Showing posts with label జొన్నవిత్తుల. Show all posts
Showing posts with label జొన్నవిత్తుల. Show all posts

Friday, May 3, 2013

తెలుగందాలే - వేటూరి

ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.



“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది.

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.
ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.
ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.
గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.
ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.
అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.

Wednesday, December 7, 2011

శ్రీరామరాజ్యం పాటలు - 1

(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)

శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు ఆయన. సంస్కృతంలో disco పాట (మహర్షి చిత్రంలో "ఊర్వశి - అస్మద్విద్వత్విద్యుత్ దీపిక త్వం ఏవ"), తెలుగు తిట్లదండకం (ష్...గప్ చుప్ లో "ఒరేయ్ త్రాపి") లాంటి ప్రయోగాలెన్నో చేసారు. గతంలో కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి  పాట గురించి కూడా చెప్పాను.

శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.

1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!

ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
  • "రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే" - మకారంతో వేసిన అనుప్రాస.
  • "రామశాసనం తిరుగులేనిదని జలధి బోధ చేసె" - రాముడు సముద్రుడిపై బాణాన్ని వేసిన ఉదంతం గుర్తు చెయ్యడం.
  • "రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం" - భక్తియోగాన్ని రెండు ముక్కల్లో వివరించడం.
  • "శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే" - భక్తులకు మనసులో కలిగే భావాన్ని కూడా ఒక్క ముక్కలో చెప్పడం.
పాట మొదటి చరణం ముందు వచ్చే వాయిద్యాల సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఇళయరాజకు తప్పితే ఇంత ఆర్ద్రత కలిగించే సంగీతం ఎవరికి సాధ్యపడుతుంది అనిపించేలాగ ఉంది.

2. శ్రీరామ లేరా ఓ రామ!
    ఈ పాటలో ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేసారు జొన్నవిత్తుల. వాల్మీకి రామాయణం చదివితే రాముడి గురించి ఏమనిపిస్తుందో అలాగే ఉంది ఈ వర్ణన. ఒక్కో వాక్యమూ కడిగిన ముత్యం.
    • "దరిసనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరథి"  - ఎవరైనా (ప్రజలు/భక్తులు) పిలువగానే రాముడు ఆలస్యం లేకుండా వెళ్తాడు.
    • "తొలుతనె ఎదురేగి కుశలమునడిగి హితమ్ను గావించే ప్రియవాది" - తాను రాజుననే గర్వం లేకుండా ఎవరైనా వస్తే తానే ముందుగా వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చి, "ప్రియం కలిగే విధంగా" మాట్లాడేవాడు రాముడు.
    • "ధీరమతియై, న్యాయపతియై ఏలు రఘుపతియే, ప్రేమస్వరమై స్నేహకరమై మేలునొసగునులే" - శ్రీరాముడు స్థిరమతి (స్థితప్రజ్ఞుడై) న్యాయం నిలబెడతాడు, అలాగే అనురాగం నిండిన గొంతుతో మంచి చేస్తాడు. ఇక్కడ స్నేహకరం అనడంలో నాకు శ్లేష గోచరిస్తోంది. స్నేహం కలిగించే విధంగా ఉండేది స్నేహకరం. రాముడు స్నేహకరమయ్యాడు అంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా నడుచుకున్నాడు అని. అలాగే, కరం అంటే చెయ్యి అనే అర్థం ఉంది. కనుక రాముడు స్నేహంతో నిండిన చెయ్యిగా మారి మేలు చేస్తాడు అనే ధ్వని కూడా ఉంది. అద్భుతం!
    • "అందరునొకటేలే, రాముడికి ఆదరమొకటేలే, సకలగుణధాముని రీతిని రాముని రీతిని ఏమని తెలుపుదులే" - రాముడికి తన-పర భేదం లేదు (స్థిరమతి), అందరినీ ఒకేలాగ ఆదరించేవాడు. ఆయన విధానాలని వర్ణించడం కష్టం!
    • "తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం, శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం" - ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే శ్రీరామచంద్రుడి శృంగారరూపం ఆమె హృదయంలో ఉదయిస్తోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం రేయిలో శ్రీరామ "చంద్రుడు" ఉదయిస్తున్నాడు అని. చక్కని భావుకత.
    • "మౌనం కూడా మధురం" - శ్రీరామచంద్రుడి మాట లాగే మౌనం కూడా తీయగా ఉంటుందట. మొదటి చరణంలో చెప్పిన "ప్రియవాది" కి జోడుగా ఇది రెండొ చరణంలో చెప్పారు.
    • "పిలిచే సమ్మోహన సుస్వరమా!" - రామ అనే పదానికి అర్థం "ఆకర్షించగలిగేది" అని. రాముడి మాట, రూపం సమ్మోహనాస్త్రం లాగా ఉన్నాయని కవి భావం.
    •  "సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా?" - సీతాదేవికి భర్తపైన ఉన్న ఆరాధన పరమాత్ముడికే (హరి) హరిచందనంతో (పసుపురంగు గంధం) వేసిన బంధంలాగ ఉందిట. "హరి" అంటూ యమకం వేసారు కవీశ్వరులు.
    • "శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధము" - రాముడు వేదాలకు సారం ఐతే అమ్మవారు దానికి అనువాదం అట. ఎంత చక్కని భావుకత! కాళిదాసు వాగర్ధావివను స్ఫురింపజేసింది ఈ వాక్యం.

    3. ఎవడున్నాడీ లోకంలో

    ఇది హరికథ లాగా కూర్చిన పాట. నిజమే ఇది హరి కథే కదా, అందుచేత ఒక్కటైనా అలాంటి పాట ఉండాలి. బాలు నారదుడికి, వాల్మీకికీ గొంతు మార్చి చక్కగా పాడారు. వాల్మీకికి పాడేటప్పుడు వినయంతో, నారదుడికి పాడినప్పుడు ఆనందంతో పాడారు.

    వాల్మీకికి ఒక ఇతిహాసం వ్రాయాలనిపించినప్పుడు నారదుడిని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమంటూ కొన్ని లక్షణాలను సూచించాడు (బాలకాండ 2-4 శ్లోకాలు). వాటిని జొన్నవిత్తుల చక్కగా అనువదించారు.

    • "ఎల్లరికీ చలచల్లనివాడు" - అందరితోనూ ప్రియంగా ఉండేవాడు అంటూ రాముడి గురించి ప్రతీ పాటలోనూ చెప్పడం చాలా బాగుంది.
    • "ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు" - ఓంకారం బ్రహ్మస్వరూపం. "రామ" శబ్దం కూడా బ్రహ్మస్వరూపం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా చదివాను. అందుకని వారిద్దరికీ పోలికను చెప్పడం చాలా బాగా కుదిరింది. ఇది అందరు కవులకీ సాధ్యపడే ఊహాశక్తి కాదు. 
    • "విలువలు కలిగిన విలుకాడు" అంటూ మఱో యమకం వేసారు. విల్లుంటే బలవంతుడు అవుతాడు, కానీ విలువలుంటేనే గొప్పవాడౌతాడు. రాముడికీ రెండూ ఉన్నాయి. అది చక్కని ప్రాసతో చెప్పారు.
    • "పలు సుగుణాలకు చెలికాడు" - సుగుణాలను స్త్రీతో పోల్చడంతో స్త్రీలను గౌరవించడమే కాక సుగుణాలు మిత్రులు, అవగుణాలు శత్రువులని గుర్తుచేయడం బాగుంది.
    4. గాలి నింగి నీరు

    "ఏడుపు పాట" అని తీసేద్దామనుకున్నా గుండెను పదే పదే తట్టేలాగ ఈ పాటను ఇళయరాజ, జొన్నవిత్తుల, బాలు, నటుడు శ్రీకాంత్ చేసారు. ఎంత ఆర్ద్రత ఉన్న పాట!

    "గాలి నింగి నీరు భూమి నిప్పు" అంటూ పంచభూతాలను (భూమికి బదులుగా నేల అని ఉంటే అన్నీ తెలుగుపదాలయ్యుండేవి), "రారే మునులు, ఋషులు? ఏమైరి వేదాంతులు?" అంటూ తత్త్వజ్ఞులను (వీరందరూ రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అడ్డుకొందామని ప్రయతించినవారే. ఒకాయనైతే ఏకంగా రాముడికి నాస్తికత్వాన్ని బోధించబోయి నాలుక కరుచుకున్నాడు), "కొండ, కోన, అడవి, సెలయేరు, సరయూనదీ" (ఇవన్నీ సీతారాముల అనురాగాన్ని గమనించినవి) అంటూ ప్రకృతిని, ప్రశ్నించడం ఎంతో లోతుగా ఉంది.

    "విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే" అనడంలో విధికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదట తలరాత/బ్రహ్మదేవుడు (destiny) అనే అర్థంలో వాడితే రెండవసారి మార్గం అనే అర్థంలో వాడారు. అందుకని ఇది మఱొక యమకం. అలాగే "ఏడేడు లోకాలకీ సోకేను ఈ శొకం"  అనడంలో కూడా శబ్దాలు యమకానికి దగ్గరగా ఉన్నాయి (సోకు, శొకం).

    "అక్కడితో ఐపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా" -- అబ్బబ్బా, గుండె పిండేసారు కదండి. ప్రతిసారి సీతమ్మవారిని అదే అపవాదు అనే రక్కసి ఏడిపిస్తోంటే జగద్రక్షకుడైన శ్రీరాముడే ఏమీ చెయ్యలేక విలపిస్తున్నాడు. "ఈ లెక్కన అసలు దైవం అంటూ ఉందా?" అనే సందేహం ఎవరికి మాత్రం కలిగి ఉండదు? కొన్నిసార్లు ఊహ కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే బరువు ఎక్కువ ఉంటుంది!

    "సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా" -- మఱొక అద్భుతమైన ప్రయోగం. సూర్యుని (సహజంగా వెలుగున్నవాడు) వంశాన్ని తన సుగుణంతో వెలిగించిన (భర్తతో అడవులకు వెళ్ళింది, అగ్నిప్రవేశం చేసింది) ఈ కోడలిని ఆ సూర్యవంశ వెలుగే (ప్రతిష్టే) వెలివేస్తే ఈ లోకంలో ఇక వెలుగు ఎక్కడిది?

    5. సీతా సీమంతం

    పండుగని సన్నాయితోనే పలికించారు ఇళయరాజ. కోకిల, పల్లవి, పున్నమి, ఆమని అంటూ జొన్నవిత్తుల ప్రకృతివర్ణనతో వ్రాసారు.

    ఈ పాటలో "కాశ్మీరం నుండి కుంకుమ", "కర్ణాటక నుండి కస్తూరి" అన్నారు కవి. రామాయణం జరిగినప్పటికి ఇంకా కర్ణాటక రాజ్యం ఏర్పడలేదు. ఈ పొఱబాటుని "ఇంత చక్కని గీతసమూహానికి ఇది దిష్టిచుక్క" అనుకుని మనం వదిలేయాలి.

    "ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే, అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమే" అనడంలో ఆశ్రమంలోని ప్రేమ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు. పాట మొత్తానికి నాకు నచ్చిన వాక్యం "ఎక్కడున్నా నువ్ గానీ, చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడూ" అంటూ రాముడిలో సగానికి మఱో సగాన్ని గురించి చెప్పడం ఎంతో ముద్దుగా ఉంది.

    6. రామ రామ రామ అనే రాజమందిరం

    చిన్నప్పుడు రాముడు చేసిన అల్లరి గురించి చెప్తూ సాగే ఈ పాటలో, "మర మర మర" అనడం వాల్మీకి గురించిన కథని గుర్తు చేసింది.

    నేను ఒక సారి సోదరుడు రాఘవని "రామచక్కని" అంటే ఏమిటి అని అడిగితే "రాఁవుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, అందమైనవాటికి ముందర రాముణ్ణి చేర్చుకుని చెప్పుకోవడం మనకు అలవాటు", అన్నాడు. నాకు ఆ వివరణ ఎంతగానో నచ్చింది. అలాగే ఈ "రామసుందరం" అనే పదం ముద్దుగా ఉంది. తదనుగుణంగానే "ముద్దుగారి పోతడంట" అనడంలో ఎంతో నిండుదనం ఉంది.

    ఈ పాటలో జొన్నవిత్తుల అనుకుని చేసారో లేక నా మనసుకే అనిపిస్తోందో మొదటి చరణంలో ప్రతీ వాక్యం రామాయణకథల్లో ఒక ఘట్టాన్ని/పాత్రని గుర్తుచేస్తోంది.
    • "బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట" - హనుమంతుడు, వానరసేన
    • "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" - కాకిపైన రాముడు బ్రహ్మాస్త్రం సంధించిన కథ
    • "సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట" - శబరి ఎంగిలి తినడం (అన్నట్టు, "రామచిలక" అనడం కూడా మన తెలుగువాళ్ళే అందమైన చిలకకు ఇచ్చిన బిరుదు)
    • "ఖజ్జురాలు ద్రాక్షలూ ఉడతలకీ పెడతడంట" - ఉడతలు రాముడికి సాయపడడం
    • "దాక్కుంటడంట చెట్టుచాటుకెళ్ళి" - వాలి వధ
    • "రాళ్ళేస్తాడంట చెరువులోకి మళ్ళీ" - సేతు బంధనం
    రెండవ చరణంలో అద్దాన్ని సంచిలో దాచిన కథ కూడా సరదాగా ఉంది. పల్లవిలో "తేప తేప తీయన" అన్నారు. "తేప" అనేది ఒక తీయని వంటకం అని చదివిన గుర్తు, దాని గురించి ఒక సరదా కథ కూడా విన్నాను. మఱి ఇది అదో కాదో తెలియదు. చదువర్లు చెప్పాలి.


    ఇంకా ఉంది...

    Sunday, November 7, 2010

    కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి (జొన్నవిత్తుల రచన)

    "దేవి" చిత్రం తో దేవిశ్రీప్రసాద్ చలనచిత్రసంగీతరంగంలోకి ప్రవేశించారు. మొదటి చిత్రం అంటే ఏ సంగీతదర్శకుడైనా చాలా కష్టపడి మంచి సంగీతాన్ని అందిస్తాడు. ఉదాహరణకి ఇప్పటికీ రోజ వంటి అద్భుతమైన పాటలను మళ్ళీ రెహ్మాన్ చెయ్యనేలేదు అనే వారున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎంతో ఉత్సాహంగా కనబడి నేటి తరం యువకుడు లాగా కనబడే ఈయన, ఎంతో పొందికైన, శ్రావ్యమైన గీతాలని ఈ చిత్రానికి అందించారు. పాటల మధ్యలో వేణువు (ఈ పాట), వీణ (తొట్టిగ్యాంగ్ చిత్రంలో "నువ్వే కావాలి" అనే పాట), సన్నాయి (ఆనందం చిత్రంలో "చికిచికిచం") వంటి సంప్రదాయవాయిద్యాలను వాడటంలో ఈయన సిద్ధహస్తుడు. ఈ పాట బాణీ చక్కని తెలుగుదనంతో ఉంటుంది.

    జొన్నవిత్తులకి అపారమైన లాఘవం ఉన్నప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం. దేవుడు, దేవి మొదలైన చిత్రాలలో ఆయన అందించిన సాహిత్యం ఎంతో చక్కగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలాగా, అచ్చతెలుగు పదాలను వాడి అందరినీ మెప్పిస్తారు. ఈ పాటతో సరసగీతాలలో ఆయనకు ఉన్న పట్టుని ప్రదర్శించారు.

    ఈ పాటను ఇక్కడ చూడవచ్చును.


    చిత్రం: దేవి
    రచన: జొన్నవిత్తుల
    దర్శకత్వం: కోడి రామకృష్ణ
    పాడింది: చిత్ర, బాలు
    సంగీతం: దేవిశ్రీప్రసాద్

    కుంకుమపూలతోటలో కులికే ఓ కుమారి
    మేలిమిబంగరు  చీరలో మెరిసే ఓ వయారి
    నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
    నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి

    ఇక్కడ గమనించవలసినది యతినియమాన్ని - కుంకుమ, కులికే; మేలిమి మెరిసే - పల్లవిని పాడుకోవడానికి హాయిగా మలచాయి. కుంకుమపూలతోట, మేలిమిబంగరు చీర వంటి పదాలు తెలుగుపాటల్లో వినిపించడం చాలా అరుదు. అవకాశం దక్కినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు జొన్నవిత్తుల. "మరాళి" అంటే హంస అనే అర్థం ఉంది. తన గుండెకొలనులో సంచరించే హంసగా, మల్లెల తావిని నింపుకున్న గాలిగా తన ప్రేయసిని వర్ణించడం చక్కగా కుదిరింది.

    శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
    గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
    నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
    ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి

    "శంఖములూదిన ప్రేమ" అనేది గొప్ప ప్రయోగం. శంఖారావం విన్నప్పటికి మల్లే, ప్రేమ మనసును తట్టగానే గుండె ఝల్లుమంటోంది అనే లోతైన భావాన్ని రెండు ముక్కల్లో చెప్పాడు కవి. "సమాళించడం"అంటే అనుకూలంగా చేర్చడం - ఈ పదం కూడా చలనచిత్రగీతాల్లో విన్నది తక్కువే! చంద్రకాంతిని వెతికే చకోరంగా తనను, యవ్వనమనే వనానికి కాపరి గా ప్రియుణ్ణి సంబోధించడం కూడా చాలా నవ్యంగా ఉంది.

    మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
    ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం 

    తామరమొగ్గ, కాముని సవాసం -శృంగారానికి కూడా ఎంతో సాత్వికతను అలది చెప్పగలిగారు కవి.

    హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
    ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం

    "చ్చ" తో అనుప్రాస కలిపడం ఒక ఎత్తైతే, "హెచ్చెను హేమంతం" అనడంతో "హె"-కు యతి కలిసింది - అలాగే హేమంతానికి ఉత్సాహం కలిగింది అనే కొంగొత్త ప్రయోగం కుదిరింది.

    ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
    విరిసిన పరువాల పిలిచెను మధుబాల
    ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
    మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా

    "విరిసిన పరువాల పిలిచెను మధుబాల" -- స్త్రీని విరిసిన పువ్వుతో పోల్చడం గతంలో చాలా పాటల్లో జరిగినా ఇది కొత్త మాటలతో వినూత్నంగా ఉంది. ఆ వాక్యానికి "వేసే పూబంధాలు" అంటూ మరింత సౌందర్యాన్ని అలిదారు కవి.

    అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
    అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం

    పుష్యమి నక్షత్రం అనడంలో కవి ఆంతర్యం పరిపూర్ణంగా అర్థం కాకపోయినా -- పుష్యం అంటే ఒక నవరత్నాలలో ఒకటి. "ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చిన తాంబూలం ఆమె చెక్కిలిపై పుష్యంగా చేరి నక్షత్రం వలే మెరుస్తోంది" అన్నది కవి భావమనిపిస్తోంది. ఇక్కడ కూడా జొన్నవిత్తుల వారు వేటూరిని తలపించారు. నక్షత్రాలను, తిథులను పాటల్లోకి తీసుకురావడం ఇదివరకు వేటూరి చాలా సార్లు చేశారు. (ఉదా:- కొండవీటి రాజ చిత్రంలో "గన్నవరం సిద్ధాంతి అన్నారు - వలపుల్లో వర్జ్యాలు ఉండబోవని").అలాగే, ఒక ప్రయోగానికి రెండుమూడు భావాలు కుదిరేలాగా వ్రాయగలగడం కూడా వేటూరి పాటల్లో రివాజు.

    ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
    అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం

    ఇది నా చేత, "ఆహా" అనిపించిన వాక్యం. "పంచదారవిల్లు" (అంటే "చెరుకువిల్లు", మన్మథుడి విల్లు) చేసిన గాయం అంటే ప్రేమ పెట్టిన తొందర - ఎంత కొత్తగా చెప్పారు కవి! ఆ విల్లు వదిలిన బాణం తగలకపోతే వయసు మోమాటం తీరదుట - మహాచిలిపిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది.

    నిలిచా నినుకోరి, రసమయ రహదారి
    శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి

    "రసమయరహదారి" (ప్రేమరసం నిండిన త్రోవ) - ఇటువంటి మాటను నేను తెలుగుపాటల్లో వినలేదు. అదొకటే కాక "శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి" అనడంలో ఎంతో శృంగారం నిక్షిప్తం చేశాడు కవి.

    మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
    నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై...

    నింగీనేలా ఏలే రాగాలు అంటే సాయంసంధ్య గా నాకు అర్థమయ్యింది. అంటే సందెవేళలో ప్రేయసీప్రియులు ఏకమై ప్రేమభావంలో పొంగిపోతున్నారు...అని.