Thursday, May 27, 2010

పదకవితాపితామహుడికి పదపుష్పాంజలి

అన్నమయ్య కీర్తన అనగానే నా మనసుకు ఒక రకమైన పరవశం కలుగుతుంది. ఆయన కీర్తనలు వింటుంటే "ఆహా, ఎంత చక్కగా వర్ణించాడు? రోజూ ఒక్కరి మీదనే కీర్తనలు వ్రాస్తున్నా, ఈయనకి పదాలు ఎక్కడనుండి దొరుకుతున్నాయి? ఆ భావనది జీవనది కదా! ఆ భక్తిరత్నాకరంలో రత్నాలకు లెక్క లేదు!", అని అనిపిస్తుంది. "తెలుగుపాట" అన్న మాటకి పునాది వేసిన అన్నమయ్యని పొగడాలంటే మాటలు చలావు. కానీ, ఆ శారదాదేవి అనుగ్రహించనంతలో కొన్ని పదపుష్పాలను సమర్పించుకోవాలన్నదే నా ఆశ. ఆ పై ఆ శ్రీనివాసుడిదే భారం!


క్కడివయ్యా నీకీ పదములు
క్కగ అమరెను క్రి పదములకు

రి నా విభుని, డు కొండలపై, కోరి కీర్తనలఁ కొలిచెడివారని
నారదుడే నీ నాలుకముంగిటఁ, బారఁగఁ జేసెనా మహతీఝరులను
ఎక్కడివయ్యా ||

లకోకిలలా చిలుకగ పలుకులఁ, లకల కులుకుల లికి శ్రీరమణి
లుకుతేనెలతల్లి ద్మావతియే, చిలికినదా నీ జిహ్వపై సిరుల?
ఎక్కడివయ్యా ||

లమేల్మంగ ధరామృతమును, లదుకొన్న శ్రీరి పెదవులపై
పులకలు పొడమ పొంకపుమాటలఁ, తొలకాడిన స్వరధుని లోతులలో
ఎక్కడివయ్యా ||

నెలకొనె హరి నా నేలకు వచ్చి, కొలువుఁదీరెనే కొండలపైనని
లచి పదములను దాచి పంపెనో, తెలుగుతల్లి నీ దివ్యహృదయమున
ఎక్కడివయ్యా ||

ఈ పాటలో అన్నమయ్య శైలిని సాధ్యమైనంతవరకు అనుసరించాను.ప్రాసాక్షరాలు కనబడుతూనే ఉన్నాయి. యతి అక్షరాలను ముద్దగా (bold) దిద్దాను.

Tuesday, May 25, 2010

వేటూరికి ఎవరు ఋణపడి ఉన్నారు?

ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే, "ఆయన పాటల్ని అనుదినం పాడుకుంటూ ఆనందించిన పిన్నాపెద్దలందరూ ఋణపడ్డారు", అని కొందరంటే, "ఇంతటి అపారమైన సంస్కృతాంధ్రభాషాఙ్ఞాననిధిని తమ నవ్యత లేని కథలలో పనికిమాలిన సందర్భాలకు పరిమితం చేసిన, కళాత్మకమైన వృత్తిని వ్యాపారమాత్రంగా మార్చిన, దర్శకనిర్మాతలు ఋణపడి ఉన్నారు" అని కొందరంటారు. ఆయన పాటలనే కాక, పాట్లని కూడా గమనించిన కొందరు అభిమానులు, "అంతటి పుంభవ సరస్వతికి వెయ్యి గజాల జాగా కూడా ఇవ్వలేకపోయిన మన తెలుగునాడు (సర్కారు) ఋణపడిపోయింది", అని అంటారు. కానీ, నన్నడిగితే వీళ్ళే కాదు,  ఋణపడిపోయినవాళ్ళ జాబితా ఇంకా పెద్దదేనంటాను.

మొట్టమొదటగా ఋణపడిపోయింది, ఆయన నోట అనేకమార్లు పొగడబడిన దేవతలు. శివుడు (శంకరాభరణం, భక్తకన్నప్ప, సాగరసంగమం మొ.),  రాముడు (గోదావరి,  రాధాగోపాళం, సీతారామయ్యగారి మనవరాలు మొ.), కృష్ణుడు (సాగరసంగమం, స్వరాభిషేకం, కాంచనగంగ మొ.), అమ్మవారు (సప్తపది, భైరవద్వీపం మొ.), హనుమంతుడు (శ్రీ ఆంజనేయం, జగదేక వీరుడు అతిలోక సుందరి, మొ.), వేంకటేశ్వరుడు  (సప్తగిరి మొ.), అయ్యప్పస్వామి (శ్రీ అయ్యప్పస్వామి మహత్యం), రాఘవేంద్రస్వామి (2003 లో విడుదలైన రాఘవేంద్ర). ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమంది దేవతలు ఆయన పదపుష్పాలతో అర్చింపబడ్డారు. కొన్ని సార్లు దేవుణ్ణి పొగడే సందర్భం చిక్కితే, కొన్ని సార్లు సందర్భం చిక్కించుకుని దేవుణ్ణి పొగిడారు వేటూరి. ఉదాహరణకి, ఆలుమగల అన్యోన్యాన్ని చెప్పడానికి రాధాగోపాళంలో "ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడూ పార్వతీ, తనువులు రెండూ తామొకటైన సీతారాములకు - మీకు శతమానం భవతి" అని అన్నారు. పువ్వూ తావీ అనో, ఆమనీ కోయిలా అనో, వేణువు నాదం అనో వర్ణించడంతో సరిపెట్టకుండా భార్యాభర్తల అన్యోన్యానికి పరమేశ్వరుడే ప్రమాణం అని మనసుకు హత్తుకునేలాగా చెప్పారు. ఒక సరదా వాన పాట వ్రాయండయ్యా అంటే ఎవరైనా కొంచెం సరసం కలుపుతారు. కానీ ఆ సరసం పక్కనే సాత్వికతను నిలుపగల ఘనుడు వేటూరేనేమో. గోదావరి చిత్రంలో "టిప్పులు టప్పులు" అనే పాటలో "లంగరేసినా లొంగిచావని రంగసాని చాటుపిలుపులు" అని సరసం చూపిస్తూనే, "రాకడా పోకడా రాములోరికెరుకలే" అంటూ గోదావరిపై రాముని ఉనికిని మాటల్లో నిలబెట్టారు. రాముడు కూడా "ఏవిటి నా మీద వీడికింత వెర్రి అభిమానం?", అనుకునేలాగా ఆ చిత్రంలో దాదాపు అన్ని పాటల్లోనూ రాముణ్ణి గుర్తుచేశారు. ఇంక రాధను ఎన్నిసార్లు ఆయన పాటల్లో తలుచుకున్నాడో చూసి కృష్ణుడికే, "ఎంతైనా వేటూరికి రాధ పట్ల పక్షపాతం ఉంది", అనిపిస్తుందేమో! దేవతలేనా? పురాణాల్లో అనేక పాత్రలకు ఆయన పాటల్లో చోటు దక్కించారు ఆయన. కొన్ని సందర్భానికైతే, కొన్ని సరదాకి. శబరి, ద్రౌపది, చంద్రమతి, శకుంతల, వరూధిని, ఘటొత్కచుడు, ఇంద్రుడు మొదలుకొని ఆఖరికి మంథర, సూర్పనఖ, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా ఆయన పాటల్లో ఎక్కడొ ఎదురవుతూనే ఉంటారు.

వేటూరికి పూర్వకవులు కూడా ఆయనకు ఋణపడ్డారు. "ఇదేమిటి? వాళ్ళ కావ్యాలు, పాటలు ద్వారా ఙ్ఞానాన్ని పొందిన వేటూరే ఋణపడి ఉండాలి కదా?" అని అనిపించడం సహజమే. కానీ, వేటూరి వాళ్ళని పదే పదే పాటల్లో తలుచుకుని వాళ్ళ ఋణం తీర్చుకోవడమే కాక, వాళ్ళనే ఋణబద్ధులను చేశారేమోననిపిస్తుంది. వాల్మీకి, కాళిదాసు మొ. సంస్కృతకవులని; నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు, రామలింగడు మొ. ఛందోబద్ధకావ్యకర్తలని; త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య మొ. వాగ్గేయకారులని; కృష్ణశాస్త్రి, నండూరి, శ్రీశ్రీ, గుడిపాటి చలం, గురజాడ వంటి ఆధునికకవులని; ఆత్రేయ, పింగళి వంటి చలనచిత్రగీతకర్తలని ఆయన పాటల్లో గుర్తుచేశారు. (వేటూరికి గురువుగారు) విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి అపరభాషాప్రవీణులనే కాక, ఒమర్ ఖయ్యాం, రబీంద్రనాథ్ ఠాగోర్ వంటి పరభాషాప్రవీణులని కూడా ఆయన పాటల్లో చూస్తూ ఉంటాము మనం. తాన్సేన్, గులాం అలీ వంటి గాయకులను సందర్భం దొరికంప్పుడల్లా ప్రస్తావించే సినీకవి మనకు దొరుకుతాడా? ఇకపై వీళ్ళని పట్టించుకునేవాళ్ళు ఉంటారా? "తెలుగు" అన్న పదాన్నే సరిగ్గా పలకడం చేతకాని వాళ్ళ చేత "చిరుత్యాగరాజు, నీ కృతినే పలికెను" అని అనిపించేవారున్నారా? ఒక యుగళగీతం వ్రాసిపెట్టవయ్యా అని అంటే పనిగట్టుకుని, "నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, ఆత్రేయ ప్రేమగీతం" అనో, కుటుంబమంతా కలిసి పాడుకునే పాట వ్రాయవయ్యా అంటే, "మనసు కవి మాట మనకు విరిబాట", అనో కనీసం చలనచిత్రరంగంలో తమకు సీనియర్లైన కవులని గుర్తుచేసేవారుంటారా?

మన జీవనదులు వేటూరికి ఋణపడ్డాయి. "పలుకులా అష్టపదులా, నడకలా జీవనదులా", అని నదుల అందాలను గుర్తుచేశారు. "ఒయ్యారి గోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం?" అని గోదావరిని చిలిపిగా అడిగారు. "నీలవేణిలో కృష్ణవేణినే చూశా" అని అమ్మాయిని పొగుడుతున్న నెపంతో కృష్ణని, "నాలోనే పొంగెను నర్మద" అని నర్మదని, "నీ తుంగభద్ర మా పాపాలు కడుగంగ" అని రాఘవేంద్రస్వామిని పొగుడుతూ తుంగభద్రని, "చినుకులన్నీ కలిసి చిత్రకావేరి" అని కావేరిని గుర్తుచేసారు. ఇంక గంగమ్మ సంగతైతే చెప్పుకోవక్కరలేదు. గంగోత్రి చిత్రంలో ఏకంగా పాటే వ్రాశారు. భారతీయనదులకే కాకుండా "పరదేశి" చిత్రంలో "మిసిసిపి-తీరే" అంటూ పరదేశంలోని నదులకు కూడా తన పాటల్లో స్థానం ఇచ్చారు.  హైదరాబాదులో, ఒక అర్ధరాత్రి, ఒకబ్బాయి అమ్మాయితో కలిసి కారులో షికారుకెళ్తుంటే, అప్పుడు పాడే పాటలో ప్రకృతిసౌందర్యాలను ఎలాగ వర్ణిస్తాము? కానీ వేటూరికి ఆ సంకోచం లేదు, "యమునాతీరం, సంధ్యారాగం - నిజమైనాయి కలలు, నీలా రెండు కనులలో" అని "నువ్వు నా కళ్ళెదుటవుంటే, నేను కలగన్న యమునాతీరం-సంధ్యారాగం నిజంగా ఎదురైనట్టు ఉంది", అని వ్రాశాడు. ఒక్క నదులనే కాదు, మన భారతదేశసౌందర్యానికి ప్రతీకలైన ఎన్నో సంపదలని ఆయన పాటల్లో నిక్షిప్తం చేశారు. రాఘవేంద్రస్వామిని గురించి చెప్పవయ్యా అంటే, "మనసు చల్లని హిమవంతా" అని హిమాలయాను గుర్తుచెయ్యగలరు వేటూరి!

ఆ తరువాత ఋణపడింది కర్ణాటకసంగీతం! "ఇదేమిటి? ఆయనకు సంగీతమొచ్చా? ఆయనేమైనా పాడాడా?" అని మీరు అనుకోవడం సహజం. "పాడితేనే ఋణపడాలా? సామాన్యులకు రాగాలను పరిచయం చేస్తే అది గొప్ప కాద?", అని నాకనిపిస్తుంది. "మదనమోహినీ చూపులోన మాండురాగమేలా?", అని ప్రేయసిని అడిగినా, "పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం - అది ఆనందభైరవి రాగం" అని ప్రేమికుల మధ్యలో అనురాగానికి స్వరరూపం ఆపాదించినా, "శ్రీ-రాగమందు కీర్తనలు మానర!"  అంటూ డబ్బు పిచ్చి వదులుకొమ్మని సరదాగా చెప్పినా - అది కర్ణాటకసంగీతం పట్ల వేటూరికి ఉన్న మమకారానికి నుడికారాన్ని కల్పించి చెప్పటమే! శంకరాభరణం, దేవగాంధారి, కీరవాణి, శివరంజని, భాగేశ్వరి వంటి రాగాలు ఆయన పాటల్లో మనకు తారసపడుతూ ఉంటాయి. ఇక "భైరవద్వీపం" చిత్రంలో "శ్రీతుంబురనారదనాదామృతం" అనే పాటలో ఆయన కర్ణాటకసంగీతానికి పదాభిషేకం చేశాడనే చెప్పుకోవాలి. మన సాంప్రదాయవిశేషాల మీద ఇంత పట్టు కలిగి, "నువ్వు సందర్భం చెప్పు, నేను సాంప్రదాయంతో జోడించి సాహిత్యాన్ని అందిస్తాను" అని ధైర్యంగా నిలబడి చెప్పగలిగే వారు చలనచిత్రసీమకు మళ్ళీ ఎప్పుడు వస్తారు? సంగీతంలో ఒ,న,మ-లు తెలియని నాబోటి వాళ్ళకు కూడా, "ఫలానా రాగం ఉందన్నమాట" అని తెలిసేలాగా ఎవరు చేస్తారు?

కవికి స్వేచ్ఛనిచ్చే దర్శకుడు అడిగితే, అమ్మాయిని వర్ణిస్తూ "ముల్లోకాలే కుప్పెలై, జడకుప్పెలై" అని అన్నారు. అలాగే, "మాకదేమీ తెలియద్సార్! మాంచి ఊపున్న పాట ఒకటి రాయండి", అని అడిగితే "యమహో నీ యమాయమా అందం" అనే మాయతెరను అడ్డు పెట్టి, ఆ వెనుకనే "తెల్లనీ చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టి, పచ్చని పాదాలట్టి, ఎర్రని బొట్టు పారాణెట్టి, చీకటింట దీపామెట్టి, చీకుచింత పక్కానెట్టి", అంటూ మన సాంప్రదాయాన్ని గుర్తుచేశారు. ఇంత ముద్దుగా మనకు మన సాంప్రదాయాలని గుర్తుచెసే శక్తి ప్రస్తుతకవులందరికీ కలుగేలా ఆశీర్వదించమని వేటూరికి నా మనవి. ఇంత చక్కగా వర్ణించబడి, నలుగురి మనసుల్లోనే కాక పెదాలపై కూడా ఉన్నందుకు మన సాంప్రదాయాలు కూడా ఆయనకు ఋణపడ్డాయనిపిస్తుంది!

ప్రతీ మనిషినీ కనేది ప్రకృతి ప్రతిబింబమైన ఆడది. కానీ ప్రతీ కవినీ కనేది మాత్రం సాక్షాత్తు ఆ ప్రకృతే! అలాంటి ప్రకృతిని వర్ణించి కవి తన కవిత్వానికి సార్థకతను సంపాదించుకుంటాడు. దురదృష్టవశాత్తు మన తెలుగు చలనచిత్రాలలో ప్రకృతిని వర్ణించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సందర్భం దొరికినా దొరక్కపోయినా ఒక్కసారి ఆ ప్రకృతిని తలుచుకోకుండా వేటూరి పాట వ్రాయలేదేమో అనిపిస్తుంది. చక్కనైన సందర్భం కుదిరితే, "ఆమనీ పాడవే హాయిగా" అని అన్నారు, ముక్కిపోయిన సందర్భం వస్తే "వానవిల్లు చీర చాటు వన్నెలందుకో; 'వద్దూ' లేదు నా భాషలో" అని అన్నారు. కానీ, ప్రకృతికి మాత్రం తన పాటల్లో పెద్దపీట వేశారు. "బహుశః ఇలాగ ప్రకృతిని వర్ణించాలనే తపన ఇప్పటి కవుల్లో తగ్గిందేమో? ప్రకృతికి మళ్ళీ ఇలాంటి ప్రాధాన్యత మన తెలుగు సినిమాపాటల్లో రాదేమో?", అన్న సందేహం కలిగినప్పుడల్లా ప్రకృతి కూడా వేటూరికి కొంత ఋణపడిందేమో అనిపిస్తుంది.

"అందరి కంటే ఎక్కువ ఋణపడింది భాషేనేమో?", అనిపిస్తుంది. "సంస్కృతమంటే అది గంభీరమైన భాష. మనకు తెలియదు.", అనుకున్నవాళ్ళ నోట, "నీ పదరాజీవముల జేరు నిర్వాణసోపానమధిరోహణముజేయు ద్రోవ"  అని పాడించగల ఘటికుడు వేటూరి.  మీలో ఎంతమంది మారాకు, క్రావడి, క్రీగన్ను, కొంగొత్త, నివురు, పుంగవ, పున్నాగ వంటి పదాలు సామాన్యమైన పాటల్లో విన్నారు? వేటూరి పాటల ద్వారా నాకు పరిచయమైన అనేక తెలుగుపదాల్లో ఇవి కొన్ని మాత్రమే! పద్యప్రాసాదాలలో రాణివాసం చేస్తూ బయటి ప్రపంచాన్ని చూడటానికి నోచుకోక కనుమరుగైపోతున్న(1) అలాంటి పదాలను ఒక సామాన్యమైన తెలుగు సినిమాపాటలో చెప్పేందుకు ఎవరు మిగిలారు? అలాంటి పదాలను పోగు చేసి వాటికి అండగా నిలిచి, "ఇది నేను వ్రాస్తాను. ఎవరు వినరో, ఎందుకు వినరో అదీ చూస్తాను!", అని ధీమాగా నుంచునే సినీకవి ఎవరు? అంతే కాకుండా సరదాకో, సన్నివేశానికో ఎన్నో ముచ్చటైన పదాలను సృష్టించి "మజామ-జావళీలు" పాడారు.

వేటూరి కలం ఆగడం మనందరికీ ఎంత దుఃఖాన్ని మిగిల్చిందో, భౌతికరూపంలో మనకు కనబడని, పైన చెప్పబడిన వారికి/వాటికి కూడా అంతే దుఃఖాన్ని కలుగజేస్తుందన్నది నా అభిప్రాయం. చెరుకుని సరిగ్గా వాడుకుంటే తీయని రసాన్ని ఇస్తుంది, పంచదారనిస్తుంది,  బెల్లాన్ని ఇస్తుంది. కానీ, అవన్నీ తీసెయ్యగా మిగిలిపోయిన చెత్తతో తయారయ్యే మద్యాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళెక్కువయిన మన చలనచిత్రపరిశ్రమ వలన, ప్రేక్షకుల వలన వేటూరి అనే మహానదిలో సుధాధారలన్నీ అడవుల్లోకి ప్రవేశించి మరుగున పడిపోతే, మలినలిప్తమైన పాయలు మాత్రమే అందరికీ కనబడుతున్నాయి. ఆ పాయల్లో కూడా అడుగున ఎక్కడో కొన్ని ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలనో, అడవుల్లో ఉన్న సుధాధారల్నో వెతకాలనే కోరికా, తీరికా, ఓపికా ఎవరికీ లేదు కానీ, ఆ మహానదిని మొత్తంగా నిందించే సాహసం మాత్రం పుష్కలంగా ఉంది. అది వేటూరి దురదృష్టమేమో!

---
ఈ వ్యాసం ద్వారా వేటూరిని మన భాష, సంప్రదాయాలు, పూర్వకవులు, సంగీతం, ప్రకృతి మొ. వాటికంటే ఎక్కువగా చూపించాలన్నది నా ఉద్దేశం కాదు. నిస్సందేహంగా అవన్నీ వేటూరి కలానికి సిరాని అందించిన స్ఫూర్తిదాయకాలు. కాకపోతే, వేటూరి కలం ఆగిపోవడం వలన వేటిపై (చిన్నదో, పెద్దదోవేటు పడిందో చెప్పాలన్నదే నా ప్రయత్నం. పాఠకులలో ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే, వారు నన్ను క్షమించాల్సిందిగా నా మనఃపూర్వకమైన మనవి.

(1) ఇక్కడ నేను వాడిన ఉపమానం పద్యకర్తలకు అవమానంగా భావించరాదని నా మనవి. ఈ కాలంలో ఒక సామాన్యమైన తెలుగువాడికి పద్యాలను అర్థం చేసుకోవాలనే తపన కన్నా, వాటిని వెటకారం చెయ్యాలనే దురభిమానమో, అవి తనకు అర్థం కావనే భయమో ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆ ఉపమానం. పద్యకర్తల పట్ల, పద్యకావ్యాల పట్ల నాకే కాదు, వేటూరికి కూడా అపారమైన భక్తిప్రపత్తులున్నాయన్నది అందరికీ విదితమేనని నా నమ్మకం.

ఈ వ్యాసానికి స్ఫూర్తినిచ్చిన ఫణీంద్రకు నా కృతఙ్ఞతలు.

Saturday, May 22, 2010

తెలుగు చలనచిత్రసాహిత్యభారతానికి భీష్ముడు - వేటూరి

వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో "జగడజగడజగడానందం" అన్నా, వెర్రితనంతో "అ అంటే అమలాపురం" అన్నా, ప్రేమభావంలో "ప్రియా! ప్రియతమా రాగాలు" అన్నా, విరహవేదనతో "చిన్న తప్పు అని చిత్తగించమని" అన్నా, ఆరాధనాభావంతో "నవరససుమమాలికా" అన్నా, చిలిపిదనంతో "ఉత్పలమాలలకూపిరి పోసిన వేళ" అన్నా, భక్తిభావంతో "శంకరా! నాదశరీరాపరా!" అన్నా, వైరాగ్యంతో "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన" అన్నా, దుఃఖంతో "కన్నీటికి కలువలు పూచేనా?", అన్నా - వేటూరి పాట నాకు చివరిదాకా తోడుండే నేస్తం. వేటూరి పాటతో నేను సావాసం చేస్తున్నట్టనిపిస్తుంది నాకు. ఆ పాట భుజం మీద చెయ్యేసి తిరుగుతున్నట్టు, ఆ పాటతో వేళాకోళమాడినట్టు, ఆ పాటతో కలిసి ఆడుకుంటున్నట్టు, ఆ పాటతో పాటే అలిసిపోయినట్టూ అనిపిస్తుంది. అలాటి వేటూరి పాట మూగబోయింది అంటే, అది జీర్ణించుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఇంకోసారి ఆ వృద్ధకలం "అందంగా లేనా? అసలేం బాలేనా?" అని అడుగుతుందేమో, "అబ్బే, నీకేమి? మహారాణిలా ఉన్నావు.", అని చెప్దామని అనిపిస్తుంది.

మన తెలుగుచలనచిత్రరంగంలో ఎందరో మహానుభావులున్నారు. వారి మధ్య వేటూరికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. మహాభారతంలో భీష్ముడు మూడు తరాల పాటు అందరికీ తన విద్వత్తుని, ఙానాన్ని అందిస్తూ వచ్చాడు. చివరికి, "తాతా, నిన్నెలాగ చంపాలో చెప్పవా?", అని అర్జునుడు అడిగితే "ఇలాగ చెయ్యాలిరా మనవడా!" అని చెప్పాడు. అలాగే వేటూరి కూడా తనకు సమకాలీకులైన అనేకచలచిత్రకవులకు దగ్గరుండి యుద్ధమర్మాలను బోధించారు. కొంతమంది అర్జునులైతే, కొంతమంది దుర్యోధనులైనారు; కొంతమంది ధర్మరాజులైతే, కొంతమంది విదురులైనారు. కానీ, ఎవ్వరూ భీష్ముడు కాలేకపోయారు. అధర్మం అన్నం పెట్టింది అని దానికి ఆసరాగా ఉండిపోయినంత మాత్రాన, భీష్ముడి గొప్పదనం తగ్గిపోతుందా? తన పాట విని ఎదిగినవాళ్ళే ఆయనకు అంపశయ్య వేసి పరుండబెట్టినా ఆయన ఠీవి తగ్గుతుందా? చివరికి అంతటి ధర్మరాజవిదురాదులే ఆయన పాదాలకు మ్రొక్కి, "మాకు మీరు ధర్మాన్ని మప్పండి" అని అడుగకతప్పుతుందా? ఈ రోజు, ఎంతటి చలనచిత్రకవి అయినా ఒకప్పుడు వేటురి పట్టిన ఉగ్గుపాలను త్రాగినవాడేననడంలో అతిశయోక్తి లేదేమో? భీష్ముడిలాగే, వేటూరి మరణం తరుముతుంటే పారిపోకుండా, "కాలుతున్న కట్టేరా, చచ్చేనాడు నీ చెలి", అని ప్రేమగీతాన్ని ఆలాపించగలిగినవాడు.

వృద్ధాప్యం ఆయన బాణాల్లో పదును తగ్గించవచ్చు, దృష్టిమాంద్యం గురిని తప్పుగా చూపించవచ్చు, కానీ, ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని ఆయన ధనుష్టంకారాన్ని వినిపిస్తే దిక్కులు దద్దరిల్లి, "విధి లేదు, తిథి లేదు, ప్రతిరోజూ నీదే లేరా", అని అనక తప్పదు. ఆయనతోటలో పూయని పూలు లేవు, ఆయన పండించని పండు లేదు, ఆయన నడయాడని చోటు లేదు! పింగళి, సముద్రాల, ఆత్రేయ, ఆరుద్ర నుండి సిరివెన్నెల వరకు అందరినీ ఆయన కవిత్వంలో చూపగలరు. అయినా పాటలో ఏక్కడో ఒక చోట, "ఇది నేను వ్రాసిన పాట సుమీ" అనేలాగా ఆయన సంతకం దాచివుంచి సంధిస్తాడు. రథసారథి ఎవరైనా, యుద్ధరంగమేదైనా, యుద్ధనీతి యేదైనా ఆయన బాణాల్లో దూకుడు తగ్గదు. విశ్వనాథ్ తో శంకరాభరణం, బాపుతో రాంబంటు, జంధ్యాలతో ఆనందభైరవి, వంశీతో సితార, సింగీతంతో అమావాస్య చంద్రుడు, రాఘవేంద్రరావుతో వేటగాడు, భారతీరాజతో సీతాకోకచిలుక, మణిరత్నంతో గీతాంజలి, శేఖర్ కమ్ములతో గోదావరి, గుణశేఖర్తో మనోహరం - ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చును. మహదేవన్, రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజన్-నాగేంద్ర, ఇళయరాజ, రెహ్మాన్, రాజ్-కోటి, కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, రమణగోగుల, రాధాకృష్ణన్ - ఎవ్వరితోనైనా ఆయన వ్రాసిన గొప్పపాటలు ఉన్నాయి!

బాపు-రమణలు చమత్కారంగా చెప్పినా వేటూరికి అవి తగని ఉపమానాలేమీ కావు అని నా నమ్మకం. "రాంబంటు" చిత్రంలో కోట శ్రీనివాసరావు తన గురించి చెప్పుకుంటూ కృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన వాక్యాలను అనుసరిస్తూ, "నేను హీరోల్లో చిరంజీవిని, హీరోయిన్లలో శ్రీదేవిని, పాటల్లో వేటూరిని", అని చెప్తాడు. నిజంగా వేటూరి పాటల్లో అంత వైశాల్యం ఉంది. అలాంటి కవి మళ్ళీ తెలుగునాడుకు దొరకడేమో! ముళ్ళపూడివారు వేటూరిని వర్ణిస్తూ చెప్పిన కందపద్యం కూడా అదే పునరుద్ఘాటిస్తుంది:

వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!

వేటూరి పాటకు ఎల్లలు లేవు. అటు ఆట-వెలదులు పాడుకునే పాటైనా, ఇటు శీలవతులు పాడుకునే పాటైనా, అటు నాస్తికులు పాడుకునే పాటైనా, ఇటు భక్తులు పాడుకునే పాటైనా, అటు కుర్రకారు పాడుకునే సరదా పాటైనా, ఇటు వృద్ధులు పాడాల్సిన వైరాగ్యగీతమైనా - ఏదైనా వేటూరికి అసాధ్యం కాదు, లేదు.

డభ్భై వర్షాలు దాటినప్పటికీ ఆయన, తలదువ్వి, బొట్టుపెట్టి, జేబులో కలం పెట్టి, తల్లి పంపిస్తే పాఠశాలకు వెళ్తున్న కుర్రాడిలాగే కనబడ్డారు. అదీ, ఆయన మనసుకున్న వయసు! రామారావుకి "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అని సీసపద్యాన్ని పాటగా వ్రాసి, బాలకృష్ణకి "ఎన్నోరాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ" అనే సరసగీతాన్ని అందించి, నేడు జూనియర్ ఎన్.టీ.ఆర్ కి "వయస్సునామి తాకెనమ్మి" అని వ్రాసినా ఆయన కలానికి యవ్వనం పోలేదు, ఆయన పాటకి వయసు కాలేదు. కలానికి కాలం లెక్కలేకపోయినా, తనువుకు దశాబ్దాలు లెక్కేగా! భీష్ముడి ధనువు వేగంతో పోటీ పడలేని ఆయన రథంలాగా, వేటూరి మనసు వేగంతో పోటీ పడలేక ఆయన శరీరం కూలిపోయింది. కానీ, కాలం ఆయన మనస్సుని "నవమి నాటి వెన్నెల నీవు, దశమినాటి జాబిలి నేను" అంటూ పిలిచింది. యవ్వనం తగ్గని మనసు ఆ కాలాన్ని కౌగిలించుకోవడానికి, కలాన్ని వదిలేసి వెళ్ళిపోయింది.

ఆయన ఎన్నో రాగలను వినిపించి, చివరికి "వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి" అని సెలవు తీసుకున్నాడు. తెలుగుచలనచిత్రగీతమనే ఆకాశాన సూర్యుడుండడు తెల్లవరితే అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ తెలుగుచలనచిత్రగగనంలో ఆయన ఒక ధ్రువతారగా, ఎప్పటికీ యువతారగా ఉండిపోతారనే ఊహ నన్ను నిలబెడుతోంది.

ఉత్తరాయణంలో దశమి పూటా దేహాన్ని విడిచిన ఆయనకు, చివర్రోజుల్లో ఆయన తపన పడినట్లు మరిన్ని భక్తిగీతాలు వ్రాసుకునే ఉత్తమమైన జన్మ ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

Saturday, May 1, 2010

చూడచక్కని చూర్ణకుంతల (పాట) - వేటూరి

ఈ పాట "మనోహరం" అనే చిత్రంలోనుండి వేటూరి వ్రాయగా, మణిశర్మ సంగీతదర్శకత్వంలో హరిహరన్ పాడాడు. ఈ పాటకు సందర్భం: "నా ఎదురుగుండా ఇంత అందంగా తిరుగుతూ, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు?", అని కథానాయకుడు నాయికను ప్రశ్నించడం.

"పాటకు SPB, పల్లవికి వేటూరి" అని "కొడితే కోలాటం" (చిత్రం: డ్యూయెట్) పాటలో వెన్నెలకంటి వ్రాశాడు. అది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది! "రాగాలా పల్లకిలో కోకిలమ్మ" అని  ఎంతో భావుకతతో వ్రాసినా, "యమహో నీ యమా యమా అందం" అని మహామాసుగా వ్రాసినా - వేటూరి పల్లవి పెదవిపైన ఆడుతూ ఉంటుంది. అలాగ కుదరాలంటే చక్కని ప్రయోగాలు పల్లవిలోనే కనబడాలి. ఆధునిక చలనచిత్రగీతాల్లో "చూర్ణకుంతల" వంటి సామాన్యులకు పరిచయం లేని పదాలను పల్లవిలోనే వాడగల ఘటికుడు వేటూరేనేమో! అలాంటి పదాలు వ్రాసినా అడ్డుచెప్పని చిత్రదర్శకుడు గుణశేఖర్‌ని కూడా మెచ్చుకోవాలి. అసలంటూ చక్కని పదాలను వాడితే జిఙ్ఞాస ఉన్నవాళ్ళు ఆ పదాలకు అర్థాలు తెలుసుకోకుండా ఉంటారా?

చూడచక్కని చూర్ణకుంతల, చూపుకందని హేళ
సందెవేళలో శకుంతల, వెన్నెలెందుకీ వేళ?
హాయినవ్వుల సుహాసిని, తేనెవెచ్చని కలా
వాలుకన్నుల వరూధినీ, లేతహెచ్చెరికలా?
చకోరి చెంచిట, చంచలా, మోహనాలమేఘమాల

పల్లవిలో చూర్ణకుంతల, సుహాసిని అంటూ నాయికను పొగిడి; శకుంతల,  వరూధిని అని పురాణాల్లో స్త్రీలతో కూడా పోల్చాడు. "ఇంతకీ వీళ్ళెవరు?" అని అడిగితే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావం ఉంది! చూర్ణకుంతల అంటే "ఉంగారాలు తిరిగిన జుత్తు కలది" అని అర్థం. శకుంతల మేనక కూతురు. అంటే నాయికను "అప్సరస కూతురులాగా ఉన్నావు", అంటున్నాడు. సుహాసిని అంటే "హాయిగా నవ్వేది" అని ఆయనే చెప్పాడు. వరూధిని అంటే పురాణాల్లో నాలాగా పూజలూ, పురస్కారాలు తప్పితే తెలియని అమాయకుడైన బ్రాహ్మడిని ముగ్గులోకి దింపుదామని తన అందాలు ఒలకబోసి (వాలు)కన్నుగీటిన ఒక అమ్మాయి! హమ్మయ్య, ఇప్పుడు ఈ పదాలకూ సందర్భానికీ ఉన్న లంకె అర్థమైందా? 

"తేనెవెచ్చని కల" అనే ప్రయోగం నాకు (అర్థమయ్యింది సరి అయితే) బాగా నచ్చింది. తేనె తీసినప్పుడు అది వెచ్చగా ఉంటుంది. అలాగే మనం తేనె సేవించేటప్పుడు గోరువెచ్చగా సేవిస్తాము. కలని "తేనెవెచ్చ" అనడం కొత్తగా ఉన్నా, తీయగా ఉంది. జరుగుతున్న పొలయలుకని "చూపుకు అందని హేల (ఆట)" గా అభివర్ణించడం, "వెన్నెలెందుకు ఉంది ఈ వేళ?" అని నాయికను సున్నితంగా ఆహ్వానించడం, "నాకు దూరంగా ఉండమని లేత హెచ్చరికలొకటా?" అని అడగటం - అన్నీ మహాచిలిపిగా ఉన్నాయి.

నిలువుటందము నీలో, నిలువుటద్దము నాలో
కలువసోకులు నీలో కలవరింతలు నాలో
ఈల వేసిన ఈడు కోరెను నిన్ను నాకు సగం
ఏడ ఏ సొగసున్నదో మరి ఏల దాపరికం?
గాలుల్లో తేలి పూలల్లోవాలి కవ్వించుకున్న వేళ కంటిపాపకేల జోల?

ఈ చరణంలో ప్రాస అద్భుతం! నిలువుటందం, నిలువుటద్దం; కలువసోకులు, కలవరింతలు వంటి పదాల కలయిక నేను ఎక్కడా చూడలేదు. అమ్మాయికి నిలువెల్లా అందముంటే, తను ఆ అందానికి అద్దమవుతానంటున్నాడు! ఆమె అందం చూసి ఇతనికి కలవరింతలు మొదలయ్యాయిట. ఈడు ముదిరింది అని చెప్పడానికి "ఈల వేసిన ఈడు" అనడం ఎన్నిసార్లు విన్నా పెదాల పైన చిరునవ్వు తెప్పించింది. "సొగసులన్నీ దాచుకోవడం దేనికి?" అని చిలిపిగా అనడం యెత్తైతే "పిల్లగాలీ, పూలూ అన్నీ ఉంటే, కనుపాపలకు లాలి పాడటం దేనికి?" అని అడగటం మరింత చిలిపిగా ఉంది.

కలలు గుప్పెడు కన్నులలో, కలయికెప్పుడు కౌగిలిలో
కథలు చెప్పకు కన్నులతో, కళలు దాగవు కోరికలో
కడలి వెతికే కన్నెవాగై కదలి రావేల?
విరహమల్లే రేగి నాలో కరిగిపోవేల?
కన్యాకుమారి! కాశ్మీరనారి! కస్సూరి ముద్దు పెట్టి కాపురాలు చెయ్యవేల?

"నువ్వు కన్నులతో కథలు చెప్తున్నా, కోరిక ఉన్నట్టుగా కళలు తెలిసిపోతున్నాయి సుమీ!", అని అమ్మాయిని ముట్టడి చేస్తే ఏం చేస్తుంది పాపం? "నువ్వు నదివీ, నేను సముద్రాన్ని - నాలో కలిసిపో" అనడంలో కూడా ఎంతో చక్కని ప్రాస కలిపి వ్రాశాడు వేటూరి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పాటలో భాషా, భావం కలిసిమెలిసి ప్రయాణం సాగించాయి. అందుకే ఈ పాట నాకు ఎంతో ఇష్టం. వేటూరి వ్రాసిన సరసగీతాలలో ఇది అగ్రశ్రేణిలో ఉంటుంది అని నా అభిప్రాయం! సందర్భం రావాలే కానీ, నేనూ ఇదే పాట పాడతానేమో :-P

Monday, April 19, 2010

ఆపరేషన్ నామకరణం

ఈ టప ఉద్దేశం పిల్లలకు నామకరణం చేసేటప్పుడు ఆలోచించే విషయాలను హాస్యభరితంగా చెప్పాలనే కానీ, ఎవరినో బాధపెట్టాలనో, ఏదో పేరును కించపరచాలనో కాదు. ఒకవేళ ఎవరికైనా అలాగ అనిపిస్తే పెద్దమనసు చేసుకుని క్షమించాలని నా మనవి!

మా వదినమ్మ తను ఆరోనెలలో అడుగుపెట్టగానే తనకు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని తెగ ఆలోచించేసింది. కాసేపు గూగులిన తరువాత, "ఇదంత అర్రీబుర్రీగా తేలే యెవ్వారం కాదు. మా సెగట్రీతో సెర్చించి (searchఇంచి) ఆలోసిత్తాను", అని నిర్ణయించుకుంది. ఈ విషయానికి నన్ను సెగట్రీగా నియమించింది. తనకు నా గురించి తెలియదు పాపం. అందుకే, "నాకు ఈ ప్రపంచంలో ఏదీ నచ్చదు, అన్నిటిలోనూ లోపాలు వెతకడం నా ప్రథమకర్తవ్యంగా భావిస్తాను", అని చెప్పాను. ఐనా సరే నన్నే సెగట్రీగా నియమించింది. అంతే, చర్చ అనుకున్నది కాస్తా, లెక్చర్ అయ్యింది. అదే ఈ రోజు నా టప.

మా వదినమ్మ నాకు ఇచ్చిన సూచనలు (specification) ఏమిటంటే:
  • సంస్కృతపదం అవ్వాలి 
  • రెండు/మూడు అక్షరాలుండాలి
  • మరీ పాతపదాలు, మరీ కొత్తపదాలు (posh పదాలు) వద్దు 
  • పేరులో negative-తనం ఉండకూడదు
  • వినగానే "ఆహా, కొత్తగా ఉంది. హాయిగా ఉంది ఈ పేరు." అనిపించాలి. 
అంతే, ఇంక సెగట్రీ, చెవులు వాచేలా e-mail లో ఉవాచ:

వదినమ్మా!

నువ్వు పేరు పెట్టడం అనేది ఏదో చాలా సులువైన పనిలాగా మాట్లాడుతున్నావు. అసలు ఈ పేరు పెట్టడం అనే ప్రక్రియే చాలా దీర్ఘమైనది, సునిశితమైన బుద్ధితో కానీ సాధించలేనిది. అందుకే ఈ నామకరణం అనే ప్రాజెక్టుకు పేరు పెట్టడం చాలా ముఖ్యం. నన్నడిగితే దీనికి "ఆపరేషణ్ నామకరణం" (ON) అని పేరు పెడదాము. నీ తొలిబిడ్డ గనుక ఈ సారి version-1 అనచ్చు. అంటే ON-1. రెండో బిడ్డకు ON-2 అలాగ పెంచుకుంటూ పోవచ్చు. ఏమంటావ్? బేమ్మర్ల పెళ్ళిళ్ళల్లో పంతులుగారు అందరి పేర్లకీ చివర్లో శర్మ తగిలించినట్లు సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతీ పనికి "ప్రాజెక్టు" అనే పదాన్ని తగిలిస్తారు. లేకపోతే motivation రాదాయె!

విషయానికి వస్తే పని చెయ్యడం కంటే సలహా ఇవ్వడం చాలా సులువు అని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా? ("ఎన్నో అధ్యాయంలో? నాకు గుర్తులేదే?" అనకు. నిజంగా గీతలో ఉందో లేదో నాకూ తెలియదు కానీ, భారీ కొటేషన్ల వెనుక భగవద్గీత backing ఉండటం మంచిది అని అలాగ అంటున్నాను, ఈ మధ్యన.) అందుకే ఇప్పటికి నీకు పేర్లు-వాటితో ఉండే తంటాలు అనే విషయం పైన కొంచం జ్ఞానోదయం చేస్తాను చూడు.

మొదటగా చెప్పాల్సింది ఏమిటంటే, నీ specificationలో "కొత్తదనం" అనే అంశం నాకు కొంచెం అనవసరమనిపించినది. ఆ మధ్యన మా దూరబ్బంధువుల అబ్బాయికి శ్రేయస్ అనే పేరు పెడితే దానికి బంధువర్గంలో "చాలా కొత్తగా ఉంది, చక్కని పేరు", అని మాంచి talk వచ్చి హిట్టయ్యింది. ఆ తరువాత నేను సాఫ్ట్వేర్ ధర్మానుసారం రెండేళ్ళ తరువాత ఉద్యోగం మారాను. అక్కడికి వెళ్తే కేవలం మా teamలోనే నలుగురు శ్రేయస్లు ఉన్నారు. మా officeలో, confusion ఎందుకని వాళ్ళను సొంతపేర్లతో కాక, ఇంటి పేర్లతో పిలుస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు, అంత కష్టపడి పెట్టిన పేరూ release కాకుండానే drop అయిన ప్రాజెక్ట్లాగా అయిపోయింది. ఇందులో నీతేమిటంటే, నీకు నచ్చిన పేర్లు చాలా చోట్ల చాలామందికి పిచ్చపిచ్చగా, విచ్చలవిడిగా నచ్చేస్తాయి. కొన్ని ఏళ్ళపాటు ఒక పేరుకు మంచి talk ఉండి, అదే పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాందరూ ఒక చోట చేరితే ఇంక variety ఏముంది?

ఒకసారి ఇలాగే ఒక చెల్లెమ్మ నన్ను పేరు select చెయ్యమని అడిగితే కే. విశ్వనాథ్ చిత్రాల్లో అమ్మవారిపైన పాటలు వింటే నీకు ఏమైనా నచ్చచ్చు అన్నాను. చివరికి ఆమె "సప్తపది" చిత్రంలో పాట విందో లేదో తెలియదు కానీ, వాళ్ళ పాపకు "శశిహాసిని" అనే పేరు పెట్టుకున్నారు. నాకు "హాసిని" అనే పేరు బాగా నచ్చింది. అందులోనూ సరస్వతీదేవి పేరంటే నాకు మక్కువాయే! అక్కడికి OK. ఇంతలో బొమ్మరిల్లు సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా చూసినప్పటినుండీ నాకు హాసిని అనగానే పెదాలు జిడ్డుగారేలాగా lip-stick పూసుకుని, ఆ పెదాలు కలవనివ్వకుండా మాట్లాడుతూ, తెలుగు సరిగ్గా పలకడం చేతకాని; ఎవరితో ఎలాగ behave చెయ్యాలో తెలియని ఒక immature కోతిపిల్ల గుర్తొస్తోంది :-( నేను చెప్పే point ఏమిటంటే మనకు "హాయిగా" అనిపించే పేరు రేపు మరొకరివల్ల చెత్తగా గా అనిపించవచ్చును.

ఇంక నీకు ఇచ్చే కొన్ని సామాన్యమైన సూచనలు:
  • పిల్లలకు మనం పెట్టే పేర్లను పెద్దయ్యాక వాళ్ళ friends కుదించడం, కుదిపెయ్యడం సహజం. ఉదాహరణకి మా స్నేహితురాలి పేరు "కౌస్తుభ" - ఎంత చక్కనైన పేరు! ఐతే ఆమెని స్నేహితురళ్ళందరూ, "Hi Cow, How are you?" అంటుంటే, మొదట్లో, "ప్రకృతిధర్మానికి విరుద్ధంగా మానవులకు గోసంతతి కలిగింది", అనిపించింది.
  • ఇందాకటి పాయింటుకో జాయింటు. పేరులో రెండు మూడు పదాలు ఉన్నప్పుడు ఆ పదాల మొదటి అక్షరాలు కలిపి కొత్త పేరు సృష్టించి దానితో పిలుస్తూ ఉంటారు స్నేహితులు. నా స్నేహితుడి పేరు కార్తీక్చంద్ర - ఎంత చక్కనైన పేరు! దాన్ని స్నేహితులని చెప్పుకునేవాళ్ళందరూ కలిసి "కాచా" అని మార్చారు. అదేదో కొండాజాతివాళ్ళ బండ పేరులాగా లేదు? ఇంకొకరి పేరు గోపాలరావు. అతనిని ముద్దుగా గోరా అని పిలిచారు. ఇంకా నయం వాళ్ళింటి పేరు ఏ ఆదిభట్లో అయితే అతని పేరు అగోరా అని ఘోరంగా అయ్యేది. పద్మని పద్దు అని (చాకలిపద్దు లాగా), లలితని లల్లి అని పిలువడం నువ్వూ గమనించే ఉంటావు! అందుచేత ఇలాంటి కంకర్రాళ్ళు nicknames గా రాని పేర్లను ఎంచుకోవడం మంచిది.
  • మళ్ళీ పై పాయింటుకో జాయింటు. మొత్తం పేరులోని పదాలలో మొదటి ఆంగ్లాక్షరాలను కలిపి nickname ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రక్రియకు బలైపోయిన కొన్ని పేర్లు: పిసుపాటి-చంద్రశేఖర-కుమార్ , అరుముగం-శివ-సామి. తస్మాత్ జాగ్రత్త!
  • తెలుగు ఉచ్చారణ తెలియని English-medium స్నేహితుల దౌష్ట్యాన్ని కూడా మనం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి: పేరులో "శ" లేకుండా చూసుకో! ఎందుకంటే కొంతమంది "శంకర్" ని "సంకర్" (అదే, వర్ణసంకరంలో సంకర్) అని గానీ, "షంకర్" అని గానీ పిలుస్తున్నారు. వింటే చెవుల్లో సీసం పోసినట్టు ఉంటోంది.
  • ఇంటి పేర్లతో ఉండే తంటా కొంత ఉంటుంది. మా దూరబ్బంధువు ఇంటిపేరు "కొట్రా". అతడు లవ్వాడి, ఇంట్లోవాళ్ళతో గొడవాడి, ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళాడాడు. అంతవరకూ బానే ఉంది. ఆ అమ్మాయి పేరు "బెట్టి". ఇంటిపేరుతో కలసి, "కొట్రా బెట్టి" అయ్యింది. పేరు వింటే violins విన్న feeling రావాలి కానీ, violence కనబడకూడదు కదా?
  • పేరులో కాస్త లింగభేదం ఉంచడం మంచిది. చైతన్య, ప్రసన్న లాంటి పేర్లు పెడితే e-mails వ్రాసేటప్పుడు లింగభేదం తెలియక ఎవరైనా "Prasanna is a nice girl" అంటే nice అన్నందుకు ఆనందించాలో, girl అన్నందుకు దుఃఖించాలో తెలియక పిల్లలు బాధపడతారు.
  • ఇంక ప్రాస కోసం ప్రయాస పడుతూ, శ్వాస విడిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పిల్లలపేర్లన్నిటికీ ప్రాస కుదర్చాలని ప్రయత్నిస్తారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ప్రాసతో పాటు కాస్త భావం, అర్థం బాగుంటే సొంపుగా ఉంటుంది. ఈ ప్రాసపై ఆశకు ప్రతిరూపలుగా ప్రతాప్-ప్రేలాప్, పురుష్-పరుష్, అభిషేక్-అరబ్ షేక్ వంటి నామద్వయాలు ఉద్భవిస్తున్నాయి.
  • సంస్కృతంలో బాగుండే కొన్ని పదాలు జంట లేకపోతే నిరర్థకాలవుతాయి. ఉదాహరణకి చరణ్ అనే పేరు వాడుకలో ఉంది. ఆ చరణానికి ఒక మొండెం, తలకాయ కూడా ప్రసాదిస్తే బాగుంటుంది. వాడు విష్ణుచరణ్ ఆ? సాయిచరణ్ ఆ? శివచరణ్ ఆ? అలాగే ప్రతీక్ అంటే "ఓహో!" అనిపిస్తున్నా దాని అర్థం "గుర్తు" అని. ప్రేమకు ప్రతీకా? మంచితనానికి ప్రతీకా? ఏమిటి అన్నది ఆ బిడ్డకు తెలుసుకోవాలనే కుతూహలం కలిగేదాకా ఆగకుండా ముందే చెప్తే సంతోషిస్తాడు. ఏమంటావ్?
  • సంస్కృతం అంటే గుర్తొచ్చింది. కొంతమంది సంస్కృతం కంటే ఆంగ్లాన్ని ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అందుకని కొన్ని పేర్లను ఆంగ్లీకరిస్తున్నారు. ఉదాహరణకు లవకుశుల పేర్లను ఈ మధ్యన love, khush గా మార్చి పెట్టుకోవడం నేను గమనించాను. ఒక idea పిల్లల జీవితాన్నే మార్చేయగలదు!
  • ఈ మధ్యన పేర్లకు prefixలు, suffixలు తగిలించడం రివాజు అయ్యింది. సాయి వాడుకలోనున్న ఒక prefix. సాయిచరణ్, సాయికిరణ్, సాయికరుణ్, సాయిశరణ్ మొదలైనవి మనం వింటూనే ఉన్నాము. ఐతే దీనితో వచ్చిన బాధేమిటి అంటే ముద్దుగా కొడుకుని సాయి అని పిలుచుకోలేము. "సాయ్" అనగానే "ఓయ్" అనేవాళ్ళు బోళ్ళుమంది ఉంటారు. అప్పుడు సాయిని వదిలేసి, "కిరణ్", "తరుణ్", "చరణ్" వంటి తాడుతెగిన గాలిపటాలలాంటి పేర్లు వాడుకోవాలి. కుమార్ మనకు తెలిసిన ఒక suffix. మా friend ఒకడి పేరు "రవికుమార్". వాడిని ఒకడు "రవికి ఇద్దరు కుమారులు. శని, యముడు - నువ్వెవరు నాయినా?" అని అడిగాడు. వాడికి దుఃఖం ముంచుకొచ్చింది. అందుచేత కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కూడా!
  • కొన్ని పేర్లకు అర్థం వెతికితే నాకు ఏమీ తోచదు. ఉదాహరణకి "సతీశ్" (*) అనే పేరుకు అర్థం నాకు తెలియదు. "సతి + ఈశ్" అనుకుందాము అంటే "సతికి అధిపతి" అని అర్థం వస్తుంది. ఎవడు మాత్రం పెళ్ళానికి మొగుడు కాకుండా పోతాడు చెప్పు? ఒకవేళ నేను సంధిని విడదీయడంలో తప్పు చేసి ఉంటే సవరించు సుమీ! అలాగే ఇదివరకు నేను పని చేసే చోట ఒకడి పేరు "అల్పేశ్". "అల్పంగా ఉండే ఈశుడా" అనుకుని ముక్కున వేలేసుకున్నాను.
  • కొంతమంది తమ తల్లిదండ్రుల పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు కొడుక్కి పెట్టుకుందాం అనుకుంటారు. దీనివల్ల పూజల్లోనూ, తతంగాలలోనూ తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెప్పుకోవడం సులువవుతుంది! అలాగే కొడుకును పిలిచినప్పుడల్లా తండ్రిని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడిదాకా బాగుంది కదా అనుకునేవాణ్ణి. ఇదే పద్ధతి కొన్ని తరాలు పాటించిన మా teacher ఒకాయన వంశవృక్షం చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. ఆయన పేరు అరుముగం శివసామి. అరుముగం ఆయన తండ్రి పేరు, శివసామి ఆయన పేరు. ఈయనకి వీళ్ళ తాతగారి పేరు పెట్టారుట. అంటే తాత పేరు శివసామి. ఇప్పుడు తండ్రి పూర్తి పేరు "శివసామి అరుముగం". అరుముగం తండ్రి పేరు, శివసామి ఆయన తండ్రి పేరు. ఇలాగ మూడు నాలుగు తరాలు ముందుదాకా వెళ్తే అందరూ శివసామి అరుముగం, అరుముగం శివసామి అనే రెండు పేర్లను audio cassette A-side, B-side లాగా మార్చి మార్చి పెట్టుకుంటూనే ఉన్నారు. పాపం, అల్పసంతోషులు అనిపించింది. మీ వాడు తండ్రి పేరు చివర్లో తగిలించుకుందాం అంటే ఇబ్బంది కాకుండా చూసుకోండమ్మోవ్!
  • అన్నట్టు ఈ తండ్రి, తాత, ముత్తాతల పేర్లు పెట్టుకోవాడానికి మన ఆంధ్రులకు ఇంకో మార్గం ఉంది వదినమ్మోయ్! ఏంటంటే కొడుకు పేరులో "శివ, వీర, వేంకట, నాగ, కనక, ఫణి" వంటి పదాలు కొన్ని తగిలిస్తే అందులో ఏదో ఒకటి తాతకో, తండ్రికో ఉండకపోతుందా? ఆ విధంగా వాళ్ళ పేరు పేరు కూడా కొడుక్కి పెట్టినట్టు ఉంటుంది కదా?
  • అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. "అంకిత" లాంటి పేర్లు పెట్టద్దు. ఎందుకంటే వెంటనే మనసులోకి వచ్చే ప్రశ్న, "ఎవరికి అంకితం చేశావు? ఏం అంకితం చేసేశావు?". అలాగే అన్వేషిత, ఆకాంక్షిత వంటివి కూడా అలాంటి అర్థాలే వస్తాయి. 
  • "ప్రియలలిత", "ప్రియదర్శిని", ప్రియమణి" లాంటి పేర్లు కూడా పెట్టద్దు. ఎందుకంటే నీ ఎదురుగుండానే ప్రతీ తలకు మాసిన వెధవా ఆమెని "ప్రియా..ప్రియా..." అని పిలుస్తాడు. అది వినలేక మనం ఏడవాలి. ఆమె మొగుడికి అనవసరమైన అనుమానాలు కూడా వస్తాయి. అన్నట్టు, ఆ ప్రియదర్శిని అనే పేరుకు అర్థమే నాకు తోచలేదు ఇప్పటికీ!
  • పైన చెప్పినదానికి కొంచం reverse చేసుకుంటే తరువాతి సూత్రం వస్తుంది. ఏమిటంటే, "జననీ", "జగదంబ" వంటి పేర్లు బయటవాళ్ళు పిలుస్తుంటే ఆమె మొగుడికీ ఒక sense of security ఇచ్చినా, స్వయంగా నోరారా పెళ్ళాన్ని పూర్తి పేరుతో పిలుద్దాము అనుకుంటే ఘోరాలు జరిగిపోతాయి.
  • ఈ మధ్యన numerlogyతో ఒక చిక్కు వచ్చి పడింది. పాప(డు) పుట్టిన తేదీ బట్టి పేరు decide చేస్తామంటారు. దీని కోసం ఎంతో చక్కని పేర్లను ఖూనీ చేస్తారు. ప్రేమ (Prema) అనే పదాన్ని ప్రేమా (Praemaa) గా వ్రాయడం లాంటి పైత్యాలు గమనించాను. వెంటనే నాకు "దీని అసాధ్యం కూల. ఇంకా నయం పేరు శ్రద్ధ (Sraddha) అయ్యి, numerologist ఇంకో రెండు అచ్చులు (vowels) కలపమన్నాడని శ్రాద్ధా (Sraaddhaa) అని వ్రాసింది కాదు!", అనుకున్నాను. చెప్పొచ్చేదేమిటంటే మనం ఎంతో ప్రేమగా పెట్టుకునే పేరు రేపు పిల్లలు numerology అని మార్చుకోగలరు. అలాగ మార్చుకుంటే తప్పుడర్థాలు రాని పేరైతే మంచిది అనుకుంటున్నాను. (+)
అదీ సంగతి! ఇంక నువ్వాలోచించు!

(*) సతీశ్ అనే పదం గురించి శిశిర గారు వివరించడంతో నాకర్థమైంది. సతి అంటే అమ్మవారు (దక్షుని పుత్రి), సతీశ్ అంటే శివుడు. నేను చిన్నప్పుడు తునిలో పెరిగాను. అక్కడికి అన్నవరం పద్దెనిమిది కిలోమీటర్లు. అందుచేత అక్కడ సత్యనారాయణ స్వామి భక్తులు ఎక్కువ. వాళ్ళు సత్యనారయణ అనే పేరుకు మారుగా సతీశ్ అని వాడటం గుర్తు. అందుకే నాకు సతీదేవి సంగతే గుర్తురాలేదు.

(+) ఈ పాయింటు శ్రీదేవి గారి కామెంటు చూసి చేర్చడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు!




ఈ టపకు సహకరించిన వదినమ్మ హరితకి, సోదరుడు ఫణీంద్రకి, మిత్రుడు కిరణ్‌కి నా మనఃపూర్వక ధన్యవాదాలు!  అన్నట్టు ఇతని పేరు (నల్లాన్ చక్రవర్తుల కిరణ్) కూడా ఇందాక చెప్పిన ఆధునికనామవ్యాకరణసూత్రాలకు లోబడి, "నచకి" గా మారింది. 

Wednesday, April 7, 2010

విరహవేదన (మూడు పద్యాలు)

ఒక friend అడిగితే విరహవేదన గురించి మూడు పద్యాలు వ్రాశాను. ఈ పద్యాలు నాకు పెద్దగా సంతృప్తిని కలుగజేయలేదు. ఐనా కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారని బ్లాగుతున్నాను.

సీ:-
కాటుక దిద్దిన కలువకన్నులు నేడు తమ నెలరాజుకై తల్లడిల్లె
నిండుగ జడలోన నింపిన పువ్వులు తుమ్మెదకై వేచి సొమ్మసిల్లె
నీతోడు కోరుచు నిలువెల్ల వాడినా నీ ఊహతో మది నిదురపోదు
నువు జతలేకుండ నిండుపున్నమియైన వెన్నెలరేయిపై వెగటుఁబుట్టె

ఆ:-
దినములెన్నియైన తీరదు నా ప్రేమ
జీవమున్న వరకు చెదిరిపోదు
నింగిలోకి చూడ నెలరాజు ప్రతిరోజు
మారె కాని నేను మారలేదు

ఆ:-
మనసుపడిన నీవు కనులలోనుండగ
కలిమి,లేమి నన్ను కదుపలేవు
లేమి ఏమి? నీవు లేకుండుటే కద?
కలిమి ఏమి? నిన్ను కలియుట కద

P.S: అన్నీ సాధారణమైన తెలుగుపదాలే ఉన్నాయి కాబట్టి ఈ పద్యాలకు నేను ప్రత్యేకించి భావం వ్రాయలేదు.

Monday, April 5, 2010

నిత్యజీవితంలో పద్యాలు

ఈ మధ్యన నాకు పద్యాలు వ్రాయటానికి సందర్భాలు/సమస్యలు దొరకలేదు. మొత్తానికి స్రవంతి గారు, శైలజ గారు, బాబాయ్ కొన్ని సమస్యలు ఇచ్చారు.

సమస్య (దత్తపది):- పూలజడ, క్రోధం, బుట్ట, వేపపువ్వు.
ఇచ్చింది: స్రవంతి గారు
పూరణ (ఆటవెలది):-
క్రోధమయ్యెనేమొ కొమ్మకు ఈవేళ
బుసలుగొట్టసాగె పూలజడదె
నాగసరమునూది కౌగిలిబుట్టలో
పెట్ట వేపపువ్వు పట్టుతేనె!
భావం:-
అమ్మాయికి ఈరోజు కోపం కలిగినట్టుంది, ఆమె పూలజడ బుసగొడుతోంది. నాగసరం ఊది (నాలుగు మంచిమాటలు చెప్పి) కౌగిలి అనే బుట్టలో పెడితే ఇప్పటిదాకా వేపపువ్వులాగా చేదునొలికిస్తున్న ఆమె, పట్టుతేనెలాగా తీయగా మారిపోతుంది. [[ మొదటి మూడూ చూసి నాకు అభినవశ్రీనాథుడైన వేటూరి పూనాడు. ఐతే ఆఖరిది చూడగానే "ఐస్క్రీం లో ఆవకాయముక్కలాగా" అనిపించింది. ఎప్పుడైనా అలాగ ఉంటేనే కదా పద్యాలు కాస్త తమాషాగా ఉంటాయి :) ]]


సమస్య (దత్తపది):- త్రివిక్రముడు, విక్రమార్కుడు, మూడు, మూర్ఖుడు
ఇచ్చింది: శైలజ గారు
పూరణలు:-
(ఆటవెలది) 
భార్గవ ఉవాచ:-
సాహసాన యినుడి సరి విక్రమార్కుడౌ
గనుకయట్లు బలినియనగఁదగును
మూడడుగులనిచ్చె మూర్ఖుడై నామాట
వినక ఏలనోత్రివిక్రమునకు
భావం:-
(వామనావతారం ముగిసిన తరువాత శుక్రుడనుకుంటున్నాడుట)
విక్రమార్కుడు అంటే విక్రమంలో అర్కుడితో (సూర్యుడు) సమానమైనవాడు అని అర్థం కాబట్టి, ఆ పేరు బలికి సరిపోతుంది. అట్టి (నా శిష్యుడైన) బలి నా మాటలను వినకుండా, ఆ మూడు అడుగులను త్రివిక్రముడికి (వామనుడికి) ఎందుకు ఇచ్చాడు? అహో!
(తేటగీతి)
సందీప ఉవాచ:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మంచి పేర్లు
కలిగి కూడ చెత్తగనుండు గదర మూడు!
ఇడియటనగమూర్ఖుడెయైన ఇంపుగుండు
వినగ మాటలు తోచు త్రివిక్రముండు
భావం:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మూడూ మంచి పేర్లు ఉన్నా కూడా చెత్తగా ఉంటాయి. అదే మూర్ఖుడు అనే అర్థం ఉన్న ఇడియట్ చిత్రం మాత్రం చాలా బాగుంటుంది. అందులోని మాటలు వింటే నాకు త్రివిక్రముడు (త్రివిక్రం శ్రీనివస్) గుర్తుకొస్తాడు.


సమస్య (దత్తపది):- మనసు, మాట, మౌనం, మనువు
ఇచ్చింది:- శైలజ
పూరణ (కందం):-
మునుపుటి మాటలనడిగిన
మనసుకు మిగిలిన బదులది మౌనంబేనా?
చనువుగ పలుకుమ! యంటిని
మనికితమును చూపి నేను మనువడిగితినా?
భావం:-
ఇదివరకుటిలాగా మాట్లాడమని అడిగిన నా మనసుకు నువ్వు ఇచ్చే సమాధానం మౌనమేమా? చనువుగా మాట్లాడమన్నానే కానీ, నా మనసులోని బాధ తెలిపి పెళ్ళిచేసుకోమని అడిగానా?



సమస్య (వర్ణన):- పల్లవి గారు గీసిన ఈ చిత్రాన్ని వర్ణించాలి.
ఇచ్చింది:- బాబాయ్ (రవీంద్ర)
పూరణ:-

సీసం:-
సూర్యునికిరణాలు సోకి చంద్రునివోలె అద్దంబు మెరిసె నీ అందమునకు
జడబిళ్ళ తొడిగిన పొడవైన నీ వేణి మణియున్న ఫణివోలె మదికి తోచు
బొమవింట బాణమై పొడిచెను తిలకంబు, సంపంగిముక్కుపై సరఘ నత్తు
ఆడజన్మఁగొనిన సౌందర్యమా! నీదు సొగసుచూడతరమా? శోభనాంగి?
ఆటవెలది:-
కోటిసిరుల మోము కొలను చందమునుండ
కళలు చల్లు కనులు కలువలౌన?
రాజసాన మెలగ రాజహంసలెయౌన?
రూపసామ్యమునకు చేపలౌన?
భావం:-
సూర్యుడి కిరణాలు తగిలి చంద్రుడు ఏ విధంగా వెలుగుతాడో, అదే విధంగా నీ అందం తగిలి అద్దం కూడా మెరిసిపోతోంది. జడబిళ్ళ తగిలించిన నీ అందమైన జడ పడగపై మణి ఉన్న నాగుపామును గుర్తుచేస్తోంది. నీ రెండు కనుబొమలూ చూస్తే ఒక ధనుస్సులాగా ఆ మధ్యన ఉన్న తిలకం బాణం లాగా అనిపిస్తున్నాయి. నీ ముక్కు సంపెంగపువ్వులాగా ఉంటే, దానిపైన ముక్కెర తుమ్మెద లాగా ఉంది. సౌందర్యమ ఆడజన్మ ఎత్తితే అది నువ్వేనేమో? నీ సొగసు చూడతరమా?
ఎన్నో కళలున్న నీ ముఖం, కొలనైతే - మృదువుగా ఉన్న నీ కళ్ళు కలువలవుతాయా? రాజసంగా అటూ ఇటూ కులుకుతున్నందుకు రాజహంసలవుతాయా? లేక, చూడటానికి చేప ఆకారంలో ఉన్నాయి కాబట్టి చేపలవుతాయా? (చెప్పవూ?) [[ ఈ పద్యాలకు స్ఫూర్తిని ఇచ్చిన పల్లవి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఇంత అందంగా ఎవరైనా బొమ్మ గీస్తే కవిత్వం పొంగకుండా ఉంటుందా? ]]