Showing posts with label ఆత్రేయ. Show all posts
Showing posts with label ఆత్రేయ. Show all posts

Saturday, July 3, 2010

అంత్యప్రాసాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> అంత్యప్రాసం


లక్షణం: మొదటి పాదం చివర ముగిసిన అక్షారసమూహంతోనే తరువాతి పాదం కూడా ముగిస్తే అది అంత్యప్రాసం అవుతుంది.

వివరణ: సాధారణంగా ప్రాస అంటే రెండో అక్షరానికి వర్తిస్తుంది. గమనిస్తే అన్నమయ్యకీర్తనలలో ప్రతిచర్ణంలోనూ రెండో అక్షరం ఒకే గుణింతంలోనుండి వస్తుంది. ఉదాహరణకు "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అనే పల్లవిని పరికిస్తే "ముద్దు, తిద్ద" - ఈ రెండు శబ్దాలకూ ప్రాస కుదిరింది. అలాగే సుమతీ శతకంలో (కందపద్యాలలో) ప్రతీ పాదంలోనూ రెండో అక్షరానికి ప్రాస కుదురుతుంది. ఉదాహరణకు: "అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు" లో "క్క" తో ప్రాస కుదురింది. ఇదే నియమం పాదంలో ఆఖరి అక్షరానికి వాడితే అది అంత్యప్రాసం అవుతుంది. భావకవిత్వంలో పాదం బదులు "వాక్యం" చివరి అక్షరసమూహాన్ని పరిగణించడం రివాజు.

మన తెలుగు చలన చిత్రంలో అతి ఎక్కువగా వాడబడుతున్న ప్రాస ఇదే.ఎంతో భావుకతతో శ్రోతలు ఊహించని విధంగా ప్రాస కలపడంలోనే అంత్యప్రాస అందం ఉంది అని నా అభిప్రాయం. దీని గురించి వ్యాసాలు కాదు, పుస్తకాలు వ్రాయచ్చును. అంత అవసరం ఇప్పుడు లేదు కాబట్టి నాకు నచ్చిన ప్రాసలు కొన్ని చెప్పి శబ్దాలంకారాలు ముగిస్తాను. ఆ తరువాత అర్థాలంకారాలు వైపు నడుద్దాము.


ఉదా: (చిత్రం: ఆంధ్రకేసరి, రచన: ఆరుద్ర)
గజపతులు, నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు

మహానుభావుడు ఆరుద్ర రాజమహేంద్రపురం గురించి వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట ఇప్పటికీ గోదారిగంగ అలలలాగా నా మనసులోతుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. "ఊరు" కి ఎన్నో ప్రాసపదాలు వాడటం మనం చూశాం, "పేరు", "ఏరు", "నీరు" వంటివి రివాజు. కానీ, ఆరుద్ర ఎంతో ఆలోచించి "నినదించెను" వంటి చక్కని పదాలను అక్కునచేర్చుకుని "గౌతమి హోరు" (గోదావరి అలల వేగం వలన కలిగిన నాదం) అని ఎంత చక్కని అంత్యప్రాస కలిపారు?

కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

అలాగే, "కొట్టుకొని పోయెనొక కోటిలింగాలు" అన్నప్పుడు ఎవరైనా, "ఐతేనేమి? కాటన్ దొర బ్యారేజీ మిగిలిందనో, రచించిన కవితాసౌధాలు మిగిలాయనో చెప్తారు", అని శ్రోతలు అనుకుంటే "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్న చందాన, "వీరేశలింగం పంతులు మిగిలాడు మాకు, అది చాలు", అని చెప్పడం విన్న ప్రతిసారి, నాకు కళ్ళు చెమరుస్తుంది.


ఉదా: (చిత్రం: రాజ్కుమార్, రచన: ఆత్రేయ)
సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం, ప్రతిపొద్దూ ప్రణయావేశం, పెదవులపై హాసం
సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం, ప్రతిరోజూ ఒక శ్రీకారం, పరవశశృంగారం

"జానకి కలగనలేదు" అనే పాటలోనిది ఈ చరణం. ముక్కలైపోయిన గుండెలగురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే "మనసు-కవి", "మన-సుకవి" ఆత్రేయగారు, ఈ పాటలో ఒక్కటైపోయిన మనసుల గురించి చక్కగా చెప్పారు (1). ఒక్కో మాటలోనూ ఎంతో లోతైన భావం ఉంది, ఎంతో చక్కందనం ఉంది. అందుకే ఈ అంత్యప్రాస బాగా కుదిరింది.


ఉదా: (చిత్రం: శుభసంకల్పం, రచన: వేటూరి)
సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేదమంత్రాలు

ఇక్కడ రెండు అక్షరాలతో చక్కని అంత్యప్రాస కుదిరింది. "కట్టె, కొట్టె, తెచ్చె" అని రామయణం చెప్పడం తెలుగువారికి తెలిసే ఉంటుంది. అదే రామయణాన్ని ఈ రెండు వాక్యాలలోనూ కవి ఎంతో అందంగా చెప్పాడు. రాముడి సుగుణాల, సీతమ్మ అందాల, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు కలిసినప్పుడు జరిగిన వైభోగాలు - అంతే కదా రామయణం!


ఉదా: (చిత్రం: మనీ రచన: సిరివెన్నెల)
ఇదీయమీను సద్దాం హుసేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో ఉండే పెళ్ళాం కంటే డిక్టేటర్లట్రా?

"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాటల మధ్యలో ఇది వ్రాశావు? సిరివెన్నెల ఇంతకంటే గొప్పవెన్నెన్నో ప్రయోగాలు చేశారు కదా?" అని చదువర్లకు సందేహం రావచ్చు. "ఇంగ్లీషు పదాలకు, తెలుగుపదాలకు ప్రాస కలపడంలో కూడా అందం ఉంది. అది చెయ్యడానికి కూడా చాలా ఆలోచన కావాలి", అని చెప్పడానికే ఇది వ్రాశాను. ఈ పాట నచ్చని తెలుగువాడుంటాడా చెప్పండి?


ఒకప్పుడు ఇది నిజంగా అలంకారంగానే (తగినపాళ్ళలో వాడేవారు) ఉండేది. ఉదాహరణకి దేవులపల్లి, పింగళి, సినారె, దాశరథి మొదలగు కవుల పాటల్లో ఇది ఒక నియమంలాగా ఉండదు. రాను రాను, ఒక నియమం అయిపోయింది. ప్రాస కలపడం, అది ఒక పాటనడం - ఇది రివాజైపోయింది. "బన్ని, పిన్ని, చున్ని" ప్రాసపాటలు, తెలుగువైభవాన్ని చూసినవారికి గుండెపోట్లై కూర్చుకున్నాయి. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.


ఈ అలంకారానికి పద్యాలలో ఉదాహరణలు నాకు తెలియవు. మీకేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

(1) "వివరించేటప్పుడు నీ అలంకారాల గోలేమిటయ్యా?", అని అనుకోకండి. దైనందినజీవితంలో వాడితేనే కదా అలంకారాలకు అలంకారం?

Thursday, March 25, 2010

మాలధారణం నియమాలతోరణం - వేటూరి

భక్తిరసప్రధానమైన చిత్రాలు తెలుగులో చాలా వచ్చాయి. వాటిల్లో చాలా మంది రచయితలు మంచి పాటలు వ్రాశారు. అలాంటి చిత్రాలలో "అయ్యప్పస్వామి మహత్యం" అనే చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో గీతసారాన్ని గీతాలలో నింపాడు రచయిత వేటూరి. ఒక్కో పాటా ఆణిముత్యం. భావం గంగమ్మలాగా ప్రవహిస్తే తెలుగు గోదారిగంగలాగా పారింది. ఈ పాటలు అయ్యప్పస్వామి భక్తులందరికీ అత్యంతప్రీతిపాత్రమైనవి.

ఈ పాటలను వేటూరే వ్రాసారని ragalahari.comలో చెప్పారు. అయినా నేను నిర్ధారించుకోవడానికి సినిమాలో titles చూశాను. అక్కడ ఆచార్య ఆత్రేయ పేరు (సహాయకులతో సహా) ఒక చోట, వేటూరి సుందరరామమూర్తి అని ఒక చోట పడ్డాయి. కానీ, వారు నిర్వహించిన బాధ్యతలను చెప్పే పదాలు backgroundలో ఉన్న వెలుగు వలన కనబడలేదు. ఆచార్య ఆత్రేయ సినిమాలకు మాటలు వ్రాసేవారు. అందుచేత ఆయన మాటలు వ్రాయగా వేటూరివారు పాటలు వ్రాశారని నా నమ్మకం. ప్రత్యేకించి ఈ పాట శైలి, సాగరసంగమంలో వేటూరి వ్రాసిన "ఓం నమఃశివాయ" శైలితో పోల్చదగినది (ఎందుకో క్రింద చెప్పాను). అందుకే ఇది వేటూరే వ్రాశారని నా నమ్మకం.

మాలధారణం, నియమాలతోరణం
జన్మతారణం, దుష్కర్మవారణం
శరణం, శరణం, శరణం, శరణం, అయ్యప్పస్వామి శరణం, అయ్యప్పస్వామి శరణం

"అయ్యప్పస్వామి మాలను ధరించడం అంటే నియమాలను దండగా చేసుకుని ధరించడం, భవసాగరాన్ని ఆ ఊతతో ఈదడం, చెడ్డపనులవైపు మనస్సు మరలకుండా అప్పడం", అని కవి వర్ణన. అంత్యప్రాస ఎంత చక్కగా కుదిరింది? భావం ఎంత లోతుగా ఉంది? భక్తిపాటలు వ్రాయడంలో తెలుగు చలనచిత్రపరిశ్రమలో వేటూరికి సాటి లేరు అని నా నమ్మకం. వైదీకసూత్రాలను కూలంకషంగా పరిశీలించి వ్రాసినట్టుగా గోచరిస్తాయి ఆయన పాటలు.

ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయసాధనలో
చతుర్వేదములలో రక్షణలో, పంచభూతముల పంజరశుకమై
ఆరుశత్రువుల ఆరడిలోపడి, ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల, మాలధారణం!

"ఉదయమూ సాయంత్రమూ, ధర్మం-అర్థం-కామం (తలచిన పని సిద్ధించాలని) ఈ మూడింటినీ తీరంగా పెట్టుకుని, నాలుగు వేదాల చేతా రక్షింపబడుతూ ఉంటారు మాలధారులు. పంచభూతములు అనే పంజరములో ఉన్న చిలుకలాగా, అరిషడ్వర్గాలు (కామక్రోధమోహలోభమదమాత్సర్యాలు) చేత వేధింపబడుతూ ఉన్న వారు నువ్వే ఏడు జన్మలకూ వీడని చేయూతవని నమ్మి నీ మాలను ధరిస్తారయ్యా!", అని భావం. ఎంత లోతైన వైదీకమర్మాలను చెప్పాడు? భక్తుల మనస్సులోనున్న ఆవేదన, వారి కష్టాలు, వారు భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తారు - అన్నీ చెప్పాడు.

మీరు గమనించినట్టైతే ఇక్కడ రెండు సంధ్యలు, మూడు పురుషార్థాలు, నాలుగు వేదాలు, పంచభూతాలు, ఆరు శత్రువులు, ఏడు జన్మలు" అన్నాడు కవి. పెరుగుతూ ఉన్న సంఖ్యలను చూడండి. సాగరసంగమం చిత్రంలో "ఓం నమఃశివాయ" పాటలో "త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, పంచభూతములు ముఖపంచకమై, ఆరు ఋతువులే ఆహార్యములై, ప్రకృతి పార్వతీ నీతో నడచిన ఏడు అడుగులూ స్వరసప్తకమై, నీ దృక్కులే అష్టదిక్కులై, నీ వాక్కులే నవరసమ్ములై, నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయా", అంటూ సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళాడు. అందుకే "మాలధారణం" పాట శైలిని "ఓం నమఃశివాయ" పాటతో పోల్చినది.

"అ-ఉ-మ" సంగమనాదంలో ఓం, ఓం, ఓం
హరిహరరూపాద్వైతంలో శరణం, శరణం, శరణం, శరణం
నిష్ఠురనిగ్రహయోగంలో, మండలపూజామంత్రఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే, ఆత్మహారతులు పట్టిన భక్తుల మాలధారణం!

ఈ చరణం గురించి చర్చించుకునే ముందు కే.వీ.మహదేవన్ గురించి చెప్పుకోవాలి. వేటూరి ఆయన్ని కలిసిన కొత్తల్లో tune చెప్పండయ్యా అంటే, "tune మేము చెప్తే ఇంక రచయితకు స్వేఛ్ఛ ఎక్కడుంటుందయ్యా? నువ్వు పాట వ్రాయి, నేను tune చేస్తాను", అన్నాడట. ఆహ! ఒక మలయాళీయుడయ్యుండి, తెలుగుజనాలకు తనపాటలతో మృష్టాన్నభోజనం తినిపించిన మహానుభావుడు మామ, మహదేవన్. మొదటి చరణానికీ రెండో చరణానికీ tune భేదం ఉంది గమనించండి. అంటే వేటూరి ముందు పాట వ్రాశాకా, దానికి లయలు నేర్పించాడు మామ! ఈ చరణం ముందు వచ్చే వేణునాదంలో భక్తితరంగాలు తాండవించాయి. మహదేవన్ నిజంగా మహానుభావుడు!

"ఓం" అనే నాదం, "అ", "ఉ", "మ" అనే మూడు స్వరాలను కలిపితే వచ్చింది అని వైదీకుల నమ్మకం. ఈ ప్రపంచం ఆ నాదంలోనుండి పుట్టింది అని మన విశ్వాసం. అయ్యప్పస్వామి హరిహరుల తనయుడని, వారిద్దరి మధ్యనా భేదాలు/విభేదాలు లేవని నిరూపించేందుకు పుట్టాడని ఆయన చరిత్ర చెబుతోంది. ఈ మూడు స్వరాల కలయికలో, ఆ రెండు మహాశక్తుల మేళనలో, ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తూ, మంత్రాలనడుమ భక్తులు వారు చేసిన పాపపుణ్యాలను కర్పూరం చేసి అయ్యప్పస్వామికి హారతిగా పడతారుట! కర్మ, దాని ఫలితం ఉన్నంతకాలమే ఆత్మ ఈ భౌతికప్రపంచంలో నడుస్తుంది. ఆ కర్మను నాశనం చేసేవాడు యోగేశ్వరుడైన పరమాత్మ. ఆ నైష్కర్మ్యాన్ని సాధించేందుకు భక్తులు స్వామి వద్దకు మాలను ధరించి వస్తున్నారు అని ఎంత లోతైన భావాన్ని తక్కువ మాటల్లో చెప్పడో వేటూరి!

ఈ చిత్రంలో మిగిలిన పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. త్వరలోనే ఆ పరమాత్ముడి దయతో అవన్నీ కూడా వ్రాయగలనని ఆశిస్తున్నాను. హరిః ఓం.

Tuesday, October 7, 2008

జానకి కల గనలేదు...

ఎవరేమన్నా సరే సంసారం అంటే అంతా సులువైన విషయం కాదు అన్నది సత్యం. ఇది అన్ని పురాణాలు, స్మృతులు, ఉపనిషత్తులు ఘోషిస్తున్న సత్యం. అసలు ఒక్కసారైనా కొట్టుకొని భార్యాభర్తలు ఉండరు అన్నది నా ప్రఘాఢ విశ్వాసం. అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వింటే, నాకు కూడా ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది, "అంత కంగారు పడాల్సింది ఏమి లేదు. ఇందులో తలనొప్పి కంటే అమృతాంజనమే ఎక్కువ ఉంటుంది ఏమోలే" అని :)

భార్యాభర్తలు అనగానే మనం చెప్పుకొనే రెండు జంటలు ఉన్నాయి. అవి: పార్వతీపరమేశ్వరులు , సీతారాములు.
అర్థనారీశ్వరుడు శివుడు ఖ్యాతికి ఎక్కితే, ఏకపత్నివ్రతుడు రాముడు ఖ్యాతికి ఎక్కాడు. వీరు ఇరువురు నాకు జీవితంలో ఆదర్శం (ఒక్క విషయంలోనే కాదు సుమీ :) ). వీళ్ళు కూడా కొట్టుకున్న సందర్భాలు మనం పురాణాల్లోచదివాము [ శివపురాణం, వాల్మీకి రామాయణం ]. కానీ, "కోపం ఉండటం వేరు. ఇష్టం లేకపోవడం వేరు. ", అని నానమ్మకం.

ఇక అసలు విషయానికి వస్తే ఈ పాట "రాజ్కుమార్" సినిమాలో ఇళయరాజా స్వరపరచిన పాట. ఇది వ్రాసింది ఆచార్యఆత్రేయ. చక్కని సాహిత్యమ, సుమధురమైన సంగీతం రెండూ కలిపితే నిజంగా
పార్వతీపరమేశ్వరులు చూసిన భావమేకలుగుతుంది.


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

రాముడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో అడవులకు వెళ్ళేటప్పుడు అసలు అందరూ "వీడు మళ్ళీ వెనక్కి వస్తాడా?", అనేభయంతోటే ఉండి ఉంటారు. అలాటిది, అనుకున్న దానికంటే ఎక్కువ దానవసంహారం చేసి, అహల్యను అనుగ్రహించి, పెళ్లికూడా చేసుకుని వస్తాడు అని ఎవరూ అనుకోలేదేమో, ఒక్క వశిష్టుడు, విశ్వామిత్రుడు తప్ప - వారు బ్రహ్మర్షులు. వారికిజరిగేది, జరిగింది, జరగబోయేది అన్నీ తెలుస్తాయి. "Marriages are made in heaven",
అంటారు. అలాగ, అనుకోకుండానే ఒకరికి ఒకరు జతపడ్డారు సీతారాములు. ఈ జంట పరవశంలో అలాగే వారి వలె వీరు కూడా కలిసారుఅని సంతోషిస్తోంది.

ఇక్కడ పారాయణం అనే పదం చక్కగా అమరింది. పారాయణం అంటే మొదటినుండి చివరిదాకా శ్రద్ధగా చదవటం. పూర్వం భాగవతపారాయణం అని చదివేవారు. అంటే, మొత్తం భాగవతం కూర్చుని శ్రద్ధగా చదవడం. వీరి జీవితాలనుచూస్తేకనుక ఆ రామాయణం లాగే ఉంది అని వీరి భావం.


చెలి మనసే శివధనుసైనది; తొలిచూపుల వశమైనది
ఆత్రేయ గారు మహానుభావుడు. మనసు కవి ఆత్రేయ అంటారు. అలాగ, చక్కనైన ప్రయోగం చేసారు. ఎక్కడైనా కొంచంసిగ్గు, బెట్టు, జాగ్రత్త అన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఆమె చేత అవుననిపించడమే అసలు ఒక పెద్ద విషయం. అలంటి ఆ స్త్రీ మనసే, శివధనుస్సు అంత బలమైనది అని చెప్పటం నాకు నచ్చింది. వారి చూపులు కలిసినప్పుడే అదిలొంగిపోయిందిట.


తొలిచుక్కవు, నీవే చుక్కానివి నీవే
ఎవరైనా ఉపవాసం/నక్తం చేసేవాళ్ళు ఉంటే, వారికి ఈ తోలిచుక్క విలువ తెలుస్తుంది. పొద్దున్న లేచినప్పటినుండి రాత్రిఒక చుక్క కనబడేవరకు భోజనం చెయ్యరు. అది కనబడ్డాక "బ్రతుకు జీవుడా" అనుకుని తినేవాళ్ళు కొంతమందిఉంటారు :) ఆ తోలిచుక్కతో ఈమె తన ప్రియుణ్ణి పోల్చడం బాగుంది.

చుక్కాణి అంటే పడవకు దరి చూపేది (rudder). దారి చూపేది కూడా అతడే అని భావం. అతడితోనే, తన పయనం అనిపునరుద్ఘాటిస్తోంది. ఇలాంటి చక్కని పదాలు అప్పుడప్పుడు వేటూరి, సిరివెన్నెల ప్రయోగిస్తున్నారు. గోదావరి సినిమాలోవేటూరి "
చుక్కాణే చూపుగా..బ్రతుకు తెరువు ఎదురీతేగా...", అని టైటిల్ సాంగ్ లో వ్రాయడం నాకు భలే నచ్చింది.


సహవాసం మనకు నివాసం; సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం; పెదవులపై హాసం
నివాసం అంటే ఇల్లు. వారికీ ఇల్లు అంటే ఒకరితో ఒకరు కలిసి ఉండటమేనట. అందులో హద్దులేవి ఉండవు.

ఇక "ప్రతిపొద్దు
ప్రణయవేశం" అనే ప్రయోగం నాకు గొప్పగా నచ్చింది. ఆవేశం అంటే ఒక భావనకు లోను కావడం. సహజంగా మనం ఆ భావాన్ని కోపానికి మాత్రమే అపాదిస్తము. ఐతే, అది ప్రణయం మనోహరమైన భావాలకు వాడెకవులు తక్కువ. అందుకే నాకు చక్కగా అనిపించింది.

ఆ ఆవేశం వ్యక్తపరిచే విధానం కూడా చాల తేలిక మాటల్లో చెప్పారు - "హాసం". అంటే, చిరునవ్వుతోనే ఆ భావాలనుతెలుపుకున్తున్నారు!


సుమసారం మన సంసారం;
పువ్వులో ఉండే ముఖ్యమైన లక్షణాలు అన్నీ ఉన్నదిట వారి సంసారం. పువ్వులో ఉండే ముఖ్యమైన లక్షణాలు: రంగులు, సువాసన, తేనె, అందం. ఇవన్నీ, మన మనసుకు ఉల్లాసం కలిగించేవి. అలాంటివి అన్నీఉన్నాయి ఆసంసారంలో అని చక్కగా, తక్కువ మాటల్లో చెప్పాడు కవి.

అసలు ఇలాంటి ప్రయోగాలు (సుమసారం) చేసే కవులు ఇంకా ఎక్కడ మిగిలారు అనిపిస్తుంది నాకు. తెలుగుపాటల్లో కూడా ఇంగ్లీష్ పదాలే నిండిపోతున్న కాలంలో, ఇలాంటి చక్కని ప్రయోగాలు వింటే నాకు చెవుల్లో తేనే పోసినట్టు ఉంటుంది.


మణిహారం మన మమకారం
మణిహారంలో అనేక మణులు ఉంటాయి. అలాగే వారి మమకారంలో కూడా అనేక భావాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి, తల్లి, తండ్రి, స్నేహితులూ ఒకరికి ఒకరు అవుతారు కాబట్టి ఆ విభిన్నమైన రూపాలు ధరిస్తున్న అనురాగం మణిహారంలాగా ఉంటుంది.


గతమంటే నీవే కధ కానిది నీవే
ఆమె గతం మొత్తం చెరిపేసి అతడు అక్కడ నుంచున్నాడుట. గతం అంత తనే కనిపిస్తున్నాడు.
ఐతే, గతం సహజంగా కథగా మిగిలిపోతుంది. కానీ, ఇతడు కథ కాదు అని ఋజువు చేస్తూ ఆమె ఎదురుగుండా
నిలిచున్నాడు!

ఈ లైన్ వింటే నాకు చక్రం సినిమాలో సిరివెన్నెల "ఒకే ఒక మాట" అనే పాటలో చేసిన చక్కని ప్రయోగం
గుర్తుకొచ్చింది: "నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదనీ, నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదనీ"

ఇక ఈ పాటలో మనం మరిచిపోకూదనివి కొన్ని ఉన్నాయి. అవి సుశీల, బాలు చక్కగా పాడి పాటను రక్తి
కట్టించడం. అలాగే, background score కూడా చక్కగా కలిసింది. ఇళయరాజా లాంటి మెలొడీలు ఇచ్చే
సంగీతదర్శకులు ఇప్పుడు అరుదు. అడపోదడపో మణిశర్మ, దేవిశ్రీ కొన్ని చేస్తున్నారు అంతే. ఆంధ్ర అందగాడు
శోభన్ బాబు కెరీర్ లోనే ఇది ఒక గొప్ప యుగళగీతం అని నా అభిప్రాయం.

చిత్రం: రాజ్కుమార్


సంగీతం: ఇళయరాజ
పాడింది: బాలు, సుశీల


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ ఈనాడు మనకూ నిజమైనదీ
ఆ రామాయణం మన జీవన పారాయణం

చెలి మనసే శివధనుసైనది తొలిచూపుల వశమైనది
వలపు స్వయం వరమైనపుడు గెలువనిదీ యేదీ
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని యశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాకా నీవే మరు జన్మకు నీవే

సహవాసం మనకు నివాసం; సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం; పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశశృంగారం
గతమంటే నీవే కధ కానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే