Saturday, June 5, 2010

ఛేకానుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> ఛేకానుప్రాసాలంకారం


లక్షణం: భవేదవ్యవధానేన ద్వయోర్వ్యంజన యుగ్మయోః
అర్థం: రెండుగానీ, అంతకంటె ఎక్కువగానీ ఉన్న హల్లుల జంటలు అర్థభేదం కలిగి, వెంట వెంటనే ప్రయోగింపబడితే అది ఛేకానుప్రాసాలంకారమవుతుంది.

కనీసం రెండు "అక్షరాల సమూహం", "వేర్వేరు అర్థాలతో", "పక్కపక్కన (మధ్యలో మరేమీ ఉండకూడదు)" వాడితే అది ఛేకానుప్రాస అవుతుంది. ఉదాహరణలు చూద్దాము.


ఉదా: (చిత్రం: సప్తపది రచన: వేటూరి)

1. ఆబాలగోపాలమా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ తాండవమాడిన సరళి

ఇక్కడ "అచ్చెరువున" అనే పదం రెండుసార్లు మధ్యలో వేరే అక్షారాలు లేకుండా వచ్చింది. మొదటి అచ్చెరువున అన్న పదానికి "ఆ చెరువున" (త్రికసంధి) అని అర్థం. రెండోసారి అచ్చెరువున అన్నప్పుడు "ఆశ్చర్యంతో" (అచ్చెరువు అన్నది "ఆశ్చర్యాం" యొక్క వికృతిశబ్దం) అని అర్థం. అంటే ఆ వాక్యం భావం "కాళిందు చెరువులో ఉన్న కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో చూశారు" అని. ఇది ఛేకానుప్రాస.

ఇందులోనే "ఆబాలగోపాలమా బాలగోపాలుని" అన్నది ఛేకానుప్రాసలాగా కనిపిస్తున్నా - కాదు! ఎందుకంటే, "అబాలగోపాలము" "ఆ బాలగోపాలుని" మధ్యలో రెండు అక్షరాల భేదం ఉంది. ఇది వేరే (యమకం) అలంకారమవుతుంది. ఆ అలంకారాన్ని చర్చించుకునేటప్పుడు వివరిస్తాను.

2. మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

"ఆ రాధ" అంటే "రాధమ్మ" అని, "ఆరాధనాగీతి" అంటే ప్రేమగీతం అని అర్థం. ఇక్కడ "ఆ రాధ" అన్న అక్షరాల కలయిక రెండుసార్లు పక్కపక్కనే వచ్చింది. ఇది ఛేకానుప్రాస. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే ఈ రెండు "ఆరాధ" అనేది అర్థవంతమైన పదం కాదు. మొదటి సారి అది రెండు పదాల కలయిక అయితే, రెండో సారి అది ఒక పదంలో భాగం మాత్రమే! అయినా ఫరవాలేదు. అందుకే సూత్రంలో "రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలసమూహం" అన్నాం తప్పితే "పదం" అని అనలేదు.


ఉదా: (చిత్రం: సూత్రధారులు రచన: (బహుశా) సినారె)

1. మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వంద వందనాలు

"వంద వందనాలు" అన్నప్పుడు మొదటి "వంద"కు "నూరు" అని అర్థం అయితే రెండో "వంద", "వందనములు" అనే పదంలోని భాగం. రెండింటి మధ్యనా వేరే అక్షరం లేదు కనుక ఇది ఛేకానుప్రాస.

2. సన్నాయి సొరమెక్కి చిన్నారి బసవన్న చెన్నార చిందాడ, కన్నార కన్నార?

ఇక్కడ మొదటి "కన్నార" కి "కన్ను + ఆర" అంటే "కళ్ళ నిండుగా" అని అర్థమైతే, రెండో "కన్నార"-కి "చూశారా?" (ప్రశ్నార్థకం) అని అర్థం. వాక్యానిలో భావం, "బసవన్నని కళ్ళ నిండుగా చూశారా?" అని.


ఉదా: (చిత్రం: సీతారాముకళ్యాణం రచన: (బహుశా) సముద్రాల రాఘవాచార్య)
సర్పభూషితాంగ, కందర్పదర్పభంగ

"కందర్పుడు" అంటే "మన్మథుడు". "దర్పము" అంటే "గర్వము" అని అర్థం. ఈ పదానికి అర్థం "మన్మథునికి గర్వభంగం చేసినవాడా" అని.


ఉదా: (చిత్రం: కోకిల రచన: వేటూరి)
ఈ పట్టుకోకట్టుకోవాలమ్మో, ఆ కట్టు ఆకట్టుకోవాలమ్మో

ఉదా: (చిత్రం: రాజకుమారుడు రచన: వేటూరి)
చుక్కలలో చక్కదనం దాచినదానా, ఎలాగైనా లాగెయ్-నా? ఏదో చెయ్-నా? దోచైనా?

ఈ ఉదాహరణ బహుశా సరైనది కాకపోవచ్చును. ఎందుకంటే "లాగైనా" కి "లాగెయ్-నా" కి తేడా ఉంది. కాకపోతే శబ్దాలంకారము అంటే శబ్దాన్ని ఎలాగ వింటాము అన్నదాన్ని బట్టి కాబట్టి ఛేకానుప్రాసకు ఉండాల్సిన స్ఫూర్తి దీనికి ఉంది అని నా నమ్మకం.


ఉదా: (పోతనామాత్యుల శ్రీమద్భాగవతం)
అరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము [పూర్తి పద్యము]

కవి కృష్ణపరమాత్ముడి శరీరాన్ని వర్ణిస్తున్నాడు. కృష్ణుడి మెడను (గళము) శంఖంతో పోల్చాడు. "కంబుసౌందర్య మంగళము" అంటే "శంఖం వంటి సౌందర్యము కలిగి శుభదాయకమైనది" అని అర్థం.


* ఈ అలంకారానికి కూడా ఈ పేరు ఎందుకు వచ్చిందో ఊహించగలుగుతున్నాను కానీ, గురువు/పుస్తకం ద్వారా తెలుసుకోలేదు. ఎవరైన విషయఙ్ఞులు ఉంటే తప్పక చెప్పగలరు.

Thursday, June 3, 2010

వృత్త్యనుప్రాసాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> వృత్యనుప్రాసాలంకారము


లక్షణం: ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసౌనామ్నా వృత్త్యను ప్రాస ఇష్యతే
అర్థం: ఒకటి, రెండు మొదలైన హల్లులను పెక్కుసార్లు ఆవృత్తి చేయుట వృత్త్యనుప్రాస అనబడును

వృత్త్యనుప్రాసాలంకరాము అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే వస్తూ ఉండటం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే హల్లు ప్రధానం కానీ, అచ్చు కాదు. ఇది ఎందుకు చెప్తున్నానో ఈ క్రింది ఉదాహరణ తరువాత తెలుస్తుంది:

ఉదా: (చిత్రం: స్వాతికిరణం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)
క్షాధ్వరశిక్షాదీక్షాక్ష! విరూపాక్ష! నీ కృపావీక్షణాపేక్షితప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష క్ష యను ప్రార్థన వినర!

ఇక్కడ "క్ష్"తో వృత్త్యనుప్రాస కూర్చబడింది. ఇక్కడ ముద్దగా (bold) దిద్దబడిన అక్షరాలన్నిటిలోనూ "క్ష్" ఉంది. చూశారా "క్ష్" వేర్వేరు అచ్చులతో కలిసి మళ్ళీ మళ్ళీ వచ్చింది. దక్ష లో "క్ష" గ ఉంటే "ఉపేక్షిత" లో "క్షి" ఉంది. అచ్చులు (అ, ఇ) వేరే అయినా హల్లు ఒకటే. అది చాలు వృత్త్యనుప్రాసకి.


వృత్త్యనుప్రాసలో వాడే అక్షరానికి ఏదైనా ఒక చోట, ముందు అక్షరంలో పూర్ణబిందువు (సున్నా) ఉంటే అది అన్ని చోట్లా ఉండాలి.  ఈ క్రింది ఉదాహరణ చూడండి:

ఉదా: (చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్యం, రచన: వేటూరి)
ఉత్తుంశబరిగిరిశృం, నిత్యనిస్సం, మంళాం, పంపాతరం, పుణ్యానుషం, మునిహృదయజలజభృం!

ఈ ఉదాహరణలో ముద్దగా చూపిన "గ"-ల ముందు అక్షరాల్లో పూర్ణబిందువు ఉంది.


వృత్త్యనుప్రాస ఒక అక్షరంతోనే కాక రెండు, లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలతో కూడా కలపచ్చును. మన తెలుగుసాహిత్యంలో ఏకంగా మూడు అక్షరాలతో వృత్త్యనుప్రాసను ప్రయోగించిన మహాకవులున్నారు.

ఉదా: (చిత్రం: వరుడు, రచన: వేటూరి)
బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా తగిలే లేమంచులా!

ఇక్కడ "చ", "ల" అనే రెండు హల్లులూ మళ్లీ మళ్ళీ వచ్చాయి. అందుచేత ఇది కూడా వృత్త్యనుప్రాస అవుతుంది - కాకపోతే రెండు అక్షరాలతో.


మరిన్ని ఉదాహరణలు:

ఉదా: (కీర్తన: కృష్ణం కలయసఖి సుందరం, రచన: శ్రీ నారాయణతీర్థులవారు)
కృష్ణం గత విషయ తృష్ణం, జగత్ప్రభ విష్ణుం, సురారిగణజిష్ణుం

ఉదా: (చిత్రం: సితార, రచన: వేటూరి)
జిలిబిలి పలుకు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కికి నగవు వపులు చిలికిన ఓ మైనా మైనా


శ్రీహరి అలంకారప్రియుడు కదా? మరి మన పోతనామాత్యుడు ఊరుకుంటాడా? శ్రీమదాంధ్రమహాభాగవతములో లేని అలంకారమంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో? అందులోని కొన్ని వెన్నముద్దలు.

సీ: (ప్రహ్లాదోపాఖ్యానం)
మందారకరందమాధుర్యమునదేలు ధుపమ్మువోవునే దనములకు [పూర్తి పద్యం]

తే: (కుచేలోపాఖ్యానం)
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు [పూర్తి పద్యం]

కం: (గజేంద్రమోక్షం)
అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!

పోతనామాత్యులు ఈ పద్యాన్ని నకారంతో ఒక అనుప్రాస, డకారంతో ఒక అనుప్రాస - రెండు తీగెలు అల్లుకుంటున్నట్టుగా అల్లుతూ వ్రాశారు. ఈ పద్యంలోని తరంగాల వేగాన్ని అందుకోలేక దాదాపు internetలో అందరూ (నాతో సహా) ఎక్కడో ఒక చోట తప్పు వ్రాశారు. ఇక్కడ ఉన్నదాంట్లో ఏమైనా తప్పుంటే సవరించగలరు.

ఈ పద్యంలో మరో విశేషం ఏమిటంటే ఒక కందపద్యం అనివార్యం అయిన చోట్ల తప్ప అన్నీ లఘువులతోనే వ్రాశారు.

కం: (రుక్మిణీకల్యాణం)
భూషణములు సెవులకు బుధ
తోషణము లనేక జన్మ దురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్.

ఇక్కడ చూశారా? ప్రతీ పాదంలో రెండు, మూడు, నాలుగు, ఐదు అక్షరాలన్నీ "ష", "ణ", "మ", "ల" గుణింతాలనుండీ వరుసగా వచ్చాయి. అంటే నాలుగు అక్షరాలతో వృత్త్యనుప్రాస నడిపించాడు మహనీయుడు పోతన!


* ఈ అలంకారానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకూ నిర్దిష్టంగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే వ్యాఖల పెట్టెలో వ్రాయండి. అప్పుడు నేను వ్యాసాన్ని సరిచేస్తాను.
* ఈ క్రింది వ్యాఖ్యలలో కిరణ్ (.C)  చక్కని ఉదాహరణలని వివరణలనీ ఇచ్చాడు. తప్పకుండా చూడండి.
* శ్రీయుతులు వేదుల బాలకృష్ణమూర్తిగారు ఈ క్రింది లంకెల్లో లంకెబిందెలకంటే విలువైన పోతనపద్యాలను పొందుపరిచారు. సాహిత్యాభిలాషులు తప్పక చదవవలసినవి ఈ పద్యాలు: రుక్మిణీకల్యాణం; కుచేలోపాఖ్యానం.

తెలుగు వ్యాకరణం - అలంకారాలు

ఈ మధ్యన బొత్తిగా నేను తెలుగు వ్యాకరణం మరిచిపోతున్నాను అనిపించింది. అసలే వచ్చింది చిటికెడు. ఆ కాస్తా కూడా మరిచిపోతే ఇంకేముంది? అందుకే ఒకసారి వ్యాకరణం మళ్ళీ గుర్తుచేసుకుందాము అని "తెలుగు వ్యాకరణము" పుస్తకం చదువుతున్నాను. "బానే ఉంది. అది బ్లాగులో వ్రాయడం దేనికయ్యా?" అంటున్నారా? ఏమీ లేదండి, ఈ మధ్యన బ్లాగులు చూస్తుంటే కవిత్వం వ్రాయాలన్న తపన, ప్రఙ్ఞ, కనబడుతున్నంతగా భాష మీద పట్టు కనబడట్లేదు. సరే ఈ వ్యాకరణాంశాలన్నీ ఒక చోట వ్రాస్తే ఔత్సాహికకవులకు కూడా ఉపయోగపడతాయి కదా అని. నాకు తెలుగు ఆట్టే రాదు. సంస్కృతమైతే మరీ తక్కువ. అందుచేత తప్పులు ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కడైనా నేను తప్పు వ్రాస్తే సవరించగలరు.

కవిత్వానికి సంబంధించి, ఛందస్సు గురించి ఇదివరకే సంకా రామకృష్ణ గారు మంచి వ్యాసాన్ని వ్రాశారు. అది చూస్తూనే నేను నెమ్మదిగా కందాలు, ఆ పైన గీతాలు, సీసాలు వ్రాశాను. ఈ రోజుకీ నాకు ఏమైనా సందేహం ఉంటే ఆ వ్యాసాన్నే చూస్తాను. కవిత్వానికి సంబంధించిన మరో చక్కని అంశం అలంకారాలు. అలంకారాల గురించి internetలో ఎక్కడా సమగ్రమైన వ్యాసాలు కనబడలేదు. అందుకే వాటి గురించి చర్చించాలని ఈ శీర్షిక మొదలుపెడుతున్నాను. వ్యాకరణం అనగానే అదేదో "మనకు పనికిరాదులే" అనుకునే వాళ్ళకు తెలియనిదేమిటంటే వారికి తెలియకుండానే రోజూ ఏవో అలంకారాలు వాడుతూ ఉంటారు. ఉదాహరణకి క్రికెట్ ఆటగాడు బంతిని కొట్టిన తీరుని వర్ణిస్తూ, "ఆ బంతి ఇంక రాదు" అనుకుంటాము. నిజానికి ఆ బంతి వెనక్కొస్తుంది. కాకపోతే అతడు అంత బలంగా కొట్టాడు అన్నది వ్యక్తపరచడానికి మనం ఆ మాట అన్నాము. దీన్నే అతిశయోక్తి అలంకారం అంటారు. అలాగే మిగిలిన అలంకారాలు కూడా రోజూ మనం ఎక్కడో వింటుంటాము అన్నది తెలియడానికి నేను వీటికి ఉదాహరణలుగా తెలుగు (సినిమా) పాటలను చెప్తాను. చక్కని పద్యం దొరికితే మాత్రం చెప్పక మాననండోయ్. ఎంతైనా సినిమా పాట T20, పద్యం టెస్ట్ మ్యాచ్.

"అలంకారము" అంటే మీకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే "కవిత్వానికి అందం తెచ్చేదాన్ని అలంకారం అంటాము" (కావ్యశోభాకరాన్ ధర్మానలంకారాన్ ప్రచక్షతే). అలంకారాలు రెండు విధాలు - శబ్దాలంకారాలు (శబ్దం ప్రధానంగా ఉండేవి), అర్థాలంకారాలు (అర్థం ప్రధానంగా ఉండేవి). వీటిని వీలైనప్పుడు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. మీ విమర్శలు, సలహాలు, సూచనలు, వ్యంగ్యాలు, వెటకారాలు ఏమైనా ఉంటే నిస్సందేహంగా వ్యాఖ్యానించండి.

Thursday, May 27, 2010

పదకవితాపితామహుడికి పదపుష్పాంజలి

అన్నమయ్య కీర్తన అనగానే నా మనసుకు ఒక రకమైన పరవశం కలుగుతుంది. ఆయన కీర్తనలు వింటుంటే "ఆహా, ఎంత చక్కగా వర్ణించాడు? రోజూ ఒక్కరి మీదనే కీర్తనలు వ్రాస్తున్నా, ఈయనకి పదాలు ఎక్కడనుండి దొరుకుతున్నాయి? ఆ భావనది జీవనది కదా! ఆ భక్తిరత్నాకరంలో రత్నాలకు లెక్క లేదు!", అని అనిపిస్తుంది. "తెలుగుపాట" అన్న మాటకి పునాది వేసిన అన్నమయ్యని పొగడాలంటే మాటలు చలావు. కానీ, ఆ శారదాదేవి అనుగ్రహించనంతలో కొన్ని పదపుష్పాలను సమర్పించుకోవాలన్నదే నా ఆశ. ఆ పై ఆ శ్రీనివాసుడిదే భారం!


క్కడివయ్యా నీకీ పదములు
క్కగ అమరెను క్రి పదములకు

రి నా విభుని, డు కొండలపై, కోరి కీర్తనలఁ కొలిచెడివారని
నారదుడే నీ నాలుకముంగిటఁ, బారఁగఁ జేసెనా మహతీఝరులను
ఎక్కడివయ్యా ||

లకోకిలలా చిలుకగ పలుకులఁ, లకల కులుకుల లికి శ్రీరమణి
లుకుతేనెలతల్లి ద్మావతియే, చిలికినదా నీ జిహ్వపై సిరుల?
ఎక్కడివయ్యా ||

లమేల్మంగ ధరామృతమును, లదుకొన్న శ్రీరి పెదవులపై
పులకలు పొడమ పొంకపుమాటలఁ, తొలకాడిన స్వరధుని లోతులలో
ఎక్కడివయ్యా ||

నెలకొనె హరి నా నేలకు వచ్చి, కొలువుఁదీరెనే కొండలపైనని
లచి పదములను దాచి పంపెనో, తెలుగుతల్లి నీ దివ్యహృదయమున
ఎక్కడివయ్యా ||

ఈ పాటలో అన్నమయ్య శైలిని సాధ్యమైనంతవరకు అనుసరించాను.ప్రాసాక్షరాలు కనబడుతూనే ఉన్నాయి. యతి అక్షరాలను ముద్దగా (bold) దిద్దాను.

Tuesday, May 25, 2010

వేటూరికి ఎవరు ఋణపడి ఉన్నారు?

ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే, "ఆయన పాటల్ని అనుదినం పాడుకుంటూ ఆనందించిన పిన్నాపెద్దలందరూ ఋణపడ్డారు", అని కొందరంటే, "ఇంతటి అపారమైన సంస్కృతాంధ్రభాషాఙ్ఞాననిధిని తమ నవ్యత లేని కథలలో పనికిమాలిన సందర్భాలకు పరిమితం చేసిన, కళాత్మకమైన వృత్తిని వ్యాపారమాత్రంగా మార్చిన, దర్శకనిర్మాతలు ఋణపడి ఉన్నారు" అని కొందరంటారు. ఆయన పాటలనే కాక, పాట్లని కూడా గమనించిన కొందరు అభిమానులు, "అంతటి పుంభవ సరస్వతికి వెయ్యి గజాల జాగా కూడా ఇవ్వలేకపోయిన మన తెలుగునాడు (సర్కారు) ఋణపడిపోయింది", అని అంటారు. కానీ, నన్నడిగితే వీళ్ళే కాదు,  ఋణపడిపోయినవాళ్ళ జాబితా ఇంకా పెద్దదేనంటాను.

మొట్టమొదటగా ఋణపడిపోయింది, ఆయన నోట అనేకమార్లు పొగడబడిన దేవతలు. శివుడు (శంకరాభరణం, భక్తకన్నప్ప, సాగరసంగమం మొ.),  రాముడు (గోదావరి,  రాధాగోపాళం, సీతారామయ్యగారి మనవరాలు మొ.), కృష్ణుడు (సాగరసంగమం, స్వరాభిషేకం, కాంచనగంగ మొ.), అమ్మవారు (సప్తపది, భైరవద్వీపం మొ.), హనుమంతుడు (శ్రీ ఆంజనేయం, జగదేక వీరుడు అతిలోక సుందరి, మొ.), వేంకటేశ్వరుడు  (సప్తగిరి మొ.), అయ్యప్పస్వామి (శ్రీ అయ్యప్పస్వామి మహత్యం), రాఘవేంద్రస్వామి (2003 లో విడుదలైన రాఘవేంద్ర). ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమంది దేవతలు ఆయన పదపుష్పాలతో అర్చింపబడ్డారు. కొన్ని సార్లు దేవుణ్ణి పొగడే సందర్భం చిక్కితే, కొన్ని సార్లు సందర్భం చిక్కించుకుని దేవుణ్ణి పొగిడారు వేటూరి. ఉదాహరణకి, ఆలుమగల అన్యోన్యాన్ని చెప్పడానికి రాధాగోపాళంలో "ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడూ పార్వతీ, తనువులు రెండూ తామొకటైన సీతారాములకు - మీకు శతమానం భవతి" అని అన్నారు. పువ్వూ తావీ అనో, ఆమనీ కోయిలా అనో, వేణువు నాదం అనో వర్ణించడంతో సరిపెట్టకుండా భార్యాభర్తల అన్యోన్యానికి పరమేశ్వరుడే ప్రమాణం అని మనసుకు హత్తుకునేలాగా చెప్పారు. ఒక సరదా వాన పాట వ్రాయండయ్యా అంటే ఎవరైనా కొంచెం సరసం కలుపుతారు. కానీ ఆ సరసం పక్కనే సాత్వికతను నిలుపగల ఘనుడు వేటూరేనేమో. గోదావరి చిత్రంలో "టిప్పులు టప్పులు" అనే పాటలో "లంగరేసినా లొంగిచావని రంగసాని చాటుపిలుపులు" అని సరసం చూపిస్తూనే, "రాకడా పోకడా రాములోరికెరుకలే" అంటూ గోదావరిపై రాముని ఉనికిని మాటల్లో నిలబెట్టారు. రాముడు కూడా "ఏవిటి నా మీద వీడికింత వెర్రి అభిమానం?", అనుకునేలాగా ఆ చిత్రంలో దాదాపు అన్ని పాటల్లోనూ రాముణ్ణి గుర్తుచేశారు. ఇంక రాధను ఎన్నిసార్లు ఆయన పాటల్లో తలుచుకున్నాడో చూసి కృష్ణుడికే, "ఎంతైనా వేటూరికి రాధ పట్ల పక్షపాతం ఉంది", అనిపిస్తుందేమో! దేవతలేనా? పురాణాల్లో అనేక పాత్రలకు ఆయన పాటల్లో చోటు దక్కించారు ఆయన. కొన్ని సందర్భానికైతే, కొన్ని సరదాకి. శబరి, ద్రౌపది, చంద్రమతి, శకుంతల, వరూధిని, ఘటొత్కచుడు, ఇంద్రుడు మొదలుకొని ఆఖరికి మంథర, సూర్పనఖ, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా ఆయన పాటల్లో ఎక్కడొ ఎదురవుతూనే ఉంటారు.

వేటూరికి పూర్వకవులు కూడా ఆయనకు ఋణపడ్డారు. "ఇదేమిటి? వాళ్ళ కావ్యాలు, పాటలు ద్వారా ఙ్ఞానాన్ని పొందిన వేటూరే ఋణపడి ఉండాలి కదా?" అని అనిపించడం సహజమే. కానీ, వేటూరి వాళ్ళని పదే పదే పాటల్లో తలుచుకుని వాళ్ళ ఋణం తీర్చుకోవడమే కాక, వాళ్ళనే ఋణబద్ధులను చేశారేమోననిపిస్తుంది. వాల్మీకి, కాళిదాసు మొ. సంస్కృతకవులని; నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు, రామలింగడు మొ. ఛందోబద్ధకావ్యకర్తలని; త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య మొ. వాగ్గేయకారులని; కృష్ణశాస్త్రి, నండూరి, శ్రీశ్రీ, గుడిపాటి చలం, గురజాడ వంటి ఆధునికకవులని; ఆత్రేయ, పింగళి వంటి చలనచిత్రగీతకర్తలని ఆయన పాటల్లో గుర్తుచేశారు. (వేటూరికి గురువుగారు) విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి అపరభాషాప్రవీణులనే కాక, ఒమర్ ఖయ్యాం, రబీంద్రనాథ్ ఠాగోర్ వంటి పరభాషాప్రవీణులని కూడా ఆయన పాటల్లో చూస్తూ ఉంటాము మనం. తాన్సేన్, గులాం అలీ వంటి గాయకులను సందర్భం దొరికంప్పుడల్లా ప్రస్తావించే సినీకవి మనకు దొరుకుతాడా? ఇకపై వీళ్ళని పట్టించుకునేవాళ్ళు ఉంటారా? "తెలుగు" అన్న పదాన్నే సరిగ్గా పలకడం చేతకాని వాళ్ళ చేత "చిరుత్యాగరాజు, నీ కృతినే పలికెను" అని అనిపించేవారున్నారా? ఒక యుగళగీతం వ్రాసిపెట్టవయ్యా అని అంటే పనిగట్టుకుని, "నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, ఆత్రేయ ప్రేమగీతం" అనో, కుటుంబమంతా కలిసి పాడుకునే పాట వ్రాయవయ్యా అంటే, "మనసు కవి మాట మనకు విరిబాట", అనో కనీసం చలనచిత్రరంగంలో తమకు సీనియర్లైన కవులని గుర్తుచేసేవారుంటారా?

మన జీవనదులు వేటూరికి ఋణపడ్డాయి. "పలుకులా అష్టపదులా, నడకలా జీవనదులా", అని నదుల అందాలను గుర్తుచేశారు. "ఒయ్యారి గోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం?" అని గోదావరిని చిలిపిగా అడిగారు. "నీలవేణిలో కృష్ణవేణినే చూశా" అని అమ్మాయిని పొగుడుతున్న నెపంతో కృష్ణని, "నాలోనే పొంగెను నర్మద" అని నర్మదని, "నీ తుంగభద్ర మా పాపాలు కడుగంగ" అని రాఘవేంద్రస్వామిని పొగుడుతూ తుంగభద్రని, "చినుకులన్నీ కలిసి చిత్రకావేరి" అని కావేరిని గుర్తుచేసారు. ఇంక గంగమ్మ సంగతైతే చెప్పుకోవక్కరలేదు. గంగోత్రి చిత్రంలో ఏకంగా పాటే వ్రాశారు. భారతీయనదులకే కాకుండా "పరదేశి" చిత్రంలో "మిసిసిపి-తీరే" అంటూ పరదేశంలోని నదులకు కూడా తన పాటల్లో స్థానం ఇచ్చారు.  హైదరాబాదులో, ఒక అర్ధరాత్రి, ఒకబ్బాయి అమ్మాయితో కలిసి కారులో షికారుకెళ్తుంటే, అప్పుడు పాడే పాటలో ప్రకృతిసౌందర్యాలను ఎలాగ వర్ణిస్తాము? కానీ వేటూరికి ఆ సంకోచం లేదు, "యమునాతీరం, సంధ్యారాగం - నిజమైనాయి కలలు, నీలా రెండు కనులలో" అని "నువ్వు నా కళ్ళెదుటవుంటే, నేను కలగన్న యమునాతీరం-సంధ్యారాగం నిజంగా ఎదురైనట్టు ఉంది", అని వ్రాశాడు. ఒక్క నదులనే కాదు, మన భారతదేశసౌందర్యానికి ప్రతీకలైన ఎన్నో సంపదలని ఆయన పాటల్లో నిక్షిప్తం చేశారు. రాఘవేంద్రస్వామిని గురించి చెప్పవయ్యా అంటే, "మనసు చల్లని హిమవంతా" అని హిమాలయాను గుర్తుచెయ్యగలరు వేటూరి!

ఆ తరువాత ఋణపడింది కర్ణాటకసంగీతం! "ఇదేమిటి? ఆయనకు సంగీతమొచ్చా? ఆయనేమైనా పాడాడా?" అని మీరు అనుకోవడం సహజం. "పాడితేనే ఋణపడాలా? సామాన్యులకు రాగాలను పరిచయం చేస్తే అది గొప్ప కాద?", అని నాకనిపిస్తుంది. "మదనమోహినీ చూపులోన మాండురాగమేలా?", అని ప్రేయసిని అడిగినా, "పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం - అది ఆనందభైరవి రాగం" అని ప్రేమికుల మధ్యలో అనురాగానికి స్వరరూపం ఆపాదించినా, "శ్రీ-రాగమందు కీర్తనలు మానర!"  అంటూ డబ్బు పిచ్చి వదులుకొమ్మని సరదాగా చెప్పినా - అది కర్ణాటకసంగీతం పట్ల వేటూరికి ఉన్న మమకారానికి నుడికారాన్ని కల్పించి చెప్పటమే! శంకరాభరణం, దేవగాంధారి, కీరవాణి, శివరంజని, భాగేశ్వరి వంటి రాగాలు ఆయన పాటల్లో మనకు తారసపడుతూ ఉంటాయి. ఇక "భైరవద్వీపం" చిత్రంలో "శ్రీతుంబురనారదనాదామృతం" అనే పాటలో ఆయన కర్ణాటకసంగీతానికి పదాభిషేకం చేశాడనే చెప్పుకోవాలి. మన సాంప్రదాయవిశేషాల మీద ఇంత పట్టు కలిగి, "నువ్వు సందర్భం చెప్పు, నేను సాంప్రదాయంతో జోడించి సాహిత్యాన్ని అందిస్తాను" అని ధైర్యంగా నిలబడి చెప్పగలిగే వారు చలనచిత్రసీమకు మళ్ళీ ఎప్పుడు వస్తారు? సంగీతంలో ఒ,న,మ-లు తెలియని నాబోటి వాళ్ళకు కూడా, "ఫలానా రాగం ఉందన్నమాట" అని తెలిసేలాగా ఎవరు చేస్తారు?

కవికి స్వేచ్ఛనిచ్చే దర్శకుడు అడిగితే, అమ్మాయిని వర్ణిస్తూ "ముల్లోకాలే కుప్పెలై, జడకుప్పెలై" అని అన్నారు. అలాగే, "మాకదేమీ తెలియద్సార్! మాంచి ఊపున్న పాట ఒకటి రాయండి", అని అడిగితే "యమహో నీ యమాయమా అందం" అనే మాయతెరను అడ్డు పెట్టి, ఆ వెనుకనే "తెల్లనీ చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టి, పచ్చని పాదాలట్టి, ఎర్రని బొట్టు పారాణెట్టి, చీకటింట దీపామెట్టి, చీకుచింత పక్కానెట్టి", అంటూ మన సాంప్రదాయాన్ని గుర్తుచేశారు. ఇంత ముద్దుగా మనకు మన సాంప్రదాయాలని గుర్తుచెసే శక్తి ప్రస్తుతకవులందరికీ కలుగేలా ఆశీర్వదించమని వేటూరికి నా మనవి. ఇంత చక్కగా వర్ణించబడి, నలుగురి మనసుల్లోనే కాక పెదాలపై కూడా ఉన్నందుకు మన సాంప్రదాయాలు కూడా ఆయనకు ఋణపడ్డాయనిపిస్తుంది!

ప్రతీ మనిషినీ కనేది ప్రకృతి ప్రతిబింబమైన ఆడది. కానీ ప్రతీ కవినీ కనేది మాత్రం సాక్షాత్తు ఆ ప్రకృతే! అలాంటి ప్రకృతిని వర్ణించి కవి తన కవిత్వానికి సార్థకతను సంపాదించుకుంటాడు. దురదృష్టవశాత్తు మన తెలుగు చలనచిత్రాలలో ప్రకృతిని వర్ణించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సందర్భం దొరికినా దొరక్కపోయినా ఒక్కసారి ఆ ప్రకృతిని తలుచుకోకుండా వేటూరి పాట వ్రాయలేదేమో అనిపిస్తుంది. చక్కనైన సందర్భం కుదిరితే, "ఆమనీ పాడవే హాయిగా" అని అన్నారు, ముక్కిపోయిన సందర్భం వస్తే "వానవిల్లు చీర చాటు వన్నెలందుకో; 'వద్దూ' లేదు నా భాషలో" అని అన్నారు. కానీ, ప్రకృతికి మాత్రం తన పాటల్లో పెద్దపీట వేశారు. "బహుశః ఇలాగ ప్రకృతిని వర్ణించాలనే తపన ఇప్పటి కవుల్లో తగ్గిందేమో? ప్రకృతికి మళ్ళీ ఇలాంటి ప్రాధాన్యత మన తెలుగు సినిమాపాటల్లో రాదేమో?", అన్న సందేహం కలిగినప్పుడల్లా ప్రకృతి కూడా వేటూరికి కొంత ఋణపడిందేమో అనిపిస్తుంది.

"అందరి కంటే ఎక్కువ ఋణపడింది భాషేనేమో?", అనిపిస్తుంది. "సంస్కృతమంటే అది గంభీరమైన భాష. మనకు తెలియదు.", అనుకున్నవాళ్ళ నోట, "నీ పదరాజీవముల జేరు నిర్వాణసోపానమధిరోహణముజేయు ద్రోవ"  అని పాడించగల ఘటికుడు వేటూరి.  మీలో ఎంతమంది మారాకు, క్రావడి, క్రీగన్ను, కొంగొత్త, నివురు, పుంగవ, పున్నాగ వంటి పదాలు సామాన్యమైన పాటల్లో విన్నారు? వేటూరి పాటల ద్వారా నాకు పరిచయమైన అనేక తెలుగుపదాల్లో ఇవి కొన్ని మాత్రమే! పద్యప్రాసాదాలలో రాణివాసం చేస్తూ బయటి ప్రపంచాన్ని చూడటానికి నోచుకోక కనుమరుగైపోతున్న(1) అలాంటి పదాలను ఒక సామాన్యమైన తెలుగు సినిమాపాటలో చెప్పేందుకు ఎవరు మిగిలారు? అలాంటి పదాలను పోగు చేసి వాటికి అండగా నిలిచి, "ఇది నేను వ్రాస్తాను. ఎవరు వినరో, ఎందుకు వినరో అదీ చూస్తాను!", అని ధీమాగా నుంచునే సినీకవి ఎవరు? అంతే కాకుండా సరదాకో, సన్నివేశానికో ఎన్నో ముచ్చటైన పదాలను సృష్టించి "మజామ-జావళీలు" పాడారు.

వేటూరి కలం ఆగడం మనందరికీ ఎంత దుఃఖాన్ని మిగిల్చిందో, భౌతికరూపంలో మనకు కనబడని, పైన చెప్పబడిన వారికి/వాటికి కూడా అంతే దుఃఖాన్ని కలుగజేస్తుందన్నది నా అభిప్రాయం. చెరుకుని సరిగ్గా వాడుకుంటే తీయని రసాన్ని ఇస్తుంది, పంచదారనిస్తుంది,  బెల్లాన్ని ఇస్తుంది. కానీ, అవన్నీ తీసెయ్యగా మిగిలిపోయిన చెత్తతో తయారయ్యే మద్యాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళెక్కువయిన మన చలనచిత్రపరిశ్రమ వలన, ప్రేక్షకుల వలన వేటూరి అనే మహానదిలో సుధాధారలన్నీ అడవుల్లోకి ప్రవేశించి మరుగున పడిపోతే, మలినలిప్తమైన పాయలు మాత్రమే అందరికీ కనబడుతున్నాయి. ఆ పాయల్లో కూడా అడుగున ఎక్కడో కొన్ని ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలనో, అడవుల్లో ఉన్న సుధాధారల్నో వెతకాలనే కోరికా, తీరికా, ఓపికా ఎవరికీ లేదు కానీ, ఆ మహానదిని మొత్తంగా నిందించే సాహసం మాత్రం పుష్కలంగా ఉంది. అది వేటూరి దురదృష్టమేమో!

---
ఈ వ్యాసం ద్వారా వేటూరిని మన భాష, సంప్రదాయాలు, పూర్వకవులు, సంగీతం, ప్రకృతి మొ. వాటికంటే ఎక్కువగా చూపించాలన్నది నా ఉద్దేశం కాదు. నిస్సందేహంగా అవన్నీ వేటూరి కలానికి సిరాని అందించిన స్ఫూర్తిదాయకాలు. కాకపోతే, వేటూరి కలం ఆగిపోవడం వలన వేటిపై (చిన్నదో, పెద్దదోవేటు పడిందో చెప్పాలన్నదే నా ప్రయత్నం. పాఠకులలో ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే, వారు నన్ను క్షమించాల్సిందిగా నా మనఃపూర్వకమైన మనవి.

(1) ఇక్కడ నేను వాడిన ఉపమానం పద్యకర్తలకు అవమానంగా భావించరాదని నా మనవి. ఈ కాలంలో ఒక సామాన్యమైన తెలుగువాడికి పద్యాలను అర్థం చేసుకోవాలనే తపన కన్నా, వాటిని వెటకారం చెయ్యాలనే దురభిమానమో, అవి తనకు అర్థం కావనే భయమో ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆ ఉపమానం. పద్యకర్తల పట్ల, పద్యకావ్యాల పట్ల నాకే కాదు, వేటూరికి కూడా అపారమైన భక్తిప్రపత్తులున్నాయన్నది అందరికీ విదితమేనని నా నమ్మకం.

ఈ వ్యాసానికి స్ఫూర్తినిచ్చిన ఫణీంద్రకు నా కృతఙ్ఞతలు.

Saturday, May 22, 2010

తెలుగు చలనచిత్రసాహిత్యభారతానికి భీష్ముడు - వేటూరి

వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో "జగడజగడజగడానందం" అన్నా, వెర్రితనంతో "అ అంటే అమలాపురం" అన్నా, ప్రేమభావంలో "ప్రియా! ప్రియతమా రాగాలు" అన్నా, విరహవేదనతో "చిన్న తప్పు అని చిత్తగించమని" అన్నా, ఆరాధనాభావంతో "నవరససుమమాలికా" అన్నా, చిలిపిదనంతో "ఉత్పలమాలలకూపిరి పోసిన వేళ" అన్నా, భక్తిభావంతో "శంకరా! నాదశరీరాపరా!" అన్నా, వైరాగ్యంతో "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన" అన్నా, దుఃఖంతో "కన్నీటికి కలువలు పూచేనా?", అన్నా - వేటూరి పాట నాకు చివరిదాకా తోడుండే నేస్తం. వేటూరి పాటతో నేను సావాసం చేస్తున్నట్టనిపిస్తుంది నాకు. ఆ పాట భుజం మీద చెయ్యేసి తిరుగుతున్నట్టు, ఆ పాటతో వేళాకోళమాడినట్టు, ఆ పాటతో కలిసి ఆడుకుంటున్నట్టు, ఆ పాటతో పాటే అలిసిపోయినట్టూ అనిపిస్తుంది. అలాటి వేటూరి పాట మూగబోయింది అంటే, అది జీర్ణించుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఇంకోసారి ఆ వృద్ధకలం "అందంగా లేనా? అసలేం బాలేనా?" అని అడుగుతుందేమో, "అబ్బే, నీకేమి? మహారాణిలా ఉన్నావు.", అని చెప్దామని అనిపిస్తుంది.

మన తెలుగుచలనచిత్రరంగంలో ఎందరో మహానుభావులున్నారు. వారి మధ్య వేటూరికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. మహాభారతంలో భీష్ముడు మూడు తరాల పాటు అందరికీ తన విద్వత్తుని, ఙానాన్ని అందిస్తూ వచ్చాడు. చివరికి, "తాతా, నిన్నెలాగ చంపాలో చెప్పవా?", అని అర్జునుడు అడిగితే "ఇలాగ చెయ్యాలిరా మనవడా!" అని చెప్పాడు. అలాగే వేటూరి కూడా తనకు సమకాలీకులైన అనేకచలచిత్రకవులకు దగ్గరుండి యుద్ధమర్మాలను బోధించారు. కొంతమంది అర్జునులైతే, కొంతమంది దుర్యోధనులైనారు; కొంతమంది ధర్మరాజులైతే, కొంతమంది విదురులైనారు. కానీ, ఎవ్వరూ భీష్ముడు కాలేకపోయారు. అధర్మం అన్నం పెట్టింది అని దానికి ఆసరాగా ఉండిపోయినంత మాత్రాన, భీష్ముడి గొప్పదనం తగ్గిపోతుందా? తన పాట విని ఎదిగినవాళ్ళే ఆయనకు అంపశయ్య వేసి పరుండబెట్టినా ఆయన ఠీవి తగ్గుతుందా? చివరికి అంతటి ధర్మరాజవిదురాదులే ఆయన పాదాలకు మ్రొక్కి, "మాకు మీరు ధర్మాన్ని మప్పండి" అని అడుగకతప్పుతుందా? ఈ రోజు, ఎంతటి చలనచిత్రకవి అయినా ఒకప్పుడు వేటురి పట్టిన ఉగ్గుపాలను త్రాగినవాడేననడంలో అతిశయోక్తి లేదేమో? భీష్ముడిలాగే, వేటూరి మరణం తరుముతుంటే పారిపోకుండా, "కాలుతున్న కట్టేరా, చచ్చేనాడు నీ చెలి", అని ప్రేమగీతాన్ని ఆలాపించగలిగినవాడు.

వృద్ధాప్యం ఆయన బాణాల్లో పదును తగ్గించవచ్చు, దృష్టిమాంద్యం గురిని తప్పుగా చూపించవచ్చు, కానీ, ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని ఆయన ధనుష్టంకారాన్ని వినిపిస్తే దిక్కులు దద్దరిల్లి, "విధి లేదు, తిథి లేదు, ప్రతిరోజూ నీదే లేరా", అని అనక తప్పదు. ఆయనతోటలో పూయని పూలు లేవు, ఆయన పండించని పండు లేదు, ఆయన నడయాడని చోటు లేదు! పింగళి, సముద్రాల, ఆత్రేయ, ఆరుద్ర నుండి సిరివెన్నెల వరకు అందరినీ ఆయన కవిత్వంలో చూపగలరు. అయినా పాటలో ఏక్కడో ఒక చోట, "ఇది నేను వ్రాసిన పాట సుమీ" అనేలాగా ఆయన సంతకం దాచివుంచి సంధిస్తాడు. రథసారథి ఎవరైనా, యుద్ధరంగమేదైనా, యుద్ధనీతి యేదైనా ఆయన బాణాల్లో దూకుడు తగ్గదు. విశ్వనాథ్ తో శంకరాభరణం, బాపుతో రాంబంటు, జంధ్యాలతో ఆనందభైరవి, వంశీతో సితార, సింగీతంతో అమావాస్య చంద్రుడు, రాఘవేంద్రరావుతో వేటగాడు, భారతీరాజతో సీతాకోకచిలుక, మణిరత్నంతో గీతాంజలి, శేఖర్ కమ్ములతో గోదావరి, గుణశేఖర్తో మనోహరం - ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చును. మహదేవన్, రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజన్-నాగేంద్ర, ఇళయరాజ, రెహ్మాన్, రాజ్-కోటి, కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, రమణగోగుల, రాధాకృష్ణన్ - ఎవ్వరితోనైనా ఆయన వ్రాసిన గొప్పపాటలు ఉన్నాయి!

బాపు-రమణలు చమత్కారంగా చెప్పినా వేటూరికి అవి తగని ఉపమానాలేమీ కావు అని నా నమ్మకం. "రాంబంటు" చిత్రంలో కోట శ్రీనివాసరావు తన గురించి చెప్పుకుంటూ కృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన వాక్యాలను అనుసరిస్తూ, "నేను హీరోల్లో చిరంజీవిని, హీరోయిన్లలో శ్రీదేవిని, పాటల్లో వేటూరిని", అని చెప్తాడు. నిజంగా వేటూరి పాటల్లో అంత వైశాల్యం ఉంది. అలాంటి కవి మళ్ళీ తెలుగునాడుకు దొరకడేమో! ముళ్ళపూడివారు వేటూరిని వర్ణిస్తూ చెప్పిన కందపద్యం కూడా అదే పునరుద్ఘాటిస్తుంది:

వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!

వేటూరి పాటకు ఎల్లలు లేవు. అటు ఆట-వెలదులు పాడుకునే పాటైనా, ఇటు శీలవతులు పాడుకునే పాటైనా, అటు నాస్తికులు పాడుకునే పాటైనా, ఇటు భక్తులు పాడుకునే పాటైనా, అటు కుర్రకారు పాడుకునే సరదా పాటైనా, ఇటు వృద్ధులు పాడాల్సిన వైరాగ్యగీతమైనా - ఏదైనా వేటూరికి అసాధ్యం కాదు, లేదు.

డభ్భై వర్షాలు దాటినప్పటికీ ఆయన, తలదువ్వి, బొట్టుపెట్టి, జేబులో కలం పెట్టి, తల్లి పంపిస్తే పాఠశాలకు వెళ్తున్న కుర్రాడిలాగే కనబడ్డారు. అదీ, ఆయన మనసుకున్న వయసు! రామారావుకి "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అని సీసపద్యాన్ని పాటగా వ్రాసి, బాలకృష్ణకి "ఎన్నోరాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ" అనే సరసగీతాన్ని అందించి, నేడు జూనియర్ ఎన్.టీ.ఆర్ కి "వయస్సునామి తాకెనమ్మి" అని వ్రాసినా ఆయన కలానికి యవ్వనం పోలేదు, ఆయన పాటకి వయసు కాలేదు. కలానికి కాలం లెక్కలేకపోయినా, తనువుకు దశాబ్దాలు లెక్కేగా! భీష్ముడి ధనువు వేగంతో పోటీ పడలేని ఆయన రథంలాగా, వేటూరి మనసు వేగంతో పోటీ పడలేక ఆయన శరీరం కూలిపోయింది. కానీ, కాలం ఆయన మనస్సుని "నవమి నాటి వెన్నెల నీవు, దశమినాటి జాబిలి నేను" అంటూ పిలిచింది. యవ్వనం తగ్గని మనసు ఆ కాలాన్ని కౌగిలించుకోవడానికి, కలాన్ని వదిలేసి వెళ్ళిపోయింది.

ఆయన ఎన్నో రాగలను వినిపించి, చివరికి "వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి" అని సెలవు తీసుకున్నాడు. తెలుగుచలనచిత్రగీతమనే ఆకాశాన సూర్యుడుండడు తెల్లవరితే అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ తెలుగుచలనచిత్రగగనంలో ఆయన ఒక ధ్రువతారగా, ఎప్పటికీ యువతారగా ఉండిపోతారనే ఊహ నన్ను నిలబెడుతోంది.

ఉత్తరాయణంలో దశమి పూటా దేహాన్ని విడిచిన ఆయనకు, చివర్రోజుల్లో ఆయన తపన పడినట్లు మరిన్ని భక్తిగీతాలు వ్రాసుకునే ఉత్తమమైన జన్మ ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

Saturday, May 1, 2010

చూడచక్కని చూర్ణకుంతల (పాట) - వేటూరి

ఈ పాట "మనోహరం" అనే చిత్రంలోనుండి వేటూరి వ్రాయగా, మణిశర్మ సంగీతదర్శకత్వంలో హరిహరన్ పాడాడు. ఈ పాటకు సందర్భం: "నా ఎదురుగుండా ఇంత అందంగా తిరుగుతూ, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు?", అని కథానాయకుడు నాయికను ప్రశ్నించడం.

"పాటకు SPB, పల్లవికి వేటూరి" అని "కొడితే కోలాటం" (చిత్రం: డ్యూయెట్) పాటలో వెన్నెలకంటి వ్రాశాడు. అది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది! "రాగాలా పల్లకిలో కోకిలమ్మ" అని  ఎంతో భావుకతతో వ్రాసినా, "యమహో నీ యమా యమా అందం" అని మహామాసుగా వ్రాసినా - వేటూరి పల్లవి పెదవిపైన ఆడుతూ ఉంటుంది. అలాగ కుదరాలంటే చక్కని ప్రయోగాలు పల్లవిలోనే కనబడాలి. ఆధునిక చలనచిత్రగీతాల్లో "చూర్ణకుంతల" వంటి సామాన్యులకు పరిచయం లేని పదాలను పల్లవిలోనే వాడగల ఘటికుడు వేటూరేనేమో! అలాంటి పదాలు వ్రాసినా అడ్డుచెప్పని చిత్రదర్శకుడు గుణశేఖర్‌ని కూడా మెచ్చుకోవాలి. అసలంటూ చక్కని పదాలను వాడితే జిఙ్ఞాస ఉన్నవాళ్ళు ఆ పదాలకు అర్థాలు తెలుసుకోకుండా ఉంటారా?

చూడచక్కని చూర్ణకుంతల, చూపుకందని హేళ
సందెవేళలో శకుంతల, వెన్నెలెందుకీ వేళ?
హాయినవ్వుల సుహాసిని, తేనెవెచ్చని కలా
వాలుకన్నుల వరూధినీ, లేతహెచ్చెరికలా?
చకోరి చెంచిట, చంచలా, మోహనాలమేఘమాల

పల్లవిలో చూర్ణకుంతల, సుహాసిని అంటూ నాయికను పొగిడి; శకుంతల,  వరూధిని అని పురాణాల్లో స్త్రీలతో కూడా పోల్చాడు. "ఇంతకీ వీళ్ళెవరు?" అని అడిగితే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావం ఉంది! చూర్ణకుంతల అంటే "ఉంగారాలు తిరిగిన జుత్తు కలది" అని అర్థం. శకుంతల మేనక కూతురు. అంటే నాయికను "అప్సరస కూతురులాగా ఉన్నావు", అంటున్నాడు. సుహాసిని అంటే "హాయిగా నవ్వేది" అని ఆయనే చెప్పాడు. వరూధిని అంటే పురాణాల్లో నాలాగా పూజలూ, పురస్కారాలు తప్పితే తెలియని అమాయకుడైన బ్రాహ్మడిని ముగ్గులోకి దింపుదామని తన అందాలు ఒలకబోసి (వాలు)కన్నుగీటిన ఒక అమ్మాయి! హమ్మయ్య, ఇప్పుడు ఈ పదాలకూ సందర్భానికీ ఉన్న లంకె అర్థమైందా? 

"తేనెవెచ్చని కల" అనే ప్రయోగం నాకు (అర్థమయ్యింది సరి అయితే) బాగా నచ్చింది. తేనె తీసినప్పుడు అది వెచ్చగా ఉంటుంది. అలాగే మనం తేనె సేవించేటప్పుడు గోరువెచ్చగా సేవిస్తాము. కలని "తేనెవెచ్చ" అనడం కొత్తగా ఉన్నా, తీయగా ఉంది. జరుగుతున్న పొలయలుకని "చూపుకు అందని హేల (ఆట)" గా అభివర్ణించడం, "వెన్నెలెందుకు ఉంది ఈ వేళ?" అని నాయికను సున్నితంగా ఆహ్వానించడం, "నాకు దూరంగా ఉండమని లేత హెచ్చరికలొకటా?" అని అడగటం - అన్నీ మహాచిలిపిగా ఉన్నాయి.

నిలువుటందము నీలో, నిలువుటద్దము నాలో
కలువసోకులు నీలో కలవరింతలు నాలో
ఈల వేసిన ఈడు కోరెను నిన్ను నాకు సగం
ఏడ ఏ సొగసున్నదో మరి ఏల దాపరికం?
గాలుల్లో తేలి పూలల్లోవాలి కవ్వించుకున్న వేళ కంటిపాపకేల జోల?

ఈ చరణంలో ప్రాస అద్భుతం! నిలువుటందం, నిలువుటద్దం; కలువసోకులు, కలవరింతలు వంటి పదాల కలయిక నేను ఎక్కడా చూడలేదు. అమ్మాయికి నిలువెల్లా అందముంటే, తను ఆ అందానికి అద్దమవుతానంటున్నాడు! ఆమె అందం చూసి ఇతనికి కలవరింతలు మొదలయ్యాయిట. ఈడు ముదిరింది అని చెప్పడానికి "ఈల వేసిన ఈడు" అనడం ఎన్నిసార్లు విన్నా పెదాల పైన చిరునవ్వు తెప్పించింది. "సొగసులన్నీ దాచుకోవడం దేనికి?" అని చిలిపిగా అనడం యెత్తైతే "పిల్లగాలీ, పూలూ అన్నీ ఉంటే, కనుపాపలకు లాలి పాడటం దేనికి?" అని అడగటం మరింత చిలిపిగా ఉంది.

కలలు గుప్పెడు కన్నులలో, కలయికెప్పుడు కౌగిలిలో
కథలు చెప్పకు కన్నులతో, కళలు దాగవు కోరికలో
కడలి వెతికే కన్నెవాగై కదలి రావేల?
విరహమల్లే రేగి నాలో కరిగిపోవేల?
కన్యాకుమారి! కాశ్మీరనారి! కస్సూరి ముద్దు పెట్టి కాపురాలు చెయ్యవేల?

"నువ్వు కన్నులతో కథలు చెప్తున్నా, కోరిక ఉన్నట్టుగా కళలు తెలిసిపోతున్నాయి సుమీ!", అని అమ్మాయిని ముట్టడి చేస్తే ఏం చేస్తుంది పాపం? "నువ్వు నదివీ, నేను సముద్రాన్ని - నాలో కలిసిపో" అనడంలో కూడా ఎంతో చక్కని ప్రాస కలిపి వ్రాశాడు వేటూరి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పాటలో భాషా, భావం కలిసిమెలిసి ప్రయాణం సాగించాయి. అందుకే ఈ పాట నాకు ఎంతో ఇష్టం. వేటూరి వ్రాసిన సరసగీతాలలో ఇది అగ్రశ్రేణిలో ఉంటుంది అని నా అభిప్రాయం! సందర్భం రావాలే కానీ, నేనూ ఇదే పాట పాడతానేమో :-P