏదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు వచ్చే సమస్య: స్తోత్రం ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం. అదే సమస్య ఇక్కడా వచ్చింది. నేను "శృంగేరి శారదా పీఠం" వారి ప్రతినుఅనుసరించాను.

నాళీక నీకాశ పదాహృతాభ్యాం
నానా విమోహాది నివారికాభ్యాం
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

నాళీక - తామర పువ్వు
నీకాశ - వలె కనిపించు
పద ఆహృతాభ్యాం - పాదములను అంటిపెట్టుకునేవి
నానా - రకరకాల
విమోహ ఆది - వ్యామోహాలు మొదలైనవి
నివారికాభ్యాం - తొలగించేవి
నమత్ - నమస్కరించే
జన - జనుల
అభీష్ట తతి - కోర్కెలను అన్నింటినీ
ప్రదాభ్యాం - ప్రసాదించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

తామర పువ్వుల వంటి గురువు పాదాలను అంటిపెట్టుకున్న పాదుకలు రకరకాల వ్యామోహాలను తొలగిస్తాయి. నమస్కరించిన వారి కోర్కెలను అనంటినీ నెరవేర్చేవి. వాటికి నమస్సులు.

శమాది షట్క ప్రద వైభవాభ్యాం
సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం
రమా ధవాంఘ్రి స్థిర భక్తిదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

శమాది షట్క ప్రద - శమము మొదలుగా గల ఆరు లక్షణాలను ఇచ్చే
వైభవాభ్యాం - మహత్తు కలిగినవి
సమాధి - బ్రహ్మంతో ఐక్యత
దాన - ఇవ్వడం (అనే)
వ్రత - వ్రతాన్ని
దీక్షితాభ్యాం - దీక్షగా తీసుకున్నవి
రమా - లక్ష్మీ దేవి
ధవ - భర్త
అంఘ్రి - పాదాలు
స్థిర - నిలకడగా
భక్తిదాభ్యాం - భక్తిని ప్రసాదించేటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురు పాదుకలు (వివేక చూడామణిలో చెప్పబడిన) శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే మోక్షప్రదమైన గుణాలను ప్రసాదించే మహత్తు కలిగినవి. శ్రద్ధగా ఉన్న వారికి బ్రహ్మపదాన్ని అందించడమే కర్తవ్యంగా ఉన్నవి. నారాయణుని పాదాల పట్ల భక్తిని నిలకడగా ఉంచగలిగినవి. వాటికి నమస్సులు.

నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి
సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యాం
నృపత్వదాభ్యాం నత లోక పంక్తేః
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

నృప ఆళి - అనేక రాజుల
మౌళి - కిరీటాల
వ్రజ - గుంపు (యొక్క)
రత్న కాంతి - రత్నాల కాంతి (యొక్క)
సరిత్ - నది (లో)
విరాజత్ - మెరిసేటి
ఝష కన్యకాభ్యాం - అందమైన చేపల వంటివి
నత - నమస్కరించిన వారికి
లోక పంక్తేః - లోకాలు అన్నింటికీ
నృపత్వదాభ్యాం - ఆధిపత్యం ఇచ్చేటివి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

అనేకమంది రాజుల కిరీటాలను ఒక చోట చేర్చగా వాటిలో ఉన్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే అంతటి వెలుగులో కూడా మెరిసేటి చేపల వంటివి గురువు పాదుకలు. అంటే ఎంతటి సిరులు, అధికారం కూడా గురువు చెప్పుల పాటి చెయ్యవు. ఆ గురువు పాదుకలకు నమస్కరించిన వారికి అనేక లోకాల ఆధిపత్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగినవి గురువు పాదాలు. వాటికి నమస్సులు.

అనంత సంసార సముద్ర తార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

అనంత - అంతు లేని
సంసార - ప్రపంచం అనే
సముద్ర - కడలి (ని)
తార - దాటించే
నౌకాయితాభ్యాం - నౌకల వంటివి
గురుభక్తిదాభ్యాం - గురువు పట్ల భక్తిని ఇచ్చేటివి
వైరాగ్య - వైరాగ్యం అనే
సామ్రాజ్యద - సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళదాయకమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురుపాదుకలు అంతులేని సంసారం అనే కడలిని దాటించే నౌకలు. అవి గురువు పైన భక్తిని కలిగించి నిలుపుతాయి. అవి (నిస్సారమైన ప్రపంచం పై) వైరాగ్యం అనే సామ్రాజ్యాన్ని పొందడానికి పూజించదగినవి. వాటికి నా నమస్కారములు.

పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం
జాడ్యాబ్ధి సంశోషణబాడబాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

పాప - పాపము (అనెడి)
అంధకార - చీకటి (కి)
అర్క - సూర్యుల
పరంపరాభ్యాం - వరుస వంటివి
తాపత్రయ - తాపత్రయము (అనెడి)
అహి + ఇంద్ర - అత్యంత శక్తివంతమైన పాముకు
ఖ + గ + ఈశ్వరాభ్యాం - ఆకాశంలో సంచరించే వాటికి (పక్షులకు) అధిపతి (గరుత్మంతుడు - గెద్ద) వంటివి
జాడ్య + అబ్ధి - అజ్ఞానం అనే సముద్రాన్ని
సంశోషణ - ఎండబెట్టేటి
బాడబాభ్యాం - భయంకరమైన నిప్పు వంటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురువు పాదుకలు పాపము అనే చీకటిని మొత్తంగా నాశనం చేసేటి వేలాది సూర్యులతో సమానం. అవి తాపత్రయాలు అనే పాముని చంపేటి గెద్ద వంటివి. అజ్ఞానం అనే కడలిని ఎండబెట్టేటి బలమైన నిప్పు వంటివి. వాటికి నమస్సులు.

కవిత్వ వారాశి నిశాకరాభ్యాం
దౌర్భాగ్య దావాంబుదమాలికాభ్యాం
దూరీకృతానమ్ర విపత్తతిభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

కవిత్వ - కవిత్వం (అనే)
వారాశి - కడలి (కి)
నిశాకరాభ్యాం - చంద్రుడి వంటివి (వన్నె తెచ్చెడివి)
దౌర్భాగ్య - దురదృష్టం (అనే)
దావ - మంట (కు)
అంబుద మాలికాభ్యాం - నీటి మాలల (కుండపోత వర్షం) వంటివి
దూరీకృత - దూరం చెసినవి
ఆనమ్ర - మొక్కెడి వారికి
విపత్ తతిభ్యాం - ఆపదల వరుసను
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురు పాదుకలు కడలికి చంద్రుడి వలె విద్యకు వన్నె తెచ్చెడివి. దురదృష్టం అనే మంటను ఆర్పేటి జడివానలు. మొక్కెడి వారికి వచ్చిన ఆపదలను అన్నింటినీ తొలగించెడివి. వాటికి నమస్సులు.

నతా యయో శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

యయోః - వేటికైతే
కదాచిత్ - ఎప్పుడో ఒక సారి మాత్రమే
నతా - మొక్కిన వారు
అపి - అయినా
హి - కచ్చితంగా
ఆశు - వెంటనే
దరిద్రవర్యాః - అత్యంత దరిద్రంలో ఉన్న వారు
శ్రీపతితాం - సిరులకు నెలవు
చ - మరియు
మూకాః - మూగవారు
వాచస్పతితాం - మాటలకు నెలవు (దేవ గురువు బృహస్పతి)
సమీయుః - వలే ఐనారో
తాభ్యాం - వాటికి
శ్రీ గురుపాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

ఎప్పుడో ఒక సారి మాత్రమే మొక్కినప్పటికీ వెంటనే దరిద్రులను నారాయణునితో (లక్ష్మీ దేవి భర్త), మూగవారిని బృహస్పతితో సమానంగా కచ్చితంగా చెయ్యగల గురువు పాదుకలకు నమస్సులు

కామాది సర్ప వ్రజ భఙ్జకాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం
బోధప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

కామ + ఆది - కామము మొదలైన
సర్ప వ్రజ - పాముల వరుస
భఙ్జకాభ్యాం - త్రుంచేవి
వివేక - ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే తెలివి
వైరాగ్య - అశాశ్వతమైన వాటి పైన కోరిక లేకుండుట
నిధి ప్రదాభ్యాం - (వివేకము, వైరాగ్యము అనే) నిధులను ప్రసాదించెడివి
బోధప్రదాభ్యాం - జ్ఞానాన్ని బోధించేవి
ద్రుత - వేగంగా
మోక్షదాభ్యాం - మోక్షాన్ని కలిగించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురు పాదుకలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు పాములను (అరిషడ్వర్గం) నాశనం చేస్తాయి. వివేకం, వైరాగ్యం అనే గొప్ప సిరులను ప్రసాదిస్తాయి. జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, త్వరగా మోక్షాన్ని ఇస్తాయి. వాటికి నమస్సులు.

స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

స్వ - వాటిని
అర్చ - మొక్కడమే
పరాణాం - తమ కర్తవ్యంగా కలవారికి
అఖిల - అన్ని
ఇష్టదాభ్యాం - ఇష్టాలనూ నెరవేర్చేవి
స్వాహా - స్వాహా దేవి (కి)
సహాయః - తోడుగా ఉండెడి వాడిని (అగ్ని: ఆయన భార్య స్వాహా దేవి)
అక్ష - కన్నుగా కలవాడికి (శివుడికి)
ధురంధరాభ్యాం - సమానమైన శక్తి కలవాటికి
స్వాంత - హృదయం
అచ్ఛ - శుద్ధి
భావ - స్థితి
ప్రద - ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

వేటిని అర్చించడంలో మునిగిన వారికి అన్ని కోర్కెలూ నెరవేరుతాయో, శివుడికి ఉన్నంత శక్తి వేటికి కలదో, వేటిని పూజిస్తే మనస్సు నిర్మలమౌతుందో - ఆ గురువు పాదుకలకు నమస్సులు.

శ్రీ గురు పాదుకాభ్యాం నమః

Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

Sunday, February 24, 2013

కొన్ని పద్యాలు



మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.

సందర్భం
ఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో?

ఉత్పలమాల
చల్లని గాలి సోకినను జల్లులు తాకిననొక్క పూటలో
వెల్లువఁవోలె తుమ్ములిక వెల్వడు కాలము లెక్క లేనివై
చెల్లెను నీకె శంకరుడ జిల్లను గంగను నెత్తినుంచి నా
ఇల్లన మంచుకొండలను, యించుక గుడ్డయు లేక సుష్టుగా!

సందర్భం
కొత్త పద్యరీతులను నేర్చుకోవాలని మొదలుపెట్టి ఒక తోటకం వ్రాసాను. ఇందులో శివుడి శౌర్యం గురించి చెప్పాలి అని ప్రయత్నించాను. త్రిపురుని సంహారం, గంగావతరణం, దక్షయజ్ఞవిధ్వంసం, మన్మథ దహనం, పరశురామాది శిష్యుల విజయం, శివుడి ఆయుధాలు -- వీటిని ప్రస్తావించా(లనుకున్నా)ను.

తోటకం
త్రిపురాంతక! దేవఝరీ మదహా!
రిపుయాగవినాశక! శ్రీజహరా!
అపరాజితశిష్యగణార్చిత! పా
శుపతాస్త్రి! పినాకి! త్రిశూలి! నతుల్

సందర్భం
ఎప్పుడు చూసినా పనికిమాలిన విషయాల గోల తప్ప కాస్త సాధన చేద్దామంటే మనసు ఒప్పుకోదు. మధ్యమధ్యలో ఉపవాసం చేస్తేనైనా మనసుకు ఓపిక తగ్గి ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది అనే ఆశతో వ్రాసాను.

ఉత్పలమాల
చిత్తములోన యోచనలు చేరును కోట్లుగనెల్లవేళలన్
ఎత్తఱినే వికారములనెందుకు పొందెదనో ఎరుంగనే
విత్తము విద్య బంధువులు విందులు వింతలు స్త్రీలు సంగతుల్
మొత్తము జేరి ముంచఁ మది మోహములోఁ బడి చిక్కెనీశ్వరా!

చంపకమాల
వదలవు ఱెప్పపాటు గడువైన హృదంబును నీచసంగతుల్
కుదురుగనుంచలేను నిను గుండెల నిండుగఁ గాని శంకరా!
ఉదరమునుంచితిన్ శుచిగ నొక్కదినంబున క్రొవ్వు తగ్గె, నా
ఎదురుగ నీదు మూర్తి గననీక్షణమీక్షణముల్ తరించెరా!

సందర్భం
పరమేశ్వరుడి ఉపాధి మాయ, జీవుడి ఉపాధులు సామాన్యమైన ఇంద్రియాలు, మనసు, అహంకారం వంటివి. మనం శివుడితో పోరగలమా? అందుకే ఒక చిన్న చమత్కారం చేసాను. శివుడు నాకున్న అవిద్యని (అజ్ఞానం అన్నాను) ఏమీ చెయ్యలేడు అని అన్నాను. ఎందుకంటే ఆ అవిద్య నశిస్తే ద్వైతం కరిగిపోయి అద్వైతం మిగులుతుంది. అప్పుడు శివుడు, నేను అని నామరూపభేదాలు ఉండవు. ఉన్నది ఒక్క బ్రహ్మమే.

మేఘవిస్ఫూర్జితము
మదీయాజ్ఞానంబుంబెరుకఁదరమే మారసంహార నీకు
న్న, దివ్యాస్త్రవ్రాతంబునకు? పురహంత తుషారాద్రి వాస్త
వ్య, దుర్భేద్యోపాధుల్ తమరొకరికే వచ్చెనో? పోఱబోకో
యి, దానిన్ మర్దింపన్ మనుగడిట నీకేది? మృత్యుంజయుడా!

సందర్భం
తరళపద్యం వ్రాయాలని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అస్సలు అంతు చిక్కలేదు. ఎంత ప్రయత్నించినా గొంతులో కవిత్వం రాకపోతే నా కవిత్వం శివుడి గొంతులో విషం కంటే కఠినమైనది అని చమత్కరించాను.

తరళం
సరళరీతులవన్ని యుండగఁ జాలవంటిని శంకరా!
తరళపద్యము వ్రాయఁబూనితి, తప్పుఁజేసితినందువా?
గరళకంఠుడవందురందరు, కాని నాదు ప్రయోగమున్
సరిగ వీనుల విన్నవారలు సమ్మతించరు గాంచరా!

ఈ పద్యాలకు సద్విమర్శను ప్రసాదించి, సరిచేసిన పెద్దలు భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సోదరుడు రాఘవ కి నా నెనర్లు.


Tuesday, October 9, 2012

అంతా మాయే, అన్నీ ఆమే/అమ్మే

 శా:-

స్తన్యంబీయని తల్లియున్, శిశువులన్ సాకేటి దొడ్డాలియున్
మాన్యంబౌ సిరియున్ దురాశగొలిపే మాయాత్మికాశక్తియున్
కన్యల్ మ్రొక్కెడి మాతయున్! పురుషులన్ కాల్చేటి కామాగ్నియున్
సన్యాసుల్ సుఖభోగులున్ కొలుచుయా శర్వాణివీవే గదే!

 భా:-

బిడ్డకు పాలివ్వని తల్లివీ, పిల్లలను సాకే తల్లివీ నీవే. గౌరవప్రదమైన సంపదవూ నీవే, దురాశ కలిగించే మాయవీ నీవే. కన్యలు కొలిచే జగన్మాతవూ నీవే, మగవారిని దహించే కామాగ్నివీ నీవే. సన్యాసులు, భోగులు ప్రార్థించే శర్వాణివి నీవే.

శివుడు బ్రహ్మం, పార్వతి మాయ. ఆ రెండూ ఒక్కటే. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు: తడి, నీరు వేఱు వేఱుగా ఉంటాయా? తడి లేకపోతే అది నీరే కాదు. నీరే లేకపోతే అసలు తడే ఉండదు.

Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (1)

ఈవేళ సియాటల్లో వర్షం పడుతోంది. సియాటల్ గురించి తెలియని వాళ్ళు "ఔనా?" అనుకుంటారేమో కానీ సియాటల్ గురించి తెలిసినవాళ్ళు "అందులో పెద్ద విశేషమేముంది?" అనడగుతారు. సియాటల్లో ఏటికి సుమారు అరవై-డబ్భై రోజుల్లో మాత్రమే సూర్యుడు నిరాటంకంగా గగనవీధిలో సంచరిస్తాడు. మిగతా రోజుల్లో మబ్బులూ, వర్షం సహజం. సియాటల్ ని అందరూ ఎప్పుడూ చీకటిగా ఉండే చోటని ఆడిపోసుకుంటారు. కానీ నాకు సియాటల్ బాగా నచ్చింది. నేను ఇళ్ళు వెతికేటప్పుడు కొంచెం వాస్తు చూస్తాను. తత్ఫలితంగానో, కాకతాళీయంగానో ఎప్పుడూ వెలుతురు బాగా వచ్చే ఇళ్ళలోనే ఉన్నాను. సూర్యుడు బయటకు రావాలే కానీ, మళ్ళీ ఇంటికెళ్ళేంత వరకు మా ఇంట్లోకి చూస్తూనే ఉంటాడు. అందుచేత మాకు పగటి వేళలో చీకటి గొడవ లేదు. కాస్త మబ్బుగానో, నెమ్మదిగా చినుకులు పడుతుండగానో, వసారాలో కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు. వెనకటికి నేను నర్శీపట్నం దగ్గర ఉండేటప్పుడు తోటల్లో తరచూ ఇదే చేసేవాళ్ళం.

ఏ విషయం గురించి మాట్లాడినా చివరకు ఆవు వ్యాసం అప్పజెప్పే కుఱ్ఱాడిలాగా, ఎటు తిప్పి ఎటు తిరిగినా నా మనసు గుర్తుచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి వేటూరి. వానకీ వేటూరికి బలమైన సంబంధమే ఉంది. వేటూరి వ్రాసిన వానపాటలు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కొన్ని పాటల్లో భావం ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి సునిశితంగా, మఱో సారి బాహాటంగా ఉంటుంది. విషయం భక్తి ఐనా, బూతైనా పదాలను పట్టుకోవడంలో వేటూరి చాకచక్యం ఏ కవినైనా కవ్విస్తుంది. వానపాటల్లో మరీను.

నాలోని శ్రోతకి వేటూరి ఎన్నో బహుమానాలు (అవే, పాటలు) ఇచ్చాడు కానీ నాలోని కవికి వేటూరి ఇచ్చిన స్ఫూర్తి కంటే, భయమే ఎక్కువ. పదాలను, భావాలను అనర్గళంగా, అనాయాసంగా చెప్పగలిగిన వేటూరిని చూస్తే నాకు "మన వల్ల కాదు బాబు!" అనిపిస్తుంది. ఒక్కోసారి చలనచిత్రాలలో చూపించినట్టు నా అంతరాత్మ ఎదుటపడి వివాహభోజనంబు చిత్రంలో కోట శ్రీనివాస రావు లాగా, "రాస్తే అట్టాంటి పాట రాయలే. బాలీ, నీ లెక్క ఔలా పాట రాస్తాడనుకున్నావ్రా?" అంటుంది.

సియాటల్లో వరుసవానల పుణ్యమా అని నాకు ఏ రోజు మానసిక పరిస్థితిని బట్టీ ఆ రోజు, వర్షం ఒక వేటూరి పాటను గుర్తు చేస్తుంది. ఉన్న మాట చెప్పుకోకపోవడం ఎందుకు. గుర్తొచ్చే పాటలలో అత్యధిక శాతం ప్రణ్యశృంగారావేశభరితంగా ఉంటాయి. అదే, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే పచ్చిగా ఉంటాయి. అర్థమైనవాడికి పదాలనే తీయని గుజ్జు వెనుక చేదైన బూతు విత్తనం తగలవచ్చును. అర్థం కానివాడికి వగరు తొక్క వెనకాల తీయని గుజ్జు కనిపించకపోవచ్చును. ఎవరేమన్నా ఆ పాటల్లో వగరూ, తీపి, చేదు అన్నీ ఉన్నాయి. వెరసి అది మావిడి పండు. కొంచం గంభీరంగా చెప్పాలంటే చూతపాకం అనాలేమో. అన్నట్టు మన్మథుడిని చూతాస్త్రుడు అంటారని బ్రౌహ్ణ్య నిఘంటువు ఉవాచ. వేటూరి పాటలలో ఉత్తుంగశృంగారభావాల కారణంగా ఆ కోణంలో కూడా ఆయన పాటలని చూతపాకం అనడం సబబేమో.

వాన చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయి? ఉరుము, మెరుపు, తళుకు, తొలకరి, జల్లు - ఇలాగ ఒక dozen పదాలుంటాయనుకోండి. వేటూరి కనీసం ఒక పాతిక వానపాటలు వ్రాసారు అనుకుంటున్నాను. ఉన్న డజను పదాలతో ఈ పాటల మధ్యన ఎంత వైవిధ్యం కుదురుతుంది? సందర్భాన్ని కూడా కలుపుకుందాము అంటారా? అవును శంకరా నాదశరీరాపర సందర్భం వేఱు, వాన వల్లప్ప వల్లప్ప సందర్భం వేఱు. కానీ "మన తెలుగు చలనచిత్రాలలో ఎన్ని సందర్భోచితమైన పాటలు ఉంటాయి?", అని ఆలోచిస్తే, ఆ పాతిక పాటల్లో పదిహేను పాటలకు సందర్భం ఇదే: "చిరంజీవికి, హీరోయిన్ కి love. వాన పడింది. పాట వ్రాయలయ్య కవి". ఐనా కూడా పాట పాటకీ కొత్త కొత్త భావాలను, పదాల గారడీని చూపించారు వేటూరి.

మొదట మనం భక్తి రసంతో మొదలేడదాము. వానపడుతోంది. ఒక భక్తుడులో "తను చేస్తున్న మంచిపనికి లోకం ఎందుకు హర్షించట్లేదు" అనే ఆవేశం కలిగింది. దాన్ని సాహిత్యంలో ఎంత ఎత్తుకు తీసుకెళ్ళవచ్చును అని (కే) విశ్వనాథుడు, (కే.వీ) మహాదేవుడు వేటూరిని అడిగితే, దానికి వేటూరి వినమ్రంగా ఇలా బెదిరించారు. శంకరాభరణం చిత్రంలో...
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది
అవధరించరా! విని తరించరా!
ఈ సంస్కృతం అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పటికీ నాకు అర్థమైనది సరో కాదో తెలియదు కానీ, "పొగరుతో (ధిక్కరి) ఉన్న ఇంద్రుణ్ణి జయించిన హిమ గిరీంద్రుడి (ఇంద్రుడి వర్షానికి, గాలులకీ హిమాలయాలు కదలవు కదా?) చలువు (సిత) గొంతులో (కంథర) నిండిన నీలకంథరా (విషం గొంతులో ఉన్నవాడు). సామాన్యులు (క్షుద్రులు) తెలుసుకోలేను రుద్రవీణ నిర్నిద్ర (అలుపు లేని) గానమిది, విను (అవధరించు), విని తరించు (సంతోషించు)". లోకులు మనిషిపై పెట్టే ఒత్తిడిని ఇంద్రుడితో పోల్చి, దాన్ని గెలిచిన హిమాలయాలను మనిషి పట్టుదలతో పోల్చి, అటువంటి మనిషిని ఆదరించేవాడిగా శివుణ్ణి వర్ణించి, కేవలం ధర్మాత్ములకు మాత్రమే అర్థమయ్యే తన జీవనగీతాన్ని చూసి సంతోషించమని శివుణ్ణి అడుగుతున్నాడు. ఆ అడగటంలో కూడా శంకరశాస్త్రి గాంభీర్యం మనకు కనబడుతుంది. అది వేటూరి సత్తా.

ఆ తఱువాత
మెరిసే మెరుపులు మురిసే పెదవుల ముసిముసి నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకుజారెనా శివగంగా
నా గానలహరిఁ నువు మునుగుంగా, ఆనందవృష్టిఁ నే తడువంగా
శివుడు పెట్టిన పరీక్షకు తను ఎలాగ ప్రతిస్పందిస్తున్నాడొ చూద్దామని లీలావినోది ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవి మెరుపులయ్యాయని, తన నడవడికి, గానానికి సంతోషించి శివుడు చేసే నాట్యంలో తుళ్ళుతున్న మువ్వల అలికిడి ఉరుములగానూ, ఆ వర్షం శివుడు తాదాత్మ్యంలో ఉండటం వలన గంగ క్రిందికి ఒలకడం గానూ వర్ణించడంలో వేటూరి మఱొక్క సారి "యద్భావం, తద్భవతి" అనే నానుడిని గుర్తుచేసాడు. శంకరశాస్త్రి "శాస్త్రి". శాస్త్రాలను, భగవంతుణ్ణి మూలంగా ఉంచుకుని నడిచే వ్యక్తి. అతనికి ఆకు కదిలినా, పువ్వు మెదిలినా శివలీలగా అనిపిస్తుంది. ముందు చరణంలో అచంచలమైన గాంభీర్యం పక్కనే రెండో చరణంలో చలింపజేసే భక్తి. వేటూరి కత్తికి రెండు వైపులా కాదు, తొమ్మిది వైపులా (నవరసాలు) పదునే.

ఒక్క ఉదాహరణే ఇస్తే ఎలాగ అంటారా? సరే వేటూరి గురించి పుస్తకాలే వ్రాసినవాళ్ళు ఉన్నారు. నేను మఱొక ఉదాహరణ ఇవ్వలేనా? సరిగమలు చిత్రంలో రవి శంకర్ శర్మ (బొంబాయి రవి) సంగీతానికి వేటూరి వ్రాసిన మాటలు చూద్దాము. ఇది వాన పాట కాదు కానీ వానతో కూడిన భావం. అంటే నిఖార్సైన ఉదాహరణే. అప్పటిదాకా సంగీతం చేతకాని వాడు గురువు అనుగ్రహం వలన, దైవబలం వలనా గొప్ప పాటగాడయ్యాడు. అప్పుడు వేటూరి అన్న మాటలు:
కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
అద్వైతభాష్యాలను చదివిన వాళ్ళకు కుండలో నింగి అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మమంతా ఒకటే అనడానికి దృష్టాంతాలంకారంతో గౌడపాదులు (శంకరాచార్యుల గురువుకు గురువు) చెప్పిన ఉదాహరణ ఇది.
బ్రహ్మం ఆకాశంలాగా అంతటా ఉంది. కుండలలోనూ ఉంది, బయటా ఉంది. కుండల వలన అది వేఱు వేఱుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే మాయ (మట్టి)ని తొలగిస్తే అంతటా ఉన్నది బ్రహ్మమే (ఆకాశమే). 
అలాగే ఇన్నాళ్ళూ తనలో ఉంచుకున్న సంగీతశక్తి తనకు ఆ కుండ అవధి కాదని తెలుసుకుని ఒక్కసారిగా ఉరిమింది అని కవి భావన. ఈ మధ్యన నేను అద్వైతసాహిత్యం ఎక్కువగా చదవడం వలన నాకు ఈ విషయం అర్థమైంది. తఱువాత సోదరుడు ఫణీంద్ర పుణ్యమా అని కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో వేటూరి ఇచ్చిన వివరణ చదివిన తఱువాత మరింత సంతోషం కలిగింది. వేటూరి భావాలను అర్థం చేసుకోగలగడంలో ఉండే తృప్తి అలా ఉంటుంది.  వెయ్యండిరా నూరు వీరతాళ్ళు అనాలనిపించట్లేదు?

కొనసాగుతుంది...

Sunday, October 2, 2011

వివేక చూడామణి - 2

శంకరాచార్యులు బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పారు. ఉత్తుత్తి వాదాల కోసం బ్రహ్మాన్ని గురించి చర్చించుకోవడం అనవసరం అని అదే విషయాన్ని మఱొక్క సారి చెప్తున్నారు.

వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా

భా:- వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు.

సనాతనధర్మంలో పదే పదే చెప్పే విషయం, గురుశుశ్రూష. కృష్ణపరమాత్ముడు కూడా ఆయన గురువు దగ్గర కొంత కాలం ఉండి విద్యలభ్యసించారు. అలాంటిది మామూలు మనుషులెంత? అందుకే శంకరాచార్యులు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళమన్నారు.

అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమం

భా:- ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక గురువును సమీపించాలి.

ఒక వ్యక్తి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి నాలుగు లక్షణాలు ఉండాలి. వీటిని శంకరాచార్యులు లక్షణాలు అనలేదు, సాధనాలు అన్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మన కర్తవ్యం (అద్వైతభావం) పూర్తి చేసుకోవాలి.

ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే
ఇహాముత్రఫలభోగవిరాగస్తదనంతరం
శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం


ఈ సాధనాల గురించి ఒక్కొక్కటిగా వివరించారు.

1. నిత్యం, అనిత్యం -- ఈ రెండిటి మధ్యనా భేదాన్ని గుర్తించగలగడం

నిత్యం, అనిత్యం మధ్యన భేదం సులభంగా తోచుతుంది. కానీ, దాన్ని అనుసరించడం చాలా కష్టం. ఉదాహరణకు మనం ఒక కొత్త వస్తువు కొనగానే పగిలిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది.మనకీ తెలుసును, ఆ వస్తువు ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేదేనని. కాకపోతే, తెలియడం వేఱు, దాన్ని జీర్ణించుకోవడం వేఱు. శంకరాచార్యులు చెప్తున్నది అది బుద్ధిలో పూర్తిగా జీర్ణించుకుపోవడం గురించి. 

2. ఇహంలో, పరంలో భోగాలపై విరక్తి

ఈ లోకమే కాదు, ఉన్నతలోకాలు కూడా శాశ్వతమైనవి కావు. మోక్షం మాత్రమే శాశ్వతమైన స్థితి. అందుకే పాపపుణ్యాలు రెండూ ముముక్షువుకు ప్రతిబంధకాలని శాస్త్రాలు చెప్తున్నది. అన్నమయ్య అన్నట్టు "భారపు పగ్గాలు, పాపపుణ్యములు". ఒక రూపాయి దానం చేసిన వెంటనే మనసులో ఒక తృప్తి పుడుతుంది, "ఈ రోజు ఒక మంచి పని చేశాను", అని. అంటే ఆ దానానికి ప్రతిఫలం అప్పుడే అనుభవిస్తున్నాము. "నా డబ్బు నేను ఇంకొకడికి దానం చేసాను" అనుకుంటూ చేసిన దానం పుణ్యం అవుతుంది, మఱో జన్మలో మనకు వెనక్కొస్తుంది. ఇది మంచి విషయంలా అనిపిస్తున్నా, ఆ పుణ్యం వెనక్కి రావాలి అంటే మనకు మఱో జన్మ ఉండాలి కదా? అందుకే దానం చేసేటప్పుడు, "ఇది నా ధర్మం. ఈ డబ్బు నాది కాదు.", అనే భావం ఉండాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినది.

దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం

భా:- "ఇది ఇవ్వడం నా ధర్మం" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయంలో, సందర్భంలో ఇచ్చే దానమే సాత్త్వికమైన దానం.

దానం చేసాను అనే సంతృప్తి కలగడం ఇహంలో భోగం, ఈ డబ్బు నాది అని మనసులో ఉండటం పుణ్యలోకాలలో భోగాన్ని ఆశించడం -- ఈ రెండూ మనను దానం చేసినప్పుడల్లా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుస్తోందిగా ఆ రెండవ సాధనం పొందటం ఎంత కష్టమో? ఇది సాధన చేస్తూ ఉంటే కానీ రాదు.

వైరాగ్యాన్ని శంకరుడు వర్ణించిన తీరు:

తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః
దేహాదిబ్రహ్మపర్యంతే హ్యానిత్యే భోగవస్తుని

భా:- దేహం మొదలుకొని బ్రహ్మం వరకు అనిత్యమైన వస్తువులందు "నాకు వద్దు" అనే భావం కలగడం వైరాగ్యం.

మనిషికి అన్నిటికంటే సులువుగా లభించే ఆనందాలు ఇంద్రియాలనుండి వస్తున్నాయి. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన, స్పర్శ -- ఇవే కదా వస్తువుల ద్వారా వస్తున్న ఆనందం. ఇవి కేవలం శరీరాన్ని సంతృప్తిపరచవచ్చును (తినడం), మనసుని సంతృప్తి కలిగించవచ్చును (ఇష్టమైనవారిని చూడటం), బుద్ధికి సంతృప్తిని కలిగించవచ్చును (కష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి). ఇవేవీ శాశ్వతం కావు. అందుకే ఇది వద్దు, ఇది వద్దు అనే వదులుకుంటూ కేవలం శాశ్వతమైన (బ్రహ్మపదం) వాటిని కోరుకోవడమే వైరాగ్యం.

3. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)

శమాది లక్షణాలన్నిటికీ నైఘంటికవివరణలు ఉన్నా శంకరాచార్యులు ప్రత్యేకించి వివరించారు.

3.1. శమం

విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే

భా:- మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని అధీనంలో ఉంచుకోవడం).

3.2. దమం

విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే
ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః

భా:- రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.

3.3. ఉపరతిః

బాహ్య అనాలంబనం వృత్తేరేషోపరతిః ఉత్తమా

భా:- బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.

3.4. తితిక్ష

సహనం సర్వదు:ఖానాం అప్రతీకారపూర్వకం
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే

భా:- అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడాన్ని ఉపరతి అంటారు.

3.5. శ్రద్ధ

శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం
సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే

భా:- ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.

3.6. సమాధానం

సర్వదా స్థాపనం బుద్ధః  శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనం

భా:- ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.

4. ముముక్షుత్వం

అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్
స్వస్వరూపావబోధేన మోక్తుమిఛ్ఛా ముముక్షుతా

భా:- అహంకారం మొదలుకొని ఈ దేహం వరకు అన్నిటిపైనా అజ్ఞానం వలన మనం కల్పించుకున్న బంధాలను, వీటి స్వరూపాలను అర్థం చేసుకుని, తెంచుకోవాలనే కోరికే ముముక్షుత అంటారు.

ముముక్షుత్వం అంటే "మోక్షం కావాలి" అనే బలమైన కోరిక. ఇది అన్నిటికీ మూలమైనది. మోక్షం కావాలనుకోబట్టే మనకు వివేకం, వైరాగ్యం, శమాది గుణాలు సాధనాలు అవుతున్నాయి.

"బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మోక్షానికీ తేడా ఉందా?" అని అడగవచ్చును గాక. బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైన పని అంటే మోక్షం గురించి బలమైన కోరిక లేకపోతే మధ్యలో ఆగిపోతారు. ఒక సారి బ్రహ్మైక భావాన్ని అనుభవిస్తే ఇంక ఈ లోకం పైన మక్కువ ఉండదు. అందుచేత బ్రహ్మజ్ఞానం, మోక్షం పక్కపక్కనే ఉంటాయి అని నాకు అర్థమనది.


చిలక మనం నేర్పిన మాటలనే (ఆ పదాలు అర్థం కాకపోయినా) మళ్ళీ మాట్లాడుతుంది. అలాగే పైన చెప్పినవన్నీ శంకరాచార్యులు చెప్పినవి నేను (నాకర్థమైనంతలో) మళ్ళీ చెప్పాను. ఇవన్నీ జీర్ణించుకోవడానికి నాకు సంవత్సరాలు పడతాయి. ఇలాగ వ్రాయడం వలన కేవలం నాకు మననం చేసుకోవడం సులువౌతుంది, ఈ గ్రంథాన్ని చదువని వారికి పరిచయం ఏర్పడుతుంది.

Thursday, September 29, 2011

వివేక చూడామణి - 1

సనాతన ధర్మానికి వేదాలు మూలం. వేదాలు తిరుగు లేనివన్నది సనాతనధర్మంలో మొదటి సూత్రం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు తరతరాలుగా సనాతనధర్మంలో గురుముఖతః ప్రచారం ఔతూ, పరంపర ద్వారా కొనసాగుతూ వచ్చాయి.

భారతంలోనే చార్వాకం, బౌద్ధం, జైనధర్మం మొదలైన మతాలు ఉన్నాయి. ఇవన్నీ వేదాల యొక్క పరమోత్కృష్టతని ఉల్లంఘించిన మతాలు. శంకరాచార్యుడు జన్మించిన సమయానికి ఇవన్నీ భారతదేశంలో బలంగా పాతుకుపోయాయి. సనాతనధర్మానికి విలువ లేక, నాస్తికత ప్రజ్వలించింది. అటువంటి సమయంలో శంకరాచార్యులు వాటన్నిటినీ తిరస్కరించి తిరిగి భారతదేశంలో సనాతనధర్మాన్ని పునఃస్థాపించారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసి, వారి గురువులైన గోవిందభగవత్పాదుల అనుగ్రహంతో అద్వైతాన్ని జగత్తుకు అందించారు. ముప్పై రెండేళ్ళ జీవితంలో ఆయన సాధించిన విజయాలను, ఆయన అందించిన భాష్యాలను, స్తోత్రరత్నాలను పరిశీలిస్తే ఆయన దైవాంశసంభూతులనడంలో, ఆత్మవంచన చేసుకోని ఏ ఒక్కరికీ, సందేహం ఉండదు.

శంకరాచార్యుల గురించి చెప్పడానికి ఒక జీవితం సరిపోదు. కానీ, ఆయన ఆశించినది, ఆయన గురించి మనం చెప్పుకోవడం కాదు, మనం అద్వైతానుభవాన్ని పొంది విముక్తులమవ్వాలని. అందుకే ఆయన ఆలోచనల సారాన్ని మనకు వివేకచూడామణి గా అందించారు. ఆ వివేకచూడామణి శ్లోకాలను, స్వామీ తురియానంద వ్రాసిన అనువాదాన్ని ఈ మధ్యనే నేను చదివాను.

వివేకచూడామణికి, భగవద్గీతకి చాలా దగ్గర సంబంధం ఉన్నా వివేకచూడామణి అధ్యాత్మికంగా చాలా పురోగమించినవాళ్ళకు తప్ప జీర్ణం కాదు. భగవద్గీతలో పిల్ల, పెద్ద, పండితుడు, పామరుడు అందరూ అర్థం చేసుకోగలిగిన ఘట్టాలు ఉంటాయి. కృష్ణపరమాత్మ కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలను సూచించి వీటిల్లో భక్తియోగం సులభమైనదని, అందరికీ ఆచరణయోగ్యమైనది అని నిర్దేశించాడు. అది మనందరికీ శిరోధార్యం. ఆది శంకరుడు భారతదేశాన్ని చుట్టినప్పుడు బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధమతం వేదాలను, ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తుంది. మఱొక్క అడుగు ముందుకేసి ఏకంగా "ఆత్మ" అనేదే లేదు అంటుంది. అటువంటి వారితో వాదించి సనాతనధర్మ వైశిష్ట్యాన్ని చూపడానికి శంకరుడు కూడా అదే స్థాయి abstraction ని ఉపయోగించి, వారి వాదనాపద్ధతులను కూడా అనుసరించి వారిని ఓడించారు. స్వయంగా భక్తిమార్గాన్ని కూడా అనుసరిస్తూనే, జ్ఞానమార్గంలో వెళ్ళి ఉపనిషత్తులను ఎంతో లోతుగా అధ్యయనం చేసి, వాటి సారం జీవాత్మ-పరమాత్మల యొక్క ఏకత్వమని, ఆ అద్వైతాన్ని ప్రబోధించారు.

అధ్యాత్మవిద్యను అధ్యయనం చేయడం చాలా కష్టం, దాన్ని ఆచరించడం మరింత కష్టం. అందుకే కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఇలా అన్నాడు:

మనుష్యాణాం సహస్రేషు, కశ్చిత్ యతతి సిద్ధయే
యతతాం అపి సిద్ధానాం, కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః

దీని భావం, "వెయ్యిమంది మనుషులలో మోక్షం కొఱకు ప్రయత్నించేవాడు ఒక్కడు ఉంటాడు. అలాంటివారిలో ఎవరో ఒకరికి మాత్రమే నేను అర్థమవుతాను", అని.

కృష్ణుడు చెప్పిన యోగాలన్నీ కూడా, "అనుసరిస్తున్నాము" అనుకుని ఆత్మవంచన చేసుకునేవారు నిత్యజీవితంలో కనిపిస్తూ ఉంటారు. జీవితాంతం తన సంతృప్తి కోసం కర్మలని ఆచరిస్తూ, ఫలితాలను చూసి మురిసిపోతూ చివరికి అంతా భగవంతుడికి అర్పిస్తున్నాను అనుకుంటారు. అది కర్మయోగమని వారు అనుకున్నా, ఒక రకంగా చెప్పాలి అంటే ఎంగిలే. మఱి కొందరు జ్ఞానయోగంలో ఉన్నాము అనుకుంటూ పుస్తకాలు తిరగేస్తూ వాదించుకుంటూ ఉంటారు. పఠనం, వాదన రెండూ తప్పు కావు కానీ, ఆ వాదనలో ఎంత వరకు మోక్షప్రయాస ఉందో కూడా గమనించుకోకుంటే అది పాండిత్యం కాదు, శబ్దప్రచ్చన్నపామరత్వం అవుతుంది. ధ్యానయోగం పేరుతో అంతర్యానం చేసుకోకపోతే అది నిద్రతోనే సమానం. అందుకే అర్జునుడు కూడా ధ్యానయోగాన్ని కృష్ణపరమాత్మ సూచించగానే "నా వల్ల కాదు", అన్నాడు. చివరిగా భక్తియోగం అనుసరిస్తున్నాము అనుకునే వారు కూడా సమదర్శిత్వాన్ని, స్థితప్రజ్ఞని, అనన్యచింతనని ఇవ్వకపోతే భగవంతుడికి కొంచెం దగ్గరవ్వడం, పుణ్యార్జన జరుగుతాయి కానీ, మోక్షాణికి ఒకడుగు ఇటు ప్రక్కన వదిలేసే అవకాశం ఉంది.

ముఖ్యంగా భక్తిని సరిగ్గా అర్థం చేసుకోని వారు ఆ మార్గంలో వెళ్తున్నాము అనుకుంటారే కానీ పరమాత్ముణ్ణి కూడా తమ దైనందినజీవితంలో ఒక వస్తువు లాగా భావించే ప్రమాదంలో ఉంటారు. భక్తి పేరుతో కొందరు, ప్రజల సొమ్ము దోచుకున్నదంతా దోచుకుని, దేవాలయాలకు కిరీటాలు విరాళంగా ఇచ్చి వారి పాపాలు తొలగిపోయాయి అనుకుంటారు. కొందరు రోజూ పొద్దున్న దణ్ణం పెడుతూనే దేవుడు వారికేదో ఋణపడిపోయినట్టు భావిస్తుంటారు. అడిగితే, "He is my best friend." అంటారు. మఱి కొందరు నామమాత్రంగా పూజలు, జపాలు చేస్తూ ఉంటారు. పూజ, జపం చేసినప్పుడల్లా దృష్టి ఫలితం మీదనే. ఆ ఫలితం ప్రసాదం కావచ్చును, కార్యసిద్ధి కావచ్చును. కొందరు మాత్రమే దైవాన్ని తలుచుకున్నప్పుడు ఆ దైవం సామీప్యతను అనుభవించగలుగుతారు. 

ఈ విషయాన్ని గుర్తించో ఏమో శంకరులు నిర్ద్వంద్వంగా ఈ విధంగా అన్నారు:

5. పఠంతు శాస్త్రాణి, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంతు దేవతాః
ఆత్మైకబోధేన వినాపి ముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేऽపి

13. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః
న స్నానేన, న దానేన, న ప్రాణాయామశతేన వా

ఈ శ్లోకాల భావం "శాస్త్రాలు చదివినా, దేవతల ప్రీత్యర్థం యజ్ఞాలు చేసినా, దేవతలను భజించినా, మనిషి తాను ఆత్మ అన్న విషయం తెలుసుకోకపోతే కోటి-కోటి సంవత్సరాలైనా ముక్తిని పొందలేడు. పుణ్యనదీస్నానాలు, దానాలు, ప్రాణాయామాదులు సత్యం తెలుసుకోవడానికి దోహదపడవు. కేవలం గురూక్తులపైన దృష్టిని ఉంచి అర్థం చేసుకోవడం వలనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ", అని.

భక్తియోగాన్ని నమ్మినవారికి ఈ రెండు పద్యాలూ కర్కశంగా తోచవచ్చును. స్వయంగా కృష్ణపరమాత్ముడే "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని చెప్పాడు కదా? మఱి దేవుడు మోక్షాన్ని ఇవ్వడంటారేమిటి అని. శంకరాచార్యులు చెప్తోన్నది ఈ దేహంలోని వాసనలు నీకు ఉన్నంత కాలం, "నేను" అన్నప్పుడు "దేహాన్ని" కూడా కలుపుకొంటున్నంత కాలం నీకు ముక్తి లేదు అని. భక్తిమార్గంలో కూడా సరిగ్గా పయనిస్తున్నవారికి ఆత్మైక భావం కలుగుతుంది. అది కలగకుంటే ఎక్కడో పొరబాటు ఉంది అని.

శంకరుడు వివేకచూడామణిలో రెండుమూడు సార్లు తప్ప దేవుడు అన్న పదాన్ని ప్రస్తావించలేదు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమో, ఆయనకు భక్తియొగంపైన నమ్మకం లేకనో కాదు. కర్మ, జ్ఞానం, ధ్యానం, భక్తి -- ఏ యోగాన్ని అనుసరించిన ముముక్షువుకైనా ఆయన చెప్పిన విషయాలు ఏదో ఒక సమయంలో ఎదురౌతాయి అని.

(ఇంకా ఉంది...)