Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Tuesday, December 25, 2018

కార్తిక మాసం సందర్భంగా రాసిన పద్యాలు

కార్తిక మాసం సందర్భంగా నేను రాసిన కొన్ని కందపద్యాలను శాస్త్రీ బ్లాగులో రాసాను. అక్కడ చదువని వారి కోసం మనోనేత్రంలో కూడా రాస్తున్నాను.

మాటలు, చేతలు, డెందము
గాటపు త్రిపురాలు దురితకారకముల్ నీ
మేటి కరకు జ్ఞానేషువు
వేటునఁ నాయహముఁ జంపు వేదాంతనిధే!

భా:- "మనసు, వాక్కు, కర్మ" అనే మూడూ త్రిపురాలుగా అయ్యి నా చేత పాపములు చేయిస్తున్నాయి. నీ సుజ్ఞానం అనే బాణంతో నా అహాన్ని చంపు, (త్రిపురాలను నాశనం చేసిన) శివా!

చాపపు నేరిమి దేవర
పాపపు పులి నోట చిక్కి బడలితి, కరుణా
రోపము గురి చూసి విడుమ
మాపు జననమరణవనిని మారాంతకుడా!

భా:- ధనుర్విద్యకు దేవతా! కామాన్ని జయించినవాడా! పాపం అనే పులి నోట చిక్కి అలిసిపోయాను. నువ్వు దయ అనే బాణాన్ని గురి చూసి పంపి పులితోబాటు ఈ జననమరణాలు అని అడవినే నాశనం చెయ్యి. (కామం వలనే పాపం పుడుతుంది. ఆ కామాన్ని జయించినవాడు పాపాన్ని నాశనం చెయ్యగలడు).

ఒడిలో బిడ్డడి యెలుకను
మెడలో బుసగొట్టు పాము మింగగఁజూడున్
ఎడమన పసివాని నెమలి
మిడినాగునుఁత్రుంచనెగురు మీదకునెపుడున్

వింతగు కాపురమును నీ
ఇంతి నడుపుచున్ జగములనేలుచునుండన్
సుంతయు బాసటనీయక
చింతెరుగని భిక్షువగుట చెల్లెను నీకే!

భా:- గణపతి వాహనమైన ఎలుకని మింగడానికి నీ మెడలో పాము బుసగొడుతూ ఉంటే, ఆ పామును మింగడానికి నీ చిన్నకొడుకు వాహనం నెమలి ఎగురుతూ ఉంటుంది. నీ ఇల్లాలు ఈ వింతైన కాపురాన్ని నడుపుతూనే జగాలను కూడా ఏలుతోంది. నువ్వు మాత్రం కొంతైనా సాయం చెయ్యకుండా భిక్షం ఎత్తుకుంటూ ఉన్నావు. ఈ వైభవం నీకే కుదిరింది.

ఎదలో కోర్కెలు ఎద్దుర
మదమొక గజముర చిలువర మత్సరమెల్లన్
పదునగు కోపము వ్యాఘ్రము
అదుపున పెట్టెడి కుశలతనందించు శివా!

భా:- ఎద్దులాగ ఎగిరిపడే కోర్కెలు, ఏనుగంత అహంభావం, పాములాగ బుస కొట్టే ఈర్ష్యా, పులి వంటి కోపం నాలో ఉన్నాయి.ఈ జంతువులని అదుపులో పెట్టిన నీవు నాకు కూడా ఆ దక్షతని అందించు, పశుపతీ! [నువ్వు ఎద్దుని (నందివాహనుడు), ఏనుగుని (గజచర్మాంబరుడు), పాములని (నాగాభరణుడు), పులిని (వ్యాఘ్రాజినాంబరుడు) అదుపులో పెట్టినవాడవు కదా.]

చలియించని యోగి, ఉమను
వలపించిన రాగి, కొలుచు వారికి ఱేడున్
కలచిన కీడున్ నటనకు
నెలవగు స్థాణువు శివుడిని నిత్యము తలతున్

భా:- స్థిరంగా ఉండే యోగి, అమ్మవారి మనసును ఆకర్షించిన అనురాగవంతుడు, కొలచిన వారిని ఆదుకొనేవాదు, చీకాకు పెట్టే వారికి శిక్షకుడు, కదులుతూ నాట్యం చేసే నటరాజు, అస్సలు కదలని స్థాణువు - అన్నీ అయిన శివుడిని ఎప్పుడూ తలుస్తూ ఉండెదను.

కైలాసంబున శైత్యము
మేలగు వినుదుస్తు నీది, మిన్నది తలలో
శైలజ కౌగిలి వీడవ
దేలన చలికోపలేక, ఇషణము మిషయే!

భా:- కైలాసంలో చలి, చక్కని ఆకాశాన్ని బట్టులుగా ధరిస్తావు, తలలో గంగమ్మ. పార్వతి కౌగిలి (పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం) వీడవంటే - చలికి తట్టుకోలేక. భార్య మీద ప్రేమ (ఇషణం) వత్తి సాకు (మిష).

పెక్కులఁ నిన్నును కలచెడి
రక్కసులకు వరములీయ రవ్వంతైనా
లెక్కించక, పెళ్లి జరుప
నక్కరఁ జూపిన వలదొర నణచుట పాడా!

భా:- నిన్ను, అనేకమందిని బాధపెట్టే రాక్షసులకు రవ్వంతైనా ఆలోచన లేకుండా వరాలిచ్చావు. నీకు పెళ్ళి జరుపుదామని ప్రయత్నించిన మన్మథుడిని మాత్రం దగ్ధం చేసావు. ఇది న్యాయమా?

ఆపవు కద భిక్షించుట
శ్రీపతి శ్రీదుల నడగక సెరబడియున్నన్
దాపున గంగను కలిగియు
ఆ పై యడిగేవు జనులనభిషేకముకై!

భా:- శివ! లక్ష్మీదేవి భర్త ఐన విష్ణువు, ధనవంతుడైన కుబేరుడూ నీకు మిత్రులైనా వాళ్ళని సాయం అడగక భిక్షమెత్తుకుంటావు. కానీ, నెత్తిపైన గంగను ఉంచుకుని జనాలను అభిషేకం చెయ్యమని అడుగుతావు. (ఇదేం విడ్డూరం!)

సిగలోనల్లరి విన్నది
రగిలే కన్నుయు నుదుటన, రాగలు మెడలో
నగుమోమునఁ మోసెడి దొర!
బెగడక మను పట్టు మదిన పెంచుము తండ్రీ!

భా:- జటాజూటంలో ఎగసిపడే గంగమ్మ, నుదుటిపైన నిప్పులు రగిలే కన్ను, మెడలో పాములు (అన్నీ ప్రమాదాలే అయినా) నవ్వుతూ వాటిని మోసేవాడా - భయపడకుండా ఉండే స్థైర్యాన్ని మా మనసుల్లో పెంచు తండ్రీ!

మాటకునూపిరి పోయగ
గాటపు శివసూత్రములను కల్పించితివే
నోటపలుకకుండ నిజము
తేటగ తెలిపెడి వలకడ దేవర ప్రణతుల్!

భా:- దక్షిణామూర్తి (వలకడ - దక్షిణదిక్కు) రూపంలో నోట మాట పలుకకుండా సత్యాన్ని (సత్) తెలుపగలిగిన యోగి, మనుషుల కోసం 14 శివ (మాహేశ్వర) సూత్రాలను పాణినికి ప్రసాదించి భాషను సృష్టించాడు. వానికి నమస్సులు.

కరిముఖమార్కండేయులఁ
మరణము దాటించినావు; మృత్యుంజయుడా!
గరళము మింగితివి నగుచు
కరుణను మముఁ గావుమయ్య కాలాంతకుడా!

భా:- శివ! నువ్వు నవ్వుతూ విషాన్ని తాగావు. మార్కండేయుణ్ణి యముడి (మృత్యువు) నుండి కాపాడావు. వినాయకుడికి ఏనుగు తలతో మరో జన్మను ప్రసాదించావు. యముడిని కూడా అంతం చేయగలవాడా - కరుణతో మమ్మల్ని కాపాడు.

ఒడలునఁ జతపడియుండిరి
విడరెట రాయిగ వెలసిన వేడుక మీరన్
గడుసరి భక్తుడడుగ సతి
నెడబాసిన వేల్పు కన్న హెచ్చును గలరే?

భా:- శివపార్వతులు లింగరూపమునైనా అర్థనారీశ్వరులుగానైనా ఒకటై అందంగా ఉన్నారు. అట్టిది, గజాసురుడు అడిగితే తన భార్యను విడిచి వెళ్ళిన శివుడి కంటె దైవం ఉందా?

తనరునె ధరణీతలమున
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?

భా:- భూమి మొత్తం వెతికినా కన్నబిడ్డను చూసి నవ్వినట్టి వాడిని నెత్తిన మోసుకు తిరిగే శివుడిని మించిన దయ కలిగినవాడు దొరుకుతాడా?

Sunday, July 24, 2016

గురుపాదుకా స్తోత్రం - తాత్పర్యం

ఎప్పటినుండో "గురుపాదుకా స్తోత్రం" నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మొన్న "గురు పౌర్ణమి" సందర్భంగా ఆ స్తోత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని వ్రాసుకున్నాను. అది ఇక్కడ వ్రాస్తున్నాను.ఏమైనా పొరబాట్లు కనిపిస్తే చదువర్లు సరి చేయగలరు.

ఏదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, ముందు వచ్చే సమస్య: స్తోత్రం ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం. అదే సమస్య ఇక్కడా వచ్చింది. నేను "శృంగేరి శారదా పీఠం" వారి ప్రతినుఅనుసరించాను.

నాళీక నీకాశ పదాహృతాభ్యాం
నానా విమోహాది నివారికాభ్యాం
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

నాళీక - తామర పువ్వు
నీకాశ - వలె కనిపించు
పద ఆహృతాభ్యాం - పాదములను అంటిపెట్టుకునేవి
నానా - రకరకాల
విమోహ ఆది - వ్యామోహాలు మొదలైనవి
నివారికాభ్యాం - తొలగించేవి
నమత్ - నమస్కరించే
జన - జనుల
అభీష్ట తతి - కోర్కెలను అన్నింటినీ
ప్రదాభ్యాం - ప్రసాదించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

తామర పువ్వుల వంటి గురువు పాదాలను అంటిపెట్టుకున్న పాదుకలు రకరకాల వ్యామోహాలను తొలగిస్తాయి. నమస్కరించిన వారి కోర్కెలను అనంటినీ నెరవేర్చేవి. వాటికి నమస్సులు.

శమాది షట్క ప్రద వైభవాభ్యాం
సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం
రమా ధవాంఘ్రి స్థిర భక్తిదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

శమాది షట్క ప్రద - శమము మొదలుగా గల ఆరు లక్షణాలను ఇచ్చే
వైభవాభ్యాం - మహత్తు కలిగినవి
సమాధి - బ్రహ్మంతో ఐక్యత
దాన - ఇవ్వడం (అనే)
వ్రత - వ్రతాన్ని
దీక్షితాభ్యాం - దీక్షగా తీసుకున్నవి
రమా - లక్ష్మీ దేవి
ధవ - భర్త
అంఘ్రి - పాదాలు
స్థిర - నిలకడగా
భక్తిదాభ్యాం - భక్తిని ప్రసాదించేటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురు పాదుకలు (వివేక చూడామణిలో చెప్పబడిన) శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే మోక్షప్రదమైన గుణాలను ప్రసాదించే మహత్తు కలిగినవి. శ్రద్ధగా ఉన్న వారికి బ్రహ్మపదాన్ని అందించడమే కర్తవ్యంగా ఉన్నవి. నారాయణుని పాదాల పట్ల భక్తిని నిలకడగా ఉంచగలిగినవి. వాటికి నమస్సులు.

నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి
సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యాం
నృపత్వదాభ్యాం నత లోక పంక్తేః
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

నృప ఆళి - అనేక రాజుల
మౌళి - కిరీటాల
వ్రజ - గుంపు (యొక్క)
రత్న కాంతి - రత్నాల కాంతి (యొక్క)
సరిత్ - నది (లో)
విరాజత్ - మెరిసేటి
ఝష కన్యకాభ్యాం - అందమైన చేపల వంటివి
నత - నమస్కరించిన వారికి
లోక పంక్తేః - లోకాలు అన్నింటికీ
నృపత్వదాభ్యాం - ఆధిపత్యం ఇచ్చేటివి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

అనేకమంది రాజుల కిరీటాలను ఒక చోట చేర్చగా వాటిలో ఉన్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే అంతటి వెలుగులో కూడా మెరిసేటి చేపల వంటివి గురువు పాదుకలు. అంటే ఎంతటి సిరులు, అధికారం కూడా గురువు చెప్పుల పాటి చెయ్యవు. ఆ గురువు పాదుకలకు నమస్కరించిన వారికి అనేక లోకాల ఆధిపత్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి కలిగినవి గురువు పాదాలు. వాటికి నమస్సులు.

అనంత సంసార సముద్ర తార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

అనంత - అంతు లేని
సంసార - ప్రపంచం అనే
సముద్ర - కడలి (ని)
తార - దాటించే
నౌకాయితాభ్యాం - నౌకల వంటివి
గురుభక్తిదాభ్యాం - గురువు పట్ల భక్తిని ఇచ్చేటివి
వైరాగ్య - వైరాగ్యం అనే
సామ్రాజ్యద - సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళదాయకమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురుపాదుకలు అంతులేని సంసారం అనే కడలిని దాటించే నౌకలు. అవి గురువు పైన భక్తిని కలిగించి నిలుపుతాయి. అవి (నిస్సారమైన ప్రపంచం పై) వైరాగ్యం అనే సామ్రాజ్యాన్ని పొందడానికి పూజించదగినవి. వాటికి నా నమస్కారములు.

పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం
జాడ్యాబ్ధి సంశోషణబాడబాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

పాప - పాపము (అనెడి)
అంధకార - చీకటి (కి)
అర్క - సూర్యుల
పరంపరాభ్యాం - వరుస వంటివి
తాపత్రయ - తాపత్రయము (అనెడి)
అహి + ఇంద్ర - అత్యంత శక్తివంతమైన పాముకు
ఖ + గ + ఈశ్వరాభ్యాం - ఆకాశంలో సంచరించే వాటికి (పక్షులకు) అధిపతి (గరుత్మంతుడు - గెద్ద) వంటివి
జాడ్య + అబ్ధి - అజ్ఞానం అనే సముద్రాన్ని
సంశోషణ - ఎండబెట్టేటి
బాడబాభ్యాం - భయంకరమైన నిప్పు వంటి వాటికి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురువు పాదుకలు పాపము అనే చీకటిని మొత్తంగా నాశనం చేసేటి వేలాది సూర్యులతో సమానం. అవి తాపత్రయాలు అనే పాముని చంపేటి గెద్ద వంటివి. అజ్ఞానం అనే కడలిని ఎండబెట్టేటి బలమైన నిప్పు వంటివి. వాటికి నమస్సులు.

కవిత్వ వారాశి నిశాకరాభ్యాం
దౌర్భాగ్య దావాంబుదమాలికాభ్యాం
దూరీకృతానమ్ర విపత్తతిభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

కవిత్వ - కవిత్వం (అనే)
వారాశి - కడలి (కి)
నిశాకరాభ్యాం - చంద్రుడి వంటివి (వన్నె తెచ్చెడివి)
దౌర్భాగ్య - దురదృష్టం (అనే)
దావ - మంట (కు)
అంబుద మాలికాభ్యాం - నీటి మాలల (కుండపోత వర్షం) వంటివి
దూరీకృత - దూరం చెసినవి
ఆనమ్ర - మొక్కెడి వారికి
విపత్ తతిభ్యాం - ఆపదల వరుసను
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు
గురు పాదుకలు కడలికి చంద్రుడి వలె విద్యకు వన్నె తెచ్చెడివి. దురదృష్టం అనే మంటను ఆర్పేటి జడివానలు. మొక్కెడి వారికి వచ్చిన ఆపదలను అన్నింటినీ తొలగించెడివి. వాటికి నమస్సులు.

నతా యయో శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

యయోః - వేటికైతే
కదాచిత్ - ఎప్పుడో ఒక సారి మాత్రమే
నతా - మొక్కిన వారు
అపి - అయినా
హి - కచ్చితంగా
ఆశు - వెంటనే
దరిద్రవర్యాః - అత్యంత దరిద్రంలో ఉన్న వారు
శ్రీపతితాం - సిరులకు నెలవు
చ - మరియు
మూకాః - మూగవారు
వాచస్పతితాం - మాటలకు నెలవు (దేవ గురువు బృహస్పతి)
సమీయుః - వలే ఐనారో
తాభ్యాం - వాటికి
శ్రీ గురుపాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

ఎప్పుడో ఒక సారి మాత్రమే మొక్కినప్పటికీ వెంటనే దరిద్రులను నారాయణునితో (లక్ష్మీ దేవి భర్త), మూగవారిని బృహస్పతితో సమానంగా కచ్చితంగా చెయ్యగల గురువు పాదుకలకు నమస్సులు

కామాది సర్ప వ్రజ భఙ్జకాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం
బోధప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

కామ + ఆది - కామము మొదలైన
సర్ప వ్రజ - పాముల వరుస
భఙ్జకాభ్యాం - త్రుంచేవి
వివేక - ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే తెలివి
వైరాగ్య - అశాశ్వతమైన వాటి పైన కోరిక లేకుండుట
నిధి ప్రదాభ్యాం - (వివేకము, వైరాగ్యము అనే) నిధులను ప్రసాదించెడివి
బోధప్రదాభ్యాం - జ్ఞానాన్ని బోధించేవి
ద్రుత - వేగంగా
మోక్షదాభ్యాం - మోక్షాన్ని కలిగించేవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

గురు పాదుకలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే ఆరు పాములను (అరిషడ్వర్గం) నాశనం చేస్తాయి. వివేకం, వైరాగ్యం అనే గొప్ప సిరులను ప్రసాదిస్తాయి. జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, త్వరగా మోక్షాన్ని ఇస్తాయి. వాటికి నమస్సులు.

స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం

స్వ - వాటిని
అర్చ - మొక్కడమే
పరాణాం - తమ కర్తవ్యంగా కలవారికి
అఖిల - అన్ని
ఇష్టదాభ్యాం - ఇష్టాలనూ నెరవేర్చేవి
స్వాహా - స్వాహా దేవి (కి)
సహాయః - తోడుగా ఉండెడి వాడిని (అగ్ని: ఆయన భార్య స్వాహా దేవి)
అక్ష - కన్నుగా కలవాడికి (శివుడికి)
ధురంధరాభ్యాం - సమానమైన శక్తి కలవాటికి
స్వాంత - హృదయం
అచ్ఛ - శుద్ధి
భావ - స్థితి
ప్రద - ఇచ్చేందుకు
పూజనాభ్యాం - పూజించదగినవి
శ్రీ గురు పాదుకాభ్యాం - మంగళకరమైన గురువు పాదుకలకు
నమో నమః - నమస్సులు

వేటిని అర్చించడంలో మునిగిన వారికి అన్ని కోర్కెలూ నెరవేరుతాయో, శివుడికి ఉన్నంత శక్తి వేటికి కలదో, వేటిని పూజిస్తే మనస్సు నిర్మలమౌతుందో - ఆ గురువు పాదుకలకు నమస్సులు.

శ్రీ గురు పాదుకాభ్యాం నమః

Wednesday, August 12, 2015

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చుకున్నాడు. అంతటి లయ ఉన్న పాట ఇది.

అన్నమయ్య నిజంగా నందకం అవతారమా, లక్కమాంబకు నిజంగా ఆలస్యంగా పిల్లలు పుట్టారా వంటి ప్రశ్నలు యోగులకు, చరిత్రకారులకు పనికొచ్చే ప్రశ్నలు. మనబోటి సామన్యప్రేక్షకులకు తగిన ప్రశ్న "ఈ సందర్భానికి, కథకు కవి న్యాయం చేశాడా?" అని. అది పరిశీలిద్దాము.

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పల్లవిలోనే వేటూరి అన్నమయ్యని బాగా ఉన్నయించాడు (elevate). అన్నమయ్య కాలానికి ముందే నన్నయ, తిక్కన వంటివారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యాన్ని వ్రాసారు. ఐతే అవి సంస్కృతపదభూయిష్టమైన మహాకావ్యాలు - సామాన్యులకు అందుబాటులో లేనివి. అన్నమయ్య అచ్చ తెలుగుమాటలకు పెద్ద పీట వేస్తూ, ఛందస్సు కంటే లయకు ప్రాధాన్యతను ఇస్తూ సామన్యజనులకు అర్థమయ్యేటువంటి పాటలు వ్రాసారు. ఒక సారి అన్నమయ్య పాటలలో పల్లవులని చూస్తే ఈ విషయం తేటబడుతుంది: "చక్కని తల్లికి ఛాంగుభళా", "అదివో అల్లదివో", "అలరులు కురియగ", "చందమామ రావో జాబిల్లి రావో", "ఏమొకో చిగురుటధరమున ఏడనెడ కస్తూరి నిండెను", "నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన ఊరెడి ఉవ్విళ్ళో" మొదలైన పల్లవులలో తెలుగుదనం తాండవిస్తుంది. 

అంతటి సున్నితమైన పల్లవులలోనే ఎంతో గంభీరమైన భక్తి, వైరాగ్య భావాలు దాగున్నాయి. ఉదాహరణకు ఈ చిత్రంలో వినిపించిన "అంతర్యామి అలసితి సొలసితి" అనే పాటలో "భారపు బగ్గాలు పాప పుణ్యములు", "మదిలో చింతలు మైలలు మణుగులు", "జనుల సంగముల జక్క రోగములు" వంటి పంక్తులు సాధకులు తమ మనసుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవలసినటువంటివి. అలతి పదాలలో లోతైన జ్ఞానాన్ని వినిపించారు కాబట్టే ఆయన "జానపదానికి జ్ఞానపథాన్ని" చూపించారు. ఏడు కొండల పైన వేంకటేశ్వరుడిలాగ ఏడు స్వరాలను అన్నమయ్య పొదరిల్లుగా చేసుకుని మన మనసుల్లో స్థిరబడ్డారు. ఇంతటి లోతైన భావాన్ని నాలుగే నాలుగు చిన్న పంక్తులలో వేటూరి వెల్లడించారు.

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీశ్శులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుద్ధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించి ఆ నందకము నందనానందకారకము

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

భగవద్గీత, 2వ అధ్యాయంలో కృష్ణపరమాత్ముడు అన్న ఈ మాటలు సాధకులకు మొదటి పాఠం.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

దీనికి కొంచం వదలుగా తెనుగిస్తే "ఒక వస్తువుని విడిచిపెట్టాలని మనం దాన్ని దూరం చేస్తే, వస్తువు దూరమౌతుంది కానీ కోరిక మిగిలిపోతుంది. అదే ఆ వస్తువు కంటే ఉత్తమమైన వస్తువుని రుచి చూస్తే, అప్పుడు మునుపటి కోరిక కూడా పోతుంది" అని. అరిషడ్వర్గాలకు (కోరిక, కోపం, వలపు, కక్కూర్తి, పొగరు, ఓర్వలేనితనం) మూలం అహం (దేహాత్మబుద్ధి). ఈ చౌకబారు ఆలోచనలను దాటాలంటే ఉన్నతమైన భక్తి, వైరాగ్య భావలను రుచిచూడాలి. అన్నమయ్య పాటలు ఆ భావాలను, వాటిలో ఆనందాన్ని చెప్పేవి. అన్నమయ్యని విష్ణువు ఆయుధమైన నందకానికి అవతారంగా భావిస్తారు. అందుకని కవి అన్నమయ్యని "అరిషడ్వర్గాన్ని తెగనరికే హరి ఖడ్గమ్ము"  అన్నాడు. అరి, హరి ప్రాసతో పాటు తరువాత "షడ్", "ఖడ్" కు కూడా ప్రాస కలిపాడు. లయ చక్కగా కుదిరింది.

విష్ణులోకంలో మొదలైన నందకం తరువాత నెమ్మదిగా మిగతా లోకాలను దర్శించుకుని అక్కడ నాదాన్ని ఆకళించుకుని లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. బ్రహ్మలోకంలో బ్రహ్మ, సరస్వతీ దేవి వీణా నాదం; శివలోకంలో శివుడి ఢమరుక నాదం; ఇంద్రాది సభలలో అప్సరసల గాననృత్యాల లయ; మబ్బులలో విహరించే నారదుడు, ఆయన వీణైన మహతీ, తుంబురుడు - వారి భక్తినాదం అన్నీ చూసి హిమాలయాల మీదుగా వచ్చిందట. ఇక్కడ నాకు రెండు విషయాలు అనిపించాయి. నిజమో కాదో వేటూరికే ఎరుక. 1. అప్పటిదాకా నాదప్రధానమైన విషయాలు మాట్లాడుతూ "దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి" అనడంలో "నందకం శృంగారరసాన్ని కూడా తెలుసుకుంది" అనే ధ్వని వినిపిస్తోంది. ఎంతైనా అన్నమయ్య శృంగార సంకీర్తనలకు పెట్టింది పేరు. 2. "శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని" అన్నారు. "శిత హిమ కంధర" అంటే తెల్లని హిమాలయాల దగ్గర అని; "యతిరాజ్ సభ" అంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల చోటు అని నాకు అనిపించింది. వారి తపస్సుకు ఫలితంగా ఈ నందకం అవతారం ఎత్తింది అని కవి భావం అని అనిపిస్తోంది.

గర్భాశయం, గర్భాలయం - ఛందోబద్ధంగా రెండూ ఒకేలాగ ధ్వనిస్తున్నాయి (UUIU). గర్భాశయం అనేది వాడుకలో ఉన్న శబ్దం. వేటూరి గర్భాలయం అనే పదం వాడి అన్నమయ్యకీ, ఆయన తల్లికీ కూడా తగిన పదసత్కారం చేసారు అనిపించింది. చివరిగా ఈ చరణంలో చెప్పుకోవలసిన పదలయ: "ప్రవేశించెను ఆ నందకము, నందన ఆనంద కారకము". నందకము అంటే విష్ణువు ఆయుధము. నందనుడు అంటే కొడుకు. ఆనందము అంటే సంతోషం. ఆనందకము అంటే ఆనందము కలిగించేది. ఇక్కడ "నం, ద", "ఆ, నం, ద" అనే అక్షరాల వరుసలు రెండు మూడు సాల్రు వచ్చాయి. దీన్నే వృత్త్యనుప్రాసం అంటారు. ఒక అక్షరంతో వృత్త్యనుప్రాసం సామాన్యమే. రెండు మూడు అక్షరాలతో చెయ్యడం విశేషం. అలాగే, "ఆ నందకము" అంటే - "ఆ విష్ణువు ఆయుధం" అని. "ఆనందకము" అంటే ఆనందం కలిగించేది అని - ఈ రెండు అర్థాలు ఉండటం వలన శ్లేష ఐంది. ఒక చిన్న వాక్యంలో ఒక శబ్దాలంకారాన్ని, ఒక అర్థాలంకారాన్ని ఉపయోగించి వేటూరి తెలుగు వ్యాకరణం తెలిసినవారికి, తెలియని వారిని కూడా మెప్పించారు. భళా! 


పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై 
ఆంధ్ర సాహితీ అమరకోశమై 
అవతరించెను అన్నమయ్య 
అసతో మా సద్గమయా

"ఉసురు" అంటే "ఊపిరి", "జీవము" అని అర్థం. బహుశా నందకం అచేతనమైనది కనుక అన్నమయ్యకు విష్ణువు జీవం పోసాడు అని కావి భావం అనిపిస్తోంది. "అమర కోశం" అంటే "ఎప్పటికీ నిలిచే నిధి" అని అర్థం. సంస్కృత భాషకు ఒక ప్రముఖమైన "నిఘంటువు" లేదా "థిసారస్ (thesaurus)" పేరు కూడా అమరకోశం. "ఆంధ్ర సాహితీ అమరకోశమై" అనడంలో "తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచే నిధి" అని, లేదా "తెలుగులో అమర కోశం" (తెలుగు పదాలకు ఆలవాలం/నిఘంటువు) అని రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎలాగ చూసుకున్నా సబబైన మాట. 

"అవతరించెను అన్నమయ" కు యతి, అంత్యప్రాస కూడా కుదిరే విధంగా పవమాన మంత్రాలలో ఒకటైన "అసతో మా సద్గమయా" ను వాడటం ఈ పాటకు చాలా అందాన్ని తెచ్చింది. కొంచెం చాదస్తంగా చూసుకునేవారు " 'అసతో మా సద్గమయా' అంటే 'అసత్యం నుండి నన్ను సత్యం వైపు' నడిపించూ కదా. అన్నమయ్య పుట్టడానికి దానికీ సంబంధం ఏమిటి? " అని అడుగవచ్చును. దీన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చును అని నాకు అనిపించింది. 1. కవి అన్నమయ్యను స్వయంగా అడుగుతున్నాడు "నన్ను నీ పాటల ద్వారా అసత్యం  నుండి బ్రహ్మం (సత్) వైపు తీసుకువెళ్ళు" అని. 2. "అసతో మా సద్గమయ" అనే మంత్రానికి ప్రతిస్పందనగా విష్ణువు అన్నమయ్యను పుట్టించాడు అని కూడా అర్థం చేసుకోవచ్చును. నిజానికి కవి లయకు, లోతుకు ప్రాధాన్యతని ఇచ్చి ఇక్కడ విషయాన్ని అస్పష్టంగా విడిచాడు అనిపించింది. ఇది కొందరికి నచ్చకపోవచ్చును. కానీ నాకు నచ్చింది.

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేబట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎద లయలో పదకవితలు కలయ 
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య 
తమసో మా జ్యోతిర్గమయా

"అరముద్దలు" అనే పదం నాకు బాగా నచ్చింది. సామాన్యంగా ముద్ద కలిపి, గోటితో మధ్యలోకి త్రుంచి పిల్లలకు పెడతారు. కచ్చితంగా తెలియదు కానీ అందుకే దాన్ని గోరుముద్ద అంటారు అనుకుంటున్నాను. ఇక్కడ కవి అరముద్దలు అని కూడా అందుకే అంటున్నారు అని అర్థమైంది. సరే, "హరి" కి "అర" కి యతి యేనా, లేక ప్రాసయతి కూడా ఉందా అని చూసాను. నిఘంటువులో "అర" అంటే "అర్ధము, సగము" అని (అరగంట లో అర); "అఱ" అంటే "లోపలి" అని (అఱచేయి) ఉంది. సంస్కృతం ర కి తెలుగు ర కి ప్రాస కుదురుతుంది కానీ, సంస్కృతం ర కి తెలుగు ఱ కి కాదు. కవి ఎక్కడికక్కడ, ప్రాస, యతి, ప్రాసయతి చూసుకుంటూ వ్రాసాడనడానికి ఇది ఆధారం.

"తెలుగు భారతికి వెలుగు హారతి" చక్కనైన ప్రయోగం. భారతి అంటే "మాట, శబ్దం, సరస్వతీ" అని అర్థాలు ఉన్నాయి. తెలుగు పదాలకు హారతి పట్టినవాడు అన్నమయ్య. తెలుగు, వెలుగు; భారతి, హారతి - ఎంత చక్కగా ప్రాస కుదిరింది. తెలుగు పద కవితలను సృజింపజేస్తూ ఉంటే ఆయన ఎద లయలో అవి కలిసిపోయాయి. ఆ తరువాత తెలుగు వారి అందరి ఎద లయలో కూడా అవి కలిసిపోయాయి. అందుకే ఆయనని "ఆంధ్ర పద కవితా పితామహుడు" అన్నారు.

పాటను ముగిస్తూ వేటూరి "తాళ్ళపాకలో వెలసెనన్నమయ తమసోమా జ్యోతిర్గమయ" అంటూ మళ్ళీ ఒక పవమాన మంత్రాన్ని కలిపారు. ఈ సారి "తాళ్ళపాక" కు యతి గా "తమసో మా జ్యోతిర్గమయ" అన్నారు. మామూలు మనిషికి కూడా సాహిత్యాన్ని అందించే రసికుణ్ణి, భక్తుణ్ణి చేసిన అన్నమయ్య నిజంగా మనని అంధకారం నుండి  తేజస్సువైపుకు తీసుకెళ్ళారు.

ఈ పాటంతా ఎక్కడికక్కడ యతి, ప్రాస, ప్రాసయతులతో అందంగా వచ్చింది. దానికి కీరవాణి పూర్తిగా న్యాయం చేసాడు. తెలుగు చలన చిత్ర గీతాలలో ఇది కచ్చితంగా ఒక "classic".

Monday, September 17, 2012

కారణమాలాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారం



లక్షణం:
(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైః
నయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాలయగును
నీతిచే సిరి సిరి చేత దాతృతయును
దాతృతను భూరియశమన్నరీతి శర్వ

భావం: కారణం కార్యం ఒకదానికొకటిగా చెప్పుకుంటూ పోతే అది కారణమాలాలంకారము. కారణం అంటే cause, కార్యం అంటే effect. ఒక కారణానికి కార్యం మఱొక కార్యానికి కారణంగా ఉంటే అది కారణమాల. ఉదాహరణకు, "నీతి చేత సంపద, సంపద చేత దానగుణం, దానగుణం వలన గొప్ప కీర్తి వస్తాయి" అన్నప్పుడు నీతి సంపదకు కారణం, సంపద దానగుణానికి కారణం, దానగుణం కీర్తికి కారణం. ఇది కారణ-మాల-అలంకారం.



(గ్రంథం: భగవద్గీత, రచన: కృష్ణ పరమాత్ముడు/వ్యాసభగవానుడు)
ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామో, కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి

భావం: మనిషి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండగా, తనకు వాటిపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన కోఱిక జనిస్తుంది, కోఱిక వలన (అనుకున్నది దక్కకపోతే) కోపం, కోపం వలన సమ్మోహితుడౌతాడు, సమ్మోహం వలన ఆలోచనను కోల్పోతాడు, ఆలోచనను కోల్పోవడం వలన బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వలన నాశనమౌతాడు.



(చిత్రం: నాలుగు స్తంభాలాట, రచన: వేటూరి సుందరరామమూర్తి)
చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలైపోయి, కడలిగా పొంగు నీ ప్రేమ

వివరణ: ఇది సూటిగా కారణమాలాలంకారం కాకపోయినా చినుకు నదికి కారణం, నది వరదకు కారణం, వరద కడలి పొంగుకు కారణం గా చెప్పుకుంటూ పోవడం వలన ఇది కారణ మాలాలంకారం అని చెప్పుకోవచ్చును అని నా అభిప్రాయం.



(చిత్రం: నువ్వే కావాలి రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది,
కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది

వివరణ: ఈ పంక్తిలో పరిణామాలంకారం, కారణమాలాలంకారం కలిపి ఉన్నాయని నా అభిప్రాయం. "విశాలనయన ప్రసన్నమై నేత్రపద్మాలతో చూచినది" అన్నామనుకోండి, దాని శబ్దార్థం (literal meaning) ఆమె పద్మాలతో చూచింది అని. కానీ పద్మాలతో ఎవరైనా చూడగలరా? లేదు కదా! అందుచేత ఆమె కళ్ళే పద్మాలయ్యాయి అని వాస్తవార్థం (real meaning). ఇక్కడ "చినుకు పాటయ్యింది" అంటే చినుకు అక్షరాలగానో, రాగం గానో అయ్యింది అని కాదు. చినుకులు చేసే శబ్దం పాటలా వినబడింది (పరిణమించింది) అని. అలాగే పాట తాకిన నేల "చిలకలు వాలే చెట్టయ్యింది" అంటే "పాట చేసే సవ్వడి చిలకపలుకుల లాగా తీయగా ఉన్నాయి" అని భావం. ఇవన్నీ పరిణామలంకారమే. కాకపోతే ఇవి వరుసగా పేర్చుకుంటూ ఒకదానికి మఱొకటి కారణంగా చెప్పారు కవి. నింగి చినుకైంది, చినుకు పాటైంది, నేల చెట్టైంది.



కారణమాలాలంకారానికి మఱొక పద్ధతి ఉంది. అది చూద్దాము.

(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
భవంతి నరకాః పాపాత్ పాపం దారిద్ర్యసంభవం
దారిద్ర్యం అప్రదానేన తస్మాత్ దానపరో భవ

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
నరకములు పాపమునఁ జే
కుఱుఁబాపము లేమిచే నగును లేమి పరి
స్ఫురణం బీకుండుటచేఁ
బరఁగు నటులుగాన దానపరుఁడవు గమ్మ!

భావం: నరకములు పాపము చేత, పాపము లేమి చేత, లేమి దానమీయకుండుట చేత వచ్చును. కాబట్టి దానము చేయవలెను.

వివరణ: ఇందాకటి ఉదాహరణలలో కారణం వెనుక కార్యం, వెనుక మఱొక కార్యం అలాగ వచ్చాయి. ఈ ఉదాహరణలో కార్యం వెనుక కారణం వచ్చింది. ఇది కూడా కారణమాలాలంకారమే.




(గ్రంథం: భగవద్గీత రచన: కృష్ణపరమాత్ముడు/వ్యాసభగవానుడు)
అన్నాత్ భవతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవః
యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞః కర్మసముద్భవః

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షరసముద్భవం,
తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం

భావం: అన్నం నుణ్డి జీవులు వస్తున్నారు, అన్నం వర్షం నుండి వస్తోంది, వర్షం యజ్ఞం నుండి వస్తోంది, యజ్ఞం విధ్యుక్త కర్మల చేత వస్తోంది, కర్మలు వేదాలనుండి పుట్టాయి, వేదాలు బ్రహ్మం నుండి పుట్టాయి. అందుచేత సర్వత్రా ఉన్న బ్రహ్మ యజ్ఞంలో ప్రతిష్ఠింపబడినాడని గ్రహించు.

వివరణ: ఇదివరకు కోపం వలన సమ్మోహం, సమ్మోహం వలన స్మృతిభ్రంశం అంటుంటే ముందు భాగంలో  కార్యం (సమ్మోహం) తఱువాతి భాగంలో కారణం అవుతోంది. ఇప్పుడు జీవులు అన్నం వలన, అన్నం వర్షం వలన అంటుంటే ముందు భాగంలో కారణం (అన్నం) తఱువాతి భాగంలో కార్యం అవుతోంది. అంతే తేడా.



ఈ పద్ధతికి మఱొక ఉదాహరణ కాకపోయిన ఒక అచ్చు (blue-print) లాగా చెప్పవలసినది అందరికీ తెలిసిన ఏడు చేపల కథ.

అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ ఏటికి వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. “చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?”  అని అడిగితే, “గడ్డిమోపు అడ్డం వచ్చింది” అని అంది చేప. “గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగితే, “ఆవు  మేయలేదు” అని చెప్పింది గడ్డిమోపు.  “ఆవూ, ఆవూ గడ్డి ఎందుకు మేయలేదు?”  అని అడిగితే, “పశువుల కాపరి  విప్పలేదు” అంది. “పశువుల కాపరీ, ఆవును ఎందుకు విప్పలేదు?”  అని అడిగితే, “అమ్మ గారు అన్నం  పెట్టలేదు” అన్నాడు పశువుల కాపరి. “అమ్మ గారు అమ్మ గారు ఎందుకు అన్నం పెట్టలేదు?”  అని అడిగితే, “పాప  ఏడ్చింది” అంది. “పాప పాప ఎందుకు ఏడ్చావు?” అని అడిగితే, “చీమ కుట్టింది” అంది పాప. “చీమా చీమా ఎందుకు కుట్టావు?” అని అడిగితే, “నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?”

అంది చీమ. ఇక్కడ కూడా కార్యం ముందు తెలుస్తోంది, కారణం తఱువాత తెలుస్తోంది.

Friday, September 7, 2012

అలంకారాలు - చంద్రాలోకం

దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.

భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు దొరికిన ఆధారాల వరకు, వీరిలో ప్రథముడు భరతుడు (భరతముని అని కూడా అంటారు). ఈయన ఏ కాలంలో జీవించారు అనే దానికి క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 300 వరకు సమాధానాలు వినవస్తున్నాయి కానీ కచ్చితమైన నిర్ణయం ఇంకా లేదు. ఈయన "నాట్యశాస్త్రం" రచయితగా ప్రసిద్ధులు. ముఖ్యంగా ఈయన నటనలో రసాలను గుర్తించి వర్ణించారు. అది అటుంచితే, ఈయన 4 అలంకారాలను గుర్తించారు. ఈయన ప్రత్యేకత, ఆసక్తి నాట్యం పైన ఉండటంతో ఆ శాస్త్రాన్ని గురించి చెప్తూ అలంకారాల గురించి అంటీ-అంటనట్టుగానే కొంత వర్ణించారు. అవి ఏ అలంకారాలు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.

విష్ణుధర్మోత్తరపురాణంలో 18 అలంకారాలను వర్ణించారు. ఈ పురాణాన్ని అష్టాదశ ఉపపురాణాలలో చెప్పింది బృహద్ధర్మపురాణం. ఈ పురాణంలో పిపీలికాదిబ్రహ్మపర్యంతం అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలుకొని సూర్యవంశం, చంద్రవంశం, యక్షులు, రాక్షసులు, పాతాళలోకం, పితృకర్మలు, వాస్తు, జ్యోతిషం, వేదాంతం, సంగీతం, సాహిత్యం అన్నిటి గురించీ 3 భాగాలలో, 1345 పర్వాలలో వర్ణింపబడ్డాయి. దీని రచయిత ఎవరు అనేది కచ్చితంగా తెలియదు కానీ ఇది భరతముని కాలం తఱువాతనే వ్రాసి ఉండాలి.

సుమారు క్రీ. శ. 6వ శతాబ్దం చిగురులో దండి అనే మహాకవి "కావ్యదర్శం" అనే గ్రంథంలో 38 అలంకారాలను గురించి వ్రాసారు. ఈయన రచించిన దశకుమారచరిత చాలా ప్రసిద్ధమైనది. "కావ్యదర్శం" పైన "భట్టికావ్యం" అనే రచన ప్రభావం చాలా ఉంది అని కొందరి అభిప్రాయం.

క్రీ.శ. 7వ శతాబ్దంలో లో భామహుడు "కావ్యాలంకారం" అనే గ్రంథం వ్రాసారు. ఇందులోని రెండు, మూడు అధ్యయాలలో అలంకారాల 35 గురించి చెప్పారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే దండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దండి వ్రాసిన దండి కావ్యదర్శాన్ని విమర్శించారు. సూటిగా ఫలాన ఆయన ఇలాగన్నాడు అని అనకుండా అపరే, అన్యే  (వేఱే వారు), కేచిత్ (కొంతమంది), అమేధసః (తెలివితక్కువ వాళ్ళు), కేచిత్ మహాత్మాః (కొందరు మహాత్ములు) వంటి సంబోధనలతో దండి రచనని విమర్శించారు. కాకపోతే కొన్ని చోట్ల పూర్తిగా ఏకీభవించారు కూడా.

దండి యమకం, అనుప్రాస అనే శబ్దాలంకారాలను అలంకారాలుగా గుర్తిస్తే భామహుడు వీటిని వేఱుగా శబ్దచిత్రాలు అన్నారు. వచనకవిత్వంలో కథ, ఆఖ్యానం అనేవి రెండుగా వర్ణించినా నిజానికి ఒకటేనని దండి చెప్తే, భామహుడు దాన్ని ఆక్షేపించారు. ఏది ఏమైనా, దండి భామహుడు సమకాలీనులైనా అవ్వాలి లేక దండి భామహుడి కంటే ముందు ఉండి ఉండాలి అని ఒక అభిప్రాయం. కొందరు అది తప్పంటారు.

ఉద్భాత అనే క్రీ.శ. 8వ శతాబ్దపు కాశ్మీర్ కవి భామహుడు కావ్యాలంకారానికి "భామహవివరణ" అనే పేరుతో దీనికి వ్యాఖ్యానం వ్రాసారు. ఆయన స్వయంగా "కావ్యాలంకార సంగ్రహం" పేరిట 41 అలంకారాలను వివరించారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రుద్రత అనే కాశ్మీరీ కవి "కావ్యాలంకారం" అనే పేరుతో వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమైనది. ఇందులో 16 అధ్యాయాలలో సుమారు 700 శ్లోకాలలో 68 అలంకారాలను వర్ణించారు. 11వ శతాబ్దంలో మమ్మట అనే ఆయన "కావ్యప్రకాశం" లో 67 అలంకారాలను గుర్తించారు. 12 వ శతాబ్దంలో రుయ్యకుడు "అలంకారసర్వస్వం" లో 79 అలంకారాలను చెప్తే, వాగ్భాత 69టి ని సూచించారు. 13వ శతాబ్దంలో జయదేవుడు 100 అలంకారాలతో వ్రాసిన పుస్తకం "చంద్రాలోకం". దాన్నే ఆధరంగా నేను అలంకారాలను చెప్తున్నాను. ఆ తఱువాత 14 వ శతాబ్దంలో కలింగదేశపు విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో 84టిని గుర్తించారు. 16వ శతాబ్దంలో తమిళనాడులో జన్మించిన అప్పయ్యదీక్షితుడనే ఒక అద్వైత వేదాంతి "కువలయానందం" లో 124 అలంకారాలను గుర్తించారు.

ఇప్పటిదాక నేను చెప్పినది కేవలం భారతసాహిత్యగగనంలో ఎక్కువ వెలుగు కలిగిన తారలనే. వీరు కాక అనేకానేకులు కావ్యం ఎలాగ వ్రాస్తే రక్తి కడుతుంది అనే అంశం మీద పుంఖానుపుంఖాలు వ్రాసారు. ఇంత చరిత్ర కలిగిన మనం చివరకు అర్థం పర్థం లేని పిచ్చి మాటలను పాటలుగా పాడుకుంటున్నామంటే అది మన దోషమేనని చెప్పుకోవాలి.  ఇక చంద్రాలోకం గురించి చెప్పుకుందాము.

చంద్రాలోకం రచించిన జయదేవుడు, గీతగోవిందం రచించిన జయదేవుడూ ఒకరే అని కొంతమంది వాదన. ఇద్దరూ దాదాపు 12 లేక 13 వ శతాబ్దానికి చెందిన వారే. ఇద్దరూ సంస్కృత పండితులే. ఇద్దరూ ఒరిస్సా నుండి వచ్చినవారే. ఇంత సామ్యం ఉన్నా వారు ఒక్కరే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గీతగోవిందంలోని పాటల్లో జయదేవుడు తాను భోజదేవుడు, వామదేవీ ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. పైగా ఆయన పరమవైష్ణవుడు. (గీతగోవిందమంతా శ్రీకృష్ణప్రేమామృతమే కదా!) కానీ చంద్రాలోకం రచయిత జయదేవుడు తాను రచించిన "ప్రసన్న రాఘవం" అనే నాటకంలో మహదేవుడు, సుమిత్రా ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. ఈ నాటక శివుడికి సంబంధించిన పండుగ సందర్భంగా మొదట నటింపబడింది అని చెప్పాడు. అప్పట్లో వైష్ణవులకు, శైవులకు ఉన్న పోటీని బట్టి చూస్తే గీతగోవిందం రచయిత ఈతడు అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

చంద్రాలోకాన్ని తెలుగులోకి ఆడిదము సూరకవి అనువదించాడు. ఈయన 18వ శతాబ్దం చివరి భాగానికి చెందిన వాడు. ఆంధ్రనామశెషము, కవిజనరంజనము, రామలింగేశ శతకం వీరి ఇతరరచనలు. సంస్కృత చంద్రాలోకంలో ఒక్కో అలంకారం ఒక్కో శ్లోకంలో వివరింపబడి ఉంది. శ్లోకంలో మొదటి పంక్తి అలంకారం లక్షణాన్ని వివరిస్తే రెండవ పంక్తి ఒక ఉదాహరణను చెప్తుంది.  ఆంధ్ర చంద్రాలోకంలో సూరకవి కూడా అదే శైలిని అవలంబించారు. సంస్కృతశ్లోకాలను ఒకటికి ఒకటిగా తెనిగించారు. తెలుగులో అన్నీ గీతాపద్యాలయ్యాయి. దీని గురించి చాలా మంది వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. వీటిలో అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు, పరవస్తు వేంకటరంగాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానాలను ఆధారంగా డా. బులుసు వెంకటసత్యనారాయణ మూర్తి గారు వ్రాసిన పుస్తకం చదువుతూ నేను అలంకారాలను వివరిస్తున్నాను.

Monday, September 3, 2012

హేత్వలంకారము


వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం


లక్షణం:

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)
హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతే
అసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||

అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)
కార్యకారణములు రెండు గలియఁబలికె
నేని యది హేత్వలంకృతి నా నెసంగు
నుదయ మందెడు నీ శశి మదవతీ క
దంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకు

వివరణ: హేతువు అంటే కారణం. హేతుమంతం అంటే కార్యం. ఉదాహరణకు సూర్యుడు రావడం హేతువు, పద్మాలు విచ్చుకోవడం కార్యం. హేతువు, హేతుమంతం ఒకే వాక్యంలో చెప్తే అది హేత్వలంకారం (హేతు + అలంకారం) అవుతుంది.

సూర్యుడు ఉదయించడం వలన జరిగే కార్యాలేమిటి? చెట్లు వికసించడం, సముద్రంలోని నీళ్ళు ఆవిరవ్వడం మొదలుకొని ఒడియాలు ఆరడం వరకు అనేకఫలితాలు ఉన్నాయి. కానీ, సూర్యుడు ఉదయించినది కేవలం పద్మాలు విచ్చుకోవడం కోసమేనన్నామనుకోండి, మిగతావి అంత ముఖ్యమైనవి కావు, పద్మాలు వికసించడమే అసలు విషయం అనే ధ్వని వచ్చి పద్మాలను పొగిడినట్టు అవుతుంది. అదే హేత్వలంకారం.

పై శ్లోకంలో (అనువాదంలోనూ) రెండొ భాగంలో కవి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఈ అందమైన భామల అలుక తీర్చడానికే చంద్రుడు ఉదయిస్తున్నాడు" అని ఆ వాక్యం భావం. నిజానికి చంద్రుడు రావడం వలన అనేకకార్యాలు జరుగుతాయి. మచ్చుకు కలువలు విచ్చుకుంటాయి. కానీ కవి వాటన్నిటినీ త్రోసిపుచ్చి అలిగిన అమ్మాయిలు అలుక వీడి ప్రియులకు లొంగడానికే వచ్చాడు అంటున్నాడు.


హేత్వలంకారం మఱొక లాగా కూడా సమకూరచ్చును. దానికి కవి ఇచ్చిన లక్షణం, ఉదాహరణ చూద్దాము.

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం)
హేతు హేతుమతోరైక్యం హేతుం కేచిత్ ప్రచక్షతే
లక్ష్మీ విలాస విదుషాం కటాక్షా వేంకట ప్రభోః

అనువాదం: (ఆడిదము సూరకవి)
కార్యకారణములకు నైక్యమగునేనిఁ
గృతులఁ గొందఱు హేత్వలంకృతియ యండ్రు
సత్కవులకున్ రమావిలాసములు వేంక
టేశ్వర కటాక్షము లనంగ నిందు మౌళి

వివరణ: కొంతమంది హేతువు, హేతుమంతం ఒకటేనని చెప్పడం హేత్వలంకారం అంటారు. ఉదాహరణకు "సత్కవులకు లభించే సిరిసంపదలు శ్రీ వేంకటేశ్వరుని కటాక్షం" అన్నామనుకోండి. నిజానికి వెంకటేశ్వరుని అనుగ్రహం "వలన" మనకు సిరిసంపదలు లభిస్తాయి అని ఉద్దేశం. కానీ, ఆ "వలన" అనే పదం విడిచిపెట్టేసి రెండిటికీ అభేదం చెప్తున్నాము. ఇదీ హేత్వలంకారమే.


ఈ అలంకారం చాలా తెలుగు పాటలలో విన్న గుర్తు. గుర్తుకు వచ్చినప్పుడు అవీ కలుపుతాను. ఈ లోపల చదువర్లకు ఏమైనా ఉదాహరణలు తెలిస్తే చెప్పగలరు.

Saturday, September 1, 2012

వ్యతిరేకాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారం


లక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోః

వివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.


ఉదా:- (చంద్రాలోకం)
సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః  కింతు ప్రకృతి కోమలాః
భావం: (మీరు) కొండలవలే ఎత్తుగానున్న వారు కాకపోతే మీకు కోమలత్వం కూడా ఉంది.
వివరణ: కొండలకు, ఒక వ్యక్తికి సామ్యం చెప్పారు (ఎత్తుగా ఉండటం). కాకపోతే వెంటనే కొండలకు లేని, ఆ వ్యక్తికి ఉన్న ఒక విశేషాన్ని చెప్పారు -- సహజ కోమలత్వం. కనుక కొండలకంటే ఆ వ్యక్తే మెరుగు అని తెలుస్తోంది. ఈ వ్యతిరేక విషయం చెప్పడం వలన ఆ వ్యక్తిని మరింత పొగిడినట్టైంది. కనుక ఇది వ్యతిరేకాలంకారం.


ఉదా:- (కావ్యం: భామినీ విలాసం, రచన: జగన్నాథ పండితరాయలు)
పంక్తి:
ఓ ప్రియా, ఇలాటి నీ ముఖముతో రాత్రులందు ముకుళించుకున్న పద్మాలను ఎలాగ పోలుస్తాము?
వివరణ: పద్మాలు పొద్దున్న పూటల విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు ముడుచుకుపోతాయి. కానీ వక్త ప్రేయసి ముఖం రాత్రుళ్ళు ముకుళించుకోవట్లేదు కనుక (నే) పద్మాలతో పోలిక న్యాయం కాదంటున్నాడు (పొద్దున్న విచ్చుకునే విషయంలో రెండూ సమానమే అని ఉద్దేశం).


ఈ అలంకారాన్ని కూడా మన సినీకవులు అంతగా వాడుకోలేదు అనుకుంటున్నాను. నా మాటను ఉదాహరణలతో సవరిస్తే సంతోషపడతాను.



పొడిగింపు:

మందాకిని/లక్ష్మీదేవి గారు వ్యాఖ్యలో చెప్పిన పాటనుండి:

చిత్రం: స్వప్న, రచన: ఆత్రేయ, సంగీతం: సత్యం, పాట: ఇదే నా మొదటి ప్రేమ లేఖ
మెరుపని పిలువాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పూవని పిలువాలంటే ఆ సొగసు ఒక్క దినం