Friday, July 29, 2011

కిట్టు కథలు: సంతృప్తి నాకు దిక్సూచి

కిట్టును చూడటానికి తన తండ్రి రాజు, వాళ్ళ స్వగ్రామం నుండి కలకత్తా వచ్చాడు. కిట్టు అప్పటికే చదువు పూర్తి చేసుకుని ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటిదాక వాళ్ళ వ్యవసాయం అంతంత మాత్రంగా నడుస్తుండటం, తండ్రి తన చదువుకోసం అప్పులు చేయడం గమనిస్తూ ఉన్న కిట్టు, ఇప్పటికైనా తన తండ్రికి కాస్త విశ్రాంతి కలిగించాలని, తను అనుభవిస్తున్న సుఖాలను తన తండ్రి కూడా అనుభవించాలని కోరుకున్నాడు. రాజుని ఎంతో అభిమానంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ప్రతి వారం ఏదో ఒక చిత్రానికో, షికారుకో అద్దెగాడీల్లో (taxi) వెళ్ళడం, ఖరీదైన restaurantsలో భోజనం చెయ్యడం మామూలైపోయాయి.

కిట్టు ఇదంతా తనపై ప్రేమతో చేస్తున్నాడు అని సంతోషించినా, ఖర్చులు కొంచెం మితి మీరుతున్నాయి అని రాజుకు బాధ కలిగింది. సున్నితమైన మాతలతో, "నాకు వద్దు. ఇంట్లోనే ఉండాలని ఉంది.", లాంటి మాటలతో చెప్పినా కిట్టు బలవంతంగా బయటకు తీసుకెళ్ళసాగాడు. ఒక రోజు కిట్టు, రాజు ఒక పెద్ద mall లో pizza center కి వెళ్ళారు. అక్కడ కిట్టు వెళ్ళి ఒక కుఱ్ఱాడికి తన పేరు ఇచ్చి వచ్చాడు. అది జరిగిన పావుగంటకి ఆ కుఱ్ఱాడు కిట్టు పేరు చదవగా, గబగబా తన తండ్రి చేయి పట్టుకుని లోపలకు, ఆ కుఱ్ఱాడు చూపించిన బల్లకు ఇరువైపులా కూర్చున్నారు. కిట్టు జాబితాలో ఉన్న వంటకాలన్నీ రాజుకు వివరిద్దామని చూశాడు. రాజు మాత్రం, "నీకేది నచ్చితే అదే చెప్పరా నాన్న", అని ఊరుకున్నాడు. కిట్టు రెండుమూడు వంటకాలు తెమ్మని చెప్పాడు.

కాసేపటికి ఆ వస్తువులు వచ్చాయి. కిట్టు ఎంతో సంతోషంగా ఒక ముక్క తుంపి రాజు పళ్ళెంలో వేసి తినమన్నాడు. రాజు దాన్ని తిందామని ప్రయత్నించాడే కానీ, అది ఎక్కట్లేదు. అది ఊతప్పానికి, దిబ్బరొట్టెకి మధ్యలో ఉంది కానీ, ఆ రుచి లేదు. కారంగా లేకపోతే రాజుకు రుచించదు. కిట్టును బాధపెట్టడం ఇష్టం లేక ఎంతో కొంత తిన్నాడు. ఇంతలో bill వచ్చింది, కిట్టు ఇంకా తింటూ ఉండటంతో రాజు దాన్ని తెరిచి చూశాడు. అక్షరాలా ఏడు వందల రూపాయలు అయ్యాయి. రాజుకు తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయ్యింది. ముఖం ఎఱ్ఱగా అయ్యింది. కుఱ్ఱదనంలో తానూ బళ్ళ మీద, బట్టల మీదా ఖర్చుపెట్టాడు కానీ, ఇది మరీ ఎక్కువ అనిపించింది. ఏమీ మాట్లాడకుండా కిట్టుతో పాటు ఇంటికి వచ్చేశాడు. తను నెమ్మదిగా చెప్తే వినట్లేదు అని కాస్త గట్టిగా, "ఏడొందలు పెట్టి కొన్నావు. నాకు అది ఏమీ నచ్చలేదు. ఎందుకురా? నాకు పక్కన hotelలో దొరికే రోటీ, దాల్ తడ్కా నచ్చింది." అన్నాడు. కిట్టు, పిజ్జ కొత్త తరం విషయం అని, యువతకు నచ్చుతోందని, రాజు స్వగ్రామానికి వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చునని నచ్చజెప్పాలని చూశాడు. కిట్టును తను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నాడని గమనించి, రాజు అప్పటికి ఊరుకున్నాడు.

సాయంత్రం ఇద్దరూ coffee తాగుతూ కూర్చున్నారు. రాజు కిట్టు కేసి చూస్తూ, "నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయిరా. మా బాబాయ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడేవాడిని", అన్నాడు . కిట్టు నిట్టూర్చి, "అదేం లేదు నాన్న", అన్నాడు. రాజు, "సరే. మా బాబాయ్ కథ ఒకటి చెప్తాను, వింటావా?", అన్నాడు. కిట్టు ఏంటన్నట్టు చూశాడు.

"నా చిన్నదనంలో మా నాన్న చనిపోయాక మా బాబాయే నన్ను సాకాడు అని నీకు తెలుసు. మా తాత ఆస్తిని తనే చూసుకుని, నేను ఎదిగాక నాకు నా భాగాన్ని ఇచ్చాడు. ఆస్తి నా చేతికి వచ్చే ముందు, అంటే నేను చదువుకునేటప్పుడు, నాకూ నీ లాగ చాలా సరదాలు ఉండేవి. అంతమంది కూతుళ్ళ మధ్యన ఒక్కడినే కొడుకుని అని మా అమ్మ నన్ను గారంగా చూసుకునేది. కానీ, డబ్బు కావాలంటే మాత్రం బాబాయ్ నే అడగాలి. మిగతా వారందరూ ఏమనుకున్నా, నాకు మటుకు మా బాబాయ్ మంచివాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా గడ్డ పెరుగేసి  అన్నం కలిపి, అందులో కొత్తావకాయ్ నంజి పెడుతూ ఉండేవాడు. తన బిడ్డలతో సమానంగా చూసేవాడు - ముద్దాడినా, కొట్టినా.

మా బాబాయ్ వంద ఎకరాల ఆసామి. కానీ, మహా పిసనారి అని మన ఊరంతా చెప్పుకునేది. అయినా, పరుల సొమ్మును ఆశించేవాడు కాదు. ఊరక అణా కూడా ఇచ్చేవాడు కాదు. డబ్బుల కోసం ఆయనని అడగాలంటే నాకూ అదే చిఱాకు, భయం. ఈ సారి కొత్త cycle కోసం అడిగాను. గంభీరంగా ఒక చూపు చూశాడు. వద్దనే దాని అర్థం, అనుకుని నిట్టూర్చాను. నిజానికి కళాశాల ఇంటికి రెండు కిలోమీటర్లకు మించి ఉండదు, మిత్రబృందం అంతా నడుచుకునే వెళ్తున్నారు. ప్చ్...అది చెప్పే వద్దంటాడేమో అనుకున్నాను.

ఉన్నట్టుండి,  "రేపు తెల్లారుకట్ట నేను పార్వతీపురం వెళ్ళాలి, నువ్వూ వస్తావా?", అన్నాడు. ఆయన చెప్పింది చెయ్యడమే తప్ప వేరు అలవాటు లేదు ఆ ఇంట్లో. సరేనని చెప్పి ఆయన వెంట వెళ్ళాను. కొండల వెంటా, గుట్టల వెంటా తిప్పి తీసుకెళ్తూ ఐదారు కిలోమీటర్లు నడిపించి కొంచెం మనుషులు కనబడే చొటికి చేర్చాడు. అప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు. పొద్దున్న ఒక్క అరటిపండు  పెట్టి ఇంత దూరం నడిపించాడేమిటిరా బాబు అనుకుంటుండగా, ఒకరి ఇంటి దగ్గర ఆగి నన్ను అరుగు మీద కూర్చోమని లోపలికి వెళ్ళాడు. లోపలనుండి ఒకావిడ వచ్చి ఒక లోటాలో మంచినీళ్ళు ఇచ్చింది. బాబాయే పంపించి ఉంటాడు. ఒక గంట తరువాత వెనక్కి వచ్చాడు. మా ఆకలేసింది. బాబాయైతే పెద్దవాడు. ఉపవాసాలు చేసి చేసి అలవాటైంది, మరి నా గతేం కాను అనుకున్నాను. మళ్ళీ యాత్ర కొనసాగింది.

ఇంక శొష వస్తుంది అనగా ఒక ఇంటి ముందు ఆపాడు. బయట బాల్చీ, చెంబు ఉన్నాయి. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్తూ, "నువ్వూ రా" అన్నాడు. నేనూ కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాను. ఒకాయన వచ్చి తుండు ఇచ్చాడు. ఇద్దరం చేతులు తుడుచుకున్నాం. "ఏరా అబ్బీ, మీ ఆవిడ ఎలాగుంది? పిల్లలు చదువుకుంటున్నారా? ఏఁవిటి హొటేలు  పెట్టారట?", అన్నారు. "అవునయ్యా, మీరు హొటేలు పెట్టాక  మొదటిసారి వచ్చారు. కడుపు నిండా తినే వెళ్ళాలి", అన్నాడు అతను. "బయటవాళ్ళకు తెలిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళకు పరువు తక్కువరా. హ హ. సరే, ఇక్కడే వడ్డించు", అన్నాడు బాబాయ్.

ఇద్దరం కూర్చున్నాము. రెండు అరటాకులు వేసి ఇడ్డెనలు వడ్డించసాగింది అతడి భార్య. ఆ కాలంలో ఇడ్లీరేకులు దొరికేవి కాదు, saucer అంత ఉండే పళ్ళాల్లో కానీ, పనస ఆకుల్లో కానీ తయారు చేసేవారు ఇడ్డెనలు. "బాగున్నావా అమ్మా", అని నవ్వుతూ అన్నాడు బాబాయ్. అంతే... ఆ తరువాత ఆవిడ వడ్డిస్తూనే ఉంది, బాబాయ్ తింటూనే ఉన్నాడు. మూడు ఇడ్డెనలకే నాకు కూర్చోలేక నడ్డి విరిగినంత పని అయ్యింది. బాబాయ్ మాత్రం డజన్ల కొద్దీ లాగించాడు. బాబాయ్ ఎక్కువ తినడం నేను ఎప్పుడూ చూడలేదు. "ముందురోజు ఉపవాసం ఉన్నాడనుకున్నా, మరీ ఇంతా?" అనుకుంటున్నాను.

బాబాయ్ మొదటి మూడు ఇడ్డెనలూ తింటుండగా హొటేలు యజమాని ముఖ్యంలో "ఇంత పెద్దాయనకు వడ్డించగలుగుతున్నాం" అనే సంతృప్తిని చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయనకు మన వంట నచ్చింది", అనే సంతోషం చూశాను. ఆ తఱువాత మూడు ఇడ్డెనలకు "పెద్దాయన మాంచి ఆకలి మీద ఉండి మొహమాటం కూడా లేకుండా టింటున్నాడు", అనే చిరునవ్వు చూశాను. ఆ తఱువాతి మూడింటికి "ఒక మనిషి ఇన్ని ఇడ్డెనలు తినగలడా" అనే ఆశ్చర్యం చూశాను. ఆ తరువాతి మూడింటికి, "వాయంతా ఈయనకే సరిపోతోంది, బయటవాళ్ళకి ఎలాగ వడ్డించాలి" అనే కంగారు చూశాను. ఆ తఱువాత మూడింటికి, "ఇన్నీ తిన్నాడు సరే, ఈయన చిల్లిగవ్వగా ఇవ్వడని ఈయన ఊళ్ళొనే చెప్తారు. ఇరువై ఇడ్డెనలకి ముడిసరుకే రెండు రూపాయలు ఉంటుంది", అనే నిట్టూర్పు చూశాను. బాబాయ్ కి మాత్రం ఏమీ పట్టలేదు. ఇడ్డెనలూ, పచ్చడీ జుఱ్ఱేస్తున్నాడు భాగవతంలో బాలకృష్ణుడిలాగా.

అంతా అయ్యింది, ఆయన  లేచి దొడ్లోకి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. నా చేతులు ఆరిపోయాయి, పిండి చేతులపై అట్టగట్టుకుపోయింది. బలంగా రుద్దుకుని కడుక్కుని వెనక్కు వచ్చేసరికి నా జీవితంలో చూస్తాను అనుకోనిది ఒకటి చూశాను. మా బాబాయ్ తుండు నా చేతుల్లో పెట్టి తన సంచిలోంచి ఒక కొత్త వందరూపాయల కాగితం తీశాడు. అది ఇంకా నలగలేదు. అప్పట్లో ఒక రూపాయి అంటే ఇప్పుడు dollarకు సమానం. వడ్డించిన ఆమెను పిలిచి, ఆమెకు చూపిస్తూ "అమ్మాయ్, గోప్ఫగా వండావే ఇడ్డెనలు. ఆ పచ్చడో, అమృతంలాగా ఉందే. ఇదిగో మీ ఆయనకు డబ్బులుస్తిన్నాను. బట్టలు కొనిపించుకో", అన్నాడు. హొటేలు యజమాని, అతడి భార్య, నేను తెల్లబోయి చూస్తున్నాము. బాబాయ్ అతని భుజం తట్టి, "ఒరేయ్ అబ్బీ, నీ ఇంట్లో ఈ అన్నపూర్ణే మహాలక్ష్మి కూడా, చక్కగా చూసుకో. ఉంటాను.", అని నాకేసి చూసి పద అని సైగ చేసి బయల్దేరాడు.

వచ్చేటప్పుడు busలో వచ్చేశాము. దిగి ఇంటికి నడుస్తూ ఉండగా భుజం మీద చెయ్యి వేసి, "ఏరా. cycle కావాలా? ఈ రోజు పొద్దున్న నడిచావు కదా? అంత దూరం నడిచి, ఒక్కోసారి వంతెన పడిపోతే ఏట్లో ఈదుకుంటూ వెళ్ళి నేను పొరుగూరులో బడికి వెళ్ళేవాణ్ణి. ఎక్కువ చదువుకోలేదు అనుకో. cycle ఉండటం మంచిదే. చాలా శ్రమ తగ్గిస్తుంది. విలువ ఉన్న వస్తువు. కొంటాను", అన్నాడు. ఇద్దరం కాళ్ళు కడుక్కుని లోపలకి వెళ్ళాం.

నేను ఎప్పుడూ మా బాబాయ్ ని ప్రశ్నించలేదు, డబ్బు విషయాల్లో అయితే అసలేమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడిగాను, "బాబాయ్, మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా? మరి మూడు రూపాయలు ఇవ్వవలసిన చోట వందరూపాయలు ఎందుకు ఇచ్చారు?", అని అడిగాను. బాబాయ్ గంభీరంగా చూసి, "డబ్బు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది రా నాన్న. ఒకటి అవసరానికి, రెండు సంతృప్తికి. డబ్బును నేను జాగ్రత్త చేసేది అవసరానికి. తాత్కాలికమైన ఆత్రాన్ని అవసరంగా చూపించి చాలా మంది పెద్ద ఖర్చులు పెడుతూ ఉంటారు. నాకు అది చేతకాలేదు. అవసరమైతే ఖర్చు పెడతాను, లేదా సంతృప్తి కోసం ఖర్చు పెడతాను. పొద్దున్న అంత దూరం నడిచి వెళ్ళేసరికి "ఎప్పుడు, ఏమిటి, ఎందుకు అని అడగకుండా అభిమానంగా పిలిచి పీట వేసి భోజనం పెట్టాడు. ఆ సమయంలో ఆ ఇడ్డెనలు నాకు అమృతప్రాయంగా అనిపించాయి. చాలా తృప్తి కలిగింది. పెళ్ళాంపిల్లలు ఉన్నవాడు, వృద్ధిలోకి రావలసినవాడు, బుద్ధిమంతుడు -- వాడికి సాయం చేయడంలో నాకు తృప్తి ఉంది. అందుకే ఇచ్చాను", అని చెప్పి భాగవతం తెరిచి కూర్చున్నాడు. అక్కడే ఉంటే నన్ను చదవమంటాడేమో అని భయపడి వెంటనే బయటకు వచ్చేస్తుంటే, "నాకు సంతృప్తి కలిగితే ఎంతైనా ఇస్తాను. కలగనప్పుడు ఎంత తక్కువైనా ఇవ్వను. ఊసుపోని వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, ఏమనుకుంటే మనకేంటి?", అన్నాడు. "అవును బాబాయ్", అని చెప్పి బయటకు వచ్చేశాను.

అప్పుడు నేను ఆలోచించాను, "ఈ cycle నాకు అవసరమా? తాత్కాలికమైన ఆత్రమా? లేక దీర్ఘకాలిక సంతృప్తా?" అని. ఇప్పటికీ విషయాలూ, వస్తువులూ  మారుతూ వచ్చాయి కానీ అదే ప్రశ్న మనసుని తడుతూ ఉంటుంది. ఈ ప్రశ్న నీకూ ఉపయోగపడచ్చేమోనని ఈ కథ చెప్పాను అంతే."

అని చెప్పాడు రాజు. కిట్టు ఒక చిరునవ్వు నవ్వి, "సాయంత్రం నేనే వంట చేస్తాను నాన్న", అని చెప్పి తన mobile లో taxi వాడికి phone చేసి రావద్దని చెప్పాడు.

Wednesday, July 27, 2011

రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

Wednesday, July 20, 2011

మహాభారతంలో యజోపయజుల కథ

(వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథపర్వంలో ఈ కథ కనబడుతుంది. దీన్ని ఆంగ్ళంలో ఇక్కడ చదువవచ్చును, సంస్కృతంలో ఇక్కడ చదువవచ్చును.)

ద్రోణుడి చేతులో పరాభవం పొందిన ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుడిపైన పగ తీర్చుకోవాలనే తపనతో దానికి కావలసిన యోగబలం పొందడం కోసం యజ్ఞయాగాదులు తెలిసిన గొప్ప బ్రాహ్మణుల కోసం వెదుకసాగాడు. యమునా, గంగాతీరాలలో వెదుకుతూ ఉండగా ఒకానొక ఆశ్రమంలో కశ్యపుడి వంశంలో జన్మించిన యజుడు, ఉపయజుడు అనే ఇద్దరు బ్రాహ్మలను చూశాడు. వారు ఇద్దరూ ఎంతో గొప్ప తపోబలం కలిగినవారని తెలుసుకుని వారికి సేవలు చేయనారంభించాడు. వారిరువురిలో తమ్ముడే గొప్పవాడని నిర్ణయించుకుని ఉపయజుడితో, "ద్రోణుడు నాకు కలుగజేసిన అవమానానికి ప్రతీకారంగా అతడిని వధించగలిగే ఒక పుత్రుడు నాకు కలిగే విధంగా ఏమైనా యజ్ఞం చేస్తే మీకు 10,000 గోవులను ఇస్తాను", అన్నాడు. మహాజ్ఞాని అయిన ఉపయజుడు "ద్రుపద, ఇటువంటి చెడు ఉద్దేశాలతో నేను పవిత్రమైన యజ్ఞాలను చేయలేను", అన్నాడు.

అయినా పట్టు వదలకుండా ద్రుపదుడు ఉపయజుణ్ణి మఱొక సంవత్సరం సేవిస్తాడు. అప్పుడు ఉపయజుడు అతడితో, "ద్రుపద, ఒక రోజు అడవిలో సంచరిస్తుండగా నా అన్న యజుడు మలినమయమైన నేల పైన రాలిన ఒక పండుని తీసుకుని సేవించడం నేను చూశాను. జ్ఞానం కలిగినవాడై కూడా అందులో అతనికి ఏమీ తప్పు తోచలేదు. ఒక చోట మలినాన్ని పట్టించుకోనివాడు, మిగతా అన్ని చోట్లా పట్టించుకుంటాడు అని అనుకోలేము. ఇంతకు ముందు మా గురువు గారి వద్దనుండగా అతడు గురుకులంలోని మిగతావారు విడిచిపెట్టిన తినుబండారాలను తినడం నేను చూశాను. అతడికి నచ్చని తిండి గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. తిండి పట్ల ఇంత యావ ఉన్నవాడికి తప్పక ఐహికమైన వాంఛలు బలీయమైనవయి ఉంటాయి. కనుక నీకు కావలసిన యజ్ఞం అతడు చేస్తాడు అని అనిపిస్తోంది", అన్నాడు.

ఉపయజుని అంత గొప్పవాడు కాడని అనుకున్నా, ద్రుపదుడు యజుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు, "గురువర్యా, మీరు నా కోసం ఒక యజ్ఞం చేసినట్టైతే మీకు 80,000 గోవులని ఇస్తాను. ద్రోణుడు చేసిన అవమానం నన్ను దహించివేస్తోంది. బ్రహ్మాస్త్రం సంపాదించిన అతడు మఱో పరశురాముని వలే తన బ్రహ్మతేజంతో క్షత్రియుల నాశనాన్ని తలబెడుతున్నాడు. నా దగ్గర క్షత్రియశక్తి ఉన్నప్పటికీ, అతడిని అడ్డుకొనే బ్రహ్మతేజం లేదు. కానీ, మీరు అతని కంటే గొప్ప బ్రహ్మజ్ఞాని. మీరు తప్పక ఈ యజ్ఞాన్ని జరిపి నాకు బ్రహ్మశక్తిని కూడా జత చేయగలరు.". యజుడు యజ్ఞం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

యజుడు ఈ యజ్ఞం చాలా కష్టమైనది అని గ్రహించి, ఉపయజుడి సహాయం కూడా అడుగుతాడు. ఉపయజుడు ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. వారిద్దరూ కలిసి జరిపిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వారికి నామకరణం కూడా యజుడే చేశాడు. (నిజానికి, ద్రౌపది నల్లగా ఉండటం చేత ఆమెకు "కృష్ణా" అనే పేరు పెట్టారు. కానీ, ద్రుపద రాజు కూతురు కావడం చేత ఆమెను ఎక్కువగా ద్రౌపది అని సంబోధించడం చూస్తున్నాము.) ద్రుపదుడు ఎంతో సంతోషించి యజుడికి తాను మాటిచ్చినట్టుగా అనేక గోవులను దానం చేసి సత్కరించాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్ళంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది.

Monday, July 18, 2011

జంతువు - దైవం

ఇటీవల ఒక గూగుల్ సమూహంలో ఒక కథ చదివాను. ఇది R.K. Narayan రచించిన A tiger of Malgudi అనే పుస్తకం లోనిదని చెప్పారు. ఆ కథ నాలో నిద్రాణమైన ప్రశ్నలని కొన్నింటిని మేలుకొల్పింది. ఆ కథ నేను అసలు పుస్తకం నుండి చదవలేదు కనుక నా మాటల్లో, నాకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. మూలకథకుని మాటల్లో వింటే ఇంకా బాగుంటుందనడంలో ఏమీ సందేహం లేదు.

ఒక పులి ఒక సాధువుని కలిసిందిట. ఆ సాధువు పులికి దేవుడి గురించి బోధ చేశాడట. "దేవుడంటే అద్వితీయమైన శక్తి కలవాడు, ఆయన కనుసన్నలలోనే మనమందరం మెలుగుతున్నాము, ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది", ఇలాగ కొంచెం లోతుగా వర్ణించి చెప్పాడట. ఆ పులికి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆశ్చర్యం నిండిన కన్నులతో చూడసాగిందట. అలాగ కాసేపు వర్ణించిన తరువాత ఆ సాధువు, పులిని "నేను చెప్పినదాన్ని బట్టి దేవుడు ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు?", అని అడిగాడట. అప్పుడు ఆ పులి, "దేవుడు చాలా పెద్ద ఆకారం కలిగిన పులి. ఆయన తోకతో భూమిని మొత్తం చుట్టేయగలడు. ఆయన ఒక్క చూపు చూస్తే అన్ని జంతువులూ భయపడిపోతాయి.", అంటూ చెప్పుకొచ్చిందట. కథ అంతే.

కథలోని నీతి ఏమిటయ్యా అంటే, మనుషులు ఏ విధంగా దేవుడు మనిషే అయ్యి ఉంటాడు అనుకుంటున్నారో, అదే విధంగా మిగతా జీవులు కూడా దేవుడిని నమ్మితే తమ లాగే ఉంటాడు అనుకుంటాయి/అనుకోవాలి కదా? సరే, ఇప్పుడు ఇంకొక కథ విందాం. దీనికి ఆధారం నాకు తెలియదు కానీ, ఇది చైనా/భారతదేశాలలో ప్రచారంలో ఉన్న కథే.

ఒక రోజు ఒక మహర్షి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా ఒక గాయపడిన ఎలుక మూలుగుతూ కనబడిందట. ఆ మహర్షి ఆ ఎలుకని చూసి జాలిపడి, తనతో తీసుకెళ్ళి పెంచుకోసాగాడట. మహర్షికి ఆ ఎలుక అంటే విపరీతమైన అభిమానం ఏర్పడి, ఆ ఎలుకను తన కూతురుగా భావించసాగాడు. ఒకానొక రోజు ఆ మహర్షికి ఎలుక పెళ్ళీడుకి వచ్చింది అనిపించింది. ఆ ఎలుకకు తగిన భర్త కోసం అన్వేషించసాగాడు.

ఒక రోజు ఉదయం స్నానం తరువాత సూర్యుడికి నమస్కరించుకుంటూండగా ఆయనకు, "సూర్యుడి కంటే అందగాడు, సులక్షణసంపన్నుడు ఎవరుంటారు? ఈతడే నాకు అల్లుడు కాదగ్గవాడు", అనుకుని వెంటనే తన తపోబలంతో సూర్యుణ్ణి ఆహ్వానిస్తాడు. సూర్యుడు కంగారుగా ప్రత్యక్షమయ్యి విషయం కనుక్కుంటాడు. కనుక్కున్నాక ఖంగు తిని, "ఇదెక్కడి చిక్కురా బాబు, మరీ సూర్యుడి భార్య ఎలుక అంటే ఎలాగ?" అనుకుంటాడు. కొంచెం ఆలోచించి, "మహర్షీ, నాకు నీ కుమార్తెను పెళ్ళి చేసుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు కానీ, ఒక్క సారి ఆలోచించు. నేను ఎంత తేజోసంపన్నుణ్ణైనా, మబ్బు వస్తే మసిబారిపోతాను. నా కంటే మబ్బులే శక్తివంతాలు. అందుచేత నువ్వు వరుణుణ్ణి సంప్రతించు", అని అంతర్ధానమవుతాడు.

మహర్షి ఆయన తపోబలాన్ని మళ్ళీ ఉపయోగించి ఈ సారి వరుణుణ్ణి రప్పిస్తాడు. ఆయన కూడా కాసేపు ఆలోచించి, "మహర్షీ, నీకు అల్లుడవ్వడం నా అదృష్టమే. కానీ, నీకు అల్లుడు కాదగిన వాడు వాయువు. ఎందుకంటే నేను ఎంత బలవంతుణ్ణైనా స్వతంత్రుణ్ణి కాను. వాయువు నన్ను ఎటు నడిపిస్తే అటు పోతాను. అందుచేత నువ్వు వాయువుని అల్లుణ్ణి చేసుకుంటే బాగుంటుంది", అంటాడు. మహర్షికి ఉన్నపాటుగా హనుమంతుడు, భీముడు మొదలైనవారి బలానికి మూలమైన వాయువు పట్ల మక్కువ పెరిగుతుంది.

ఈ సారి వాయువుని ఆహ్వానిస్తాడు. వాయువు ప్రత్యక్షమయ్యి, కాసేపు తలగోక్కుని, "మహర్షీ, నాకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకోవాలనే ఉంది", అనగానే మహర్షి చిఱాకు పడుతూ, "మఱి ఇంకేమిటి?" అంటాడు. వాయువు, "నేను ఎంత బలవంతుణ్ణైనా కొండలను కదిలించగలనా? అందుకే కదా అవి అచలాలైనాయి? అందుచేత నీకు తగిన అల్లుడు హిమవంతుడని నా అభిప్రాయం.", అంటాడు. ఆలోచిస్తే మహర్షికి అదీ నిజమేననిపించి వాయువుకు సెలవు ఇస్తాడు.

సరే, ఈ సారి ఏదేమైనా సరే హిమవంతుడితో ఎలుకకు పెళ్ళి చేద్దామని నిర్ణయించుకుని హిమవంతుణ్ణి పిలుస్తాడు. ఆయన ఆలోచించి "మహర్షీ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ పిలుపు విని దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు అంటే వారందరికంటే నీవే బలవంతుడవని విదితమౌతోంది. నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం నా భాగ్యం గా భావిస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి అని నువ్వు అనుకోవడం నా అదృష్టం. ఐతే నీకు ఒక నిజం చెప్పాలి. నేను ఎంత బలవంతుణ్ణైనా నన్ను తొలిచేయగల సామర్థ్యం ఒక్క ఎలుకకే ఉంది. అందుచేత నీ మూషికానికి మఱొక మూషికాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుంది", అని మాయమౌతాడు. ఇది విన్న మహర్షికి ఒక్క సారి వివేకం మేల్కొని, "ఏమిటి నా ఈ ప్రయాస, ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు ఇంత ప్రాకులాడాను?", అని విచారించి, ఆ ఎలుకని మఱొక ఎలుకకు ఇచ్చి వివాహం చేస్తాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే మనకు ప్రేమ ఉంది కదా అని, మన దృష్టిలో శ్రేష్ఠమైనదాన్ని మనకు ప్రియమైనవారికి తగిలించాలని చూడకూడదు, వారికి ఏది సరిపోతుందో, నచ్చుతుందో అదే ఇవ్వాలి. అంతర్లీనంగా ఉన్న మఱొక నీతి ఏమిటంటే ఏ జీవి గొప్పదనం దానిది. ఏదీ మఱొక దాన్ని కంటే సంపూర్ణంగా ఉన్నతం కాదు.

మొదటి కథకి రెండొ కథకి మధ్యన పెద్ద పొంతన ఏమీ లేదు కానీ, మనిషి జంతువు దృష్ట్యా కూడా ఒక్కసారి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడేమోననే నా అభిప్రాయానికి ఇవి బలాన్ని చేకూరుస్తాయి. సకలచరాచరసృష్టిలో పరమాత్ముడు లేని విషయం ఏముంది? అలాంటప్పుడు ఒక జీవి ఎక్కువ, మఱొక జీవి తక్కువ అనుకుంటే మనకు దైవం అర్థం కానట్టే కదా?

Thursday, June 30, 2011

హాస్యధారావాహిక - అమృతం

ఈ మధ్యన భారతీయులకు పరదేశీ హాస్యధారావాహికల మీద దృష్టి మళ్ళింది. Friends, Two and a half men, Big bang theory, How I met your mother మొదలైన ధారావాహికల గురించి ప్రవాసభారతీయులు మాట్లాడుకోవడం తరచూ నేను వింటుంటాను. నేను చూసిన రెండు మూడు ధారావాహికలు నిజంగానే హాస్యభరితంగా ఉన్నాయి. కాకపోతే వీటితో నాకు రెండు చిరాకులు ఉన్నాయి. మొదటిది అశ్లీలత (కొంచెం కూడా విలువలని చూపించకపోవడం) ఐతే రెండోది బలవంతంగా నవ్వించాలనుకోవడం (తెర వెనుక నవ్వులు, చప్పట్లు గుప్పించడం). అయినప్పటికీ వీటిల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. అది నిజంగా అభినందనీయం.

పశ్చిమదేశాలు ఏం చేస్తే అది అనుసరించడం అలవాటైపోయిన మన దేశంలో అలాంటి చిత్రాలు ఊపందుకున్నాయి కానీ, నాకు తెలిసి ధారావాహికలు మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఉత్తరభారతదేశంలో Laughter challenge పేరిట హాస్యాన్ని పండించగలిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఆ తరువాత అదే వృత్తిగా ఎంచుకొని విజయం సాధించారు. వాళ్ళల్లో ప్రముఖుడు రాజూ శ్రీవాస్తవ్ చాలా కీర్తి గడించాడు. దక్షిణాదిలో తమిళులని చూస్తే, వాళ్ళూ చాలా హాస్యభరితమైన ధారావాహికను సృష్టించగలిగారు. "లొల్లు సభ" పేరితో వారు చలచిత్రాలకు వ్యంగ్యరూపాలను చిత్రించి ప్రేక్షకుల మెప్పు పొందారు. కాకపోతే ఈ రెండిట్లో కూడా ఎంతో కొంత అశ్లీలత, వ్యంగ్యం ఉన్నాయి.

ప్రపంచం అంతా ముగ్గులు వేసుకున్నాక లేస్తూ ఆవలించడం అలవాటైపోయిన కొత్త తరం తెలుగువాళ్ళకు ఇలాంటిది ఏముందా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి లేకుండా ఎంతో చక్కటి అభిరుచి ఉన్న గుణ్ణం గంగరాజు గారు (Just Yellow అనే పతాకంపై) అమృతం హాస్యధారావాహికను మొదలుపెట్టారు. ఈయన ప్రమేయం ఉన్న చిత్రాలు అన్నీ నాకు నచ్చినవే -- Little soldiers, ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది మొదలైనవన్నీ చక్కటి చిత్రాలు. అమృతంలో ఎక్కువ అంకాలు ఎవరు దర్శకత్వం వహించారో తెలియదు కానీ, మొదట్లో కొన్ని చంద్రశేఖర్ ఏలేటి (ఐతే, అనుకోకుండా ఒక రోజు చిత్రాలకు దర్శకుడు) చివరిలో చాలా భాగాలు హర్షవర్ధన్ (కొన్నాళ్ళు అమృతం పాత్రను పోషించిన చక్కని నటుడు), వాసు ఇంటూరి (సర్వం పాత్రతో సంచలనం సృష్టించిన మరో చక్కని నటుడు) దర్శకత్వం వహించారు. చాలా అంకాలకు రచన చేసింది గుణ్ణం గంగరాజు గారే!

వివిధదశల్లో అమృతం పాత్రను ముగ్గురు నటులు పోషించారు -- శివాజీ రాజా, senior నరేశ్, హర్షవర్ధన్. అలాగే సంజీవని పాత్రను కూడా ముగ్గురు (?) నటులు పోషించారు (ఝాన్సీ, ఉమా మహంతి, సుప్రజ). ఆంజినేలు, శాంతలుగా గుండు హనుమంతురావ్, రాగిణి అద్భుతంగా నటించారు. అమృతరావు మరదలు పద్దుగా స్వాతి, మామగారిగా కనకాల దేవదాస్ నటించారు. అప్పాజీ గా శివన్నారాయన నూటికి నూటొక్కపాళ్ళు న్యాయం చేశారంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోతూ ఉండే పాత్రలు చేసినవాళ్ళు (kidnapper గా చేసిన వ్యక్తి, కిరాణా కొట్లో పనిపిల్లగా చేసిన అమ్మాయి, రాధ-మధులో పద్మశ్రీకి సహాయకుడిగా చేసిన అబ్బాయి -- వీళ్ళ పేర్లు తెలియవు కానీ...) కూడా బాగా చేశారు.

ప్రపంచంలో ఎంతో ఖర్చుపెట్టి తీసిన, పేరు పొందిన హాస్యధారావాహికలు కొన్ని మాత్రమే 300 అంకాలు (episodes) పూర్తి చేసుకున్నాయి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో తీసిన అమృతం ధారావాహిక 313 అంకాల పాటు నడిచింది. ఈ అంకాలను ఒక్కొక్కటిగా Just Yellow పతాకం వారు YouTube లో చేరుస్తున్నారు. దాదాపు అన్ని అంకాలు ఎంతో కొత్తదనంతో, నిజాయతీతో ఉంటాయి. ఈ ధారావాహికలో నాకు నచ్చిన విషయాలు:
  • ప్రతి  frameలోనూ హాస్యాన్ని బలవంతంగా పుట్టించడానికి వ్యంగ్యాన్ని వాడలేదు. నిజానికి ఈ ధారావాహిక మొత్తంలో ఎవ్వరూ ఎవరినీ అనవసరంగా అవమానించరు/కించపరచరు.
  • అశ్లీలత కొంచెమంటే కొంచెం కూడా లేదు! తాగుడూ, జూదం, ధూమపానం వంటివి కూడా లేవు. పిల్లలకు సంకోచం లేకుండా చూపించవచ్చును.
  • తెలుగుదనం -- దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ధారావాహికలో ఎక్కడికక్కడ చక్కటి తెలుగుపదాలు వినబడుతూ ఉంటాయి. అక్కడక్కడా సంస్కృతసమాసాలను కూడా దంచారు. ఇక తెలుగు, ఆంగ్ళం కలిపి ప్రాస వ్రాయడం ఆ రచయితకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. "నేరచరిత్రను నెరేట్ చేస్తాను", "కొరిమి దెయ్యంలా courier service అన్నావ్" లాంటి ప్రయాసప్రాసలు భలేగా నవ్విస్తాయి. నిజానికి ఒక వ్యాపారాత్మకమైన దూరదర్శనస్రవంతి (TV channel) లో episode ని అంకం అని పిలిచిన ఏకైక ధారావాహిక ఇదేనేమో!
  • పాత్రధారులు -- అప్పాజీ, అమృతం, ఆంజినేలు, శాంత, సంజీవిని, సర్వం -- ఎవరికి వారే అద్భుతంగా నటించారు. వీళ్ళకు చలనచిత్రాలలో అవకాశాలు లేకపోవడం చలనచిత్రసీమ ఎంత దుస్థితిలో ఉందో తెలుపుతోంది. అందరి ఉచ్చారణ చక్కగా ఉంది. ఎక్కడా వంక పెట్టడానికి లేదు.
  • ఒక ఏడాదంతా హాయిగా నవ్వుకునేటన్ని అంకాలు ఉన్నాయి. మరుసటి ఏడాది మళ్ళీ చూస్తే మళ్ళీ నవ్వొస్తాయి :)

మొదట్లో ఈ ధారావాహికకు ఎంతో ఆకర్షనను కలిగించినది మాత్రం రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిలో ఆంగ్ళ, తెలుగు పదాలను చక్కగా కలిపి - హాస్యం, తేలికదనం, కవిత్వం, కొత్తదనం కలిపి వ్రాసిన "ఒరేయ్ ఆంజినేలు" అనే పాట తెలియని మధ్యతరగతి తెలుగు వాడుండడేమో.  అది స్వరపరిచి, వినిపించిన కళ్యానీ మాలిక్ కూడా చక్కటి ప్రావిణ్యం కనబరిచారు. పాటను క్రింద వ్రాస్తున్నాను. ఇలాగ వ్రాసేవరకూ ఈ పాటకు రెండు చరణాలు ఉన్నాయని అనుకోలేదు.

హయ్యోలు, హమ్మోలు -- ఇంతేనా బ్రతుకు హు హు హు
ఆహాలు, ఓహోలు -- ఉంటాయి వెతుకు హ హ హ
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోల్
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయొడింతో ఐపోయే గాయాలే మనకు గండాలు

ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవ ట్రబులు?
హల్లో హవ్డూయుడూ అంటూ అంటోంది అంతే నీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా?
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా?
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు,
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెనుతుఫానసలు?

ఒరేయ్ ఆంజినేలు తెగ ఆయాసపదిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీమార్!

ఈ పాటకు వెనక వచ్చే రేఖాచిత్రాలు (sketches) కూడా చాలా హాస్యభరితంగా, కొత్తగా ఉన్నాయి. "చెంచాడు భవసాగరాలు" అనడం సిరివెన్నెల చేసిన ప్రయోగం చాలా అభినందనీయం. అన్ని కష్టాలనీ రెండు మాటల్లో తేల్చి  పారేశారు. ఏదేమైనా ఈ ధారావాహిక ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సినది!

Sunday, June 12, 2011

విని విని విసుగెత్తిన స్టేట్మెంట్లు

చలనచిత్రాలు సామాన్యుడి మనోరంజనం కోసం, కళాకారుల సంతృప్తి/జీవనోపాధి కోసం అన్నది పాఠ్యపుస్తకాలలోని విషయం. ఆ పుస్తకాలని కాసేపు పక్కన పెట్టి, కళ్ళ ఎదురుగా జరుగుతున్న వింతలని చూస్తే  అసలు విషయం చాలా భిన్నంగా ఉంటుంది. modern  భాషలో చెప్పాలంటే cinema  సామాన్యుడికి ఒక వ్యసనం, కళాకారులుగా చలామణి అవుతున్న వారి డబ్బు దాహం తీర్చే ఒక సాధనం. ఇది తెలుసుకోవడానికి పదో తరగతిలో ఉత్తీర్ణత కూడా అనవసరం.

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు గారు "చిత్రం చూస్తున్నప్పుడు ఒక్క సారైనా ప్రేక్షకుడి కంట్లో నీరు వస్తే ఆ చిత్రం విజయాన్ని సాధిస్తుంది" అని అన్నారని ఎక్కడో విన్నాను. అందులో కొంత వాస్తవం ఉంది అనే నా నమ్మకం. ఉదాహరణకి కీ.శే. జంధ్యాల చిత్రాలు చూస్తే ఆద్యంతం హాస్యరసం ప్రవహిస్తున్నా, మధ్యలో ఏదో ఒక్క చోట ప్రేక్షకుడికి కళ్ళు చమర్చేలాగా ఒక సన్నివేశాన్ని ఉంచేవారు. చంటబ్బాయ్ లో చిరంజీవి బాల్యాన్ని గురించి వర్ణించినా, ఆహా నా పెళ్ళంట లో రాజేంద్ర ప్రసాద్ పక్కింటి కుటుంబంతో తనకు తల్లి లేకపోవడాన్ని గురించి చెప్పి బాధపడినా, అదే చిత్రం చిట్టచిగురున నూతన్ ప్రసాద్ తన కొడుకుత "ప్రేమలో గెలవలేదని ఎటువంట అఘాయిత్యం చేసుకోవద్దు", అని చెప్పినా, వివాహ భోజనంబు చిత్రంలో హరీష్ తనలో ప్రేమ వలన కలిగిన మార్పులను తన అన్నయ్యతో చెప్పుకు బాధపడినా -- అవన్నీ ఆ చిత్రాలకు పట్టుకొమ్మలైన సన్నివేశాలు కాకపోవచ్చును కానీ, జరుగుతున్న హాస్యం నడుమ కూడా ఏదో ఒక ఆవేదన ఉంటుంది, అటువంటి వ్యక్తులను మనం అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశ్యం కనబడుతుంది. అలాగే, ఎంత బాధ ఉన్నా నవ్వుతూ ఉండాలనే సందేశం కూడా ఉంది.

అంత బాధ్యతగా చిత్రాలు తీసే రోజులు పోయాయి అని ఈ రోజు నేను దండోరా వెయ్యాల్సిన పని లేదు. ఈ దర్శకులు, నిర్మాతలూ ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి, వాళ్ళను వాళ్ళే సమర్థించుకుని మోసం చేసుకుంటున్నారు అనిపిస్తోంది. ఈ భావదౌర్భాగ్యానికి కారణం ప్రేక్షకుడా, కళావ్యాపారా లేక కళాకారులా అన్నది నాకూ తెలియదు కానీ, కళను ఆస్వాదించి సంతృప్తిని పొందే పరిస్థితి నుండి "మన వర్గం నటుడో, దర్శకుడో  కళ కంటే గొప్పవాడు" అనే వ్యసనానికి ప్రేక్షకులు, మంచి చిత్రాలను తీసి కళను ప్రోత్సహించి, కాస్త డబ్బు కూడా సంపాదించుకుందాం అనే పరిస్థితి నుండి "కళ? అమ్మో ప్రేక్షకులు చూడరు. ఫలానా చిత్రంలా మాంచి mass చిత్రమైతే బాగుంటుంది." అనే దుస్థితికి నిర్మాతలూ, దర్శకులు వచ్చేసారు.

ఈ ఉపోద్ఘాతం ఇంతటితో ఆపి, అసలు విషయం దగ్గరకు వస్తే -- ఈ జరుగుతున్న circus  మధ్యలో వినిపించే కొన్ని వ్యాఖ్యలు వింటూ ఉంటె "అసలు వీడు మాట్లాడేదానికి అర్థం ఉందా?" అనే ప్రశ్న నాకు కలుగుతోంది. అలాంటివి కొన్ని చెప్దామని నా ప్రయత్నం.

శంకరాభరణం mass  ఆ, class  ఆ?

మొహం పగలగోట్టాలనిపిస్తుంది ఈ మాట అన్న దర్శకులని. శంకరాభరణం class ఏ అంటాను. పండితులని, పామరులని ఒక త్రాటిపై నిలుపగలిగింది అంటే దాని వెనుక ఒక సిద్ధాంతం ఉంది. వారిద్దరిలోనూ ఉన్న వివేకాన్ని మేల్కొలపడమే ఆ చిత్రవిజయానికి రహస్యం. రిక్షావాడు "శంకరా, నాదశరీరాపరా" అని పాడాడు అంటే వాడికి దాని అర్థం తెలిసి కాదు, ఆ సందర్భాన్ని అనుభవించగలిగాడు అని. కథలో ప్రతీ పాత్రనీ హృద్యంగా చెప్పడం అంటే అదే.

రెండు రుమ్మాళ్ళని పైనా కిందా తొడిగి ఆడపిల్లల చేత అర్థనగ్న ప్రదర్శనలను చేయించి, వాళ్ళు తీసే ఆణాకాణీ చిత్రాలకి శంకరాభరణం చిత్రంతో పోలిక చెప్పే సంకుచితమతులకి "పౌండ్రక విశ్వనాథ్" అనే బిరుదు ప్రకటించాల్సిందిగా మన నిద్రపోతున్న ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.

కథను అనుసరించి అవసరమైతే వస్త్రాలను విసర్జిస్తాను.

నీకు అసత్య దోషం అంటదు కుమారీ!  మాకు ఒక దొంగసాకు (కట్టుకథ) చెప్తున్నావు. ఆ కథను అడ్డుపెట్టుకుని (అనుసరించి) వస్త్రసన్యాసం చేస్తున్నావు. నిజమే.

అమ్మాయ్! నువ్వు ఏ మందులో మింగి కండ పట్టించుకుని (అదే, కండబలిసి) వచ్చింది ఎందుకో మా అందరికీ తెలుసునమ్మా. నువ్వు చేసే అభినయానికి అంగుళం అవకాశం లేని ముష్టి పాత్రలకి ఎంత అవసరమో, ఏమి అవసరమో మాకు తెలుసును. మొదట్లో కాస్త ఒళ్ళు దాచుకున్నా రెండు మూడు అవకాశాలు రాగానే, లేదా పోగానే నువ్వేం చేస్తావో మాకు తెలియదా? నాకు అన్నప్రాసన అయినప్పటి విజయశాంతి దగ్గరనుండి నేటి తమన్నా వరకు అందరూ చేసిందే నువ్వూ చేస్తున్నావు.

డబ్బు చాలా చెడ్డదిలే పాపా! చిన్నప్పుడు దేశాన్ని ఉద్ధరిద్దామనుకుని ఎన్నో ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అమెరిక వచ్చి చద్దికూడు తింటున్న నాలాంటి వాళ్లకి అది ఇంకా బాగా తెలుసును.

ఈ పాత్ర మా నాయకుడు తప్ప వేరేవాడు చెయ్యలేడు.

ఓసోస్! రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ఆంధ్రులందరూ నమస్కారం చేసుకున్న కీ. శే. ఎం. టి. ఆర్. కూడా ఒప్పుకోవలసిన సత్యం ఏమిటంటే రామానంద్ సాగర్ రామాయణంలో రాముడు, బీ. ఆర్. చోప్రా మహాభారతంలో కృష్ణుడు ఏంటో అద్భుతంగా కుదిరారు అని. మరి నీ బచ్చాగాడు చేసిన దగుల్బాజీ పాత్రకు వేరే ఎవడూ దొరకడా? సముద్రాన్ని వదిలేసి, దొడ్లో నీటి గుంటలో చేపలు పడితే దొరికిన చెపే అద్భుతంగా అనిపిస్తుందిరా అల్పసంతోషి.

పాత్రకు తగ్గ నాయకుడిని వెతుక్కోవడం అంటే విశ్వనాథ్ ని చూడు. నలభై ఏళ్ళు పైబడిన సోమయాజులని తీసుకొచ్చి కథానాయకుడు అంటే అందరూ నివ్వెరపోయారు/నవ్వి పోయారు. ఆ పాత్రకు నీ యువ-నవ-హీరో సరిపోతాడ? ఒక గర్విష్టి, అహంభావి అయిన పాత్రను పోషించే కళాపిపాస లేని, image -చట్రం లో చిక్కుకుపోయిన మన నటులు సిగ్గుపడే లాగా మమ్ముట్టి వచ్చి స్వాతికిరణంలో నటించి, తన సంభాషణలను తనే చెప్పుకున్నది గమనించి అప్పుడు మాట్లాడు.

ఈ చిత్రం చరిత్రని తిరగ వ్రాస్తుంది.

నిజమే. ఒక్క మగాడు, బిగ్ బాస్, మృగరాజు, శక్తి, పలనాటి బ్రహ్మనాయుడు, పులి -- అన్ని చిత్రాలు చరిత్రను తిరగ వ్రాసాయి. ఆఖరి పుటలో ఆఖరి (తిరగ)  స్థానానికి ఇంత పోటీ ఉంటుంది అని చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీసిన కీ. శే. కే. వీ. రెడ్డి ఆనాడు అనుకుని ఉండరు.

ఫలానా బాబు career లోనే ఇది "the best film" అవుతుంది.

అవునవును. ఖలేజ మహేష్ బాబుకు, పులి పవన్ కళ్యాణ్ కి, బద్రీనాథ్ అర్జున్ కి, శక్తి ఎం. టీ. ఆర్ కి. - బాగుందామ్మా! ఖర్చుపై ఉన్న శ్రద్ధ script  పైన ఉండదుగా. అందుకే "the భ్రష్టు films" నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన సంగీతానికి మంచి స్పందన లభించింది.

ఎక్కడ? ఎవరు విన్నారు అసలు? హిందీ/తమిళ్ చిత్రాలనుండి కొట్టుకొచ్చిన నాలుగు బాణీలకి, కవులకు స్వేఛ్ఛనివ్వకుండా బలవంతంగా పదాలు ఇరికించి విడుదల చేసిన నీ album ఎవరు బాబూ విన్నది? చిన్నప్పుడు పాఠశాలలో జనగణమన పాడినప్పుడు కూడా నీ సంగీతం విన్నంత రివాజుగా అనిపించలేదు. చీమల గుండె సవ్వడిని చూడటానికి వాడే stethoscope  వాడినా వినపడని స్పందన నీకు మాత్రమె వినిపించిందంటే నువ్వు అసాధ్యుడవే.

కథ కొత్తది అని చెప్పను. కానీ, treatment కొత్తగా ఉంటుంది.

ఇప్పుడు కొంచెం serious. నేను Utah కి వచ్చినప్పుడు మా professor నాకు ఒక project  చెప్పారు. ప్రపంచంలో ఉన్న చలనచిత్రాలన్నీ తీసుకొచ్చి, వాటికున్న పీచు, తొక్క తీసేస్తే మిగిలే గుజ్జులు కేవలం 24  మాత్రమె ఉన్నాయి అని ఎవరో ఒక శాస్త్రవేత్త నిరూపించాడట. నిజమే, ఎన్ని కథలని సృష్టించేస్తాము? (నేను చెయ్యాల్సిన పని ఏమిటయ్యా అంటే చిత్రానికి వచ్చిన వ్యాఖ్యానం (review) ఇస్తే, దాన్ని బట్టి ఆ చిత్రం ఏ గుజ్జుని ఆధారంగా చేసినదో చెప్పే యంత్రాన్ని తయారుచెయ్యడం. project  నచ్చింది కానీ, ఇందులో శాస్త్రాధ్యయనం ఏముందిలే అని వేరే project తీసుకున్నాను.)

మన కర్నాటక సంగీతంలో రాగాలు కేవలం వందలలోనే ఉన్నాయి. హిందుస్తానీ కలిపి వెయ్యి అనుకుందాం. మరి వీటిని అనుసరించి అన్నమాచార్యుడు, పురందర దాసు, త్యాగరాజు మొదలైన వారి స్వరపరిచిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి? వేలకు వేలు. పాట పాటకు ఎంత వైవిధ్యం? ఒక్కో పాటకూ ఎంత పరిపూర్ణత, అస్తిత్వం? మన మహాభారతంలో ఎన్ని వేల కథలు ఉన్నాయి? అదంతా చదవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే విషయం అదే అయినా, చెప్పే విధానంలో క్రొత్తదనం ఉంటె బాగుంటుంది అని.

గొప్ప విషయాలతో వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే వాటిని అడ్డు పెట్టుకుని చాలా సులువుగా వెధవ పనులు చేసేయ్యచ్చును. ఆది శంకరుడు "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు, ఎవడో భూటకసన్యాసి "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు. పదాలు అవే, మనసులో భావం, అంటున్న ఆత్మ స్థితి వేరు. ఆది శంకరుడికి ఒక త్రాగుబోతు ఎదురయితే "నాయినా, ఇది చెడ్డ అలవాటు, మానుకోరా!" అని చెప్పారట ఆయన. దానికి వాడు, "మీ శివుడు త్రాగితే లేనిది నేను త్రాగితే వచ్చిందా?" అని అడిగితె, ఆయన వెంటనే కొంచెం విషం ఇచ్చి, "శివుడు గరళం కూడా త్రాగాడు. ఇది నువ్వు త్రాగు!" అన్నారట. ఉన్న విషయంలో తనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమె గ్రహించడం మనిషి నైజం. దీన్నే అవకాశవాదం అని కొంతమంది అంటూ ఉంటారు.

"మై నే ప్యార్ కియా" కి "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "జో జీతా వోహి సికందర్" కి "తమ్ముడు" కి మధ్యన ఉన్నది స్ఫూర్తి అంటే నేను ఒప్పుకోలేను. అవి మక్కీకి మక్కీ దింపేసిన చిత్రాలు. ఆ మధ్యన "గుడుంబా శంకర్" సినిమానే  "ఆట"గా తీసారని ఒక నిర్మాత ఫిర్యాదు చేసారు. మరి గుడుంబా శంకర్ చిత్రానికి వెనుకన ఎన్నెన్ని సినిమాలు ఉన్నాయో ఆయనే చెప్పాలి. బిందాస్, జయీభవ, ఆర్య-2, don శీను  మొదలైన చిత్రాలన్నీ నా కళ్ళకు ఒకటే కథ లాగా కనిపించాయి. ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర - ఇలాగ చెప్పుకుంటూ పొతే కోకొల్లలు. ఈ మధ్యన విజయవంతమైన రవి తేజ చిత్రాలు చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి ఇంత దరిద్రంగా తయారైందా అనిపిస్తోంది. అన్నీ ఒకే కథ లాగా అనిపించాయి.  సరే ఇంకా శక్తి, బద్రీనాథ్ ల సంగతి అందరూ చెప్పుకుంటూ ఉన్నదే. కోడి రామకృష్ణ శివ చిత్రం చూసి శత్రువు చిత్రం తీసారట. ఆ రెండు చిత్రాలూ నేను చూసాన. శత్రువు చిత్రం చూసినప్పుడు నాకు శివ చిత్రం గుర్తు రాలేదు. స్ఫూర్తి అంటే ఇలాగ ఉండాలి ఆయన చెప్పడం నేను విన్నాను, ఏకీభవిస్తాను.

అయ్యా దర్శకులూ! ఒక సారి మన దక్షిణాదిన కే. బాలచందర్ ని చూడండి. వంద చిత్రాలు తీసారు. కథకథకీ  వైవిధ్యం ఉంది. మధ్యతరగతి ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసిన చిత్రాలు మనందరికీ గర్వకారణం. బలమైన కథని, సంభాషనలని, సంగీతసాహిత్యాలనీ నమ్ముకున్న ఆయనకు ఎప్పుడూ ఇలాగ ప్రచారం చేసుకోవలసిన/సమర్థించుకోవలసిన పనిపడలేదు. మన రాష్ట్రంలోనే నీలకంఠ, క్రిష్, శేఖర్ కమ్ముల  లాంటి దర్శకులు పురోగమనాన్ని సాధిస్తున్నారు. కాస్త మీ ముక్కిపోయిన గుజ్జుని బయట పారేసి బుర్రలో గుజ్జుకి పని చెప్పండి. మీ బుర్రలో గుజ్జు లేదు అని నేను అనుకోవట్లేదు. గుణ శేఖర్ తీసిన సొగసు చూడ తరమా, మనోహరం అద్భుతమైన చిత్రాలు. త్రివిక్రమ్ తీసిన నువ్వే నువ్వే చక్కని చిత్రం. వంశీ చిత్రాలలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. మరి ఆ తరువాత వాళ్ళ చిత్రాలు ఎందుకు బాగా రాలేదు. సమాధానం వారికే తెలుసును.

మంచి దర్శకుడు కావాలంటే మంచి పుస్తకాలు చదవాలి, జనజీవనం పైన ఒక అవగాహన ఉండాలి, చేసే పనిపైన శ్రద్ధ, అంకితభావం, గురవం ఉండాలి. ఇవన్నీ సాధించెంతవరకూ మీకు ఏదైనా మానసిక వైద్యశాలలో treatment  అవసరం, మీ treatment  మాకు అనవసరం.

Sunday, June 5, 2011

శ్లేషాలంకారము (paronomasia/pun)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> శ్లేషాలంకారము


లక్షణం: నానార్థ సంశ్రయః శ్లేషః వర్ణ్యా వర్ణ్యోభయాశ్రితః
వివరణ: రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలను ఆశ్రయించుకుని ఉండటాన్ని శ్లేష (కౌగిలి) అలంకారం అందురు.

ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు. సాధారణంగా ఇది వ్యంగ్యానికి, కఱ్ఱ విరగకుండా పామును చంపడానికి వాడుతూ ఉంటారు. కానీ, దీనిని సదుద్దేశంతో, స్తుతి చేయడానికి వాడిన సందర్భాలు మన సాహిత్యంలో కోకొల్లలు.


ఉదా:- (రఘువంశం, రచన: కాళిదాసు)
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

వి:- ఈ వాక్యానికి అర్థం "జగత్తునకు తండ్రులు (తలిదండ్రులు) అయిన పార్వతీ-పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను" అని. కానీ, పార్వతీపరమేశ్వరౌ అనే సంధిని మఱొక విధంగా విడదీయవచ్చును - పార్వతీప (పార్వతీ దేవి పతి), రమేశః (రమాదేవికి ప్రభువు) అంటే "జగత్తునకు తండ్రులైన శివకేశవులకు నమస్కారములు" అనే అర్థంతో కూడా చదువవచ్చును.

"సాగరసంగమం" చిత్రంలో "నాదవినోదము" అనే పాటకు మొదల్లో బాలసుబ్రహ్మణ్యం "వాగర్థావివ సంపృక్తౌ" అనే శ్లోకం చదివి మొదట్లో "పార్వతీ-పరమేశ్వరౌ" అని, ఆ తఱువాత మళ్ళీ, "పార్వతీప-రమేశ్వరౌ" అనడం మీరు గమనించవచ్చును.


ఉదా:- (విష్ణుసహస్రనామ ఉత్తరపీఠిక, రచన: వ్యాసభగవానుడు (?) )
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం, రామ నామ వరాననే

వి:- సంస్కృతంలో మనోరమః అంటే మనసుని రంజింపజేసేవాడు, మనోరమా అంటే మనసుని రంజింపజేసేది (స్త్రీలింగం). మనోరమే అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది "మనోరమా" అనే అకారాంత స్త్రీలింగ శబ్దానికి సంబోధనా ప్రథమా విభక్తి. అంటే సీత అనే ఆమెను పిలవడానికి "హే సీతే" అనడం లాగా అన్నమాట. రెండవ అర్థం మనోరమః అనే అకారాంత పున్లింగ శబ్దానికి సప్తమా విభక్తి. అలాగే వరాననః, వరాననా కూడా. ఇప్పుడు ఈ శ్లోకానికి రెండు అర్థాలు ఎలాగ వచ్చాయో చూద్దాము.

1. శివుడు పార్వతీ దేవితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడట:
"శ్రీరామ, రామ, రామ" అని (ఇతి) రామునియందు (రామే) రమిస్తూ (పరమానందాన్ని అనుభవిస్తూ) ఉంటాను, ఓ మనోరమా. రామ నామం ఒక్కటే, వెయ్యి (సహస్ర) పేర్లతో సమానం (తుల్యం) వరాననా".

2. నాబోటి ఒక సాధారణ భక్తుడు శ్రీరాముణ్ణి తలుచుకుంటే:
"శ్రీరామ, రామ, రామ" అని రామునియందు (రామే), మనస్సుకు సంతోషాన్ని కలిగించేవానియందు (మనోరమే), వరాననుడు యంది (వరాననే) రమిస్తూ ఉంటాను. రామనామం ఒక్కటీ వెయ్యి పేర్లకు సమానం".

ఈ విధంగా రెండు అర్థాలను ఆపాదించుకుని ఈ శ్లోకాన్ని చదివి తరించవచ్చును.


ఉదా:- (నానుడి)
పతివ్రతకు పరపతితో పనేముందో?

వి:- పరపతి అనే పదాన్ని రెండు అర్థాలలో వాడవచ్చును. ఒకటి - పరుల పతి అని, రెండు - ప్రతిష్ట అని. పతివ్రతకు పరుల పతి మీదకు మనసు పోకూడదని ఒక అర్థమైతే, పతివ్రతకు పేరుప్రతిష్టల మీద కాక పతి మీద దృష్టి ఉండాలని మఱొక అర్థం.


ఈ అలంకారాన్ని ఆధారంగా అనేక అశ్లీలవాక్యాలను నిర్మించిన ఘనులు ఉన్నారు. వాటిలో భాషాపరంగా మంచి విషయం ఉన్నా, సంస్కారపరంగా నచ్చకపోవడంతో ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఈ అలంకారం ఉన్న తెలుగు పద్యాలను/చలనచిత్రగీతాలను వ్యాఖ్యల ద్వారా తెలుపగలరని చదువర్లకు మనవి.