లక్షణం: మొదటి పాదం చివర ముగిసిన అక్షారసమూహంతోనే తరువాతి పాదం కూడా ముగిస్తే అది అంత్యప్రాసం అవుతుంది.
వివరణ: సాధారణంగా ప్రాస అంటే రెండో అక్షరానికి వర్తిస్తుంది. గమనిస్తే అన్నమయ్యకీర్తనలలో ప్రతిచర్ణంలోనూ రెండో అక్షరం ఒకే గుణింతంలోనుండి వస్తుంది. ఉదాహరణకు "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అనే పల్లవిని పరికిస్తే "ముద్దు, తిద్ద" - ఈ రెండు శబ్దాలకూ ప్రాస కుదిరింది. అలాగే సుమతీ శతకంలో (కందపద్యాలలో) ప్రతీ పాదంలోనూ రెండో అక్షరానికి ప్రాస కుదురుతుంది. ఉదాహరణకు: "అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు" లో "క్క" తో ప్రాస కుదురింది. ఇదే నియమం పాదంలో ఆఖరి అక్షరానికి వాడితే అది అంత్యప్రాసం అవుతుంది. భావకవిత్వంలో పాదం బదులు "వాక్యం" చివరి అక్షరసమూహాన్ని పరిగణించడం రివాజు.
మన తెలుగు చలన చిత్రంలో అతి ఎక్కువగా వాడబడుతున్న ప్రాస ఇదే.ఎంతో భావుకతతో శ్రోతలు ఊహించని విధంగా ప్రాస కలపడంలోనే అంత్యప్రాస అందం ఉంది అని నా అభిప్రాయం. దీని గురించి వ్యాసాలు కాదు, పుస్తకాలు వ్రాయచ్చును. అంత అవసరం ఇప్పుడు లేదు కాబట్టి నాకు నచ్చిన ప్రాసలు కొన్ని చెప్పి శబ్దాలంకారాలు ముగిస్తాను. ఆ తరువాత అర్థాలంకారాలు వైపు నడుద్దాము.
ఉదా: (చిత్రం: ఆంధ్రకేసరి, రచన: ఆరుద్ర)
గజపతులు, నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు
మహానుభావుడు ఆరుద్ర రాజమహేంద్రపురం గురించి వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట ఇప్పటికీ గోదారిగంగ అలలలాగా నా మనసులోతుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. "ఊరు" కి ఎన్నో ప్రాసపదాలు వాడటం మనం చూశాం, "పేరు", "ఏరు", "నీరు" వంటివి రివాజు. కానీ, ఆరుద్ర ఎంతో ఆలోచించి "నినదించెను" వంటి చక్కని పదాలను అక్కునచేర్చుకుని "గౌతమి హోరు" (గోదావరి అలల వేగం వలన కలిగిన నాదం) అని ఎంత చక్కని అంత్యప్రాస కలిపారు?
కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
అలాగే, "కొట్టుకొని పోయెనొక కోటిలింగాలు" అన్నప్పుడు ఎవరైనా, "ఐతేనేమి? కాటన్ దొర బ్యారేజీ మిగిలిందనో, రచించిన కవితాసౌధాలు మిగిలాయనో చెప్తారు", అని శ్రోతలు అనుకుంటే "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్న చందాన, "వీరేశలింగం పంతులు మిగిలాడు మాకు, అది చాలు", అని చెప్పడం విన్న ప్రతిసారి, నాకు కళ్ళు చెమరుస్తుంది.
ఉదా: (చిత్రం: రాజ్కుమార్, రచన: ఆత్రేయ)
సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం, ప్రతిపొద్దూ ప్రణయావేశం, పెదవులపై హాసం
సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం, ప్రతిరోజూ ఒక శ్రీకారం, పరవశశృంగారం
"జానకి కలగనలేదు" అనే పాటలోనిది ఈ చరణం. ముక్కలైపోయిన గుండెలగురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే "మనసు-కవి", "మన-సుకవి" ఆత్రేయగారు, ఈ పాటలో ఒక్కటైపోయిన మనసుల గురించి చక్కగా చెప్పారు (1). ఒక్కో మాటలోనూ ఎంతో లోతైన భావం ఉంది, ఎంతో చక్కందనం ఉంది. అందుకే ఈ అంత్యప్రాస బాగా కుదిరింది.
ఉదా: (చిత్రం: శుభసంకల్పం, రచన: వేటూరి)
సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేదమంత్రాలు
ఇక్కడ రెండు అక్షరాలతో చక్కని అంత్యప్రాస కుదిరింది. "కట్టె, కొట్టె, తెచ్చె" అని రామయణం చెప్పడం తెలుగువారికి తెలిసే ఉంటుంది. అదే రామయణాన్ని ఈ రెండు వాక్యాలలోనూ కవి ఎంతో అందంగా చెప్పాడు. రాముడి సుగుణాల, సీతమ్మ అందాల, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు కలిసినప్పుడు జరిగిన వైభోగాలు - అంతే కదా రామయణం!
ఉదా: (చిత్రం: మనీ రచన: సిరివెన్నెల)
ఇదీయమీను సద్దాం హుసేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో ఉండే పెళ్ళాం కంటే డిక్టేటర్లట్రా?
"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాటల మధ్యలో ఇది వ్రాశావు? సిరివెన్నెల ఇంతకంటే గొప్పవెన్నెన్నో ప్రయోగాలు చేశారు కదా?" అని చదువర్లకు సందేహం రావచ్చు. "ఇంగ్లీషు పదాలకు, తెలుగుపదాలకు ప్రాస కలపడంలో కూడా అందం ఉంది. అది చెయ్యడానికి కూడా చాలా ఆలోచన కావాలి", అని చెప్పడానికే ఇది వ్రాశాను. ఈ పాట నచ్చని తెలుగువాడుంటాడా చెప్పండి?
ఒకప్పుడు ఇది నిజంగా అలంకారంగానే (తగినపాళ్ళలో వాడేవారు) ఉండేది. ఉదాహరణకి దేవులపల్లి, పింగళి, సినారె, దాశరథి మొదలగు కవుల పాటల్లో ఇది ఒక నియమంలాగా ఉండదు. రాను రాను, ఒక నియమం అయిపోయింది. ప్రాస కలపడం, అది ఒక పాటనడం - ఇది రివాజైపోయింది. "బన్ని, పిన్ని, చున్ని" ప్రాసపాటలు, తెలుగువైభవాన్ని చూసినవారికి గుండెపోట్లై కూర్చుకున్నాయి. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.
ఈ అలంకారానికి పద్యాలలో ఉదాహరణలు నాకు తెలియవు. మీకేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.
(1) "వివరించేటప్పుడు నీ అలంకారాల గోలేమిటయ్యా?", అని అనుకోకండి. దైనందినజీవితంలో వాడితేనే కదా అలంకారాలకు అలంకారం?