Showing posts with label ఉత్పలమాల. Show all posts
Showing posts with label ఉత్పలమాల. Show all posts

Sunday, February 11, 2018

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.

దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా! 
(దౌష్ట్యము = దుర్మార్గం, కాంచి = చూసి, దండన సేయు = దండించు, ఎంచు = నిర్ణయించు, హా = అయ్యో!)

భీముడు చేసిన దుర్మార్గాన్ని చూసి, రాముడు అతనిని దండించాలని నిర్ణయించుకున్నాడట. అది ఎలాగో ఉత్పలమాలలో చెప్పాలి. శ్రీచరణ్ గారు - ఇబ్బంది లేకుండా పూరించారు. ఆయన పూరణ:

​సృష్ట్యధినాథుడైన పరచిన్మయ విష్ణువు కృష్ణమూర్తియై
వృష్ట్యనృతాంబుదంబు వలె వీరరసంబును నూరిపోయగా
దృష్ట్యవహీనజాతుడగు దిట్టను కూల్చుట కోపభద్రుడై
దౌష్ట్యము గాంచి భీమునికి దండన చేయగ రాముడెంచె హా!


వారి పద్యంలో అన్వయం నాకు పూర్తిగా గోచరించలేదు. "అనృతాంబుదము" అని కృష్ణుడిని అనడం బాగుంది. అంబుదం అంటే మబ్బు. మబ్బులూ, కృష్ణుడూ నల్లగా ఉంటారు (నీలమేఘశ్యాముడు). ఆ కృష్ణుడు కల్లబొల్లి మాటలు చెప్పాడు అండానికి "అనృత + అంబుదం" అన్నారు.

అవధానం రేపనగా ఇది మరీ కష్టమేమోనని కొంచెం సందేహించాను. అదే విషయం నిద్రబోయే ముందు నా సతీమణితో అంటే "మీరు పూరించలేనిది ఆయనని అడగడం సబబా" అంది. సరే, చేతిలో కాగితం, కలం లేకుండా నేను పూరించగలనో లేదొ చూద్దాం అని పూరించాను. దాదాపు 40 నిముషాలు పట్టింది. ఇలాగ పూరించాను.

సృష్ట్యనునిత్యముంగనెడి సాధుకుఁ నీచుకుఁ మధ్య స్పర్థలో
దృష్ట్యనుసారమే తెలియు ర్మమెటో మురవైరియన్నకున్
తుష్ట్యరి కాడె శిష్యుఁ తొడ తుంచిన దుండగుడెవ్వడయ్యినన్ 
దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె హా!

సృష్టి ఎప్పుడూ మంచివాడికీ, చెడ్డవాడికీ మధ్య తగువును చూస్తూనే ఉంటుంది. అందులో ఎవరివైపు ధర్మముందో చెప్పడం కష్టం. ఎవరి దృష్టిని బట్టి వారికి అలాగ అనిపిస్తుంది. ఇందులో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడి అన్న, అవతారమూర్తి అయిన బలరాముడికి కూడా మినహాయింపు లేదు. తన శిష్యుడైన దుర్యోధనుడిని తొడ చీల్చి చంపినవాడు ఎవరైనా తన సంతోషానికి విరోధియే కదా. అందులోనూ భీముడు కూడా బలరాముడి శిష్యుడే. అందుచేత, బలరాముడికి చెడ్డ పేరు వస్తుంది. ఈ దుర్మార్గాన్ని చూసి భీముడిని దండించాలి అని (బల)రాముడు నిర్ణయించుకున్నాడు.

ఒక వేళ ఈ సమస్యతో అనుకోని చిక్కు ఏమైనా వస్తే ఉంటాయి అని మరి కొన్ని సమస్యలను కూడా సిద్ధపరిచాను. అవి మీకు నచ్చి, పూరించాలి అనిపిస్తే - ప్రయత్నించగలరు.

పలువురు మెచ్చెఁ పాలడుగు బాలుడె భామనుఁ గాసిచేయగన్
రావణుఁ నెగ్గియర్జునుడు రాముని వేటుకు నేలకూలెనే
పొట్టేలెంచెను చేప పొందు యెదుటన్ పుష్పాంగి చూస్తుండగా
తామరఁ గని యేవపడని తరుణియుఁ గలదే!
పాడెడి వారి పాలఁ బడి పాలక సైన్యము పారిపోయె హా!

Sunday, June 21, 2015

సియాటల్ లో మన్మథ నామ నూతన సంవత్సర యుగాది కవి సమ్మేళణం

2014 ఉగాదికి సియాటల్ లో జరిగిన కవి సమ్మేళణానికి మంచి ప్రతిస్పందన లభించింది. ఆ స్ఫూర్తితో ఈ సారి కూడా జరుపుదామనుకున్నాము. ఈ సారి శ్రీరామ నవమి, ఉగాది కలిపి జరపాలని "మన సంస్కృతి" సంస్థ నిర్ణయించింది. శ్రీ సీతారాముల కల్యాణం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగింది. కొంచం ఆలస్యం అవ్వడంతో కవి సమ్మేళణానికి సమయం లేకపోయింది. అయినప్పటికి ప్రశ్నలను, ప్రోత్సాహాన్ని అందించిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి, కొత్తపాళి గారికి కృతజ్ఞులము. కవిసమ్మేళనానికి గానూ వ్రాసిన పద్యాలలో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సీతా రామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

ఇస్సీ అనే పదం మనకు ప్రస్తుతం వాడుకలో లేదు. ఇస్సీ అంటే "అయ్యో, అక్కట" అనే అర్థంలో వాడతారు(ట). దీన్ని చాలా అద్భుతంగా పూరించినవారు లంకా సూర్య రవీంద్ర.

నా త్రాణంబును, నాదు బ్రాణములు, నా దార్ఢ్యంబు శ్రీ రాముడే!
నా తండ్రిన్, నన జానకీతనయ నే దావాలకంపింపనే?
నీతిన్ దప్పక నీకు జేసినటి వాగ్ద్విత్వంబు జెల్లింప, నా
సీతారామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహ మిల్లాలవై!

సామాన్యంగా మనం సమస్యను "సీతా! రామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని చదువుతాము. సీతాదేవి రామునికి ద్రోహం ఎప్పుడు చేసిందా అనుకుంటాము. ఐతే పూరకులు దాన్ని "సీతారామునికి ఇలా ద్రోహం చేస్తావా?" అని అర్థం వచ్చేలాగా వ్రాసారు. పై పద్యంలో భావం: దశరథుడు కైకేయతో "నా మాటను నెపంగా పెట్టుకుని నా సర్వస్వమైన సీతారాముణ్ణి, సీతని అడవులకు పంపించి అతనికి ద్రోహం చేస్తావా?" అని అంటున్నాడట.

మారా మారాము మానుమా రామునితో

ఇది సులభమైనదే. మన్మథుడు రామునితో మారాం చేస్తున్నాడట. దీనికి పూరణ:

శారదమయ ఘనచంద్రిక
తారావళి తోడ గూడి తాపము బెంచన్,
భారమె, సీతా విరహము!
మారా! మారాము మాను మా రామునితో!

సీత అశోకవనంలో ఉన్నప్పుడు రాముడు విరహంతో బాధపడుతున్న విషయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు బులుసు మల్లిక్. ఐతే వసంతంలో సీతారాములు వేఱ్వేఱు చోట్లలో ఉన్నారు అని ఆధారమేమిటి? కిష్కింధ కాండలో దీనికి ఆధారాలు ఉన్నాయి.

దత్తపది: బీర, వంగ, కంద, కాకర - ఉగాది పచ్చడి

ఇది పరిపరి విధాలుగా ఆలోచించాను. పెద్ద పెద్ద పద్యాలు వ్రాసి కిట్టించవచ్చునేమో కానీ, నాకు చిన్న పద్యం వ్రాస్తేనే శ్రోతలకు కాస్త ఆసక్తి ఉంటుంది అనిపించి చివరకు నన్ను ఆదరించిన కందాన్ని ఆశ్రయించాను.

మనసు కందనీక మనియేమి ఫలితంబు
బీరముండ కుండ పేలవంగ
మలగమంది చూడు మనుగాది పచ్చడి
రాతి రీతి కాక రసమయంగ

ఎప్పుడూ సుఖాన్ని (తీపిని) మాత్రమే కోఱుకుంటూ వెళ్ళకుండా కాస్త నాలుగు రుచులూ చూడమని ఉగాది పచ్చడి సందేశం అని భావం. ఉదాహరణకు చిన్నతనంలో చెయ్యాలనుకుని చెయ్యలేని పని ఇప్పుడూ చెయ్యడం పులుపు. వ్యాయామం చెయ్యడం చేదు. ఇలాగ ఆరు రుచులూ కలిస్తేనే జీవితం రసమయం అవుతుంది. లేకపోతే రాయి లాగ బ్రతుకుతున్నట్టే.


దత్తపది: మలైక, సన్నీ, కరీన, ప్రియాంక - మన్మథవత్సరానికి స్వాగతం

ఇది కొంచం కష్టమైనదే. అన్నీ అందమైన అమ్మాయిల పేర్లతో మన్మథ నామ సంవత్సరానికి స్వాగతం పలకాలి. కానీ ఎక్కడా అసభ్యత కనిపించకూడదు. ఇది పూరించడంలో బులుసు మల్లిక్ గారు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

వచ్చెను మన్మథుండు నవవత్సరమై - విమలైకదృశ్యమై
విచ్చెను పద్మినుల్ గుబురు వెన్నెల వోలిన సన్నివేశమై
నచ్చిన శాంకరీ నగవు నాచిన మోహన పుష్పధన్వి తా
తెచ్చెను రాగదీపికల తేనియలొల్కెడి విష్ణుసూనుడున్

ఇందులో భావం: "మన్మథుడు ఒక సంవత్సరంగా వచ్చాడు. దానితో ఎంతో అందమైన దృశ్యం ఏర్పడింది. తామరపువ్వులు గుబురుగా ఏర్పడి వెన్నెల విరిసినట్టు ఉన్నాయి. ఆ పరమేశ్వరి తేనెలొలికే నవ్వును దోచుకుని మన్మథుడు సౌందర్యదీపికలను తీసుకుని వచ్చాడు." అని. అమ్మవారి నవ్వు మన్మథుడు దోచుకోవడం ఏమిటి అంటే సౌందర్యలహరిలో దీనికి సంకేతంగా ఒక శ్లోకం (86 వ ది) ఉంది.

దత్తపది: రంభ, మేనక, ఘృతాచి, మనోరమ - సీతారామ కల్యాణం

అప్సరసల పేర్లతో సీతారామ కల్యాణం వర్ణించమన్నారు. వీళ్ళందరూ వచ్చి సీతమ్మ అందాన్ని చూచి చిన్నబోయారనో, దంపతులను చూచి సంతోషించారనో పూరించవచ్చును. అప్పుడు పృచ్ఛకుని శ్రమను అవమానించినట్టు అవుతుంది. అందుకని మంచి స్ఫూర్తితో పూరించడం జరిగింది. ఘృతాచి ఒక అప్సరస. అదే పదానికి "ఆజ్యాన్ని (నెయ్యిని) హోమాగ్నిలో పోసే గరిటె" అని కూడా అర్థం ఉంది. అది ఆధారంగా దొరికింది. అందుకని ఇలాగ పూరించాను.

అనలం రేగె ఘృతాచి నుండి పడగా ఆజ్యంబు, ఆ రీతినే
ఇనవంశీయుని సొంపు మేనఁ కళలున్, హెచ్చయ్యె సీతమ్మఁవా 
కొనచూపుల్ పడగా మనోరమముగా, కోలాహలంబంతటా
కనువారందరి సంబరం భళి భళీ గానాలుఁ, కేరింతలై

(శ్రీ సీతారాముల కల్యాణంలో జరుగుతున్న హోమంలో) ఘృతాచి నుండి పడిన నెయ్యి తగిలి అగ్ని రేగింది. అలాగనే సీతమ్మ కొనచూపులు పడి శ్రీరాముడి ఒంటి వెలుగు కూడా హెచ్చైందిట. ఇది చూసినవారందరి కబుర్లు, కేరింతలూ చేరి అంతటా కోలాహలంగా ఉందిట.

భైరవభట్ల కామేశ్వర రావు, బులుసు మల్లిక్, లంకా సూర్య రవీంద్ర గార్లకు కృతజ్ఞలు.

Sunday, February 24, 2013

కొన్ని పద్యాలు



మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.

సందర్భం
ఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో?

ఉత్పలమాల
చల్లని గాలి సోకినను జల్లులు తాకిననొక్క పూటలో
వెల్లువఁవోలె తుమ్ములిక వెల్వడు కాలము లెక్క లేనివై
చెల్లెను నీకె శంకరుడ జిల్లను గంగను నెత్తినుంచి నా
ఇల్లన మంచుకొండలను, యించుక గుడ్డయు లేక సుష్టుగా!

సందర్భం
కొత్త పద్యరీతులను నేర్చుకోవాలని మొదలుపెట్టి ఒక తోటకం వ్రాసాను. ఇందులో శివుడి శౌర్యం గురించి చెప్పాలి అని ప్రయత్నించాను. త్రిపురుని సంహారం, గంగావతరణం, దక్షయజ్ఞవిధ్వంసం, మన్మథ దహనం, పరశురామాది శిష్యుల విజయం, శివుడి ఆయుధాలు -- వీటిని ప్రస్తావించా(లనుకున్నా)ను.

తోటకం
త్రిపురాంతక! దేవఝరీ మదహా!
రిపుయాగవినాశక! శ్రీజహరా!
అపరాజితశిష్యగణార్చిత! పా
శుపతాస్త్రి! పినాకి! త్రిశూలి! నతుల్

సందర్భం
ఎప్పుడు చూసినా పనికిమాలిన విషయాల గోల తప్ప కాస్త సాధన చేద్దామంటే మనసు ఒప్పుకోదు. మధ్యమధ్యలో ఉపవాసం చేస్తేనైనా మనసుకు ఓపిక తగ్గి ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది అనే ఆశతో వ్రాసాను.

ఉత్పలమాల
చిత్తములోన యోచనలు చేరును కోట్లుగనెల్లవేళలన్
ఎత్తఱినే వికారములనెందుకు పొందెదనో ఎరుంగనే
విత్తము విద్య బంధువులు విందులు వింతలు స్త్రీలు సంగతుల్
మొత్తము జేరి ముంచఁ మది మోహములోఁ బడి చిక్కెనీశ్వరా!

చంపకమాల
వదలవు ఱెప్పపాటు గడువైన హృదంబును నీచసంగతుల్
కుదురుగనుంచలేను నిను గుండెల నిండుగఁ గాని శంకరా!
ఉదరమునుంచితిన్ శుచిగ నొక్కదినంబున క్రొవ్వు తగ్గె, నా
ఎదురుగ నీదు మూర్తి గననీక్షణమీక్షణముల్ తరించెరా!

సందర్భం
పరమేశ్వరుడి ఉపాధి మాయ, జీవుడి ఉపాధులు సామాన్యమైన ఇంద్రియాలు, మనసు, అహంకారం వంటివి. మనం శివుడితో పోరగలమా? అందుకే ఒక చిన్న చమత్కారం చేసాను. శివుడు నాకున్న అవిద్యని (అజ్ఞానం అన్నాను) ఏమీ చెయ్యలేడు అని అన్నాను. ఎందుకంటే ఆ అవిద్య నశిస్తే ద్వైతం కరిగిపోయి అద్వైతం మిగులుతుంది. అప్పుడు శివుడు, నేను అని నామరూపభేదాలు ఉండవు. ఉన్నది ఒక్క బ్రహ్మమే.

మేఘవిస్ఫూర్జితము
మదీయాజ్ఞానంబుంబెరుకఁదరమే మారసంహార నీకు
న్న, దివ్యాస్త్రవ్రాతంబునకు? పురహంత తుషారాద్రి వాస్త
వ్య, దుర్భేద్యోపాధుల్ తమరొకరికే వచ్చెనో? పోఱబోకో
యి, దానిన్ మర్దింపన్ మనుగడిట నీకేది? మృత్యుంజయుడా!

సందర్భం
తరళపద్యం వ్రాయాలని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అస్సలు అంతు చిక్కలేదు. ఎంత ప్రయత్నించినా గొంతులో కవిత్వం రాకపోతే నా కవిత్వం శివుడి గొంతులో విషం కంటే కఠినమైనది అని చమత్కరించాను.

తరళం
సరళరీతులవన్ని యుండగఁ జాలవంటిని శంకరా!
తరళపద్యము వ్రాయఁబూనితి, తప్పుఁజేసితినందువా?
గరళకంఠుడవందురందరు, కాని నాదు ప్రయోగమున్
సరిగ వీనుల విన్నవారలు సమ్మతించరు గాంచరా!

ఈ పద్యాలకు సద్విమర్శను ప్రసాదించి, సరిచేసిన పెద్దలు భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సోదరుడు రాఘవ కి నా నెనర్లు.


Monday, April 23, 2012

కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?

చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఎప్పుడైన ఆయన దౌహిత్రులు (కూతిరి కొడుకులు) ఇంటికి వచ్చినప్పుడు "కాస్త అలా నడుద్దాము పద", అని వీధిలోనే కొంతసేపు నడిచేవారు. ఈ సారి కిట్టు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది.

"ఒరేయ్ నాన్న, ఒక సారి రావు గారి ఇంటికి వెళ్ళివద్దాము పద. ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు.", అన్నారు కృష్ణయ్య. రావు గారంటే అదే వీధిలో ఉండే మఱొక వ్యాపరస్థుడు. చాలా ఆస్తి, మందిబలం ఉన్న వ్యక్తి. ఇంట్లో ఆడవాళ్ళతో చెప్పి కిట్టు, కృష్ణయ్య కలిసి రావు గారి ఇంటికి వెళ్ళారు. రావు గారు ఒక పడకకుర్చీలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనన్నట్టు చూస్తున్నారు. కృష్ణయ్య గారిని చూసి "రండి, కూర్చోండి", అంటూ ఇంట్లో ఆడవాళ్ళకు వినబడేలాగా, "కృష్ణయ్య గారు, ఆయని మనవడు వచ్చారు. coffeeలు పట్టుకురండి", అన్నారు.

ఇంతలో రావు గారు, కృష్ణయ్య గారు కూర్చుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వారి పిల్లలు ఎలాగ నడుపుతున్నారో చర్చించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కిట్టుకు ఇదేమీ అర్థం కాక చుట్టూ ఉన్న చిత్రపటాలను చూస్తున్నాడు. ఇంతలో coffeeలు వచ్చాయి. ముగ్గురూ తాగడం మొదలెట్టారు. మెల్లగా, అటు తిరిగి ఇటు తిరిగి, మాట ఆస్తుల పంపకాల గురించి వచ్చింది.

రా: ఏఁవయ్య కృష్ణయ్య, నీ వీలునామా వ్రాసావా?
కృ: ఎప్పుడో! ఆ మధ్యన 90లలో అనారోగ్యం చేసినప్పుడే వ్రాసాను. ఆడపిల్లలని, అబ్బాయిని పిలిచి విషయం చెప్పి సంతకాలు పెట్టించాను.
రా: కొడుక్కి కొంచెం ఎక్కువ ఇచ్చావా? అందరికీ సమానంగా పంచావా?
కృ: కూతుళ్ళకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసాను కదా. కొడుక్కే దాదాపు అంతా వ్రాసాను.
రా: అలాగెలాగ కుదురుతుంది? నీకు మీ నాన్న దగ్గరనుండి ఆస్తి సంక్రమించింది కదా?
కృ: నా మొహం లే. సుబ్బన్న (తన తండ్రి) గారు నన్ను చాలా ప్రేమగా పెంచారు కానీ నాకు ఇవ్వడానికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలలేదు. అరయెకరం ఇచ్చారేమో. మాకున్న అప్పులకు కూడా అది సరిపోలేదు. అప్పులోళ్ళకి ఆ ఉన్న పొలాన్ని హామీ ఇచ్చి, ఈ వూరొచ్చి వ్యాపారం చేసి చేతులూ కాళ్ళూ కాల్చుకుని ఐదారేళ్ళ తఱువాత తీర్చాను.
రా: ఏమైతేనేఁ నీకు ఆయన దగ్గరనుండి సంక్రమించిన ఆస్తి నువ్వు పెట్టిన వ్యాపారానికి ఉపయోగపడింది కదా? నువ్వు అది అనుభవించావు కదా?
కృ: అర ఎకరానికి కూడా "అనుభవించడం" లాంటి మాటలెందుకులే.
రా: ఏమైనా స్వామీ, నీ కూతుళ్ళు న్యాయస్థానంలో దావా వేస్తే నువ్వు నీ ఆస్తిని సమానంగా పంచి తీరాల్సింది.

కృష్ణయ్య గారు కాఫీ త్రాగుతున్నారు కానీ ఆయన కళ్ళు ఎఱ్ఱగా మారుతున్నాయి. ఆయన కొంతసేపు మౌనం వహించారు. కిట్టు ఇది గమనించాడు. రావు గారి ఇంటికి కృష్ణయ్య గారి ఇంటికి మధ్యన నాలుగు ఇళ్ళు దూరం. ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటే కిట్టు వెళ్ళాక చెప్పచ్చును. ఆయన ఉద్దేశం హెచ్చరించడం అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఆయన ఉద్దేశాన్ని ఊహిస్తే, అంత మంచి అభిప్రాయం కలగదు. కృష్ణయ్య కాస్త ఓరిమి తెచ్చుకుని మాట్లాడారు.

కృ: పోనీలే, నా కూతుళ్ళు అలాగ అడిగేవాళ్ళు కాదు.
రా: బాగుంది, నీ మీద ప్రేమతో ఇప్పుడేమనట్లేదు. వాళ్ళకూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చేయాలి కదా. మరి కట్నాలు కానుకల దగ్గర నువ్వు సాయం చెయ్యకపోతే ఊరుకుంటారా?
కృ: నేను చేసేది చేస్తూనే ఉన్నానయ్యా. ఎప్పుడూ నా కూతుళ్ళకు నేను లోటు చెయ్యలేదు.
రా: మరి అలాంటప్పుడు ఆస్తి కూడా చెరిసమానంగా పంచాలి కదా?

కృష్ణయ్య మహాకోపీష్టి. కాకపోతే అనారోగ్యంతో ఉన్న పెద్దమనిషిని పలకరిద్దామని వచ్చి తిరిగి జవాబు చెప్పడం దేనికని ఊరుకున్నారు. కిట్టు అది గమనించాడు. తను మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని అందుకున్నాడు.

కి: తాతగారు, మీరు అన్నది సబబేనండి. కూతుళ్ళకు కూడా సమానమైన వాటా ఇవ్వాలి.

తాత్కాలికంగా రావుగారి కళ్ళు వెలిగిపోయాయి. ఆయన సాయంత్రం సఫలమైంది అని భావమో ఏమో. కృష్ణయ్యకి కొంచెం బెంగ పట్టుకుంది.

కి: కానీ, దాదాపు ముప్పై ఏళ్ళనుండి మా అమ్మ కానీ, పిన్నులు కానీ, వాళ్ళ సంతతి కానీ మా తాతగారి పక్కన లేము. మేము వేఱే ఊరిలో ఉన్నాము. ఆయనకు జ్వరం వస్తే ఒక మాత్రా ఇవ్వలేదు, రొంత చారు కాచలేదు. మా మటుకు మేము ఎండాకాలం సెలవులలో రావడం, సరదాగా గడిపి వెళ్ళిపోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆయన ఇంట్లో ఒక బీరువా సర్దలేదు, ఒక చింతా పంచుకోలేదు, ఆయన వ్యాపారానికి ఏమీ సాయమూ చెయ్యలేదు. మరి మా మేనమావ, బావలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. మా తాతగారు ఒక కేక వేస్తే పలికే వాడికే కదా ఆస్తి చెందాల్సింది?

కృష్ణయ్య గారి కళ్ళల్లో కాస్త తెరిపి కనబడింది. రావు గారు వాదించడానికి మళ్ళీ మొదలయ్యారు. ఇంతలోనే కిట్టు...

కి: పోనీ ఆ అరయెకరం గురించే మాట్లాడుకుందాం. నేను LKG, UKG ఇక్కడే చదువుకున్నాను. అల్లుడి దగ్గర రూపాయి తీసుకోను అని మా తాతగారు నా fees ఆయనే కట్టారు. ఆ తఱువాత engineering చదివేటప్పుడు కొంచం డబ్బులు అవసరమైతే సర్దారు. మా తాతగారు ఆయన తండ్రి అరయెకరం మీదనే ఈ ఆస్తి అంతా సంపాదించారు కాబట్టి అందులో భాగం ఆయన పిల్లలకు చెందాలంటే, నేను ఆ LKG, UKG, engineering వలనే ఈ రోజు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నా ఆస్తిలో మా తాతగారికో, మా మేనమాఁవకో వాటా ఇస్తున్నానా? లేదు కదా? అరయెకరం ఆస్తి చేతిలో ఉండి, ఎకరం పాటి అప్పుండి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కష్టపడి, వ్యాపారం పెట్టుకుని, సుఖపడి నలుగిరికి అన్నం పెట్టే పరిస్థితులో ఉన్నారో చెప్పండి. దానికి ఆ అరయెకరమే కారణమనుకోవాలా? లేక ఆ వ్యక్తి వ్యాపారదక్షతే కారణం అనుకోవాలా?

కి: మఱోలా అనుకోకండి కానీ, మా తాతగారి ఆయన కూతుళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అభిమానంగా పలకరించి, నాలుగు అనుభవపూర్వకమైన మాటలు చెప్తే అదే పదివేలు.

రావు గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కృష్ణయ్య అంతటితో ఆపి, "నాన్న కిట్టు, పదరా బయల్దేరదాము. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.", అని చెప్పి చేతి కఱ్ఱ పట్టుకున్నారు. కిట్టు వెళ్ళి ఆయన చెప్పులు కాళ్ళ దగ్గర సర్దాడు. ఆయన, కిట్టు, రావు గారికి నమస్కారం చెప్పి నడవసాగారు.

కొంచెం దూరం వచ్చాక, కృష్ణయ్య కిట్టు భుజాల మీద చెయ్యివేసి కొంచెం దగ్గరకు లాగి, "ఒరేయ్ నాన్న, ఈ రోజు నాకు మహదానందం కలిగించే మాట అన్నావురా. ఆయన ఎంత పుల్లలు పెట్టాలని చూసిన, నువ్వే అడ్డుకునేసరికి ఆయనకు బుఱ్ఱ తిరిగిపోయింది. అందుకేరా అన్నది:

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో 
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
 కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
 శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

అని...తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టే పిల్లల బుద్ధులుంటాయిరా. మీ అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకడి రూపాయి కోసం ఆశించలేదు. నేను పుచ్చుకోలేదు కానీ మీ నాన్న నీ చదువుకైన డబ్బులిచ్చేస్తాననే వచ్చాడు. మరి అదే లక్షణాలు మీకూ వచ్చాయి. చెట్టుని బట్టే కాయలు ఉంటాయిరా. కిత్తనార మొక్కకి అనాసకాయలు కాస్తాయా?"
 
వృద్ధాప్యంలో అన్ని విషయాలపైనా విరక్తి కలిగి అరుదుగా సంతోషం కనబడే వాళ్ళ తాతయ్య మొహంలోని తృప్తి కిట్టు మనసులో ప్రతిబింబించింది.

Monday, January 2, 2012

అందమైన అమ్మాయి (పద్యాలు)

రాత్రి రెండు దాటాక నేను మాట్లాడేదానికే అర్థం ఉండదు (అప్పుడప్పుడు పగలు కూడా). అలాంటిది జాలపౌరులు అందరూ చూడగలిగే బ్లాగు వ్రాస్తున్నాను. ఏమైనా అర్థరహితంగా (అదే, పిచ్చి పిచ్చిగా) అనిపిస్తే క్షమించాలి.

అసలు విషయానికి వస్తే: మొన్న ఒక పూటకూళ్ళయింటికి (restaurant) వెళ్ళాను. అక్కడ తిండిని అందించే ఒక అమ్మాయి వర్ణించలేనంత అందంగా క/అనిపించింది. సరే, ఈ మధ్య మనం కాస్త సృజనాత్మకంగా వ్రాసినది ఏమీ లేదు కదా! "బొత్తిగా తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటదీ?" అనుకుని, డిక్కీలో తొంగున్న నా కవిహృదయాన్ని కాస్త బయటకు తీసి, దుమ్ము దులిపి, బ్రౌహ్ణ్య నిఘంటువుని ఊతగా ఇచ్చి పద్యాలు వ్రాయమన్నాను.  ఇవిగో, ఈ క్రిందివి రాలాయి. చదువర్లకు నా తవికలు నచ్చినా నచ్చకపోయినా, నా ప్రయోగాలకు వారి మనసులు నొచ్చుకోకుండా ఉంటే అదే పదివేలు.

గమనికలు:-

పై వాక్యంలో నచ్చు, నొచ్చు -- ఇది అనుకుని వేసిన ప్రాస కాదు. ఎంత డిక్కీలో ఉన్నా నా కవిహృదయానికి ఇంత డొక్కు భావనలు లేవు అని నా నమ్మకం. డిక్కీ, డొక్కు...హ్మ్...రాత్రి రెండు దాటింది! కంగారు పడకండి, ఈ పద్యాలు రోజూ పడుకునే ముందు ఒక్కొక్కటి చప్పున వ్రాసుకుంటూ వచ్చాను. రెండు దాటాక వ్రాసిన పద్యం సివరాకరి కంద పద్యం ఒకటే.

ఔత్సాహిక కవిని కాబట్టి నా పద్యాలలో ఉత్సాహం కనిపించినట్టు భావం కనిపించకపోవచ్చును. పెద్దలు పద్యాలను సవరించడానికి, ఔత్సాహికపాఠకులకు నా బాధేంటో చెప్పడానికి పద్యాల క్రింద (నేను అనుకున్న) భావాన్ని వ్రాస్తున్నాను.

శా:-
దేవీ యెవ్వరివీవు? యీ పురమునన్ దేవాంగనల్ జొచ్చిరే?
ఏ వైజ్ఞానికుడైన శిల్పములలోనెక్కించెనా ప్రాణముల్?
భావావేశము గల్గి బ్రహ్మ రుచితో భావించి నిర్మించెనా?
నీ విభ్రాజితమూర్తి కీర్తి నుడువన్ నేనెంత వాడన్, కొమా!

భా:- ఓ దేవి, నువ్వు ఎవరివి? ఈ మధ్యన మా ఊళ్ళోకి దేవతలు ప్రవేశించారా? ఎవరైనా శాస్త్రజ్ఞుడు శిల్పాలకు ప్రాణం పోయడం నేర్చుకున్నాడా? భావావేశం కలిగి బ్రహ్మ ప్రత్యేకమైన శ్రద్ధతో నిన్ను మలిచాడా? నీ వెలుగులీనే రూపాన్ని కీర్తించడానికి నేను సరిపోను.

చం:-
సుమములఁ బోలు నీ యధరశోభకు లొంగని వారునుందురే?
తమిగొను వారికిన్ మిగులు దాహము తీరగ దారి యున్నదే?
ప్రమదము కల్గి భంగపడు ప్రాణులలో మగవారి తోటివై
భ్రమపడి యెన్ని తుమ్మెదలు భ్రామరమొందగ వాలె నీ యెడన్

భా:- పువ్వులలా మెరిసే నీ పెదవుల శొభకు లొంగనివాళ్ళుంటారా? నీ మోహంలో పడినవారికి కలిగే పిపాస తీరే మార్గం ఉన్నదా? నీ మాయలో పడి (అనుకున్నది దక్కక) చిన్నబోయిన ప్రాణులలో మగవాళ్ళతో పాటు (నీ పెదవులను పూవులనుకుని మోసపోయిన) తేనెటీగలెన్నున్నాయి?

మ:-
ఎవరా ఈశ్వరుడంచు ప్రేలు మొరకుల్ హెచ్చైన నీ పొంకమున్
అవలోకించిన తత్క్షణంబు మదిలోనజ్ఞానమున్ వీడరే?
స్తవముంజేయరె హేతువాదిగణముల్ సర్వేశుఁ గుర్తించి, సం
భవమే కూర్చగ నిన్ను ఈ ప్రకృతికిన్ పైవాడు లేకుండగన్?

భా:- "ఈశ్వరుడు ఎవరు?" అని పొగరుగా అడిగే మూర్ఖులు ఇంత గొప్ప అందాన్ని చూసి వెంటనే తమకున్న అజ్ఞానాన్ని వదిలేసి, దేవుడున్నాడు అని గుర్తించి ఆయనను స్తుతించడం మొదలెడతారు. పైవాడు లేకపోతే, ఇంత అందమైన నిన్ను తయారుచేయడం (ఆలోచనలు లేని) ఈ ప్రకృతికి వీలౌతుందా?

గ:- చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో గుఱ్ఱం జాషువా వ్రాసిన "గిజిగాడు" పద్యాలు చదివిన స్ఫూర్తి ఇంకా ఉందేమో! అందులో ఒక పద్యంలోని "నాస్తికులు నిన్ను చూసి మనసు మార్చుకుంటారు" అనే భావనని పైన జాతీయం చేసాను.

నిజానికి ఆమెను చూసిన వెంటనే, నా పక్కనే ఉన్న నా నాస్తిక మిత్రుడి వైపు తిరిగి, "ఎవఱ్ఱా దేవుడు లేదన్నది? ఆ అమ్మాయిని చూడు. ఇంత అందగత్తె కేవలం by chance తయారైందా? ఎవరో చెక్కినట్టు లేదు?" అన్నాను :)

ఉ:-
మోహిని చెన్నుకున్ మురిసి మూర్ఛిలినారని దానవాళికిన్
సాహసమున్న రీతి తగు సంయమమేదని యన్నవాడనే!
వ్యాహతునైతి నీ యెదుట, వైఖరి మార్చిన నాదు గుండెపై
ద్రోహము జేసెనంచు మతి దోషము లెంచక నూరకుండె, హా!

భా:- మోహిని అందానికి మురిసిపోయి, మూర్ఛపోయిన రాక్షసులకు సాహసం ఉన్నంతగా సంయమం (మనసును అదుపులో ఉంచుకోవడం) లేదు అన్నవాణ్ణి, నీ అందం ముందు ఓడిపోయి నిలిచాను. నా బుద్ధి మనసు తనకు ద్రోహం చేసిందని చిఱాకు పడకుండా ఉండిపోయింది (మనసు, బుద్ధి ఆమె అందానికి దాసోహం అన్నాయి).

త:-
ఒడలు స్పందన లేకనున్నది ఉన్నపాటుగ మైకమా?
ఘడియ మారక గిపోయెను కాలమాగెన? నా భ్రమా?
ఉడుకు నెత్తురు మంచు ముద్దయెనూడి మేఘము రాలెనా?
నొడవనీయక డ్డుతున్నది నువ్వు వేసిన మంత్రమా?

భా:- ఒళ్ళు తెలియట్లేదు, ఉన్నట్టుండి నాకు మైకం కలిగిందా? గడియలు మారుతున్నట్టు అనిపించట్లేదు - కాలమాగిపోయిందా? లేక ఉత్త భ్రమా? ఎప్పుడూ దూకుడు గా ఉండే నా నెత్తురు చల్లబడిపోయింది. ఆకశంలోంచి మబ్బేమైనా ఊడు నా మీద పడిందా? నేను మాట్లాడ లేకపోతున్నాను -- నువ్వు ఏమైనా మంత్రం వేసావా?

సీ:-
దీపపు కాంతికి తెలినవ్వు మెరిసెనో? 
                          నవ్వుకు వెలిగెనో దివ్వెలెల్ల?
చెక్కిలి వెలుగుకు దిక్కులు రంజిలె
                          ఎవ్విధి పొందితివింత సొగసు?
కనురెప్పలున్నట్టి గండెలు లేవని
                          వింటిని యిన్నేళ్ళు వేయినోళ్ళ!
నీ నీలికన్నుల మీనాలఁ గాచేటి
                          కందెర్లఁ గమనించి కంటి నిజము

భా:- ఈ దీపాల వెలుగుకు నీ నవ్వు మెరుస్తోందో, నీ నవ్వుకే ఈ దీపాలు మెరుస్తున్నాయో తెలియట్లేదు. నీ బుగ్గల ఎఱుపుకు దిక్కులన్నీ వెలుగుతున్నాయి. ఇంత అందం నీకు ఎక్కడిది?

కనురెప్పలున్న చేపలు లేవు అని ఇన్నాళ్ళు అందరూ అంటుండగా విన్నాను. కానీ నీ నల్లని కళ్ళనే చేపలను కాస్తున్న, కను-తెరలు (కనురెప్పలు) గమనించాక నిజం తెలిసింది.

గ:- గండెలు, కందెర్లు -- జై బ్రౌన్ దొర!

ఆ:-
నీవు రెప్ప మోడ్చు నింపాది తాళంబు
నేర్చి నాదు గుండె మార్చె లయను
నడుచు వేళ నీదు నడుమును చూడగ
నటుయిటు కదలాడి యలిసె కనులు

భా:- నీవు నెమ్మదిగా రెప్పలు వేసే "నింపాది తాళం" (ఆది తాళం మీద pun :) ) నచ్చి నా గుండె దానితో పాటుగా కొట్టుకుంటోంది. నువ్వు నడుస్తుంటే కదులుతున్న నడుమును చూడటానికి అటూ ఇటూ ఊగి కళ్ళు అలిసిపోయాయి.

కం:-
కలరే నీయందమునకు
తులతూగే పురుషులిలను? దొరకరె లలనా!
అల వైకుంఠపురములో
కొలువైన హరి సరిజోడు కోమలి నీకున్!

భా:- నీ అందానికి సరితూగే మగవాడు ఈ ప్రపంచంలో దొరకరే అమ్మాయి! వైకుంఠంలో కొలువైన శ్రీహరే నీకు సరిజోడీ.

గ:- పోతన భాగవతం స్ఫూర్తి సుస్పష్టంగా కనబడుతోంది. ప్రత్యేకించి చెప్పక్కరలేదు అనుకుంటాను :)

అమ్మాయి అందాన్ని మెచ్చుకుంటున్నాను కానీ  పిచ్చి పిచ్చి మాటలు, థాటులు (thoughts) లేవనే విషయాన్ని తేటపరచడానికే ముగింపు పద్యంలో "శ్రీమద్రమారమణ గోవిందో హరి!".

Thursday, March 3, 2011

శివరాత్రి సందర్భంగా పద్యాలు

శివరాత్రి గురించి బహుశః పాఠకులందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను పనికట్టుకుని కొత్తగా చెప్పేది ఏముంది?  శివతత్త్వం ఒక్క మాటలో చెప్పాలంటే "ప్రాణులన్నింటినీ ప్రేమించడం. అహాన్ని జయించడం." -- అంతే.  భగవంతుని కృప చేత మనందరిలోనూ దాగున్న అరిషడ్వర్గాలు నశించాలని ఆశిస్తున్నాను. ఇదే విషయాన్ని పద్యాల రూపంలో ఉంచాను. తప్పులేమైనా కనబడితే సవరించగలరని ప్రార్థన.

ఉ:-
ధ్యానములోనిమగ్నమయి ధారుణిలో మను పాపకర్ములన్
కానకనుంటివో? తగదు! కాదిది ధర్మము నీలకంధరా!
ఆనక నేత్రముల్ దెరువ అంధము రాజ్యము జేయుఁభూమిపై
మానవజాతి దానవుల మారణహోమపు యజ్ఞధేనువై

భా:-
శివా! ధ్యానంలో ఉండిపోయి భూమిపైనున్న పాపులను చూడటం మానేశావా? ఇది నీకు ధర్మం కాదు. నువ్వు కొంచెం ఆలస్యం చేసి కళ్ళు తెరచినా ఇక్కడ మిగిలేది - మానవరూపరాక్షసుల మారణహోమానికి దేవతైన అంధకారం మాత్రమే.

మ:-
తలపై శీతలగంగ భూతలముపై తానెట్టి దౌర్భాగ్యమున్
గలదై నిత్యము శోకసాగరములో గాసిల్లి వేసారెనో
తెలుపన్ చూడదె? ఆమె బాధ గనవా? తీర్చంగ సర్వేశ్వరా!
తలమే ఆమెను ఏపరించు తెగులై తారాడు కాలుష్యమున్

భా:-
నీ తలపైన ఉన్న గంగ తను భూమిపై ఎంత దౌర్భాగ్యానికి లోనౌతోందో, శోకసాగరంలో తపిస్తోందో (అన్ని నదులు సాగరంలో కలిస్తే గంగ శోకసాగరంలో కలుస్తోంది) చెప్పలేదా? భార్య బాధను చూసి ఆమెను వేధిస్తున్న కాలుష్యం అనే రోగాన్ని నువ్వు నయం చెయ్యలేవా?

శా:-
కైలాసంబున కాపురంబదెటులో కాశ్మీరు యుద్ధాలతో?
కాలాకారుడవంచు వేదములలో కైవారముంజేసిరే?
కాలే జీవుల సాక్షిగానెఱుగుమా కాదంచునీ సత్యమున్
కాలేవయ్య నవీనమానవతకున్ కాసింత పోటీ హరా!

భా:-
కాశ్మీర్లో నిత్యం యుద్ధాలు జరుగుతుంటే కైలాసంలో నువ్వు కాపురమెలాగ ఉంటున్నావయ్యా? ఐనా వేదాలలో నిన్ను కాలరూపుడు (మృత్యురూపుడు) అన్నారు కానీ మా మానవజాతి సృష్టిస్తున్న విధ్వంసం సాక్షిగా తెలుసుకోవయ్యా - నువ్వు మాకు ఏ మాత్రం పోటే రాలేవు.

కం:-
అవలక్షణదాసులగుచు
అవధులునెఱుగక యెగబడి యావజ్జనులున్
అవనిని నాశము జేసిరి
శివునాజ్ఞకు భయము లేదు చీమలకైనన్

భా:-
మనుషులు ధర్మాన్ని విడచి ఎవరికి నచ్చినట్టు వారి ఈ భూమిని నాశనం చేస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేక చీమైనా కదలదంటారు కానీ, నిజానికి ఈ ప్రపంచంలో చీమకు కూడా నీ ఆజ్ఞపైన గౌరవం లేదు.

సీ:-
సాగరాల తుదల సంగతులేలయ్య? నగరంబు నరకమై నలిగె గోవు
పచ్చగడ్డిని మేసి పాలిచ్చు గోమాతరొమ్ము చీల్చి రుధిరమమ్ముకొనుచు
వాలము చేబట్టి వైతరణినిఁద్రోయ, తనయాడపడుచుల తాపమెఱిగి
ధరణిపై జరిగేటి దారుణాలను నీకు వర్ణించి చెప్పడే వృషభరాజు?

భా:-
"చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు" అంటారు కదా? ఆ సాగరాల చివరిదాక ఎందుకు పట్టణాలే గోవులకు నరకమైపోతున్నాయి. ఎవ్వరూ ఆశించని గడ్డిని తీసుకొని కమ్మని పాలనిచ్చే ఆ గోమాతని హింసించి ఆమె రొమ్ము చీల్చుకుని మరీ రక్తంతో కూడిన పాలను అమ్ముకునేటువంటి మనుషులు తయారయ్యారు. ఆవు తోక పట్టుకుని వైతరణి దాటడం కాదు, బ్రతికున్న ఆవునే తోకతో లాగి వైతరణిలోకి తోసేస్తున్న దుఃస్థితి ఇది. తన ఆడపడుచుల కష్టం చూసి నందీశ్వరుడైనా నీకు మానవుల దౌష్ట్యాన్ని గురించి చెప్పలేదా?

ఆ:-
భూమి చాలదంచు వ్యోమయానముఁ జేసి
చందమామ తలమునందుకొనిరి
తనకు భూమి స్థితియె తప్పదేమోనంచు
విధువు చేయలేద విన్నపములు?

భా:-
భూమి చాల్లేదని చివరకు చంద్రమండలం మీద కూడా జెండా పాతాము. తనకు కూడా భూమి స్థితే పట్టి కాలుష్యంతో, దుష్టులతో నిండిపోతాడేమోనని భయపడి చంద్రుడు నిన్ను ఏమీ అడగలేదా?

చం:-
గరళము త్రాగి దేవతలఁ గాసితివందురు సత్యమా శివా?
మరణము లెక్కజేయక ప్రమాదముఁదెచ్చెడి రాక్షసాళికిన్
వరములనిచ్చు దానగుణవంతుడవందురు నమ్మవచ్చునా?
కరుణకు రూపమన్న నుడి కల్పన కాదుగ, శైలమందిరా?

భా:-
విషం తాగి దేవతలను కాశావు అంటారు? మరణాన్ని సైతం లెక్కచేయకుండా రాక్షసులకు వరాలిచ్చిన దానవీరుడవంటారు? కరుణకు నీవు నిలువెత్తు రూపం అంటారు. ఇవన్నీ నిజమేనా? లేక మా అపోహలా?

శా:-
బోళాశంకరుడన్న మాట రుజువై, భూమాత హర్షించగన్!
కైలాసంబున ధ్యానయోగతపముల్ కాసేపు చాలించుమా
మా లోకంబున ధర్మరక్షకుడవై మాలిన్యమున్ తెంచుమా
నీలో పేర్మిని మానవాళి మఱగన్ నేర్పించఁ రా దైవమా!

భా:-
ఇవన్నీ నిజమని, నువ్వు బోళామనిషివి అని రుజువయ్యే లాగా -- భూమాత ఆనందించేలాగా కొన్నాళ్ళు కైలాసంలో ధ్యానం మాని మా లోకంలో ధర్మాన్ని రక్షించు. నీలో ఉన్న గొప్ప గుణాలన్నీ మానవజాతికి మప్పు.

Wednesday, December 29, 2010

నిత్యజీవితంలో పద్యాలు - శారదాదేవి

ఉ:-
శ్రీకరపాదపద్మముల చేతులఁ దాకగఁజాల లేక యీ
చీకటి కోటలోనిరికి చిత్తము చంచలమై భ్రమించుచున్
వేకువ కోరి వేడితిని వేదముఁబట్టిన దివ్యహస్త! ఈ
నా కనుదోయిలో నిలిచి నాటకమున్ కడతేర్చుమా భువిన్

చం:-
కరణములన్ని ప్రాణహరకాంతికి మ్రొగ్గెడి మూఢమక్షికల్
తరణము చేతఁగాక భవతామససాగరమందు చిక్కితిన్
శరణను నన్ను గావగ ప్రసన్నతనొందుమ, హంసవాహినీ!
కరుణను చూచుమా జనని! కామితదాయిని! లోకపావనీ!

చాలా రోజులు పద్యాలకు దూరంగా ఉన్నాను అని ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకుని రెండు పద్యాలు వ్రాశాను. తప్పులుంటే సవరించగలరు.

Saturday, February 13, 2010

శివరాత్రి సందర్భంగా!

ఓం నమ:శివాయ!

చం:-
శివుడని తల్చినంత మది శీతనగంబుగ మారుచుండగన్
కవనము పొంగుబట్టె సురకర్షువు పారెడి రీతి జిహ్వపై
సవనవిరోధి, తెల్పు! గతజన్మములో తపమేమి చేసితిన్
కవితలఁ గూర్చిజేయ, కరకంఠుడ! నీ యభిషేకమీ గతిన్!

భా:-
"శివ" అని తలుచుకోగానే నా మనసు మంచుకొండగా మారుతోంది. (అక్కడనుండి) కవిత్వం గంగలాగ నాలుకపై పరుగులెడుతోంది. శంకర! ఈ విధంగా నీకు పద్యాలతో అభిషేకం చెయ్యడానికి నేను గతజన్మలో ఏమి పుణ్యం చేసుకున్నానో చెప్పవయ్యా!

ఉ:-
దేహము అగ్నిగుండమని, తీరిన కోర్కెలు ఏధమయ్యి ఆ
దాహము పెంచుచుండునని, దక్కని కోర్కెలు గాలిధోరణిన్
వాహనమల్లె మోసి నలువైపులకంపెడివంచు నేర్చి, వ్యా
మోహము బోవఁగోరి కయిమోడ్చితి గావర, శైలమందిరా!

భా:-
"శరీరం ఒక అగ్నిగుండంలాంటిది, తీరిన కోర్కెలు అందులో వేసే ఇంధనంలాగ అగ్నిని పెంచుతాయి, తీరని కోర్కెలు గాలి లాగా మంటను నలువైపులకూ పంపుతాయి", అన్న నిజం తెలుసుకుని, ఈ మోహమనెడి మంటనుండి విమోచనం కోరి నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను శంకర! నన్ను రక్షించవయ్యా!

గతంలో నేను శివుడిపై సంస్కృతంలో వ్రాసిన పాటను గుర్తుచేసుకున్నాను.

Friday, January 15, 2010

మకరసంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పండుగ వైదీకసంస్కృతిలో సూర్యమానాత్ నూతనసంవత్సరం. అంటే, సూర్యుడు భూమిదృష్ట్యా ఎక్కడ ఉన్నాడు అన్నది పరిగణంలోకి తీసుకుంటే అప్పుడు ప్రతి ఏడూ దాదాపు జనవరి 13/14 తేదీలలో మకరరాశిలోకి (ఉత్తరాషాఢ-2వ పాదం) ప్రవేశిస్తాడు. సూర్యుడు మకరం నుండి మిథునం వరకు సాగించే ప్రయాణాన్ని (అంటే నిజానికి సూర్యుడు కాదు భూమి పయనిస్తుంది, నేను చెప్పేది భూమిదృష్ట్యా అంటే relative motion) ఉత్తరాయణపుణ్యకాలమని అంటారు! మోక్షం వచ్చేవారు ఈ సమయంలోనే దేహయాత్ర చాలిస్తారు అని భగవద్గీత చెప్తోంది.

ఈ పుణ్యకాలాన్ని ఆహ్వానిస్తూ "సర్వే జనాః సుఖినో భవంతు" అనుకుందాము.

శా:-
ఆమూలాగ్రముతుంచరే జగతిలో అఙానమున్ విద్యతో
ప్రేమోల్లాసము నింపరే మనసులో భేదాలు పోగొట్టగన్
వ్యామోహంబు నశింపనందుకొనరే వైదూష్యభక్త్యాదులన్
ఆ మార్తాండుడు వుత్తరాయణముకై ఔత్సుక్యమున్ జూపగా!

ఉ:-
పిల్లలు బుద్ధిమంతులవ పెద్దల మాటలు గౌరవించుచున్
చెల్లని కౌతుకోన్నతియు చేరగ విద్యలెరుంగబూనుచున్
చల్లగనుండ కాపురము జంటలు ప్రేమగ మాటలాడుచున్
ఎల్లరు శాంతినుండ సిరి యింటనె తాండవమాడగోరెదన్