Showing posts with label అన్నమయ్య. Show all posts
Showing posts with label అన్నమయ్య. Show all posts

Wednesday, August 12, 2015

అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.

పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ "తెలుగు పదానికి జన్మదినం" అనే పాట. వేటూరి కవితాస్వేచ్ఛని తరచూ విమర్శించే నా సోదరుడు కూడా ఈ పాటను మెచ్చుకున్నాడు. అంతటి లయ ఉన్న పాట ఇది.

అన్నమయ్య నిజంగా నందకం అవతారమా, లక్కమాంబకు నిజంగా ఆలస్యంగా పిల్లలు పుట్టారా వంటి ప్రశ్నలు యోగులకు, చరిత్రకారులకు పనికొచ్చే ప్రశ్నలు. మనబోటి సామన్యప్రేక్షకులకు తగిన ప్రశ్న "ఈ సందర్భానికి, కథకు కవి న్యాయం చేశాడా?" అని. అది పరిశీలిద్దాము.

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పల్లవిలోనే వేటూరి అన్నమయ్యని బాగా ఉన్నయించాడు (elevate). అన్నమయ్య కాలానికి ముందే నన్నయ, తిక్కన వంటివారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యాన్ని వ్రాసారు. ఐతే అవి సంస్కృతపదభూయిష్టమైన మహాకావ్యాలు - సామాన్యులకు అందుబాటులో లేనివి. అన్నమయ్య అచ్చ తెలుగుమాటలకు పెద్ద పీట వేస్తూ, ఛందస్సు కంటే లయకు ప్రాధాన్యతను ఇస్తూ సామన్యజనులకు అర్థమయ్యేటువంటి పాటలు వ్రాసారు. ఒక సారి అన్నమయ్య పాటలలో పల్లవులని చూస్తే ఈ విషయం తేటబడుతుంది: "చక్కని తల్లికి ఛాంగుభళా", "అదివో అల్లదివో", "అలరులు కురియగ", "చందమామ రావో జాబిల్లి రావో", "ఏమొకో చిగురుటధరమున ఏడనెడ కస్తూరి నిండెను", "నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన ఊరెడి ఉవ్విళ్ళో" మొదలైన పల్లవులలో తెలుగుదనం తాండవిస్తుంది. 

అంతటి సున్నితమైన పల్లవులలోనే ఎంతో గంభీరమైన భక్తి, వైరాగ్య భావాలు దాగున్నాయి. ఉదాహరణకు ఈ చిత్రంలో వినిపించిన "అంతర్యామి అలసితి సొలసితి" అనే పాటలో "భారపు బగ్గాలు పాప పుణ్యములు", "మదిలో చింతలు మైలలు మణుగులు", "జనుల సంగముల జక్క రోగములు" వంటి పంక్తులు సాధకులు తమ మనసుల్లో పచ్చబొట్టు పొడిపించుకోవలసినటువంటివి. అలతి పదాలలో లోతైన జ్ఞానాన్ని వినిపించారు కాబట్టే ఆయన "జానపదానికి జ్ఞానపథాన్ని" చూపించారు. ఏడు కొండల పైన వేంకటేశ్వరుడిలాగ ఏడు స్వరాలను అన్నమయ్య పొదరిల్లుగా చేసుకుని మన మనసుల్లో స్థిరబడ్డారు. ఇంతటి లోతైన భావాన్ని నాలుగే నాలుగు చిన్న పంక్తులలో వేటూరి వెల్లడించారు.

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీశ్శులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుద్ధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లిదనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించి ఆ నందకము నందనానందకారకము

అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

భగవద్గీత, 2వ అధ్యాయంలో కృష్ణపరమాత్ముడు అన్న ఈ మాటలు సాధకులకు మొదటి పాఠం.

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

దీనికి కొంచం వదలుగా తెనుగిస్తే "ఒక వస్తువుని విడిచిపెట్టాలని మనం దాన్ని దూరం చేస్తే, వస్తువు దూరమౌతుంది కానీ కోరిక మిగిలిపోతుంది. అదే ఆ వస్తువు కంటే ఉత్తమమైన వస్తువుని రుచి చూస్తే, అప్పుడు మునుపటి కోరిక కూడా పోతుంది" అని. అరిషడ్వర్గాలకు (కోరిక, కోపం, వలపు, కక్కూర్తి, పొగరు, ఓర్వలేనితనం) మూలం అహం (దేహాత్మబుద్ధి). ఈ చౌకబారు ఆలోచనలను దాటాలంటే ఉన్నతమైన భక్తి, వైరాగ్య భావలను రుచిచూడాలి. అన్నమయ్య పాటలు ఆ భావాలను, వాటిలో ఆనందాన్ని చెప్పేవి. అన్నమయ్యని విష్ణువు ఆయుధమైన నందకానికి అవతారంగా భావిస్తారు. అందుకని కవి అన్నమయ్యని "అరిషడ్వర్గాన్ని తెగనరికే హరి ఖడ్గమ్ము"  అన్నాడు. అరి, హరి ప్రాసతో పాటు తరువాత "షడ్", "ఖడ్" కు కూడా ప్రాస కలిపాడు. లయ చక్కగా కుదిరింది.

విష్ణులోకంలో మొదలైన నందకం తరువాత నెమ్మదిగా మిగతా లోకాలను దర్శించుకుని అక్కడ నాదాన్ని ఆకళించుకుని లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించింది. బ్రహ్మలోకంలో బ్రహ్మ, సరస్వతీ దేవి వీణా నాదం; శివలోకంలో శివుడి ఢమరుక నాదం; ఇంద్రాది సభలలో అప్సరసల గాననృత్యాల లయ; మబ్బులలో విహరించే నారదుడు, ఆయన వీణైన మహతీ, తుంబురుడు - వారి భక్తినాదం అన్నీ చూసి హిమాలయాల మీదుగా వచ్చిందట. ఇక్కడ నాకు రెండు విషయాలు అనిపించాయి. నిజమో కాదో వేటూరికే ఎరుక. 1. అప్పటిదాకా నాదప్రధానమైన విషయాలు మాట్లాడుతూ "దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి" అనడంలో "నందకం శృంగారరసాన్ని కూడా తెలుసుకుంది" అనే ధ్వని వినిపిస్తోంది. ఎంతైనా అన్నమయ్య శృంగార సంకీర్తనలకు పెట్టింది పేరు. 2. "శితహిమకంధర యతిరాజ్ సభలో తపఃఫలమ్ముగ తళుకుమని" అన్నారు. "శిత హిమ కంధర" అంటే తెల్లని హిమాలయాల దగ్గర అని; "యతిరాజ్ సభ" అంటే అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల చోటు అని నాకు అనిపించింది. వారి తపస్సుకు ఫలితంగా ఈ నందకం అవతారం ఎత్తింది అని కవి భావం అని అనిపిస్తోంది.

గర్భాశయం, గర్భాలయం - ఛందోబద్ధంగా రెండూ ఒకేలాగ ధ్వనిస్తున్నాయి (UUIU). గర్భాశయం అనేది వాడుకలో ఉన్న శబ్దం. వేటూరి గర్భాలయం అనే పదం వాడి అన్నమయ్యకీ, ఆయన తల్లికీ కూడా తగిన పదసత్కారం చేసారు అనిపించింది. చివరిగా ఈ చరణంలో చెప్పుకోవలసిన పదలయ: "ప్రవేశించెను ఆ నందకము, నందన ఆనంద కారకము". నందకము అంటే విష్ణువు ఆయుధము. నందనుడు అంటే కొడుకు. ఆనందము అంటే సంతోషం. ఆనందకము అంటే ఆనందము కలిగించేది. ఇక్కడ "నం, ద", "ఆ, నం, ద" అనే అక్షరాల వరుసలు రెండు మూడు సాల్రు వచ్చాయి. దీన్నే వృత్త్యనుప్రాసం అంటారు. ఒక అక్షరంతో వృత్త్యనుప్రాసం సామాన్యమే. రెండు మూడు అక్షరాలతో చెయ్యడం విశేషం. అలాగే, "ఆ నందకము" అంటే - "ఆ విష్ణువు ఆయుధం" అని. "ఆనందకము" అంటే ఆనందం కలిగించేది అని - ఈ రెండు అర్థాలు ఉండటం వలన శ్లేష ఐంది. ఒక చిన్న వాక్యంలో ఒక శబ్దాలంకారాన్ని, ఒక అర్థాలంకారాన్ని ఉపయోగించి వేటూరి తెలుగు వ్యాకరణం తెలిసినవారికి, తెలియని వారిని కూడా మెప్పించారు. భళా! 


పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై 
ఆంధ్ర సాహితీ అమరకోశమై 
అవతరించెను అన్నమయ్య 
అసతో మా సద్గమయా

"ఉసురు" అంటే "ఊపిరి", "జీవము" అని అర్థం. బహుశా నందకం అచేతనమైనది కనుక అన్నమయ్యకు విష్ణువు జీవం పోసాడు అని కావి భావం అనిపిస్తోంది. "అమర కోశం" అంటే "ఎప్పటికీ నిలిచే నిధి" అని అర్థం. సంస్కృత భాషకు ఒక ప్రముఖమైన "నిఘంటువు" లేదా "థిసారస్ (thesaurus)" పేరు కూడా అమరకోశం. "ఆంధ్ర సాహితీ అమరకోశమై" అనడంలో "తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచే నిధి" అని, లేదా "తెలుగులో అమర కోశం" (తెలుగు పదాలకు ఆలవాలం/నిఘంటువు) అని రెండు ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎలాగ చూసుకున్నా సబబైన మాట. 

"అవతరించెను అన్నమయ" కు యతి, అంత్యప్రాస కూడా కుదిరే విధంగా పవమాన మంత్రాలలో ఒకటైన "అసతో మా సద్గమయా" ను వాడటం ఈ పాటకు చాలా అందాన్ని తెచ్చింది. కొంచెం చాదస్తంగా చూసుకునేవారు " 'అసతో మా సద్గమయా' అంటే 'అసత్యం నుండి నన్ను సత్యం వైపు' నడిపించూ కదా. అన్నమయ్య పుట్టడానికి దానికీ సంబంధం ఏమిటి? " అని అడుగవచ్చును. దీన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చును అని నాకు అనిపించింది. 1. కవి అన్నమయ్యను స్వయంగా అడుగుతున్నాడు "నన్ను నీ పాటల ద్వారా అసత్యం  నుండి బ్రహ్మం (సత్) వైపు తీసుకువెళ్ళు" అని. 2. "అసతో మా సద్గమయ" అనే మంత్రానికి ప్రతిస్పందనగా విష్ణువు అన్నమయ్యను పుట్టించాడు అని కూడా అర్థం చేసుకోవచ్చును. నిజానికి కవి లయకు, లోతుకు ప్రాధాన్యతని ఇచ్చి ఇక్కడ విషయాన్ని అస్పష్టంగా విడిచాడు అనిపించింది. ఇది కొందరికి నచ్చకపోవచ్చును. కానీ నాకు నచ్చింది.

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేబట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎద లయలో పదకవితలు కలయ 
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య 
తమసో మా జ్యోతిర్గమయా

"అరముద్దలు" అనే పదం నాకు బాగా నచ్చింది. సామాన్యంగా ముద్ద కలిపి, గోటితో మధ్యలోకి త్రుంచి పిల్లలకు పెడతారు. కచ్చితంగా తెలియదు కానీ అందుకే దాన్ని గోరుముద్ద అంటారు అనుకుంటున్నాను. ఇక్కడ కవి అరముద్దలు అని కూడా అందుకే అంటున్నారు అని అర్థమైంది. సరే, "హరి" కి "అర" కి యతి యేనా, లేక ప్రాసయతి కూడా ఉందా అని చూసాను. నిఘంటువులో "అర" అంటే "అర్ధము, సగము" అని (అరగంట లో అర); "అఱ" అంటే "లోపలి" అని (అఱచేయి) ఉంది. సంస్కృతం ర కి తెలుగు ర కి ప్రాస కుదురుతుంది కానీ, సంస్కృతం ర కి తెలుగు ఱ కి కాదు. కవి ఎక్కడికక్కడ, ప్రాస, యతి, ప్రాసయతి చూసుకుంటూ వ్రాసాడనడానికి ఇది ఆధారం.

"తెలుగు భారతికి వెలుగు హారతి" చక్కనైన ప్రయోగం. భారతి అంటే "మాట, శబ్దం, సరస్వతీ" అని అర్థాలు ఉన్నాయి. తెలుగు పదాలకు హారతి పట్టినవాడు అన్నమయ్య. తెలుగు, వెలుగు; భారతి, హారతి - ఎంత చక్కగా ప్రాస కుదిరింది. తెలుగు పద కవితలను సృజింపజేస్తూ ఉంటే ఆయన ఎద లయలో అవి కలిసిపోయాయి. ఆ తరువాత తెలుగు వారి అందరి ఎద లయలో కూడా అవి కలిసిపోయాయి. అందుకే ఆయనని "ఆంధ్ర పద కవితా పితామహుడు" అన్నారు.

పాటను ముగిస్తూ వేటూరి "తాళ్ళపాకలో వెలసెనన్నమయ తమసోమా జ్యోతిర్గమయ" అంటూ మళ్ళీ ఒక పవమాన మంత్రాన్ని కలిపారు. ఈ సారి "తాళ్ళపాక" కు యతి గా "తమసో మా జ్యోతిర్గమయ" అన్నారు. మామూలు మనిషికి కూడా సాహిత్యాన్ని అందించే రసికుణ్ణి, భక్తుణ్ణి చేసిన అన్నమయ్య నిజంగా మనని అంధకారం నుండి  తేజస్సువైపుకు తీసుకెళ్ళారు.

ఈ పాటంతా ఎక్కడికక్కడ యతి, ప్రాస, ప్రాసయతులతో అందంగా వచ్చింది. దానికి కీరవాణి పూర్తిగా న్యాయం చేసాడు. తెలుగు చలన చిత్ర గీతాలలో ఇది కచ్చితంగా ఒక "classic".

Sunday, October 2, 2011

వివేక చూడామణి - 2

శంకరాచార్యులు బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పారు. ఉత్తుత్తి వాదాల కోసం బ్రహ్మాన్ని గురించి చర్చించుకోవడం అనవసరం అని అదే విషయాన్ని మఱొక్క సారి చెప్తున్నారు.

వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా

భా:- వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు.

సనాతనధర్మంలో పదే పదే చెప్పే విషయం, గురుశుశ్రూష. కృష్ణపరమాత్ముడు కూడా ఆయన గురువు దగ్గర కొంత కాలం ఉండి విద్యలభ్యసించారు. అలాంటిది మామూలు మనుషులెంత? అందుకే శంకరాచార్యులు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళమన్నారు.

అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమం

భా:- ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక గురువును సమీపించాలి.

ఒక వ్యక్తి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి నాలుగు లక్షణాలు ఉండాలి. వీటిని శంకరాచార్యులు లక్షణాలు అనలేదు, సాధనాలు అన్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మన కర్తవ్యం (అద్వైతభావం) పూర్తి చేసుకోవాలి.

ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే
ఇహాముత్రఫలభోగవిరాగస్తదనంతరం
శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం


ఈ సాధనాల గురించి ఒక్కొక్కటిగా వివరించారు.

1. నిత్యం, అనిత్యం -- ఈ రెండిటి మధ్యనా భేదాన్ని గుర్తించగలగడం

నిత్యం, అనిత్యం మధ్యన భేదం సులభంగా తోచుతుంది. కానీ, దాన్ని అనుసరించడం చాలా కష్టం. ఉదాహరణకు మనం ఒక కొత్త వస్తువు కొనగానే పగిలిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది.మనకీ తెలుసును, ఆ వస్తువు ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేదేనని. కాకపోతే, తెలియడం వేఱు, దాన్ని జీర్ణించుకోవడం వేఱు. శంకరాచార్యులు చెప్తున్నది అది బుద్ధిలో పూర్తిగా జీర్ణించుకుపోవడం గురించి. 

2. ఇహంలో, పరంలో భోగాలపై విరక్తి

ఈ లోకమే కాదు, ఉన్నతలోకాలు కూడా శాశ్వతమైనవి కావు. మోక్షం మాత్రమే శాశ్వతమైన స్థితి. అందుకే పాపపుణ్యాలు రెండూ ముముక్షువుకు ప్రతిబంధకాలని శాస్త్రాలు చెప్తున్నది. అన్నమయ్య అన్నట్టు "భారపు పగ్గాలు, పాపపుణ్యములు". ఒక రూపాయి దానం చేసిన వెంటనే మనసులో ఒక తృప్తి పుడుతుంది, "ఈ రోజు ఒక మంచి పని చేశాను", అని. అంటే ఆ దానానికి ప్రతిఫలం అప్పుడే అనుభవిస్తున్నాము. "నా డబ్బు నేను ఇంకొకడికి దానం చేసాను" అనుకుంటూ చేసిన దానం పుణ్యం అవుతుంది, మఱో జన్మలో మనకు వెనక్కొస్తుంది. ఇది మంచి విషయంలా అనిపిస్తున్నా, ఆ పుణ్యం వెనక్కి రావాలి అంటే మనకు మఱో జన్మ ఉండాలి కదా? అందుకే దానం చేసేటప్పుడు, "ఇది నా ధర్మం. ఈ డబ్బు నాది కాదు.", అనే భావం ఉండాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినది.

దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం

భా:- "ఇది ఇవ్వడం నా ధర్మం" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయంలో, సందర్భంలో ఇచ్చే దానమే సాత్త్వికమైన దానం.

దానం చేసాను అనే సంతృప్తి కలగడం ఇహంలో భోగం, ఈ డబ్బు నాది అని మనసులో ఉండటం పుణ్యలోకాలలో భోగాన్ని ఆశించడం -- ఈ రెండూ మనను దానం చేసినప్పుడల్లా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుస్తోందిగా ఆ రెండవ సాధనం పొందటం ఎంత కష్టమో? ఇది సాధన చేస్తూ ఉంటే కానీ రాదు.

వైరాగ్యాన్ని శంకరుడు వర్ణించిన తీరు:

తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః
దేహాదిబ్రహ్మపర్యంతే హ్యానిత్యే భోగవస్తుని

భా:- దేహం మొదలుకొని బ్రహ్మం వరకు అనిత్యమైన వస్తువులందు "నాకు వద్దు" అనే భావం కలగడం వైరాగ్యం.

మనిషికి అన్నిటికంటే సులువుగా లభించే ఆనందాలు ఇంద్రియాలనుండి వస్తున్నాయి. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన, స్పర్శ -- ఇవే కదా వస్తువుల ద్వారా వస్తున్న ఆనందం. ఇవి కేవలం శరీరాన్ని సంతృప్తిపరచవచ్చును (తినడం), మనసుని సంతృప్తి కలిగించవచ్చును (ఇష్టమైనవారిని చూడటం), బుద్ధికి సంతృప్తిని కలిగించవచ్చును (కష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి). ఇవేవీ శాశ్వతం కావు. అందుకే ఇది వద్దు, ఇది వద్దు అనే వదులుకుంటూ కేవలం శాశ్వతమైన (బ్రహ్మపదం) వాటిని కోరుకోవడమే వైరాగ్యం.

3. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)

శమాది లక్షణాలన్నిటికీ నైఘంటికవివరణలు ఉన్నా శంకరాచార్యులు ప్రత్యేకించి వివరించారు.

3.1. శమం

విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే

భా:- మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని అధీనంలో ఉంచుకోవడం).

3.2. దమం

విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే
ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః

భా:- రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.

3.3. ఉపరతిః

బాహ్య అనాలంబనం వృత్తేరేషోపరతిః ఉత్తమా

భా:- బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.

3.4. తితిక్ష

సహనం సర్వదు:ఖానాం అప్రతీకారపూర్వకం
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే

భా:- అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడాన్ని ఉపరతి అంటారు.

3.5. శ్రద్ధ

శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం
సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే

భా:- ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.

3.6. సమాధానం

సర్వదా స్థాపనం బుద్ధః  శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనం

భా:- ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.

4. ముముక్షుత్వం

అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్
స్వస్వరూపావబోధేన మోక్తుమిఛ్ఛా ముముక్షుతా

భా:- అహంకారం మొదలుకొని ఈ దేహం వరకు అన్నిటిపైనా అజ్ఞానం వలన మనం కల్పించుకున్న బంధాలను, వీటి స్వరూపాలను అర్థం చేసుకుని, తెంచుకోవాలనే కోరికే ముముక్షుత అంటారు.

ముముక్షుత్వం అంటే "మోక్షం కావాలి" అనే బలమైన కోరిక. ఇది అన్నిటికీ మూలమైనది. మోక్షం కావాలనుకోబట్టే మనకు వివేకం, వైరాగ్యం, శమాది గుణాలు సాధనాలు అవుతున్నాయి.

"బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మోక్షానికీ తేడా ఉందా?" అని అడగవచ్చును గాక. బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైన పని అంటే మోక్షం గురించి బలమైన కోరిక లేకపోతే మధ్యలో ఆగిపోతారు. ఒక సారి బ్రహ్మైక భావాన్ని అనుభవిస్తే ఇంక ఈ లోకం పైన మక్కువ ఉండదు. అందుచేత బ్రహ్మజ్ఞానం, మోక్షం పక్కపక్కనే ఉంటాయి అని నాకు అర్థమనది.


చిలక మనం నేర్పిన మాటలనే (ఆ పదాలు అర్థం కాకపోయినా) మళ్ళీ మాట్లాడుతుంది. అలాగే పైన చెప్పినవన్నీ శంకరాచార్యులు చెప్పినవి నేను (నాకర్థమైనంతలో) మళ్ళీ చెప్పాను. ఇవన్నీ జీర్ణించుకోవడానికి నాకు సంవత్సరాలు పడతాయి. ఇలాగ వ్రాయడం వలన కేవలం నాకు మననం చేసుకోవడం సులువౌతుంది, ఈ గ్రంథాన్ని చదువని వారికి పరిచయం ఏర్పడుతుంది.

Tuesday, May 17, 2011

తెలుగు భారతికి వెలుగు హారతై, ఎద లయలో పదకవితలు కలయ... (అన్నమయ్య జన్మదినం)

ఈ రోజు అన్నమాచార్యుని పుట్టినరోజు. తెలుగువారందరూ ఎంతో గర్వించ-తగిన/వలసిన రోజు. తెలుగు భాషని, భాషకి సేవచేసిన మహానుభావులని మరిచిపోవడం మనకు వెన్నతో పెట్టిన విద్య అయినప్పటికీ ఈ రోజు కాస్త ఆ అలవాటుని పక్కన పెట్టి, ఆ మహానుభావుడిని ఒక్కసారి స్మరిద్దాము.

ఈ రోజుల్లో మన చలనచిత్రాల్లో వస్తున్న పాటలను చూస్తే "ఓసోసి, పాట వ్రాయడం అంటే ఇంత సులువా? నేనూ వ్రాస్తాను" అనుకుని "నిన్ను చూస్తే గుండె కొట్టుకుంది, మాయరోగం నన్ను పట్టుకుంది" అని వ్రాసేద్దామనిపిస్తుంది. చలనచిత్రకవులకు కూడా పదే పదే అదే సందర్భం ఇస్తే తరచూ అవే పదాలు/భావాలు దొర్లుతూ ఉంటాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. అలాంటిది ముప్ఫైవేలకు పైగా పాటలు, ఒక్కడంటే ఒక్కడి మీద, వ్రాయడం, ప్రతీ పాటలో వైవిధ్యం కనబరచడం, వాటిని భావితరాలకు నచ్చేలాగ/ఉపయోగపడేలాగా స్వరపరచడం, ఎక్కడా యాంత్రికంగా అనిపించకుండా ఆవు పొదుగు దగ్గరి పాలలాగ స్వఛ్ఛంగా ఉంచడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న కర్ణాటక సంగీతంలో ఇంతటి అద్భుతాన్ని సాధించినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చును (అంటే తక్కువ సంకీర్తనలను రచిస్తే తక్కువ కవులు/గాయకులు అని కాదు. కానీ రోజుకో అద్భుతమైన గేయం వ్రాయడం గుర్తించదగిన విషయం అని).

నేను గతసంవత్సరం అన్నమయ్య జన్మదినానికి ఒక పాట వ్రాశాను. స్వరాలంటారూ, నా లాంటి స్వరపరిజ్ఞానహీనుడు ఏం చేస్తాడు? ఏదో "ల లా ల" అనుకుంటూ పాట వ్రాశాను. ఈ ఏడాది కూడా ఎలాగైనా ఒక పాట అన్నమయ్య మీద వ్రాయాలని నా మనసు లాగింది. కానీ, గంటసేపు కూర్చున్నా ఏమీ తట్టట్లేదు. ఇప్పుడు నేను అన్నమయ్య అంత కవిని అనే దుస్సాహసం చేయట్లేదు, కాకపోతే ఏడాది ఖాళీ ఉన్నా అదే సందర్భానికి మఱొక పాట వ్రాయలేకపోతున్నాను. మఱి రోజూ వేంకటేశుడి మీదనే వ్రాయాలంటే ఎంత భక్తి, భావనాశక్తి, భాషాపటిమ ఉండాలో ఆలోచిస్తేనే అన్నమయ్యకు పొఱ్లుదణ్ణాలు పెట్టేయాలనిపిస్తోంది. ఐనా సాహసించి అన్నమయ్య గుఱించి ఏమైనా వ్రాద్దామంటే చలనచిత్రకవితాపితామహుడు వేటూరి ఇప్పటికే అద్భుతమైన పదాలను వాడి అన్నమయ్యని మెప్పించేశాడు. ఆ పాటలు తలుచుకుంటేనే "అమ్మో...నేను ఇలాగ వ్రాయలేను మొఱ్ఱో" అనాలనిపిస్తుంది.

అన్నమయ్య గళానికి (అదే...నందకానికి!) రెండు వైపులా పదునే. అటు సంఘాన్ని విమర్శించినా (బ్రహ్మమొకటే), ఇటు సంఘాన్ని విస్మరించినా (అదినే నెఱగనా); అటు శృంగారమైనా (ఏమొకో చిగురుటధరమున), ఇటు పరమవైరాగ్యమైనా (అంతర్యామి అలసితి); అటు గంభీరమైన సంస్కృతమైన (ఫాలనేత్రానలప్రబల), ఇటు జానపదమైనా (సిరుతనవ్వులవాడే సిన్నెక్క) -- అన్నీ ఆయనకు పుట్టుకతో వచ్చినవే అనిపిస్తుంది. ఒక వంద thesisలు వ్రాయగలిగినన్ని విషయాలు ఆయన పాటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన కవితాపటిమ గుఱించి చెప్పడానికి నా బోటి అల్పుడు సరిపోడు. ఆ ప్రయత్నం కూడా నేను చేయదలుచుకోలేదు.

కొంతమంది కారణజన్ములు అని వారిని చూడకపోయినా వారి సృష్టిని బట్టి చెప్పచ్చును. ఆది శంకరుడి గొప్పదనం తెలియడానికి ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ చదవక్కరలేదు. సంస్కృతంలో అక్షరం ముక్క తెలియని వాడైనా "అయి గిరి నందిని" అన్న శ్లోకం విన్నాడంటే, "ఇదెవరో మహానుభావుడు వ్రాశాడురోయ్!" అనుకుంటాడు. అలాంటి కారణజన్ముడే అన్నమాచార్యుడు కూడా. నేను దైనందినజీవితంలో విసిగిపోయినప్పుడు ఒక్కసారి ఆయన మాటలను గుర్తుచేసుకుంటుంటాను. ఆయన వైరాగ్యభరితమైన పాటలు వింటూవుంటే నా మనసుకు ఊరట కలుగుతుంది. భగవద్గీతలోని లోతంతా ఒక్క నిముషంలో చూసినంత ఎత్తుకు వెళ్ళిపోతాను.

"కోరిన కోఱ్కెలు కోయనికట్లు, తీరవు నీవవి తెంచక; మదిలో చింతలు మయిలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక"
"యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి; కొంతైన బ్రహ్మచింత కోటిలాభము"
"పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా"

 
ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్ని రోజులైనా చెప్పుకుంటూపోవచ్చును. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపి, పదకవితాకులంలో ఒక మరుగుజ్జునైన నేను మనసార ఆ మహాత్ముడికి ప్రణామం చేస్తున్నాను. "మహానుభావ... మళ్ళీ నీకు పుట్టే ఉద్దేశం ఉంటే చెప్పు, నీకు చెప్పులుకుట్టేవాడిగా పుట్టినా నాబోంట్ల జన్మ ధన్యమవుతుంది", అని గట్టిగా అరవాలనిపిస్తోంది.

PS: సోదరుడు శ్రవణ్ కుమార్, తన బ్లాగు ద్వారా అన్నమయ్య పాటలను నలుగురికీ అందే విధంగా చేస్తున్నాడు. ఆ బ్లాగులో అన్నమయ్య అనే అనంతరత్నాకరంనుండి గ్రహించిన అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి. చదువర్లు ఆ బ్లాగుని దర్శించవలసిందిగా నా మనవి. 

Thursday, October 14, 2010

రూపకాలంకారం (metaphor)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> రూపకాలంకారము

లక్షణం: విషయ్యభేద తాద్రూప్య రంజనం విషయస్య యత్
వివరణ: ఉపమేయమునకు, ఉపమానము తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం 'రూపకం' అవుతుంది. మొదటిది అభేదరూపకం, రెండవది తాద్రూప్యరూపకం.

మనం దేన్ని పోల్చదలుచుకున్నామో అది ఉపమేయమని, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానమని ఇదివరకే మనం తెలుసుకున్నాము.

ఉదా: (చంద్రాలోకం)
ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే

ఇక్కడ "మహారాజు" అన్నది ఉపమేయం. "ఈశ్వరుడు" అన్నది ఉపమానం. నిజానికి ఈశ్వరుడు, మహారాజు వేరు వేరు. అయినప్పటికీ "సాక్షాత్తు" అన్న పదం ద్వారా వీరిద్దరికీ అభేదం (తేడా లేకపోవడం) చెప్తున్నాడు కవి. అంటే ఈశ్వరుడిలోని ధర్మాలన్నీ ఈ మహారాజులో ఉన్నాయి అని కవి భావం. ఈశ్వరధర్మాన్ని మహారాజుకు ఆపాదించడం కోసం కవి వీరిద్దరికీ అభేదాన్ని చెప్పాడు కనుక ఇది అభేదరూపకం అవుతుంది.

రూపకసమాసం విగ్రహవాక్యవిధానం తెలిస్తే తాద్రూప్యరూపకం గురించి తెలిసినట్టే. ఈ క్రింది ఉదాహరణ చూద్దాము.

ఉదా: (సౌందరనందం, రచన: అశ్వఘోషుడు)
కామవ్యాథుని చేత మనుష్యహరిణములు చంపబడుచున్నవి.

ఈ ప్రయోగంలో రెండు రూపకాలంకారాలు ఉన్నాయి. మొదటిది: "కామవ్యాథుడు" అంటే "కామము అనెడి బోయవాడు" అని భావం. కామానికి, బోయవానికి ఉన్న తాద్రూప్యాన్ని (similarity) చెప్తోంది కాబట్టి ఇది రూపకలాంకారం అవుతుంది. ఇక రెండవది: "మనుష్యహరిణము" అంటే "మనిషి అనే లేడి". వేటాడబడటంలో (కామము చేత) మనిషికి, (బోయవాని చేత) లేడికి కల తాద్రూప్యాన్ని చెప్తోంది కనుక ఇది కూడా ప్యరూపకాలంకారం అవుతుంది.

ఉదా: (మనుచరిత్ర, రచన: అల్లసాని పెద్దన)
విలోకన ప్రభావీచికలన్ తదీయ పదవీకలశాంబుధి వెల్లి గొల్పచున్

పద్యంలోని ఈ పాదానికి భావం, "చంద్రుని కిరణాల వలన సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసిపడతాయో, అదే విధంగా వరూధిని చూపులు తాకి ప్రవరుని బాట పొంగిపొరలుతోంది", అని. ఇక్కడ "పదవీకలశాంబుధి" అనడంలో పదవికి, కలశాంబుధికి తాద్రూప్యాన్ని చెప్పడం ద్వారా ఇది రూపకాలంకారమైంది.

ఉదా: (అంతర్యామి అలసితి సొలసితి, రచన: అన్నమాచార్యులు)
కోరిన కోర్కెలు కోయని కట్లు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మదిలో చింతలు మయిలలు మణుగులు

ఈ వాక్యాలన్నింటిలోనూ రెండు విషయాలకు అభేదాన్ని చెప్తున్నారు మహానుభావులు అన్నమాచార్యులు.

ఉదా: (రఘువంశసుధాంబుధిచంద్ర, రచన:  పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్)
రఘువంశసుధాంబుధిచంద్ర! శ్రీరామ రామ రాజరాజేశ్వర!

రఘువంశసుధాంబుధి అంటే "రఘువంశము అనెడి అమృతం నిండిన సముద్రం" అని అర్థం. ఆ రెండింటికీ అభేదం చెప్పాడు. అక్కడితో ఆగక, చివరన "చంద్ర" అని చేర్చడంతో "రఘువంశమనే సముద్రానికి చంద్రుడవు" అని శ్రీరాముణ్ణి అనడంతో చంద్రుడి ధర్మాలను శ్రీరామచంద్రుడికి ఆపాదించి తాద్రూప్యరూపకాలంకారాన్ని సమర్పించుకున్నాడు కవి.


మహామహులైన కవులు తమ భావనాబుభుక్షను చల్లార్చుకోవడానికి రూపకాలంకారాన్ని సేవించారు. వారందరి ప్రయోగాలనూ ఒకచోట చెప్పడానికి నాబోటి సామాన్యుడికి రెండుమూడు జన్మలు కూడా చాలకపోవచ్చును.ఇదే అలంకారాన్ని మన చలనచిత్రకవులు కూడా చాలా వాడారు. కొన్నిసార్లు ఉచితమైన సందర్భాలకు వాడితే కొన్ని చోట్ల ఈ అలంకారానికి అవమానం కలిగించే విధంగా వాడారు. మనం ఉచితమైనవే చెప్పుకుందాం.

ఉదా: (పాట: ధన్యోహం ఓ శబరీశా, చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్మ్యం, రచన: వేటూరి)
ఉత్తుంగ శబరిగిరిశృంగా, నిత్యనిస్సంగ, మంగళాంగ, పంపాతరంగపుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగా!

"మునుల యొక్క హృదయములు అనెడి తామరపూవుల మీద వాలే తేనెటీగ" అనే లోతైన భావాన్ని వేటూరివారు సంస్కృతభూయిష్టంగా చెప్పారు.


ఉదా: (పాట: సన్నజాజిమంచమెట్టి, చిత్రం: రాంబంటు, రచన: వేటూరి)
చందమామ కంచమెట్టి,సన్నజాజి బువ్వపెట్టి...




చదువర్లకు తెలిసిన కావ్యాలు, కీర్తనలు, పాటల్లోని రూపకాలంకారాలను గుర్తించి చెప్పగలరని ఆశిస్తున్నాను.

Thursday, May 27, 2010

పదకవితాపితామహుడికి పదపుష్పాంజలి

అన్నమయ్య కీర్తన అనగానే నా మనసుకు ఒక రకమైన పరవశం కలుగుతుంది. ఆయన కీర్తనలు వింటుంటే "ఆహా, ఎంత చక్కగా వర్ణించాడు? రోజూ ఒక్కరి మీదనే కీర్తనలు వ్రాస్తున్నా, ఈయనకి పదాలు ఎక్కడనుండి దొరుకుతున్నాయి? ఆ భావనది జీవనది కదా! ఆ భక్తిరత్నాకరంలో రత్నాలకు లెక్క లేదు!", అని అనిపిస్తుంది. "తెలుగుపాట" అన్న మాటకి పునాది వేసిన అన్నమయ్యని పొగడాలంటే మాటలు చలావు. కానీ, ఆ శారదాదేవి అనుగ్రహించనంతలో కొన్ని పదపుష్పాలను సమర్పించుకోవాలన్నదే నా ఆశ. ఆ పై ఆ శ్రీనివాసుడిదే భారం!


క్కడివయ్యా నీకీ పదములు
క్కగ అమరెను క్రి పదములకు

రి నా విభుని, డు కొండలపై, కోరి కీర్తనలఁ కొలిచెడివారని
నారదుడే నీ నాలుకముంగిటఁ, బారఁగఁ జేసెనా మహతీఝరులను
ఎక్కడివయ్యా ||

లకోకిలలా చిలుకగ పలుకులఁ, లకల కులుకుల లికి శ్రీరమణి
లుకుతేనెలతల్లి ద్మావతియే, చిలికినదా నీ జిహ్వపై సిరుల?
ఎక్కడివయ్యా ||

లమేల్మంగ ధరామృతమును, లదుకొన్న శ్రీరి పెదవులపై
పులకలు పొడమ పొంకపుమాటలఁ, తొలకాడిన స్వరధుని లోతులలో
ఎక్కడివయ్యా ||

నెలకొనె హరి నా నేలకు వచ్చి, కొలువుఁదీరెనే కొండలపైనని
లచి పదములను దాచి పంపెనో, తెలుగుతల్లి నీ దివ్యహృదయమున
ఎక్కడివయ్యా ||

ఈ పాటలో అన్నమయ్య శైలిని సాధ్యమైనంతవరకు అనుసరించాను.ప్రాసాక్షరాలు కనబడుతూనే ఉన్నాయి. యతి అక్షరాలను ముద్దగా (bold) దిద్దాను.